అకాల మరణాలతో ఆగినపెళ్లిళ్లు..! | Death In Family Marriage Postponed In Achampet | Sakshi
Sakshi News home page

Apr 28 2018 7:15 AM | Updated on Apr 28 2018 7:17 AM

Death In Family Marriage Postponed In Achampet - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, ఇన్‌సెట్లో నిరంజన్‌ (ఫైల్‌)

సాక్షి, ఉప్పునుంతల (అచ్చంపేట): అప్పటి వరకు పెళ్లి సందడితో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. తండ్రి అకాల మృతితో పెళ్లి పీఠల వరకు వచ్చిన పెళ్లి నిలిచిపోయింది. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మండలంలోని కాంసానిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాచర్ల నిరంజన్‌(50), రేణమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

పెద్దకూతురికి గతంలోనే వివాహం కాగా.. రెండో కూతురు అఖిల వివాహం ఆదివారం వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన శంకర్‌తో నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పందిరి వేసి నిరంజన్‌ ఇంట్లో గురువారం సత్యనారాయణ వ్రతం నిర్వహించి అఖిలను పెళ్లి కూతుర్ని చేశారు. శుక్రవారం అమ్మాయి ఇంట్లో ప్రతానం కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా గురువారం రాత్రి  అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.

మరో రెండు గంటల్లో పెళ్లి కుమారునికి సంబంధించిన బంధువులు కాంసానిపల్లి రావాల్సి ఉంది. రాత్రి పదిగంటల సమయంలో నిరంజన్‌ భోజనం చేస్తుడంగా ఛాతిలో నొప్పి వస్తుందని కుప్పకూలి కొద్దిసేపటికే మృతిచెందాడు. దీంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి మృతితో కూతురు పెళ్లి ఆగిపోవడం బంధువులను, గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.

వడదెబ్బతో కౌలురైతు...
పాన్‌గల్‌ (వనపర్తి): పొలం పనులు చేస్తున్న ఓ కౌలురైతు వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం పాన్‌గల్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగనమోని రాములు(58) భార్య బాలమ్మతో కలిసి శుక్రవారం కౌలుకు తీసుకున్న పొలంలో చెత్తను, కంప చెట్లను తొలగించే పనులు చేస్తున్నారు. ఈ తీవ్రమైన ఎండకు వడదెబ్బకు గురై పొలంలోనే సొమ్మసిల్లి పడిపోయి మృతిచెందాడు.
గత రెండు రోజులుగా వ్యవసాయ పనులు చేస్తుండటంతో వడదెబ్బకు గురై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాములుకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటి యజమాని అకాల మరణంతో కటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా రాములు మృతితో శనివారం జరగాల్సిన సోదరుని కుమారుని వివాహం నిలిచిపోయింది.

వడదెబ్బతో మృతిచెందిన రాములు కుటుంబాన్ని తహసీల్దార్‌ అలెగ్జాండర్, ఆర్‌ఐ బాల్‌రాంనాయక్, సర్పంచ్‌ సురేఖ, మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు ఆనందం, సింగోటం, నర్సింహ, వార్డుసభ్యులు భాస్కర్‌రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మత్స్యకార్మిక సంఘం నాయకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement