jet airways
-
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
క్యాన్సర్తో నరేష్ గోయల్ భార్య కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ క్యాన్సర్తో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆమె 2015 నుంచి సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.అనితా గోయల్ కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనిత 1979లో మార్కెటింగ్ అనలిస్ట్గా కంపెనీలో చేరారు. ఆమె మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్గా ఎదిగిన తర్వాత నరేష్ గోయల్తో పరిచయం ఏర్పడింది. వారు కలిసిన తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.మనీలాండరింగ్ కేసులో 2023లో జైలుకెళ్లిన ఆమె భర్త నరేష్గోయల్కు వైద్యకారణాల వల్ల బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ ఇచ్చింది. భర్త జైల్లోనుంచి బయటకు వచ్చిన కొద్దిరోజులకే భార్య మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. -
నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్కు ముంబయి హైకోర్టు రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయన భౌతిక, మానసిక ఆరోగ్యం బాగోలేదని గోయెల్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2023 సెప్టెంబరులో తనను అరెస్టు చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో అనుమతి లేకుండా ముంబయిని విడిచి వెళ్లకూడదని, హామీ కింద రూ.లక్ష జమ చేయాలని ఆదేశించింది. దాంతోపాటు ఆయన పాస్పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని తెలిపింది.నరేశ్ గోయెల్ కొన్నిరోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆ చికిత్స నిమిత్తం పలుమార్లు బెయిల్కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందుకు కోర్టు నిరాకరించింది. జైలులోనుంచి బయటకు వెళ్లి సాక్ష్యాలను మారుస్తారని బెయిల్ ఇవ్వలేదని సమాచారం. మానవతా దృక్ఫథంతో తనకు బెయిలు మంజూరు చేయాలని గోయెల్ విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఆసుపత్రిలో గోయెల్ చికిత్స గడువును పొడిగిస్తే ఈడీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలసింది.ఇదీ చదవండి: ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్..! కారణం..జెట్ ఎయిర్వేస్ అభివృద్ధి కోసం కెనరా బ్యాంకు ద్వారా గతంలో దాదాపు రూ.530 కోట్లు అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని సంస్థ వృద్ధికికాకుండా వ్యక్తిగత అవసరాలకు, ఇతరవాటికి వినియోగించారని తేలడంతో గోయెల్తోపాటు ఆయన భార్యను అరెస్టు చేశారు. అయితే తన భార్య ఆరోగ్యంరీత్యా బెయిల్ ఇచ్చారు. -
జలన్ కల్రాక్ చేతికి జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ రుణపరిష్కార ప్రణాళికను దివాలా పరిష్కార అపీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాజాగా అనుమతించింది. జలన్ కల్రాక్ కన్సార్షియంకు కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు ఎన్సీఎల్ఏటీ బెంచ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. బదిలీని 90 రోజుల్లోగా పూర్తిచేయవలసిందిగా జెట్ ఎయిర్వేస్ పర్యవేక్షణ కమిటీకి సూచించింది. దీంతోపాటు పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీగా జలన్ కల్రాక్ కన్సార్షియం(జేకేసీ) చెల్లించిన రూ. 150 కోట్లను సర్దుబాటు చేయమంటూ జెట్ ఎయిర్వేస్ రుణదాతలను ఎన్సీఎల్ఏటీ బెంచ్ ఆదేశించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకి గతంలో విజయవంతమైన బిడ్డర్గా జేకేసీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ఎయిర్వేస్ రుణదాతలు, జేకేసీ మధ్య యాజమాన్య బదిలీపై తలెత్తిన న్యాయ వివాదాలు ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి. ఇంతక్రితం కంపెనీ రుణదాతలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా నిర్ణయాధికారాన్ని ఎన్సీఎల్ఏటీకి అప్పగించింది. ఆర్థిక సవాళ్లతో జెట్ ఎయిర్వేస్ సర్విసులు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోగా.. 2021లో జేకేసీ విజయవంత బిడ్డర్గా నిలిచింది. కాగా.. కోర్టు అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళిక(రూ. 350 కోట్ల ఆర్థిక మద్దతు)లో భాగంగా జెట్ ఎయిర్వేస్కు గతేడాది జలన్ కల్రాక్ కన్సార్షియం రూ. 100 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2024)లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. -
కష్టాలన్నీ ఈ అపరకుబేరుడికే..ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు!
ప్రముఖ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రిత్యా మరో ఆరు నెలల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ముంబైకి చెందిన జెజె హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా తన శరీరంలో క్యాన్సర్ కారకమయ్యే మాలిగ్నెన్సీ అనే కణతి పెరిగిపోతుందని, వైద్యం కోసం మధ్యంతర బెయిల్ కోరినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గోయల్ తరపు న్యాయవాది అబద్ పోండా సైతం మెడికల్ రిపోర్టులను కోర్టుకి అందజేశారు. గోయల్ అనారోగ్యానికి చికిత్స తీసుకునేందుకు జైలులో సరైన వసతులు లేవు. ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందే హక్కు ఉందని అన్నారు. కీమోథెరపీ తర్వాత కోలుకోవడానికి వైద్య చికిత్స, పరిశుభ్రమైన వాతావరణం అవసరం కాబట్టే గోయల్కు ఆరు నెలల మెడికల్ బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. తన క్లయింట్ చికిత్స పొందిన తర్వాత, పరిశుభ్రత సమస్యలు ఉంటాయని, ఫలితంగా అతను ఇతర ఖైదీలతో కలిసి జీవించలేరని పోండా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పోండా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు టాటా మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందవచ్చని, పోలీసు ఎస్కార్ట్ సౌకర్యాన్ని పొందవచ్చని తెలిపింది. కాగా, ఈ పిటిషన్పై ప్రత్యేక కోర్టు వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు సైతం మోసం-అవినీతి ఆరోపణలు. వేలాది మందిని రోడ్డున పడేశారన్న అపఖ్యాతి. దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు. కుటుంబానికి దూరమై జైలులో దుర్భర జీవితం. చచ్చిపోతా.. అనుమతించండంటూ కోర్టుకు విజ్ఞప్తులు. ఇదీ.. జెట్ ఎయిర్వేస్ అధిపతి నరేశ్ గోయల్ దుస్థితి. నరేష్ గోయల్ తో పాటు ఆయన భార్యకు క్యాన్సర్, కుమార్తెకు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ ఇద్దరి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేక, జైలు జీవితం అనుభవించ లేక దయచేసి జైల్లోనే చచ్చిపోయేందుకు నాకు అనుమతివ్వండి అంటూ కొద్దిరోజుల క్రితం కోర్టును ప్రాధేయపడ్డారు. ఇప్పుడు నరేష్ సైతం క్యాన్సర్ భారిన పడడం వైద్యం నిమిత్తం బెయిల్ మంజూరు చేయడంపై ఆయన ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. జైలులో ఆయన దుర్బర జీవితం గురించి తెసుకున్న వారు సైతం నరేష్ గోయల్ కష్టం... పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు. రూ.538 కోట్ల మోసం కేసులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్లో రూ.538 కోట్ల మోసానికి పాల్పడ్డారని నరేశ్ గోయల్, ఆయన భార్య అనితతోసహా ఇతర జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దాఖలు చేసింది. బ్యాంక్ రుణ నిధులను మళ్లించారని, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ 1న గోయల్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
క్యాన్సర్ బారిన పడ్డ నరేష్ గోయల్! - కోర్టు కనికరిస్తుందా..
మనీలాండరింగ్ కేసులో వేలకోట్ల మోసానికి పాల్పడ్డ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు 'నరేష్ గోయల్' గత ఏడాది సెప్టెంబర్ 1న అరెస్ట్ అయ్యారు. అయితే క్యాన్సర్ భారిన పడి.. దాని చికిత్స కోసం ఇటీవల మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ కోసం నరేష్ గోయల్ అభ్యర్థనను కోర్టు పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోర్టు ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసి.. సంబంధిత వివరాలను ఈ నెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది. నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిపోర్ట్ అందించిన తరువాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది. నరేష్ గోయల్ గత జనవరిలో కోర్టుకు హాజరైన తనకు బ్రతకాలనిగానీ, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశ లేదని, జైల్లోనే చనిపోవాలనుకున్న ప్రతిసారీ విధి కాపాడుతోంది, ఇలాంటి జీవితం భరించడం కంటే చనిపోవడం మేలని తనకు ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించవద్దని కన్నీరు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఇండియాలోనే టాప్ ఎయిర్లైన్స్లో ఒకటిగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ ప్రస్తుతం దుర్భర జీవితం గడుపుతున్నారు. 1990 నుంచి 2000 వరకు భారతీయ వైమానిక రంగంలో ఓ మెరుపు మెరిసిన సంస్థ ఈ రోజు అధో పాతాళానికి పడిపోయింది. అయితే ఈ నెల 20న నరేష్ గోయల్ బెయిల్ పొందుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: గర్ల్ఫ్రెండ్కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్లో యూజర్ చాట్ వైరల్ -
గుర్తుపట్టారా? ఒకప్పుడు ‘బాగా రిచ్’.. ఇప్పుడు షార్ప్షూటర్లు మధ్య జైలు జీవితం!
ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం అటు వ్యాపార ప్రపంచంలో ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు. కళ్లల్లో అన్నీ కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు విమానయాన రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త. వందల్లో విమానాలు, వేల కోట్లల్లో ఆస్తులు. పిలిస్తే పలికే మంది మార్బలం. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు. ఒక్క చిటికేస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కారు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రూ.538.62 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడి కరడు గట్టిన నేరస్థులు, షార్ప్షూటర్లు, గూండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో కోర్టును చావును ప్రసాదించమని కోరారు. సమాజంలో బతకలేక.. జైలులో చనిపోయేందుకు అనుమతి అడిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎంతటి శత్రువుకైనా తలెత్తకూడదని కోరుకుంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనను గుర్తు పట్టారా? ఇంతకీ ఆఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో జైలు పాలైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ది. నాలుగు నెలలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియా ఆయనను ఫోటోలు తీసింది. ఇక జనవరి 26న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు తనని ప్రైవేట్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అమనుమతి కావాలని పిటిషన్లో కోరారు. ఎస్కార్ట్తో ప్రైవేట్ ఆస్పత్రికి పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎంజే దేశ్పాండే..‘నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే (చివరి విచారణలో) గుర్తించాము. ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎస్కార్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారను కాబట్టి ఎస్కార్ట్ కోసం అయ్యే ఖర్చును గోయల్ చెల్లిస్తారని తెలిపారు. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
రూ.538 కోట్ల విలువైన జెట్ఎయిర్వేస్ ఆస్తులు సీజ్
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన భార్య, కుమారుడికి చెందిన లండన్, దుబాయ్ సహా భారత్లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్లు, ఇతర ఆస్తులను ఈడీ ఈ మేరకు సీజ్ చేసింది. దాదాపు 26 సంవత్సరాలుగా పూర్తి వాణిజ్య సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నగదు కొరత కారణంగా ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. 2019లో గోయల్ ఎయిర్లైన్ చైర్పర్సన్గా వైదొలిగిన తర్వాత జెట్ ఎయిర్వేస్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పిటిషన్ని దాఖలు చేసింది. కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో ఈడీ నరేష్ గోయల్ను అరెస్టు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. ఈ కేసులో నేరష్ గోయల్తో పాటు మరో ఐదుగురిపై ఈడీ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల ఆస్తులపై ఈ ఏడాది జులైలోనే ఈడీ దాడులు జరిపింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2021 జూలై 29న ఈ కేసును మోసంగా ప్రకటించబడిందని కూడా సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది? -
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు మరో 100 కోట్లు
ముంబై: జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) మరో రూ. 100 కోట్లు సమకూర్చింది. దీనితో, కోర్టు ఆమోదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం మొత్తం రూ. 350 కోట్లు సమకూర్చినట్లయిందని జేకేసీ తెలిపింది. కంపెనీపై పూర్తి అధికారాలు దక్కించుకునేందుకు అవసరమైన నిబంధనలన్నింటినీ పాటించినట్లయిందని పేర్కొంది. ఎయిర్లైన్ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళికలో ఎటువంటి మార్పులు ఉండవని, వచ్చే ఏడాది (2024) నుంచి ప్రారంభించేందుకు కొత్త ప్రమోటర్లు దృఢనిశ్చయంతో ఉన్నట్లు జేకేసీ వివరించింది. లాంచ్ తేదీని రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17 నుంచి నిల్చిపోయిన సంగతి తెలిసిందే. -
ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను.. మనీ లాండరింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్ 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది. కెనెరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది. -
ఎవరీ నరేశ్ గోయల్?..జెట్ ఎయిర్వేస్ ఎలా పతనం అయ్యింది?
చిన్న వయస్సులోనే తండ్రి మరణం..చదువుకునే స్థోమతా లేదు. ఒకపూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. అలాంటి దుర్భుర జీవితాన్ని అనుభవించిన ఓ యువకుడు దేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్ వేస్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగారు. చిన్న వయస్సు నుంచే ‘నువ్వు మంచి చేస్తే మంచి... చెడు చేస్తే చెడు... తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది’ అమ్మ మాటల్ని వింటూ పెరిగిన ఆయన ఆర్ధిక నేరానికి ఎందుకు పాల్పడ్డారు. వందల కోట్లలో తీసుకున్న బ్యాంకు లోన్లను ఎగ్గొట్టి పరారయ్యేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరికి ఎలా అరెస్ట్ అయ్యారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం.. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అదుపులోకి తీసుకుంది.ఈ తరుణంలో భారతీయలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న నరేశ్ గోయల్ కెరియర్, జెట్ ఎయిర్వేస్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. బీకామ్తో సరిపెట్టుకుని నరేశ్ గోయల్ 29 జూలై 1949 పంజాబ్లోని సంగ్రూర్ గ్రామంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని, పంజాబ్లోని పాటియాలా ప్రభుత్వ బిక్రమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. అయితే 11 ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి మరణం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రుణం కారణంగా ప్రభుత్వం చిన్న తనంలో గోయల్ ఇంటిని, ఇతర ఆస్తుల్ని వేలం పాట నిర్వహించింది. కాబట్టే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేయాలన్నా ఆయన కలలు.. కల్లలయ్యాయి. చదువుకునే స్థోమత లేక బీకామ్తో సరిపెట్టుకున్నారు. కఠిక నేలపై నిద్రిస్తూ 1967లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గోయల్ తన మేన మామ సేథ్ చరణ్ దాస్ రామ్ లాల్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్లో క్యాషియర్గా తన వృత్తిని ప్రారంభించారు. అదే ఆఫీస్నే ఇంటిగా మార్చుకున్నారు. పగలు ఆఫీస్ పనుల్ని చక్కబెడుతూనే.. రాత్రి వేళలో అదే ఆఫీస్లో నిద్రించే వారు. ఆఫీస్ అయిపోయిన వెంటనే అందులోనే స్నానం చేయడం.. పక్కనే ఉన్న దాబాలో సమయానికి ఏది దొరికితే అది తినడం, కఠిక నేలపై నిద్రించడం ఇలా రోజువారీ దినచర్యగా మారింది. అనతి కాలంలో మేనేజర్ స్థాయికి అనతి కాలంలో 1969లో ఇరాకీ ఎయిర్వేస్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్గా నియమితులయ్యారు. 1971 నుండి 1974 మధ్యకాలంలో రాయల్ జోర్డానియన్ ఎయిర్లైన్స్కు రీజినల్ మేనేజర్గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో టిక్కెట్లు, రిజర్వేషన్, అమ్మకాల రంగాలలో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే మిడిల్ ఈస్టర్న్ ఎయిర్లైన్స్లోని భారతీయ అధికారులతో పనిచేసేందుకు ఉపయోగపడింది. తల్లి ఆశీర్వాదంతో 1967 నుండి 1974 వరకు, గోయల్ అనేక విదేశీ విమానయాన సంస్థలతో కలిసి పనిచేశారు. వ్యాపార మెళుకువల్ని నేర్చుకుని ఆ రంగంపై పట్టు సాధించారు. తనకున్న అనుభవంతో 1974లో నరేశ్ గోయల్ తన తల్లి నుంచి 500 డాలర్లు( రూ. 40వేలు) ఇప్పుడు (రూ.2లక్షలకు పైమాటే) వేల వరకు తీసుకున్నారు. ఆ డబ్బుతో తన సోదరుడు సురీందర్ కుమార్ గోయల్తో కలిసి తన సొంత స్టార్టప్ జైటర్ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో జైటర్ ఎయిర్ ఫ్రాన్స్, ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్, కాథే పసిఫిక్ వంటి విమానయాన సంస్థలకు సేలందించేంది. వ్యాపారం జోరుగా కొనసాడంతో లాభాల్ని గడిస్తూ వచ్చారు. అంది వచ్చిన అవకాశం అయితే 1991లో, నాటి భారత ప్రభుత్వం ఓపెన్ స్కైస్ పాలసీని ప్రకటించింది. ఆ ప్రకటనే నరేశ్ మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదం చేసింది. గోయల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సొంతంగా తానే విమానయాన సంస్థను ప్రారంభించారు.1992లో అతని ట్రావెల్ ఏజెన్సీ జెట్ ఎయిర్వేస్గా పేరు మార్చారు. ఆ మరుసటి ఏడాది జెట్ ఎయిర్వేస్ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2004 నాటికి, జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. 2007లో జెట్ ఎయిర్వేస్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది. 2010 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఏవియేషన్ సంస్థగా అవతరించింది. కొంపముంచిన అతి విశ్వాసం కానీ రోజులు గడిచే కొద్దీ జెట్ ఎయిర్వేస్ ప్రాభవం మరింత తగ్గుతూ వచ్చింది. ఓవైపు అతి విశ్వాసం.. మరోవైపు మార్కెట్లో ఇతర ఏవియేషన్ సంస్థలు పుట్టుకురావడం, జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్ ధరలు ఇతర ఏవియేషన్ కంపెనీ టికెట్ల ధరల కంటే ఎక్కువగా ఉండటం, వ్యాపారం కొనసాగించేందుకు అప్పులు చేయడం.. వాటికి వడ్డీలు చెల్లించడం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అక్రమ మార్గాన్ని ఎంచుకోవడంతో.. జెట్ ఎయిర్వేస్ పతనం ప్రారంభమైంది. నాలుగు పెద్ద సూట్కేసుల్ని తీసుకుని 2019లో ఎయిర్లైన్లో ఆర్థిక సంక్షోభంతో మూడింట రెండు వంతుల విమానాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆయన మార్చి 25 ,2019న తన భార్య అనితా గోయల్తో కలిసి జెట్ ఎయిర్వేస్ బోర్డు నుండి వైదొలిగారు. అదే ఏడాది నాలుగు పెద్ద పెద్ద సూట్కేసులతో విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. సెప్టెంబరు 2019లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గోయల్పై విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రశ్నించారు. 2020లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కెనరా బ్యాంక్ నుంచి రూ.538 కోట్లు రుణాలు ఎగవేతకు పాల్పడడం, తన అనుబంధ సంస్థ జేఐఎల్కు 14వందల కోట్ల చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధుల్ని కాజేశారు. కెనరా బ్యాంక్ అధికారుల ఫిర్యాదు, నిధులు కాజేయడంతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించిన ఈడీ అధికారులు గోయల్ను ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వివాదాలు 👉2000వ దశకంలో నరేష్గోయల్కు అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జెట్ ఎయిర్వేస్కు దావూద్ నిధులు సమకూర్చారని పిల్ పేర్కొంది. అయితే నరేష్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. 👉మార్చి 2020లో, అతనితో అనుబంధించబడిన 19 ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొన్నందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. 👉19 జూలై 2023న, నరేష్ గోయల్, అతని సహచరుల నివాసాల్లో ఢిల్లీ, ముంబైలలో దాడులు చేసింది. దీనికి ముందు, జూలై 14, 2023న గోయల్, అతని భార్యతో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చివరికి అదుపులోకి తీసుకుంది. 👉1979లో మార్కెటింగ్ అనలిస్ట్గా కంపెనీలో చేరి మార్కెటింగ్, సేల్స్ హెడ్గా ఎదిగిన అనిత అనే యువతిని ఆమెను వివాహం చేసుకున్నారు. వారు తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 👉చివరిగా ::: ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా కెప్టెన్ గోపీనాథ్ పాత్రను సూర్య చేస్తే.. సినిమాలోని సూర్య (మహా) ఆశయాన్ని ప్రతి అడుగులోను అడ్డగించే విలన్గా పరేష్ రావల్ యాక్ట్ చేశారు. నిజజీవితంలో కెప్టెన్ గోపీనాథ్ను ఇబ్బంది పెట్టింది మరెవరో కాదు జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేశ్ గోయల్. -
‘జెట్ ఎయిర్వేస్’ నరేశ్ గోయల్ అరెస్ట్
ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(74)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద.. ముంబైలో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. జెట్ ఎయిర్ కోసం కెనరా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.848.86 కోట్ల రుణాలను దారి మళ్లించి స్వాహా చేశారని సీబీఐ ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ గోయల్ను ప్రశ్నించి.. అరెస్టు చేసింది. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గోయల్ను శనివారం ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశ పెట్టి..ఈడీ అధి కారులు ఆయన కస్టడీ కోరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనూహ్యంగా.. దాదాపు 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలు, సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్లో మూత పడింది. ఆపై బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకుంనది. ఇక జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఎయిర్పోర్ట్లో అడ్డగింత.. తనిఖీలు.. జెట్ ఎయిర్వేస్ సర్వీస్లు నిలిచిపోయాక.. 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. ఆ టైంలో నరేష్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక.. విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేష్ గోయల్ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అటు నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు. -
కీలక పరిణామం.. జెట్ ఎయిర్వేస్ సీఈవో పదవికి సంజీవ్ కపూర్ రాజీనామా!
దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది జెట్ ఎయిర్వేస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంజీవ్ కపూర్ తన పదవికి రాజీనామా చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన సీఈవోగా ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నారు. ఇక సంజీవ్ కపూర్ సీఈవో పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న విషయంపై కారణాలు తెలియరావాల్సి ఉంది. రిజిగ్నేషన్పై అటు సంజవ్ కపూర్ గాని, ఇటు జలాన్- కర్లాక్ కన్సార్షియం గాని స్పందించలేదు. అప్పటి వరకు సంజీవ్ కపూర్ సీఈవోగా ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019లో నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కు వెళ్లగా.. జలాన్- కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకుంది. అయితే, తాజాగా జెట్ ఎయిర్వేస్ సేవల్ని పునఃప్రారంభించే విషయంలో కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ తరుణంలో సంజీవ్ కపూర్ రాజీనామా చేయడం దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిమాలు చోటు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది. సంజీవ్ కపూర్ రాజీనామాతో విమానయాన రంగంలో సంజీవ్ కపూర్కు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కు అధ్యక్షుడిగా ఉన్నారు. స్పైస్జెట్, గోఎయిర్, విస్తారాలో వివిధ హోదాల్లో సంజీవ్ కపూర్ పనిచేశారు. చదవండి👉 ‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఇండిగో ఎయిర్ హోస్టెస్కు జెట్ ఎయిర్వేస్ సీఈవో సపోర్ట్ -
వివాదంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. దేశంలో ఉన్న మెట్రో స్టేషన్ల సౌందర్యం,ఆర్కిటెక్చర్పై (aesthetics and architecture) ఆసంతృప్తి వ్యక్తం చేస్తూ వైట్ఫీల్డ్-కేఆర్ పురం మెట్రో మార్గం (పర్పుల్ లైన్) - దుబాయ్ మెట్రో స్టేషన్ ఫోటోల్ని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లపై ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ నడుస్తున్నది. సంజీవ్ కపూర్ భారత్ - దుబాయ్లోని మౌలిక సదుపాయాలను పోల్చారు. దుబాయ్ మౌలిక సదుపాయాలతో పోలిస్తే ఇండియన్ మెట్రోస్టేషన్లు ‘కళ లేని కాంక్రీటు కళ్లజోళ్లు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఆ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు జెట్ ఎయిర్వేస్ సీఈవోను ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ ట్విటర్ యూజర్ బెంగుళూరు, గుర్గావ్, కోల్కతాలలోని ఓవర్గ్రౌండ్/ఓవర్ హెడ్ మెట్రో స్టేషన్లు కళావిహీనంగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తూ సంబంధిత మెట్రోస్టేషన్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో పాటు దుబాయ్ మెట్రోస్టేషన్ కంటే భారత్లో మెట్రో స్టేషన్లు బాగున్నాయని నొక్కాణిస్తూ మరిన్ని ఫోటోల్ని షేర్ చేశారు. చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా అందంగా ఉన్న మెట్రోస్టేషన్లను, వాటి డిజైన్ ఫోటోల్ని ట్విటర్లో పంచుకుంటున్నారు. 'అది కూడా కరెక్టే కదా సార్' సంజీవ్ కపూర్ అభిప్రాయాన్ని ఏకీభవించిన మరికొందరు.‘‘అది కూడా కరెక్టే కదా సార్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యావరణ అనుకూలమైనది కాదు. ఖర్చుతో కూడుకున్నది. కేవలం మెట్రో స్టేషన్ మాత్రమే కాదు ఇతర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఈ రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలు సైతం అందానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతులు మీదిగా కాగా, జెట్ ఎయిర్వేస్ సీఈవో ట్వీట్ చేసిన బెంగళూరులోని 13 కిలోమీటర్ల వైట్ఫీల్డ్-కెఆర్ పురం మెట్రో (పర్పుల్ లైన్) రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 25న ప్రారంభించనున్నారు. Delhi Metro for you! pic.twitter.com/HA8z0g6AZZ — Rahul Kapoor (@okwithrk) March 18, 2023 The same station from some distance has this look (not the right part of pic), but yes, most of the stations are box shaped. •Sri Sathya Sai Hospital Metro Station#Bangalore pic.twitter.com/SCWEUxtmk6 — Bangalore Metro Updates (@WF_Watcher) March 18, 2023 Bangalore metro has amazing artwork on the walls. They let artists paint the walls later on. Case in point, church street metro: pic.twitter.com/41ojhy7JQx — Srijan R Shetty (@srijanshetty) March 19, 2023 -
‘మీకో దణ్ణం! నాకు ఫోన్ చేయొద్దు’.. జెట్ ఎయిర్ వేస్ సీఈవో అసహనం!
9 ఏళ్ల నుంచి మీ నెట్ వర్క్ వినియోగిస్తున్నా. ఇక నుంచి వేరే నెట్ వర్క్కు మారుతున్నా. దయచేసి నాకు ఫోన్ చేయకండి అంటూ ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ఓ టెలికం కంపెనీ కస్టమర్ కేర్ నిర్వాహకంపై అసహననానికి గురయ్యారు. అందుకు ఓ కారణాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్ వేదికగా చివాట్లు పెట్టారు. జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ 9 ఏళ్ల నుంచి దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ను వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ నెట్ వర్క్ పనితీరు మందగించడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సంజీవ్ కపూర్కు సైతం ఈ తరహా ఇబ్బంది తలెత్తింది. ఆదివారం నెట్ వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, అదే సమయంలో కస్టమర్ కేర్ నుంచి వరుస కాల్స్ రావడంతో ఇరిటేట్ అయ్యారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ట్విటర్ వేదికగా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫోన్ చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ప్రియమైన @ViCustomerCare: నెట్ వర్క్ మారవద్దని నన్ను ఒప్పించేందుకు పదే పదే కాల్స్ చేస్తున్నారు. అలా కాల్ చేయడం మానేయండి. నేను 9 సంవత్సరాల తర్వాత నెట్ వర్క్ ఎందుకు మారుతున్నానో మీకు చెప్పాను. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కవరేజీ తక్కువగా. కొందరికి రోమింగ్ కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. అంతే. ధన్యవాదాలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్కు వీఐ కస్టమర్ కేర్ విభాగం స్పందించింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అని రిప్లయి ఇచ్చింది. ఆ ట్వీట్కు సంజీవ్ రిప్లయి ఇచ్చారు. @ViCustomerCare దయచేసి నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించకండి. నిన్నటి నుండి నాకు డజను కాల్స్ వచ్చాయి. ఫోన్ చేయడం ఆపండి, అంతే! అని అన్నారు. అయినా సరే వీఐ కస్టమర్ కేర్ విభాగం సంజీవ్ కపూర్కు మరోసారి ఫోన్ చేసి విసిగించింది. దీంతో ఏం చేయాలో పోక...మా నెట్ వర్క్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఫోన్ వచ్చింది. ఇది మంచి పద్దతి కాదు. ఫోన్ చేయడం ఎప్పుడు ఆపేస్తారో.. వీఐ యాజమాన్యం ఉన్నతాధికులు ట్విటర్లో ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తూ మరోసారి ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. Dear @ViCustomerCare : please stop calling me repeatedly trying to convince me not to switch carriers. I have told you why I am switching after 9 years: 1. Poor coverage in some parts of India, and 2. Inferior international roaming plans for some countries. That's all. Thanks. — Sanjiv Kapoor (@TheSanjivKapoor) February 12, 2023 Hi Sanjiv! I can understand this has caused difficulties for you. I’ve made a note of your concern. Will get in touch with you shortly - Vandana https://t.co/fuKV0H8zIF — Vi Customer Care (@ViCustomerCare) February 12, 2023 -
మాజీ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ కొత్త యజమాని– జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియంకు (మురారి లాల్ జలాన్– ఫ్లోరియన్ ఫ్రిచ్) అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్లైన్ మాజీ ఉద్యోగుల భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని ఆదేశిస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఇచ్చిన రూలింగ్కు వ్యతిరేకంగా కన్సార్టియం దాఖలు చేసిన అప్పీల్ను విచారణకు స్వీకరించలేదు. ‘‘ఎవరైనా ఏదైనా డీల్లో అడుగుపెడుతున్నప్పుడు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుసుకుంటారు. చెల్లించని కార్మికుల బకాయిలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ విషయంలో అంతిమ నిర్ణయం ఉండాలి. క్షమించండి, మేము ట్రిబ్యునల్ తీర్పులో జోక్యం చేసుకోవడం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కన్సార్టియం వాదన ఇది... కన్సార్టియం తరఫున సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కిర్పాల్ తన వాదనలు వినిపిస్తూ, కన్సార్టియంకు అందించిన సమాచార పత్రంలో (ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్) కార్పొరేట్ రుణగ్రహీత (జెట్ ఎయిర్వేస్) భవిష్య నిధి, గ్రాట్యుటీ బకాయిలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలను పూర్తిగా వెల్లడించలేదని పేర్కొన్నారు. బకాయిల కింద ఇప్పుడు రూ. 200 కోట్లకు పైగా అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, దీనివల్ల విమానయాన సంస్థను పునరుద్ధరించడం కష్టమని అన్నారు. ఒకసారి ఆమోదించిన తర్వాత రిజల్యూషన్ ప్లాన్ను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని కూడా పేర్కొన్నారు. ఈ తరహా ఉద్యోగులకు ఆశాకిరణం సుప్రీం రూలింగ్తో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కన్సార్టియం అప్పీల్కు వెళుతుందన్న అభిప్రాయంతో జెట్ ఎయిర్వేస్ అగ్రివ్డ్ (బాధిత) వర్క్మెన్ అసోసియేషన్ (ఏఏడబ్ల్యూజేఏ) సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ భట్నాగర్, న్యాయవాది స్వర్ణేందు ఛటర్జీ తమ వాదనలు వినిపించారు. ‘‘ఈ ఉత్తర్వు ఈ వివాదంలో మార్గనిర్దేశం చేయడమే కాదు, ఈ రకమైన వ్యాజ్యాలలో చిక్కుకున్న ఈ తరహా కార్మికులు, ఉద్యోగులందరికీ ఇది ఒక ఆశాకిరణం’’ అని అడ్వకేట్ ఛటర్జీ విలేకరులతో అన్నారు. రికార్డ్ తేదీ... 2019 జూన్ 20 ఆర్థిక సంక్షోభం కారణంగా 2019 ప్రారంభంలో కార్యకలాపాలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా జలాన్–ఫ్రిట్ష్ కన్సార్టియం గెలుచుకుంది. విమానయాన సంస్థ ఇప్పుడు తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం, రాజీనామా చేసిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులందరికీ పూర్తి గ్రాట్యుటీ మరియు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలి. ఈ లెక్కలకు 2019 జూన్ 20 వరకు తేదీని (దివాలాకు సంబంధించి అడ్మిషన్ తేదీ వరకు) పరిగణనలోకి తీసుకోవాలి. సుప్రీం రూలింగ్తో ప్రయోజనం పొందుతున్న వారిలో జెట్ ఎయిర్వేస్ కార్మికులు, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. -
జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం బదిలీకి ఎన్సీఎల్టీ ఆమోదం
ముంబై: దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులను జలాన్ కల్రాక్ కన్సార్షియానికి బదిలీ చేసే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. అలాగే రుణదాతలు, ఉద్యోగులు మొదలైన వారికి బాకీలు చెల్లించడానికి మరికొంత సమయం ఇచ్చింది. దీంతో బాకీల చెల్లింపునకు కన్సార్షియానికి మే నెల వరకూ వ్యవధి లభించింది. గతంలో ఈ గడువు 2022 నవంబర్ 16గా ఉండేది. కన్సార్షియం, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దివాలా పరిష్కార ప్రక్రియ కింద జెట్ ఎయిర్వేస్ను జలాన్ కల్రాక్ కన్సార్షియం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2021 జూన్లో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 7,807 కోట్ల మేర బాకీలను వదులుకునేందుకు (హెయిర్కట్) అంగీకరించాయి. రుణదాతలకు చెల్లింపులతో పాటు వ్యాపారానికి కన్సార్షియం రూ. 1,375 కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్లైన్ యాజమాన్య హక్ులను తమకు బదిలీ చేయాలని, బాకీల చెల్లింపునకు మ రింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని కన్సార్షి యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ప్రతివాదులు కోరినప్పటికీ ఎన్సీఎల్టీ తిరస్కరించింది. -
‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసలు
ప్రముఖ ఏవీయేషన్ సంస్థ ఇండిగో సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. ఈ వివాదంలో మరో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎయిర్ హోస్టెస్కు సపోర్ట్ చేశారు. నెటిజన్లు సైతం ఎయిర్ హోస్టెస్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండిగో సంస్థ ఇస్తాంబుల్- ఢిల్లీ విమానాల కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. డిసెంబర్ 16న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికుడు తానుకోరుకున్న ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో లేవని వాగ్వాదానికి దిగాడు. ఫ్లైట్లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఆర్.గూర్ప్రీత్ సింగ్ మెన్స్ వీడియో తీసి సోషల్మీడియాలో షేర్ చేయడంతో అది తెగ చక్కెర్లు కొడుతోంది. వాళ్లూ మనుషులే As I had said earlier, crew are human too. It must have taken a lot to get her to breaking point. Over the years I have seen crew slapped and abused on board flights, called "servant" and worse. Hope she is fine despite the pressure she must be under. https://t.co/cSPI0jQBZl — Sanjiv Kapoor (@TheSanjivKapoor) December 21, 2022 ఈ తరుణంలో ఫ్లైట్లో ప్రయాణికులు-ఎయిర్ హోస్టెస్ మధ్య జరిగిన ఘర్షణపై జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందించారు. ఇండిగో ఎయిర్ హోస్టెస్కు మద్దతు పలికారు. సిబ్బంది కూడా మనుషులేనని వ్యాఖ్యానించారు. ‘నేను ముందే చెప్పినట్లు,సిబ్బంది కూడా మనుషులే.నేను గత కొన్నేళ్లుగా విమానంలో సిబ్బందిని..చెంపదెబ్బలు కొట్టడం దూర్భాషలాడడం చూశాను. ప్రయాణికుడితో జరిగిన వాగ్వాదంలో ఆమె తీవ్రంగా త్తిడికి గురైంది. ఇప్పుడు ఆమె బాగుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎయిర్ హోస్టెస్కు అండగా నెటిజన్లు సీఈవో వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించారు.హెచ్ఆర్, యాజమాన్యం మహిళా సిబ్బందికి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. వారు ఈ స్థాయిలో చేరేందుకు ఎంతో కష్టపడిందో అర్ధం చేసుకోవాలంటూ అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో మహిళా సిబ్బంది తప్పు లేదని, ఎంతో ఓర్పుతో సమాధానం ఇచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఫ్లైట్లో ఏం జరిగింది ఇండిగోకు విమానం ‘6ఈ 12’ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీ వైపు వస్తుంది. ప్రయాణ సమయంలో ఎయిర్ హోస్టెస్కు, ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికుడు దురుసగా ప్రవర్తించడంతో ఓ ఎయిర్ హోస్ట్ కన్నీటి పర్యంతమైంది. దీంతో మరో ఎయిర్ హోస్టెస్ వారికి సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించేందుకు వెళ్లింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రయాణికుడు మరింత రెచ్చిపోయాడు. గొడవను సద్దుమణించేందుకు ప్రయత్నించిన సదరు మహిళా ఉద్యోగిని వైపు చేత్తో సంజ్ఞలు చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె ప్రయాణికుడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. Tempers soaring even mid-air: "I am not your servant" An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv — Tarun Shukla (@shukla_tarun) December 21, 2022 "నువ్వు నా వైపు వేలు చూపుతూ ఎందుకు అరుస్తున్నావు. నీ వల్ల నా సిబ్బంది ఏడుస్తున్నారు. దయచేసి పరిస్థితని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరిపడ భోజనాలు (విమానంలో) ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఆహారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం’ అని మాట్లాడుతుండగా ప్రయాణికుడు అడ్డు తగిలాడు "ఎందుకు అరుస్తున్నావు?" అని ప్రయాణికుడు గట్టిగా అరిచాడు. ఎయిర్ హోస్ట్ తన స్వరం పెంచుతూ...ఎందుకంటే మీరు మా మీద అరుస్తున్నారు. నీ మీ పని మనిషిని కాదు సార్. ఎయిర్ హెస్ట్ని. ఇండిగో సంస్థ ఉద్యోగిని అంటూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. శాండ్ విచ్ లేదని.. ఫ్లైట్ వివాదంపై ఇండిగో యాజమాన్యం స్పందించింది. ప్రయాణీకుడు శాండ్విచ్ అడిగారని, విమానంలో ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేస్తామని సిబ్బంది చెప్పారు. కానీ ఆ వ్యక్తి ఎయిర్ హోస్టెస్పై అరవడం ప్రారంభించాడు. దీంతో భయాందోళనకు గురైన ఎయిర్ హోస్ట్ ఏడ్చినట్లు తెలిపింది. -
Jet Airways: జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ షాక్
ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ భారీ షాక్ ఇచ్చింది. సంస్థ భవిష్యత్ కోసం పొదుపు మంత్రం జపిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి వేతనాలు చెల్లించకుండా 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. మిగిలిన ఉద్యోగులకు 50 శాతం వరకు జీతంలో కోత పెట్టనుంది. 2019లో ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో జెట్ ఎయిర్వేస్ను బిడ్డింగ్ జలాన్కర్లాక్ సంస్థ దక్కించింది. నూతన యాజమాన్యం ఈ ఏడాది నుంచి తిరిగి సర్వీసుల్ని ప్రారంభించాలని భావించింది. కానీ ఇప్పుటికే ఉద్యోగులకు చెల్లించాల్సిన జీత భత్యాలపై ఉద్యోగులు, సిబ్బంది సంఘం నేషనల్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ను ఆశ్రయించారు. దీంతో కథ మొదటికొచ్చింది. సర్వీసుల పునప్రారంభం కంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ బకాయిలను చెల్లించాలని నూతన యాజమాన్యాన్ని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో జలాన్ కర్లాక్ కన్సార్షియం ఎయిర్లైన్స్ పూర్తి స్థాయిలో తాము ఆధీనంలోకి రాలేదని, ఇందుకోసం తగిన సమయం పడుతోందంటూ ఎన్సీల్ఏటీకి వివరణిచ్చింది. కాగా, సిబ్బందిని సెలవులపై ఇంటికి పంపేందుకు నిర్ణయం తీసుకుంది. నిధుల్ని ఆదా చేసేందుకు ఈ తరహా చర్యలకు దిగింది. -
నష్టాల్లోనే జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ జెట్ ఎయిర్వేస్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 308 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 306 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. మొత్తం ఆదాయం రూ. 45 కోట్ల నుంచి 13.5 కోట్లకు పడిపోయింది. మొత్తం వ్యయాలు రూ. 322 కోట్లకు చేరాయి. మూడున్నరేళ్లుగా కార్యకలాపాలు నిలిచిపోయిన కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో జలాన్ కల్రాక్ కన్సార్షియం బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను గెలుపొందింది. అయితే కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావలసి ఉంది. -
దేశీ ఎయిర్లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్లైన్స్పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
ఏవియేషన్కు కొలువుల కళ!
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగా తగ్గిపోవడం, ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగిపోవడం ఏవియేషన్ పరిశ్రమకు కలసి వస్తోంది. దీంతో గత రెండేళ్ల నుంచి విహార యాత్రలకు దూరమైన వారు.. ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని విమానం ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎయిర్లైన్స్ సంస్థలకు డిమాండ్ను పెంచుతున్నాయి. మరోవైపు రాకేశ్ ఝున్ఝున్వాలా నుంచి ఆకాశ ఎయిర్లైన్స్ కొత్తగా సేవలు ఆరంభిస్తుండడం, మరోవైపు చాలా కాలంగా నిలిచిన జెట్ ఎయిర్వేస్ సేవల పునరుద్ధరణతో ఈ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో ఎయిర్లైన్స్ సంస్థలు సుమారు 30 శాతం మేర అదనంగా ఉద్యోగులను నియమించుకోవచ్చని పరిశ్రమ నిపుణుల అంచనా. ఆటోమేషన్ చుట్టూ చర్చ నడుస్తున్నప్పటికీ.. ఏవియేషన్ పరిశ్రమ ఎక్కువగా మానవవనరులపైనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని టీమ్లీజ్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ (రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్) జోయ్ థామస్ తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను పరిశీలిస్తే వచ్చే రెండు క్వార్టర్లలో నియామకాలు 30 శాతం పెరగొచ్చని చెప్పారు. మాన్స్టర్ డాట్ కామ్ డేటాను పరిశీలిస్తే.. 2022 ఏప్రిల్ నెలలో ఏవియేషన్ రంగంలో నియామకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది. మారిన పరిస్థితులు.. కరోనా కారణంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షల వల్ల ఏవియేషన్ రంగం గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను చూసిన మాట వాస్తవం. ఏవియేషన్, దీని అనుబంధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్రయిట్ ఫార్వార్డర్స్, కార్గో ఎయిర్లైన్స్ ఒక్కటే ఇందుకు భిన్నం. దీంతో ఏవియేషన్ రంగంలో భారీగా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. వేతనాల్లో కోత పడింది. ఎయిర్లైన్స్ సంస్థలు 2020 ఏప్రిల్, మే నెలల్లో అసలు సర్వీసులే నడపలేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి రెండేళ్లపాటు దేశీయ సర్వీసులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో నష్టాలను తట్టుకోలేక ఉద్యోగుల వేతనాలకు కోతలు పెట్టిన పరిస్థితులు చూశాం. కరోనా రెండేళ్ల కాలంలో ఈ పరిశ్రమలో సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పార్లమెంటరీ డేటానే చెబుతోంది. రూ.25,000 కోట్లకు పైగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొన్నది. ఇండిగో అయితే తన మొత్తం సిబ్బందిలో 10 మందిని తగ్గించింది. విస్తారా సైతం తన సిబ్బంది వేతనాలకు కోత పెట్టింది. స్పైస్జెట్, గోఫస్ట్ వేరియబుల్ పేను ఆఫర్ చేశాయి. కొత్త సంస్థలు.. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఆకాశ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు మొదలవన్నాయి. ఎయిర్ ఇండియా యాజమాన్యం మారిపోవడం, టాటా గ్రూపులో ఎయిర్లైన్స్ సంస్థల స్థిరీకరణ, కరోనా కేసులు తగ్గిపోవడం, విదేశీ సర్వీసులకు ద్వారాలు తెరవడం డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కమర్షియల్ పైలట్ల నియామకాలు వచ్చే కొన్నేళ్లపాటు వృద్ధి దశలోనే ఉంటాయని క్వెస్కార్ప్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ జోషి చెప్పారు. కొత్త సంస్థల రాక, ఉన్న సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం వల్ల నిర్వహణ సిబ్బందికి డిమాండ్ పెంచుతుందని జోషి వివరించారు. -
జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్లాన్ : ఉద్యోగుల షాక్!
ముంబై: ఎయిర్లైన్స్ కోసం జలాన్-కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళికను సవాలుచేస్తూ, ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్)లో అప్పీల్ దాఖలు చేసినట్లు ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ గురువారం తెలిపింది. బ్రిటన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్ల కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను 2020 అక్టోబర్లో జెట్ ఎయిర్వేస్ రుణ దాతల కమిటీ (సీఓసీ) ఆమోదించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ పరిష్కార ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు గత వారం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తిరిగి ధృవీకరించింది. దీనితో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 2019లో ఆగిపోయిన ఎయిర్లైన్ పునఃప్రారంభానికి మార్గం సుగమం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియను సవాలు చేస్తూ, ఆ సంస్థ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. బీకేస్, జెట్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్, వివిధ సంఘాలు కూడా గత నెలలో ఎన్సీఎల్ఏటీ ముందు అప్పీల్ దాఖలు చేశాయి. రాబోయే నెలల్లో సేవలను పునఃప్రారంభిస్తుందని భావిస్తున్న జెట్ ఎయిర్వేస్ను ప్రస్తుతం మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తోంది. అప్పీల్ ఎందుకంటే... జెట్ ఎయిర్వేస్ ఆస్తులు, ఫ్లైట్ స్లాట్లు, మరీ ముఖ్యంగా ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులతో సహా కీలక విభాగాల వినియోగం ఎలా అన్నది రిజల్యూషన్ ప్రణాళికలో ఊహాజనితంగా ఉందని ఆల్ ఇండియా జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ పావస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగానే తాము దీనిని సవాలు చేస్తున్నట్లు తెలిపారు. అసోసియేషన్ గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్క్యాష్మెంట్, ఏప్రిల్ 2018 నుండి జూన్ 2019 వరకు బోనస్, కార్మికులు-ఉద్యోగులందరికీ రిట్రెంచ్మెంట్ పరిహారం పూర్తి చెల్లింపులపై తగిన పరిష్కారం చూపాలని ఎన్సీఎల్ఏటీ ముందు దాఖలు చేసిన అప్పీల్లో విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. రిజల్యూషన్ దరఖాస్తుదారు లేదా మానిటరింగ్ కమిటీ ద్వారా తిరిగి నియమించబడిన ఏ ఉద్యోగికైనా అప్పటికే రావాల్సిన వారి గ్రాట్యుటీ, చెల్లించని వేతనాలు, ప్రివిలేజ్ లీవ్ ఎన్క్యాష్మెంట్, బోనస్ రిట్రెంచ్మెంట్ పరిహారం చెల్లించాలని కూడా అసోసియేషన్ డిమాండ్ చేస్తోందన్నారు. మినహాయింపులను ఎంతమాత్రం అంగీకరించడం జరగదని కిరణ్ పావస్కర్ స్పష్టం చేశారు. రిజల్యూషన్ ప్రణాళిక అస్పష్టమైన వ్యాపార ప్రణాళికతో ముడివడి ఉందని జెట్ ఎయిర్వేస్ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఉద్యోగుల న్యాయ సలహాదారు నారాయణ్ హరిహరన్ అన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులను, ముఖ్యంగా గ్రాట్యుటీ, ప్రివిలేజ్లీవ్, చెల్లించని జీతం, బోనస్లను మాఫీ చేయలని చూస్తున్నట్లు విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ ఇంతక్రితం నరేష్ గోయల్, గల్ఫ్ క్యారియర్ ఎతిహాద్ యాజమాన్యంలో ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం 2019 జూన్లో రూ. 8,000 కోట్లకు పైగా బకాయిల కోసం దివాలా పిటిషన్ను దాఖలు చేసింది. -
జెట్ ఎయిర్వేస్లో కొత్తగా నియామకాలు
న్యూఢిల్లీ: విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఇటీవలే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ పొందిన జెట్ ఎయిర్వేస్ తాజాగా నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకున్నట్లు వెల్లడించింది. చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా ప్రభ్ శరణ్ సింగ్, ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్గా హెచ్ఆర్ జగన్నాథ్, ఇన్ఫ్లయిట్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా మార్క్ టర్నర్, సేల్స్ తదిర విభాగాల వైస్ ప్రెసిడెంట్గా విశేష్ ఖన్నా నియమితులైనట్లు తెలిపింది. వచ్చే నెలలో కొందరు బాధ్యతలు చేపట్టనున్నట్లు వివరించింది. సింగ్ ప్రస్తుతం డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్లో సీఈవోగా చేసిన జగన్నాథ్కు ఏవియేషన్ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. టర్నర్ గతంలో కూడా జెట్ ఎయిర్వేస్లో సేవలు అందించారు. గల్ఫ్ ఎయిర్, ఎమిరేట్స్ మొదలైన వాటిలో సీనియర్ మేనేజ్మెంట్ హోదాలో పని చేశారు. ఖన్నా ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్లో బిజినెస్ హెడ్ (ఈ–వీసా విభాగం)గా ఉన్నారు. ఆర్థిక సంక్షోభంతో 2019 ఏప్రిల్ 17న మూతబడిన జెట్ ఎయిర్వేస్ను జలాన్–కల్రాక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. -
రెక్కలు తొడిగి, మళ్లీ నింగిలోకి జెట్ ఎయిర్ వేస్..!
అప్పులతో కుదేలైన ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ తిరిగి తన కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జెట్ ఎయిర్ వేస్కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్(ఏఓసీ)ని అందించింది మే5,1993న నరేష్ గోయల్ జెట్ ఎయిర్ వేస్ పేరుతో తొలి కమర్షియల్ ఫ్లైట్ను ప్రారంభించారు. 100 పైగా విమానాలతో జెట్ ఎయిర్ వేస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. కానీ మార్కెట్లో కాంపిటీషన్, ఫ్లైట్ నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఆ సంస్థ ఏప్రిల్ 18,2019 నాటికి ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో జాతీయ అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా,ఈ సంస్థను యూఏఈకి చెందిన వ్యాపార వేత్త మురారి జలాన్, యూకేకి చెందిన కల్రాక్ క్యాపిటల్ సంస్థలు ఒప్పొంద ప్రాతిపదికన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయడం,పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా ఆ రెండు సంస్థల కన్సార్టియం జెట్ ఎయిర్ వేస్కు 180మిలియన్ల నిధుల్ని అందించనున్నాయి. అందులో 60 మిలియన్లను అత్యవసర రుణాల్ని జెట్ ఎయిర్ వేస్ తీర్చనుంది. డీసీజీఏ వివరాల ప్రకారం డీసీజీఏ వివరాల ప్రకారం.. జెట్ ఎయిర్ వేస్ ఇప్పటికే తన కార్యకాలపాల్ని ప్రారంభించింది. మే15నుంచి మే17 మధ్య కాలంలో 5 విమానాల రాకపోకల్ని నిర్వహించింది. మిగిలిన కమర్షియల్ ఫ్లైట్లు జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రారంభం కానున్నాయని డీసీజీఏ తెలిపింది. చదవండి👉ఇండిగోకి కొత్త సీఈవో..ఆయన ఎవరంటే! -
రెక్కలు తొడిగిన జెట్ ఎయిర్వేస్
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ మళ్లీ రెక్కలు తొడిగింది. కమర్షియల్ విమాన సర్వీసులు నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు సాధించింది. దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత తర్వాత జెట్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి ఎగిరింది. డీజీసీఏ నుంచి అనుమతి రావడంతో టెస్ట్ ఫ్లైట్ను ముందుగా నడిపించింది జెట్ ఎయిర్వేస్. 2022 మే5న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మొదటి విమానం బయల్ధేరింది. మళ్లీ విమాన సర్వీసులు ప్రారంభించడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆ కంపెనీ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. త్వరలోనే కమర్షియల్ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. జెట్ ఎయిర్వేస్ చివరి కమర్షియల్ సర్వీస్ 2019 ఏప్రిల్ 17న నడిచింది. చదవండి : సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదంటున్న అపర కుబేరుడు వారెన్ బఫెట్ -
బాబోయ్ ఫ్యూయల్ రేట్లు మండిపోతున్నాయ్! విమానాల్లో మగవాళ్లు వద్దు?
కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది. పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్. విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు. విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు. Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV — Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022 మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు. చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్ -
జెట్ ఎయిర్వేస్ 2.0లో కీలక పరిణామం
ముంబై: కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ గౌర్ షాక్ ఇచ్చారు. తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం గౌర్ వెల్లడించలేదు. అయితే రాకేశ్ ఝున్ఝున్వాలా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వల్లే.. గౌర్ నిష్క్రమణ జరిగిందా? అనే కోణంలో ప్రత్యేక చర్చ మొదలైంది ఇప్పుడు. నరేష్ గోయల్ స్థాపించిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా రెండు సంవత్సరాల పాటు సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి 2022లో జెట్ ఎయిర్వేస్ 2.0 పేరుతో సర్వీసుల్ని పున:ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం అధికారికంగా వెల్లడించింది కూడా. మరోవైపు 2022 మొదటి త్రైమాసికంలో(వేసవిలోపే) విమానయాన సంస్థను పునఃప్రారంభించడానికి గత ఏడాది ఎన్సిఎల్టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇన్వెస్ట్మెంట్ గురు, బిగ్బుల్ రాకేశ్ ఝున్ఝున్వాలా ‘ఆకాశ ఎయిర్’ను కూడా తొలి త్రైమాసికంలోనే తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదివరకే 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఈ మధ్యే లోగోను లాంఛ్ చేయగా.. బోయిగ్ సంస్థతో విమానాల కోసం ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్ ఎయిర్వేస్ నుంచి తాతాల్కిక సీఈవో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ గౌర్ ఆకాశ ఎయిర్లో చేరతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ 2021 జూన్లో ఆమోదం తెలిపింది. 2022 నుంచి తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని జలాన్ కల్రాక్ కన్సార్షియం భావించింది. (చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!) -
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్కు సిద్ధం!
-
జెట్ ఎయిర్వేస్: టేకాఫ్కు సిద్ధం!
సాక్షి,ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మంచిరోజులు రానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం సుగమమైంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచే దేశీయ విమాన సర్వీసులను పున:ప్రారంభించనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని జలాన్ కల్రాక్ కన్సార్షియం వెల్లడించింది. నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఈ ఏడాది జూన్లో ఆమోదం తెలిపింది. తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని మురళీ జలాన్ ఇటీవల వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ప్రయాణంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్కు సిద్ధమవుతున్నాయి. చదవండి : Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్డే -
అమ్మకానికి ఎయిరిండియా.. దక్కించుకునేది ఎవరు ?
పెట్టుబడుల ఉపసంహార కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఎన్డీఏ సర్కారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా అమ్మకానికి మరోసారి రంగం సిద్ధం చేసింది. నేటితో ఆఖరు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా నిర్వాహణపరమైన లోపాలతో నష్టాల పాలైంది. ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా నష్టాలు రూ. 43,000 కోట్లుగా తేలాయి. దీంతో ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి ఉన్న కంపెనీలు బిడ్ దాఖలు చేసేందుకు 2021 సెప్టెంబరు 15 చివరి తేదీగా నిర్ణయించింది. ఇకపై గడువు పెంచబోమంటూ ఏవియేషన్ మినిష్టర్ జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. రెండోసారి ఎయిర్ ఇండియాను 2018లోనే కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఎయిర్ ఇండియాలో కనీసం 76 శాతం వాటాను కొనుగోలు చేయాలని షరతు విధించింది. అయితే ఏ ఒక్క కంపెనీ కేంద్రం విధించిన షరతులు అనుసరించి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో రెండో సారి ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి బిడ్లను కేంద్రం ఆహ్వానించింది. ఈసారి ఒకే సంస్థ కాకుండా రెండు సంస్థలు కలిసి బిడ్డింగ్లో పాల్గొనవచ్చంటూ కొంత వెసులుబాటు కల్పించింది. అదే విధంగా వంద శాతం వాటాలను విక్రయించాలని కూడా నిర్ణయించింది. బరిలో ఎవరు ? ఎయిర్ ఇండియా కొనుగోలుకు సంబంధించి చివరి తేది వరకు కూడా పెద్దగా కంపెనీలు ఆసక్తి చూపించలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు టాటా గ్రూపుతో పాటు స్పైస్ జెట్ సంస్థలు ఎయిర్ఇండియా కొనుగోలకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎయిర్ ఇండియా భారీగా నష్టాల పాలైనప్పటికీ వేల కొట్ల విలువ చేసే ఆస్తులు ఆ సంస్థకి ఉన్నాయి. ముంబై, ఢిల్లీలలో నగరం నడిబొడ్డున ఎకరాల కొద్ది స్థలం అందుబాటులో ఉంది. దీనికి తోడు దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లో సిబ్బంది క్వార్టర్స్ రూపంలో కూడా ఆస్తులు ఎయిర్ ఇండియా పేరిట ఉన్నాయి. విదేశాల్లో సైతం ఎయిర్ఇండియాకు అనేక ఆస్తులు ఉన్నాయి. చదవండి : డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే -
మళ్లీ గాల్లో ఎగరనున్న ఆ బడా ఎయిర్ లైన్స్ కంపెనీ
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్వేస్ తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్దం అవుతుంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జెట్ ఎయిర్వేస్ విమానాలు మళ్లీ గాల్లో ఎగరనున్నాయని జలాన్ కల్రాక్ కన్సార్షియం సోమవారం వెల్లడించింది. న్యూఢిల్లీ నుంచి ముంబైకి తన మొదటి విమానంతో దేశీయ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని, వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి అంతర్జాతీయ విమానాలు కూడా పనిచేస్తాయని కంపెనీ ఈ రోజు తెలిపింది. 100కి పైగా విమాన సేవలు గ్రౌండెడ్ క్యారియర్ పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. "జెట్ ఎయిర్వేస్ 2.0 2022 మొదటి తొలి త్రైమాసికంలో దేశీయ కార్యకలాపాలను పునఃప్రారంభించడం, క్యూ3/క్యూ4 2022 నాటికి స్వల్ప కాలిక అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మా ప్రణాళికలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో 50+ విమానాలు, 5 సంవత్సరాలలో 100+ పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని కన్సార్టియం స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నట్లు" లండన్ కు చెందిన జలాన్ కల్రాక్ కన్సార్టియం ప్రధాన సభ్యుడు, జెట్ ఎయిర్ వేస్ ప్రతిపాదిత నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుఏఈ వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ అన్నారు.(చదవండి: ఈఎస్ఐసీ చందాదారులకు కేంద్రం శుభవార్త!) విమానయాన చరిత్రలో ఇదే మొదటిసారి "విమానయాన చరిత్రలో 2 సంవత్సరాలకు పైగా మూతబడిన ఒక విమానయాన సంస్థను పునరుద్ధరించబడటం ఇదే మొదటిసారి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగం కావడం ఆనందంగా ఉంది" అని శ్రీ జలాన్ చెప్పారు. భారీగా పెరిగిన నష్టాలతో కుంటుపడిన ఈ విమానయాన సంస్థ, ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్. భారీ అప్పుల కారణంగా ఏప్రిల్ 2019లో అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చింది. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికను నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ ఏడాది జూన్లో ఆమోదించింది. ప్రస్తుతం ఈ కంపెనీ దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబరులో బ్రిటన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈ వ్యాపారవేత్త జలాన్ల నేతృత్వంలోని కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్లో విజేతగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో రూ.12000 వేల కోట్లను తిరిగి చెల్లిస్తామని కల్రాక్-జలాన్ కన్సార్షియం ప్రతిపాదించింది. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది.(చదవండి: పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..) 1000కి పైగా ఉద్యోగాలు పునరాగమనం చేస్తున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. "జెట్ ఎయిర్ వేస్ ముంబైలోని తన 'గ్లోబల్ వన్' కార్యాలయం నుండి పనిచేస్తుంది. అక్కడ ఆ విమానయాన సంస్థకు ప్రపంచ స్థాయి అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని కూడా ఉంది. ఇక్కడే సిబ్బంది కోసం ఇన్-హౌస్ శిక్షణ ఇస్తారు" అని తాత్కాలిక సీఈఓ కెప్టెన్ గౌర్ పేర్కొన్నారు. "జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే తన ప్రణాళికలో భాగంగా 150 మందికి పైగా శాశ్వత స్థాయి ఉద్యోగులను నియమించుకుంది. అలాగే వివధ కేటగిరీలలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 1000 మందికి పైగా ఉద్యోగులను ఆన్ బోర్డ్ చేయాలని చూస్తున్నాము" అని కెప్టెన్ గౌర్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియ దశలవారీగా ఉంటుందని ఆయన అన్నారు. -
ఎన్సీఎల్ఏటీ ముందుకు జెట్ ఎయిర్వేస్ దివాలా కేసు
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ దివాలా విషయంలో జలాన్ కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలును నిలిపివేయాలని ఆ విమాన సంస్థ క్యాబిన్, గ్రౌండ్ సిబ్బంది ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. ఈ పరిష్కార ప్రక్రియలో తమ వేతనాలు, రిటైర్మెంట్ ప్రయోజన అంశాలు లేవని వివరించింది. తమ వాదనలు విని, తుది తీర్పు వెలువరించేంతవరకూ జూన్లో ఎస్సీఎల్టీ, ముంబై బెంచ్ ఆమోదించిన కల్రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలుపై స్టే ఇవ్వాలని ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించింది. రుణ భారాల్లో కూరు కుపోయిన జెట్ ఎయిర్వేస్ రెండేళ్లుగా కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అద్దె యంత్రాల కోసం సోనాలికా యాప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా గ్రూప్ ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్’ పేరుతో యాప్ను తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు, ట్రాక్టర్ల వంటివి అద్దెకిచ్చే వ్యక్తులను ఈ యాప్ ద్వారా రైతులతో అనుసంధానిస్తారు. రైతులు సైతం తమ వద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వాలనుకుంటే ఈ యాప్లో పేరు నమోదు చేసుకోవచ్చు. -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్ఝున్వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్ఝున్వాలాకు ఎయిర్లైన్స్లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్బుల్గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్ఝున్వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్లైన్స్లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగమైన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోనున్న కంపెనీ సంస్థ సిబ్బందికి ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్టాప్ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా నగదును సైతం చెల్లించేందుకు ప్రతిపాదించింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ సిబ్బందిలో కనీసం 95 శాతం టేకోవర్కు అనుకూలంగా ఓటింగ్ చేయవలసి ఉంటుంది. ఇలాగైతేనే జెట్ ఎయిర్వేస్ కొనుగోలు బిడ్కు క్లియరెన్స్ లభించనుంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసేందుకు బిడ్ను గెలుపొందిన సంగతి తెలిసిందే. కంపెనీ సిబ్బంది(ఉద్యోగులు, కార్మికులు) ప్రయోజనాల నేపథ్యంలో టేకోవర్ ప్రక్రియకు ఈ నెల 5న ప్రారంభమైన వోటింగ్ ఆగస్ట్ 4వరకూ కొనసాగనుంది. గత నెల 22న ఎన్సీఎల్టీ కొన్ని షరతులతో జలాన్ కల్రాక్ కన్సార్షియంకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా కంపెనీ సిబ్బందికి కొన్ని రకాల లబ్ధిని చేకూర్చేందుకు కన్సార్షియం ఆమోదించింది. ఈ అంశాలను జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో పొందుపరిచారు. రుణ భారం, నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్ 17న మూత పడింది. తదుపరి 2019 జూన్ 20న దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఆఫర్ ఇలా..: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది(కార్మికులు)కి టేకోవర్ కంపెనీ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా ల్యాప్టాప్ను ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అంతేకాకుండా రూ. 22,800 చొప్పున నగదును చెల్లించనుంది. ఇక ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.11,000 చొప్పున అందించనుంది. జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు జలాన్ కల్రాక్ కన్సార్షియం మొత్తంగా నగదు రూపేణా రూ. 1,375 కోట్లను వెచ్చించనుంది. -
జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు!
న్యూఢిల్లీ: దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను వేలంలో దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం .. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం కంపెనీలో రూ. 1,375 కోట్ల మేర నిధులు సమకూర్చనుంది. ఇందులో రూ. 475 కోట్లు రుణదాతలకు దక్కనున్నాయి. మిగతా రూ. 900 కోట్ల మొత్తాన్ని సంస్థ నిర్వహణ మూలనిధి అవసరాలు, పెట్టుబడి వ్యయాల కోసం కన్సార్షియం వెచ్చించనుంది. ఈ ప్రణాళిక ప్రకారం బ్యాంకులకు దక్కే నిధుల్లో భారీగా అంటకత్తెర పడనుంది. సుమారు రూ. 7,800 కోట్ల పైగా రావాలంటూ బ్యాంకులు క్లెయిమ్ చేయగా వాటికి రూ. 475 కోట్ల మేరకే కేటాయింపు జరిగింది. ఇందులోనూ మళ్లీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్పీ) సంబంధించిన ఖర్చులు పోగా ఆర్థిక రుణదాతలకు నికరంగా రూ. 380 కోట్లు లభించనున్నాయి. దీనిలో రూ. 185 కోట్ల మొత్తాన్ని ముందస్తుగా చెల్లించనుండగా, మిగతా రూ. 195 కోట్లకు జీరో – కూపన్ బాండ్లను కన్సార్షియం జారీ చేస్తుంది. అలాగే జెట్ ఎయిర్వేస్లో బ్యాంకులకు 9.5 శాతం, జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్లో 7.5 శాతం వాటా లభిస్తుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్లో కార్యకలాపాలు నిలిపివేసింది. అదే ఏడాది జూన్ నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 22న జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను రాతపూర్వకంగా బుధవారం ప్రకటించింది. చదవండి: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ రెక్కలు! -
దివాలా తీసిన విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు
ముంబై: ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగిరేందుకు మార్గం దాదాపు సుగమమైంది. జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. జూన్ 22 నుంచి 90 రోజుల్లోగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. ఒకవేళ గడువు పొడిగించాల్సిన అవసరం వస్తే ట్రిబ్యునల్ను జలాన్ కల్రాక్ కన్సార్షియం మరోసారి ఆశ్రయించవచ్చని మౌఖికంగా పేర్కొంది. అటు విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపు అంశాన్ని ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ సంస్థ పరిశీలించాల్సి ఉంటుందని ఎన్సీఎల్టీ తెలిపింది. మరోవైపు ఎన్సీఎల్టీ రాతపూర్వక ఆదేశాలు వచ్చాక తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నట్లు జలాన్ కల్రాక్ కన్సార్షియం పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ను తిరిగి పునరుద్ధరించేందుకు సంబంధిత వర్గాలందరితో కలిసి పనిచేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగలవని కంపెనీ పరిష్కార నిపుణుడు, గ్రాంట్ అండ్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ ఆశీష్ ఛాచ్రియా ఆశాభావం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ ప్రారంభమయ్యాక రెండేళ్ల నుంచి కంపెనీ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ‘రెండేళ్ల మా శ్రమకు ఫలితం దక్కింది. జెట్ ఎయిర్వేస్ 2.0 పునరుద్ధరణకు ఎన్సీఎల్టీ ఉత్తర్వులు తోడ్పడతాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కీలకంగా స్లాట్లు.. రెండేళ్ల క్రితం కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయిన తర్వాత జెట్కి ఉన్న స్లాట్లు ఇతర ఆపరేటర్లకు దక్కాయి. కంపెనీ సర్వీసులు పునఃప్రారంభం కావడానికి ఇవి కీలకంగా ఉండనున్నాయి. ఇదే విషయాన్ని ఆశీష్.. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకెళ్లారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ (ఎంవోసీఏ) దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. అయితే, గత చరిత్ర ఆధారంగా జెట్ ఎయిర్వేస్కు స్లాట్లను కేటాయించడం కుదరదని, నిర్దిష్ట మార్గదర్శకాలకు లోబడే కేటాయింపు ఉంటుందని ఎన్సీఎల్టీకి దాఖలు చేసిన సంయుక్త అఫిడవిట్లో డీజీసీఏ, ఎంవోసీఏ స్పష్టం చేశాయి. మరోవైపు స్లాట్ల అంశం ఎప్పటికి పరిష్కారమవుతుందన్నది చెప్పడం కష్టం అయినప్పటికీ.. నిర్దేశిత గడువులోగా ఒక కొలిక్కి రాగలదని ఆశిస్తున్నట్లు ఆశీష్ పేర్కొన్నారు. పలు విమానాశ్రయాలు సామర్థ్యాన్ని విస్తరించుకుంటున్న నేపథ్యంలో తగు స్థాయిలో స్లాట్లు అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు. రూ. 8,000 కోట్ల బకాయిలు బ్యాంకులకు రూ. 8,000 కోట్ల పైచిలుకు బాకీపడిన జెట్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోవడం తెలిసిందే. కంపెనీ కార్యకలాపాలు పునఃప్రారంభించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం సమర్పించిన పరిష్కార ప్రణాళికను గతేడాది అక్టోబర్లో రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించగా, తాజాగా ఎన్సీఎల్టీ కూడా ఓకే చెప్పింది. బ్రిటన్కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలాన్ కలిసి ఈ కన్సార్షియం ఏర్పాటు చేశారు. షేరు జూమ్.. పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేసిందన్న సానుకూల వార్తతో జెట్ షేరు మంగళవారం 5 శాతం (అప్పర్ సర్క్యూట్) ఎగిసింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో రూ. 99.45 వద్ద ముగిసింది. మరోవైపు, రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిచిపోయినప్పట్నుంచీ జెట్ షేరు ధర దాదాపు సగానికి పైగా పడిపోయింది. సర్వీసుల నిలిపివేతకు ఒక్క రోజు ముందు 2019 ఏప్రిల్ 16న బీఎస్ఈలో షేరు రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత పరిణామాలతో ఒకదశలో సుమారు రూ. 59కి కూడా పడిపోయింది. ప్రస్తుతం రూ. 99.45 వద్దకు తిరిగి కోలుకుంది. రెండేళ్లలో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 1,617 కోట్ల మేర హరించుకుపోయింది. తాజా పరిణామాలతో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 1,130 కోట్లుగా ఉంది. జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఇలా.. లీజుకు తీసుకున్న నాలుగు బోయింగ్ విమానాలతో, జెట్ ఎయిర్వేస్ 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటరుగా సర్వీసులు ప్రారంభించింది. ఆ తర్వాత 1995లో పూర్తి స్థాయి షెడ్యూల్ క్యారియర్గా మారింది. 2004 మార్చిలో చెన్నై నుంచి కొలంబోకు ఫ్లయిట్తో అంతర్జాతీయంగా సర్వీసులు ప్రారంభించింది. 2019 ఏప్రిల్ 17: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కారణంగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం .. ఎన్సీఎల్టీలో జూన్ 19న కంపెనీపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది. 2020 మార్చి 13: టేకోవర్ చేసేందుకు బిడ్డర్లు ఎవరూ రాకపోవడంతో పరిష్కార ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని జెట్ కోరింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న ప్రాపర్టీని విక్రయించి, కొన్ని రుణాలను సెటిల్ చేసుకునేందుకు జూన్లో కంపెనీకి ఎన్సీఎల్టీ అనుమతులు ఇచ్చింది. 2020 అక్టోబర్ 17: జలాన్ కల్రాక్ కన్సార్షియం పరిష్కార ప్రణాళికను రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించింది. గత చరిత్ర ఆధారంగా స్లాట్లను కూడా మళ్లీ కేటాయించాలని ఎన్సీఎల్టీని కన్సార్షియం కోరింది. 2021 ఫిబ్రవరి 21: జలాన్ కల్రాక్ కన్సార్షియం అభ్యర్థ్ధనపై స్పందించేందుకు డీజీసీఏకి ఎన్సీఎల్టీ మరింత సమయం ఇచ్చింది. స్లాట్ల విషయంలో తామేమీ భరోసా ఇవ్వలేమని మార్చిలో డీజీసీఏ తెలియజేసింది. కంపెనీ గత చరిత్ర ఆధారంగా స్లాట్లు కేటాయించలేమని జూన్ 3న ఎన్సీఎల్టీకి డీజీసీఏ, ఎంవోసీఏ తెలియజేశాయి. -
80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు ముందున్నస్థాయిలో 80 శాతంవరకూ దేశీ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్లైన్స్ కంపెనీలు తమ సామర్థ్యంలో 80 శాతం విమానాలను నిర్వహించేందుకు వీలు చిక్కింది. ఇందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్డవున్ విధించిన తదుపరి మే 25న దేశీయంగా విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. రెండు నెలల తరువాత సర్వీసులు ప్రారంభమైనప్పుడు 30,000 మంది ప్రయాణికులు నమోదుకాగా.. నవంబర్ 30కల్లా ఈ సంఖ్య 2.52 లక్షలను తాకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ లిస్టెడ్ కంపెనీలు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, స్పైస్జెట్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండిగో.. గో ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల కంపెనీ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్చేసి రూ. 1,744 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,747 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దేశీయంగా మే నెలలో 33 శాతం, జూన్లో 45 శాతం వరకూ విమానాల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా 70 శాతం నుంచి 80 శాతానికి పరిమితిని పెంచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. స్పైస్జెట్ దేశీ సర్వీసులలో 80 శాతం వరకూ విమానాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో స్పైస్జెట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9.3 శాతం దూసుకెళ్లి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది. ఇక రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా కల్రాక్ క్యాపిటిల్ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇటీవల జెట్ ఎయిర్వేస్ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడటంతో జెట్ ఎయిర్వేస్ షేరు నవంబర్ 5న రూ. 79 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
వేసవి నుంచి మళ్లీ జెట్ ఎయిర్ సర్వీసులు!
ముంబై, సాక్షి: వచ్చే వేసవి సీజన్ నుంచి ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే జాతీయ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నుంచి కంపెనీ టేకోవర్కు లైన్ క్లియర్కావడంతో డీజీసీఏ, పౌర విమానయాన శాఖ(ఎంసీఏ) నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. భారీ రుణాలు, నష్టాల కారణంగా 2019 నుంచి కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే నష్టాలతో కుదేలైన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికలకు ఇటీవల ఎన్సీఎల్టీ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకుంది. దీనిలో భాగంగా ఇకపైన కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలలో జెట్ ఎయిర్వేస్ లిస్టింగ్ను కొనసాగించేందుకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశాలకు కనెక్టివిటీ వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. దేశీయంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి సర్వీసులు ప్రారంభంకావచ్చని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్ రిజల్యూషన్ ప్రణాళికను నవంబర్ 5న ఎన్సీఎల్టీకి కల్రాక్ క్యాపిటల్- మురారిలాల్ జలన్ కన్సార్షియం అందజేశాయి. బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ తదితర సంస్థల మధ్య పోటీలో రూ. 1,000 కోట్ల ఆఫర్ ద్వారా జెట్ ఎయిర్వేస్ను కల్రాక్ క్యాపిటల్ గెలుచుకుంది. కాగా.. ఇప్పటికే ఎన్సీఎల్టీ నుంచి అనుమతులు పొందడంతో ఎంసీఏ, డీజీసీఏల నుంచి క్లియరెన్స్ల కోసం కంపెనీ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. షేరు జోరు కంపెనీ పునరుద్ధరణకు కల్రాక్ క్యాపిటల్- మురారీ లాల్ జలాన్ కన్సార్షియం ప్రతిపాదించిన రిజల్యూషన్కు రుణదాతల కమిటీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ప్రయివేట్ రంగ కంపెనీ జెట్ ఎయిర్వేస్ కౌంటర్ గత రెండు నెలల్లో నిరవధికంగా బలపడుతూ వచ్చింది. ఈ బాటలో నవంబర్ 5కల్లా ఎన్ఎస్ఈలో రూ. 79ను అధిగమించింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరంది. తదుపరి అక్కడక్కడే అన్నట్లుగా కదులుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ షేరు 1 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
జెట్ ఎయిర్వేస్కు రెక్కలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇండియా టేకాఫ్కు ముందడుగు పడింది. కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ మారనుంది. లండన్కు చెందిన ఫైనాన్షియల్ అడ్వైజరీ అయిన కల్రాక్ క్యాపిటల్, వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్ల కన్సార్షియం జెట్ పగ్గాలను చేపట్టబోతోంది. జెట్ను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకై ఈ కన్సార్షియం ఆఫర్ చేసిన బిడ్ను జెట్ రుణ సంస్థల కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని శనివారం వెల్లడించింది. కల్రాక్–జలాన్ల కన్సార్షియం బిడ్లో భాగంగా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్లో వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. జెట్ను దక్కించుకునే వేటలో ఎఫ్ఎస్టీసీ, బిగ్ చార్టర్, ఇంపీరియల్ క్యాపిటల్ సైతం పోటీపడ్డాయి. అప్పుల భారంతో నష్టాల్లో కూరుకుపోయి, దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్లో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కంపెనీ అప్పులు రూ.8,000 కోట్లకు ఎగబాకాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలతోసహా రూ.40,000 కోట్ల బకాయిలు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికుల సంఖ్య పరంగా భారత్లో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఈ సంస్థలో దాదాపు 22,000 మంది ఉద్యోగులు ఉండేవారు. కోల్కతాలో తమ కుటుంబ వ్యాపారమైన పేపర్ ట్రేడింగ్లో మురారీ లాల్ జలాన్ తన కెరీర్ను 1980లో ప్రారంభించారు. పేపర్ తయారీ, రియల్టీ, హెల్త్కేర్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టి రష్యా, యూఏఈ వంటి దేశాల్లో విస్తరించారు. జెట్ డీల్తో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది -
విమానయాన షేర్లు లాభాల టేకాఫ్
దేశీయ విమానయాన కంపెనీల షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్లో లాభాల బాట పట్టాయి. లాక్డౌన్తో దాదాపు 2నెలల విరామం తర్వాత సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఏవియేషన్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, గ్లోబల్ వెక్టా హెలీకార్పో లిమిటెడ్ కంపెనీల షేర్లు 11శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 2,3 నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఈయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, కచ్చితమైన నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షేర్ల ధరల జోరు... ఇండిగో షేరు: నేడు బీఎస్ఈలో రూ.1002.00 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 8శాతం లాభంతో రూ.986.50 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.765.05, రూ.1911.00గా ఉన్నాయి. స్పైస్ జెట్ షేరు: నేడు బీఎస్ఈలో 5శాతం లాభంతో రూ.42.95 వద్ద ప్రారంభమైన అదే ధర వద్ద అప్పర్ సర్కూ్యట్ను తాకి ఫ్రీజ్ అయ్యింది. జెట్ ఎయిర్వేస్: నేడు బీఎస్ఈలో రూ.19.90 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 4.91శాతం లాభంతో రూ.20.30 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.13, రూ.164.90గా ఉన్నాయి. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్ను సానుకూల అంచనాలతో అప్గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
జెట్ ఎయిర్వేస్ నరేష్ గోయల్కు ఈడీ షాక్
సాక్షి, ముంబై: జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో నరేష్ గోయల్ ఇంటిపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహంచారు. అలాగే గోయల్తోపాటు మరికొందరిపై ఈడీ తాజాగా కేసులు నమోదు చేసింది. ముంబై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదైందని ఈడీ అధికారులు తెలిపారు. బుధవారం కూడా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, విచారణ చేపట్టామని, దాడులు కొనసాగుతున్నాయని అధికారులు గురువారం తెలిపారు. జెట్ఎయిర్వేస్లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో గోయల్, అతని కుటుంబం, ఇతరులపై విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై దాడులు నిర్వహించింది. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్లో గోయల్ను విచారించింది. గోయల్కు 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, వీటిలో ఐదు విదేశాల్లో ఉన్నాయిని ఈడీ గతంలో ఆరోపించింది. అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు "అనుమానాస్పద" లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఈడీ పరిశీలిస్తోంది. కాగా అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ గత ఏడాది ఏప్రిల్లో తన కార్యకలాపాలను మూసివేసింది. దీనికి ఒక నెల ముందు, గోయల్ జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ విమాన యాన సంస్థ చాలా రోజుల తరువాత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయర్వేస్ను కొనుగోలుకు బిడ్ను సిద్ధం చేస్తోందన్న వార్తల మధ్య జెట్ ఎయిర్వేస్ షేర్లు లాభపడుతున్నాయి. మంగళవారం నాటి బలహీన సెషన్లో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్వేస్ షేర్లుకొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ అయ్యి రూ .296 వద్ద లాక్ అయ్యాయి. కాగా హిందూజా సోదరులు గోపిచంద్, అశోక్ హిందూజా నేతృత్వంలోని బృందం జనవరి 15 గడువులోగా జెట్ ఎ యిర్వేస్కు బిడ్ దాఖలు చేయాలని యోచిస్తోంది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడిది ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్కు మంచి రోజులు?!
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకుని చివరకు మూతపడిన జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఒకకీలక విషయం మార్కెట్ వర్గాల్లో నానుతోంది. హిందూజా గ్రూప్ మూతపడిన జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ను కొనుగోలు చేయడానికి బిడ్ను సిద్ధం చేస్తోంది. బిలియనీర్ హిందూజా బ్రదర్స్ జెట్ ఎయిర్వేస్కు బిడ్ సిద్ధం చేస్తున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గోపిచంద్ హిందూజా, అశోక్ హిందూజా సోదరుల బృందం 2020 జనవరి 15 గడువు లోగా బిడ్ను సమర్పించాలని యోచిస్తోంది. అయితే ఈ వార్తలపై హిందుజా గ్రూపు అధికారికంగా స్పందించాల్సి వుంది. -
జెట్ ఎయిర్వేస్ దివాలా
ముంబై: జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార గడువును 90 రోజుల పాటు పొడిగించేందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతించింది. దక్షిణాఫ్రికాకు చెందిన సినర్జీ గ్రూపు మరింత సమయం కోరుతుండడం, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు ఆసక్తి వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ రుణ దాతల కమిటీ (సీవోసీ) దివాలా పరిష్కార గడువును పొడిగించాలంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ను కోరింది. జెట్ ఎయిర్వేస్కు కార్పొరేట్ దివాలా పరిష్కార గడువు (180 రోజులు) ఈ నెల 16న ముగియగా, ఈ గడువును మరో 90 రోజులు పాటు పొడిగిస్తూ ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. జెట్ ఎయిర్వేస్కు సినర్జీ గ్రూపు ఒక్కటే బిడ్ దాఖలు చేయగా, వాటాదారుల ప్రయోజనం దృష్ట్యా పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కోరుతుండడం గమనార్హం. -
ఎయిర్లైన్స్ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు
విమానయాన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మిలియన్ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదుచేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500–700 మిలియన్ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్లో వేసిన అంచనాలను సవరించింది. జెట్ ఎయిర్వేస్ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్లైన్స్ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది. -
జెట్ మాజీ ఛైర్మన్కు మరోసారి చిక్కులు
సాక్షి, ముంబై: జెట్ఎయిర్వేస్ వ్యవస్థాపకులు నరేష్ గోయల్కు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. నిధుల మళ్లింపు ఆరోపణలతో ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భావిస్తోంది. ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్పై సంతృప్తిచెందని అధికారులు స్వతంత్ర ఆడిట్నిర్వహిస్తామని ప్రకటించడంతో నరేష్గోయల్ చిక్కుల్లోపడ్డారు. మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు నరేష్గోయల్కు ఉన్నాయని, వాటిలో ఐదు కంపెనీలు విదేశాల్లో రిజిష్టరు అయినట్లు సీనియర్ ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ , నిర్వహణ ఖర్చులు ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. నగదు సంక్షోభంలో చిక్కుకుని, ఏడువేల కోట్ల బకాయిలు పేరుకున్న సంస్థపై ఇపుడు స్వతంత్ర ఆడిట్ నిర్వహించడమే మంచిని భావిస్తోంది. గతవారంలో గోయల్ను ప్రశ్నించిన అధికారులు ఎస్బిఐ నిర్వహించిన ఆడిట్లో లోపాలున్నట్లు గుర్తించారు. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర ఆడిట్తోనే మరిన్ని అంశాలు వెలుగులోనికి వస్తాయని ఈడీ భావిస్తోంది. ముంబై కార్యాలయంలో గత వారంలోనే గోయల్ను విచారించిన ఈడీ విదేశీ కరెన్సీ చట్టాల పరిధిలో విచారణ నిర్వహించింది. ఆగస్టులో ఆయన నివాసాలు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన తర్వాత మొదటిసారి ముంబైలో గోయల్ను ప్రశ్నించింది. రూ.18వేల కోట్ల మోసం చేసినట్లు ఆరోపణలపై దర్యాప్తునకు గోయల్ సహకరించడం లేదని ఆగస్టులో ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం నివేదించింది. అయితే ఈ ఆరోపణలను గోయల్ తిరస్కరించారు. కాగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న ఎయిర్లైన్స్ చైర్మన్ గోయల్ ఇదివరకే తన పదవికి రాజీనామా చేశారు. అలాగా మార్చిలో జెట్ ఎయిర్వేస్ బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా గోయల్, అతని భార్య అనిత రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. -
జెట్కు కొత్త బిడ్డర్లు దూరం
ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ‘మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్లైన్ను ఇక మరింత పొడిగించే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటిదాకా వచ్చిన మూడు సంస్థలతోనే విక్రయ ప్రక్రియ కొనసాగవచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన వాటిల్లో రష్యాకు చెందిన రష్యన్ ఫండ్ ట్రెజరీ ఆర్ఏ పార్ట్నర్స్, పనామాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ అవాంట్యులో గ్రూప్, దక్షిణ అమెరికా సినర్జీ గ్రూప్ ఉన్నాయి. -
జెట్ ఫౌండర్ నరేష్ గోయల్పై ఈడీ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ నివాసం, కార్యాలయాలపై ఈడీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫెమా నిబంధనలకు అనుగుణంగా అదనపు ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టామని ఈడీ అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీలో గోయల్కు చెందిన నివాస, కార్యాలయ ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక సంక్షోభంతో పాటు నగదు కొరతతో ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనిఖీ నివేదికలోనూ వెల్లడైంది. జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్లైన్ చైర్మన్గా నరేష్ గోయల్ ఈ ఏడాడి మార్చిలో వైదొలిగారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్లో ఐబీసీ కోడ్ కింద దివాళా ప్రక్రియ సాగుతోంది. -
జెట్ ఎయిర్వేస్ ఎఫెక్ట్ : స్పైస్జెట్ రికార్డ్ లాభాలు
సాక్షి, ముంబై : భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ లిమిటెడ్ అనూహ్య లాభాలను సాధించింది. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం, సేవలు నిలిపివేత లాంటివి స్పైస్ జెట్ కు బాగా కలిసి వచ్చాయి. ఆర్థిక మందగమనం, దేశీయంగా డిమాండ్ క్షీణిస్తున్నప్పటికీ లాభాల్లో విశ్లేషకుల అంచనాలను బీట్ చేసింది. ఉదాహరణకు, ఎడెల్విస్ సెక్యూరిటీస్ 154 కోట్ల రూపాయల లాభం ఆర్జిస్తుందని అంచనా వేసింది. జూన్ త్రైమాసికంలో(క్యూ 1) రూ. 262 కోట్ల నికర లాభాలను సాధించింది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 38.1 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం ఏకంగా 35 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం జూన్ 2019తో ముగిసిన త్రైమాసికంలో 3,145.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.2,253.3 కోట్లు. ఆపరేటింగ్ ఆదాయం 3002 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 2204 కోట్లుగా ఉంది. గత ఏడాది రూ. 32.89తో పోలిస్తే క్యూ 1లో రూ. 143.2 కోట్ల ఇతర ఆదాయాన్ని నమోదు చేసింది. గత మూడు నెలల కాలంలో ప్రయాణీకుల ఛార్జీలు11 శాతం పెరిగాయని స్పైస్ జెట్ తెలిపింది. మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిన తరువాత బోయింగ్ 737 మాక్స్ విమానాలను రద్దు చేయడంతో ఈ త్రైమాసికంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నామని, లేదంటే ఫలితాలు ఇంకా బావుండేవని స్పైస్జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
జెట్ రేసులో ఇండిగో!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి, 90 రోజుల్లోపు దీనికి పరిష్కారం కనుగొనాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎన్సీఎల్టీ ముంగిటకు చేరిన జెట్ ఎయిర్వేస్పై పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయంగా విమానయానంలో అతిపెద్ద వాటా కలిగిన ఇండిగో దివాలా దశకు చేరిన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్తో కలసి దివాలా చట్టం (ఐబీసీ) కింద జెట్ఎయిర్వేస్కు బిడ్ వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మరో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ కొనుగోలుకు ముందుకొస్తోంది ఆసక్తిగల ఇతర ఇన్వెస్టర్లతో కలసి జెట్ ఎయిర్వేస్కు బిడ్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమస్యాత్మక కంపెనీల్లో పెట్టుబడులకు అపోలో గ్లోబల్ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంను సంప్రదించినట్టు తెలిసింది. ఈ సంస్థ నిర్వహణలో 280 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రాథమిక చర్చలు జరిగాయి... ‘‘ఇండిగో, టీపీజీ క్యాపిటల్ జెట్ ఎయిర్వేస్ పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లీడ్ బ్యాంకర్ అయిన ఎస్బీఐతో ఇటీవలే ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కింద ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ వేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ, అంతర్జాతీయ స్లాట్లపై ఇండిగో ఆసక్తిగా ఉంది. తద్వారా తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలని భావిస్తోంది. జెట్ ప్రివిలేజ్ ప్రైవేటు లిమిటెడ్ (జేపీపీఎల్) పట్ల టీపీజీ క్యాపిటల్ ఎక్కువ ఆసక్తితో ఉంది. ఎందుకంటే జెట్ ఎయిర్వేస్తో పోలిస్తే జేపీపీఎల్ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడమే కాకుండా, గతంలో లాభాలు కూడా చవిచూసింది.స్వతంత్ర సంస్థ అయిన జేపీపీఎల్ దివాలా చర్యల్లో భాగంగా లేకపోవడమే ఉన్న అడ్డంకి. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో జేపీపీఎల్ను కూడా భాగం చేయవచ్చా అన్నదానిపై ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేపీపీఎల్ అన్నది జెట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో తరచుగా ప్రయాణించే వారి కోసం ఉద్దేశించిన లాయల్టీ ప్రోగ్రామ్. 2012లో జెట్ సొంత విభాగంగా ఏర్పాటవ్వగా, 2014లో స్వతంత్ర సంస్థగా మార్చారు. ఆ ఏడాది ఎతిహాద్ ఎయిర్వేస్ 150 మిలియన్ డాలర్లతో 50.1 శాతం వాటా తీసుకుంది. మిగిలిన వాటా జెట్ చేతుల్లో ఉంది. జేపీపీఎల్ విలువ రూ.7,300 కోట్లు ఉంటుందని ఆన్ పాయింట్ లాయల్టీ అనే సంస్థ అంచనా కట్టింది. ఇక, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంతో ఇటీవలే సమావేశమైందని, వ్యాల్యూ ఇన్వెస్టర్లుగా జెట్ ఎయిర్వేస్లో మంచి అవకాశం కోసం చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెట్ రుణదాతల కన్సార్షియం ఈ నెల 16న తొలిసారి సమావేశమై చర్చలు కూడా నిర్వహించింది. ఈ వారాంతంలోపు జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం పలకొచ్చని, బిడ్లు వేసేందుకు ఆగస్ట్ మొదటి వారం వరకు గడువు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. -
నరేష్ గోయల్కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు గోయల్ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గ్యారంటీ సొమ్ము చెల్లించకుండా దేశం విడిచి వెళ్లరాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి విదేశాలకు వెళ్లాలనుకుంటే 18వేల కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని న్యాయమూర్తి సురేష్ కైత్ స్పష్టం చేశారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్ను సవాల్ చేస్తూ, దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతిని కోరుతూ గోయల్ చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అలాగే దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా గోయల్ ఆయన భార్య అనిత దుబాయ్కు వెళుతుండగా మార్చి 25 న విమానాన్ని దింపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ రంగబ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యా, డైమండ్ వ్యాపారి నీరవ్మోదీని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్కు తాజా షాక్ తగిలింది. -
నరేష్ గోయల్కి ఢిల్లీ కోర్టులో షాక్
-
జెట్ ఎయిర్వేస్ : ఉద్యోగుల చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : రుణభారంతో కుదేలైన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు తమ సంస్థను గట్టెక్కించేందుకు , తద్వారా తమ భవిష్యత్తు భరోసాకు నడుం బిగించారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో ఉద్యోగుల కన్సార్షియం బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ద్వారా 75 శాతానికి బిడ్ దాఖలు చేస్తామని శుక్రవారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని అంటున్నారు. "ఇది నిజంగా ప్రధానమంత్రి కల 'సబ్కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వస్' ను సూచిస్తుందంటూ , ఉద్యోగుల కన్సార్షియం ఆదిగ్రూప్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, జనరల్ సెక్రటరీ, జెట్ సీనియర్-మోస్ట్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్వేస్పై 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్పీ) దివాలా ప్రక్రియ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్ను ఈ నెల 20న స్వీకరించగా తదుపరి విచారణ జూలై 5న జరగనుంది. భారత్లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. కాగా బ్యాంక్లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8 500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం 25వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియ ప్రారంభం
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ కోసం పిటీషన్ దాఖలు చేసింది.ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్ను ఈ నెల 20న స్వీకరించింది. 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ చట్టం ప్రకారం తమ కంపెనీపై కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్పీ) ఆరంభమైందని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. దివాలా ప్రక్రియ ప్రారంభమవడంతో తమ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ అధికారాలన్నీ సస్పెండ్ అవుతాయని, ఇంటెరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్పీ) బోర్డ్ అధికారాలు నిర్వహిస్తారని వివరించింది. రెండు వారాల పురోగతి నివేదిక భారత్లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. సాధారణంగా రిజల్యూషన్ ప్రణాళికకు 180 రోజుల గడువు ఇస్తారు. అయితే జాతీయ ప్రాముఖ్యత గల అంశం కాబట్టి త్వరితంగా దీనిని ఒక కొలిక్కి తెచ్చే ఉద్దేశంతో 90 రోజుల గడువునే నిర్దేశించారు. జెట్ ఎయిర్వేస్ దివాలాపై తదుపరి విచారణ వచ్చే నెల 5న జరగనున్నది. అదే తేదీన రెండు వారాల పురోగతి నివేదికను ఐఆర్పీ సమర్పించాలని కూడా ముంబై ధర్మాసనం ఆదేశించింది. బ్యాంక్లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసింది. -
జెట్ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు
ముంబై: జెట్ ఎయిర్వేస్కు వ్యతిరేకంగా దివాలా పరిష్కారం కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నమోదు చేసుకుంది. గ్రాంట్ థార్న్టన్కు చెందిన ఆశిష్ చౌచారియాను పరిష్కార నిపుణుడిగా నియమించింది. ఈ అంశం జాతీయ ప్రాధాన్యం గలది కాబట్టి చట్ట ప్రకారం ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ, మూడు నెలల వ్యవధిలోపు పరిష్కార ప్రక్రియ కనుగొనేందుకు ప్రయత్నించాలని పరిష్కార నిపుణుడిని ఎన్సీఎల్టీ బెంచ్ కోరింది. పిటిషన్లో ఎస్బీఐ జెట్ ఎయిర్వేస్ నుంచి రూ.967 కోట్లు తన వంతుగా వసూలు కావాల్సి ఉందని తెలిపింది. ఇందులో మూలధన అవసరాలకు రూ.505 కోట్లు, ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కింద రూ.462 కోట్లను జెట్ ఎయిర్వేస్కు అందించినట్టు పేర్కొంది. ఈ దరఖాస్తులో జోక్యం చేసుకునేందుకు తమను అనుమతించాలంటూ నెదర్లాండ్కు చెందిన లాజిస్టిక్స్ విక్రయదారులు దాఖలు చేసిన పిటిషన్ను బెంచ్ తిరస్కరించింది. ప్రతీ 15 రోజులకోసారి పరిష్కార పురోగతిపై నివేదికను సమర్పించాలని, తొలి నివేదిక జూలై 5న దాఖలు చేయాలని పరిష్కార నిపుణుడిని ఎన్సీఎల్టీ ఆదేశించింది. అదే రోజు ఈ పిటిషన్పై బెంచ్ తదుపరి విచారణ చేయనుంది. మొత్తం 26 బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ రూ.8,500 కోట్ల మేర బకాయిపడింది. వందలాది విక్రయదారులు, ఉద్యోగులకు రూ.13,000 కోట్లకు పైగా చెల్లింపులు చేయా ల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోవడం తెలిసిందే. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్స్టర్డామ్ ఎయిర్పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్స్టర్డామ్ ఎయిర్పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
ఎన్సీఎల్టీ ముంగిట జెట్
ముంబై: దాదాపు రూ.8,500 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని 26 బ్యాంకులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణను ట్రిబ్యునల్ బుధవారానికి వాయిదా వేసింది. రుణాలు, నష్టాల భారం పేరుకుపోవడంతో జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా కంపెనీని విక్రయించడానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నప్పటికీ... వివిధ కారణాల వల్ల సాధ్యపడటం లేదు. బ్యాంకులకు రూ. 8,500 కోట్లతో పాటు, వందల కొద్దీ వెండార్లకు (విమానాలు లీజుకిచ్చిన సంస్థలు మొదలైనవి) రూ.10,000 కోట్లను జెట్ చెల్లించాల్సి ఉంది. ఇక మార్చి నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో 23,000 మంది పైచిలుకు ఉద్యోగులకు రూ.3,000 కోట్ల మేర జీతాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మంగళవారం జెట్ షేరు 41 శాతం క్షీణించి రూ. 40.45 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 53 శాతం క్షీణించి రూ.32.25 ఆల్టైం కనిష్ట స్థాయిని కూడా తాకింది. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్లలో షేర్ల విలువ 73 శాతం పైగా హరించుకుపోయింది. -
జెట్ ఎగరడం ఇక కలే!
ముంబై: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో మెజారిటీ వాటాలు విక్రయించటంపై బ్యాంకులు చేతులెత్తేశాయి. వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించి రెండు నెలల పాటు ఇన్వెస్టర్ కోసం అన్వేషించిన రుణదాతల (బ్యాంకులు) కమిటీ... ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. చివరకు బిడ్డింగ్లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్ను విక్రయించడం ఇష్టం లేక, దివాలా చట్టం (ఐబీసీ) కింద రూ.8,000 కోట్ల రుణాల వసూలు కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు అవి ప్రకటించాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో 26 సంస్థల రుణదాతల కమిటీ సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘షరతులతో కూడిన ఒకే ఒక్క బిడ్ మాత్రమే రావడంతో ఉన్నత స్థాయి చర్చల అనంతరం జెట్ ఎయిర్వేస్కు దివాలా చట్టం కింద పరిష్కారం కోరాలని నిర్ణయించాం’’ అని ఎస్బీఐ ప్రకటనలో పేర్కొంది. ఆశావహ ఇన్వెస్టర్ ఈ డీల్కు కొన్ని రకాల సెబీ మినహాయింపులు కోరడంతో, ఐబీసీ కిందే మెరుగైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. 25 ఏళ్ల క్రితం మొదలై ఒక దశలో అతిపెద్ద ప్రైవేటు రంగ విమానయాన కంపెనీగా ఎదిగిన జెట్ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. కార్యకలాపాల నిర్వహణకు కనీస నగదు కూడా లేని పరిస్థితుల్లో, నిధుల సాయానికి బ్యాంకులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ విమానాలను కూడా లీజుదారులు తీసుకెళ్లిపోయారు. 23,000 మంది ఉద్యోగులకు కష్టం! ఎతిహాద్–హిందుజా కూటమి ఆసక్తి వ్యక్తీకరించినప్పటికీ, నిర్మాణాత్మక ప్రతిపాదన ఏదీ సమర్పించలేదని, పైగా భారీ హెయిర్కట్ (రుణభారంలో నష్టపోయే మొత్తం) తీసుకోవాలని కోరడంతో బ్యాంకులు ఎన్సీఎల్టీ మార్గాన్ని ఎంచుకున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ చైర్మన్ నరేష్ గోయల్కు వ్యతిరేకంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం, దర్యాప్తు విభాగాలు మనీల్యాండరింగ్ ఆరోపణలపై విచారణ మొదలుపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, సంస్థ పునరుద్ధరణ దిశగా ఇన్ని రోజులు ఆశలతో ఉన్న వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు బ్యాంకుల నిర్ణయం ఫలితంగా అంధకారంగా మారింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు సంస్థను వీడగా, ఇప్పటికీ చాలా మంది తిరిగి కార్యకలాపాలు మొదలవుతాయన్న ఆశతో ఉన్నారు. బ్యాంకుల చేతికి వెళ్లినా చీకటే జెట్ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉండటంతో చైర్మన్ నరేష్ గోయల్ను బలవంతంగా బయటకు పంపించిన బ్యాంకులు కంపెనీ నియంత్రణను మార్చి 25న తమ అధీనంలోకి తీసుకున్నాయి. రుణాన్ని ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే, రూ.1,500 కోట్ల మేర ఈక్విటీ మూలధనాన్ని అందిస్తామని హామీ ఇచ్చిన బ్యాంకులు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పాటు సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయేందుకు పరోక్షంగా కారణమయ్యాయి. సంస్థలో 24 శాతం వాటా కలిగిన అబుదాబీ సంస్థ ఎతిహాద్ సైతం మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. అప్పుల భారమే ఎక్కువ జెట్ ఎయిర్వేస్కు రుణ భారం, ఇతర బాధ్యతలు కలిపి రూ.36,000 కోట్ల మేర ఉన్నాయి. సంస్థ చేతుల్లోని ఆస్తులు కేవలం హీత్రూ విమానాశ్రయంలో స్లాట్లు, జేపీ మైల్స్ అనే లాయల్టీ కార్యక్రమంలో మైనారిటీ వాటా మాత్రమే. దేశీయ విమానాశ్రయాల్లో జెట్కు ఉన్న స్లాట్లలో చాలా వాటిని ఇప్పటికే కేంద్రం ఇతర కంపెనీలకు కేటాయించేసింది. సంస్థ ఖాతాల్లో ఉన్న విమానాలు కేవలం 16. మిగిలిన 123 విమానాలు లీజుకు తీసుకున్నవి కాగా, అవి రిజిస్ట్రేషన్ కోల్పోయాయి. షేరు ఢమాల్... జెట్ ఎయిర్వేస్ షేరు సోమవారం భారీగా నష్టపోయింది. జూన్ 28 నుంచి జెట్ ఎయిర్వేస్ స్టాక్ ట్రేడింగ్పై ఆంక్షలు విధిస్తున్నట్టు, ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలోకి మారుస్తున్నట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లు తీసుకున్న నిర్ణయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. షేరు 18% నష్టపోయి ఎన్ఎస్ఈలో రూ.66.95 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 19.56% పతనమైంది. -
జెట్ ఎయిర్వేస్: మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : అప్పుల ఊబిలో కూరుకు పోయి కార్యకలాపాలను నిలిపివేసిన ప్రయివేటు రంగవిమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లుగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థపాకుడు నరేష్ గోయల్ మీద తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. భారీ పన్ను ఎగవేత ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖ ఆయనకు సమన్లు జారీ చేసింది. రూ. 650 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నరేష్ గోయల్ను ప్రశ్నించబోతోందని తాజా మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. పన్నులు ఎగవేసేందుకు నరేష్ గోయల్ దుబాయ్లోని దాని గ్రూప్ కంపెనీతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డంతోపాటు, ఇందుకు దుబాయ్ కంపెనీకి కమిషన్ ముట్టినట్టుగా అసెస్మెంట్ వింగ్ దర్యాప్తులో తేలింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నరేష్ గోయల్ను ఆదేశించింది. త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్న సమయంలో ఈ సర్వే జరిగిందని ఆదాయపు పన్ను అధికారి చెప్పారు. పన్నులు ఎగవేసేందుకు విదేశాలకు నిధులను మళ్లించాలనే ఉద్దేశ్యంతో చేసిన అధిక చెల్లింపులు అనే కోణంలో అసెస్మెంట్ వింగ్ విచారణ అనంతరం, మరింత వివరణ కోరేందుకు ఆయన్ను పిలిపించనున్నట్టు మరో అధికారి అందించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే తాజా పరిణామాలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది. కాగా 2018 సెప్టెంబర్లో జెట్ ముంబై కార్యాలయాంలో దాడులు, కొన్నికీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దీనిపై దర్యాప్తు ఫిబ్రవరిలో పూర్తయింది. అయితే ఫిబ్రవరిలో వెలువడిన ఈ నివేదికపై స్పందించిన జెట్ఎయిర్వేస్ అవకతవకల ఆరోపణలను ఖండించింది. లావాదేవీలన్నీచట్ట ప్రకారం, నియంత్రణ, కార్పొరేట్ పాలన అవసరాలకు లోబడే ఉన్నాయంటూ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జెట్ సమస్యలు పరిష్కారమవుతాయ్!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సమస్యలు పరిష్కారమవుతాయని పౌర విమానయాన శాఖ కొత్త మంత్రి హర్దీప్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగానికి సంబంధించి గతంలో కొన్ని తప్పులు చేశామని, ఇప్పుడు వాటిని సరిదిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. భారీ రుణాల కారణంగా సంక్షోభంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్పై రెండో సారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం నుంచి వెలువడిన తొలి వ్యాఖ్య ఇది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీగా రుణాలు చేయడం, తీవ్రమైన పోటీతో ఒకప్పుడు ప్రైవేట్ రంగంలో అతి పెద్ద విమానయాన సంస్థగా వెలిగిన జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు కార్యకలాపాలు నిలిపేసింది. ఫలితంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా విమాన చార్జీలు భారీగా పెరిగాయి. విమానయాన రంగం గడ్డు పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ శాఖకు కొత్త మంత్రిగా పురి బాధ్యతలు స్వీకరించారు. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, ఎయిర్ ఇండియా విక్రయం గత ఏడాది విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సమస్యలను కొత్త మంత్రి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి. -
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా కార్యకలాపాలు నిలిపివేసిన ప్రయివేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లావాదేవీల నిర్వహణ (ట్రేడింగ్ యాక్టివిటీ)లో ఆంక్షలు విధించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్ వేస్ షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో జెట్ షేరు ఏకంగా 23శాతం పతనమైంది. తద్వారా సరికొత్త కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 986.03 కోట్లకు పడిపోయింది. బిఎస్ఇలో 15.61 లక్షల షేర్లు చేతులుమారాయి. స్టాక్ గత తొమ్మిది రోజుల్లో 40శాతానికి పైగా పతనమైంది. జెట్ షేర్లను రోజువారీ ట్రేడింగ్నుంచి తీసివేయనున్నామని నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తెలిపింది. గరిష్టస్థాయిలో ఆటుపోట్లను చవిచూడకుండా నివారించే బాటలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కౌంటర్లో ట్రేడింగ్ యాక్టివిటీపై నియంత్రణలు విధించనున్నట్లు ఎన్ఎస్ఈ ఒక సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఈ నెల 28 నుంచీ అమల్లోకిరానున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఈ షేరును ఎఫ్అండ్వో విభాగం నుంచి తొలగించనున్నారు. ఫలితంగా 100 శాతం మార్జిన్ల చెల్లింపుతోపాటు 5 శాతం ప్రైస్బ్యాండ్ అమలు కానుంది. -
జెట్లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి
ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు నెల రోజుల్నించి కార్యకలాపాలు నిలిపివేసిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను హిందుజా గ్రూప్ పరిశీలిస్తోంది. మంగళవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జెట్ విక్రయంపై కసరత్తు చేస్తున్నాయి. ఎతిహాద్ గ్రూప్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న జెట్ ఎయిర్వేస్ స్లాట్స్ను ఇతర ఎయిర్లైన్స్కు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందుజా గ్రూప్నకు ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యుత్, రియల్ ఎస్టేట్, హెల్త్కేర్ తదితర రంగాల్లో కార్యకలాపాలున్నాయి. గ్రూప్ సంస్థల్లో దాదాపు 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్ ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేర్లు ఏకంగా 15 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో 14.73 శాతం పెరిగి రూ.150.75 వద్ద ముగిశాయి. అటు ఎన్ఎస్ఈలో సుమారు 13 శాతం పెరిగి రూ. 148.40 వద్ద క్లోజయ్యాయి. రూ.135 వద్ద ప్రారంభమైన షేరు ఒక దశలో రూ. 154.80 గరిష్ట స్థాయికి కూడా ఎగిసింది. దీంతో వరుసగా రెండో రోజూ జెట్ షేరు పెరిగినట్లయింది. -
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. విమాన సర్వీసులను పూర్తి నిలిపివేసిన అనంతరం జెట్ ఎయిర్వేస్ నుంచి వరుసగా కీలక ఉద్యోగులు తప్పుకుంటున్నారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా కంపెనీనుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం కంపెనీ డిప్యూటీ సీఈవో, సిఎఫ్ఓ అమిత్ అగర్వాల్ కంపెనీ నుంచి వైదొలగారు. ఒకవైపు వాటాల కొనుగోలు సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రావడంలేదు. మరోవైపు వరుసగా కీలక ఎగ్జిక్యూటివ్లు కంపెనీకి గుడ్బై చెపుతున్నారు. ముఖ్యంగా ఇపుడు సీఈవో రాజీనామా చేయడం కీలక పరిణామం. కాగా ఆగష్టు 8, 2017న జెట్కు సీఈవోగా వినయ్ దుబే నియమితులయ్యారు. -
‘జెట్’ కూలిపోయిందా.. కూల్చేశారా?
సాక్షి, బిజినెస్ డెస్క్: విమానయాన రంగంలో 25 ఏళ్లకు పైగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జెట్ ఎయిర్వేస్ ఉన్నట్టుండి కుప్పకూలడం వెనుక ఏం జరిగి ఉంటుంది...? ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్నా చితకా ఎయిర్లైన్ కంపెనీలు సర్వీసులను చక్కగా నడిపిస్తుంటే, దశాబ్దాల చరిత్ర ఉన్న జెట్ ఎందుకలా రెక్కలు తెగిన విహంగంలా కూలిపోయింది...? కేవలం చమురు ధరల పెరుగుదల, రుణాల భారమే ఈ సంస్థను ముంచేసిందా? లేక కావాలనే ముంచేశారా? సంస్థ ప్రమోటర్ నరేష్గోయల్ నిధులను పక్కదారి పట్టించారా? భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు జెట్ఎయిర్వేస్ స్టీరింగ్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాతే ఎందుకు ఉన్న ఫళంగా జెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి? ప్రీ ప్లాన్ ప్రకారం తీసుకొచ్చిన సంక్షోభమా ఇది? విశ్లేషకులు, విమానయాన పరిశ్రమ వర్గాలు, ఆఖరికి జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానాలు ఎవరిస్తారు..? స్వామి సంచలన ట్వీట్ ‘‘ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ఇద్దరు మంత్రులు జెట్ ఎయిర్వేస్ను స్పైస్జెట్కు విక్రయించేందుకు మానిప్యులేట్ చేస్తున్నారు. తెరవెనుక అసలు యజమానులు ఎవరన్నది తర్వాత వెల్లడిస్తాను. ప్రభుత్వం ముందున్న ఆప్షన్ జెట్ ఎయిర్వేస్ను ఎయిర్ ఇండియాతో విలీనం చేయడమే. ఎందుకంటే రెండు వైపులా ఎయిర్స్పేస్ విషయంలో ప్రభుత్వానిదే జోక్యం ఉంటుంది’’ అని బీజేపీ ప్రముఖ నేత సుబ్రమణ్యస్వామి గత నెల 21న చేసిన ట్వీట్. అంటే స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ తెరవెనుక ఎవరో ఈ కథ అంతా నడిపిస్తున్నట్టు స్వామి మాటల్లో వ్యక్తమైన సందేహంలా కనిపిస్తోంది. తిరిగి స్వామి బయటపెట్టే వరకూ అసలు కథ ఎవరికీ తెలియదేమో! నిధుల మళ్లింపుపై ఫిర్యాదు ఐసీఐసీఐ బ్యాంకు–వీడియోకాన్ రుణ బంధం వెనుక బ్యాంకు మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్కు ప్రయోజన లబ్ధి కలిగిందంటూ ఓ ఫిర్యాదుతో సంచలన దర్యాప్తునకు కారణమైన ప్రజా వేగు అరవింద్ గుప్తా గుర్తుండే ఉంటుంది. ఆ వ్యక్తే జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపుపై దర్యాప్తు సంస్థల తలుపు తట్టారు. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్లు కంపెనీ పుస్తకాల నుంచి రూ.5,125 కోట్లను దారి మళ్లించినట్టు ఆయన ఆరోపణ. ఈ నిధుల మళ్లింపును కంపెనీ ఆడిటింగ్ కంపెనీ నిరోధించలేకపోయిందంటూ 2018 ఆగస్ట్లో అరవింద్ గుప్తా ఫిర్యాదు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఫలితాలను జెట్ ఎయిర్వేస్ సకాలంలో వెల్లడించలేదు. వాయిదా వేసింది. అదే సమయంలో అరవింద్ గుప్తా ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం జెట్ఎయిర్వేస్ ఖాతాల తనిఖీ చేపట్టింది. కంపెనీల చట్టం నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు, నిధుల మళ్లింపు ప్రయత్నాలను గుర్తించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ నివేదికను ఆర్వోసీ కార్పొరేట్ శాఖకు ఈ నెల 8నే సమర్పించింది. ఆర్వోసీ గుర్తించిన అంశాల పట్ల కార్పొరేట్ శాఖ సంతృప్తి చెంది, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరం అని భావిస్తే తీవ్ర మోసాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు ఆదేశించే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్కు చెందిన కంపెనీలతో జెట్ ఎయిర్వేస్, జెట్లైట్ లావాదేవీలు నిర్వహించాయని అరవింద్ గుప్తా ఆరోపణలు. ఈ ఆరోపణల్లోని నిజానిజాలు త్వరలో నిగ్గు తేలాల్సి ఉంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్శర్మ జెట్ఎయిర్వేస్ కూలిపోవడాన్ని స్కామ్గా కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్శర్మ ఆరోపించారు. ‘‘ఇదో పెద్ద స్కామ్గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఈ సమయంలో దీన్ని ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. కేంద్రం కాపాడుతున్న ఇతర వ్యాపారాలతో పోలిస్తే జెట్ రుణ భారం తక్కువేనన్నారు. ఎయిర్లైన్స్కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. బ్యాంకుల ఆధ్వర్యంలో మూత 1992లో ఏర్పాటై 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు ఆరంభించిన జెట్ ఎయిర్వేస్... 2019 ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీనికంటే ముందు నిధుల సమీకరణకు కంపెనీ దాదాపు తీవ్రంగానే ప్రయత్నించింది. 3 నెలలుగా 20,000 మంది ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేదు. బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. చివరకు కార్యకలాపాలను నిలిపివేయడంతో 20వేల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. నరేష్ గోయల్ నిర్వహణలో జెట్ మొత్తం రూ.13,000 కోట్ల మేర నష్టాలను మూటగట్టుకున్నట్టు తెలుస్తోంది. 120 విమానాలతో నిత్యం 600 విమాన సర్వీసులను నడిపిన ఘన చరిత జెట్ ఎయిర్వేస్ది. చివరికి కార్యకలాపాలు నిలిపివేసే నాటికి సంస్థ వద్దనున్న విమానాలు కేవలం 7. లీజుకిచ్చిన సంస్థలు తమ విమానాలను స్వాధీనం చేసుకున్నాయి. జెట్ ఎయిర్వేస్ స్లాట్లను తాత్కాలికంగా ప్రభుత్వం ఇతర సంస్థలకు కేటాయించేసి చేతులు దులుపుకుందే గానీ సంస్థను కాపాడే యత్నాలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన సంస్థలకు లీడ్బ్యాంకర్ ఎస్బీఐ. రుణాలిచ్చిన సంస్థలు తమ రుణాలను జెట్లో వాటాలుగా మార్చుకుని మెజారిటీ వాటాదారులుగా అవతరించాయి. ప్రమోటర్ నరేష్ గోయల్ను చైర్మన్ పదవి నుంచి తప్పుకునేలా చేశాయి కూడా. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు తక్షణం రూ.1,500 కోట్లు అవసరం కాగా, వాటిని బ్యాంకులు సమకూరుస్తాయన్న ఆశ చిగురించింది. నిజానికి బ్యాంకులు రూ.1,500 కోట్ల నిధుల సాయానికీ తొలుత ఆసక్తి తెలిపినప్పటికీ... వాటాదారులుగా మారాక ఎందుకో వెనుకడుగు వేశాయి. ఏప్రిల్ 15 నాటి సమావేశంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోలేదు. డిపాజిట్ దారులు, తమ చట్టబద్ధమైన ప్రయోజనాల కోణంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్టు నాడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెలవిచ్చారు. అయితే, జెట్ నిర్వహణను నియంత్రణలోకి తీసుకున్న బ్యాంకులు, రూ.1,500 కోట్ల ఇచ్చేందుకు ముందుకు రాకుండా, తర్వాత రెండు రోజులకు ఏప్రిల్ 17న సంస్థ మూసివేతకు కారణమయ్యాయి. రోజువారీ కార్యకలాపాలు జరిగేలా చూసి, జెట్ను విక్రయానికి పెడితే ఇన్వెస్టర్లు త్వరగా ముందుకు వచ్చేవారేమో. కానీ, విమానాలన్నీ కిందకు దించేసి, రుణదాతలు విక్రయానికి మొగ్గు చూపడం సందేహాలకు తావిచ్చినట్టయింది. షేరు ధర సయ్యాట జెట్ఎయిర్వేస్ 2018–19 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ఫలితాలను వాయిదా వేయడం ఈ సంక్షోభానికి ఆరంభంగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కంపెనీ షేరు ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూ వచ్చింది. 2018 జనవరి 5న జెట్ ఎయిర్వేస్ షేరు రూ.870 స్థాయిలో ఉంది. 2018 అక్టోబర్ 1 నాటికి రూ.172 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత టాటాలు జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వచ్చిన వార్తలతో ఈ షేరు ధర ఈ స్థాయి నుంచి నెల రోజుల్లోనే రూ.323 వరకు పెరిగింది. తిరిగి అక్కడి నుంచి తాజాగా రూ.129 స్థాయికి పడిపోయింది. షేరు ఏడాది గరిష్ట, కనిష్ట ధరలు రూ.489, రూ.121. మళ్లీ టేకాఫ్ అవుతుందా...? బ్యాంకులు జెట్ఎయిర్వేస్కు బిడ్లు పిలిచాయి. నాలుగు సంస్థలు బిడ్లు వేశాయి కూడా. వీటిల్లో ఎతిహాద్ కూడా ఉంది. జెట్ను తాము టేకోవర్ చేస్తాం, రుణాలన్నీ తీర్చేస్తామంటూ పైలెట్లు, ఇంజినీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్డబ్ల్యూఐపీ, జేఏఎమ్ఈవీఏలు ఎస్బీఐని లేఖ ద్వారా కోరాయి. అయినా వారికి అవకాశం ఇవ్వలేదు. తమ నియంత్రణలోకి తీసుకుని రూపాయి కూడా విదిల్చలేదు. కానీ, నిలువునా అమ్మేసి తమ బకాయిలను రాబట్టుకునే పనిపై దృష్టి పెట్టాయి ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు. చివరికి ఏ సంస్థకు జెట్ను అప్పగిస్తాయో, అందులో ఎవరి ప్రయోజనం నెరవేరుతుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే, సుబ్రమణ్యస్వామి ఆరోపణలు, ఇటు జెట్ ఉద్యోగుల ఆరోపణలు, ప్రజావేగు ఫిర్యాదులోని నిజా నిజాలే నిగ్గుతేలాల్సి ఉంది. కింగ్ఫిషర్–జెట్... అప్పులే ముంచాయ్ విజయ్మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ పరిణామాలకు పోలిక కనిపిస్తుంది. ఈ రెండూ భారీగా అప్పులు తీసుకుని హారతి కర్పూరంగా మార్చి, తిరిగి చెల్లించలేక చేతులెత్తేసినవే. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ షేరు 2008లో రూ.90కు పైగా పలికింది. చివరికి కార్యకలాపాలు మూసేసే నాటికి పడిపోతూ వచ్చి రూపాయి వరకు దిగొచ్చింది. చివరికి డీలిస్ట్ అయింది. నాడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు రుణాలిచ్చిన సంస్థలు ఇప్పుడు దాని ప్రమోటర్ విజయ్మాల్యాను వెంటాడుతూ, వేటాడుతున్నాయి. కానీ, కింగ్ఫిషర్ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ, జెట్ ఎయిర్వేస్లో మాత్రం వాటాదారులుగా మారి ఆ సంస్థను మరెవరికో కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి జెట్ ఎయిర్వేస్ షేరు ఇంత జరిగినా రూ.120 స్థాయిలకు పైనే ఉందంటే జెట్ ఎదో ఒక గట్టి సంస్థ చేతుల్లోకి వెళ్లి, తిరిగి ఎగురుతుందన్న ఆశ ఇన్వెస్టర్లలో ఉండి ఉండొచ్చన్న విశ్లేషణ అనలిస్టుల నుంచి వినిపిస్తోంది. జెట్ఎయిర్వేస్ విషయంలో బ్యాంకుల తీరును విజయ్మాల్యా సైతం ఇటీవల తప్పుబట్టారు. . ఎతిహాద్ కుట్ర...? అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందన్న ఆరోపణ కేవలం సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్ నేత ఆనంద్శర్మ నుంచే కాదు.. జెట్ ఎయిర్వేస్ పైలట్ల నుంచి కూడా రావడం ఆశ్చర్యకరం. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కలిసి ఈ కుట్రకు తెరతీశాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలని ప్రధాని నరేంద్ర మోదీని జెట్ఎయిర్వేస్ పైలట్లు కోరారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు 24 శాతం వాటా ఉంది. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు. కానీ, ప్రభుత్వం మాత్రం దర్యాప్తునకు ఆదేశించలేదు. జెట్కు అందరూ రాంరాం! నిన్న సీఎఫ్ఓ.. నేడు సీఈఓ ఔట్ జెట్ ఎయిర్వేస్కు కీలక పదవుల్లోని వారు ఆకస్మికంగా రాజీనామాలు ప్రకటిస్తున్నారు. నిధుల కొరతతో సంస్థ కార్యకలాపాలు మూతబడిన నెల రోజులకు సీఈవో వినయ్ దూబే, కంపెనీ సెక్రటరీ కుల్దీప్ శర్మ జెట్ ఎయిర్వేస్కు గుడ్బై చెప్పేశారు. భారతీయ అమెరికన్ అయిన దూబే 21 నెలల పాటు జెట్ ఎయిర్వేస్లో పనిచేశారు. జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవుల నుంచి అమిత్ అగర్వాల్ తప్పుకున్న మరుసటి రోజే దూబే నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. వ్యక్తిగత కారణాల వల్ల దూబే కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేసినట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. జెట్కు పూర్వం డెల్టా ఎయిర్లైన్స్, సబ్రే ఐఎన్సీ, అమెరికన్ ఎయిర్లైన్స్ తదితర విమానయాన సంస్థల్లో దూబే పనిచేశారు. అలాగే, డిప్యూటీ సీఈవో, సీఎఫ్వో పదవులకు అమిత్ అగర్వాల్ రాజీనామా చేశారని, ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చినట్టు జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం ఇచ్చింది. మరోవైపు చీఫ్పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సైతం రాజీనామా చేసినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను విక్రయించే పనిలో ఉన్న సమయంలో ఉన్నత పదవుల నుంచి వీరు తప్పుకోవడం గమనార్హం. గత నెలలో కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పతి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నసీమ్ జైది, హోల్టైమ్ డైరెక్టర్ గౌరంగ్ శెట్టి కూడా రాజీనామా చేయడం తెలిసిందే. -
మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్బై
సాక్షి, ముంబై: రుణ సంక్షోభంతో చిక్కుకుని ప్రస్తుతం కార్యకలాపాలను నిలిపివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. తాజాగా జెట్ ఎయిర్వేస్ డిప్యూటీ సీఈవో, సీఎఫ్వో అమిత్ అగర్వాల్ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. మే13 నుంచి అమిత్ అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్టు జెట్ ఎయిర్వేస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. అమిత్ అగర్వాల్ 2015, డిసెంబరులో జెట్ ఎయిర్వేస్లో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్గా 24 ఏళ్ల అనుభవం ఉంది. జెట్ కంటే ముందు సుజ్లాన ఎనర్జీ, ఎస్సార్ స్టీల్ లాంటి పలు సంస్థల్లో సీఎఫ్వోగా పనిచేశారు. గత నెల రోజుల కాలంలో నలుగురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ రాజీనామా చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. -
ఎఫ్21 మీరు కొంటే మరో దేశానికి అమ్మం
న్యూఢిల్లీ: ఇతర కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ దృష్ట్యా.. తాము కొత్తగా తయారు చేసిన ఎఫ్–21 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి ఏరోస్పేస్ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ భారత్కు ఓ ఆఫర్ ఇచ్చింది. 114 ఎఫ్–21 విమానాల కొనుగోలుకు కనుక భారత్ ఆర్డర్ ఇచ్చిన పక్షంలో.. తమ యుద్ధ విమానాలను మరే ఇతర దేశానికి అమ్మబోమని స్పష్టం చేసింది. ఆయుధాలను తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో పాటు అత్యుత్తమమైన ఇంజిన్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ వంటి పలు ప్రత్యేకతలు కలిగిన ఈ విమానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 60కి పైగా వైమానిక కేంద్రాల నుంచి నడపగలిగేలా డిజైన్ చేసినట్లు కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ చెప్పారు. 18 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1,27,000 కోట్లు) విలువైన 114 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత వైమానిక దళం గత నెలలో సమాచార విజ్ఞప్తి (ఆర్ఎఫ్ఐ) లేదా ప్రాథమిక టెండర్ జారీ చేసింది. -
జెట్కు ఈపీఎఫ్వో నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకుగానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) జెట్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయిలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్ ఫండ్లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన లేఖలో ఈపీఎఫ్వో ముంబై ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ దిలీప్ కే రాథోడ్ స్పష్టం చేశారు. లేఖ ప్రకారం 2019 మార్చి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు, బకాయిలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి అద్దెకిచ్చిన పలు కార్యాలయాలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎయిర్లైన్ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జెట్కు బిడ్స్ దాఖలు.. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి ఎతిహాద్ ఎయిర్వేస్తో పాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు ఎస్బీఐ క్యాప్స్ వెల్లడించింది. సీల్డ్ కవర్లో వచ్చిన బిడ్లను పరిశీలించేందుకు రుణదాతలకు సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. జెట్లో 31.2–75 శాతం దాకా వాటాల విక్రయానికి బ్యాంకుల కన్సార్షియం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అర్హత పొందిన సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేయడానికి మే 10 (శుక్రవారం) ఆఖరు తేదీ. దీనికి అనుగుణంగా ఎతిహాద్ తదితర సంస్థల నుంచి బిడ్స్ వచ్చినట్లు బిడ్డింగ్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్బీఐ క్యాప్స్ పేర్కొంది. బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ దాదాపు రూ. 8,000 కోట్లు బాకీపడింది. ప్రస్తుతం సంస్థలో బ్యాంకులకు 51 శాతం పైగా వాటాలు ఉన్నాయి. షేరు 3 శాతం అప్..: జెట్ కొనుగోలు కోసం బిడ్స్ వచ్చాయన్న వార్తలతో షేరు శుక్రవారం 3 శాతం పెరిగింది. రూ. 151.80 వద్ద క్లోజయ్యింది. -
జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు భారీ ఊరట లభించింది. ఇప్పటికే సంస్థలో 25శాతం వాటా వున్న ఎథిహాద్ఎ యిర్వేస్ , జెట్లో వాటాల కొనుగోలుకు బైండింగ్ బిడ్ దాఖలు చేసింది. దీనిపై (టిపిజి కాపిటల్, ఇండిగో పార్టనర్స్, ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)) మొత్తం మూడు బిడ్లు దాఖలు కాగా ఎథిహాడ్ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు జెట్ ఎయిర్వేస్లోవాటా కొనుగోలుకు సంబంధించి బిడ్లను సమర్పించేందుకు గడువు మే 10 వ తేదీ సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పరిణామంపై మార్కెట్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దాదాపు మరో 6 వారాల్లో జెట్ విమానాలు మళ్లీ ఎగిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ఇలా వుంటే జెట్ ఎయిర్వేస్ మూతతో రోడ్డున పడ్డ ఉద్యోగుల బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసారు. తమకు వేతనాలు తక్కువైనా పర్వాలేదు కానీ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం మే 23 తరువాత ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు కంపెనీ ఉద్యోగులు ప్రధాన మంత్రి కలిసి సంస్థను కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ జెట్ ఎయిర్వేస్ కోసం వాటాల విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే అధికారమున్న ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్కు రెండు బిడ్లు వచ్చాయని ఎస్బీఐ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్పై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు?
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్ఎఫ్ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్వోసీ ముంబై విభాగం జెట్ ఎయిర్వేస్ ఖాతాల తనిఖీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేట్ శాఖకు నివేదిక కూడా సమర్పించింది. జెట్ ఎయిర్వేస్ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్ఎఫ్ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. అరవింద్ గుప్తా అనే ప్రజా వేగు ఇచ్చిన ఫిర్యాదులో... జెట్ ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆడిట్ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్ ఎయిర్వేస్, జెట్లైట్ బ్రాండ్లు ప్రమోటర్లకు చెందిన కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆర్వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్ గుప్తాయే కావడం గమనార్హం. వేలానికి జెట్ ఎయిర్వేస్ కార్యాలయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో వెల్లడించింది. 52,775 చ.అ. విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్ ఎయిర్వేస్ గోద్రెజ్ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్డీఎఫ్సీకి జెట్ ఎయిర్వేస్ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది. ఇప్పటికే జెట్ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న రుణదాతలు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. -
జెట్ ఎయిర్వేస్లో మూడవ వికెట్ డౌన్
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను మూసివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా జెట్ ఎయిర్వేస్ బోర్డు, సంస్థనుంచి వైదొలగుతున్నట్టు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా గత నెల రోజుల కాలంలో ముగ్గురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ జెట్ ఎయిర్వేస్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు జెట్ ఎయిర్వేస్కు దర్యాప్తు సంస్థల రూపంలో మరో ప్రమాదం ముంచు కొస్తోంది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ జెట్ లో నిధుల మళ్లింపుపై దర్యాప్తును ప్రారంభించనుందని సమాచారం. -
మంచిరోజులు వస్తాయంటున్న జెట్ ఫౌండర్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో మూసివేత అంచుకు చేరిన జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే బిడ్డర్ మరికొన్ని రోజుల్లో ముందుకొస్తారని జెట్ ఎయిర్వేస్ వ్యవస్ధాపకుడు నరేష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిడ్డింగ్కు తుదిగడువు ఈనెల 10న ముగుస్తుండగా వచ్చే వారంలోనే బిడ్డర్ను బ్యాంకులు ఖరారు చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ 26వ వార్షికోత్సవమైన మే 5 (ఆదివారం) తన జీవితంలో అత్యంత విచారకరమైన రోజని ఆయన సంస్థ ఉద్యోగులు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా మే 5 సంస్థ ఉద్యోగుల్లో ప్రత్యేక స్ధానం ఏర్పరచుకుందని, అయితే ఈ ఏడాది మాత్రం అది అత్యంత విచారకరమైన రోజుగా గడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 1993, ఏప్రిల్ 18న తాము ముంబైలో తొలి విమానాన్ని అందుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ 18న తాము అమృత్సర్ నుంచి ముంబైకి చివరి విమానం నడపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు తాను తన భార్య నీతా చివరినిమిషం వరకూ ప్రయత్నించామని, మార్చి 25న బోర్డు నుంచి వైదొలగడంతో పాటు తన కంపెనీల్లో ఒక కంపెనీ నుంచి రూ 250 కోట్లు సమకూర్చానని, ఎయిర్లైన్లో తన షేర్లను తనఖా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా జెట్ ఎయిర్వేస్ను దక్కించుకునేందుకు ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ఎన్ఐఐఎఫ్ ఆసక్తి కనబరుస్తున్నాయి. -
జెట్ క్రాష్లో ఎతిహాద్ కుట్ర!
న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయి సేవలను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ఉదంతంలో భారీ కుట్ర చోటుచేసుకుందా? తాజాగా జెట్ పైలట్ల ఆరోపణలతో ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారు అయిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఎస్బీఐ కలిసి ఈ కుట్రకు తెరతీసాయని... దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని జెట్ ఎయిర్వేస్ పైలట్లు కోరారు. కంపెనీ షేరు ధరను స్టాక్ మార్కెట్లో కుప్పకూల్చడం ద్వారా ఎతిహాద్ జెట్లో మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలనుకుందని, అందుకే ఈ కుట్రకు తెరతీశారని పైలట్లు ఆరోపించారు. తద్వారా కంపెనీని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవాలనేది ఆ కంపెనీ వ్యూహమన్నారు. జెట్ ఎయిర్వేస్లో యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు ప్రస్తుతం 24 శాతం వాటా ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేకపోవడంతో జెట్ సేవలను ఇటీవలే తాత్కాలికంగా నిలిపివేశారు. జెట్ ప్రమోటర్ నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.1,500 కోట్ల తాజా నిధులను అందించేందుకు సిద్ధపడినా.. ఎస్బీఐ ముందుకు రాలేదని, ఎతిహాద్ కూడా ఈ కష్టకాలంలో కావాలనే సహాయ నిరాకరణకు పాల్పడిందని పైలట్లు పేర్కొన్నారు. జెట్ పతనం వెనుక ఎతిహాద్ పాత్రను దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని ప్రధానిని అభ్యర్థించారు.గురువారం బీఎస్ఈలో మరో 20 శాతం మేర దిగజారి రూ.122కు పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 12% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్కు హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో పడిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. కాన్సిల్ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై జెట్ ఎయిర్వేస్ స్పందించాలని కోరింది. అలాగే ఈ అంశంపై అఫిడవిట్ను దాఖలు చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)ను ఆదేశించింది. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేసి, ప్రయాణికులను సంక్షోభంలోకి నెట్టి వేసిందనంటూ సామాజిక కార్యకర్త బిజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.బి. భంభాని ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ బుధవారం ఈ నోటీసులిచ్చింది. ఈ వేసవి సెలవుల తర్వాత దీనిపై వాదనలను వింటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. కాగా జెట్ ఎయిర్వేస్ రుణ సమీకరణ అంశం ఒక కొలిక్కి రాకపోవడంతో సర్వీసులను ఆకస్మికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన రీఫండ్ మొత్తం సుమారు 360 కోట్ల రూపాయలకు పై మాటే. -
వైద్య బీమా ప్రీమియానికి డబ్బుల్లేవు
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు కంపెనీ వద్ద డబ్బుల్లేవని జెట్ఎయిర్ వేస్ తన ఉద్యోగులకు స్పష్టం చేసింది. మంగళవారంతో కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ రెన్యువల్ గడువు తీరిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్ 17 నుంచి సంస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ‘‘రుణదాతలు లేదా ఇతర మార్గాల నుంచి అత్యవసరంగా నిధులు అందే పరిస్థితి సమీపంలో లేదు. దీంతో గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు అవసరమైన నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో కంపెనీ ఉంది’’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సమాచారం ఇచ్చారు. -
గుడ్ న్యూస్ చెప్పిన విస్తారా
దేశీయ విమానయాన సంస్థ విస్తారా గుడ్ న్యూస్ చెప్పింది. వందమందికి పైగా పైలట్లను, 400 మందికి పైగా క్యాబిన్ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించినట్టు సమాచారం. ఈనియామకాల్లో ముఖ్యంగా రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుందట. తద్వారా అప్పుల సంక్షోభంలో చిక్కుకుని, కార్యకలాపాలను నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు భారీ ఊరటనివ్వనుంది. అలాగే విస్తారా నిబంధనలు, స్టాండర్డ్స్కు అనుగుణంగా వీరికి (జెట్ ఎయిర్వేస్కు చెందిన పైలట్లు, ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి) సంబంధిత విక్షణను కూడా ఇవ్వనుందని ఇండస్ట్రీకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. అంతేకాదు జెట్ ఎయిర్వేస్కు చెందిన 737 బోయింగ్ విమానాలను కూడా విస్తారా తన ఖాతాలో చేర్చుకోనుంది. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులను కూడా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ నియమకాలని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై విస్తారా అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేస్తాం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా ఆ కంపెనీ ఉద్యోగ సంఘాలు కంపెనీని నడిపించడానికి ముందుకు వచ్చాయి. పైలెట్లు, ఇంజనీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్డబ్ల్యూఐపీ, జేఏఎమ్ఈవీఏలు ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్కు ఒక లేఖ రాశాయి. రూ.7,000 కోట్ల మేర నిధులు సమీకరించగలమని, జెట్ను టేకోవర్ చేస్తామని ఆ లేఖలో ఆ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎస్డబ్ల్యూఐపీ(ద సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్)లో 800 మంది, జేఏఎమ్ఈవీఏ(జెట్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో 500 మంది వరకూ సభ్యులున్నారు. కాగా జెట్ టేకోవర్కు సంబంధించిన బిడ్లు దాఖలు చేసే గడువు తేదీ దాటిపోయింది. టేకోవర్కు అర్హత సాధించే కంపెనీల తుది జాబితా వచ్చే నెల 10న వెల్లడి కావచ్చు. -
నాకే ఎందుకిలా..? మాల్యా
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ ట్విటర్ అందుకున్నారు. బ్యాంకులకు 100 శాతం తిరిగి చెల్లిస్తానంటూ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్కోసం తీసుకున్నమొత్తం రుణాన్ని చెల్లించడం కోసం తాను సిద్దంగా ఉన్నా.. బ్యాంకులు ఎందుకు అంగీకరిచడంలేదంటూ మరోసారి వాపోయారు. జెట్ ఎయిర్వేస్ దుస్థితిపై టీవీల్లో చర్చల్ని చూశాను. ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి కష్టాలు బాధాకరమని మాల్యా పేర్కొన్నారు. కొన్ని వ్యాపార తప్పిదాల వల్ల కింగ్ ఫిషర్తోపాటు భారతీయ విమానయాన సంస్థలు కుప్పకూలడం విచారకరం. ఇపుడు అనూహ్యంగా జెట్ పతనం. 100శాతం రుణాలు చెల్లిస్తానని చెబుతున్నా..కానీ సీబీఐ, ఈడీ తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాకే ఎందుకు ఇలా అంటూ మాల్యా అసహనం వ్యక్తం చేశారు. Watched TV debate on the sad collapse of Jet which included unpaid employees and Industry veterans. Important issues on unemployment and suffering, security available to Banks, prospects of revival etc. Here I am offering 100 % payback of KFA loans which Banks wont take. Why ? — Vijay Mallya (@TheVijayMallya) April 28, 2019 Several Indian airlines collapsed sadly including KFA. Now the previously unthinkable has happened with the collapse of Jet. Genuine business failures. But I am criminally charged by CBI/ED despite offering 100% payback. Wonder why only me ? — Vijay Mallya (@TheVijayMallya) April 28, 2019 -
జెట్ బాటలో మరో సంస్థ..
సాక్షి, న్యూఢిల్లీ : సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మూసివేతకు దారితీసిన జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాటలో మరో విమానయాన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఏప్రిల్ వేతనాలు చెల్లించలేమని పవన్ హంస్ యాజమాన్యం ఉద్యోగులకు పంపిన సర్క్యులర్లో వెల్లడించింది. కంపెనీ సామర్ధ్యాన్ని పూర్తిగా సమీక్షించిన మీదట సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడైందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాబడులు తగ్గి నికర నష్టం రూ 89 కోట్లుగా నమోదైందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పౌరవిమానయాన రంగంలో పరిస్థితులు సైతం భవిష్యత్ వృద్ధికి ఏ మాత్రం సానుకూలంగా లేవని స్పష్టం చేసింది. కాగా, కంపెనీ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నందున వేతనాలు చెల్లించలేమని యాజమాన్యం పేర్కొనడం పట్ల పవన్ హంస్ ఉద్యోగుల సమాఖ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కంపెనీ చర్య అమానవీయమైనదని ఆక్షేపించింది. వేతన సవరణ కోసం వేచిచూస్తున్న ఉద్యోగుల వేతనాలను నిలిపివేయడం తగదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే కంపెనీ ఎగ్జిక్యూటివ్లు పెరిగిన వేతనాలను అందుకుంటున్న క్రమంలో యాజమాన్యం చర్య తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. యాజమాన్యం చర్యకు నిరసనగా తాము నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతామని పేర్కొంది. మరోవైపు ఉద్యోగులకు ఏప్రిల్ వేతనాలను నిలిపివేయలేదని, ఏప్రిల్ వేతనాలు అందని ఉద్యోగుల సంఖ్య పరిమితమని పవన్హంస్ ప్రతినిధి స్పష్టం చేశారు. -
డిప్రెషన్తో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి ఆత్మహత్య
ముంబై : మహారాష్ట్రాలోని పాల్గర్ జిల్లాలో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. జెట్ ఎయిర్వేస్లో పని చేసే సీనియర్ టెక్నీషియన్ శైలేష్ సింగ్(45) నల్సోపోరాలో తాను నివాసముంటున్న నాలుగంతస్తుల బిల్డింగ్పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శైలేష్ సింగ్ క్యాన్సర్తో బాధపడేవారని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా శైలేష్ తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిప్రెషన్లో ఉండేవారని సహోద్యోగులు తెలిపారు. క్యాన్సర్ కారణంగా తరుచు కీమోథెరపీ చేపించుకోవాల్సి వచ్చేదని, ఇటీవల కాలంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎక్కువవ్వడంతో డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. జెట్ఎయిర్వేస్ సంక్షోభం కారణంగా ఉద్యోగులు జీతాలు అందక చాలా రోజులుగా ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే. 26 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన జెట్ ఎయిర్లైన్ దిగ్గజం బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 22,000 మంది భవిష్యత్ ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో 16,000 మంది డైరెక్ట్ ఉద్యోగులు కాగా, మరో 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. -
‘జెట్’ సిబ్బందికి కొత్త రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘బిల్లులు పేరుకుపోతున్నాయి. మా పిల్లల పాఠశాలల, కాలేజీల ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఇక ఈఎంఐలు సరేసరి. మా పరిస్థితి భయానకంగా ఉంది. మా సహచరుల్లో కొంత మంది ఇప్పటికే 40 శాతం తక్కువ జీతాలకు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ జెట్ ఎయిర్వేస్ పైలట్ మీడియాతో వాపోయారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రైవేట్ జెట్ ఎయిర్వేస్ను తాత్కాలికంగా మూసివేయడంతో అందులో పనిచేసే వివిధ కేటగిరీలకు చెందిన దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు ఈ పరిస్థితి ఏర్పడింది. కొంత మంది సిబ్బంది 40 శాతం తక్కువకు ఇతర ఉద్యోగాల్లో చేరిపోయారని చెబుతున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉద్యోగాలు దొరకడమే విశేషం. అంతకన్నా విశేషం ఏమిటంటే, జెట్ ఎయిర్వేస్ సిబ్బంది దుస్థితి గురించి తెలిసి అనేక స్టార్టప్, కార్పొరేట్ కంపెనీలే కాకుండా ప్రత్యర్థి ఎయిర్వేస్ కంపెనీలు కూడా వారిని పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి. చెన్నైలో ఉంటున్న ఓ చిన్నపాటి పుస్తకాల పబ్లిషర్ తన వద్ద రెండు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, రోడ్డున పడ్డ జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు ఇవ్వాలని అనుకుంటున్నానని, తదుపరి వివరాలకు తనను సంప్రతించాల్సిందిగా మొట్టమొదట ట్వీట్ చేశారు. దాంతో స్టార్టప్లతో సహా పలు కార్పొరేట్ కంపెనీలు, పలు సంస్థల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తాను పదిమంది జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తానని, వారు పీజీ చేసి పౌర సంబంధాల్లో ఉద్యోగం చేయడానికి వీలుగా వడ్డీరహిత రుణాలను కూడా ఇస్తానంటూ ఒకరు, తమది ఎక్స్ప్రెస్ ఇన్ ఇండియా డాట్కామ్ అని, ఇప్పటికే ఓ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉందంటే అది తమకు లాభించే అంశంగా పరిగణిస్తున్నామని, జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులయితే వారికి కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామంటూ మరొకరు ఆఫర్ ఇచ్చారు. ఇలా ఉద్యోగాలు ఆఫర్ చేసిన వారిలో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉదాహరణకు జెట్ మాజీ ఉద్యోగి అమిత్ బీ వధ్వానీ ముంబైలో ‘సాయి ఎస్టేట్ కన్సల్టెంట్స్’ నడుపుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు, అమ్మకాలు, కొనుగోళ్ల ఆడిట్ లెక్కలు, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, పబ్లిక్ రిలేషన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఇస్తానంటూ ఆయన ఆఫర్ ఇచ్చారు. ఇక క్యూర్ఫిట్, బౌన్స్, స్టేఎబోడ్ అనే స్టార్టప్ కంపెనీల్లో 150 ఉద్యోగాలను జెట్ ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చారు. అమెరికాలోని ‘వియ్ వర్క్ డాట్ కామ్’ కూడా ఆఫర్ ఇచ్చింది. మంచి అనుభవం ఉన్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను ప్రభుత్వ పౌర విమానయానంలోకి తీసుకుంటామని కేంద్ర పౌరవిమాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఏప్రిల్ 21వ తేదీన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హామీ ఇచ్చారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటారో, లేదో తెలియదుగానీ, ఆయన హామీకి స్పందించిన ‘స్పైస్జెట్ ఎయిర్వేస్’ జెట్ ఎయిర్వేస్కు చెందిన వెయ్యి మంది సిబ్బంది వరకు ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. ఇంతగా మానవత్వం పరిమళిస్తుందంటే అది సోషల్ మీడియా పుణ్యమేనని చెప్పాలి! -
వేతనాలపై చేతులెత్తేసిన జెట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ వేతనాల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి చేదు వార్త చేరవేసింది. సంస్ధ విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేతన చెల్లింపులకు నిధులు సర్ధుబాటు చేయలేమని బ్యాంకుల కన్సార్షియం తెలిపిందని జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబే ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బిడ్డింగ్ ప్రక్రియను కొనసాగిస్తూనే సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు కొన్ని నిధులు విడుదల చేయాలని తాము కోరగా బ్యాంకులు నిరాకరించాయని తెలిపారు. కొద్ది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే వారు మరోచోట ఉద్యోగం చూసుకోవడం మినహా వారికి మరో మార్గం లేదని తాము పదేపదే బ్యాంకులను కోరినా ఫలితం లేకుండా పోయిందని దూబే ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను తాము బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై కంపెనీ షేర్హోల్డర్లే నిర్ణయం తీసుకోవాలని సులభంగా తేల్చేశారని చెప్పారు. ఇక బోర్డు సమావేశాల్లోనూ వేతన బకాయిల చెల్లింపునకు ప్రమోటర్లు, వ్యూహాత్మక వాటాదారును కోరినా వారి నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి సహకరించాలని కోరినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
స్వీయ తప్పిదమే పతన కారణమా?
పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో 1990 దశకంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయటం మొదలు పెట్టగానే అంతవరకు ప్రభుత్వ ఏకస్వామ్య విధానాల వలన రక్షణ పొందిన చాలా రంగాల్లో ప్రైవేట్ రంగ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విమానయాన రంగాన్ని కూడా సరళీకరించారు. దానిలో భాగంగా ఆనాడు మోడీ లుఫ్ట్, దమానియా, ఎన్ఈపీసీ, జెట్ ఎయిర్వేస్ లాంటి విమానయాన సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మూడు నాలుగేళ్లలోనే వాటిలో చాలా సంస్థలు మూతపడినా, జెట్ ఎయిర్లైన్స్ మాత్రం అప్పటి నుంచి తన కార్యక్రమాలను సాగిస్తూ, నష్టాల దృష్ట్యా ఒక వారం క్రితం తన విమాన సర్వీసులను నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్కు రుణాలు మంజూరు చేసిన సంస్థలు ఉదారంగా కొంత ఆర్థిక సహాయం ఈ సమయంలో అందించి ఉంటే విమాన సంస్థ మూసేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని, పనిచేసే ఉద్యోగులకు ఆసరాగా ఉండేదని, విమానయానంలో ధరలు పెరగకుండా చూడటానికి కూడా తోడ్పడేదని కొందరి వాదన. ఈ వాదన సరికాదు. ఈ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఒకరోజు, కొద్ది కాలంలో వచ్చే అంశం కాదు. సంస్థకు ఆర్థిక సమస్యలు చాలాకాలం నుంచే ప్రారంభమై ఉంటాయి. తొలి దశలో రుణాలు మంజూరు చేసిన సంస్థలు సరైన పాత్ర పోషించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. జెట్ ఎయిర్వేస్ను కాపాడుకునే అవకాశాలు అప్పుడు మెండుగా ఉండేవి. పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు రుణ సహాయం చేయడం వల్ల సంస్థ కొన్నాళ్ళు ఆక్సిజన్పై బతకడానికి సహాయపడుతుందేమో కానీ సంస్థ పరిస్థితిలో ఎటువంటి మౌలికమైన మార్పు తీసుకొని రావు. ఈనాడు ఇచ్చే సహాయం బూడిదలో పోసిన పన్నీరు గానే మిగిలిపోతుంది. బ్యాంకులు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా భావన. జెట్ విమానయాన సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో నిర్వహించిన పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్లో చాలామంది ఆశ్రిత పక్షపాతం పెట్టుబడిగా ఎదిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. రాజకీయ నేతలను, అధికారులను సంతృప్తి పరచడం ద్వారా వారి సహాయ సహకారాలతో వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యక్తులు వీరందరూ. వీరు సరళీకృత ఆర్థిక విధానంలో వచ్చే పోటీ పరిస్థితిని తట్టుకుని నిలబడే సామర్థ్యం శక్తి ఉన్న వ్యక్తులు కారు. ఆ కోవకు చెందిన వ్యక్తి జెట్ ఎయిర్వేస్ అధినేత. ఇండిగో స్పైస్ జెట్ లాంటి ఆర్భాటం లేని విమానయాన సంస్థల పోటీని ఈయన తట్టుకోలేకపోయారు. ఎక్కువ ధర వెచ్చించి కొన్న సహారా విమాన సంస్థ ఎయిర్ దక్కన్ కింగ్ ఫిషర్ సంస్థకు ఏరకంగా గుది బండ అయిందో జెట్ ఎయిర్వేస్కీ అట్లాగే అయింది. వీటన్నిటికీ మించి టికెట్ల అమ్మకం కోసంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ ఏజెంట్లకు చెల్లించిన రుసుము సంస్థ ఖర్చులలో 12 శాతం ఉంది. ఇండిగో లాంటి సంస్థలకు ఇది రెండు శాతం మాత్రమే. 2017– 18లో రూ.2,826 కోట్లు ఈ పద్దు కింద ఏజెంట్లకు చెల్లించడమైంది. గత నాలుగేళ్లలో ఈ పద్దు కింద కమీషన్గా చెల్లించిన మొత్తం రూ. 10 వేల కోట్లు. ఈరోజు ఈ సంస్థ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ మొత్తం కన్నా ఇది ఎక్కువ. జెట్ ఎయిర్వేస్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కంపెనీని ప్రమోట్ చేసిన నరేష్ గోయల్ మాత్రమే కాక మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రధానమైన అంశాన్ని విస్మరించటానికి కారణాలు చెప్పవలసిన బాధ్యత ఆడిటర్లకు, సంస్థలో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లకు ఉన్నది. సంస్థ వనరులను కొందరు బినామీలకు బదిలీ చేయటానికి యాజమాన్యం ప్రమోటర్స్ ప్రయత్నం చేశారా అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సరళీకృత ఆర్థిక విధానాలలో పనిచేసే ప్రైవేట్ సంస్థలు అన్నీ విజయవంతం కాకపోవచ్చు. పోటీ విధానంలో సమర్థ సంస్థలే దీర్ఘకాలంలో మనగలగటం జరుగుతుంది. అసమర్థ సంస్థలు మార్కెట్ ఆటుపోటులను ఎదుర్కోలేక మూతపడటం సహజమే. కానీ సంస్థ మూతపడటానికి కారణం ప్రమోటర్లు, యాజమాన్యం చేసిన అవినీతికర కార్యక్రమాలు అయితే ఆ ప్రమోటర్లు యాజమాన్యం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే నిజమైతే వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థ విషయంలో మాత్రం సంస్థ మూత పడటానికి మార్కెట్ ప్రేరేపిత కారణాలకన్నా నిర్వహణ లోపాలు అనైతిక విధానాలు ప్రధాన కారణాలని అనిపిస్తున్నాయి. ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాలపై దృష్టి సారించి నిజాలు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు -
జెట్ పునరుద్ధరణపై ఆశలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిల్చిపోయిన జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణపై ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తూ తాజాగా బ్రిటన్ వ్యాపారవేత్త జేసన్ అన్స్వర్త్.. కంపెనీలో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మెజారిటీ వాటాల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేస్తూ జెట్ సీఈవో వినయ్ దూబేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన దూబే .. ఇతర సీనియర్ జెట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేలా ఏర్పాటు చేశారని అన్స్వర్త్ తెలిపారు. వాటాల కొనుగోలు కోసం జెట్ రుణదాతలకు కూడా గతంలో లేఖ రాసినప్పటికీ.. వారి నుంచి ఇంకా స్పందన రాలేదని ఆయన వివరించారు. ‘జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు జీతభత్యాలు అందుకునేలా, సంస్థ మరిన్ని అసెట్స్ను కోల్పో కుండా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చూడాలన్నది నా ఉద్దేశం‘ అని అన్స్వర్త్ తెలిపారు. అట్మాస్ఫియర్ ఇంటర్కాంటినెంటల్ ఎయిర్లైన్స్ పేరిట స్టార్టప్ సంస్థను ప్రారంభించిన అన్స్వర్త్.. లండన్లోని స్టాన్స్టెడ్ ఎయిర్పోర్టు నుంచి భారత్, దుబాయ్ తదితర ప్రాంతాలకు ఈ ఏడాది ఆఖర్లోగా విమాన సేవలు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్లాన్ ఉంది.. జెట్ సమస్యలు, అప్పుల భారాల గురించి తనకు తెలుసని, వాటిని అధిగమించేందుకు తన దగ్గర ప్రణాళిక కూడా ఉందని అన్స్వర్త్ తెలిపారు. అట్మాస్ఫియర్పై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లలో కొంత మంది జెట్పై కూడా ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. 2015లో అట్మాస్ఫియర్ను ఏర్పాటు చేసినప్పటినుంచీ వివిధ స్థాయిల్లో వివిధ సంస్థలతో కలిసి పనిచేయడమనేది జెట్ పునరుద్ధర ణకు తోడ్పడగలదని చెప్పారు. కంపెనీ విలువ మరింత పడిపోకుండా సాధ్యమైనంత త్వరగా సం స్థ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యేలా చూడటం ముఖ్యమని తెలిపారు. ఇప్పటికే చాలా మంది జెట్ ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లిపోతున్నారని, అట్మాస్ఫియర్ ఎయిర్లైన్స్ భారత విభాగానికి కూడా జెట్ ఉద్యోగుల నుంచి వందల కొద్దీ దరఖాస్తులు వచ్చాయని ఆయన చెప్పారు. విదేశీ రూట్లపై దృష్టి.. ప్రధానంగా విదేశీ రూట్లలో సేవలపై దృష్టి పెట్టడం ద్వారా జెట్ను పునరుద్ధరించాలని భావిస్తున్నట్లు అన్స్వర్త్ చెప్పారు. సవాళ్లున్నప్పటికీ చౌక చార్జీల విమానయాన సంస్థలతో పోలిస్తే పూర్తిస్థాయి ఎయిర్లైన్స్కు దీర్ఘకాలంలో అవకాశాలు పుష్కలం గా ఉన్నాయన్నారు. వినోదం, రిఫ్రెష్మెంట్స్తో సరైన రేటుకి ప్రీమియం అనుభూతినివ్వడం ఇం దుకు కీలకమని చెప్పారు. భారీ రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న సర్వీసులను నిలిపివేసింది. దీంతో 20,000 మంది పైచిలుకు ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కంపెనీని రుణదా తలు వేలానికి ఉంచాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, ఎన్ఐఐ ఎఫ్ సంస్థలు షార్ట్లిస్ట య్యాయి. ఇవి మే 10లోగా తుది బిడ్స్ను దాఖలు చేయాల్సి ఉంది. అయితే ప్రధానమైన స్లాట్స్, వి మానాలు, పైలట్లు, ఉద్యోగులు సంస్థ చేజారిపో తుండటంతో బిడ్డర్స్ కూడా ఆసక్తి చూపకపోవచ్చే మోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్లాట్స్ కేటాయింపు తాత్కాలికమే: కేంద్రం విమానాశ్రయాల్లో జెట్ ఎయిర్వేస్ స్లాట్స్ను ఇతర సంస్థలకు కేటాయించడం తాత్కాలికం మాత్రమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంగళవారం తెలిపింది. జెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించిన వెంటనే తిరిగి అప్పగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు కార ణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకే మూడు నెలల పాటు తాత్కాలికంగా జెట్ స్లాట్స్ను ఇతర ఎయిర్ లైన్స్కు ఇవ్వనున్నట్లు కేంద్రం వివరించింది. స్లాట్స్ కేటాయింపు పారదర్శ కంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ కమిటీలో ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ, ప్రైవేట్ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ తదితర సంస్థల ప్రతినిధులు ఉంటారు. -
జెట్ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో 22,000 మంది పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీతాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కష్టకాలంలో కొంత తోడ్పాటునిచ్చేలా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ను (ఐబీఏ) బ్యాంకు యూనియన్లు కోరాయి. జెట్ సిబ్బందికి స్పెషల్ లోన్ స్కీముల్లాంటివి రూపొందించేలా బ్యాంకులకు సూచించాలని అభ్యర్థించాయి. అలాగే, ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించడంలో జెట్కు తోడ్పడేలా తగు విలువ గల ఆస్తులను తనఖాగా ఉంచుకుని కంపెనీకి కూడా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఉద్యోగులకు ఒక్క నెల జీతాలైనా చెల్లించాలంటే కనీసం రూ.170 కోట్లు అవసరమవుతాయంటూ జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే వెల్లడించిన నేపథ్యంలో బ్యాంకు యూనియన్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఉద్యోగుల భవిష్యత్ను కాపాడేలా కంపెనీని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలంటూ గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బ్యాంకు యూనియన్లు లేఖ రాశాయి. బ్యాంకులకు రూ. 8,500 కోట్లు, విమానాలు లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్ రూ. 4,000 కోట్ల బాకీపడింది. ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులకు వేల కోట్ల రూపాయలు రిఫండ్ చేయాల్సి ఉంది. -
జెట్కు ఐబీసీ వెలుపలే పరిష్కారం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను అధీనంలోకి తీసుకున్న ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో మొత్తం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని బ్యాంకులు ఎంతో ఆశతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే ప్లాన్ బి (ఐబీసీ వెలుపల పరిష్కారం) దిశగా పనిచేయనున్నట్టు పేర్కొన్నాయి. ఐబీసీ కింద అయితే పరిష్కారానికి ఎన్సీఎల్టీ ఆమోదం అవసరం. పైగా ఈ ప్రక్రియ మార్కెట్ స్పందనపై ఆధారపడి, సమయం తీసుకుంటుంది. జెట్కు ఉన్న విమానాలు, ఇతర ఆస్తులను విక్రయించడమే ప్లాన్ బిగా పేర్కొన్నాయి. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ జెట్ ఎయిర్వేస్లో వాటాల పట్ల ఆసక్తి ప్రదర్శించినట్టు సమాచారం. అయితే, బిడ్డర్ల సమాచారం మే 10న అధికారికంగా తెలియనుంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్శర్మ జెట్ఎయిర్వేస్ కూలిపోవడం ఓ స్కామ్గా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్శర్మ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో పెద్ద స్కామ్గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. ఎయిర్లైన్స్కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు: ఏఐ ఉద్యోగులు ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడిన ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తన ప్రణాళికలపై తక్షణమే పునరాలోచన చేయాలని ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏసీఈయూ) సీనియర్ అధికారి పేర్కొన్నారు. జెట్ఎయిర్వేస్ 20,000 మంది ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు విమానయాన పరిశ్రమలో సంక్షోభానికి, ఉద్యోగాల నష్టానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై పునఃపరిశీలన అవసరమని సూచించారు. ‘‘మొదట కింగ్ఫిషర్, ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రైవేటీకరణ కార్యక్రమం వల్ల అర్థం చేసుకోవాల్సినది ఏమంటే... జాతీయీకరణను తొలగించడం ఒక్కటే లాభాలు, సామర్థ్యాన్ని తెచ్చిపెట్టలేవు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. -
స్పైస్ జెట్ చొరవ : 500 మందికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస కార్యకలాపాలను మూసివేయడంతో రోడ్డునపడ్డ జెట్ ఎయిర్వెస్ ఉద్యోగుల విషయంలో మరో విమాన యాన సంస్థ స్పైస్ జెట్ సానుకూలంగా స్పందించింది. దాదాపు 500 మందికి ఉద్యోగాలను కల్పించినట్టు స్పైస్ జెట్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. భవిష్యత్తు నియామాకాల్లో జెట్ ఎయిర్వేస్ బాధిత ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడం విశేషం. "మేము ఇప్పటికే 100 కన్నా ఎక్కువ పైలట్లకు, 200 కన్నా ఎక్కువ క్యాబిన్ సిబ్బందికి , 200మందికిపైగా టెక్నికల్, ఇతర బ్బందికి ఉద్యోగాలు కల్పించాము" అని స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో మరింత మందికి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రయాణీకుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జెట్ నిలుపుదల ద్వారా ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసేందుకు వచ్చే రెండు వారాలలో 27 విమాన సర్వీసులను అదనంగా చేర్చనున్నామని సంస్థ ప్రకటించింది. మరోవైపు జెట్ విమానాలను నిలిపివేయడంతో విమాన సర్వీసుల క్రమబద్దీకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా 440 స్లాట్లలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) సహా స్థానిక విమానయాన సంస్థలు ప్రయోజనం పొందనున్నాయి. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం జెట్ వాటాల కొనుకోలుకు సంబంధించి బిడ్డింగ్లను ఆహ్వానించింది. జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు రుణ దాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఢిల్లీ, ముంబై నగరాల్లో వందలాది మంది జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమను ఆదుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. -
జెట్ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి
ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్ ఎయిర్వేస్ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్ ఎయిర్వేస్కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్ బెయిలవుట్ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్ గోయల్ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్ గోయల్ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. -
ఆ ఉద్యోగులను ఆదుకుంటాం..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సమస్యలతో మూసివేత అంచున నిలిచి ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు తమ సంస్థలో అవకాశం ఇస్తామని స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు. తాము విస్తరణ ప్రణాళికలతో ముందుకెళుతున్న క్రమంలో జెట్ ఎయిర్వేస్ మూసివేత కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము తొలుత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చామని సింగ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాము తమ విమాన సేవలను మరింత విస్తరిస్తామని, మరింత మంది జెట్ ఉద్యోగులకు అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు. మరోవైపు ఎయిర్ ఇండియా సైతం జెట్ ఎయిర్వేస్ రూట్లలో తమ సర్వీసులను నడిపేందుకు ప్రయత్నిస్తోంది. నగదు సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్కు ఎమర్జన్సీ ఫండ్స్ను సమకూర్చేందుకు బ్యాంకర్లుమ నిరాకరించడంతో సంస్థ తన విమాన సర్వీసులన్నింటినీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఉద్యోగుల పాలిట అశనిపాతంలా తాకింది. సంస్థలోని ఒక్కో ఉద్యోగిది ఒక్కో గాథ. అర్థాంతరంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగి పరిస్థితికి అద్దం పడుతున్న వారి ఆవేదన వర్ణనాతీతం. తమ భవిష్యత్తును తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్న వైనం కలవర పరుస్తోంది. రుణ వితరణకు సంబంధించి ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతోబుధవారం రాత్రి నుంచి అన్ని సర్వీసులనూ తాత్కాలికంగా రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో దాదాపు 22వేలమందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ను ఆదుకునేందుకు ఫౌండర్ నరేష్ గోయల్ సంస్థనుంచి తప్పుకుంటే.. రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూరుస్తామని ఎస్బీఐ కన్సార్షియం చెప్పింది. దీని ప్రకారం ఆయన కంపెనీని వీడారు. కానీ ఇపుడు కనీసం 400కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు అంగీకరించడంలేదు. ఇందులో తప్పెవరిది? ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ఉద్యోగులు మండిపడ్డారు. తమ ఉద్యోగాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మాజీ ఫౌండర్ నరేష్ గోయాల్? లేక ఎస్బీఐ యాజమాన్యమా అని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డలు ఆకలితో చచ్చిపోతోంటే ఎవరూ పట్టించుకోవడంలేదు. వారికి ఓట్లు మాత్రమే కావాంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని... తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ కష్టాల్ని గుర్తించి జెట్ ఎయిర్వేస్ను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు రెండునెలలుగా వేతనాలు లభించకపోవడంతో తమ పిల్లల స్కూలు ఫీజులు, లోన్ల ఈఎంఐలు, ఇలా చాలా బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ప్రథమేష్ (27)ది కూడా ఇదే ఆవేదన. సంస్థమీద తనకు పూర్తి విశ్వాసం ఉందని సీనియర్ ఉద్యోగి అనిల్ సాహు(50) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సునామీ ఉపద్రవంముంచుకొచ్చిందని, దీన్నుంచి కోలుకుని త్వరలోనే మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు. కానీ 50 ఏళ్ల వయసులో మరో ఎయిర్లైన్స్ సంస్థలో జాబ్ సంపాదించుకోవడం తేలిక కాదన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా సగం శాలరీకే చేరాల్సి వస్తుందని మరికొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న మరో ఉద్యోగి అమీనా, ఇప్పటికు తనకు తనకు లాంటి ఇబ్బంది లేదని, తిరిగి తమ సంస్థ పుంజుకుంటుందని భావిస్తున్నానన్నారు. జీతాల్లేవు.. అందుకే ప్రాఫిడ్ ఫండ్ విత్ డ్రా చేసి మరీ పిల్లల ఫీజులు కట్టాను. మా అమ్మ (70) వైద్య ఖర్చులు భరించడం ఇపుడొక సవాల్ - శంకర్ చక్రవర్తి (50) సీనియర్ అస్టిస్టెంట్ ఇంజనీర్. 1993నుంచి సంస్థలో పనిచేస్తున్న ఈయన జీతం నెలకు రూ.80వేలు. జెట్ ఎయిర్వేస్లో చేరినపుడు ఎన్నో కలలు కన్నాను. అందంతా మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది - రమన్ రాజపుత్ (26) క్యాబిన్ క్రూ నేను సింగిల్ పేరెంట్ని. 12 ఏళ్ల కొడుకుని ఎలా పోషించాలి. భవిష్యత్తు అగ్యమగోచరంగా ఉంది -మోనికా బక్షి (42) కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ మరోవైపు సంస్థ సంక్షోభం గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి సూచించింది. జెట్ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
జెట్కు త్వరలోనే కొత్త ఇన్వెస్టర్!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో వాటాల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని రుణాలిచ్చిన సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘సంస్థ విలువను సముచితంగా, పారదర్శకంగా మదింపు చేసేలా బిడ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని రుణదాతలు ఆశావహంగా ఉన్నారు’ అని బ్యాంకర్ల కన్సార్షియం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో కుంగుతున్న జెట్కు ఊపిరినిచ్చేలా అత్యవసరంగా రూ. 400 కోట్లు సమకూర్చడానికి బ్యాంకులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రాత్రి నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. జెట్ యాజమాన్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న 26 బ్యాంకుల కన్సార్షియం.. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్లను పిలిచింది. ఎతిహాద్ ఎయిర్వేస్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ, ఎన్ఐఐఎఫ్, ఇండిగో పార్ట్నర్స్ సంస్థలు షార్ట్లిస్ట్ అయ్యాయి. ఇవి మే 10 లోగా తుది బిడ్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. భారీగా పతనమైన జెట్ షేరు... కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో గురువారం జెట్ ఎయిర్వేస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 32 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో 32.23 శాతం క్షీణతతో రూ. 163.90 వద్ద జెట్ షేరు క్లోజయ్యింది. ఒక దశలో 34.62 శాతం దాకా తగ్గి రూ. 158.10 (52 వారాల కనిష్టం) స్థాయికి కూడా పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈలో జెట్ షేర్లు 31 శాతం క్షీణించి రూ. 165.75 వద్ద క్లోజయ్యాయి. బీఎస్ఈలో 60.41 లక్షలు, ఎన్ఎస్?లో 5 కోట్ల షేర్లు చేతులు మారాయి. రెండు రోజుల్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,111 కోట్ల మేర క్షీణించి రూ. 1,862 కోట్లకు పడిపోయింది. 5 విమానాలు లీజుకు తీసుకుంటాం: ఎయిరిండియా జెట్ ఎయిర్వేస్కి చెందిన అయిదు విమానాలను లీజుకు తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్కు ప్రభుత్వ రంగ ఎయిరిండియా సీఎండీ అశ్వని లొహానీ లేఖ రాశారు. జెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశంతో.. వీటిని లండన్, దుబాయ్, సింగపూర్ రూట్లలో నడపాలని భావిస్తున్నట్లు ఏప్రిల్ 17న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బోయింగ్ 777 రకానికి చెందిన అయిదు విమానాలను పరస్పరం ఆమోదయోగ్యమైన షరతులు బట్టి లీజుకు తీసుకోవాలని భావిస్తున్నట్లు లొహానీ తెలిపారు. విమాన సర్వీసుల రద్దుతో విదేశాల్లో నిల్చిపోయిన జెట్ ఎయిర్వేస్ ప్రయాణికుల సౌకర్యార్థం సాధారణ చార్జీలు కాకుండా ప్రత్యేక చార్జీలను వర్తింప చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ఇతర సంస్థలకు జెట్ స్లాట్స్.. జెట్ విమానాల రద్దు కారణంగా ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో నిరుపయోగంగా మారిన 440 స్లాట్స్ను తాత్కాలికంగా ఇతర ఎయిర్లైన్స్కు కేటాయించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆయా విమానాశ్రయాల అధికారులతో కూడిన కమిటీ కేటాయింపులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ వ్యవధి మూడు నెలల పాటు ఉంటుందన్నారు. ముంబైలో 280 స్లాట్స్, ఢిల్లీ ఎయిర్పోర్టులో 160 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని వివరించారు. వచ్చే మూడు నెలల్లో ఇతర ఎయిర్లైన్స్ మరో 30 విమానాలను సమకూర్చుకుంటున్నాయని ఖరోలా చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ఉద్యోగ యూనియన్ల విజ్ఞప్తి కింగ్ఫిషర్ తరహాలో జెట్ ఎయిర్వేస్ కూడా మూతబడకుండా చూసేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని జెట్ అధికారులు, ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. కంపెనీలో చోటు చేసుకున్న పరిణామాల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్సీపీ పార్టీ శాసనసభ్యుడు కిరణ్ పవాస్కర్ డిమాండ్ చేశారు. 16,000 మంది పర్మనెంట్ ఉద్యోగులపై ప్రభావం పడుతోందని, సర్వీసులను రద్దు చేసే ముందుగా వారి జీతాల బకాయిలను ఎందుకు చెల్లించలేదో కంపెనీ వివరణ ఇవ్వాలన్నారు. -
జెట్ రూట్లపై కన్నేసిన ఎయిర్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ విమాన సేవలు నిలిచిపోయిన కొన్ని రూట్లను టేకోవర్ చేసేందుకు ఎయిర్ ఇండియా సంసిద్ధమైంది. గతంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు నడిచిన కొన్ని రూట్లలో తన బోయింగ్-777 విమానాలను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సీఈవో కోరిన రూ 400 కోట్ల తక్షణ నిధులను చెల్లించేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో సంస్థ షట్డౌన్కు చేరువైన సంగతి తెలిసిందే. కాగా జెట్ ఎయిర్వేస్ రూట్లలో తమ విమాన సేవలను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎయిర్ ఇండియా సీఎండీ అశ్వని లోహని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్కు లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా మూతపడటంతో ఆయా రూట్లలో ప్రయాణీకుల అసౌకర్యాన్ని నివారించేందుకు తాము ఈ ప్రతిపాదన చేశామని లేఖలో పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా ప్రతిపాదనపై ఎస్బీఐ ఇంకా స్పందించలేదు. -
34 శాతం కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేరు
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని చివరకు మూసివేత దిశగా పయనిస్తున్న జెట్ ఎయిర్వేస్ స్టాక్మార్కెట్లో వరుసగా నష్టపోతోంది. తాత్కాలికంగా కార్యకాలాపాలను మూసివేస్తున్నట్టు యాజమాన్యం బుధవారం వెల్లడించడంతో గురువారం నాటి మార్కెట్లో ఏకంగా 30శాతం నష్టపోయింది. అయితే నలుగురుబిడ్డర్లు వాటాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్నారన్నఅంచనాలతో ప్రస్తుతం 26 శాతం నష్టంతో 179 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా మరోవైపు జెట్ ఎయిర్వేస సంక్షోభం నేపథ్యంలో ఇతర కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్ వివాదం నేపథ్యంలో మరో దేశీయ విమానాయాన సంస్థ స్పైస్జెట్ కొత్తగా విమాన సర్వీసులను పరిచయం చేస్తూ ఉండటంతో ఈ కౌంటర్లో భారీగా కొనుగోళ్లు నెలకొన్నాయి. 22 బోయింగ్ 737 ఎన్జీ విమానాలను ఇటీవల ప్రకటించింది. తాజాగా మరో 6 విమానాలను సర్వీసుల్లో దింపుతున్నట్టు వెల్లడించింది. దీంతో వరుసగా లాభపడుతూ ప్రస్తుతం 6 శాతం ఎగిసింది. అలాగే ఇండిగో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కౌంటర్లో కొనుగోళ్ల ధోరణి నెలకొంది ఒక శాతానికిపైగా లాభాలతో కొనసాగుతోంది. -
జెట్ క్రాష్ ల్యాండింగ్!
న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో కఠిన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరో విమానయాన సంస్థ మూసివేత అంచులకు చేరింది. రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ‘రుణదాతల నుంచి గానీ మరే ఇతర మార్గాల ద్వారా గానీ అత్యవసరంగా కావాల్సిన నిధులు లభించే భరోసా లేదు. దీంతో కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో ఇంధన విక్రేతలకు, ఇతరత్రా సేవలందించే వారికి చెల్లింపులు జరపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశీయంగాను, విదేశీ రూట్లలోనూ నడిపే ఫ్లయిట్స్ అన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమృత్సర్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి రాత్రి 10.30 గం.లకు వెళ్లే ఫ్లయిట్ ఆఖరుది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు జెట్ ఎయిర్వేస్ బుధవారం తెలిపింది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రయాణికులు, బ్యాంకులు, రుణదాతలకు వేల కోట్ల రూపాయల బాకీల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది. నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి జెట్ పరిష్కార ప్రణాళికకు తోడ్పాటునిస్తామని పేర్కొంది. మే 10 దాకా నిరీక్షణ .. సంస్థలో వాటాలను విక్రయిస్తున్న రుణదాతలు .. బిడ్లను ఖరారు చేసే ప్రక్రియ పూర్తయ్యే దాకా వేచి చూడనున్నట్లు జెట్ తెలిపింది. నాలుగు సంస్థలు అర్హత పొందాయని, ఇవి తుది బిడ్లను దాఖలు చేసేందుకు మే 10 దాకా గడువుందని పేర్కొంది. ఎతిహాద్ ఎయిర్వేస్, జాతీయ పెట్టుబడి నిధి ఎన్ఐఐఎఫ్, ప్రైవేట్ సంస్థ టీపీజీ, మరో ఫండ్ హౌస్ ఇండిగో పార్ట్నర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, జెట్ కార్యకలాపాల నిలిపివేతపై పౌర విమానయాన శాఖ స్పందించింది. సంస్థ సమస్యల పరిష్కారమార్గాన్ని కనుగొనేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నామని ఉద్యోగులకు పంపిన లేఖలో జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే తెలిపారు. ‘అయితే, విక్రయ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుందన్న సంగతి అంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఈలోగా మరిన్ని సవాళ్లు ఎదురవ్వొచ్చు. వీటికి సంబంధించి ప్రస్తుతానిౖMðతే మన దగ్గర సమాధానాలు లేవు‘ అని ఆయన తెలిపారు. మంగళవారం సమావేశంలో ఆఖరు ప్రయత్నంగా రూ. 400 కోట్లయినా సమకూర్చాలని బ్యాంకులను కోరాలంటూ సీఈవో వినయ్ దూబేకి జెట్ బోర్డు సూచించింది. బ్యాంకులు దానికి అంగీకరించకపోతే, సంస్థ భవిష్యత్పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయితే, అత్యవసరంగా నిధులను సమకూర్చాలన్న విజ్ఞప్తిని అంగీకరించడం లేదంటూ రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మంగళవారం రాత్రి పొద్దుపోయాక జెట్ ఎయిర్వేస్కు తెలిపింది. ఈ పరిణామాల దరిమిలా సర్వీసులను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీ ఎయిర్లైన్స్ కష్టాలకు కారణాలు.. విమానయాన సంస్థల కష్టాలకు పలు కారణాలు ఉంటున్నాయి. ప్రధానంగా దేశీ విమాన సర్వీసులకు ఉపయోగించే ఇంధనంపై అధిక పన్నుల పోటు, విమానాశ్రయాల్లో ఇన్ఫ్రా సమస్యలతో మరిన్ని ప్లేన్స్ను చేర్చే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన పోటీ కారణంగా చౌక చార్జీలతో కొనసాగాల్సి వస్తుండటం, నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతుండటం మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి. జెట్ పాతికేళ్ల ప్రస్థానమిదీ.. ►1992లో సంస్థ ఏర్పాటు. 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్గా కార్యకలాపాలు ప్రారంభం. 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు. 2004లో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్. ►2005లో పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ). ► 2007లో రూ. 2,050 కోట్లతో ఎయిర్ సహారా కొనుగోలు. ► 2010 – 2012 దాకా ప్యాసింజర్ మార్కెట్లో అత్యధిక వాటాతో అగ్రస్థానం. ► 2011–12లో సంక్షోభ పరిస్థితులు. 2013లో ఎతిహాద్కు 24 శాతం వాటాల విక్రయం. డీల్ విలువ 379 మిలియన్ డాలర్లు. ► గడిచిన పదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు నష్టాలు. 2015లో 22.5 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2018 నాటికి 15.5 శాతానికి పడిపోయింది. ►2018 మార్చి నుంచి తాజాగా మరో సంక్షోభం మొదలు. ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యాలు, టాప్ మేనేజ్మెంట్ జీతభత్యాల్లో 25 శాతం దాకా కట్. గడిచిన ఏడాది కాలంగా సంస్థ మార్కెట్ విలువ 60 శాతం పైగా హరించుకుపోయింది. రుణదాతలకు దాదాపు రూ. 8,000 కోట్లకు పైగా బాకీపడింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో మరింత ముదిరిన సంక్షోభం. 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి. ►ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఆర్థిక పరిస్థితులు మరింతగా దిగజారాయి. కంపెనీ బోర్డు నుంచి వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ తప్పుకున్నారు. బ్యాంకు యాజమాన్యాన్ని బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థలో 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ ఆహ్వానించాయి. కార్యకలాపాలు కొనసాగించేందుకు రూ. 1,500 కోట్లు సమకూర్చే ప్రతిపాదనలు చేశాయి. వీటిని అందించడంపైనే మల్లగుల్లాలు పడిన బ్యాంకులు చివరికి అత్యవసరంగా కావాల్సిన నిధులను ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. ప్రస్తుతం కంపెనీలో ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంకు 51 శాతం, నరేష్ గోయల్కు 24 శాతం, ఎతిహాద్ ఎయిర్వేస్కు 12 శాతం వాటాలు ఉన్నాయి. ►ఒకప్పుడు 120 పైగా విమానాలు ఉండేవి. కానీ అద్దెలు కట్టకపోవడంతో లీజుకిచ్చిన సంస్థలు పలు విమానాలను నిలిపివేయడంతో ప్లేన్స్ సంఖ్య 5కి పడిపోయింది. ఉద్యోగులకు జీతభత్యాలు నిల్చిపోయాయి. జెట్ సంక్షోభంతో విమాన చార్జీలు భారీగా పెరుగుతున్నాయి. స్వయంగా ప్రధాని కార్యాలయం, పౌర విమానయాన శాఖ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయిదేళ్లలో ఏడో సంస్థ.. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఆర్థిక సంక్షోభం, తీవ్ర పోటీ ధాటికి పలు విమానయాన సంస్థలు కుప్పకూలుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో ఎయిర్ పెగాసస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, జూమ్ ఎయిర్ మూతబడ్డాయి. తాజాగా ఈ జాబితాలో ఏడో సంస్థగా జెట్ ఎయిర్వేస్ కూడా చేరుతోంది. అంతక్రితం 1987లో వాయుదూత్, 1996లో ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్.. మోదీలుఫ్త్, 1997లో దమానియా ఎయిర్వేస్, ఎన్ఈపీ, 2000లో అర్చనా ఎయిర్వేస్ మూతబడ్డాయి. ఎయిర్లైన్ కర్మ: మాల్యా.. జెట్ ఎయిర్వేస్ పరిస్థితిపై మూతబడిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ ప్రమోటర్ విజయ్ మాల్యా స్పందించారు. కంపెనీకి సంఘీభావం ప్రకటించారు. ప్రైవేట్ విమానయాన సంస్థల కష్టాలకు కేంద్రమే కారణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు వేల కోట్ల ప్రజాధనమిచ్చి గట్టెక్కిస్తోంది కానీ .. ప్రైవేట్ ఎయిర్లైన్స్పై మాత్రం పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. ‘కింగ్ఫిషర్కు జెట్ ఎయిర్వేస్ ప్రధాన పోటీదారు అయినప్పటికీ.. అంత పెద్ద సంస్థ మూసివేత పరిస్థితుల్లోకి జారిపోవడం చూస్తే నాకు బాధేస్తోంది. ఎయిరిండియాను కాపాడేందుకు కేంద్రం రూ. 35,000 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. ప్రైవేట్ రంగ సంస్థలను మాత్రం వదిలేస్తోంది. అప్పట్లో నేను భారీ పెట్టుబడులు పెట్టిన కింగ్ఫిషర్ దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది. అవార్డులూ అందుకుంది. బ్యాంకుల నుంచి కూడా కింగ్ఫిషర్ రుణాలు తీసుకున్న సంగతి వాస్తవమే. నేను 100 శాతం చెల్లించేస్తానంటున్నా నాపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఇదంతా ఎయిర్లైన్ కర్మ అనుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. -
జెట్ ఎయిర్వేస్ కథ ముగిసింది!
సాక్షి, ముంబై : తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ తన సర్వీసులు నిలిపివేయడానికి సిద్ధమైంది. బుధవారం( ఏప్రిల్ 17) రాత్రి నుంచే తమ సేవలను పూర్తిగా నిలిపివేయనుంది. రాత్రి 10:30కు అమృత్సర్ నుంచి ముంబై వెళ్లే ఫ్లైట్.. జెట్ ఎయిర్వేస్కు చివరి విమాన సర్వీస్ కానుంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. అదనపు నిధులకు సంబంధించి జెట్ ఎయిర్వేస్ విన్నపాన్ని బ్యాంకులు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక జెట్ఎయిర్వేస్ మూసివేత నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ అత్యవసరంగా రూ.400 కోట్లు ఇవ్వాలని ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియంను కోరిన విషయం తెలిసిందే. రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. ఈ తీవ్ర సంక్షోభంతో గత మూడు నెలలుగా ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ జీతాలు చెల్లించలేదు. ఇప్పటికే వారు నిరసన వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్వేస్ అంశంలో జోక్యం చేసుకుని, సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించాలని పైలెట్ల యూనియన్ ప్రధాని మోదీని కూడా అభ్యర్థించాయి. జెట్ఎయిర్వేస్ తాజా నిర్ణయంతో 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమైంది. ఆల్ఇండియా జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ఏప్రిల్ 18న మేనేజ్మెంట్తో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
జెట్ పరిస్థితికి కారణం కేంద్రమే అంటున్న మాల్యా
-
ఇది ఎయిర్లైన్ కర్మ
లండన్: ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త, విజయ్ మాల్యా(63) మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జెట్ ఎయిర్ వేస్ సంక్షోభానికి కేంద్రమే కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి మూసివేత దిశగా పయనిస్తున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పట్ల తన విచారం వ్యక్తంచేశారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, నీతా గోయల్కు తన సానుభూతిని ప్రకటించారు. ఒకప్పుడు కింగ్ఫిషర్కు జెట్ ఎయిర్వేస్ గట్టి పోటీ ఇచ్చింది. అంత పెద్ద ప్రయివేటు ఎయిర్లైన్ను ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరమంటూ విజయ్ మల్యా బుధవారం ట్వీట్ చేశారు. జెట్ పరిస్థితికి రప్రభుత్వమే కారణమంటూ ట్విటర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఒక పక్క ఎయిరిండియాను భారీ ప్యాకేజీ (రూ.35వేల కోట్లు)తో ఆదుకున్న ప్రభుత్వం ప్రయివేటు సంస్థలపై మాత్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. వ్యాపార పరంగా తాము ప్రత్యర్థులమే అయినప్పటికీ జెట్ ఎయిర్వేస్ కోసం ఎంతో కష్టపడ్డ గోయల్ దంపతులకు సానుభూతి. వారి సేవలకు నిజంగా దేశం గర్వపడాలి. కానీ దురదృష్టవశాత్తూ దేశీయంగా చాలా ఎయిర్లైన్స్ దెబ్బతింటున్నాయి. ఎందుకు అని మాల్యా ప్రశ్నించారు. అలాగే తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నానని, కానీ బ్యాంకులే తీసుకోవడం లేదంటూ మాల్యా మరోసారి ట్విటర్ వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు. 100శాతం చెల్లిస్తానన్నా నాపై నేర అభియోగాలు వేస్తున్నారు. ఇది ఎయిర్లైన్ కర్ మఅన్నారు. దీంతోపాటు లండన్లో ఉన్నా జైల్లో బ్యాంకులను బకాయిలు చెల్లిస్తానని మరోసారి హామీ ఇచ్చారు. Even though we were fierce competitors, my sympathies go out to Naresh and Neeta Goyal who built Jet Airways that India should be extremely proud of. Fine Airline providing vital connectivity and class service. Sad that so many Airlines have bitten the dust in India. Why ? — Vijay Mallya (@TheVijayMallya) April 16, 2019 I invested hugely into Kingfisher which rapidly grew to become India’s largest and most awarded airline. True, Kingfisher borrowed from PSU Banks as well. I have offered to pay back 100 percent but am being criminally charged instead. Airline Karma ? — Vijay Mallya (@TheVijayMallya) April 16, 2019 -
జెట్పై బ్యాంకుల కసరత్తు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్ ఎయిర్వేస్పై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకునేలా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జెట్ను పునరుద్ధరించేందుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇంకా ఏ ప్రణాళికా ఖరారు కాలేదు‘ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మరోవైపు, జెట్కు రుణాలిచ్చిన సంస్థల ప్రతినిధులు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్తో కూడా భేటీ అయ్యారు. రూ.8,000 కోట్ల పైగా రుణభారం ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కంపెనీ 123 ఎయిర్క్రాఫ్ట్లను నడపగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 5కు పడిపోయింది. సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్.. డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. రుణాలిచ్చిన బ్యాంకులు.. కంపెనీ యాజమాన్య అధికారాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. సంస్థకు అత్యవసరంగా రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూర్చేలా ప్రతిపాదనలు చేశాయి. 75 శాతం దాకా వాటాలను విక్రయించేందుకు బిడ్స్ కూడా ఆహ్వానించాయి. దీంతో కంపెనీలో వాటాలు దక్కించుకునేందుకు నరేష్ గోయల్ కూడా బిడ్ వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బిడ్డింగ్లో పాల్గొనరాదని ఆయన నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. సంక్షోభంపై కేంద్రం సమీక్ష... జెట్ ఎయిర్వేస్ సంక్షోభం, పెరుగుతున్న విమాన చార్జీలు, ఫ్లయిట్స్ రద్దు తదితర అంశాలపై సమీక్ష జరపాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రయాణీకుల భద్రత, హక్కులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సూచించారు. ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఆయన పోస్ట్ చేశారు. జెట్ వివాదంపై సమీక్షకు ఆదేశించినట్లు ప్రభు ప్రకటించడం వారం రోజుల్లో ఇది రెండోసారి. తక్షణ సాయం కోసం నిధులు అందించాలంటూ బ్యాంకులను జెట్ ఎయిర్వేస్ కోరినట్లు ఖరోలా తెలిపారు. సంస్థ ప్రస్తుతం అయిదు విమానాలు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 10 రూట్లలో చార్జీల తగ్గింపుపై డీజీసీఏ దృష్టి జెట్ ఎయిర్వేస్ ఫ్లయిట్స్ రద్దు నేపథ్యంలో చార్జీలను రోజువారీ సమీక్షించడం కొనసాగుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి తెలిపారు. అలాగే, సత్వరం తగు చర్యలు తీసుకునేందుకు ఎయిర్లైన్స్తో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు. ఎయిర్లైన్స్ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో .. రద్దీ ఎక్కువగా ఉండే 40 రూట్లలో చార్జీలు సమీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. పది రూట్లలో చార్జీలు 10–30 శాతం దాకా పెరిగాయని గుర్తించినట్లు .. వాటిని సముచిత స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎయిర్లైన్స్కు సూచించినట్లు ఖరోలా చెప్పారు. ఏప్రిల్ 18న విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రతినిధులతో పౌర విమానయాన శాఖ సమావేశం కానున్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. మంగళవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో సుమారు 8 శాతం మేర క్షీణించి రూ. 241.85 వద్ద క్లోజయ్యింది. -
సంక్షోభంలో జెట్ ఎయిర్వేస్
-
జెట్ ఎయిర్వేస్ మూతపడనుందా?
సాక్షి, ముంబై : జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో పాతాళానికి పడిపోయిన జెట్ ఎయిర్వేస్ కార్యకాలాపాలు మూడ పడనున్నాయని తెలుస్తోంది. మంగళవారం నాటి జెట్ ఎయిర్వేస్ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. ముంబైలో కొనసాగుతున్న బోర్డు సమావేశంలో ఆర్థిక సహాయం అందని కారణంగా జెట్ఎయిర్వేస్ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ షేర్ 18శాతం కుప్పకూలింది. మధ్యంతర నిధులను సమకూర్చేందుకు బ్యాంకుల మధ్య అంగీకారం కుదరలేదని ఈ రోజు సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు తెలిపింది. అలాగే సంస్థను గట్టెక్కించే నాధుడు ఇంకా వెలుగులోకి రాలేదు. జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు దాఖలు చేయాల్సిన గడువును మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు బిడ్డర్లు తమ బిడ్స్ సమర్పించుకోవచ్చని కంపెనీ తాజాగా వెల్లడించింది. అలాగే సంస్థ మాజీ ఫౌండర నరేష్ గోయల్ కొనుగోలు రేస్ నుంచి తప్పుకున్నారు. ఈ తాజా పరిణామాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఇది ఇలా వుంటే సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ పరిణామాలను పరిశీలిస్తోందని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు అంతర్జాతీయ సర్వీసులన్నింటిని సోమవారం దాగా రద్దు చేసుకున్న సంస్థ మరోసారి ఈ గడువును పొడిగించింది. ఏప్రిల్ 18వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ తాజాగా ప్రకటించింది. అంతేకాదు ఏప్రిల్ 18 వరకు జెట్ ఎయిర్వేస్కు ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఐవోసీ తెలిపింది. కాగా రూ. 3500 కోట్ల రుణ భారానికి తోడు, టికెట్ల కాన్సిలేషన్ ద్వారా ప్రయాణికులకు చెల్లించాల్సిన చార్జీల విలువ రూ.3500 కోట్లకు చేరింది. దీంతో జెట్ ఎయిర్వేస్ అప్పుల భారం మొత్తం రూ. 8500 కోట్లకు ఎగబాకింది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం 7 విమానాలను నడుపుతోంది. ఈ వార్తలు నిజమైతే 16వేలమంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిపోనుంది. Directed Secretary @MoCA_GoI to review issues related to Jet Airways, especially increasing fares, flight cancellations etc. Asked him to take necessary steps to protect passenger rights and safety; and to work with all stakeholders for their well being. — Chowkidar Suresh Prabhu (@sureshpprabhu) April 16, 2019 -
నిధులిచ్చి సంస్థను కాపాడండి!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్కు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కింద ఇస్తామన్న రూ.1,500 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జెట్ ఎయిర్వేస్ పైలట్ల సమాఖ్య నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ కోరింది. కంపెనీ మూతబడితే 20,000 పైచిలుకు సిబ్బంది రోడ్డున పడే ప్రమాదం ఉందని, వారిని ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది కూడా. ‘జెట్ కార్యకలాపాలు యథాప్రకారం సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్ల నిధులను విడుదల చేయాలని ఎస్బీఐని కోరుతున్నాం. అలాగే, 20,000 పైచిలుకు ఉద్యోగాలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాం’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) వైస్ ప్రెసిడెంట్ అదీమ్ వలియాని చెప్పారు. సోమవారమిక్కడ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమైన సందర్భంగా ఆయన విలేకరులతో ఈ విషయాలు చెప్పారు. సంక్షోభంలో ఉన్న సంస్థకు సంఘీభావం తెలిపేందుకు పైలట్లు, ఇంజనీర్లు, క్యాబిన్ సిబ్బంది తదితర ఉద్యోగులు కంపెనీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా బాకీ పడిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య అధికారాలను బ్యాంకుల కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకోవటం తెలిసిందే. కొత్త ఇన్వెస్టరు వచ్చే దాకా కంపెనీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్లు సమకూర్చేలా బ్యాంకులు ప్రతిపాదనలు చేశాయి. ఇప్పటిదాకా కేవలం రూ.300 కోట్లు.. అది కూడా విడతలవారీగా చిన్న మొత్తాల్లోనే ఇచ్చాయి. తాజాగా తక్షణం అత్యవసరంగా ఎంత ఇవ్వాలన్న దానిపై గత శుక్రవారం ఎయిర్లైన్ మేనేజ్మెంట్, ఎస్బీఐ మధ్య జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. బ్యాంకుల నిర్ణయం నేటికి వాయిదా.. జెట్కు అత్యవసరంగా నిధులు సమకూర్చే అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో కూడా బ్యాంకర్లు తగు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో మంగళవారం మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ సిబ్బందికి అంతర్గతంగా రాసిన లేఖలో జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే ఈ విషయాలు వెల్లడించారు. నిధులు అందుబాటులోకి రాకపోవడంతో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్ రద్దును ఏప్రిల్ 18 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ‘సోమవారం సమావేశంలో నిధుల విడుదల చేస్తారని ఆశించాం. అలా జరగకపోవడం నిరాశపర్చింది. మంగళవారం కూడా నిధులు అందకపోతే కంపెనీ కొనసాగే పరిస్థితులైతే కనిపించడం లేదు‘ అని పైలట్ల యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. -
నేటి నుంచి జెట్ పైలట్ల సమ్మె
ముంబై: జీతాల బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పైలట్లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉదయం 10 నుంచి విమానాలను నడపరాదని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 1,100 పైలట్లు ఇందులో పాల్గొనున్నట్లు పేర్కొన్నాయి. ‘మూడున్నర నెలలుగా మాకు జీతాలు అందడం లేదు. అందుకే ఏప్రిల్ 15 నుంచి విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకున్నాం. నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ)లోని మొత్తం 1,100 పైలట్లు సోమవారం ఉదయం 10.గంటల నుంచి విమానాలు నడపబోరు‘ అని ఎన్ఏజీ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే నిలిపివేయాలని ముందుగా భావించినప్పటికీ .. కొత్త యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఏప్రిల్ 15 దాకా వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నాయి. రూ. 8,000 కోట్ల పైగా రుణభారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ మేనేజ్మెంట్ బాధ్యతలను ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విదేశీ విమానాల రద్దు...: ఆగ్నేయాసియా ప్రాంతాలు, సార్క్ దేశాలకు నడిపే విమానాలను నిరవధికంగా రద్దు చేసినట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. అటు టొరంటో, ప్యారిస్, ఆమ్స్టర్డామ్, లండన్ హీత్రో వంటి ఇతర విదేశీ రూట్లలో సర్వీసుల నిలిపివేతను ఏప్రిల్ 16 దాకా (మంగళవారం) పొడిగించినట్లు జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. -
రోడ్డెక్కిన జెట్ ఎయిర్వేస్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ సంక్షోభంతో అనేక ఇబ్బందుల పాలవుతున్న ఉద్యోగులు పోరుబాట బట్టారు. తమకు జీతాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. పైలట్లతోపాటు ఫ్లైట్ అటెండర్స్, గ్రౌండ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఢిల్లీ విమానాశ్రాయం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సేవ్ జెట్ఎయిర్వేస్ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని కోరారు. సంస్థ భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేసిన పలువురు ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అటు దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ముంబైలో ప్రదర్శన నిర్వహించారు. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అటు విమానాలకు అద్దెబకాయిలు చెల్లించలేక ఇప్పటికే పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముఖ్యంగా సోమవారం దాకా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. -
జెట్ సంక్షోభం : మరో షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై : రుణ సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. పీటీఐ సమాచారం ప్రకారం శుక్రవారం మరో మూడు రోజుల పాటు అంటే ఏప్రిల్ 15, సోమవారం దాకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. ఇప్పటికే రెండు రోజులపాటు అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రిత్వ కార్యాలయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిశ్రాను కలవనున్నారు. జెట్ ఎయిర్వేస్ సమస్య, పరిష్కాలపై సమీక్షించనున్నారు. ఇది ఇలా ఉంటే తమకు జీవితాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జెట్ ఎయిర్వేస్ సిబ్బంది ఆందోళనకు దిగారు. దాదాపు 2వేల మంది ఉద్యోగులు ముంబైలో ర్యాలీ నిర్వహించారు. తక్షణమే తమకు జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం తమకు క్లారిటీ ఇవ్వాలని కోరారు. అంతేకాదు మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, సీఈవో వినోద్ దువే, యాజమాన్యంపై లేబర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. 25 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ దేశీయంగా కూడా 10 విమానాలను రద్దు చేసింది. దీంతో అద్దె బకాయిలు చెల్లించలేక నిలిపి వేసిన విమానాల సంఖ్య 79కి చేరింది. మరోవైపు అనూహ్యంగా జెట్ విమానాలను రద్దు చేయడంతో విమాన ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. కోలకతా, ముంబై విమానాశ్రయాల్లో టికెట్ల డబ్బులు రిఫండ్ కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అలాగే క్యాన్సిల్ అయిన టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణీకులు వాపోయారు. అసలు దీనిపై నిర్దిష్టమైన సమాచారం ఏదీ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జెట్ ఎయిర్వేస్లో నెలకొన్న సమస్యను పరిశీలించాల్సిందిగా సివిల్ ఏవియేషన్ మంత్రి సురేష్ ప్రభు నేడు (శుక్రవారం) పౌర విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ సమస్యను చక్కదిద్దాలంటూ సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ వాటాల కొనుగోలుకు బిడ్లకు సమర్పించేందుకు గడువు ఈ సాయంత్రంతో ముగిసింది. -
జెట్ సంక్షోభంపై స్పందించిన సురేష్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ జెట్ ఎయిర్వేస్లో సమస్యలను చక్కదిద్దేందుకు చొవర చూపాలని పౌర విమానయాన కార్యదర్శి ఖరోలాను ఆదేశిస్తూ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు సమస్యలు చుట్టుముట్టడంతో విమానాల సంఖ్యను, సేవలను తగ్గిస్తున్న జెట్ ఎయిర్వేస్ కేవలం 9 విమానాలనే నడుపుతోంది. జెట్ ఎయిర్వేస్ గురువారం తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. రోజంతా అంతర్జాతీయ సేవలను రద్దు చేసింది. జెట్ చర్యతో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. జెట్ ఇబ్బందులు ప్రస్తుతం ఏ స్ధాయిలో ఉన్నాయంటే విమాన సర్వీసులు రద్దవడంతో కేవలం ప్రయాణీకులకే సంస్థ రూ 3500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
మరింత సంక్షోభంలో జెట్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం మరింతగా ముదురుతోంది. తాజాగా లీజు అద్దెలు చెల్లించకపోవడంతో మరో 10 విమానాలు నిలిపివేయాల్సి వచ్చినట్లు సంస్థ గురువారం వెల్లడించింది. దీంతో ఇలా నిల్చిపోయిన విమానాల సంఖ్య 79కి చేరింది. అయినప్పటికీ కార్యకలాపాలు సజావుగా సాగించే క్రమంలో నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు జెట్ పేర్కొంది. మరోవైపు, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ 26 శాతం వాటాలను తనఖా పెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి జెట్ ఎయిర్వేస్ తీసుకున్న రుణాలకు గాను 2.95 శాతం షేర్లు (26.01 శాతం వాటాలు) ఏప్రిల్ 4న తనఖా ఉంచినట్లు కంపెనీ వెల్లడించింది. రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం బ్యాంకులు జెట్ ఎయిర్వేస్ను తమ చేతుల్లోకి తీసుకున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్ హోదా నుంచి గోయల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. విదేశీ సేవల కొనసాగింపుపై కేంద్రం దృష్టి.. జెట్ విమానాల సంఖ్య 14కి తగ్గిపోయిన నేపథ్యంలో అంతర్జాతీయ కార్యకలాపాలు కొనసాగించేందుకు సంబంధించి కంపెనీకి గల అర్హతలను ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశాలు ఉన్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. వాస్తవ పరిస్థితుల గురించి జెట్ నుంచి అన్ని వివరాలు సేకరించాలంటూ నియంత్రణ సంస్థ డీజీసీఏకు సూచించడం జరిగిందని, నివేదిక వచ్చాక తగు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ రూట్లలో విమానాలు నడపాలంటే దేశీ ఎయిర్లైన్స్కు కనీసం 20 విమానాలు ఉండాలి. జెట్ దగ్గర ఒకప్పుడు 123 పైచిలుకు విమానాలు ఉన్నప్పటికీ.. సంఖ్య ప్రస్తుతం 14కి తగ్గిపోయింది. రుణభారం దాదాపు రూ. 8,000 కోట్ల మేర పేరుకుపోయింది. వాటాల రేసులో నరేష్ గోయల్ కూడా.. జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలు రేసులో మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కూడా పోటీపడనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన కూడా బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వివరించాయి. ఇందుకు నిబంధనలు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపాయి. నరేష్ గోయల్ సహా ఎవరైనా సరే బ్యాంకుల కన్సార్షియం విక్రయిస్తున్న వాటాల కొనుగోలుకు పోటీపడొచ్చంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్ గోయల్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో గోయల్ కూడా పోటీలో ఉంటారన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్లో 31–75% దాకా వాటాలు విక్రయిస్తున్న బ్యాంకుల కన్సార్షియం బిడ్స్ దాఖలుకు గడువును ఏప్రిల్ 12కి పొడిగించింది. ఈశాన్య రాష్ట్రాలకు సేవలు నిలిపివేత.. మరోవైపు, తూర్పు, ఈశాన్య భారతంలోని ప్రాంతాలకు జెట్ సర్వీసులు నిలిపివేసినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీంతో కోల్కతా, పాట్నా, గౌహతి తదితర ప్రాంతాలకు జెట్ విమానసేవలు ఆగిపోయాయని పేర్కొన్నాయి. నిర్వహణపరమైన కారణాలతో కోల్కతా–గౌహతి, ముంబై–కోల్కతా, డెహ్రాడూన్–గౌహతి (వయా కోల్కతా) మధ్య సేవలను శుక్రవారం (ఏప్రిల్ 12న) నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ వివరణనిచ్చింది. అలాగే ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి లండన్, ఆమ్స్టర్డామ్, ప్యారిస్కు ఏప్రిల్ 12న నడపాల్సిన విమాన సేవలను నిర్వహణపరమైన కారణాల వల్ల నిలిపివేస్తున్నట్లు జెట్ వర్గాలు తెలిపాయి. -
రెండు రోజులు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతూ విమాన సర్వీసులను నిలిపివేస్తున్న జెట్ ఎయిర్వేస్ తాజాగా మరోషాకింగ్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు( ఏప్రిల్ 11,12) అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆమ్స్టర్డాం, ప్యారిస్, లండన్కు సర్వీసులను నిలిపి వేసింది. నిధుల లేమి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి తోడు లీజు చెల్లించలేక మరో 10 విమానాలను రద్దు చేస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ గురువారం బీఎస్ఈ ఫైలింగ్లో ప్రకటించింది. దీంతో బకాయిలు చెల్లించలేక నిలిచిపోయిన విమానాల సంఖ్య మొత్తం 79 కి చేరింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను అటు ప్రభుత్వం, ఇటు డీజీసీఏ పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలంటే ఎయిర్లైన్స్ కనీసం 20 విమానాలను కలిగి వుండాలి. అయితే గత నెలనుంచి కేవలం14 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇది అంతర్జాతీయ కార్యకలాపాలను నిలిపి వేయడానికి దారి తీయనుంది. ఒకవైపు జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగుతుండగానే, తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్వేస్ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్టు దారుణంగా తయారవుతోంది. -
జెట్ ఎయిర్వేస్ సాగాలో న్యూ ట్విస్ట్
సాక్షి,ముంబై : జెట్ ఎయిర్వేస్ సాగాలో సరికొత్త ట్విస్ట్ వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మాజీ ప్రమోటర్, గత నెలలో చైర్మన్గా తప్పుకున్న నరేష్ గోయల్ ఎయిర్లైన్స్లో వాటాను తిరిగి దక్కించు కోవాలని యోచిస్తున్నారట. జెట్లో వాటాల కొనుగోలుకు ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి కనబర్చని నేపథ్యంలో ఆయన నిర్దిష్టమైన రోడ్మ్యాప్తో సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బిడ్ను దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం రుణపరిష్కారప్రనాళికను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వెస్లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించారు. అయితే దీనికి పెద్దగా స్పందన లభించకపోవడంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్లైన్ను పొడిగించింది. బిడ్లనును సమర్పించే గడువును ఏప్రిల్ 12వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ క్యాపిటల్ ప్రకటించింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్నఎతిహాడ్, జెట్ ఎయిర్ వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్ వాటాల ఒక కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. దాదాపు ప్రతి రోజు ఎస్బీఐ అధికారులతో సమావేశమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా అప్పుల సంక్షోభంతో కుప్పకూలుతున్న జెట్ ఎయిర్వేస్కు కష్టాలు వెన్నంటుతున్నాయి. తీవ్ర నిధుల కొరత, రుణాల భారంతో పాటు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్ధితిలో జెట్ ఎయిర్వేస్ అష్ట కష్టాలు పడుతోంది. బాకీలు కట్టలేందంటూ ఎయిర్వేస్కు ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఇంధన సరఫరాను నిలిపివేసింది. తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించే ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ను స్థాపించి విజయపథంలో పరుగులు పెట్టించిన ఛైర్మన్ నరేష్ గోయల్ చివరికి అనివార్య పరిస్థితుల్లో కంపెనీ బోర్డు నుంచి సతీమణి అనితా గోయల్తోపాటు వైదొలగిన సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ను కొనేవారే లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక వైపు తమ వేతన బకాయిలు చెల్లించకపోతే విధులను హాజరుకామని తేల్చి చెప్పిన పైలట్లు తాజాగా జెట్ ఎయిర్వేస్కు లీగల్ నోటీసులిచ్చారు. వేతన బకాయిలను ఈనెల 14 లోగా అందించాలని డిమాండ్ చేస్తూ, జెట్ ఎయిర్వేస్ నూతన యాజమాన్యానికి పైలట్ల సంఘం (నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్-నాగ్) లీగల్ నోటీస్ జారీ చేసింది. సంస్థ యాజమాన్యం బ్యాంకుల చేతికి వచ్చినా, పరిస్థితిలో మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేసిన నాగ్ సంస్థ సీఈవో వివేక్ దుబేకు ఈ నోటీసులు పంపించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతన బకాయిలు ఈ నెల 14 నాటికి జీతాలుచెల్లించాలని, అలాగే ఇకపై ప్రతినెలా 1వ తేదీ కల్లా వేతనాలు అందించాలని కోరుతూ నూతన యాజమాన్యానికి నాగ్ నోటీసులిచ్చింది. మరోవైపు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) మరోసారి ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వారంలో ఇది రెండవ సారి. అలాగే జెట్ఎయిర్వేస్లోని వాటాలను విక్రయించేందుకు ఎస్బ్యాంకు బిడ్లను ఆహ్వానించింది. ఇప్పటివరకు ఈ వాటాలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తిని కనబర్చక పోవడంతో గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. జెట్ ఎయిర్వేస్లోని సుమారు 75శాతం వాటాల కొనుగోలుకు బిడ్లను స్వీకరించే గడువును ఏప్రిల్12వ తేదీ శుక్రవారం వరకు పొడిగించామని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ప్రకటించింది. ఇది ఇలా వుంటే నెదర్ల్యాండ్స్ ఆమ్స్టర్డాంలోని చిపోల్ విమానాశ్రయంలో జెట్ ఎయిర్వేస్ విమానాన్ని నిలిపిశారు. బకాయిలు చెల్లించని కారణంగానే ముంబైకు చెందిన జెట్ విమానాన్ని దాదాపు ఆరు గంటలపాటు ఎయిర్పోర్టులో నిలిపివేశారు. ఈ ఘటనపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణా కారణాల వల్ల జెట్ విమానం 9డబ్ల్యు 231 ఆలస్యంమైందని, ప్రయాణీకుల సౌకర్యార్థం సంబంధిత చర్యలు తీసుకున్నామంటూ వివరణ ఇచ్చింది. -
జెట్ విక్రయం టేకాఫ్!!
ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ), ఆర్థిక ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐ) నుంచి బిడ్స్ను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదన ప్రకారం .. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి కనిష్టంగా 3.54 కోట్ల షేర్లు (సుమారు 31.2 శాతం వాటాలు) నుంచి గరిష్టంగా 8.51 కోట్ల దాకా షేర్లను (75 శాతం వాటాలు) విక్రయించే అవకాశం ఉంది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేది ఏప్రిల్ 10. అర్హత పొందిన బిడ్డర్లు ఏప్రిల్ 30లోగా తుది బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థ ఈ బిడ్డింగ్ నిర్వహణలో తోడ్పాటు అందించనుంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ గత కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో విఫలమవుతోంది. సిబ్బంది జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేక సతమతమవుతోంది. పలు విమానాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఎయిర్లైన్ నియంత్రణను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. మార్చి 25న జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. సంస్థలో మెజారిటీ వాటాలు బ్యాంకుల చేతికి వచ్చాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రమోటరు నరేష్ గోయల్, ఆయన భార్య జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నిష్క్రమించారు. సంస్థలో వారి వాటా గతంలో ఉన్న 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఇక, జెట్ కుప్పకూలకుండా యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించేందుకు బ్యాంకులు సుమారు రూ. 1,500 కోట్లు సమకూర్చనున్నాయి. ప్రకటన సారాంశం.. ఎస్బీఐ కన్సార్షియం ప్రకటన ప్రకారం.. జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణాలను పొందింది. తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ విక్రయం చేపట్టడం జరిగింది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) రూపకల్పన, సమర్పణకు సంబంధించిన అన్ని వ్యయాలను బిడ్డర్సే భరించాల్సి ఉంటుందని ప్రకటన పేర్కొంది. దేశ, విదేశాల్లో ఇదే తరహా రంగాల్లో అనుభవమున్న కార్పొరేట్లు వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ) కేటగిరీ కింద బిడ్స్ వేయొచ్చు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మొదలైన వాటిని ఎఫ్ఐల కేటగిరీ కింద వర్గీకరించారు. ఎస్ఐలకు ఏవియేషన్ వ్యాపారంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కన్సార్షియంగా ఏర్పడి బిడ్స్ వేసిన పక్షంలో .. అందులో ముగ్గురు సభ్యులకు మించి ఉండకూడదు. కన్సార్షియంలో ఒక్కొక్కరి వాటా 15 శాతానికి పైబడే ఉండాలి. ఆరు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి.. జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలుపై ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వంటి వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో పాటు కేకేఆర్, బ్లాక్స్టోన్, టీపీజీ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ కన్సార్షియం ఇప్పటికే జెట్ ఎయిర్వేస్లో వాటాల విక్రయంపై టాటా గ్రూప్, టీపీజీ క్యాపిటల్ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపింది. సోమవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు 3% పెరిగి రూ. 264.10 వద్ద క్లోజయ్యింది. -
జెట్ సంక్షోభం : బిడ్లకు ఆహ్వానం
అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ పరిస్థితి రోజు రోజుకు మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. జెట్ ఎయిర్వేస్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, వీలైనంత త్వరగా సంస్థ నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది. వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు బ్యాంకుల కన్సార్షియానికి నాయకత్వం వహిస్తున్న ఎస్బీఐ సోమవారం వెల్లడించింది. ఈ బిడ్లను దాఖలు చేసేందుకు ఏప్రిల్ 10న చివరి తేదీగా పేర్కొంది. బిడ్డర్లలో స్ట్రాటజిక్, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు ఏవియేషన్ సెక్టారుకు చెందినవారు అయి ఉండాలని నిబంధన విధించారు. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా ఈక్విటీ ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజర్లను బిడ్ వేసేందుకు ఆహ్వానిస్తోంది. కాగా బ్యాంకులకు జెట్ ఎయిర్ వేస్ నుంచి మొత్తం రూ.8000 కోట్ల బకాయాలు తిరిగి రావాల్సి ఉంది. ఈ అప్పులను 26 బ్యాంకులు ఈక్విటీగా మార్చుకోవడంతో బ్యాంకుల వాటా 51 శాతానికి చేరింది. అలాగే జెట్ ఎయిర్వేస్ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్, ఇతర సభ్యుల వాటా 51 శాతం\ నుంచి 25 శాతానికి తగ్గింది. అయితే ఆ మొత్తాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చి ఆసక్తి ఉన్న బిడ్డర్లకు అప్పగించాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. ఇప్పటికే కన్సార్షియం కనీసం 3.54 కోట్ల షేర్లను ఆఫర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అంటే మొత్తం వాటాలో ఇది 31.2 శాతంతో సమానం. జెట్ ఎయిర్వేస్ రుణ పరిష్కారానికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 180 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్కు ఐవోసీ షాక్
సాక్షి,ముంబై : సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అద్దె బకాయిలు చెల్లించలేక పలు విమాన సర్వీసులను రద్దు చేసింది మరోవైపు జీతాలు చెల్లించడంలో విఫలం కావడంతో జీతాలివ్వకపోతే విధులకు రాలేమని పైలట్లు తేల్చిపారేశారు. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిర్లైన్ మీద మరో బాంబు వేసింది. బకాయిలు చెల్లించని కారణంగా ఇకపై ఇంధన సరఫరా చేయబోమని శుక్రవారం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద మీద తాటిపండులా అయిపోయింది జెట్ ఎయిర్వేస్ పరిస్థితి. కాగా రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నజెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. దీంత మొత్తం 69 విమానాలను నిలిపివేసి నట్టయింది. దాదాపు 16 వేల మంది సిబ్బందికి మార్చి నెల వేతనాలు బకాయి పడిన సంగతి తెలిసిందే. -
‘జెట్’లో జోక్యం చేసుకోం
న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్మెంట్కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది. బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్ జెట్ ఎయిర్వేస్కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి. ఎగురుతున్నది 28 విమానాలే.. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. మార్చి జీతాలు వాయిదా .. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. షేరు 5 శాతం డౌన్.. విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. -
వేతనాలపై జెట్ ఎయిర్వేస్ మెలిక
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ వేతన చెల్లింపులపై చేతులెత్తేసింది. డిసెంబర్ వరకూ ఉన్న వేతన బకాయిలే చెల్లిస్తామని స్పష్టం చేసింది. వేతన బకాయిలను పూర్తిగా పరిష్కరించకుంటే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలను నిలిపివేస్తామని పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఇంజనీర్లు, సీనియర్ సిబ్బంది సహా పైలట్లకు నాలుగు నెలల నుంచి వేతన చెల్లింపు నిలిచిపోయింది. మార్చి 31 నాటికి బకాయిలు చెల్లించడంతో పాటు రానున్న మాసాల్లో వేతన చెల్లింపులపై రోడ్మ్యాప్ ప్రకటించని పక్షంలో విమానాలను ఎగరనీయమని సిబ్బంది అల్టిమేటం జారీ చేశారు. ఇక డిసెంబర్ వేతనంలోనే 87.50 శాతం బకాయిని చెల్లించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం ఇంతవరకే చెల్లిస్తామని, సంస్థను గాడిలో పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది డిమాండ్ను నెరవేర్చేందుకు ఆశించిన సమయం కంటే మరికొంత సమయం పడుతుందని జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు వాటా కల్పించేందుకు సంస్థ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య అనిత బోర్డు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. -
కొత్త ఇన్వెస్టర్ రూ.4,500 కోట్లు తేవాలి
న్యూఢిల్లీ: నిధుల కటకటతో బ్యాంకుల అధీనంలోకి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు కొత్త ఇన్వెస్టర్ కనీసం రూ.4,500 కోట్లను తీసుకురావాల్సి ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని 26 బ్యాంకుల కమిటీ వచ్చే నెలలో జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చక్కని సంస్థ అని, ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి ఉన్నట్టు రజనీష్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించి, ఏప్రిల్ 30 నాటికి బిడ్లను ఆహ్వానించాలన్నది బ్యాంకుల ప్రణాళిక. ‘‘ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్లైన్ లేదా నరేష్ గోయల్ లేదా ఎతిహాద్ ఎవరైనా కావొచ్చు. ఎయిర్లైన్ను సొంతం చేసుకునేందుకు ఎవరినీ నిషేధించలేదు’’ అని రజనీష్ కుమార్ అన్నారు. జీతాలు ఇవ్వండి బాస్.. పెండింగ్లో ఉన్న తమ జీతాలను వెంటనే ఇప్పించాలంటూ జెట్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ను కోరింది. జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ ఒకటి నుంచి సేవలను నిలిపివేస్తామని 1,100 మంది ఉద్యోగులతో కూడిన ఈ సంఘం హెచ్చరించడం గమనార్హం. జెట్ ఎయిర్వేస్కు రూ.1,500 కోట్ల అత్యవసర లిక్విడిటీని అందించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల నుంచి నూతన యాజమాన్యానికి విన్నపాలు పెరిగినట్లు తెలుస్తోంది. -
కింగ్ఫిషర్ను కూల్చారు.. జెట్ను గట్టెక్కిస్తున్నారు
న్యూఢిల్లీ: మాజీ లిక్కర్ కింగ్, వ్యాపారవేత్త విజయ్మాల్యా బ్యాంకుల ద్వంద్వ ప్రమాణాలపై మండిపడ్డారు. ఒకప్పుడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నిర్దాక్షిణ్యంగా విఫలమయ్యేందుకు కారణమైన బ్యాంకులు... ఇప్పుడు అదే విధమైన పరిస్థితిలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను మాత్రం ఒడ్డెక్కిస్తున్నాయని ఎత్తిచూపారు. సమస్యల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ను ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ తన నియంత్రణలోకి తీసుకోవడంపై వరుస ట్వీట్లతో మాల్యా తన స్పందన తెలియజేశారు. కింగ్ఫిషర్ విషయంలోనూ ఇదే జరగాల్సి ఉందన్నారు. ‘‘పీఎస్యూ బ్యాంకులు జెట్ఎయిర్వేస్కు బెయిలవుట్ కల్పించడం, ఉద్యోగాలను, సేవల కనెక్టివిటీని కాపాడడం చూడ్డానికి ఆనందంగా ఉంది. ఇవే పీఎస్యూ బ్యాంకులు భారత్లోనే అత్యుత్తమమైన ఎయిర్లైన్ (కింగ్ఫిషర్), మెరుగైన ఉద్యోగులు, అనుసంధానత ఉన్న దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశాయి’’ అని మాల్యా ట్వీట్ చేశారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను నిలబెట్టేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించలేదని, బదులుగా అన్ని ద్వారాలను మూసేశారని ఆక్షేపించారు. కంపెనీని, ఉద్యోగులను కాపాడేందుకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో తాను రూ.4,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసినట్టు మాల్యా చెప్పారు. జెట్ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విషయంలో భిన్న విధానాన్ని అనుసరించడం పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారును విమర్శించారు. ‘‘నాటి ప్రధాని మన్మోహన్సింగ్కు నేను రాసిన లేఖలను బీజేపీ అధికార ప్రతినిధి అనర్గళంగా చదువుతారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో పీఎస్ యూ బ్యాంకులు అక్రమంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సహకరించాయని చెబుతారు. మరి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఏం మారిపోయిందన్నది ఆసక్తి కలిగిస్తోంది’’ అని మాల్యా విమర్శించారు. నా డబ్బులు తీసుకోండి... ‘‘పీఎస్యూ బ్యాంకులు, ఇతర రుణదాతలకు చెల్లించేందుకు గాను కర్ణాటక హైకోర్టు ముందు నా లిక్విడ్ ఆస్తులను (వెంటనే నగదుగా మార్చుకునేవి) ఉంచాను. వాటిని తీసుకోవాలని మరోసారి అభ్యర్థిస్తున్నాను. బ్యాంకులు నా డబ్బులను ఎందుకు తీసుకోవడం లేదు? జెట్ఎయిర్వేస్ను కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయి’’ అని తన ట్వీట్లో మాల్యా పేర్కొన్నారు. బ్యాంకులకు మాల్యా రూ.9,000 కోట్లకు పైగా రుణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. బ్రిటన్లో ఉన్న ఆయన్ను భారత్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించలేక, అదే సమయంలో కార్యకాలాపాల నిర్వహణకు నిధుల్లేక మునిగిపోయే పరిస్థితికి చేరిన జెట్ ఎయిర్వేస్ను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ ఓ పరిష్కార ప్రణాళికను రూపొందించిన విషయం గమనార్హం. బ్యాంకులు తమ రుణాలను జెట్ఎయిర్వేస్లో వాటాల కింద మార్చుకుని తమ అధీనంలోకి తీసుకునేందుకు నిర్ణయించాయి. -
బ్యాంకులకు మాల్యా బంపర్ ఆఫర్
ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా జెట్ ఎయిర్వేస్ వివాదంపై స్పందించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను, ఉద్యోగులను కాపాడేందుకు తన డబ్బులను తీసుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికైనా దీనిపై బ్యాంకులు పునరాలోచించాలని కోరాడు. దీంతోపాటు సంక్షోభంలో ఉన్న తన పట్ల డబుల్ స్టాండర్డ్స్ని అవలంబిస్తోందంటూ మంగళవారం ట్విటర్లో వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాడు. అలాగే సంస్థను ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను రక్షించేందుకు ప్రభుత్వం రంగ బ్యాంకులు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించడంపై మాల్యా సంతోషం వ్యక్తం చేశాడు. కానీ ఇదే తన విషయంలో కూడా జరిగి వుంటే బావుండేదంటూ వాపోయాడు. బీజేపీ ప్రభుత్వం లోని ప్రభుత్వ బ్యాంకులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆరోపిస్తూ మాల్యా వరుస ట్వీట్లు చేశాడు. దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ కింగ్ ఫిషర్, దాని ఉద్యోగులు, వ్యాపారం నిర్దాక్షిణ్యంగా కూలిపోతోంటే ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని ట్వీట్ చేశాడు. సంక్షోభంలో ఉన్న కింగ్ఫిషర్ సంస్థను, సంస్థ ఉద్యోగులను కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టానని మాల్యా చెప్పుకొచ్చాడు. దీన్ని గుర్తించకుండా తనను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నాడు. అలాగే తన లిక్విడ్ ఆస్తులను తీసుకోవాలని గౌరవనీయమైన కర్నాటక హైకోర్టు ముందు ఇప్పటికే తన ప్రతిపాదనను ఉంచానని కానీ ప్రభుత్వ బ్యాంకులు, ఇతర రుణ దాతలు ఎందుకు సమ్మతించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్ ఎయిర్వేస్ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు. జెట్ ఎయిర్వేస్ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎదుర్కొంది. దివాలా కారణంగా కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది. దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్లో కేసు విచారణను ఎదుర్కొంటుండగా గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని మాల్యా ఆస్తుల ఎటాచ్మెంట్కు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జులై 10న జరగనున్నాయి. కాగా జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు ఛైర్మన్ నరేష్ గోయల్ ఎట్టకేలకు సోమవారం (మార్చి 25) న దిగి వచ్చారు. ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో రుణదాతలు 1500 కోట్ల రూపాయల బెయిల్ అవుట్ ప్యాకేజీకి అంగీకరించిన సంగతి తెలిసిందే. (చదవండి : గోయల్.. ‘జెట్’ దిగెన్!) Happy to see that PSU Banks have bailed out Jet Airways saving jobs, connectivity and enterprise. Only wish the same was done for Kingfisher. — Vijay Mallya (@TheVijayMallya) March 25, 2019 And I repeat once again that I have placed liquid assets before the Hon’ble Karnataka High Court to pay off the PSU Banks and all other creditors. Why do the Banks not take my money. It will help them to save Jet Airways if nothing else. — Vijay Mallya (@TheVijayMallya) March 26, 2019 -
గోయల్.. ‘జెట్’ దిగెన్!
ముంబై: కొన్ని నెలలుగా కొనసాగుతున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి పరిష్కారం దొరికింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి, కంపెనీ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితాగోయల్ తప్పుకున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికలో భాగమే ఇది. ఈ ప్రణాళికకు సోమవారం అత్యవసరంగా సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదం తెలిపింది. మధ్యంతర నిధుల సాయం పొందడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం విదితమే. నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్ పీజేఎస్సీ నామినీ డైరెక్టర్ కెవిన్ నైట్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి వైదొలిగారు. కంపెనీలో ఎతిహాద్కు 24 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. డెట్ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణకు మధ్యంతర మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా జెట్ ఎయిర్వేస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మెకెన్సీ అండ్ కో సహకారంతో బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణ కింద ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రమోటర్లకు చెందిన ఇద్దరు నామినీలు, ఎతిహాద్ ఎయిర్వేస్ తరఫున ఒక నామినీ జెట్ ఎయిర్వేస్ బోర్డులో కొనసాగుతారని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఉద్యోగుల్లో ఆందోళన మరోవైపు జనవరి నుంచి ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ వేతనాలను చెల్లించడం లేదు. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా కేవలం 12.5 శాతం వేతనాలనే చెల్లించింది. దీంతో పైలట్లు, ఇంజనీర్లు, ఇతర కీలక విధుల్లోని ఉద్యోగులు ఇతర విమానయాన సంస్థల్లో ఉపాధి వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. ‘‘మాకు కూడా ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. ఎయిర్లైన్ ఒక్కసారిగా కుప్పకూలితే ఏమవుతుందన్న భయం ఉంది. మా బకాయిలు మార్చి 31 నాటికి చెల్లించాలి. అలాగే, మా కంపెనీకి సంబంధించి రోడ్మ్యాప్ సిద్ధం కావాలి’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వలైని పేర్కొన్నారు. విషాద దినం: అజయ్సింగ్ దేశ విమానయాన రంగానికి ఇదొక విషాద దినంగా స్పైస్జెట్ చీఫ్ అజయ్సింగ్ వ్యాఖ్యానించారు. నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాల్సి రావడంతో అజయ్సింగ్ ఇలా స్పందించారు. ప్రపంచస్థాయి ఎయిర్లైన్ సంస్థను ప్రారంభించి నరేష్ గోయల్, అనితా గోయల్ భారత్ గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. విమానయాన సంస్థలను పోటీ పడలేకుండా చేస్తున్న నిర్మాణాత్మక సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు విధాన నిర్ణేతలకు ఇదొక మేల్కొలుపుగా అభివర్ణించారు. వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. షేరు పరుగు... గోయల్ వైదొలగిన వార్తలతో జెట్ షేరు 17 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈలో చివరికి 12.69 శాతం లాభంతో రూ.254.50 వద్ద స్థిరపడింది. బ్యాంకుల నిర్ణయం పట్ల జైట్లీ సంతోషం న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకులు తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులు స్వప్రయోజనాలతోపాటు, ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకున్నట్టు చెప్పారు. ‘‘మరిన్ని విమానాలు, ఎయిర్లైన్స్ భారత్కు అవసరం. లేదంటే చార్జీలు పెరిగిపోతాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ కార్యకలాపాలు కొనసాగే విధంగా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడే అవి తమ బకాయిలను వసూలు చేసుకోగలవు. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని జైట్లీ పేర్కొన్నారు. మే నాటికి కొనుగోలుదారుల ఖరారు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులను మే చివరి నాటికి ఖరారు చేస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రమోటర్ అయిన నరేష్ గోయల్ సైతం త్వరలో జరిగే బిడ్డింగ్లో పాల్గొనేందుకు అర్హులేనని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఈక్విటీగా మార్చడం వల్ల జెట్ ఎయిర్వేస్లో... ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులకు 51 శాతం వాటా ఉండనుంటే, నరేష్ గోయల్ వాటా ప్రస్తుత 50 శాతం నుంచి 25 శాతానికి దిగొస్తుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. జెట్ ఎయిర్వేస్ విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మే 31 నాటికే ఇది ముగుస్తుందన్న ఆశాభావాన్ని రజనీష్ కుమార్ వ్యక్తం చేశారు. ‘‘ఎవరు రావాలన్నా జెట్ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 నాటికి బిడ్డింగ్ ముగుస్తుంది. మే నాటికి ఇన్వెస్టర్ను ఖరారు చేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్లైన్.. నరేష్ గోయల్ అయినా లేదా ఎతిహాద్ అయినా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. బిడ్డింగ్కు ఎవరికీ నిషేధం లేదని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడడమే: గోయల్ జెట్లో పనిచేసే 22,000 మంది ఉద్యోగుల కుటుంబ ప్రయోజనాల కంటే తనకు ఏదీ పెద్ద త్యాగం కాదని కంపెనీ చైర్మన్, బోర్డు నుంచి తప్పుకున్న నరేష్ గోయల్ వ్యాఖ్యానించారు. 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్వేస్ను స్థాపించినది నరేష్ గోయల్. 1992 నుంచి కంపెనీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ‘‘నా కుటుంబంలోని 22,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యల కోసమే జెట్ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబం నాతో, నా వెనుకనే ఉన్నది. మీరు కూడా నా నిర్ణయానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలు జెట్ బోర్డు నుంచి తప్పుకున్న నేపథ్యంలో తమ ప్రయాణం ముగిసిపోలేదని, నూతన అధ్యాయం ఇప్పుడే మొదలైందన్నారు గోయల్. రుణ పునర్నిర్మాణ ప్రణాళిక ఆమోదంతో జెట్ బలమైన, స్థిరమైన ఆర్థిక మూలాలపై నిలబడుతుందన్న ఆశాభావాన్ని 22,000 మంది ఉద్యో గులకు రాసిన లేఖలో గోయల్ వ్యక్తం చేశారు. సంస్థకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. -
జెట్ బోర్డు నుంచి వైదొలగిన నరేష్ గోయల్
ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి చైర్మన్ నరేష్ గోయల్, ఆయన భార్య తప్పుకున్నారు. జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన భార్య అనిత్ గోయల్, పూర్తికాల డైరెక్టర్ గౌరంగ్ షెట్టి, నసీం జైదీ తప్పుకోవాలని బోర్డు సూచించింది. ఇందుకు ప్రతిగా అత్యవసర నిధి కింద రూ 1500 కోట్లు సమీకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ నిధులను జెట్ ఎయిర్వేస్కు అందచేస్తుంది. గోయల్ బృందం బోర్డు నుంచి వైదొలగడంతో వారంలోగా జెట్ ఎయిర్వేస్కు అత్యవసర సాయం అందించేందుకు బ్యాంకుల కన్సార్షియం ముందుకొచ్చిందని ఎయిర్లైన్ వర్గాలు తెలిపాయి. కాగా దివాలా చట్టానికి అనుగుణంగా ప్రక్రియను చేపట్టడం కంటే రుణదాతలకు, కంపెనీకి మధ్య సంప్రదింపులు జరగడమే మేలని సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్లో గోయల్ వాటా 51 శాతం నుంచి 25.5 శాతానికి, ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 12 శాతానికి తగ్గుతుందని, బ్యాంకులకు 50.5 శాతం వాటాతో కంపెనీపై నియంత్రణ లభించేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్ దివాళా తీయకుండా కాపాడేందుకు ఎయిర్లైన్ను కాపాడాలని ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. కాగా మూడు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించడం లేదని జెట్ ఎయిర్వేస్ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది, పైలట్లు ఆందోళన చేపడుతున్నారు. ఏప్రిల్ 1లోపు పెండింగ్ వేతన బకాయిలను పరిష్కరించకపోతే అదే రోజు నుంచి సేవలు నిలిపివేస్తామని పైలట్లు హెచ్చరించారు. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం : కీలక పరిణామం
సాక్షి, ముంబై : ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. సంస్థ ఫౌండర్, ప్రధాన ప్రమోటర్ నరేష్ గోయల్ సంస్థనుంచి వైదొలగే అవకాశం ఉందని తెలుస్తోంది. నరేష్ గోయల్తోపాటు ఆయన భార్య అనితా గోయల్ కూడా బోర్డుకు రాజీనామా చేయనున్నారని తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. జెట్ఎయిర్వేస్ సంక్షోభంపై చర్చించేందుకు బోర్డు ఈ రోజు సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో ఒక కొత్త తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. తద్వారా నరేష్ గోయల్ సొంతమైన 51 శాతం వాటాను కన్సా ర్షియం సొంతం చేసుకుంటుంది. కొత్త కొనుగోలుదదారుకోసం అన్వేషించనుంది. అలాగే ఎస్బీఐ మాజీ ఛైర్మన్ మాజీ సీవీసీ కమిషనర్ జానకి వల్లభ్ను జెట్ ఎయిర్వేస్ బోర్డులోకి ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న నరేష గోయల్ అక్కడినుంచే 23వేల ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం. ఈ వార్తలు వాస్తవరూపం దాలిస్తే దాదాపు పాతికేళ్లపాటు సంస్థను విజయపధంలో నడిపించిన నరేష్ గోయల్ ప్రస్థానం ముగియనుంది. మరోవైపు ఇప్పటికే పలువురు సీనియర్ ఉన్నతాధికారులు సంస్థను వీడగా, వేతన బకాయిలు చెల్లించకపోతే తాము కూడా రాజీనామా బాట పట్టక తప్పదని పైలట్లు హెచ్చరించారు. అటు అద్దె బకాయిలు చెల్లించలేక , పైలట్లులేక రోజు రోజుకు జెట్ ఎయిర్వేస్ రద్దవుతున్న విమానాల సంఖ్య పెరుగుతోంది. కాగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్ మరింత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నేతృత్వంలో భారీ రుణాలిచ్చిన బ్యాంకులు సంస్థను గట్టెక్కించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలన సంస్థ మళ్లీ గాడిలో పడాలంటే నరేష్ గోయల్, ఆయన భార్య , మరో ఇద్దరు డైరెక్టర్లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సూచించిన సంగతి తెలిసిందే. -
13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్ ఎయిర్వేస్
సాక్షి, న్యూఢిల్లీ: నిధుల కొరత కారణంగా గత కొన్ని రోజులుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ 13 అంతర్జాతీయ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఏప్రిల్ చివరి వరకు పలు అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది. బెంగుళూరు-సింగపూర్, ఢిల్లీ-అబుదాబీ, ఢిల్లీ-డామన్, ఢిల్లీ-ఢాకా, డిల్లీ-హంగ్కాంగ్,ఢిల్లీ-రియాద్, కోల్కతా-ఢాకా, ముంబై-అబుదాబీ, ముంబై-బహ్రేన్, ముంబాయి-డామన్, ముంబై-హంగ్కాంగ్, పూణే-అబుదాబీ, పూణే-సింగపూర్ మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఢిల్లీ-బ్యాంకాక్ మార్గాల్లో సర్వీసులను 3 నుంచి ఒకటికి తగ్గించగా, ఢిల్లీ-ఖాట్మాండు (4 నుంచి 2), ఢిల్లీ-సింగపూర్ (3 నుంచి 1), ముంబయి-బ్యాంకాక్(3 నుంచి1), ముంబాయి-దోహా(2 నుంచి 1), ముంబాయి-కువైట్ నగరం(2 నుంచి 1), ముంబాయి-సింగపూర్ (3 నుంచి1)కి తగ్గించుకుంది. తాజా సమాచారం మేరకు జెట్ ఎయిర్వేస్ రూ. 8వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఇవే కాకుండా అమ్మకందారులకు రూ.15 వేల కోట్ల మేర బకాయి పడింది. స్టాక్ మార్కెట్లోనూ జెట్ ఎయిర్వేస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. -
13 రూట్లలో విమాన సర్వీసులు రద్దు
సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలు, రుణ భారంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రయివేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. విమానాలకు అద్దెలు చెల్లించలేక, పైలెట్లకు జీతాలు చెల్లించలేక పలు విమానాల రద్దు చేసుకుంటూ వస్తోంది. తాజా 13 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను రద్దు చేసింది. ఏప్రిల్ చివరివరకు ఈ నిర్ణయం అమలవుతుందని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అద్దె బకాయిలు చెల్లించలేక మరో 7 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రద్దు చేసిన విమానాల సంఖ్య 54కు చేరింది. ఇప్పటికే ముంబై -ఢిల్లీ మధ్య విమానాల సర్వీసులను కూడా బాగా తగ్గించింది. అలాగే ముంబై -మాంచెస్టర్ మధ్య సర్వీసులను ఇప్పటికే రద్దు చేసుకుంది. కాగా జీతాలు చెల్లించకుంటే వచ్చేనెలనుంచి విధులకు హాజరుకామని ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించారు. జీతాల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. మరోవైపు వందలాది మంది పైలెట్లు ఉద్యోగాలకోసం ఇతర విమానయాన సంస్థలను ఆశ్రయించిన సంగతి విదితమే. -
‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’
ముంబై : మేం కూడా సాధరణ మనుషులమే. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి గురవుతాం. కానీ ఒక్కసారి కాక్పిట్లో ప్రవేశించామంటే.. అన్ని సమస్యలను పక్కన పెట్టేస్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన వారిగా మిగిలిపోవాల్సి వస్తుందంటున్నారు జెట్ ఎయిర్వేస్ సీనియర్ కమాండర్ ఒకరు. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక సంక్షభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. ఈ విషయం గురించి గత 20 ఏళ్లుగా జెట్ ఎయిర్వేస్ సంస్థలో బోయింగ్ 7777 కమాండర్గా పనిచేస్తున్న కరణ్ చోప్రా మాట్లాడుతూ.. ‘మేం కూడా అందరి లాంటి వాళ్లమే. నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇల్లు గడవడం కోసం మా అమ్మ నగలను కుదవపెట్టాను. ఆర్థిక ఇబ్బందులు మనిషిని ఎంత కుంగదీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒత్తిడిని మేం కాక్పిట్ బయటే వదిలేసి వెళ్తాం. అలా చేయకపోతే ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసిన వారిగా మిగులుతాం’ అని తెలిపారు. అంతేకాక మిగితా ఉద్యోగాలతో పోలిస్తే.. దీనికి చాలా ఏకాగ్రత, ప్రశాంతమైన మనసు అవసరం అని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 1 లోగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోయినా.. జీతాలు ఇవ్వకపోయిన నిరవధిక సమ్మెకు దిగుతాం అని తెలిపారు. మరో సీనియర్ కమాండర్ మాట్లాడుతూ.. ‘ఒక వేళ జెట్ ఎయిర్వేస్ ఈ సంక్షభం నుంచి బయటపడకపోతే.. దాదాపు 1500 మంది ఉద్యోగులు వీధిన పడాల్సి వస్తుంది. ప్రసుత్తం మార్కెట్లో ఇన్ని ఖాళీలు కూడా లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎవరి మీద నిందలు వేయడం సరికాదు’ అని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతూ వస్తోంది. చాలా వరకు విమానాలను నడపకుండా నిలిపివేసింది. వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం అవుతోంది. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్వేస్ కూడా జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పుకోవాలని చూస్తోంది. -
ప్రధానికి జెట్ ఎయిర్వేస్ పైలట్ల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలలుగా పెండింగ్లో ఉన్న తమ వేతనాలను చెల్లించాలని యాజమాన్యానికి సూచించాలని కోరుతూ జెట్ ఎయిర్వేస్ పైలట్లు ప్రధాని నరేంద్ర మోదీ, పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభులకు గురువారం లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ దివాళా అంచున ఉందని, ఈ సంస్థ ఉనికిని కోల్పోతే వేలాది మంది ఉద్యోగులు వీధినపడతారని తాము ఆందోళన చెందుతున్నామని జెట్ ఎయిర్వేస్ పైలట్లతో కూడిన ట్రేడ్ యూనియన్ సంస్థ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) పేర్కొంది. మార్చి 31లోగా తమ వేతనాలను పూర్తిగా చెల్లించకుంటే ఏప్రిల్ 1 నుంచి విధులకు దూరంగా ఉంటామని, విమాన సేవలను నిలిపివేస్తామని వారు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా తమకు సంస్థ జీతాల చెల్లింపులను నిలిపివేసిందని, జీతాలు చెల్లించాలంటూ తాము పలుమార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రధానికి రాసిన లేఖలో పైలట్లు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలతో పాటు రోజువారీ చెల్లింపులనూ చేపట్టలేక చేతులెత్తేసింది. పలు విమాన సర్వీసులను జెట్ ఎయిర్వేస్ నిలిపివేయడంతో విమాన ప్రయాణీకలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు బ్యాంకులు తమ రుణాలను వాటాలుగా మార్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు అనుగుణంగా బ్యాంకులు బెయిలవుట్ ప్యాకేజ్కు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. -
జెట్కు బ్యాంకుల బాసట
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్ కుప్పకూలకుండా చూసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేనేజ్మెంట్ మార్పు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మేనేజ్మెంట్తో కంపెనీ నిర్వహణ సాధ్యపడే అవకాశాలు లేనందున.. జెట్ ఎయిర్వేస్ను పునరుద్ధరించేందుకు బ్యాంకులు రూపొందించిన ప్రణాళికలో యాజమాన్య మార్పు ప్రతిపాదన ఉండొచ్చని వివరించారు. దివాలా కోడ్ పరిష్కారం కాదు.. జెట్ ఎయిర్వేస్ పరిస్థితుల గురించి ప్రభుత్వానికి వివరించేందుకే జైట్లీతో భేటీ అయినట్లు సమావేశం అనంతరం రజనీష్ కుమార్ చెప్పారు. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికపై బ్యాంకులు గత అయిదు నెలలుగా కసరత్తు చేస్తున్నాయని, ఇది దాదాపు సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. సర్వీసుల రంగంలో ఉన్న జెట్ లాంటి కంపెనీ నుంచి బకాయిలు రాబట్టుకునేందుకు దివాలా కోడ్ను తక్షణం ప్రయోగించడం పరిష్కారం కాదని, ఇది ఆఖరు అస్త్రం మాత్రమే కాగలదని కుమార్ చెప్పారు. ‘ఐబీసీని ప్రయోగించడమంటే కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడమే. అయితే, ఇంకా పరిస్థితి చేయి దాటిపోలేదనే మేం భావిస్తున్నాం. కాబట్టి జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. వీటిని.. ఒక వ్యక్తినో లేదా ప్రమోటరునో కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా భావించనక్కర్లేదు. బ్యాంకుల, దేశ, ఏవియేషన్ రంగ ప్రయోజనాలను కాపాడేందుకు జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే పునరుద్ధరణ ప్రణాళిక గురించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. జెట్ లో కొత్తగా మరో వాటాదారును తెస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. సంస్థలో 24% వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్ వాటి విక్రయం కోసం ఎస్బీఐ ని సంప్రతించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్లో ప్రమోటరు నరేష్ గోయల్కు 51% వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 8,200 కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు నాటికి కంపెనీ రూ. 1,700 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంది. 119 విమానాలకు గాను.. ప్రస్తుతం కేవలం 41 ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే నడుపుతోంది. జీతాలు బకాయిపడటంతో అటు ఉద్యోగులూ ఆందోళనకు దిగబోతున్నారు. తక్షణం జీతాలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమానసేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల యూనియన్ హెచ్చరించింది. కంపెనీ గానీ మూతబడితే దాదాపు 23,000 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. స్లాట్స్ను వేరే సంస్థలకు కేటాయించడంపై దృష్టి.. జెట్ ఎయిర్వేస్ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో నిరుపయోగంగా ఉంటున్న ఆ సంస్థ స్లాట్స్ను తాత్కాలికంగా ఇతర దేశీ ఎయిర్లైన్స్కు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించి వివిధ ఎయిర్లైన్స్ ప్రతినిధులతో కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సమావేశమయ్యారు. ఎయిరిండియా, స్పైస్జెట్, గోఎయిర్, ఇండిగో ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్ని స్లాట్స్ ఉపయోగిస్తోంది, ఎన్ని అవసరం ఉందన్న దానిపై జెట్ ఎయిర్వేస్తో చర్చించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. రద్దీ సీజన్లో ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చూడాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రధానికి పైలట్ల లేఖ.. జీతాల బకాయిల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్ఏజీ) తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసింది. 7 నెలలుగా కంపెనీ జీతాలను సక్రమంగా చెల్లించడం లేదని.. దీంతో పైలట్లు, ఇంజనీర్లు తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొంది. ‘జెట్ ఎయిర్వేస్ పతనం అంచున ఉందన్న భయాలు నెలకొన్నాయి. అదే జరిగితే వేల మంది సిబ్బంది ఉపాధి కోల్పోతారు. విమానాలు అందుబాటులో లేకపోవడం వల్ల చార్జీలు పెరిగిపోతాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని వివరించింది. ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నందున.. భద్రతా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వివరించింది. మార్చి నెలాఖరులోగా జీతాల బకాయిలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలు పూర్తిగా ఆపేస్తామంటూ పైలట్లు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. జెట్ విమానాలపై స్పైస్జెట్ కన్ను.. మరోవైపు జెట్ ఎయిర్వేస్ కష్టాలు పోటీ సంస్థ స్పైస్జెట్కు వరంగా మారుతున్నాయి. పలు జెట్ ఫ్లయిట్స్ రద్దవుతుండటంతో.. ప్రయాణికులు స్పైస్జెట్ వైపు మళ్లుతారన్న అంచనాలతో ఆ సంస్థ షేరు బుధవారం పెరిగింది. జెట్ ఎయిర్వేస్కి చెందిన పలు విమానాలు నిల్చిపోవడంతో వాటిలో కొన్నింటిని తీసుకోవాలని పోటీ సంస్థ స్పైస్జెట్ యోచిస్తోంది. ఇటీవల నిషేధం వేటుపడిన బోయింగ్ 737 మ్యాక్స్ రకం 12 విమానాలను పక్కనపెట్టాల్సి రావడంతో స్పైస్జెట్ విమానాల కొరత ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే జెట్ ఎయిర్వేస్ విమానాలను తీసుకోవడంపై దృష్టి సారించింది. అటు జెట్ ఎయిర్వేస్ గానీ దివాలా తీస్తే.. తమ విమానాలు భారత్లోనే చిక్కుబడిపోతాయన్న భయంతో లీజుకిచ్చిన సంస్థలు (లెస్సర్లు) కూడా స్పైస్జెట్ వెంటపడుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 50 ఎయిర్క్రాఫ్ట్లను స్పైస్జెట్కు లెస్సర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. -
జనం సొమ్ముతో ఆ కంపెనీని ఆదుకుంటారా..?
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులకు సూచిస్తూ ప్రజల సొమ్మును ప్రైవేట్ ఎయిర్లైన్కు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కేంద్రం కోరుతున్న సంగతి తెలిసిందే. దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బెయిలవుట్ ప్రతిపాదనన పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రూ 8500 కోట్ల రుణాన్ని వాటాలుగా మలుచుకోవాలని ప్రధాని సూచించడంతో సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్లో ఆయా బ్యాంకులకు 50 శాతం వాటా దక్కుతుందని సుర్జీవాలా పేర్కొన్నారు. దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ వంటి కార్పొరేట్ సంస్థకు బెయిలవుట్ ప్యాకేజ్ ఇచ్చేందుకు మోదీ సర్కార్ ఎందుకు తొందరపడుతోందని ఆయన ప్రశ్నించారు. రుణభారంతో సతమతమవుతున్న రైతులను విస్మరించి విదేశీ ఇన్వెస్టర్ల నియంత్రణలో ఉన్న ఈ కంపెనీని ప్రజల సొమ్ముతో ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ప్రజల ధనానికి రక్షకులు మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు వాటంతటవే తీసుకోలేవని సుర్జీవాలా చెప్పారు. -
జెట్ ఎయిర్వేస్ షేరు ఢమాల్
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ఎయిర్ షేర్లు బుధవారం ట్రేడింగ్లో ఢమాల్ అంది. బీఎస్ఈలో ఎయిర్వేస్ షేర్లు రూ.215.70ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. దాదాపు 6శాతం నష్టంతో రూ.215 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ప్రస్తుతం 5శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల కూరుకుపోయిన కంపెనీ నుంచి వైదొలగించేందుకు తన భాగస్వామ్య సంస్థ ఎతిహాత్ ప్రయత్నాలు చేస్తుంది. జెట్ ప్రివిలెజ్ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఆఫర్ చేసినట్లు సమాచారం. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు ఎస్బీఐకి ఎతిహాద్ ఆఫర్ చేసినట్లు మంగళవారం వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా నేడు జెట్ ఎయిర్వేస్ ధర గత ముగింపు(రూ.229) తో పోలిస్తే దాదాపు 6శాతం నష్టంతో రూ.215 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గుచూపడంతో షేరు 7శాతం నష్టపోయి రూ.213.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:40ని.లకు షేరు గత ముగింపు(రూ.229.05) ధరతో పోలిస్తే షేరు ధర 5శాతం నష్టపోయి రూ.217.50ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00 రూ.708.15లుగా నమోదయ్యాయి. -
జెట్ ఎయిర్వేస్లో సంక్షోభం
ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ కూడా ఏదో ఒక ధరకు వాటాలు విక్రయించేసి తప్పుకునే ప్రయత్నాల్లో ఉంది. షేరు ఒక్కింటికి రూ. 150 చొప్పున జెట్లో తమకున్న 24 శాతం వాటాలను రూ. 400 కోట్లకు అమ్మేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే జెట్ ఎయిర్వేస్ విలువ రూ. 1,800 కోట్లుగా ఉండనుంది. దీంతో పాటు .. జెట్ ప్రివిలెజ్ వ్యాపార విభాగంలో తనకున్న 50.1 శాతం వాటాలను కూడా ఎస్బీఐకి ఎతిహాద్ ఆఫర్ చేసింది. ఒకవేళ అదే జరిగితే.. ఇప్పటికే రుణాల చెల్లింపుల్లో ఢీఫాల్ట్ అవుతున్న జెట్ పరిస్థితి మరింత జటిలంగా మారనుంది. దాదాపు రూ. 8,200 కోట్ల మేర రుణభారంలో ఉన్న జెట్ ఈ నెలాఖరు కల్లా రూ. 1,700 కోట్లు చెల్లించాల్సి ఉంది. భారీగా రుణభారంతో దివాలా తీసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని జెట్ ఎయిర్వేస్ తలపిస్తుండటం గమనార్హం. పైలట్లు, ఇంజినీర్ల హెచ్చరికలు.. మరోవైపు, జీతాల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతుండటంతో పైలట్లు సైతం పోరు బాట పట్టనున్నారు. మార్చి 31లోగా పరిష్కార ప్రణాళికపై స్పష్టతనిచ్చి, తమ జీతాల బకాయిలను చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విమాన సేవలు నిలిపివేస్తామంటూ పైలట్ల సంఘం నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) హెచ్చరించింది. అటు, జెట్ విమానాల నిర్వహణ ఇంజనీర్ల సంఘం (జేఏఎంఈడబ్ల్యూఏ) కూడా తమ జీతాల విషయంలో జోక్యం చేసుకుని, బకాయిలు ఇప్పించాలంటూ డీజీసీఏకి ఈ–మెయిల్ పంపింది. మూడు నెలలుగా జీతాలు రాకపోతుండటంతో ఆర్థిక సమస్యలతో తమపై మానసికంగా ఒత్తిడి పెరిగిపోతోందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఇది మరింత తీవ్రమైతే ఫ్లయిట్ భద్రతకు ప్రమాదమని తెలిపారు. వందకు పైగా విమానాల నిర్వహణ కోసం జెట్ ఎయిర్వేస్లో సుమారు 560 మంది ఇంజనీర్లు ఉన్నారు. అటు మొత్తం 119 విమానాల్లో జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం 41 విమానాలతో దేశీయంగా 603, విదేశీ రూట్లలో 382 ఫ్లయిట్స్ నడుపుతోందని డీజీసీఏ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గొచ్చని మంగళవారం జెట్ యాజమాన్యంతో సమావేశం అనంతరం డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులను విధుల్లోకి పంపొద్దని జెట్కు సూచించినట్లు వివరించాయి. కేంద్రం సమీక్ష.. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జెట్ ఎయిర్వేస్కు నిధులు సమకూర్చి, దివాలా తీయకుండా చూడాలంటూ బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. ఎన్నికల వేళ జెట్ ఎయిర్వేస్ గానీ దివాలా తీస్తే.. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడటం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావిస్తోందని సంబ ంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాన వాటాదారులు (వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్) గానీ మరిన్ని వాటాలను తనఖా ఉంచిన పక్షంలో బ్యాంకులు మరికొంత మేర రుణాలిచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గడిచిన ఏడాదికాలంగా జెట్ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు బ్యాంకుల నుంచి సమాచారం తెలుసుకుంటూనే ఉందని వివరించాయి. జెట్లో నరేష్ గోయల్, ఆయన కుటుంబానికి 52%, ఎతిహాద్కు 24 శాతం వాటాలు ఉన్నాయి. రుణాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొంత రుణాన్ని బ్యాంకులు ఈక్విటీ వాటాల కింద మార్చుకునే ప్రతిపాదనకు జెట్ బోర్డు గత నెల ఆమోదముద్ర వేసింది. దీంతో జెట్ ఎయిర్వేస్లో బ్యాంకులే అతిపెద్ద వాటాదారుగా మారనున్నాయి. ఇక, రుణభారం, ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ పెద్ద స్థాయిలో ఫ్లయిట్స్ను రద్దు చేస్తుండటంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు దృష్టి సారించారు. ఫ్లయిట్స్ రద్దు, అడ్వాన్స్ బుకింగ్స్, రీఫండ్స్, భద్రతాపరమైన అంశాలు మొదలైన వాటన్నింటినీ సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించాలని పౌర విమానయాన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి కూడా నివేదిక తీసుకోవాలని సూచించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయాలు తెలిపారు. -
‘ఏప్రిల్ 1 నుంచి ఆ విమానాలు బంద్’
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు మరో సవాల్ ముంచుకొచ్చింది. ఈ మాసాంతంలోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు. సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపులపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్ 1 నుంచి తాము విధులకు హాజరుకాబోమని గిల్డ్ స్పష్టం చేసింది. వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్ గిల్డ్ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్కు లేఖ రాసింది. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంపై అత్యవసర భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులను నిలిపివేయడంతో పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని యాజమాన్యంతో మంగళవారం జరిపిన అత్యవసర భేటీలో డీజీసీఏ ఆదేశించింది. మరోవైపు జెట్ ఎయిర్వేస్లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. నగదు లభ్యత కొరవడటంతో సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొద్ది నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో వారి మానసిక స్థైర్యం దెబ్బతిని సంస్థ విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. విమాన సర్వీసుల్లో కోత విధించే క్రమంలో జెట్ ఎయిర్వేస్ ఈ దిశగా సంకేతాలు పంపుతోంది. జెట్ ఎయిర్వేస్ చేతులెత్తేయడంతో వేతనాలపై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. మార్చి నాటికి వేతనాలను క్లియర్ చేస్తామని తమకిచ్చిన హామీ నెరవేరకపోవడంతో కంపెనీ పట్ల విశ్వాసం సన్నగిల్లిందని జెట్ ఎయిర్వేస్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)కు రాసిన లేఖలో పేర్కొంది. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా జోక్యం చేసుకోవాలని డీజీసీఏను కోరింది. జెట్ ఎయిర్వేస్లో దాదాపు 560 మంది మెయింటెనెన్స్ ఇంజనీర్లు పనిచేస్తుండగా 490 మంది ఇంజనీర్లు ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకూ తమకు కంపెనీ మూడు నెలల జీతాలు బకాయి ఉందని ఇంజనీర్ల అసోసియేషన్ డీజీసీఏకు పంపిన ఈ మెయిల్లో పేర్కొంది. అత్యవసర భేటీ.. జెట్ ఎయిర్లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణీకులకు నెలకొన్న అసౌకర్యం నేపథ్యంలో అత్యవసర భేటీని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో డీజీసీఏ సంస్థ యాజమాన్యంతో సమావేశమైంది. విమాన సర్వీసుల రద్దు, క్యాన్సిలేషన్, రిఫండ్ల వివరాలతో పాటు సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం, బ్యాంకర్లకు బకాయిలు వంటి పలు అంశాలపై యాజమాన్యంతో ఈ భేటీలో విస్తృతంగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సంక్షోభం సమసేలా.. ప్రైవేట్ ఎయిర్లైనర్ జెట్ ఎయిర్వేస్ దివాళా బారిన పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులను కాపాడే క్రమంలో ప్రభుత్వం బ్యాంకర్లను చొరవ చూపాలని సూచించింది. బ్యాంకులకు కంపెనీ బకాయి పడిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని దివాళా గండం నుంచి గట్టెక్కించాలని బ్యాంకులను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. కాగా, జెట్ ఎయిర్వేస్ను తిరిగిగాడిలో పెట్టే ప్రణాళికలను సైతం ఆయా బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కీలక పరిణామం
సాక్షి, ముంబై: బిలియన్ డాలర్ల అప్పులు, రుణ బాధలు, నిధుల లేమి, కనీసం పైలట్లకు జీతాలు కూడా చెల్లించలేని సంక్షోభంలో ఉన్న దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ నుంచి చక్కదిద్దే కసరత్తుగా భాగంగా కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్ సంస్థనుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం 51శాతం వాటా కలిగిన ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా గోయల్ తప్పుకునేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నష్టాలతో కునారిల్లుతూ, నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్కు వాటా దారైన ఇతిహాద్ ఎయిర్లైన్స్ బెయిల్అవుట్ ప్యాకేజీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో గోయల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు విమానయాన సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుయంటూ ఇప్పటికే వార్తలు బిజినెస్ వర్గాల్లో వ్యాపించాయి. ఇతిహాద్కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్లో 24శాతం వాటా ఉండగా, మరో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు నివేదించాయి కూడా.. ఈ డీల్ ఓకే అయితే ఇతిహాద్ వాటా మరింత పెరగనుంది. అటు ఫౌండర్ నరేష్ గోయేల్ వాటాలు 20శాతానికి పడిపోతాయి. అలాగే రూ. 3000 కోట్ల రుణాలు అందించడానికి రుణదాతలు ముందుకొచ్చాయని సమాచారం. అయితే తాజా పరిణామంపై జెట్ ఎయిర్వేస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. రాబోయే కాలంలో మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతోందని సిబ్బంది సహనంగా ఉండాలని పేర్కొన్నారు. కంపెనీ నిలదొక్కుకునే ముందు కొన్ని ఇబ్బందులు తప్పవని, కానీ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు, నిబద్ధతతో సమిష్టి కృషితో భవిష్యత్తులో బలమైన సంస్థగా నిలబడతామనే ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్కు అతిపెద్ద రుణదాతగా ఉన్న స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియా ఇతర బ్యాంకులు, ఛైర్మన్ నరేష్ గోయల్, ఇతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఒక అత్యవసర భేటీని ఏర్పాటు చేసింది. అనంతరం జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందంటూ పిబ్రవరి 25న, కొంతమంది ముఖ్య వాటాదారులతో కలిసి ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాగా అద్దెలు చెల్లించలేక ఇటీవల 6బోయింగ్ 737 విమానాలను, 15 ఇతర విమానాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్ వేస్ రుణ బాధలనుండి బయట పడే అవకాశం ఉందని అంచనా. -
ఉద్రిక్తతల ఎఫెక్ట్ : పలు విమానాలు రద్దు
దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గగనతల ఉద్రికత్తలు, కఠిన నిబంధనలతో పలు విమాన సంస్థలు ఇప్పటికే అనేక సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి. సివిల్ ఎయిర్ ట్రాఫిక్ కారణంగా జెట్ ఎయిర్వేస్, గోఎయిర్, ఇండిగో, స్పైస్ జెట్ పలు సర్వీసులను రద్దు చేశాయి. శ్రీనగర్, అమృత్సర్, డెహ్రాడూన్, జమ్మూ, చండీగఢ్, ఇతర విమానాశ్రయాల మూసివేత కారణంగా తాత్కాలికంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ పరిణామాలకనుగుణంగా ప్రయాణికులు వ్యవహరించాలని విజ్ఙప్తి చేశాయి. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించకుండానే తమ రిజర్వేషన్లను అప్డేట్ చేసుకోవచ్చని గోఎయిర్ ప్రకటించింది. ఇందుకు టోల్ ఫ్రీ నెంబరు 18602 100 999ను ట్వీట్ చేసింది. #9WUpdate As per instructions from Delhi ATC regarding airport closure, flight operations to/from Amritsar, Srinagar, Jammu & Leh have been suspended until further notice. We request our guests check their flight status before proceeding to the airport https://t.co/q3TCmCPN0Q— Jet Airways (@jetairways) February 27, 2019#6ETravelAdvisory : Due to airspace closure, flights to and from Srinagar, Jammu, Chandigarh, Amritsar and Dehradun have been temporarily suspended. To opt for cancellations or alternate options click on Plan B https://t.co/ofwzjniT1l— IndiGo (@IndiGo6E) February 27, 2019#Update: Due to airspace restriction, flights to/from Dehradun (DED) & Jaisalmer (JSA) are affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/VkU7yLjrw0.— SpiceJet (@flyspicejet) February 27, 2019 -
సంక్షోభం నుంచి బయటపడేందుకు జెట్ కసరత్తు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్వేస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకులు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేసేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రణాళిక అమలు ద్వారా మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని ధీమా వ్యక్తం చేసింది. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ , సంస్థలో వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్ సీఈవో టోనీ డగ్లస్ సోమవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక సంక్షోభం, రుణభార సమస్యలు ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్.. నిధుల సమీకరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రుణాలను ఈక్విటీ కింద మార్చే ప్రతిపాదనకు గత వారం సంస్థ షేర్హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. మరోవైపు, జెట్ ఎయిర్వేస్ నుంచి బాకీలు రాబట్టుకునే అంశంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఎస్బీఐ సోమవారం తెలిపింది. -
జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్?
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్ దాఖలు చేయాలని ఎస్బీఐ యోచిస్తోందని సమాచారం. నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్ అల్లాడుతున్న విషయం తెలిసిందే. రుణ పునర్వ్యవస్థీకరణకు, రుణాలను ఈక్విటీగా మార్చడానికి తదితర మరికొన్న ప్రతిపాదనలకు వాటాదారులు ఈ నెల 21న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)ఇటీవలే ఆమోదం తెలిపారు. మరోవైపు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంక్ల కన్సార్షియమ్ జెట్ ఎయిర్వేస్కు రూ.500 కోట్ల మేర నిధులను కూడా మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది(ఈ విషయమై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది). ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ విషయమై ఎస్బీఐ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎస్బీఐ గానీ, జెట్ ఎయిర్వేస్ కానీ అధికారికంగా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కాగా ఈ నెల 21న జరిగిన ఈజీఎమ్లో వివిధ ప్రతిపాదనలపై ఓటింగ్కు ఇతిహాద్ కంపెనీ దూరంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జెట్ ఎయిర్వేస్లో ఇతిహాద్ ఎయిర్వేస్కు 24% వాటా ఉంది. ఎస్బీఐ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్)ల నుంచి మరిన్ని అదనపు నిధులు, ఈక్విటీ కేటాయింపు తదితర అంశాలపై మరింత స్పష్టత కోసం జెట్ ఎయిర్వేస్ వేచి చూస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జెట్ ఎయిర్వేస్లో ఎస్బీఐ, ఎన్ఐఐఎఫ్లు 51% వాటా తీసుకోవాలని, దీని కోసం ఈ రెండు సంస్థలు రూ.2,200 కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఇతిహాద్ కోరుకుంటోందని ఆ వర్గాలు వెల్లడించా యి. తాము ఇచ్చిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు రుణాలిచ్చిన కంపెనీపై ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్ను దాఖలు చేస్తా యి. దీనికి ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపితే సదరు సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
సగం ధరకే విమాన టికెట్లు
సాక్షి, ముంబై : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటురంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరోసారి డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 50శాతం దాకా డిస్కౌంట్ అందిస్తోంది. దాదాపు సగం ధరకే టిక్కెట్ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం, ఎకానమి క్లాస్ సీట్లకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు ఈ నెల 21 నుంచి, దేశీయ ప్రయాణికులు మార్చి1 నుంచి ప్రయాణం చేయవచ్చునని వెల్లడించింది. అలాగే ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
జెట్ రుణ సంక్షోభానికి తెర!
ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు ఈ రుణ పరిష్కార ప్రణాళికను రూపొందించినట్టు జెట్ ఎయిర్వేస్ తెలియజేసింది. తాజా ఈక్విటీ రూపంలో నిధులు అందించడం, ఇప్పటికే ఇచ్చిన రుణాలను పునరుద్ధరించడం, ఆస్తుల విక్రయం వంటివి ఈ ప్రణాళికలో భాగం. ఈ చర్యల అనంతరం బ్యాంకులో అతిపెద్ద వాటాదారులు రుణ దాతలే అవుతారు. రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చడం కింద... రూ.10 ముఖ విలువ కలిగిన 11.40 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. కాకపోతే పుస్తక విలువ ప్రతికూలంగా ఉన్నందున ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం షేరు ముఖ విలువను రూ.1 కింద పరిగణనలోకి తీసుకుంటారు. జెట్ ఎయిర్వేస్ సుమారు రూ.8,500 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ఇందులో వచ్చే మార్చి నాటికే తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూ.1,700 కోట్లు. తన పనితీరు మెరుగుపరుచుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడం, నెట్వర్క్, సేవలకు సంబంధించిన వ్యాపార నమూనాలో మార్పుల వంటి చర్యలు కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ పరిష్కార ప్రణాళికకు ఈ నెల 21న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదాన్ని కంపెనీ కోరనుంది. నష్టాలు రూ.732 కోట్లు జెట్ ఎయిర్వేస్కి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.588 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.165 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఇంధన వ్యయాలు అధికంగా ఉండటం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఈ క్యూ3లో భారీగా నష్టాలు వచ్చాయని వివరించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే, గత క్యూ3లో రూ.186 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.732 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,148 కోట్లు.... కంపెనీ ఆదాయం రూ.6,086 కోట్ల నుంచి రూ.6,148 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సైతం రూ.6,043 కోట్ల నుంచి రూ.6,786 కోట్లకు పెరిగాయి. గత క్యూ3లో రూ.2,749 కోట్లుగా ఉన్న దేశీయ ఆదాయం ఈ క్యూ3లో రూ.2,560 కోట్లకు తగ్గిందని, అంతర్జాతీయ ఆదాయం కూడా రూ.3,337 కోట్ల నుంచి రూ.3,588 కోట్లకు తగ్గిందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేర్ 1 శాతం లాభంతో రూ.225 వద్ద ముగిసింది. -
జెట్ ఎయిర్వేస్ రిపబ్లిక్ డే సేల్
సాక్షి,ముంబై : భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లను సగం ధరకే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడు రోజుల సేల్లో పరిమిత కాలం ఆఫర్గా అందిస్తున్న 50 శాతం వరకూ డిస్కౌంట్ ఇరువైపుల ప్రయాణానికి వర్తిస్తుందని తెలిపింది. ప్రీమియం, ఎకానమీ క్లాసుల్లో కూడా ఈ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. జనవరి 30వరకూ ఈ ఆఫర్లో అందుబాటులో ఉండనుంది. మస్కట్, షార్జా తప్ప గల్ఫ్లోని అన్ని దేశాలతోపాటు బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్, ఖాట్మాండు, కొలంబో, ఢాకా వెళ్లే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా ప్రాతిపదికన ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. -
చేతులెత్తేసిన జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: కొన్ని త్రైమాసికాలుగా భారీ నష్టాలను చవిచూస్తూ... ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి సైతం ఇబ్బందులు పడుతున్న జెట్ ఎయిర్వేస్కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. తీసుకున్న రుణాలకు వాయిదాలను చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ఎస్బీఐ ఆధ్వర్యంలోని దేశీయ బ్యాంకుల కన్సార్షియానికి రుణంలో అసలును, వడ్డీని కలిపి డిసెంబరు 31న చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేకపోయింది. తాత్కాలిక నగదు ప్రవాహాల్లో తారతమ్యాలే దీనికి కారణమని జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్సే్ఛంజ్లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. రుణ చెల్లింపులకు సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ ఖాతాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్బీఐ ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించింది. వరుసగా గత మూడు త్రైమాసికాలుగా జెట్ఎయిర్వేస్ రూ.1,000 కోట్లకుపైగా నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కొంత మంది ఉద్యోగులను తొలగించింది. లాభదాయకం కాని మార్గాల్లో సర్వీసులను కూడా నిలిపివేసింది. కాగా, మూలధన అవసరాల కోసం, కొన్ని రకాల చెల్లింపులకు రూ.1,500 కోట్ల మేర స్వల్పకాలిక రుణం తీసుకునే ప్రయత్నాలను సంస్థ ప్రారంభించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. రేటింగ్ తగ్గింపు జెట్ఎయిర్వేస్ దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సదుపాయాల రేటింగ్ను తగ్గిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా బుధవారం ప్రకటించింది. ‘‘యాజమాన్యం నుంచి లిక్విడిటీ పెంపు చర్యల అమలులో జాప్యం నెలకొంది. దీంతో లిక్విడిటీ సమస్య తీవ్రతరం అయింది. కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, విమానాల అద్దె చెల్లింపులనూ ఆలస్యం చేస్తోంది’’అని ఇక్రా తన నిర్ణయం వెనుక కారణాలను తెలియజేసింది. జెట్ ఎయిర్వేస్ 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు రూ.1,700 కోట్ల మేర, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,444 కోట్లు, రూ.2020–21లో రూ.2,167 కోట్ల మేర బకాయిలను తీర్చాల్సి ఉందని ఇక్రా తెలియజేసింది. షేరుకు అమ్మకాల ఒత్తిడి జెట్ ఎయిర్వేస్ రుణ చెల్లింపుల్లో విఫలమైందన్న సమాచారం బయటకు రావడంతో... కంపెనీ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈలో 6 శాతానికి పైగా నష్టపోయి రూ.263.75 వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈలో 7 శాతం వరకు నష్టపోయింది. -
ఎయిర్లైన్స్ న్యూ ఇయర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. చమురు ధరల భారంతో నష్టాలతో నెట్టుకొస్తున్నప్పటికీ, పోటీ పరంగా ఎయిర్లైన్స్ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. నవంబర్ నెలలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 11.03 శాతం పెరిగింది. 116.45 లక్షల మంది ప్రయాణికులు ఈ నెల్లో విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఈ వృద్ధి రేటు గత నాలుగేళ్ల కాలంలోనే అతి తక్కువ. అంతకుముందు అక్టోబర్ నెలలో ట్రాఫిక్ వృద్ధి 13.34 శాతంగా ఉంది. జెట్ఎయిర్వేస్: పరిమిత కాలం పాటు అమల్లో ఉండే విధంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ చార్జీలపై 30 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు టికెట్ బుకింగ్లపై ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఒకవైపు, రానుపోను ప్రయాణాలకూ, బిజినెస్, ఎకానమీ తరగతుల టికెట్లపైనా తగ్గింపు ఇస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో జనవరి 7, ఆ తర్వాత ప్రయాణాలకు తగ్గింపు ధరలపై టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. గో ఎయిర్: గో ఎయిర్ సంస్థ థాయిలాండ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్లో వచ్చే నెల 10–13వ తేదీల మధ్య జరిగే యాట్ షో నేపథ్యంలో, ఫుకెట్ ప్రయాణ టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. భారత్ నుంచి ఫుకెట్కు నేరుగా విమాన సేవలను ప్రారంభిస్తున్న తొలి సంస్థ ఇదే. స్పైస్జెట్: హైదరాబాద్ నుంచి కోల్కతా, పుణె, కోయంబత్తూర్కు జనవరి 1 నుంచి కొత్తగా ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, కొచ్చి, పోర్ట్బ్లెయిర్, బాగ్డోగ్రా మధ్య ఎనిమిది సీజనల్ విమాన సర్వీసులను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 28 మధ్య నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్ నుంచి వివిధ గమ్యస్థానాలకు మొత్తం మీద 41 విమానాలను నడపనుంది. హైదరాబాద్– కోల్కతా మార్గంలో రూ.2,699కే టికెట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే, కోల్కతా–హైదరాబాద్ మార్గంలో రూ.3,199కే టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించింది. ఇక హైదరాబాద్–పుణె మధ్య రూ.2,499, రూ.2,209 ధరలను నిర్ణయించింది. హైదరాబాద్– కోయంబత్తూరుకు రూ.2,809, తిరుగు ప్రయాణ టికెట్ను రూ.2,309కే ప్రమోషనల్ ఆఫర్ కింద అందిస్తున్నట్టు స్పైస్జెట్ పేర్కొంది. -
జెట్ఎయిర్వేస్ ఎకానమీ తరగతుల్లో ఉచిత భోజనం కట్
ముంబై: వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా జెట్ఎయిర్వేస్ దేశీయ మార్గాల్లో మరో రెండు ఎకానమీ తరగతి ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఉపసంహరించుకుంది. వచ్చే జనవరి 7 నుంచి మొదలయ్యే ప్రయాణాల కోసం డిసెంబర్ 21 నుంచి బుక్ చేసుకునే టికెట్లపై ఇది అమలవుతుందని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఎకానమీ విభాగంలో దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి లైట్, డీల్, సేవర్, క్లాసిక్, ఫ్లెక్స్ పేరుతో ఐదు రకాల ధరల ఆప్షన్లను జెట్ఎయిర్వేస్ ప్రస్తుతం ఆఫర్ చేస్తోంది. ఇందులో లైట్, డీల్ విభాగాల్లో ఇంతకుముందే ఉచిత భోజనం తొలగించగా, తాజాగా ట్రావెల్ సేవర్, క్లాసిక్ నుంచి కూడా వీటిని తీసివేయనుంది. దీంతో ఇకపై ఫ్లెక్స్ ఆప్షన్లో మాత్రమే ప్రయాణికులకు ఉచిత భోజన సదుపాయం లభించనుంది. ఇక ఈ నెల 21కి ముందు బుక్ చేసుకునే వారికి ప్రస్తుతమున్నట్టుగానే ఉచిత భోజనం అందిస్తామని జెట్ఎయిర్వేస్ తెలిపింది. ప్లాటినం, గోల్డ్ కార్డు కలిగిన సభ్యులకు ఇక ముందూ కాంప్లిమెంటరీ ఉచిత భోజనం పొందొచ్చని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెరుగుదలతో జెట్ఎయిర్వేస్ ఇటీవలి కాలంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
పలు విమానాలు రద్దు :కంపెనీ వివరణ
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది. గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర్మన్ నరేష్గోయల్కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వివరణ మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్లో పాక్షికంగా చెల్లించింది జెట్. అంతర్జాతీయ సర్వీసుల్లో కోత ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఒక్క రోజులో 14 ‘జెట్’ విమానాల రద్దు
ముంబై: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు పైలట్లు సహకరించకపోవడంతో ఆదివారం ఆ సంస్థకు చెందిన 14 విమానాలు రద్దయ్యాయి. పైలట్లు సహా పై స్థాయి ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలను పాక్షికంగా చెల్లించిన జెట్ ఎయిర్వేస్.. అక్టోబర్, నవంబర్ నెల జీతాలను మాత్రం ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో కొందరు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందనే సాకు చూపుతూ ఆదివారం అకస్మాత్తుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 14 విమానాలను జెట్ ఎయిర్వేస్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎదురైన నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందనీ, పైలట్లు సహకరించకపోవడం వల్ల కాదని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు విషయాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేశామనీ, వీలైనంత మందిని ఇతర విమానాల్లో పంపి, మిగతా వారికి పరిహారం చెల్లించామంది. -
జెట్లో కొనసాగుతున్న ఉద్వాసనలు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మరో 16 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్, కొచి కార్యాలయాల్లో పని చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘జెట్ ఎయిర్వేస్ పరిమిత స్థాయిలో కొద్ది కొద్దిగా ఉద్యోగులను తొలగించడం చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లోని కార్యాలయాన్ని మూసివేసింది. ఇందులో నలుగురైదుగురు సిబ్బంది ఉండేవారు. గతవారం కొచ్చి కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో కొందరికి వైదొలగాలంటూ సూచన కూడా చేసింది. మొత్తం మీద ఈ రెండు కార్యాలయాలకు సంబంధించి 16 మందిని తొలగించినట్లయింది‘ అని సంబంధిత వర్గాలు వివరించాయి. గత నెలాఖరులోనే 20 మంది ఉద్యోగులకు జెట్ ఉద్వాసన పలికింది. వీరిలో సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్లు మొదలుకుని ఇన్–ఫ్లయిట్ సర్వీసుల విభాగాలకు చెందిన సిబ్బంది దాకా ఉన్నారు. అంతకు ముందు ఇంజినీరింగ్, సెక్యూరిటీ, సేల్స్ తదితర విభాగాల్లో మేనేజర్ స్థాయిలోని 15 మంది దాకా ఉద్యోగులను తప్పుకోవాలని సంస్థ సూచించినట్లు సమాచారం. జెట్ ఎయిర్వేస్లో 16,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. టర్నెరౌండ్ ప్రణాళికలో భాగం.. ఉద్యోగుల తొలగింపు అంశంపై స్పందిస్తూ... టర్న్ అరౌండ్ ప్రణాళికలో భాగంగా నిర్దిష్ట నగరాల్లో వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జెట్ ఎయిర్వేస్ తెలిపింది. దీని ప్రకారంగానే నెట్వర్క్, సిబ్బంది వినియోగం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షిస్తున్నామని, లాభసాటిగా లేని రూట్ల నుంచి మెరుగైన రూట్ల వైపు వనరులను మళ్లిస్తున్నామని పేర్కొంది. జెట్ ఎయిర్వేస్ వరుసగా మూడు త్రైమాసికాలుగా భారీ నష్టాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,261 కోట్లు నష్టాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వివిధ వనరుల ద్వారా నిధు లు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే ఇటీవలే వెల్లడించారు. -
జెట్ ఎయిర్వేస్ ఇండిపెండెంట్ డైరెక్టర్ బై..బై
రుణ సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ (ఇండియా) లిమిటెడ్ నెత్తిన మరో పిడుగుపడింది. ఇండిపెండెంట్ డైరెక్టర్ రంజన్ మథాయి రాజీనామా చేశారు. బోర్డు స్వతంత్ర డైరక్టర్గా తన బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోతున్న కారణంగా బోర్డుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఒక వైపు కొండలా పెరుగుతున్న రుణభారం, మరోవైపు చమురు ధరల పెరుగుదల జెట్ ఎయిర్వేస్ను బాగా ప్రభావితం చేసింది. లాభాలు పడిపోయాయి. తీవ్ర నష్టాల్లో కూరుకపోయింది. దీంతో తనను తాను నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి నెట్టబడింది. ఈ క్రమంలో టాటా గ్రూపునకు చెందిన టాటా సన్స్ లిమిటెడ్ జెట్లో వాటా కొనుగోలుకు ముందుస్తు చర్చలు ప్రారంభించినట్టు గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఔను.. జెట్ రేసులో ఉన్నాం!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్ టేకోవర్పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా ధృవీకరించినట్లయింది. ‘జెట్ ఎయిర్వేస్ టేకోవర్పై టాటా సన్స్ ఆసక్తిగా ఉందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే, ఈ అంశంపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే జరిగాయని స్పష్టం చేయదల్చుకున్నాం. నిర్దిష్ట ప్రతిపాదనేదీ మేం ఆఫర్ చేయలేదు‘ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే విషయంపై శుక్రవారం బోర్డు సమావేశంలో టాటాలు సానుకూల నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాల నేపథ్యంలో తాజా వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించే విషయంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగిందని, కంపెనీని కొనుగోలు చేసేలా టాటా సన్స్కు సూచనలు చేసిందన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ కేంద్రం వాటిని తోసిపుచ్చింది. గురువారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన వివరణలో కూడా టేకోవర్ వార్తలన్నీ ఊహాగానాలేనంటూ జెట్ ఎయిర్వేస్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. జెట్ ఎయిర్వేస్లో ప్రమోటరు, చైర్మన్ నరేష్ గోయల్, ఆయన కుటుంబానికి 51%, ఎతిహాద్ ఎయిర్వేస్కు మరో 24% వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి జీ తాలు కూడా సక్రమంగా చెల్లించలేకపోతోంది. వరుసగా గత మూడు త్రైమాసికాల్లో భారీ నష్టాలు ప్రకటించింది. తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల నష్టం నమోదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో నరేష్ గోయల్ పూర్తిగా తప్పుకుని, నిర్ణయాధికారం పూర్తి గా తమదిగా ఉండే పక్షంలో మాత్రమే డీల్ కుదుర్చుకోవాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జెట్పై వ్యూహం.. జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసిన పక్షంలో సింగపూర్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యంలో దేశీయంగా ఏర్పాటు చేసిన విస్తార విమానయాన సంస్థలో భాగం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విస్తారకు దేశీయంగా 22 విమానాలు, 3.8 శాతం మాత్రమే మార్కెట్ వాటా ఉంది. మరోవైపు, అనుబంధ సంస్థ జెట్లైట్తో కలిపి జెట్కు 124 విమానాలు, 15.8 శాతం మార్కెట్ వాటా ఉంది. దేశ, విదేశాల్లో 66 ప్రాంతాలకు విమాన సేవలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ రూట్లలో విస్తార కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నా అందుకు సంబంధించిన అనుమ తులు మంజూరు కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ జెట్ను కొనుగోలు చేసి విస్తారలో విలీనం చేస్తే.. నేరుగా విదేశీ రూట్లలో సర్వీసులు ప్రారంభించేందుకు వెసులుబాటు లభించే అవకాశం ఉంది. 2008లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా విదేశీ రూట్లలో సర్వీసులు మొదలుపెట్టేందుకు ఇదే తరహాలో ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అయిదేళ్ల కార్యకలాపాలు పూర్తయితే గానీ దేశీ ఎయిర్లైన్స్కు విదేశీ రూట్లలో సేవలకు అర్హత లభించేది కాదు. ఎయిర్ఏషియాకి ’టాటా’ .. జెట్ ఎయిర్వేస్పై కన్నేసిన టాటా గ్రూప్.. ఏవియేషన్ వ్యాపారంలో మరో వెంచర్ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్ ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ)తో కలిసి విసార పేరుతో పూర్తి స్థాయి విమానయాన సంస్థను, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా బెర్హాద్తో కలిసి చౌక చార్జీల ఎయిర్ ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. ఎయిర్ఏషియా ఇండియా నుంచి వైదొలగాలని టాటా సన్స్ యోచిస్తున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. ఒకవేళ జెట్ ఎయిర్వేస్ డీల్ సాకారమైతే దాన్ని విస్తారలో విలీనం చేసి మొత్తం మీద ఒక్క విమానయాన వెంచర్కే పరిమితం కావాలని భావిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్కు 49 శాతం, ఎయిర్ఏషియా బెర్హాద్కు మిగతా వాటాలు ఉన్నాయి. కంపెనీకి 19 విమానాలు ఉన్నాయి. ఒకవైపున జెట్ ఎయిర్వేస్ టేకోవర్కు టాటా సన్స్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎయిర్ఏషియా ఇండియా నుంచి తప్పుకోవడంపై కూడా చర్చలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే, ఎయిర్ఏషియా ఇండియా పరిమాణం తక్కువగా ఉండటం, మందగతిన కార్యకలాపాల విస్తరణ, నష్టాలు, ఎయిర్ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. ఇతర అధికారుల అనుమానాస్పద లావాదేవీలపై సీబీఐ విచారణ తదితర అంశాల కారణంగా కొనుగోలుదారును పట్టుకోవడం టాటాలకు కాస్త కష్టతరంగానే ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయంగా ఫెర్నాండెజ్ స్వయంగా తన వాటాలను అమ్మేసి వైదొలిగే అంశాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. ‘తనమీద కేసులు దాఖలు కావడంతో భారత్లో వ్యాపారం చేయడం టోనీ ఫెర్నాండెజ్కు మరింత కష్టతరంగా మారుతోంది. దీంతో కంపెనీలో తన వాటాలను అమ్మేసే అవకాశాలను ఆయన పరిశీలించవచ్చు. అయితే, ఒకవేళ తాను వైదొలగాలని అనుకుంటే.. విమానయాన సంస్థలో తన వాటాలకు మంచి గిట్టుబాటు రేటు వస్తే తప్ప ఆయన తప్పుకోరు‘ అని కంపెనీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు, ఫెర్నాండెజ్ వాటాలను కొనుగోలు చేసి ఎయిర్ఏషియా ఇండియాను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్నా టాటాలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఇన్ఫ్రా, అకౌంటింగ్, రిజర్వేషన్ వ్యవస్థ మొదలైనవన్నీ ఎయిర్ఏషియా బెర్హాద్ లేదా దాని అనుబంధ సంస్థలు మలేషియా నుంచి నిర్వహిస్తుంటాయని, టాటాలకు కేవలం లైసెన్సు, స్లాట్స్ మాత్రమే దక్కుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జెట్ షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ చేయొచ్చంటూ వస్తున్న వార్తలు జెట్ ఎయిర్వేస్ షేరుకు గణనీయంగా లాభించాయి. గడిచిన అయిదు ట్రేడింగ్ సెషన్స్లో సంస్థ షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. టాటా సన్స్ బోర్డు సమావేశంలో టేకోవర్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలతో శుక్రవారం జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 14 శాతం గ్యాప్ అప్తో ప్రారంభమైంది. చివరికి 8 శాతం లాభంతో రూ. 346.85 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్ఎస్ఈలో 8 శాతం పెరిగి రూ. 341 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.366.95 స్థాయిని కూడా తాకింది. -
జెట్ డీల్కు రంగం సిద్ధం
సాక్షి, ముంబై: గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచిన టాటాసన్స్, జెట్డీల్కు రంగం సిద్ధమైంది. ఈ వార్తలను ధృవీకరించిన టాటా సన్స్ ఈ కొనుగోలు సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన టాటా సన్స్బోర్డు ఆమోదం తెలిపిందనీ అయితే ఇంతరవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బోర్డు సభ్యులందరూ సమావేశ ముగింపు తర్వాత విలేఖరులతో మాట్లాడడానికి నిరాకరించారు. తాజా పరిణామంతో జెట్ ఎయిర్వేస్ కొనుగోలు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు టాటా సన్స్ కసరత్తును వేగవంతం చేసిందనే వార్తలు ఇటీవల మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విస్తారా బ్రాండు విమానయాన సేవల సంస్థను నిర్వహిస్తున్న టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ షేర్ల విలీనం ద్వారా జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైందని మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఇరుక్కున్న జెట్ ఎయిర్వేస్ను కాపావాలని టాటా సన్స్ను ప్రభుత్వం కోరిందని బ్లూమ్బెర్గ్ వ్యాఖ్యానించింది. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి టాటా సన్స్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్లు సంప్రదింపులు జరుపుతున్నట్టు మింట్ వార్తాపత్రిక వెల్లడించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖర్ సుముఖంగా ఉన్నప్పటికీ, సంస్థ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మాత్రం కొన్ని అభ్యంతరాలను వెలిబుచ్చినట్లు మరో కథనం. కంపెనీని పూర్తిగా కొనడం కాకుండా, జెట్కి చెందిన విమానాలు, పైలట్లు, స్లాట్లు మొదలైనవి మాత్రమే తీసుకునే విధంగా టాటా సన్స్ ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన టాటా సన్స్ బోర్డు సమావేశం టాటా-జెట్ డీల్ పై అంచనాలను మరింత పెంచింది. మరోవైపు ఇవి పూర్తిగా ఊహాజనిత వార్తలని నిన్న (గురువారం) జెట్ ఎయిర్వేస్ కొట్టిపారేసింది. దీనిపై ఎలాంటి చర్చలూ,నిర్ణయాలు లేవని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. కాగా జెట్ ఎయిర్వెస్లో అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్లైన్స్ 24శాతం వాటా ఉండగా ఉండగా, వ్యవస్థాపకుడు గోయల్కు 51 శాతం వాటా ఉంది. -
జెట్పై నేడు టాటా సన్స్ భేటీ..
ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనపై టాటా సన్స్ అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘జెట్ ఎయిర్వేస్ కోసం బిడ్ చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు టాటా సన్స్ బోర్డు శుక్రవారం సమావేశమవుతుంది‘ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, టాటా సన్స్, జెట్ ఎయిర్వేస్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఊహాగానాలపై తాము స్పందించబోమని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి జీతాలివ్వడంలోనూ, లీజుకు తీసుకున్న విమానాల అద్దెలు చెల్లించడంలోనూ విఫలమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,261 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించింది. నిధుల సమీకరణలో భాగంగా 6 బోయింగ్ 777 విమానాలను విక్రయానికి ఉంచింది కూడా. విలీనానికి అంగీకరిస్తేనే? ఇప్పటికే విమానయాన సేవల వెంచర్స్ ఉన్న టాటా సన్స్.. తాజా పరిస్థితుల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేసే ప్రయత్నాలపై దృష్టి సారించింది. సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరిట ఒక వెంచర్ను, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియాతో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా పేరిట మరో విమానయాన వెంచర్ను నిర్వహిస్తోంది. ఈ వెంచర్స్కి ఉపయోగపడేలా ఉంటే జెట్ ఎయిర్వేస్లో వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వీటి ప్రకారం జెట్ ఎయిర్వేస్ను పూర్తిగా విలీనం చేసుకుంటే శ్రేయస్కరమని విస్తార మాతృసంస్థ టాటా–సింగపూర్ ఎయిర్లైన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయొచ్చు. దీనిలో జెట్ వైస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కుటుంబం, జెట్లో వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్వేస్, టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ భాగస్వాములుగా ఉంటారు. షేరు జూమ్.. టాటా సన్స్ టేకోవర్ వార్తల నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ షేరు గురువారం దాదాపు 26 శాతం దాకా ఎగిసింది. బీఎస్ఈలో 24.5 శాతం పెరిగి రూ.320.95 వద్ద క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలో 26.41 శాతం ఎగిసి రూ. 326 వద్ద ముగిసింది.