సమస్యలు తేల్చకుండా... విభజన కుదరదు | Without sloving the Problems.. Bifurcation is not possible | Sakshi
Sakshi News home page

సమస్యలు తేల్చకుండా... విభజన కుదరదు

Published Fri, Aug 9 2013 1:48 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సమస్యలు తేల్చకుండా... విభజన కుదరదు - Sakshi

సమస్యలు తేల్చకుండా... విభజన కుదరదు

రాష్ట్ర విభజనతో తలెత్తే సాగునీరు, విద్యుత్తు, హైదరాబాద్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని.. వాటిపై అసెంబ్లీలోనూ కూలంకషంగా చర్చలు చేశాకనే విభజనపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజనతో ఇరు ప్రాంతాల మధ్య ఈ అంశాలు పెను సమస్యలు సృష్టిస్తాయన్నారు. ‘‘ఓ చిన్న సమస్యను పరిష్కరించటానికి మరో అతిపెద్ద సమస్యను సృష్టిస్తారా? సమస్యలను పరిష్కరించటానికి బదులు మరిన్ని పెంచేలా చేస్తారా?’’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన తొమ్మిది రోజుల తర్వాత.. ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మౌనం వీడారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో వారం పది రోజుల నుంచి సమైక్య ఉద్యమం అగ్నిగుండంగా రగులుకొంటుండటంతో ఆయన ఎట్టకేలకు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. విభజనతో సాగునీరు, విద్యుత్తు, రాజధాని అంశాలపై అనేక సమస్యలు వస్తాయని.. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సాగునీటి సమస్యలపై రెండు రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి లేవనెత్తిన అంశాలనే సీఎం కిరణ్ ఈ సందర్భంగా ప్రస్తావించటం గమనార్హం.
 
తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీలు ఇప్పుడు దొంగనాటకాలు ఆడుతున్నాయని విమర్శించిన సీఎం.. తెలంగాణ ఏర్పాటుపై పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తాను వ్యతిరేకించను, సమర్థించను అని పేర్కొనటం విశేషం. ముఖ్యమంత్రిగా వాస్తవాలు చెప్పటం తన బాధ్యత కనుక తాను ఈ విషయాలు ప్రస్తావిస్తున్నానని సీఎం వ్యాఖ్యానించారు. అయితే.. అధిష్టానాన్ని తాను ధిక్కరించటం లేదని కాబట్టి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన నిర్ణయం తీసుకుందని.. కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే ముందు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని పేర్కొన్నారు. అయితే.. సీమాంధ్ర ప్రాంత నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు తమ అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి విన్నవించుకోవాలని ఆయన సూచించారు. సీఎం ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే... 
 
 సమ్మె వద్దు... ఆంటోని కమిటీకి చెప్పండి
 ‘‘రాష్ట్ర భవిష్యత్తు అంశంపై గత తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు సీమాంధ్ర ప్రాంతంలో ప్రజా జీవితానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఉద్యమం సందర్భంగా నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల విగ్రహాలను ధ్వంసం చేయటం విచారకరం. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది. కానీ హింసకు పాల్పడితే క ఠినంగా వ్యవహరిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు సాగుకు సన్నద్ధమైన తరుణంలో ఎన్జీఓలు, ఇతర శాఖల ఉద్యోగులు సమ్మెకు దిగటం సరికాదు.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ కమిటీని వేసినందున.. రాష్ట్ర విభజన అంశంలో ఉన్న అపోహలు, సమస్యలను అక్కడ విన్నవించుకోవ చ్చు. ఈ కమిటీ కాంగ్రెస్ పార్టీపరంగా వేసిందే అయినప్పటికీ ఇందులో ఇద్దరు కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. ఉద్యోగులే కాకుండా విద్యార్థులు, యువకులు సమస్యలున్న ప్రతి ఒక్కరూ ఈ కమిటీకి సమస్యలు చెప్పుకొనే ఏర్పాట్లు చేస్తాం.’’  
 
 కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే...
 ‘‘తెలుగుజాతి అంతా కలసి ఉండాలని ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణపై నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. మొదట ఈ నిర్ణయానికి కారకులుగా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు చెప్పాలి. 2001-02లో 41 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక తెలంగాణ కావాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు వినతిపత్రం ఇప్పించారు. అప్పటికింకా టీఆర్‌ఎస్ కూడా ఆవిర్భవించలేదు. టీడీపీ 2008లో తెలంగాణకు మద్దతుగా తీర్మానం చేసింది. కాంగ్రెస్‌లో ఎప్పట్నుంచో రెండు ప్రాంతాల్లో రెండు అభిప్రాయాలున్నాయి. సీమాంధ్రలోని వారంతా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత వారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్నారు. అందరి అభిప్రాయాలు విన్నాక ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లోనే ఆయా ప్రాంతాల్లో తలెత్తిన భావోదే ్వగాలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షను తెలియచెప్పటం వారి విధి.’’
 .
 .
 సాగునీటి సమస్యలకు సమాధానమేదీ? 
 ‘‘శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యలో ఉంది. ఒకపక్క నల్గొండ.. మరోపక్క రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలు, కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఈప్రాజెక్టు కింద సమైక్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలో చేపడుతున్న కార్యక్రమాల వల్ల 30 లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. రేపు రాష్ట్ర విభజన జరిగి ఈ ప్రాంతాలు వేర్వేరు రాష్ట్రాల కిందకు చేరితే ఈ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారు? 
 నాగార్జునసాగర్‌లో కుడి, ఎడమ కాలువల కింద 23 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఈ ప్రాజెక్టు కూడా రెండు ప్రాంతాల మధ్యలోనే ఉంది. ఒక కాలువ కింద 14 లక్షలు ఆంధ్రలో, మరో కాలువ కింద ఏడు లక్షలు తెలంగాణలో, ఆ తరువాత మళ్లీ సీమాంధ్రలోని మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు వెళ్తోంది. ఇపుడు రాష్ట్రాన్ని విభజిస్తే దీన్ని ఏవిధంగా నిర్వహిస్తారు? కోట్లాది మంది రైతులకు నష్టం లేకుండా ఎలా చేస్తారు? 
 పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు. దీనికింద 27 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. మరో 23 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని మళ్లించటం ద్వారా కృష్ణాలో 80 టీఎంసీలు ఆదా అవుతుంది. ఇందులో 41 టీఎంసీలు మనకు దక్కితే తద్వారా తెలంగాణకు, కరవు జిల్లాలైన రాయలసీమకు అందించటానికి వీలుంటుంది. రాష్ట్ర విభజన జరిగితే ఈ పంపకాలు ఎలా చేయగలుగుతారు? రాష్ట్రాల మధ్య ఇంటర్ కనెక్టివిటీ ఉన్న ఈ నీటిని ఎలా విభజిస్తారు? 
 
 గోదావరి నుంచి 165 టీఎంసీల గోదావరి నీటిని నాగార్జునసాగర్‌కు పంపించే దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచాం. ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలైతే ఇది ఎలా అమలు చేస్తారు? 
 ఇటీవలి ఖరీఫ్‌లో రెండు దఫాలుగా 49 టీఎంసీలకు గాను 45 టీఎంసీలే ఇచ్చాం. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పడిన వర్షాల వల్ల ఆంధ్రాలోని 13 లక్షల ఎకరాలకు నీరందించాం. మనం కలసి ఉన్నాం కనుక ఆ నీటితో ఇరుప్రాంతాల రైతులు పంటలు సాగుచేసుకోగలుగుతున్నారు. అదే ఖమ్మం, వరంగల్‌లు వేరే రాష్ట్రంగా ఉంటే ఆ నీళ్లు ఎలా వస్తాయి? 
 
 కృష్ణాలో, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో 9 లక్షల ఎకరాల పంట ఎండిపోతుంటే చివర్లో ఒక్క టీఎంసీ విడుదల చేస్తే చాలునన్న పరిస్థితి ఉండింది. ఖమ్మం జిల్లా సీలేరు నుంచి ఒక టీఎంసీ నీటిని విద్యుదుత్పత్తి కోసం వినియోగించి విడుదల చేయటంతో కనీవిని ఎరుగని రీతిలో దిగుబడులు వచ్చాయి. ఖమ్మం వేరే రాష్ట్రంగా ఉంటే ఇది సాధ్యమయ్యేదేనా? 
 
 రేపు రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. సమైక్యంగా ఉన్నందునే నల్గొండలోని ఏఎంఆర్‌ప్రాజెక్టు కింద 12 టీఎంసీలు ఇవ్వటంతో రెండు లక్షల ఎకరాలు సాగు అయ్యింది. ఇలాంటివి సాగునీటి రంగంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. కోట్లాది మంది రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యలను తేల్చకుండా విభజన చేయటం సరికాదు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత రైతుల మధ్య ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్నో వస్తాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాకనే రాష్ట్ర విభజన జరగాలి. 
 
 అంతర్రాష్ట్ర జలవివాదాలు మరింత పెరుగుతాయి... 
 ‘‘ఇపుడు సమైక్యంగా ఉన్నప్పుడే అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లతో రాష్ట్రం అంతర్రాష్ట్ర జలవివాదాలను ఎదుర్కొంటోంది. రేపు విభజన అయితే ఇవి మరింతగా పెరుగుతాయి. పైగా రాష్ట్రంలో ఇపుడున్న కీలక నీటిపారుదల ప్రాజెక్టులు రెండు ప్రాంతాలకు నట్టనడుమ ఉన్నాయి. వీటి నిర్వహణ పరిధి ఎవరికి ఇవ్వాలన్నదీ మరో పెద్ద సమస్య. తుంగభద్ర డ్యామ్ కర్ణాటకలోనే ఉంది. అక్కడి ఎడమ కాలువ ద్వారా ఆ రాష్ట్రమే ఎక్కువ నీరు వాడుకుంటోంది. రెండో కాలువ 120 కిలోమీటర్లు కర్ణాటకలో ప్రవహించి మన రాష్ట్రంలోకి వస్తోంది. ఈ లోపునే ఆ రాష్ట్రం నీటిని వాడేస్తుండటంతో రాష్ట్రంలోని ఆయకట్టుకు నీరందక రైతులు అల్లాడిపోతున్నారు. ఇన్ని సమస్యల తరుణంలో వాటిని పరిష్కరించేబదులు మరిన్ని సమస్యలను పెంచుతారా? కావేరీ నదీజలాల సంగతే చూసుకోండి. 1892 నుంచి ఆ సమస్య ఉంది. ఎన్నో న్యాయవివాదాలు నడిచినా ఇప్పటికీ తేలకుండా ఇరుప్రాంతాల మధ్య తీవ్ర విభేదాలను అది రాజేస్తోంది. పంజాబ్, హర్యానాలను విడదీసినప్పుడు కూడా నదీజలాలపై ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఆ తరువాత వాటిని అసెంబ్లీలోనే రద్దుచేస్తున్నట్లు ప్రకటించటంతో ఇరుప్రాంతాల రైతుల మధ్య ఘర్షణలు రేగుతూనే ఉన్నాయి.’’ 
 
 విద్యుచ్ఛక్తి కొరతను ఎలా అధిగమిస్తారు?
 ‘‘విద్యుచ్ఛక్తి విషయానికి వస్తే 65 శాతం పంపుసెట్లు తెలంగాణలోనే ఉన్నాయి. వీటికి ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నాం. ఉచిత విద్యుత్తుకు ఇచ్చే రూ. 4,000 కోట్లలో అత్యధికం తెలంగాణకే వెళ్తున్నాయి. తెలంగాణలో 57 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతుండగా అక్కడ వినియోగం 113 నుంచి 175 మిలియన్ యూనిట్లు ఉంది. అక్కడ సగానికి పైగా కొరత ఉంది. రాయలసీమలో 38 మిలియన్ యూనిట్లు వినియోగం కాగా అక్కడ 34 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రాలో 120 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే వారు వాడుతున్నది కేవలం 76 మిలియన్ యూనిట్లు మాత్రమే. బొగ్గు, గ్యాస్ లేనందున వాటి ఆధారిత విద్యుత్ ప్లాంట్లు వృధాగా పడి ఉన్నాయి.  కేసీఆర్ చత్తీస్‌గఢ్ నుంచి 10 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెస్తామనటం హాస్యాస్పదం. అక్కడ ఉత్పత్తి చేస్తున్నదే 6,300 మిలియన్ యూనిట్లు. అందులో ప్రయివేటు సంస్థల  ఉత్పత్తి 4,400 మిలియన్ యూనిట్లు. గ్రిడ్ క నెక్టివిటీ లేనప్పుడు అక్కడి నుంచి విద్యుత్తు ఎలా తెస్తారు? తెలంగాణలో సగానికి పైగా విద్యుత్ కొరత ఉంటే ఆ ప్రాంత రైతులకు ఎలా ఆదుకొంటారు?’’ 
 
 ఉద్యోగాలపై తప్పుడు లెక్కలతో మభ్యపెడుతున్నారు...
 ‘‘ఉద్యోగాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో 59 వేల మంది అదనంగా ఉన్నారని కొందరు.. లక్షమంది ఉన్నారని మరికొందరు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. వాస్తవానికి 610 జీవోను పూర్తిగా అమలుచేసి అదనంగా ఉన్న వారిలో అత్యధికుల్ని వెనక్కు పంపేశాం. ఇంకా 5,620 మంది కోర్టు తీర్పుల ద్వారా కొనసాగుతున్నారు. వారిపైనా హైకోర్టు ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. త్వరలో వారినీ వెనక్కు పంపేయనున్నాం. 610 జీఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్లో కేవలం సీమాంధ్రులు మాత్రమే లేరు. తెలంగాణలోని 5, 6 జోన్ల ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ విషయాలను కప్పిపుచ్చి తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారు.’’ 
 
 హైదరాబాద్‌పై ఏం చెప్తారు? 
 ‘‘హైదరాబాద్ విషయానికి వస్తే 1956లో రాష్ట్రం ఏర్పడ్డాక అరవై ఏళ్లుగా రాజధానిగా ఉండటంతో విద్య, వైద్యం, ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలు, హైకోర్టు ఇక్కడే ఉండటంతో న్యాయవాదులుగా, వ్యాపారాలు చేసుకోవటానికి, పరిశ్రమలు స్థాపించుకోవటానికి ఇలా అనేక లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఇది మన రాష్ట్రం, ఇది మన రాజధాని అన్న నమ్మకంతో వారంతా ఇక్కడ పెట్టుబడులు పెట్టి తరతరాలుగా కుటుంబాలతో నివసిస్తున్నారు. వారి పిల్లలు, మనవళ్లు ఇక్కడే పుట్టారు. నేను కూడా ఇక్కడ పుట్టిన వాడినే. ఇప్పుడు ఇది వేరే రాష్ట్రం అంటే వారి మనోభావాలు ఎలా ఉంటాయో ఆలోచించారా? ఇన్నేళ్ల తరువాత ఇది మీదికాదని, వేరొకరిదని ఎలా చెబుతాం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాకనే విభజన చేయాలి. ఆంటోని కమిటీ, కేంద్ర ప్రభుత్వం వీటికి సమాధానం చెప్పాలి.. అసెంబ్లీలో కూడా కూలంకషంగా చర్చించాకనే నిర్ణయం తీసుకోవాలి. ఈ స్పష్టత ఇవ్వకుండా విభజన అంటే సరికాదు. కుదరదు. కోరికలు, ఉద్యమాలతో రాష్ట్రాలు ఏర్పాటు చేయటమన్నది సరికాదు. రాష్ట్ర ఏర్పాటుకు సరైన కారణాలు చూపాలి. దేశంలో ఎక్కడ కూడా రాజధాని ఉన్న ప్రాంతాలను విడదీయలేదు. ఇవన్నీ తప్పకుండా చర్చకు రావలసిందే.’’ 
 
 ఇవన్నీ తేల్చాకే రాష్ట్ర విభజన చేయాలి...
 ‘‘నేను చెప్పే ఈ విషయాలన్నీ వాదన కాదు. వాస్తవం. ప్రజలకు వివరిస్తున్నా. ఇవే అంశాలను తేల్చటానికే రోశయ్య కమిటీని ఏర్పాటుచేశారు. ఇప్పుడు నేను కూడా అవే విషయాలు తేల్చాలంటున్నాను. ఇప్పుడు ఆంటోని కమిటీయే కాదు కేంద్రం మరో సబ్‌కమిటీని ఏర్పాటుచేస్తుంది. అది కూడా ఈ విషయాలను తేల్చాకనే రాష్ట్ర విభజన చేయాలి. నేను సీఎంగా ఉన్నందున వాస్తవ పరిస్థితులను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమస్యల వల్ల రేపు రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. వారికి సరైన మార్గం చూపి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నా’’ అని సీఎం పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’ అన్న మీడియా ప్రశ్నకు.. ‘‘నేను పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించటం లేదు’’ అని ఆయన బదులిచ్చారు. ‘‘పార్టీతో ఏం మాట్లాడాలో అవి మాట్లాడాను. వాటిని మీకు ఎందుకు చెప్తాను? ఇరు ప్రాంతాల ప్రజల సమస్యలను మాత్రమే మీ ముందుంచాను. రాష్ట్ర విభజను వ్యతిరేకించను.. అలా అని స్వాగతించను. రెండు ప్రాంతాలకు సమతూకం, సమన్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సమైక్యాన్నే కోరుకుంటున్నందున ఆ తీర్మానపత్రంపై నేనూ సంతకం చేశాను. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని చెప్పాం. అందులో తప్పేమీ లేదు’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చివర్లో రంజాన్ సందర్భంగా ‘ఈద్ ముబారక్’ అంటూ సీఎం ముగించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement