
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 32 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.181 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.240 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక క్వార్టర్లీ లాభమని స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు.
ముడి చమురు ధరలు 17 శాతం ఎగిసినా, ఇతర వ్యయాలు 3 శాతం పెరిగినా, ప్రయాణికుల ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయిలో నికర లాభం సాధించామని చెప్పారు. వరుసగా 12వ క్వార్టర్లోనూ లాభాల్లో ఉన్నామంటూ... గత క్యూ3లో రూ1,642 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,082 కోట్లకు పెరిగిందని తెలియజేశారు.