S&P Global ratings
-
2030 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్!
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ విశ్లేషించింది. అయితే ‘అపారమైన అవకాశాన్ని’ అన్లాక్ చేసి తదుపరి అతిపెద్ద ప్రపంచ తయారీ కేంద్రంగా మారడం దేశానికి ప్రధాన పరీక్ష అని పేర్కొంది. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అంచనా వేసిన 6.4 శాతం వృద్ధి వేగం 2026 నాటికి 7 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. రాబోయే మూడేళ్లలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. సేవల–ఆధిపత్య ఆర్థిక వ్యవస్థ నుండి భారత్ తయారీ–ఆధిపత్యంగా మార్చడానికి బలమైన లాజిస్టిక్స్ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడం కీలకమని ‘గ్లోబల్ క్రెడిట్ ఔట్లుక్ 2024: కొత్త ఇబ్బందులు, మార్గాలు’ అన్న అంశంపై విడుదల చేసిన నివేదికలో రేటింగ్ సంస్థ పేర్కొంది. 2022–23లో భారత్ ఎకానమీగా వ్యవసాయ రంగం వాటా 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీగా కొనసాగుతోంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. 3.75 ట్రిలియన్ డాలర్లతో భారత్ ఐదవ స్థానంలో నిలుస్తోంది. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. తాజా నివేదికలో ఎస్అండ్పీ పేర్కొన్న ముఖ్యాంశాలు.. ► శ్రామిక మార్కెట్ సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం అనేది కార్మి కుల నైపుణ్యం పెంపొందించడం, శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడంపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాల్లో విజయం ద్వారా భారత్ తన అధిక శాతం యువత నుంచి ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతుంది. ► వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్ వచ్చే దశాబ్దంలో భారత్లో అధికంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్ రంగానికి ప్రయోజనం చేకూర్చుతుంది. ► 2024లో 50 కంటే ఎక్కువ దేశాల్లో ఎన్నికలు (అధ్యక్ష/లేదా శాసన సభలు) ఉన్నాయి. వీటి ఫలితాలపై ఆధారపడి చాలా వరకు ప్రపంచ పరిణామాలు ఉండవచ్చు. ► త్వరలో మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న యుద్ధంలో చిక్కుకున్న రష్యా– ఉక్రెయిన్ రెండు దేశాల్లో మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో ప్రత్యక్ష సంబంధం ఉన్న అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడం గమనార్హం. భారత్సహా ఇండోనేíÙయా, దక్షిణాఫ్రికా, మెక్సికో వంటి వర్థమాన దేశాలు కూడా ఎన్నికలకు వెళ్లనున్నాయి. -
వృద్ధిలో భారత్ వేగం.. చైనా నెమ్మది
న్యూఢిల్లీ: ఎకానమీ బాటలో భారత్ వేగంగా పరోగమిస్తుంటే.. చైనా నెమ్మదిస్తోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘చైనా స్లోస్... ఇండియా గ్రోస్’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఆసియా–పసిఫిక్ గ్రోత్ ఇంజిన్... చైనా నుండి దక్షిణ, ఆగ్నేయాసియాలకు మారుతుందని అంచనా. ►చైనా వృద్ధి రేటు 2023లో 5.4 శాతంగా అంచనా. 2024లో ఇది 4.6 శాతానికి తగ్గుతుంది. 2025లో 4.8 శాతానికి పెరుగుతుంది. 2026లో మళ్లీ 4.6 శాతానికి తగ్గుతుంది. ►ఇక భారత్ వృద్ధి 2026లో 7 శాతానికి పెరుగుతుంది. ఇదే సమయంలో వియత్నా వృద్ధి 6.8%, ఫిలిప్పైన్స్ వృద్ధి రేటు 6.4 %, ఇండోనేíÙ యా వృద్ధి 5 శాతంగా నమోదయ్యే వీలుంది. భారత్తో పాటు ఇండోనేíÙయా, మలేíÙయా, ఫి లిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంది. ►భారత్ వృద్ధి రేటు 2023–24, 2024–25లో 6.4 శాతంగా ఉంటుంది. 2025లో 6.9 శాతంగా, 2026లో 7 శాతంగా సంస్థ అంచనావేస్తోంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్లో ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయి. ►ఆసియా–పసిఫిక్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచే అవకాశం ఉన్నందున, ఈ ప్రాంతంలోని రుణ గ్రహీతలకు రుణ వ్యయాలు, సేవలు భారీగా ఉంటాయి. ►మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు విస్తరిస్తే.. అవి ప్రపంచ సరఫరా చైన్ను దెబ్బతీయవచ్చు. ఇది ఇంధన వ్యయాలను పెంచుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతంది. అధిక ఇన్పుట్ ఖర్చులు కార్పొరేట్ మార్జిన్లను తగ్గించే అవకాశం ఉంది. ఇది డిమాండ్ పరిస్థితులనూ దెబ్బతీసే అవకాశం ఉంది. ►ఆసియా–పరిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాలను (చైనా మినహా) 2024కు సంబంధించి 4.4 శాతం నుంచి 4.2 శాతానికి తగ్గిస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ప్రత్యేకించి ఎగుమతుల ఆధారిత తయారీ రంగం కఠిన పరిస్థితులను ఎదుర్కొనే ఇబ్బందులు ఉన్నాయి. -
భారత్ వృద్ధి స్పీడ్ 6.4 శాతం
న్యూఢిల్లీ: భారత్ 2023–24 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ భారీగా 40 బేసిస్ పాయింట్లు (0.4%) పెంచింది. దీనితో ఈ అంచనా 6 శాతం నుంచి 6.4 శాతానికి పెరిగింది. అధిక ఆహార ద్రవ్యోల్బణం, బలహీన ఎగుమతి పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక క్రియాశీలత, డిమాండ్ పటిష్టంగా ఉన్నాయని తన తాజా ఎకనమిక్ అవుట్లుక్ ఫర్ ఆసియా పసిఫిక్ నివేదికలో పేర్కొంది. తమ అంచనాల అప్గ్రేడ్కు ఈ అంశాలు కారణాలుగా వివరించింది. అయితే 2024–25 అంచనాలను మాత్రం క్రితం 6.9 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. అధిక బేస్ ఎఫెక్ట్, గ్లోబల్ వృద్ధిపై బలహీన అంచనాలు, వడ్డీరేట్ల పెంపు ప్రతికూలతలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి తీరుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ఏడీబీ, ఫిచ్ అంచనాలకన్నా (6.3 శాతం) ఎస్అండ్పీ తాజా అంచనాలు కొంచెం అధికంగా ఉండడం గమనార్హం. 2023 మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7.2 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. కాగా, భారత్తో పాటు ఇండోనేíÙయా, మలే షియా, ఫిలిప్పైన్స్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని ఎస్అండ్పీ నివేదిక పేర్కొంది. -
సెప్టెంబర్లో ‘తయారీ’ నిరాశ.. ఐదు నెలల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం సెప్టెంబర్లో నెమ్మదించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 58.6 వద్ద ఉంటే, సెప్టెంబర్లో 57.5కు పడింది. అంతక్రితం ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ స్థాయి దిగువకు పడిపోతేనే దానిని క్షీణతగా పేర్కొంటారు. ఈ ప్రాతిపదికన సూచీ 27 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. తాజా సమీక్షా నెల సెప్టెంబర్లో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి నెమ్మదించినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
భారత్ ఎకానమీకి ‘వినియోగం’ రక్ష
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2026–27 ఆర్థిక సంవత్సరం వరకూ సగటున 6.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ సీనియర్ ఎకనమిస్ట్ (ఆసియా–పసిఫిక్) విశ్రుత్ రాణా అంచనావేశారు. దేశీయ వినియోగమే ఎకానమీ పురోగతికి ప్రధాన కారణంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. 2022–23లో ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతంకాగా, ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6 శాతంగా ఉంటుందని ఒక వెబినార్లో పేర్కొన్నారు. ఎగుమతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లు వృద్ధి రేటుకు కొంత ప్రతికూలంగా ఉన్నాయని అన్నారు. వడ్డీరేట్ల పెంపు, వినియోగ డిమాండ్పై ఈ ప్రతికూలతలు తక్షణం ఎకానమీ బలహీనతకు కారణంగా పేర్కొన్నారు. 2022–23 వృద్ధికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.5 అంచనాలకన్నా విశ్రుత్ రాణా అంచనా (6 శాతం) తక్కువగా ఉండడం గమనార్హం. కాగా పెట్టుబడుల పరంగా చూస్తే దేశీయ రికవరీ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ, వడ్డీరేట్లను తగ్గించేందుకు ఆర్బీఐ తొందరపడబోదన్నది తమ అభిప్రాయమన్నారు. ద్రవ్యోల్బణం అంచనాలు పూర్తిగా తగ్గే వరకు ఆర్బీఐ నిరీక్షిస్తుందని, రేట్లను తగ్గించడానికి 2024 ప్రారంభం వరకు వేచి ఉండవచ్చని రాణా అభిప్రాయపడ్డారు. -
మేలో ‘తయారీ’ పటిష్టం
న్యూఢిల్లీ: తయారీ రంగం మేలో మంచి పురోగతిని కనబరిచినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ధ్ (పీఎంఐ) స్పష్టం చేసింది. సూచీ 31 నెలల గరిష్ట స్థాయిలో 58.7కు చేరినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఏప్రిల్లో సూచీ 57.2 వద్ద ఉంది. నిజానికి సూచీ 50పైన వుంటే వృద్ధి ధోరణిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ 50 పైన కొనసాగడం వరుసగా 23వ నెల కావడం గమనార్హం. -
పటిష్టంగా భారత బ్యాంకుల లాభదాయకత
న్యూఢిల్లీ: భారత బ్యాంకుల లాభదాయకత ఆరోగ్యకర స్థాయిలో స్థిరపడుతుందని, ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడడం కూడా కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ రేటింగ్స్ అంచనా వేసింది. ‘‘భారత బ్యాంకుల లాభాలు ఇక మీదట ఆరోగ్యంగానే ఉంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల భారం గణనీయంగా పెరిగిన దగ్గర్నుంచి, గత ఏడేళ్లలో ఈ రంగం ఎంతో మెరుగుపడింది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలిసేత్ ఛాబ్రియా తెలిపారు. రుణ వసూళ్లు బలంగా ఉన్నాయని, భారత బ్యాంకులు దశాబ్ద కాలంలో మెరుగైన ఫలితాలను చూపిస్తున్నాయని ఎస్అండ్పీ రేటింగ్స్ పేర్కొంది. క్రెడిట్ వ్యయాలు తక్కువగా ఉండడం, అధిక నికర వడ్డీ మార్జిన్ల నుంచి ప్రయోజనం పొందడం వల్ల భారత బ్యాంకింగ్ రంగం ప్రయోజనం చూస్తున్నట్టు తెలిపింది. వ్యవస్థ అంతటా ఆస్తులపై సగటు రాబడులు (ఆర్వోఏఏ) 1.2 శాతంగా 2022–23లో ఉంటాయని, 2023–24లో 1.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా వచ్చే ఎన్పీఏలు తక్కువగానే ఉన్నట్టు తెలిపింది. మాఫీ చేసిన రుణాలు వసూలు అవుతుండడంతో వాటి లాభాలు పెరుగుతున్నట్టు పేర్కొంది. భారత్ బలమైన ఆర్థిక పనితీరు బ్యాంకింగ్ రంగానికి సానుకూలమని ఎస్అండ్పీ రేటింగ్స్ అంచనా వేసింది. 2026 వరకు భారత్ ఏటా 6–7 శాతం స్థాయిలో వృద్ధిని చూస్తుందని, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని తెలిపింది. -
మార్చిలో ‘సేవలు’ అంతంతే..!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో పేలవ పనితీరును కనబరిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరికన్నా తక్కువకు పడిపోయి 57.8కి చేరింది. సూచీ ఫిబ్రవరిలో 12 నెలల గరిష్ట స్థాయి 59.4ను చూసిన సంగతి తెలిసిందే. కొత్త బిజినెస్ ఆర్డర్లు అంతంత మాత్రంగానే పెరిగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డి లిమా పేర్కొన్నారు. కాగా, సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన వరుసగా 20 నెలల నుంచి సూచీ వృద్ధి ధోరణిలో పయనిస్తోంది. తయారీ–సేవల రంగం కలిపినా డౌన్! కాగా, తయారీ–సేవల రంగం కలిపినా ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59.0 వద్ద ఉంటే, మార్చిలో 58.4కు పడిపోయింది. మరోవైపు ఒక్క తయారీ రంగం చూస్తే మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్ల స్పందన ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదు చేస్తారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా 60%. పరిశ్రమల రంగం వాటా దాదాపు 15% అయితే, అందులో తయారీ రంగం వెయిటేజ్ 70% ఉంటుంది. -
మార్చిలో తయారీ రంగం పరుగు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చిలో మంచి పురోగతి కనబరచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మూడు నెలల గరిష్ట స్థాయిలో 56.4కు వద్దకు చేరింది. డిమాండ్ ఊపందుకోవడంతో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినట్లూ వివరించింది. ఫిబ్రవరిలో పీఎంఐ 55.3గా నమోదయ్యింది. అయితే సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన సూచీ వృద్ధి బాటన కొనసాగడం వరుసగా 21వ నెల. ఉద్యోగ కల్పన విషయానికి వస్తే, మార్చిలో పేరోల్ సంఖ్యలో దాదాపు మార్పులేదు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. -
భారత్ వృద్ధి రేటు.. 6 శాతం!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్ దిగ్గజం అంచనా వేసింది. (ఇదీ చదవండి: జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ త్రైమాసిక ఎకనమిక్ అప్డేట్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది. ► 2024–2026 మధ్య భారత్ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరంలలో భారత్ జీడీపీ వృద్ధి తీరు 6.9 శాతంగా ఉండనుంది. 2026–27లో 7.1%కి పెరుగుతుందని అంచనా. ► భారత్ ఎకానమీకి సాంప్రదాయకంగా ‘దేశీయ డిమాండ్’ చోదక శక్తిగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం కొంత ఎకానమీపై కనబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 4.4%కి నెమ్మదించడం గమనార్హం. ► ఆర్బీఐ రేటు పెంపునకు ప్రాతిపదిక అయిన వినియోగ ద్రవ్యోల్బణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ సవాళ్లుసహా పలు అడ్డంకులూ ఉన్నాయి. (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!) అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ ఆశావాద దృక్పథాన్నే వెలువరించింది. ఈ సంవత్సరం చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. 2023 చైనా వృద్ధికి సంబంధించి నవంబర్లో వేసిన 4.8 శాతం అంచనాలను 5.5 శాతానికి పెంచింది. మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రకటించిన 5 శాతం అంచనాలకన్నా ఇది అధికం కావడం గమనార్హం. వినియోగం, సేవల రంగాలు ఎకానమీ పురోగతికి దోహదపడతాయని అభిప్రాయపడింది. అమెరికా, యూరోజోన్లో ఎకానమీలో 2023లో భారీగా మందగించవచ్చని రేటింగ్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది అమెరికా 0.7 శాతం, యూరోజోన్ 0.3 శాతం వృద్ధి సాధిస్తాయన్నది తమ అంచనాగా తెలిపింది. చైనా కోలుకోవడం ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై అమెరికా, యూరప్లోని మందగమన ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయబోదని పేర్కొన్న ఎస్అండ్పీ, ఇది కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తుందని అంచనావేసింది. -
భారత్ ‘సేవలు’ భేష్...
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. దేశంలో డిమాండ్ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు. సేవలు–తయారీ కలిపినా... పురోగతి! తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. -
తయారీ రంగం సుస్థిర వృద్ధి
న్యూఢిల్లీ: తయారీ రంగం సుస్థిర వృద్ధి బాటన కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. అయితే సూచీ 50పైన కొనసాగితే దీనిని వృద్ధి ధోరణిగా పేర్కొంటారు. 50 దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన పీఎంఐ 50పైన కొనసాగడం ఇది వరుసగా 20వ నెల. జనవరి తరహాలోనే కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి ఫిబ్రవరిలోనూ కొనసాగినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. కాగా, ఉపాధి కల్పన విషయంలో మాత్రం పెద్దగా పురోగతి కనిపించడం లేదని లిమా పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న 98 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇక కంపెనీలపై ద్రవ్యోల్బణం ఒత్తిళ్లూ కొనసాగుతున్నట్లు తెలిపారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానల్లో కొనుగోళ్లు జరిపే మేనేజర్లకు పంపిన ప్రశ్నాపత్రం, ప్రతిస్పందనల ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదుచేయడం జరుగుతుంది. -
అక్టోబర్లో ‘సేవలు’ బాగున్నాయ్!
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం అక్టోబర్లో మంచి ఫలితాన్ని నమోదుచేసుకుందని ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సూచించింది. సెప్టెంబర్లో ఆరు నెలల కనిష్టం 54.3కు పడిపోయిన సూచీ, అక్టోబర్లో 55.1కు ఎగసింది. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదిక సేవల సూచీ వృద్ధి బాటన ఉండడం ఇది వరుసగా 15వ నెల. తమ సర్వే ప్రకారం అక్టోబర్లో వరుసగా ఐదవనెల సేవల రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. గడచిన మూడు సంవత్సరాల్లో సేవల రంగం ఈ స్థాయి స్పీడ్ ఇది రెండవసారని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. అక్టోబర్లో సేవల రంగం పురోగతికి దేశీయ మార్కెట్ ప్రధాన వనరని కూడా లిమా తెలిపారు. ఇక విదేశీ అమ్మకాలు మాత్రం వరుసగా మూడవ త్రైమాసికంలో దిగువబాటన నడిచాయని అన్నారు. -
భారత వృద్ధిపై ఎస్ అండ్ పీ విశ్వాసం
న్యూఢిల్లీ: భారత వృద్ధి ప్రగతి పట్ల అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ ధీమాగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచాలను పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గించినప్పటికీ.. ఎస్అండ్పీ మాత్రం 7.3 శాతంగానే కొనసాగించింది. ఈ ఏడాది చివరి వరకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతానికి ఎగువనే చలించొచ్చని అభిప్రాయపడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఆర్థిక అంచనాలను తాజాగా ఎస్అండ్పీ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు వెలుపలి వాతావరణం ప్రతికూలంగా ఉందని, అధిక అంతర్జాతీయ రేట్ల వల్ల కరెన్సీ విలువల క్షీణత, పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం వంటి ఒత్తిళ్లు ఈ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. చైనాలో మందగమనం ప్రభావం.. భారత్లో వినియోగం, పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం సర్దుబాటు చేస్తుందని పేర్కొంది. ‘‘సవాళ్లు ఉన్నప్పటికీ.. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరం 2023–24కు 6.5 శాతంగా కొనసాగిస్తున్నాం’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ లూయిస్ కూజ్స్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధించొచ్చని ఆర్బీఐ అంచనాగా ఉంది. ఏడీబీ, ఫిచ్ రేటింగ్స్, సిటీ గ్రూపు భారత వృద్ధి రేటును 2022–23కు 7 శాతం, అంతకంటే దిగువకు ఇప్పటికే తగ్గించేశాయి. గత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండడం గమనార్హం. పస్త్రుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడడం తెలిసిందే. రూపాయిలో అస్థిరతలు.. రానున్న రోజుల్లో రూపాయి ఒత్తిళ్లను చూస్తుందని ఎస్అండ్పీ ఆర్థికవేత్త విశృత్ రాణా అంచనా వేశారు. అయితే, భారత్ వద్ద విదేశీ మారకం నిల్వలు గణనీయంగా ఉన్నట్టు తెలిపారు. రూపాయి డాలర్తో 81.52కు పడిపోవడం గమనార్హం. ‘‘గత నెల రోజుల్లో అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్తో పోలిస్తే రూపాయి క్షీణించింది తక్కువే. అంతర్జాతీయంగా ద్రవ్య విధానాలు కఠినతరం అవుతున్న కొద్దీ రూపాయి మరిన్ని అస్థిరతలు చూడనుంది. బారత విదేశీ మారకం నిల్వల నిష్పత్తి అన్నది స్వల్పకాల విదేశీ రుణాలతో పోలిస్తే 2 కంటే ఎక్కువే ఉంది. ఇది గణనీయమైన మిగులు నిల్వలను సూచిస్తోంది’’అని విశృత్ రాణా వివరించారు. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగాను, తదుపరి ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగాను ఉంటుందని ఎస్అండ్పీ అంచనా వేసింది. వాతావరణంలో మార్పుల వల్ల గోధుమలు, బియ్యం ధరలు పెరగడాన్ని ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్ల పెరుగుదలకు దారితీస్తుందంటూ, 2022–23 చివరికి 5.9 శాతం స్థాయిలో రెపో రేటు ఉంటుందని అంచనా వేసింది. -
ఎకానమీకి సేవల దన్ను..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం సవాళ్లలోనూ సేవల రంగం ఎకానమీకి మేలో దన్నుగా నిలిచింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మేలో 58.9గా నమోదయ్యింది. గడచిన 11 సంవత్సరాల్లో సేవల రంగంలో ఈ స్థాయి పటిష్టత నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్లో సూచీ 57.9 వద్ద ఉంది. కొత్త వ్యాపారాల్లో పురోగతి సూచీ పటిష్ట స్థాయికి దోహదపడింది. నిజానికి ఈ సూచీ 50పైన ఉంటే పురోగతిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం సేవల సూచీ వృద్ధి బాటన నిలవడం ఇది వరుసగా పదవనెల. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ సేవా రంగంలో వృద్ధిని పెంచడంలో సహాయపడింది. మే నెలలో వ్యాపార కార్యకలాపాలు 11 సంవత్సరాలలో అత్యంత వేగంతో పుంజుకున్నాయి, జూలై 2011 తరువాత కొత్త ఆర్డర్లలో వేగవంతమైన పెరుగుదల ఇదే తొలిసారి’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60%గా ఉంది. తయారీ–సేవలు కలిపినా అదుర్చ్... ఇక సేవలు, తయారీ కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ ఏప్రిల్లో 57.6గా ఉంటే, మేలో 58.3కు ఎగసింది. నవంబర్ తర్వాత ఈ స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. భారత్ తయారీ రంగం (పారిశ్రామిక ఉత్పత్తిలో 75%) మే నెల్లో స్థిరంగా ఉంది. -
ద్రవ్యోల్బణం తీవ్రతలోనూ తయారీ రంగం స్థిరం!
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం (మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 75 శాతం) మే నెల్లో స్థిరంగా ఉంది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మే నెల్లో దాదాపు ఏప్రిల్ (54.7) స్థాయిలోనే 54.6 వద్ద ఉంది. వ్యవస్థలో తీవ్ర ధరల పెరుగుదల పరిస్థితి ఉన్నప్పటికీ ఎస్అండ్పీ సూచీ దాదాపు స్థిరంగా కొనసాగుతుండడం గమనార్హం. మే నెల్లో ఉత్పత్తి, ఆర్డర్లు పెరిగాయని, డిమాండ్లో రికవరీ ఉందని సూచీ అంశాలు వివరించాయి. పలు రంగాలు రికవరీ బాటన నడిచాయి. ఎగుమతుల పరిస్థితి బాగుంది. సూచీ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. అమ్మకాల పెరుగుదల నేపథ్యంలో మేలో తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడ్డం మరో కీలకాంశం. స్వల్పంగానే అయినా, 2020 జనవరి తర్వాత ఉపాధి కల్పన విషయంలో కొంత సానుకూల పరిస్థితి కనిపించింది. మరోవైపు వరుసగా 22వ నెల ముడి పదార్థాల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇంధనం, రవాణా, ఫుడ్స్టఫ్, మెటల్స్, జౌళి రంగాల్లో ధరల పెరుగుదల కనబడింది. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో బిజినెస్ సెంటిమెంట్ బలహీనంగా ఉంది. -
రెండు నెలల్లో అతిపెద్ద పతనం
ముంబై: ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలతో స్టాక్ మార్కెట్ గురువారం రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్తో సహా దేశీయ కార్పొరేట్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నష్టాలకు ఆజ్యం పోశాయి. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు భారత వృద్ధి రేటు అవుట్లుక్ను 7.3 శాతానికి కుదించింది. దేశీయ మార్కెట్లో్ల విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, కొనసాగుతున్న రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 1,416 పాయింట్లు క్షీణించి 52,930 వద్ద ముగిసింది. నిఫ్టీ 431 పాయింట్లను కోల్పోయి 16 వేల దిగువున 15,809 వద్ద నిలిచింది. ఈ ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్క్యాప్ ఇండెక్స్లు ఏకంగా రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో, నిఫ్టీ 50 షేర్లలో ఐటీసీ(3.50%), డాక్టర్ రెడ్డీస్(అరశాతం), పవర్గ్రిడ్(0.30%) మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 4,900 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,226 కోట్లను కొన్నారు. ట్రేడింగ్ ఆద్యంతం నష్టాలే.., ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 1,139 పాయింట్ల భారీ పతనంతో 53,070 వద్ద., నిఫ్టీ 323 పాయింట్లు క్షీణించి 15,917 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ట్రేడింగ్ మొదలు.., మార్కెట్ ముగిసే దాకా ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేక పోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు క్షీణించి 52,670 వద్ద, నిఫ్టీ 465 పాయింట్లు నష్టపోయి 15,775 వద్ద కనిష్టాలను తాకాయి. భారీగా పతనమైన ప్రపంచ మార్కెట్లు యూఎస్ రిటైల్ దిగ్గజ సంస్థలు వాల్మార్ట్, అమెజాన్, క్రోగర్, కాస్ట్కోల రిటైల్ అమ్మకాలు బాగా తగ్గాయి. నీరసించిన గణాంకాలు మందగమన సంకేతాలు సూచిస్తున్నాయనే భయాలతో అక్కడి మార్కెట్లు బుధవారం.., 2020 జూన్ తర్వాత అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. వాల్మార్ట్ షేరు ఏకంగా 25 శాతం పడిపోయింది. ముప్పై ఏళ్లలో అతి పెద్ద క్షీణత ఇది. ట్రేడింగ్ ముగిసే సరికి దేశ ప్రధాన ఇండెక్సులు డోజోన్ 3.6%, నాక్డాక్ 4.7%, ఎస్అండ్పీ నాలుగుశాతం క్షీణించాయి. స్టాక్ ఫ్యూచర్లు సైతం గురువారం ఒకటిన్నర శాతం నష్టంతో కదలాడాయి. అమెరికా మార్కెట్ల పతనానికి తోడు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఆసియా మార్కెట్లు రెండు శాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లకు చెందిన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు 2.50% నష్టపోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో నష్టాల మార్కెట్లోనూ ఐటీసీ షేరు ఎదురీదింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 4.50% దూసుకెళ్లి రూ.279 వద్ద స్థాయిని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 3.5% లాభంతో రూ.276 వద్ద ముగిసింది. ► ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల సెగ దేశీయ ఐటీ షేర్లను తాకింది. విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీ షేర్లు 6శాతం నుంచి ఐదు శాతం నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో టాప్ లూజర్లన్నీ ఐటీ షేర్లే కావడం గమనార్హం. ► మార్కెట్లో అస్థిరతను సూచించే నిఫ్టీ వొలిటాలిటీ ఇండెక్స్ పది శాతానికి ఎగసి 24.56 స్థాయి వద్ద స్థిరపడింది. రూ.6.71 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ రెండున్నర శాతం నష్టంతో రెండు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.6.71 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.249.06 లక్షల కోట్లకు దిగివచ్చింది. రూ‘పాయె’! 77.65కి రికార్డు పతనం ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్ ‘ముగింపు’లో కొత్త చరిత్రాత్మక కనిష్టాన్ని చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం ముగింపుతో చూస్తే 3 పైసలు బలహీనపడి 77.65 వద్ద ముగిసింది. ఇప్పటి వరకూ రూపాయికి ఇంట్రాడే ‘కనిష్టం’ 77.79. మే 17వ తేదీన ఈ పతన స్థాయి నమోదయ్యింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర తీవ్రత, ద్రవ్యోల్బణం భయాలు, అమెరికా, భారత్సహా పలు దేశాలు వడ్డీరేట్ల పెంపు దశలోకి ప్రవేశించడం, డాలర్ బలోపేత ధోరణి, దేశంలో ఈక్విటీల బలహీన పరిస్థితి నేపథ్యంలో రూపాయి పతన బాట పట్టింది. రూపాయి బుధవారం ముగింపు 77.62. గురువారం ట్రేడింగ్లో 77.72 బలహీనతతో ప్రారంభమైంది. 77.63కు బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. రూపాయి కొద్ది సెషన్లలోనే 78కి తాకడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
వృద్ధి రేటు 7.3 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ: భారత వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో 7.8 శాతంగా ఉంటుందన్న గత అంచనాను 7.3 శాతానికి సవరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంచనాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం పాటు గరిష్టాల్లో ఉండడం ఆందోళనకరమని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. దీనివల్ల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటి కంటే మరింత అధికంగా రేట్లను పెంచాల్సి వస్తుందని పేర్కొంది. ఇది ఉత్పత్తిపై, ఉపాధి కల్పనపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎస్అండ్పీ చివరిగా 2021 డిసెంబర్లో భారత్ వృద్ధి అంచనాలను ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి 7.8 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనాలు వ్యక్తీకరించింది. కానీ, అప్పటికి ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండగా, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం కూడా లేదు. ముఖ్యంగా గత మూడు నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోవడం తెలిసిందే. 2023–24లో 6.5 శాతం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతంగా ఎస్అండ్పీ అంచనా వేసింది. ‘‘చివరిసారి మా వృద్ధి అంచనాల తర్వాత రిస్క్లు పెరిగిపోయాయి. రష్యా–ఉక్రెయిన్ వివాదం వృద్ధి రేటును కిందకు తీసుకెళుతుంది’’అని ఎస్అండ్పీ పేర్కొంది. ఇక గడిచిన ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 8.9 శాతంగా నమోదు కావచ్చని అంచనా. ఈ నెలాఖరులో ఈ గణాంకాలు రానున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉండొచ్చని ఎస్అండ్పీ తెలిపింది. -
ఏప్రిల్లో సేవల రంగం భేష్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఏప్రిల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 57.9కి ఎగసింది. గత 5 నెలల్లో ఈ స్థాయి నమో దు ఇదే తొలిసారి. మార్చిలో సూచీ 53.6 వద్ద ఉంది. కొత్త వర్క్ ఆర్డర్ల పెరుగుదల, సానుకూ ల వ్యాపార క్రియాశీలత వంటి అంశాలు ఇండెక్స్కు బలాన్ని అందించాయి. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ‘సేవల పీఎంఐ డేటా ప్రోత్సాహకరంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణం’ అని ఎస్అండ్పీ గ్లోబల్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. సేవలు, తయారీ... దూకుడే: కాగా సేవలు, తయారీ రంగం కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ మార్చిలో 54.3 వద్ద ఉంటే, ఏప్రిల్లో 57.6కు ఎగసింది. ఈ సూచీ కూడా ఐదు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల్లో కొంత మెరుగుదల కనబడింది. ఒక్క తయారీకి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. -
వేవ్లతో భారత్ ఎకానమీకి దెబ్బ,11 నుంచి 9.5 శాతానికి తగ్గిన వృద్దిరేటు
న్యూఢిల్లీ: మహమ్మారి తదుపరి వేవ్ల నుంచి భారత్ ఎకానమీకి ఇబ్బంది పొంచి ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవుట్లుక్ అనిశ్చితిలో ఉందని హెచ్చరించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తొలి (మార్చినాటి) అంచనాల 11 శాతాన్ని తాజాగా 9.5 శాతానికి తగ్గించింది. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఏప్రిల్, మే నెలల్లో సెకండ్వేవ్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాలెన్స్ షీట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం వచ్చే రెండేళ్లలో కనబడుతుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతానికి పరిమితం అవుతుంది. వ్యాక్సినేషన్ నత్తనడక నడుస్తుండడం ప్రతికూలాంశం. మొత్తం ప్రజల్లో కేవలం 15 శాతం మం దికి మాత్రమే ఇప్పటి వరకూ తొలి విడత వ్యాక్సినేషన్ జరిగింది. అయితే ఇకపై వ్యాక్సినేషన్ మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నాం. మొదటివేవ్తో పోల్చితే రెండవ వేవ్లో తయారీ, ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినకపోయినప్పటికీ, సేవల రంగం మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. వాహన విక్రయాల వంటి కీలక వినియోగ సూచీలు 2021 మేలో తీవ్రంగా పడిపోయాయి. వినియోగ విశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆంక్షలు, లాక్డౌన్ నిబంధనలు తగ్గుతున్నాయి. రవాణా మెరుగుపడుతోంది. అయితే రికవరీ 2021 తొలి మూడు నెలల నాటి స్థాయిలో వేగంగా ఉండకపోవచ్చు. కుటుంబాల పొదుపు రేట్లు పడిపోతున్నాయి. దీనితో వినియోగానికి మద్దతు లభించడంలేదు. ఒకవేళ ఉన్న కొద్దోగొప్పో డబ్బును కుటుంబాలు పొదుపుచేసుకోవడం మొదలుపెడితే, ఎకానమీ పునఃప్రారంభమైనా కుటుంబాల పరంగా వ్యయాలు అంతగా వేగం పుంజుకోకపోచ్చు. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాలు తగిన సరళతరంగానే కొనసాగవచ్చు. అయితే ఇప్పట్లో తాజా ఉద్దీపన ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (2–6 శ్రేణి) కన్నా అధికంగా ఆరు శాతంపైగా కొనసాగుతున్న పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంక్ మరో దఫా రెపో రేటు కోతకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) అవకాశం లేదు. దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ద్రవ్య విధానం విషయంలో ప్రభుత్వానికి పరిమితులున్నాయి. ఇందులో మొదటిది సెకండ్ వేవ్ రావడానికి ముందే– ఫిబ్రవరి 1వ తేదీన 2021–22 బడ్జెట్ను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి. భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22లో రెండంకెలపైనే ఉంటుందని సెకండ్వేవ్కు ముందు పలు విశ్లేషణా సంస్థలు అంచనావేశాయి. అయితే తరువాత కాలంలో ఈ రేటును ఒకంకెలోపునకు తగ్గించేశాయి. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఈ నెల ప్రారంభంలో వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. -
బ్యాంకింగ్ డిజిటలైజేషన్లో బాలారిష్టాలు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ పక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ, చిన్న ప్రైవేటు రంగ బ్యాంకుల తక్కువ లాభదాయకత, మొండిబకాయిల భారం వంటి అంశాలను ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది. ‘రిటైల్ బ్యాంకింగ్లో సాంకేతిక పరమైన అవరోధాలు: పెద్ద బ్యాంకుల్లో మారాల్సిన పరిస్థితులు’’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్లో ప్రధానమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థ– యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగం భారీగా పెరిగేందుకు కోవిడ్–19 ప్రేరిత అంశాలు దోహదపడుతున్నాయి. 2020 జూన్ నుంచి నవంబర్ మధ్య గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ దాదాపు రెట్టింపయ్యింది. ► మొబైల్ పేమెంట్ యూజర్లు ఈ–వాలెట్ల నుంచి యూపీఐ వైపునకు మారుతున్నారు. 2020 అక్టోబర్లో మొత్తం పేమెంట్స్ మార్కెట్ లావాదేవీల్లో యూపీఐ వాటా 51 శాతం కావడం గమనార్హం. ► ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ కనెక్టివిటిలో పురోగతి, సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడే యువత అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు దోహదపడతాయి. ► బ్యాంకింగ్లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే మొండిబకాయిల భారం, తక్కువ లాభదాయకత వంటి అంశాలు సాంకేతికతపై బ్యాంకింగ్ వ్యయాలను క్లిష్టతరం చేస్తున్నాయి. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు, కొన్ని బ్యాంకింగ్–యేతర ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) బ్యాంకింగ్ విషయంలో సాంకేతిక అవరోధాలను విజవంతంగా అధిగమించగలుగుతున్నాయి. అలాగే పలు ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్లకు సంబంధించి పలు సేవల విషయంలో ఆధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాయి. ► సాంప్రదాయక బ్యాంకులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల మధ్య భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాంకులు తమ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. -
యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ డౌన్గ్రేడ్
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ బ్లూచిప్ బజాజ్ ఫైనాన్స్ల రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసింది. ‘జంక్’ హోదాను ప్రకటించింది. తద్వారా కోవిడ్-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్ అంతర్జాతీయ ఫైనాన్షియల్, గిఫ్ట్ సిటీ, హాంకాంగ్ బ్రాంచీల రేటింగ్స్ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్గ్రేడ్ చేసింది. బాండ్ల రేటింగ్ను BB కేటగిరీకి సవరిస్తే జంక్ స్థాయికి చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఎకనమిక్ రిస్కుల నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ ఈ సందర్భంగా పేర్కొంది. పటిష్టం దేశీ బ్యాంకింగ్ వ్యవస్థ సగటుతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ రుణ నాణ్యత అత్యుత్తమమంటూ ఎస్అండ్పీ పేర్కొంది. అయితే అంతర్జాతీయ సంస్థలతో చూస్తే.. మొండి బకాయిలు(ఎన్పీఏలు) అధికంగా నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. అయినప్పటికీ మార్కెట్ వాటాను నిలుపుకోవడంతోపాటు, తగినన్ని పెట్టుబడులతో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఎన్బీఎఫ్సీ.. బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్ను సైతం ఎస్అండ్పీ గ్లోబల్ తాజాగా డౌన్గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. ఈ బాటలో మరో ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ క్రెడిట్ రేటింగ్ను సైతం BB/ప్రతికూలం/B నుంచి BB/watch Negative/Bకు డౌన్గ్రేడ్ చేసింది. ఇదే విధంగా ఇండియన్ బ్యాంక్ రేటింగ్ను క్రెడిట్ వాచ్గా సవరించింది. రానున్న త్రైమాసికాలలో బ్యాంక్ క్రెడిట్ ప్రొఫైల్ బలహీనపడనున్నట్లు ఎస్అండ్పీ అంచనా వేసింది. అలహాబాద్ బ్యాంక్ విలీనంతోపాటు.. కోవిడ్-19 కారణంగా బ్యాంక్ అధిక రిస్కులను ఎదుర్కొనే అవకాశమున్నట్లు ఎస్అండ్పీ భావిస్తోంది. కొనసాగింపు.. ఇతర బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్లకు గతంలో ఇచ్చిన రేటింగ్స్ను కొనసాగించనున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. అయితే మణప్పురం ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్ప్ల రేటింగ్స్ను డౌన్గ్రేడ్ చేసింది. హీరో ఫిన్కార్ప్, ముత్తూట్ ఫైనాన్స్ల రేటింగ్స్ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. -
భారత్ ఎకానమీ అస్తవ్యస్తం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందిలో ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్ అండ్ పీ పేర్కొంది. 2021 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 5% క్షీణిస్తుందని తాజా నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్ కట్టడిలో కష్టాలు, విధాన పరమైన నిర్ణయాల అమల్లో జాప్యం, పైనాన్షియల్ రంగంసహా పలు విభాగాల్లో అనిశ్చితి ధోరణి వంటి అంశాలు దీనికి కారణం. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021–22లో ఆర్థిక వ్యవస్థ కొంత వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని అంచనావేసింది. కరోనా ఎఫెక్ట్తో ఆసియా–పసిఫిక్ ప్రాంతం మూడు ట్రిలియన్ డాలర్లను నష్టపోయే వీలుందని తెలిపింది. ఈ ప్రాంతం ఆర్థిక వ్యవస్థ 2020లో 1.3 శాతం నష్టపోతుందని అయితే 2021లో 6.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని పేర్కొంది. కాగా చైనా ఆర్థికాభివృద్ధి 2020, 2021ల్లో వరుసగా 1.2 శాతం, 7.4 శాతాలుగా నమోదవుతాయని అంచనావేసింది. డీ అండ్ బీ చెప్పింది ఇదే: దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు, కోవిడ్–19 కేసులు పెరుగుతుండడం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ డీ అండ్ బీ పేర్కొంది. ఇక సరఫరాల చైన్ దెబ్బతింటే ఆహార ధరలూ తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వ్యవస్థలో డిమాండ్ మందగమనం కొనసాగుతుందని, వలస కార్మికుల కొరత కారణంగా కంపెనీలకు ప్రత్యేకించి లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. -
బ్యాంక్లపై కరోనా పిడుగు
ముంబై: కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం కావడం.... మన దేశపు బ్యాంక్లపై ఈ ఏడాది తీవ్రమైన ప్రభావమే చూపనున్నది. మొండి బకాయిలు 2 శాతం, వడ్డీ వ్యయాలు 1.3 శాతం మేర పెరుగుతాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుందని, మరింత కాలమే ఈ వైరస్ కల్లోలం కొనసాగుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయని ఈ సంస్థకు చెందిన క్రెడిట్ ఎనలిస్ట్ గావిన్ గన్నింగ్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ► ఈ ఏడాది ఆర్థిక రంగ కష్టాలు అంచనాలను మించి ఉంటాయి. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో ఆర్థిక స్థితిగతులు మరింత అస్తవ్యస్తమవుతాయి. ఇది బ్యాంక్ రుణాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. ► ప్రపంచ వ్యాప్తంగా బ్యాంక్ల వడ్డీ వ్యయాలు అదనంగా 30,000 కోట్ల డాలర్లు, మొండి బకాయిలు 60,000 కోట్ల డాలర్ల మేర పెరుగుతాయి. ► కరోనా కల్లోలం కారణంగా మొదటి దశలో కార్పొరేట్ రంగమే అధికంగా కుదేలైంది. బ్యాంకింగ్ రంగానికి సెగ పెద్దగా తగల్లేదు. ఈ వైరస్ ఉధృతి నానాటికీ తీవ్రమవుతుండటంతో బ్యాంకింగ్ రంగంపై ప్రభావం తీవ్రంగానే ఉండనున్నది. ► ఈ ఏడాది చైనా బ్యాంక్ల మొండి బకాయిలు కూడా 2 శాతం మేర పెరుగుతాయి. వడ్డీ వ్యయాలు మాత్రం 1 శాతం మేర మాత్రమే పెరుగుతాయి. -
బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా సగం పైగా తగ్గించేయడం గమనార్హం. లాక్డౌన్లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్పైనా గణనీయంగా ఉండబోతున్నాయని వివరించింది. చైనాలో తొలి దశలో తయారీ కార్యకలాపాల నిలిపివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావాలు మరింతగా విస్తరించాయని పేర్కొంది. ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా మాంద్యం వస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత అంచనాలను 2 శాతానికి కుదిస్తున్నాం‘ అని ఫిచ్ తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ గత వారమే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి. చిన్న సంస్థలు, బ్యాంకులకు దెబ్బ... వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోనుండటంతో లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు, సేవల రంగాలపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. సాధారణంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుందని, వారి ఆదాయాలేమైనా తగ్గిన పక్షంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తవచ్చని తెలిపింది. ‘ఈ పరిస్థితుల్లో భారత్లోని ఎన్బీఎఫ్సీలు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్డౌన్తో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్యకలాపాలు దెబ్బతినొచ్చు. కరోనా కేసులు స్థానికంగా పెరిగితే ఆర్థికంగా సెంటిమెంటుపై కూడా దెబ్బతింటుంది. దీనితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎన్బీఎఫ్సీలు మళ్లీ పట్టాలు తప్పే అవకాశముంది‘ అని ఫిచ్ తెలిపింది. వచ్చే ఏడాది రికవరీ: ఏడీబీ అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇది భారత్లోనే శరవేగంగా విస్తరిస్తే, ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పవని ఏడీబీ తెలిపింది. అయితే, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ (ఏడీవో) నివేదికలో ఏడీబీ తెలిపింది. ‘ప్రస్తుతం అసాధారణ గడ్డుకాలంగా నడుస్తోంది. కరోనా ప్రజల జీవితాలతో పాటు వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది‘ అని ఏడీబీ ప్రెసిడెంట్ మసాత్సుగు అసకావా తెలిపారు. ‘ప్రపంచ వృద్ధికి, భారత రికవరీకి కరోనా పెను సవాలుగా మారింది. కానీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో గట్టిగా కోలుకోవచ్చు. సంస్కరణల ఊతంతో అప్పుడు 6.2% ఉండొచ్చు‘ అని ఏడీబీ చీఫ్ ఎకానమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. మహమ్మారి బారిన పడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత్ వేగంగా స్పందించిందన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లపరంగా కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు రికవరీకి తోడ్పడగలవని చెప్పారు. ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3–4.8%కి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కమోడిటీల ధరల పతనం కూడా కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతోందని వివరించింది. 2020లో వృద్ధి 4.1 శాతానికి తగ్గి, 2021లో 6 శాతానికి రికవర్ కాగలదని తెలిపింది. -
మాంద్యం కోరల్లో!
ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది. మాంద్యం భయాలు... భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్ను కూడా నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం ‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► ఇండెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంకు 24 శాతం, పవర్గ్రిడ్ 12 శాతం, కోటక్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ 11 శాతం చొప్పున, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 శాతం, ఎన్టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది. భారత్ ‘వృద్ధి’కి ఎస్ అండ్ పీ కోత న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ, అమెరికా, యూరోప్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్లో ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్ అంచనావేసింది. 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది. క్రూడ్, బంగారం మరింత పతనం కోవిడ్–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. ► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ► ఇక క్రూడ్ విషయానికి వస్తే, స్వీట్ బ్యారల్ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ఆయిల్ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
హైదరాబాద్లో ఎస్అండ్పీ గ్లోబల్ రెండో సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనలిటిక్స్, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ హైదరాబాద్లో కొత్త ‘ఓరియన్’ కార్యాలయాన్ని ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రానికి రూ.70 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశామని కంపెనీ ఇండియా ఎండీ అభిషేక్ తోమర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 700 మంది సపోర్ట్ సిబ్బంది ఓరియన్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్అండ్పీ గ్లోబల్కు హైదరాబాద్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీ వద్ద ఒక కార్యాలయం ఉంది. ఇందులో 3,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంతే స్థాయిలో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తామని అభిషేక్ వెల్లడించారు. హైటెక్ సిటీ కార్యాలయం నుంచి ఈ సెంటర్కు కార్యకలాపాలను బదిలీ చేస్తామన్నారు. ఓరియన్ సెంటర్ కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అహ్మదాబాద్, గురుగ్రామ్తోసహా భారత్లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000. -
ముఖేష్ అంబానీ ఉచితాలకు ఇక ముగింపు
కోల్కత్తా : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్ భారీ కుదుపులకి లోనైన సంగతి తెలిసిందే. ధరల యుద్ధంతో టెలికాం దిగ్గజాలను ఇది అతలాకుతలం చేసింది. ఇక ఈ వార్కు తెరపడబోతుందట. రిలయన్స్ జియో తెరతీసిన ధరల యుద్ధం తుది దశల్లోకి చేరుకుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. వచ్చే 12-18 నెలలో ఒక దశ వద్ద జియో తన పోటీ వ్యూహాన్ని హేతుబద్ధం చేస్తుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తోంది. అంతేకాక ఇక రెవెన్యూలు, మార్జిన్లను ఆర్జించడంపైనే జియో ఫోకస్ చేస్తుందని పేర్కొంది. దీంతో ముఖేష్ అంబానీ ఉచితాలకు ఇక ముగింపుకు వస్తుందని తెలిపింది. '' భారీ డిస్కౌంట్స్, ఉచిత ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలో ఉన్న 10శాతం టెల్కో సబ్స్క్రైబర్ బేస్ను జియో సొంతం చేసుకుంది. కానీ ఈ భారీ డిస్కౌంట్ విధానాలు జీవితకాలం కొనసాగించలేదు'' అని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిస్ట్ అశుతోష్ శర్మ చెప్పారు. జియో తెరతీసిన ఈ గేమ్లో పాల్గొన్న పోటీదారులందరూ రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది. గతేడాది సెప్టెంబర్లో జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. జియో ప్రవేశంతో ఒక్కసారిగా టెలికాం మార్కెట్ అంతా తీవ్ర కఠినతరమైన పరిస్థితులను ఎదుర్కొంది. 80 శాతం ఈ రంగ రెవెన్యూలను అంటే వాయిస్ కాల్స్ను జియో జీవితకాలం ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. జియో డేటా రేట్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కంపెనీల కంటే తక్కువగానే అందిస్తోంది. జియో దెబ్బకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు కూడా ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ డేటా ఆఫర్లను తీసుకొచ్చాయి. రెవెన్యూలు, లాభాలు తక్కువ ఉన్నప్పటికీ, వారి మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో కన్సాలిడేషన్ ఏర్పడింది. వొడాఫోన్ ఇండియా, ఐడియాలు విలీనం ప్రక్రియలో ఉండగా.. టెలినార్ను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఇక ఆర్కామ్, ఎంటీఎస్, ఎయిర్సెల్లు కూడా ఇలానే ఉన్నాయి. ఈ కన్సాలిడేట్లో కేవలం మూడు సంస్థలే అంటే వొడాఫోన్-ఐడియా విలీన సంస్థ, ఎయిర్టెల్, జియోలే 75-85 శాతం ఇండస్ట్రి రెవెన్యూలను సొంతం చేసుకోనున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేస్తోంది. -
బ్యాంకులకు మరో రెండేళ్లు కష్టాలే!
♦ భారత బ్యాంకులపై ఒత్తిడి కొనసాగుతుంది ♦ ఆస్తుల నాణ్యత, లాభాల పరంగా సమస్యలుంటాయి ♦ ఎన్పీఏలు పెరుగుతాయి: ఎస్ అండ్ పీ రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ/ముంబై: ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకులపై ఒత్తిడి కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. సమస్యాత్మక రంగాల్లోని కంపెనీలకు అధిక రుణాలిచ్చిన ఫలితంగా ఎన్పీఏలు పెరుగుతూనే ఉంటాయని అంచనా వేసింది. ఫలితంగా ఆస్తుల నాణ్యత, లాభాలు, క్యాపిటలైజేషన్ పరంగా మరో ఏడాది నుంచి రెండేళ్ల పాటు బ్యాంకులపై ఒత్తిడి ఉంటుందని తెలిపింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత పరంగా బలహీన ధోరణి కొనసాగితే ఆర్థిక సవాళ్లు పెరిగినట్లు భావించాల్సి వస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అనలిస్ట్ గీతాచుగ్ చెప్పారు. ‘భారత్, చైనా బ్యాంకులపై ఆర్థికపరమైన కష్టాల నీలినీడలు’ పేరిట ఈ రెండు దేశాల్లోని బ్యాంకులను ఆస్తుల నాణ్యత, లాభాలు, క్యాపిటలైజేషన్, రుణాల వృద్ధి పరంగా పోల్చి నివేదిక రూపొందించింది. నివేదికలోని అంశాలివీ... ♦ భారత్ బ్యాంకుల మాదిరిగా చైనా బ్యాంకులు సైతం ఇవే సమస్యలతో కూడిన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ♦ భారత్, చైనా బ్యాంకులపై అధిక ఆర్థికపరమైన సవాళ్లు వాటి పరపతి అవకాశాలకు ప్రతిబంధకం. ♦ భారత్ పారిశ్రామికోత్పత్తిలో పురోగతి తక్కువగా ఉండడం, చైనాలో అధిక పారిశ్రామికోత్పత్తి వల్ల బ్యాంకులపై ఆస్తుల నాణ్యత పరమైన ఒత్తిడి కొనసాగుతుంది. బ్యాంకుల వడ్డీ మార్జిన్లలో క్షీణత ‘అధిక మొండిబకాయిలు, కార్పొరేట్ల రుణాలపై దృష్టి వల్ల భారత్లోని బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు (ఎన్ఐఎంలు) కుచించుకుపోతాయి. రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు ఇకపైనా తగ్గిస్తాయి. అయితే, రుణాలపై అధిక వ్యయాల కారణంగా లాభాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల ఉండకపోవచ్చు’ అని ఎస్అండ్పీ అనలిస్ట్ అమిత్ పాండే తెలిపారు. మూడేళ్లలో బ్యాంకులకు రూ. 2.5 లక్షల కోట్లివ్వాలి బాసెల్ -3 నిబంధనల ప్రకారం ఉండాల్సిన మూలధనానికి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే మూడేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల నిధులు అందించాల్సి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకులు భారీ మొండి బకాయిల సమస్యలో చిక్కుకున్నాయని, ఇపుడవి మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే పరిస్థితిలో లేవని, కనుక నిధుల పరంగా ప్రభుత్వంపై ఆధారపడక తప్పదని ఎస్అండ్పీ అనలిస్ట్ గీతాచుగ్ చెప్పారు. ‘అవసరమైన మూలధనాన్ని సమీకరించలేకపోతే అవి కొత్త రుణాలివ్వలేవు. దానివల్ల మార్కెట్ వాటాను కోల్పోవాల్సి వస్తుంది. చివరికది బ్యాంకుల మధ్య స్థిరీకరణకు దారితీస్తుంది. బలహీన, అసమర్థ బ్యాంకుల్ని బలమైన బ్యాంకులు చేజిక్కించుకోవచ్చు’’ అని గీతాచుగ్ వివరించారు. బ్యాంకులు ఎన్పీఏలను 8.5%గా పేర్కొన్నప్పటికీ తమ అంచనా ప్రకారం ఇవి 13%గా ఉండవచ్చన్నారు. భారత్ కంటే చైనాలో ఎన్పీఏల సమస్య తక్కువన్నారు. మేకిన్ ఇండియాకు మౌలిక వసతులే అడ్డంకి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి మౌలిక వసతుల లేమి పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నట్లు గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్అండ్పీ తెలియజేసింది. మౌలిక వసతుల లోపం కారణంగా జీడీపీలో 5 శాతం వరకు అదనంగా వ్యయం అవుతున్నట్లు ఎస్అండ్పీ అనలిస్ట్ అభిషేక్ దంగ్రా తెలిపారు. మౌలిక వసతుల్లో వృద్ధితో ఎగుమతుల పరంగా పోటీతత్వం పెరుగుతుందనే అంచనాలున్నట్టు చెప్పారు. ‘‘ఎగుమతులకు కేంద్రంగా ఉన్న చైనా సైతం మౌలిక వసతుల పరంగా సమస్యలు ఎదుర్కొంటోంది. మౌలిక వసతుల అభివృద్ధి కోసం వెచ్చించే ప్రతి రూపాయి జీడీపీకి రూ.2 తెచ్చిపెడుతుంది. జీఎస్టీ బిల్లు ఆమోదమనేది లాజిస్టిక్స్, తయారీ రంగాలకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’’ అని దంగ్రా వివరించారు. ‘‘సరైన నియంత్రణ విధానంతో ఈ రంగానికి మేలు జరుగుతుంది. చక్కని నియంత్రణ వల్ల దేశీయంగా విద్యుదుత్పత్తి రంగం టర్న్ అరౌండ్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి’’ అన్నారాయన. ప్రభుత్వం రవాణా రంగంపై వ్యయాన్ని పెంచినా, అధిక రుణ భారంతో ప్రాజెక్టులు ఆలస్యం కావొచ్చని హెచ్చరించారు. నిధుల పరంగా ప్రభుత్వానికి ఉన్న పరిమితులతో... ప్రైవేటు రంగం పాత్ర తప్పనిసరి అని స్పష్టంచేశారు.