ముఖేష్ అంబానీ ఉచితాలకు ఇక ముగింపు
కోల్కత్తా : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్ భారీ కుదుపులకి లోనైన సంగతి తెలిసిందే. ధరల యుద్ధంతో టెలికాం దిగ్గజాలను ఇది అతలాకుతలం చేసింది. ఇక ఈ వార్కు తెరపడబోతుందట. రిలయన్స్ జియో తెరతీసిన ధరల యుద్ధం తుది దశల్లోకి చేరుకుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. వచ్చే 12-18 నెలలో ఒక దశ వద్ద జియో తన పోటీ వ్యూహాన్ని హేతుబద్ధం చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తోంది. అంతేకాక ఇక రెవెన్యూలు, మార్జిన్లను ఆర్జించడంపైనే జియో ఫోకస్ చేస్తుందని పేర్కొంది. దీంతో ముఖేష్ అంబానీ ఉచితాలకు ఇక ముగింపుకు వస్తుందని తెలిపింది.
'' భారీ డిస్కౌంట్స్, ఉచిత ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలో ఉన్న 10శాతం టెల్కో సబ్స్క్రైబర్ బేస్ను జియో సొంతం చేసుకుంది. కానీ ఈ భారీ డిస్కౌంట్ విధానాలు జీవితకాలం కొనసాగించలేదు'' అని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిస్ట్ అశుతోష్ శర్మ చెప్పారు. జియో తెరతీసిన ఈ గేమ్లో పాల్గొన్న పోటీదారులందరూ రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది.
గతేడాది సెప్టెంబర్లో జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. జియో ప్రవేశంతో ఒక్కసారిగా టెలికాం మార్కెట్ అంతా తీవ్ర కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొంది. 80 శాతం ఈ రంగ రెవెన్యూలను అంటే వాయిస్ కాల్స్ను జియో జీవితకాలం ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. జియో డేటా రేట్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీల కంటే తక్కువగానే అందిస్తోంది. జియో దెబ్బకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు కూడా ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ డేటా ఆఫర్లను తీసుకొచ్చాయి.
రెవెన్యూలు, లాభాలు తక్కువ ఉన్నప్పటికీ, వారి మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో కన్సాలిడేషన్ ఏర్పడింది. వొడాఫోన్ ఇండియా, ఐడియాలు విలీనం ప్రక్రియలో ఉండగా.. టెలినార్ను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఇక ఆర్కామ్, ఎంటీఎస్, ఎయిర్సెల్లు కూడా ఇలానే ఉన్నాయి. ఈ కన్సాలిడేట్లో కేవలం మూడు సంస్థలే అంటే వొడాఫోన్-ఐడియా విలీన సంస్థ, ఎయిర్టెల్, జియోలే 75-85 శాతం ఇండస్ట్రి రెవెన్యూలను సొంతం చేసుకోనున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేస్తోంది.