
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, ఏపీ శాసన మండలి డిప్యూటి చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశం బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. హోదా ఇచ్చేవరకు కేంద్రంపై తమ పోరాటం కనసాగుతుందని మిథున్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో రెండు రాష్ట్రలకు మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రెండు రాష్ట్రాలలో ఎలా అధికారంలోకి రావాలో అన్న ఆలోచనను పక్కకు పెట్టి ప్రజలకు ఎలా మంచి చేయాలో ఆలోచించాలని సూచించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు ముఖ్యమంత్రులు చూపిస్తున్న చొరవ దేశంలోనే ఆదర్శవంతం అని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment