
న్యూఢిల్లీ: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దృష్టి సారించింది. ఆర్థిక ఫలితాలను వాయిదావేసిన అంశంతో పాటు మరికొన్ని విషయాల గురించి వివరణనివ్వాలంటూ కంపెనీతో పాటు ఆడిటర్లకు కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) సూచించింది.
ఎంసీఏలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు తెలిపారు. జూన్ త్రైమాసిక ఫలితాలను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా సంక్షోభ పరిస్థితుల కారణంగా జెట్ వాయిదా వేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. సిబ్బంది నిరసనతో ఆ యోచనను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27న సంస్థ బోర్డు సమావేశం కానుంది.