
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై భారత్ కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు దిశానిర్ధేశం చేశారు. దీనికి సంబంధించి ‘ప్రతిపాదిత ఎలక్షన్ మ్యానిఫెస్టో’ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆదివారం విడుదల చేసింది. వచ్చే కొత్త ప్రభుత్వానికి ఈ మ్యానిఫెస్టో ఒక ఆర్థిక కార్యాచరణగా తోడ్పడుతుందని సీఐఐ పేర్కొంది. ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఆదివారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన తరుణంలో సీఐఐ ఈ మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం ఇలా అనేక రంగాల్లో సాధించాల్సిన పురోగతిని ఈ మ్యానిఫెస్టోలో చేర్చారు. ‘పారిశ్రామిక ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సంప్రతింపుల ఆధారంగా ఈ కీలక సూచనలు చేశాం. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నీతివంతమైన నాయకత్వం లక్ష్యంగా పలు అంశాలను పొందుపరిచాం. రాజకీయ పార్టీలన్నీ తమ మ్యానిఫెస్టోలో ఈ సూచనలను చేరుస్తారని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. సూచనల్లో ప్రధానాంశాలివీ...
►అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులను భారత్ అందిపుచ్చుకోవాలంటే భారీస్థాయి సంస్కరణలను కొనసాగించాలి.
►వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పన్ను శ్లాబ్లను 2–3 శాతం మేర కుదించాలి.
►ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని ఎదుర్కోవాలంటే కార్పొరేట్ ఆదాయపు పన్నును ఎలాం టి మినహాయింపుల్లేకుండా 18%కి తగ్గించాలి.
►పాలన, న్యాయ, పోలీసు విభాగాల్లో సంస్కరణలు తీసుకురావాలి.
►2024 నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ఎన్నికల సంస్కరణలు చేయాలి.
►విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలి. అదేవిధంగా వొకేషనల్ ట్రైనింగ్ను పాఠ్యాంశాల్లో భాగంగా చేయాలి. పనితీరు బాగున్న ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు, ముఖ్యంగా గ్రామాల్లో డిజిటల్ స్కూల్ ఇన్ఫ్రాను మెరుగుపరడం వంటి చర్యలు అవసరం.
►యూనివర్సిటీలన్నింటినీ పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. పరిశోధన అభివృద్ధి(ఆర్అండ్డీ)లో ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో
1 శాతానికి పెంచాలి.
►సాంకేతికత ఆధారంగా నైపుణ్య శిక్షణలకు కొత్త విధానాలను ప్రవేశపెట్టాలి.
►వైద్య, ఆరోగ్య రంగంలో వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచాలి. ఈ రంగానికి మౌలిక హోదా కల్పించాలి. ప్రసూతి, శిశు మరణాలను తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
►కార్మిక చట్టాల్లో తగిన మార్పుల కోసం కేంద్రం, రాష్ట్రాల కార్మిక మంత్రులతో ఒక సాధికార కమిటీ వేయాలి.
► రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రమైన జాతీయ వ్యవసాయ మిషన్ను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలకు సంబంధించి ‘ఈజ్ ఆప్ డూయింగ్ అగ్రికల్చర్(వ్యవసాయానికి అత్యంత సానుకూలత) ర్యాంకింగ్ను ప్రవేశపెట్టాలి.
► వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్ఈ)ల్లో మూడు దశల్లో ప్రభుత్వ వాటాను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. తొలి దశలో ప్రభుత్వ వాటాను 51 శాతానికి, రెండో దశలో 26 శాతానికి, మూడో దశలో పూర్తిగా విక్రయించి వైదొలగేలా చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లలో ఈ మొత్తం అమ్మకం ప్రక్రియ పూర్తవ్వాలి.