
సాక్షి, విజయవాడ: గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు పాలన అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను చూసి టీడీపీ ఓర్చు కోలేకపోతుందన్నారు. ‘గుడ్మార్నింగ్ విజయవాడ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం కండ్రిక 59వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే విష్ణు.. ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్డు మార్గాలు, వీధి దీపాలు, పార్కు అభివృద్ధి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పిన కూడా ఆయనకు ఇంకా అర్థం కావడం లేదన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేద వాడికైనా ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 35 వేల మంది పేదలను అర్హులుగా గుర్తించామని.. ఉగాది నాటికి మంజూరు చేయబోతున్నామని తెలిపారు. అర్హులైన మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ‘జగనన్న కిట్’ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. అన్న క్యాంటీన్లో పెద్ద కుంభకోణం జరిగిందని..టీడీపీ చేసిన అవినీతి మొత్తం త్వరలోనే బయటకు వస్తుందని ఎమ్మెల్యే విష్ణు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment