![Google CEO Sundar Pichai to receive 2019 Global Leadership Award - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/6/SUNDER.jpg.webp?itok=as2xw6QF)
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్కు అరుదైన గౌరవం దక్కింది. టెక్నాలజీ రంగంలో ఈయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన అమెరికా–భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ).. ప్రతి ఏడాది ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు పిచాయ్ను ఎంపికచేసినట్లు ప్రకటించింది. ఈయనతో పాటు నాస్డాక్ ప్రెసిడెంట్ అడెనా ఫ్రైడ్మాన్ పేరును ప్రకటించిన యూఎస్ఐబీసీ.. ఇరువురి నేతృత్వంలోని కంపెనీలు, అంతర్జాతీయ టెక్నాలజీ రంగ ప్లాట్ఫాంను ఏర్పాటుచేయడంలో తమవంతు కృషిచేసినట్లు కొనియాడింది. ఇరు సంస్థల కారణంగా భారత్, అమెరికా మధ్య వస్తు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం గడిచిన ఐదేళ్లలో 150 శాతం పెరిగి గతేడాదినాటికి 142.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇక వచ్చేవారం జరగనున్న ఇండియా ఐడియాస్ సదస్సులో ఇరువురికి అవార్డులను అందించనున్నట్లు వెల్లడించింది.
వచ్చే ఆరేళ్లలో 8.8 కోట్లకు 5జీ కనెక్షన్లు..!
జీఎస్ఎంఏ అంచనా
న్యూఢిల్లీ: భారత మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2025 నాటికి 92 కోట్లకు చేరనుందని గ్లోబల్ టెలికం పరిశ్రమ సమాఖ్య (జీఎస్ఎంఏ) అంచనావేసింది. ఇదేసమయంలో 5జీ కనెక్షన్లు 8.8 కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. 2018 చివరినాటికి మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 75 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ఈ రంగ ఆదాయం 2016 నుంచి 20 శాతం తగ్గిపోయినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment