
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇంటీరియర్ డిజైన్ మార్కెట్ రూ.20 వేల కోట్లకు చేరిందని.. ప్రతి ఏటా 15–20 శాతం వృద్ధి చెందుతోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడీ) పేర్కొంది. ఇంటీరియర్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా రూ.2 వేల కోట్లుగా ఉంటుందని.. ఈ పరిశ్రమల చాలా వరకూ అసంఘటితంగా ఉందని ఐఐఐడీ పేర్కొంది. ఈనెల 22–24 తేదీ వరకూ హైటెక్స్లో ‘ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్–2018’ 3వ ఎడిషన్ జరగనుంది.
ఈ సందర్భంగా ఐఐఐడీ–హెచ్ఆర్సీ చైర్పర్సన్ అపర్ణా బిదర్కర్, ఐఐఐడీ–హెచ్ఆర్సీ మాజీ చైర్పర్సన్ అమితా రాజ్, సెక్రటరీ మనోజ్ వాహి తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రదర్శనలో 30 రీజినల్ చాప్టర్లు, దేశంలోని ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ కంపెనీలు, నిపుణులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొంటారని అపర్ణా తెలిపారు. మూడు రోజుల ఈ ప్రదర్శనలో కనీసం రూ.500 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నామని, అలాగే పలు కంపెనీల ఉత్పత్తుల ప్రారంభాలూ ఉంటాయని ఆమె తెలిపారు.