
సోనియా ధావన్ , పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ
సొంత కంపెనీలో డాటా బ్రీచ్కు పాల్పడింది పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత కార్యదర్శి సోనియా ధావన్. అంతేకాకుండా 20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ఆ సమాచారన్నంతా బహిర్గతం చేస్తానంటూ ఆయనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలో కంపెనీ కార్యాలయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేటీఎం నోయిడా విభాగం ధ్రువీకరించింది. విచారణ పూర్తయ్యేంత వరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొంది.
బాస్ ఫోన్, లాప్టాప్ల నుంచి..
పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా ఆ సంస్థలోనే పనిచేస్తోంది. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన లాప్టాప్, మొబైల్, ఆఫీస్ కంప్యూటర్లను వినియోగించేది. ఈ క్రమంలోనే కంపెనీతో పాటు విజయ్ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆమె దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన డేటా మొత్తాన్ని రోహిత్ కోమల్ అనే వ్యక్తికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అతడు విజయ్ సోదరుడు, పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేశాడు. ‘20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి ప్రజల్లో పేటీఎంకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తామంటూ’ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయాన్ని అజయ్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా సోనియా సహా ఆమెకు సహకరించిన వ్యక్తులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment