
సాక్షి, అమలాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ జననేత వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.
అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతవరం శివారు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించినుంది. విరామం అనంతరం పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. బొండయకొడు, కొండలమ్మచింత మీదుగా ముమ్మిడివరం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇదివరకే 200 రోజులతో పాటు 2,400 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది.