ఏడేళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి | Father Molestation on Seven Years Daughter In Guntur | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి

Sep 12 2018 1:54 PM | Updated on Sep 12 2018 1:54 PM

Father Molestation on Seven Years Daughter In Guntur - Sakshi

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

గుంటూరు, తాడికొండ: కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి ఏడేళ్ల వయసున్న కన్న కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తాడికొండలో చోటుచేసుకుంది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌ బీ అనే మహిళకు 7 సంవత్సరాల క్రితం గుంటూరు లక్ష్మీనారాయణపురానికి చెందిన షేక్‌ రహ్మల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అతనికి అప్పటికే ఒక వివాహం జరిగి భార్య మరణించగా, ఇది రెండో వివాహం. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగబిడ్డ సంతానం. తొలినుంచి భర్త సైకో మనస్తత్వంతో ఇబ్బందులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన నాగుల్‌బీ ఠాణాలో కేసు పెట్టి భర్తకు దూరంగా ఉంటోంది.

పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల భార్యతో కాపురం చేసేందుకు వచ్చిన రహ్మల్‌ రెండు నెలలుగా తాడికొండలోనే ఉంటున్నాడు. ఈ నెల మూడో తేదీన పాఠశాల నుంచి వచ్చిన పెద్ద కుమార్తె (7) ను తినుబండారం కొనిపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే రోజు గుంటూరుకు వెళ్లిపోయిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె కడుపు నొప్పి అంటూ బాధపడుతుంటే వేడి చేసి ఉంటుందని భావించిన తల్లి అంతగా పట్టించుకోలేదు. తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో 10న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన తల్లికి వైద్యులు బాలికపై లైంగిక దాడికి గురైందని చెప్పడంతో విస్తుపోయింది. కుమార్తెను ఆరా తీయగా.. తండ్రే తనను బయటకు తీసుకెళ్లి ముద్దులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడని తెలపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాడికొండ ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement