
రొద్దం: పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద ఆగస్టు 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పెద్దకొడుకులా అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రొద్దం మండలం ఎల్.తిమ్మాపురం, లక్సాపల్లి గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది కుటుంబాలను శంకరనారాయణ, ఆయన తమ్ముళ్లు మల్లికార్జున, రవీంద్రలు శనివారం పరామర్శించారు. మృతులు రవీంద్రారెడ్డి భార్య భారతమ్మ, భీమయ్య భార్య భీమక్క, బెజవాడ గోపాల్రెడ్డి భార్య లక్ష్మమ్మ,, కురుబ నారాయణయప్ప భార్య నాగరత్నమ్మ, కురుబ వెంకటప్ప భార్య అశ్వర్థమ్మ, కురుబ రామాంజినప్ప భార్య రామాంజినమ్మ, కురుబ వెంకటస్వామి భార్య దేవమ్మ, వడ్డి ఆంజనేయులు భార్య అలివేలమ్మ, దాసరి అంజి భార్య కళావతి తదితర కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
రోడ్డు ప్రమాదం కలచివేస్తోంది
డ్రైవర్ తప్పిదం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందడం తనను కలచివేస్తోందని శంకరనారాయణ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన రోజే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకునే విషయమై చర్చించామన్నారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. వ్యక్తిగతంగాను, పార్టీపరంగాను ఆదుకునేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు.
ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తీరుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రొద్దం మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు, రాజారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, రాజ్గోపాల్రెడ్డి, పెనుకొండ, గోరంట్ల మండలాల కన్వీనర్లు ఫక్రోద్ధీన్, శ్రీకాంత్రెడ్డి, తయాబ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగాధర్, నాగలూరు బాబు, సుధాకర్రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, న్యాయవాది భాస్కర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, కొడల రాయుడు, ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment