Guntur Crime News
-
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహొసినిగా గుర్తించారు. చదవండి:ఇల్లు కొనుక్కున్నా.. పట్టా వెనక్కి తీసుకోండి -
ఉద్యోగం పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు.. 40 మందికి టోకరా
పెదకాకాని: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు మోసపోయారు. బాధితుల కథనం.. గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని కంతేరు అడ్డరోడ్డులో ఉన్న ఐజేఎం అపార్ట్మెంట్స్లో విజయవాడ ట్రెజరీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న దావులూరి మాల్యాద్రి నివాసం ఉంటున్నాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వికలాంగ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న మాత జయప్రకాష్రెడ్డికి దావులూరి మాల్యాద్రి పరిచయం అయ్యాడు. డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు మధ్యవర్తిగా లాజర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు.. జయప్రకాష్రెడ్డి కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామం కావడంతో ఆయన పరిచయం ఉన్న మరో ఏడుగురితో కలసి మొత్తం ఎనిమిది మంది లాజర్ను కలిశారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల అవుతుందని ముందుగా అడ్వాన్స్ లక్ష చొప్పున చెల్లించాలని లాజర్ చెప్పడంతో 8 లక్షలు చెల్లించారు. ఎక్కువ మందిని చూసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని చెప్పడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న మరో 32 మందిని పరిచయం చేశారు. 40 మంది నుంచి ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించారు. వారి వద్ద నుంచి దావులూరి మాల్యాద్రి, లాజరు అతడి భార్య అరుణ వసూలు చేశారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోగా అదిగో ఇదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీయడంతో అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకూ షూరిటీగా నోట్లు, 100 స్టాంప్ పేపరుపైనా దావులూరి మాల్యాద్రి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతకాలానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మీకు ఉద్యోగాలు ఇప్పించం, చేతనైంది చేసుకోండి అంటూ దుర్భాషలాడాడు. అలానే ఉద్యోగానికి నగదు చెల్లించిన వారిలో ఒకరైన ఎం.రాజేష్ బావ బి. వెంకటేశ్వరరావు(కానిస్టేబుల్) నిన్ను నమ్మి డబ్బులు చెల్లించాం, నీ చెక్ ఇవ్వాలని మాత జయప్రకాష్రెడ్డి ఇంటిపైకి వచ్చి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ఆశపడి 40 మంది అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల చొప్పున చెల్లించి మోసపోయామని, మాకు మా కుటుంబసభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని, మోసపోయిన నగదు ఇప్పించాలని బాధితులు పెదకాకాని పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు
ఇంకా పూర్తిగా ఊహ కూడా తెలియని వయస్సు.. సరదాగా తోటి స్నేహితులతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన చిన్నారిని 12 ఏళ్ల ప్రాయంలోనే మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు ఆ కిరాతకులు.. అంగట్లో వస్తువులా ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక విక్రయానికి తెగబడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తిప్పుతూ వ్యభిచారం చేయించారు. ఈ వేధింపులు తాళలేక నరరూప రాక్షసుల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. కేసును సీరియస్గా తీసుకున్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.సుప్రజ ఈ చిన్నారికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో అపర కాళికలా మారారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేసులో ఎంత పెద్దవారు ఉన్నా పోలీసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. పది నెలల కాలంలో 79 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజులపాటు రిమాండ్ విధించేలా చర్యలు చేపట్టారు. దీనిపై సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులందరికీ శిక్ష పడటం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరును హైకోర్టు సైతం ప్రశంసించింది. ఆదిశక్తిలా ఉరికిన ఏఎస్పీ సుప్రజ వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుల నుంచి తప్పించుకున్న బాలిక మేడికొండూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తనను తీసుకువెళ్లిన ప్రాంతాలన్నీ చెప్పినా అప్పటి స్టేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె.సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. ఆదిశక్తి అవతారంలా ముందుకురికారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజ చేతే విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించటంతోపాటు, కేసు ఛేదనలో ప్రతిభ చాటిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఒక కేసు.. 80 మంది దోషులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసుస్టేషన్ పరిధిలో గత ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక తల్లికి కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో ఉన్న తరుణంలో తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకుని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత ఆమె మరొకరికి బాలికను విక్రయించింది. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు. తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పసిమొగ్గ వాడిపోయింది. ఆఖరికి రాజస్థాన్–పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకున్న పాప ఎలాగో మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో 80 మంది నిందితులుగా తేలారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మాత్రం లండన్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీస్ (ఎల్ఓసీ) జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. న్యాయంతో కొంత ఉపశమనం సమాజంలో కొందరు మానవమృగాల్లా వ్యవహరిస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇది ఎంతో బాధాకరం. వికృత చేష్టలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. కిరాతకులకు శిక్షలు వేయించినప్పుడు బాధిత చిన్నారులకు కొంతైనా న్యాయం చేయగలిగామన్న సంతోషం కలుగుతుంది. మేడికొండూరు కేసులోనూ సుమారు 10 నెలలు కష్టపడి చార్జిïÙటు దాఖలు చేశాం. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తాం. – కె.సుప్రజ అడిషనల్ ఎస్పీ, గుంటూరు జిల్లా పసిపాపలకు న్యాయం చేసి.. సుప్రజ ఈస్ట్ డీఎస్పీగా పనిచేసిన సమయంలో కొత్తపేటలో ఐదేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితులు నేపాల్లో ఉంటే వారిని రప్పించి అరెస్టు చేయడంతోపాటు ప్రధాన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు. లాలాపేటలో రెండేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడినప్పుడు కూడా విచారణ చేపట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. -
చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా?
సాక్షి, తాడేపల్లి (మంగళగిరి): తాడేపల్లి మండల పరిధిలోని మెల్లెంపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అదృశ్యమైన బాలుడు తమ ఇంటికి 200 మీటర్ల దూరంలో పంట పొలాల్లో ఉన్న కందకంలో మృతి చెందినట్లు స్థానికులు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం... మెల్లెంపూడి ఎస్టీ కాలనీలో నివాసం ఉండే కుర్ర భగవానియా నాయక్, అమల దంపతుల రెండో కుమారుడు భార్గవ తేజ (6). ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడు కనిపించడం లేదంటూ తండ్రి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండే నాగేశ్వరరావు అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా కందకంలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కందకంలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. బహుశా కుక్కలు కానీ, కోతులు కానీ వెంటపడటంతో కందకంలో పడి ఉంటాడని, అక్కడ బాలుడిని అవి గాయపరిచి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అనుమానాలు ఈ ఘటనపై కుటుంబసభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కావాలనే బాలుడిని దారుణంగా కొట్టి చంపి ఉంటారని పేర్కొంటున్నారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో కుక్కలు గాని, కోతులు గాని దాడి చేస్తే తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అవే దాడిచేసి ఉంటే కుడి కాలు విరిగి, ఎముక బయటకు వచ్చేంత పరిస్థితి ఉంటుందా? చెయ్యి ఎందుకు విరుగుతుంది? కందకంలో పడినంత మాత్రాన అంత పెద్ద దెబ్బలు తగులుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నార్త్జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్, తాడేపల్లి రూరల్ సీఐ అంకమ్మరావు, ఎస్సై వినోద్కుమార్ ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. గుంటూరు నుంచి డాగ్ స్క్వాడ్ను, వేలిముద్రల నిపుణులను పిలిపించి దర్యాప్తు చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? మండల పరిధిలోని వడ్డేశ్వరంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న అదృశ్యమైన బండి అఖిల్ (8), మెల్లెంపూడిలో మృతిచెందిన భార్గవతేజ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాల్లో నెల రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. అందులో ఒకరు మృతిచెందగా, మరొకరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. వడ్డేశ్వరం బాలుడి తల్లి, మెల్లెంపూడి బాలుడి తండ్రి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కలిసి పనిచేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలూ ఒకే విధంగా ఉండటంతో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: సెల్ఫోన్ వాడొద్దన్నందుకు.. మనస్తాపంతో! పీహెచ్డీ చేసి.. కళ్లు కాంపౌండ్లో ‘మత్తు’ -
దారుణం: తల్లిని కడతేర్చిన కసాయి కూతురు
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): కన్నతల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల కథనం మేరకు... ఏటీ అగ్రహారం జీరో లైనులో నివసించే పూతాబత్తిని భూలక్ష్మి (58)కి కుమారుడు నాగరాజు, కుమార్తె దాసరి అలియాస్ భవనం రమాదేవి ఉన్నారు. ఆరేళ్ల కుమారుడు రాహుల్రెడ్డితో కలిసి రమాదేవి తల్లి వద్దే ఉంటోంది. వ్యసనాలకు బానిసగా మారిన రమాదేవి కుమారుడిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో 25వ తేదీ రాత్రి రమాదేవి బయటకు వెళ్లడంతో కుమారుడు రాహుల్ ఆహారం తీసుకోకుండా ఏడుస్తుండటంతో తల్లి భూలక్ష్మి కుమార్తెకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పింది. ఇంటికి వచ్చిన తరువాత తల్లీకుమార్తెల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమాదేవి తల్లి భూలక్ష్మి గొంతు నులుముతుండగా నాగరాజు గమనించి, అడ్డుకుని, విడిపించాడు. అనంతరం తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ భూలక్ష్మి మృతిచెందింది. నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తరగతి గదిలో టీచర్పై హత్యాయత్నం భార్య కాపురానికి రావడంలేదని.. అత్తను చంపేశాడు -
‘మమ్మల్ని క్షమించండి. విడిపోయి బతకలేం’
సాక్షి, సత్తెనపల్లి: ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్థాపానికి గురైన ప్రేమికులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తెనపల్లి పట్టణంలోని స్వామి వివేకానంద నగర్లో సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బోండాట ప్రదీప్తి (17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన దేవళ్ల కిరణ్కుమార్ అలియాస్ సాయి కిరణ్కుమార్ (21) తాపీ పనులు చేస్తుంటాడు. గతంలో ఇద్దరి ఇళ్లూ దగ్గరగా ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐదు నెలల క్రితం పెద్దలకు తెలియడంతో ఇరు కుటుంబాల పెద్దలు మందలించారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీసు స్టేషన్లో యువతి తల్లి అరుణ ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్ కుమార్ను రాజమండ్రికి పంపారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో ప్రదీప్తి ఇంటి నుంచి బయటకు రాగా, కిరణ్కుమార్ రాజమండ్రి నుంచి వచ్చాడు. ఇదరూ కలిసి వివాహం చేసుకుని స్వామి వివేకానంద నగర్లోని చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘అమ్మ, నాన్న, అత్త, మామయ్య మమ్మల్ని క్షమించండి. మేము విడిపోయి బతకలేము.. అందుకే చచ్చి పోతున్నాం.. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... అందుకే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా చచ్చిపోతున్నాం.. మమ్మల్ని క్షమించండి’... అంటూ డి.సాయికిరణ్కుమార్, డి.ప్రదీప్తి పేర్లతో సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహారావు, ముప్పాళ్ల ఎస్సై నజీర్ బేగ్లు సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: మహిళ మృతి
సాక్షి, కాకుమాను: వివాహతేర సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎస్.సుందర్ రాజన్ తెలిపిన వివరాల మేరకు... జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత (28) అనే మహిళకు కొంత కాలం క్రితం కానీషా అనే వ్యక్తితో వివాహమైంది. యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో సునీతకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారి బంధం కొనసాగించేందుకు వీలు లేకపోవటంతో ఇద్దరు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కాకుమాను శివారులోకి వెళ్లి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ విషయాన్ని వేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి సునీత మృతి చెందగా వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. సునీతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సునీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు మార్చురీకి తరలించారు. వేణుగోపాల్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చస్తున్నారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి గ్రామంలో మరదలిపై బావ దాడి చేయడంతో, మరదలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. జరిగిన ఈ ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిశేషు అనే వ్యక్తి పెన్షన్ డబ్బులు విషయంలో పెద్దకొడుకు శివశంకర్ తనకు కావాలని అడుగుతుండగా, తండ్రి మాత్రం చిన్న కొడుక్కు ఇస్తానని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న శివశంకర్ ఇదంతా మరదలే చేస్తుందని భావించి జొన్నా గీతాసురేఖపై అసభ్యంగా మాట్లాడుతూ దాడికి పాల్పడ్డాడు. మనస్తాపం చెందిన గీతా సురేఖ ఇంట్లో ఉన్న గ్లైసిల్ మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన మామ బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. జరిగిన ఈ ఘటనపై గీతాసురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. -
దారుణం: ప్రియుడిని చంపి శవాన్ని ఇంట్లోనే..
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడిని హతమార్చి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఉదంతం చెరుకుపల్లిలో వెలుగు చూసింది. వివరాలు.. గుంటూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటూ శిరీష అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చి రూ. 15 లక్షలు భరణం ఇచ్చేందుకు చిరంజీవి తన మెడికల్ షాపును విక్రయించాడు. ఆ డబ్బు మీద ఆశతో శిరీష చిరంజీవిని చంపాలని నిర్ణయించుకుంది. అయితే శిరీషకు మరోకరితో కూడా వివాహేతర సంబంధం ఉంది. దీంతో అతడితో కలిసి చిరంజీవిని చంపేందుకు శిరీష పథకం రచించింది. అనుకున్నట్టుగానే ప్రియుడితో కలిసి చిరంజీవిని హతమార్చి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. మృతుడు తండ్రి సుబ్బారావు ఫిర్యాదుతో విషయం వెలుగులో వచ్చింది. చిరంజీవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీషతో పాటు ఆమె ప్రియుడు భానుప్రకాష్ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భర్తను ఇంట్లో పూడ్చి.. ప్రియునితో సహజీవనం
చెరుకుపల్లి(రేపల్లె): మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వ్యక్తి అదృశ్యమైన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా తన కుమారుడు బల్లేపల్లి చిరంజీవి కనిపించటం లేదని మండల కేంద్రమైన చెరుకుపల్లికి చెందిన బల్లేపల్లి సుబ్బారావు వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో చిరంజీవి భార్య కొల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి అక్కడ సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు ఆమెను విచారించగా నిర్ఘాంత పోయే విషయాలు వెలుగుచూసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు నెలల క్రితం ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చి వేశారని తెలుస్తోంది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు గ్రామానికి వెళ్లి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవిని హతమార్చటంలో సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరంజీవికి రెండో భార్య చిరంజీవి మొదటి భార్యతో వివాదం రావటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలోనే ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. చిరంజీవికి కొల్లూరులో మెడికల్ షాపు ఉండేది. ఆ సమయంలో కొల్లూరుకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చిరంజీవికి స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో అతని భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల స్థలం అమ్మగా రూ.20 లక్షలు వచ్చాయని, వాటిని ఇంట్లో భద్రపరచగా, అదే రోజు ప్రియునితో కలిసి చిరంజీవిని హత్య చేసి ఆ సొమ్ముతో కొల్లూరు వెళ్లిపోయి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. భయాందోళన చెందుతున్న గ్రామస్తులు చిరంజీవిని పాతిపెట్టారని భావిస్తున్న ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటంపై స్థానికులు కలవరపడుతున్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తాం దీనిపై రేపల్లె రూరల్ సీఐ బి. శ్రీనివాసరావును వివరణ కోరగా వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును మరింత వేగవంతం చేసి దర్యాప్తు చేపడుతున్నామని, నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
లాడ్జి అండర్గ్రౌండ్లో పేకాట శిబిరంపై దాడి
గుంటూరు ఈస్ట్ : అండర్గ్రౌండ్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని అరండల్పేట పోలీసులు ఛేదించారు. అమరావతి మెయిన్రోడ్డులోని ఓ లాడ్జిలో రెండో అంతస్థులోని బాత్రూము పక్కన గోడకు రధ్రం పెట్టి సెల్లార్లోకి మెట్లు ఏర్పాటు చేసుకుని బయటి వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చినా కనిపెట్టలేని విధంగా జూద గృహం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..అమరావతి రోడ్డు మెయిన్రోడ్డులోని డీలక్స్ లాడ్జిలో అండర్గ్రౌండ్లో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ లేకపోయినా పలువురు లాడ్జిలోకి వెళ్లి రావడం చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది. స్థానికులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్గా తీసుకుని పలువురు సీఐలను బృందగా ఏర్పాటు చేసి బుధవారం దాడి చేయించారు. లోపలకు వెళ్లిన పోలీసులకు పేకాట ఎక్కడ ఆడుతుంది తెలియలేదు. ఉన్నతాధికారులకు పేకాట నిర్వహణ సమాచారం పక్కాగా ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు లాడ్జిలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు. దీంతో సిబ్బంది అండర్గ్రౌండ్కు ఏర్పాటు చేసిన రహస్య ద్వారం చూపించారు. రెండో ఫ్లోర్లో బాత్రూము పక్కన చిన్న సందు పెట్టి అండర్గ్రౌండ్లో కింద హాలు ఏర్పాటు చేశారు. అండర్గ్రౌండ్లో 16 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్య నిర్వాహకుడు ముదనం పేరయ్య ముందుగానే పరారయ్యాడు. మిగిలిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరిలో లాడ్జి యజమాని ఉండటం గమనార్హం. వారి వద్ద నుంచి పోలీసులు రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
యువతిని వేధిస్తున్న అధ్యాపకుడి అరెస్టు
గుంటూరు ఈస్ట్: యువతిని వేధిస్తున్న ఘటనలో ఓ అధ్యాపకుడిని అరండల్పేట పోలీసులు అరెస్టు చేశారు. వివాహితుడైన ఆ అధ్యాపకుడు ప్రేమ పేరుతో గతంలో యువతిని మోసం చేసి, అరెస్టయ్యాడు. బెయిల్పై వచ్చి తిరిగి వేధిస్తుండడంతో పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. అరండల్పేట ఎస్ఐ ఎస్.రవీంద్ర కథనం మేరకు.. స్తంభాలగరువు ఎల్ఐసీ కాలనీ ఒకటో లైనుకు చెందిన చిలికా శ్రీనివాసరావు బ్రాడీపేటలో ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండేవాడు. అతడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఓ బీఈడీ కళాశాలలో చదువుతున్న ఓ యువతి శ్రీనివాసరావు వద్ద ఇంగ్లిష్ కోచింగ్ తీసుకునేది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను శ్రీనివాసరావు ప్రేమపేరుతో నమ్మించి నిశ్చితార్థం చేసుకుని రూ.2 లక్షలు తీసుకున్నాడు. అనంతరం తాను వివాహితుడినని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి పుట్టిన రోజునాడు కేకులు కోసి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం, పెళ్లి చేసుకోవాలని వత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె తల్లిని దుర్భాషలాడాడు. యువతికి వివాహం కాకుండా చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదుతో శ్రీనివాసరావును పోలీసులు సోమవారం మరోసారి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
‘ఐయామ్ 420’‘ప్రేమ’ వల వేసి..
గుంటూరు ఈస్ట్: ఇంజనీరింగ్ విద్యార్థిని నగ్న చిత్రాలను ‘ఐయామ్ 420’ పేరుతో ఇన్స్ట్ర్రాగామ్లో అప్లోడ్ చేసి.. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటనలో మరో ఏడుగురు నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులైన వరుణ్, కౌశిక్లను జూన్ 27వ తేదీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పక్కా ఆధారాలు సేకరించి మిగిలిన నిందితుల్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సోమవారం వెల్లడించారు. (విద్యార్థిని నగ్న చిత్రాల కేసు: ఏడుగురు అరెస్ట్) ‘ప్రేమ’ వల వేసి.. ♦ ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన వరుణ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వలవేసి తన సహ విద్యార్థినిని వంచించాడు. ఆమె నగ్న వీడియో చిత్రీకరించి.. ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతోపాటు తోటి విద్యార్థులకు ఫార్వార్డ్ చేశాడు. ♦ రెండో నిందితుడైన కౌశిక్ ద్వారా ఆ విద్యార్థిని నగ్న చిత్రాలు భాస్కర్, అతని ద్వారా ధనుంజయరెడ్డి, అతని నుంచి మణికంఠ, తులసీకృష్ణ, వారి నుంచి కేశవ్, క్రాంతి కిరణ్, రోహిత్ అనే విద్యార్థులకు చేరాయి. ♦ వీరిలో మణికంఠ, ధనుంజయరెడ్డి వాటిని ఆ యువతికి పంపి.. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు. మిగిలిన ఐదుగురికి ఇదే విషయం చెప్పడంతో వాళ్లు కూడా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ♦ వారిలో మణికంఠ అనే విద్యార్థి‘ఐయామ్ 420’ అనే పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి ఇన్స్ట్రాగామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలను ఆమెకే పంపి చాటింగ్ చేశాడు. ♦ ఆమెను బ్లాక్మెయిల్ చేసి రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలు అతడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా కోరగా.. నిందితులు దొరికిపోతామన్న భయంతో అకౌంట్ నంబర్ పంపకుండా మిన్నకుండిపోయారు. ♦ ఆ యువత ధైర్యం చేసి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పక్కా సాంకేతిక ఆధారాలతో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి ల్యాప్టాప్, 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ♦ ఫేక్ అకౌంట్ను ఛేదించడం, సాంకేతిక ఆధారాలను సేకరించడంలో అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీమ్ ఇన్చార్జి విశ్వనాథరెడ్డి, సాంకేతిక సిబ్బంది విశేష కృషి చేశారని ఎస్పీ చెప్పారు. ♦ నిందితులపై రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ తెలిపారు. ♦ దీనివల్ల వారిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన దిశ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ, ఎస్ఐలు కోటయ్య, బాజీ బాబులను ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. -
కస్టోడియనే సూత్రధారి
సాక్షి, గుంటూరు: ఈ నెల 9న గుంటూరు అమరావతి రోడ్డులోని నగరాలు సమీపంలో సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలో నగదు నింపే వాహనంలో రూ.39 లక్షలు చోరీ కేసు మిస్టరీ వీడింది. ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్ నాగేంద్రబాబే చోరీకి ప్రధాన సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైటర్స్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రవీణ్, సొల్లా వెంకట నాగేంద్రబాబు కస్టోడియన్లుగా, భోజారావు గన్మెన్గా, ఉల్లం తిరుపతిరావు ఏటీఎంకు డబ్బు నింపే వాహనం డ్రైవర్గా పని చేస్తున్నారు. తిరుపతిరావు తాను ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టు ట్రావెలింగ్ అలవెన్స్ పొందుతూ ఉండేవాడు. ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనుమతికి కస్టోడియన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్పై నాగేంద్రబాబు సంతకం పెట్టడాన్ని ప్రవీణ్ వ్యతిరేకించాడు. దీంతో నాగేంద్రబాబు, తిరుపతిరావు, భోజారావు ప్రవీణ్తో గొడవపడ్డారు. ప్రవీణ్ను ఇబ్బంది పెట్టాలని... భేదాభిప్రాయాల నేపథ్యంలో ప్రవీణ్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను డ్యూటీలో ఉన్న సమయంలో వ్యాన్లో ఉన్న డబ్బు కాజేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా నాగేంద్ర తన స్వగ్రామమైన మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రాజబోయిన వెంకట నాగశివ, కంపసాటి గంగాధర్లను భోజారావు, తిరుపతిరావులకు పరిచయం చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు నగదుతో ఉన్న వాహనం నగరాలులోని సెంట్రల్ బ్యాంకు వద్ద రోడ్డుపై నిలిపి డ్రైవర్ తిరుపతిరావు తనకు సొంత పని ఉందని ప్రవీణ్ను బ్యాంకులోకి తీసుకువెళ్లాడు. ఈ సమయంలో నాగ వెంకటసాయి, గంగాధర్ వ్యాన్లోని రూ.39 లక్షల నగదుతో ఉన్న బాక్స్ను చోరీ చేసి బైక్పై నవులూరుకు వెళ్లారు. 250 సీసీ కెమెరాలు పరిశీలించగా... చోరీ ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఎస్పీ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అర్బన్ జిల్లాలోని 250 సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రాథమికంగా నిందితులను గుర్తించిన అనంతరం, టెక్నికల్ ఆధారాలు సేకరించి నిర్ధారించారు. చోరీ జరిగిన అనంతరం నిందితులు వెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా వారు వేసుకున్న దుస్తులు, వాడిన బైక్ను గుర్తించారు. ఈ ఆధారాల వల్ల నిందితులు ఎవరో గుర్తించడం కుదరకపోవడంతో, నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు వెరిఫై చేయగా నవులూరు ప్రాంతంలో నిందితులు ప్రారంభమైనట్టు గుర్తించి, చోరీ అనంతరం కూడా వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిర్ధారణ అవడంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా గుర్తించిన నిందితుల కాల్డేటా పరిశీలించగా వీళ్లు తిరుపతిరావు స్నేహితులని గుర్తించిన పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయాన్ని చోరీ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. కేసును ఛేదించిన సిబ్బందికిఅభినందనలు కేసును త్వరగా ఛేదించి, 100 శాతం రికవరీ చేసిన నల్లపాడు పోలీసులను, సీసీఎస్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. సీఐ కె.వీరాస్వామి, ఎస్ఐలు విశ్వనాథ్, రవీంద్ర, అమరవర్థన్, ఇతర సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ గంగాధరం, సీసీఎస్ ఏఎస్పీ మనోహర్, డీఎస్పీలు కమలాకర్, ప్రకాశ్, బాలసుందరరావు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
వేల్పూరు(శావల్యాపురం): రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పారా నరేంద్ర(30) స్వగ్రామంలో ఉన్న తన కూతురు జన్మదిన వేడుకల నిమిత్తం హైదరాబాద్ నుంచి బైక్పై వచ్చాడు. ఈ క్రమంలో కూతురు మొదట సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, తిరిగి మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్కు ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గమధ్యంలో మిర్యాలగూడెం జాతీయరహదారిపై ప్రమాదశాత్తు బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే నరేంద్ర మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లిదండ్రులు,బంధువులు, గ్రామస్తులు ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మిర్యాలగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అరగంటలో కిడ్నాప్ కేసు ఛేదన
తాడేపల్లిరూరల్(మంగళగిరి): యువకుడు కిడ్నాప్కు గురైన కేసును పోలీసులు అరగంటలో ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామానికి చెందిన తడపతినేని శేఖర్ అనే యువకుడు తన లారీలో ఇసుక అక్రమంగా తోలుతూ పట్టుబడ్డాడు. అధికారులు లారీని సీజ్ చేసి అపరాధ రుసుం విధించారు. ఆ మొత్తం చెల్లించేందుకు శేఖర్ నిడమానూరు గ్రామంలో ఒక కారును రెండు నెలల క్రితం అద్దెకు తీసుకుని దాన్ని తాడేపల్లిలోని రౌడీషీటర్ తొత్తుక శివకుమార్కు తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకున్నాడు. కారు యజమాని పలుమార్లు శేఖర్ను ప్రశ్నించగా తాడేపల్లిలోని ప్రాతూరు కరకట్ట వెంట ఉందని చెప్పడంతో రెండో తాళం తీసుకొని కారును తీసుకువెళ్లాడు. విజయవాడలో బంధీ... దీంతో రౌడీషీటర్ శివకుమార్ శేఖర్కు ఫోన్ చేసి విజయవాడకు పిలిపించి బంధించాడు. శివకుమార్తో పాటు అతని సోదరులైన రౌడీషీటర్లు తొత్తుక రాంబాబు, తొత్తుక సాయి, మరో రౌడీషీటర్ సతీష్ శేఖర్ను చిత్రహింసలు పెట్టారు. ఆ కారులో తెలంగాణ నుంచి రూ.2.50 లక్షల విలువైన మద్యాన్ని తీసుకొచ్చామని, ఖర్చులతో కలిపి మొత్తం రూ.5 లక్షలు కట్టాలంటూ బలవంతంగా పత్రాలపై సంతకం చేయించారు. అనంతరం శేఖర్ తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి, నీ కొడుకు రూ.5 లక్షలు ఇవ్వాలి, తెచ్చి ఇవ్వకపోతే చంపేసి కృష్ణానదిలో పూడుస్తామంటూ బెదిరించారు. వెంకట్రావు డబ్బులు తీసుకుని తాడేపల్లి వచ్చి అనుమానంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావును ఆశ్రయించాడు. సెల్ సిగ్నల్ ద్వారా సీఐ కిడ్నాపర్లు శేఖర్ను ఉంచిన స్థలాన్ని కనుగొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం తరలింపు వెలుగులోకి... రౌడీషీటర్ శివకుమార్ అతని అనుచరులు తాకట్టు పెట్టుకున్న కారులో తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ తమ జేబులు నింపుకొన్నారు. చివరకు కిడ్నాప్ డ్రామాతో వీరి అక్రమ మద్యం వ్యాపారం బయటపడింది. పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిప్పంటుకుని ఇద్దరు చిన్నారుల మృతి
బొల్లాపల్లి (వినుకొండ): ప్రమాదవశాత్తూ మంటలంటుకుని ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులు మరణించిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందిన మూఢావతు బాలునాయక్కు ఉదయ్కుమార్ నాయక్, సాంబశివరావు నాయక్, రామారావు నాయక్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు వివాహాలు చేసుకుని పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిందిలా.. ⇔ బుధవారం సాయంత్రం సాంబశివరావు నాయక్ 30 లీటర్ల పెట్రోలు క్యాను నుంచి ఐదు లీటర్లను మరో క్యానులోకి వంచుతుండగా సమీపంలో కట్టెల పొయ్యి నుంచి నిప్పులు రేగి పెట్రోలుకు అంటుకున్నాయి. ⇔ అక్కడే ఆడుకుంటున్న ఉదయ్కుమార్ కుమార్తె కృపాబాయి(3)కి మంటలు అంటుకునిఅక్కడికక్కడే మృతి చెందింది. ⇔ సాంబశివరావు నాయక్ కుమారుడు సియోన్ నాయక్ (ఏడాది)కు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ⇔ సియోన్ నాయక్ను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతిచెందాడు. గాయపడ్డ మరో ఇద్దరుప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న సాంబశివరావు నాయక్ భార్య లక్ష్మీబాయి, రామారావు నాయక్ భార్య మల్లేశ్వరి బాయి స్వల్పంగా గాయపడ్డారు. కళ్ల ముందే మంటలంటుకుని తమ బిడ్డలు కాలిపోతున్నా కాపాడుకోలేకపోయామని ఉదయ్ కుమార్, ఆయన భార్య ఇస్త్రీ బాయి బోరున విలపించారు. వినుకొండ రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు, బండ్లమోటు ఎస్ఐ జి.అనిల్కుమార్ ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదాలు
-
క్షణికావేశం.. విషాదంతం
రెంటచింతల(మాచర్ల): క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. మున్నంగి నర్సింహారెడ్డి, దుర్గాభవాని దంపతులు మండల కేంద్రమైన రెంటచింతల గంధంవారి బజారు సమీపంలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు వారిని రెంటచింతల ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. భార్య దుర్గాభవాని (38) చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సింహారెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నర్సింహా రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలికి వివాహమైంది. చిన్న కుమార్తె స్రవంతి స్థానిక వైఆర్ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మృతురాలు దుర్గాభవాని తల్లి బిక్కిరెడ్డి విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
వివాహ వేళ.. విషాద గీతిక
వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్.. మధ్యాహ్నం వేళకు తన ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో ముక్కలయ్యాయి. తెనాలిరూరల్: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్ నగర్కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది. దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్(9), కట్టుపల్లి నిఖిల్(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్ను మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. మిన్నంటిన హాహాకారాలు.. ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు.. చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అంబేడ్కర్నగర్కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది. ఎమ్మెల్యే మేరుగ పరామర్శ.. ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు గ్రామంలో బస్టాప్కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్ వేగంగా వచ్చి ట్రాక్టర్కు తగిలింది. ఇంజిన్ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి. పరిమితికి మించిప్రయాణం ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్ శ్రీనివాసరావు ట్రాక్టర్ నడుపుతున్నాడు. ట్రాక్టర్లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. -
నాయనమ్మ హత్య
పట్నంబజారు(గుంటూరు): ఆస్తి కోసం నాయనమ్మను మనవడు హత్య చేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక శ్రీనివాసరావుపేటలో ఆకుల యలమంద, అతని భార్య పద్మావతి, తల్లి సామ్రాజ్యం, నానమ్మ సుశీల (70) నివసిస్తున్నారు. ఆస్తి తన పేరున రాయాలని సుశీలను యలమంద గొడవ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఆరో తేదీ రాత్రి 2.30 గంటల సమయంలో సుశీలను చీరతో ఉరి బిగిస్తుండగా ఆమె కేకలు వేసింది. ఇంటి పక్కన ఉండే నరసింహ కుటుంబ సభ్యులు వచ్చి చూడటంతో యలమంద పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే సుశీల మృతి చెందింది. ఆస్తి రాయలేదనే కోపంతో వృద్ధురాలిని మనవడే హత్య చేసినట్లు నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రాయల్ ఎన్ఫీల్డ్ రూ.75 వేలకే..
తాడేపల్లిరూరల్: పట్టణ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడు ఓఎల్ఎక్స్ యాప్ను నమ్ముకొని నిండా మునిగి లబోదిబోమంటూ ఆదివారం తాడేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం మేరకు... మహానాడులో నివాసం ఉండే నాగం వెంకటేశ్వరరావు అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం అమ్మకానికి రావడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. ఓఎల్ఎక్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫొటోతో పాటు అమ్మకందారుని ఫోన్ నెంబర్ 8168232398 కలిగి ఉంది. ఆ వ్యక్తికి ఫోన్ చేయగా తాను ఆర్మీలో విశాఖపట్నంలో పనిచేస్తానని చెప్పాడు. ఇక్కడ నుంచి జమ్మూకాశ్మీర్కు బదిలీ అయిందని, అందుకే రూ.2 లక్షల వాహనాన్ని రూ.75 వేలకే అమ్ముతున్నానని నమ్మబలికాడు. మొదట గూగుల్పే ద్వారా రూ.5 వేలు నగదు చెల్లించి, విశాఖ వచ్చి వాహనాన్ని చూసుకోవచ్చని చెప్పాడు. నగదు చెల్లించిన తర్వాత ద్విచక్రవాహనం విలువ రూ.89 వేలు ఇస్తే ఇస్తానంటూ చెప్పడంతో, వెంకటేశ్వరరావు నమ్మి మిగతా నగదును కూడా నాలుగు సార్లు గూగుల్పేలో చెల్లించాడు. ద్విచక్ర వాహనాన్ని ట్రాన్స్పోర్ట్లో పంపిస్తానని చెప్పి వారం అవుతున్నా పంపించలేదని, ఆర్మీ అతను ఓఎల్ఎక్స్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన లేదని వాపోయాడు. జరిగిన ఘటనపై తాడేపల్లి ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి, సైబర్క్రైమ్ విభాగానికి కేసు అప్పగించారు. -
కాటేసిన కాసుల వల
గుంటూరు:భర్తకు దూరమై ఒంటరిగా బతుకుతున్న ఆ మహిళ తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. కానీ ఆ తల్లి ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవని నిర్ధారించుకుంది. అప్పుల బాధలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలి ఉచ్చులో పడింది. తాను పుండైనప్పటికీ కుమారుడికి పండంటి జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. కాసుల కోసం చీకటి గదిలో కన్నీటిని దిగమింగింది. కానీ ఆ చిల్లర డబ్బుల కోసం తానే చితిపైకి చేరుతుందని ఊహించలేకపోయింది. డబ్బులు అడిగిన నేరానికి నమ్మకంగా వ్యభిచారవృత్తిలోకి దించిన మహిళ, ఆమె భర్త, మరో వ్యక్తి కలిసి ఆమెను మట్టుబెట్టారు. కొడుకును ఉన్నతంగా చూసుకోకుండానే కాటికి పంపించారు. హతమార్చిందిలా ... విశ్వసనీయ సమాచారం ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహిత మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాలతో ఎనిమిదేళ్ల కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అయినా కుమారుడ్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించింది. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో నరసరావుపేటలో వ్యభిచార గృహ ఓ నిర్వాహకురాలు పరిచయమైంది. ఆమె వద్దకు వెళ్లగా మూడు రోజులపాటు నరసరావుపేటలోనే ఉంచింది. ముందుగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. వ్యభిచార నిర్వాహకురాలు చెప్పినంత డబ్బులు చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నిర్వహకురాలి భర్త కూడా వివాహితను దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివాహిత హెచ్చరించింది. పోలీసుల వద్దకు వెళితే సమస్య వస్తుందని నిర్వాహకురాలు భయపడింది. దీంతో ఆమెను మట్టుబెట్టాలని పథకం రచించారు. ఈ ఏడాది జనవరి రెండో వారంలో డబ్బు ఇస్తామని నమ్మించి వివాహితను నరసరావుపేట పిలిపించారు. పార్టీ చేసుకుందామని నమ్మించి వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త, ఓ విటుడు, వివాహితను గుత్తికొండ పరిసర ప్రాంతంలోని సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లారు. కాలువ గట్టున అందరూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వివాహితను నిర్ధాక్షిణ్యంగా వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త కాలువలోకి నెట్టేశారు. వివాహిత మృతి చెంది నీటిలో కొట్టుకుపోయిందని నిర్ధారించుకున్న అనంతరం అక్కడ నుంచి వెళ్లారు. గతంలోను ఇదే తరహాలో.. సుమారు పదేళ్ల కిరతం చిలకలూరిపేటలో వ్యభిచార వృత్తి నిర్వహించడానికి వచ్చిన ఓ యువతిని సదరు నిర్వాహకురాలు హత్య చేసినట్టు గుర్తించారు. చిలకలూరిపేట రూరల్ స్టేషన్లో ఈమెపై హత్య కేసు నమోదైనట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. వెలుగు చూసిందిలా... తమ కుమార్తె నరసరావుపేటకు వచ్చి ఆచూకీ లేకుండా పోయిందని జనవరి 21న మృతురాలి తల్లి, బంధువులు నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నకరికల్లు వద్ద గుంటూరు బ్రాంచ్ కెనాల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని అక్కడ పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్ మిస్టరీ వీడింది. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు కూపీ లాగారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. వివాహితను తామే హతమార్చినట్లు వారు అంగీకరించారు. -
పండుగ రోజు విషాదం.. బావ, బావమరిది మృతి
పిడుగురాళ్ల రూరల్ (గురజాల): భోగి పండుగ రోజు సరదాగా ఈతకు వెళ్లిన బావ, బావ మరుదులు కాలువలో మునిగి మృతిచెందారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వేణుగోపాల్ (22) చెన్నైలో బీటెక్ చదువుతున్నాడు. వేణుగోపాల్ మేనత్త కుమారుడు అనిల్ (18) పెదగార్లపాడులో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం భోగి పండుగ నాడు బావ, బావమరిది ఇద్దరూ కలసి తంగెడ మేజర్ కాలువలో ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ గల్లంతయ్యారు. వారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు వచ్చి చూడగా బట్టలు, చెప్పులు కాలువ ఒడ్డున కనిపించాయి. దీంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఆందోళనకు గురై.. గాలింపు చేపట్టగా, రెండు గంటల తర్వాత విగతజీవులుగా కనిపించారు. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్య
గుంటూరు ఈస్ట్: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే యువతితో వివాహానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్హెచ్ఓ సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతి ఎంబీఏ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా కె.సముద్రం మండలానికి చెందిన ఓ యువకుడు గుంటూరు నగరంలోని ఓ ఫార్మసీ కళాశాలలో నాలుగు సంవత్సరాల క్రితం బీఫార్మసీ చదువుతూ ప్రతి ఆదివారం యువతి ఇంటి సమీపంలోని చర్చికి వచ్చేవాడు. ఇద్దరి మధ్య నెలకొన్న స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తి అయిన తరువాత యువకుడు దుబాయ్లో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ తమ ప్రేమను కొనసాగించారు. యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి సొంత ఊరికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులను తీసుకుని డిసెంబరు 26వ తేదీ యువకుడి ఇంటికి వెళ్లింది. యువకుడి తల్లిదండ్రులతో వివాహ విషయం ప్రస్తావించారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు వివాహం విషయం కొంతకాలం తరువాత చర్చిద్దామని చెప్పి పంపించారు. యువకుడు తన సెల్లో ప్రియురాలి నంబరు బ్లాక్ చేశాడు. అయితే ఆ యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయమైందని సమాచారం తెలుసుకున్న యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్ నంబరు ప్రియుడు బ్లాక్ చేయడంతో సూసైడ్ మెసేజ్ అతని ఫ్రెండ్ ఫోన్కు పంపింది. తన ప్రియుడు లేని జీవితాన్ని తాను ఊహించలేనని పేర్కొంది. మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనని, ఆ కారణంగా తల్లిదండ్రులకు తాను భారమవుతానని భావించానని రాసింది. వచ్చే జన్మలోనైనా నీవు నాకు దక్కుతావా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను మృతి చెందిన అనంతరం మృతదేహాన్ని చూడడానికి కూడా నువ్వు రావులే అంటూ తన ఆవేదనను వెలిబుచ్చింది. పెళ్లి కానుకగా తాను కొన్న వాచీని స్వీకరించాలని అభ్యర్థిచింది. మెసేజ్ చేరిన కొంతసేపటికే తాను ప్రాణాలను విడుస్తున్నట్లు, తనను రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని తెలిపింది. -
కాల్మనీ కేసులో ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
గుంటూరు ఈస్ట్: కాల్మనీ కేసులో గురుశిష్యులను అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరిపై రౌడీషీట్లు సైతం తెరిచారు. నిందితులపై గతంలో 9 కేసులు ఉన్నా టీడీపీ అండదండలతో రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదలకు సంబంధించి పాత నేరస్తుల చరిత్రను పరిగణనలోకి తీసుకున్న అర్బన్ ఎస్పీ పి.హెచ్డి.రామకృష్ణ వారి ఆగడాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాల్మనీ వ్యాపారులు ఇద్దరినీ లాలాపురం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్టేషన్లో ఈస్ట్ డీఎస్పీ కె.సుప్రజ, ఎస్హెచ్ఓలు ఫిరోజ్, రాజశేఖరరెడ్డి, సురేష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు. వారి కథనం మేరకు.. గుంటూరు విద్యానగర్ ఒకటో లైను ఎక్స్టెన్షన్కు చెందిన ఇమడాబత్తిని కల్యాణచక్రవర్తి అలియాస్ పప్పుల నాని లాలాపేట పరిధిలోని హజార్ వారి వీధిలో తొలుత పప్పుల వ్యాపారం చేశాడు. అనంతరం 25 ఏళ్లుగా మీటర్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. నెహ్రూనగర్ 4వ లైనుకు చెందిన మాజేటి శేఖర్ తొలి నుంచి పప్పుల నానికి అనుచరుడిగా ఉంటు న్నాడు. పప్పుల నాని మీటర్ వడ్డీ, వంద రోజుల వడ్డీ, రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బాకీ చెల్లించని వారిని తన కార్యాలయానికి పిలిపించి బంధించి కొట్టి చెక్కులు, ప్రామిసరీ నోట్లపై అధిక మొత్తం రాయించి సంతకాలు చేయించుకుని పంపేవాడు. కొందరి వద్ద ఖాళీ నోట్లు, చెక్లపై సంతకాలు చేయించుకునేవాడు. కార్యాలయానికి రాని వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేసేవాడు. బాకీ వసూలు చేసే క్రమంలో వంటరిగా జీవించే మహిళలతో నాని, శేఖర్ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరిని తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కొత్తపేట స్టేషన్లో శేఖర్పై ఇటీవల కేసు నమోదైంది. పప్పుల నానికి ఉన్న పలుకుబడి కారణంగా అతని బారినపడిన మహిళలు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. వడ్డీ కోసం గురుశిష్యులు పెట్టే వేధింపులను తట్టుకోలేక గతంలో కొంతమంది ధైర్యం చేసి ఆధారాలతో ఎస్పీలకు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో పలు పోలీస్స్టేషన్లలో పప్పుల నానిపై ఆరు, శేఖర్పై మూడు కేసులు నమోదయ్యాయి. వీరు రిమాండ్కు వెళ్లినా వారి అనుచరులు యథావిధిగా కార్యకలాపాలను కొనసాగించేవారు. పప్పులనాని వద్ద గత మార్చి, ఏప్రిల్ నెలల్లో నెహ్రూనగర్ పదో లైనుకుచెందిన ఏలే దుర్గాప్రసాద్, అతని తండ్రి కొండయ్య మీటరు వడ్డీకి ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.2 లక్షలు తీసుకున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున 50 రోజులు చెల్లించిన అనంతరం, చెల్లింపులు నమోదు చేసిన పుస్తకాన్ని తండ్రీకొడుకుల నుంచి నాని, శేఖర్ లాక్కున్నారు. వడ్డీకి వడ్డీ వేసి ఎక్కువ మొత్తం డిమాండు చేశారు. మొదట ఇచ్చిన ప్రామిసరీ నోట్లు పోయాయంటూ, డిసెంబర్ 28వ తేదీ తండ్రీకొడుకులను నాని, శేఖర్ తమ కార్యాలయంలోబంధించి ఆరు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారు. బాధితులు పోలీస్ స్పందన కార్యక్రమంలోలో ఫిర్యాదు చేయడంతో అర్బన్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ స్పందించారు. నిందితుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టుచేసి రూ.30,32,900 నగదు, 9 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 ఖాళీ బ్యాంకు చెక్లు, రోజువారి, మీటర్ వడ్డీ లెక్కల పుస్తకాలు స్వాధీనం చేసుకునిరిమాండుకు తరలించారు. రౌడీ ఆగడాలకు అంతేలేదు పప్పుల నాని, శేఖర్ రాజకీయంగా, పోలీసుల వద్ద పలుకుబడి సంపాదించి హోల్సేల్ కిరాణా, ఇతర వ్యాపారులపై జులుం ప్రదర్శించే వారు. పప్పుల నాని తన దౌర్జన్య కార్యకాలాపాల కోసం వివిధ కాలనీలకు చెందిన వ్యక్తులు, యువకులను అనుచరులుగా పెట్టుకున్నాడు. ఆ అనుచరులు కిరాణా, ఫ్యాన్సీ, జ్యూస్ షాపులు, చికెన్ షాపులు, తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండానే తమకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. గురుశిష్యులు ఇద్దరు గతంలో ఫోర్జరీ దస్తావేజులు పుట్టించి మోసగించేవారు. నిందితుల రోజువారీ వసూళ్లు రూ.80 వేలు. పోలీసులు వారి కార్యాలయంపై దాడి చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదుకు సంబంధించి వడ్డీకి తీసుకున్న వారి పేరుతో చీటీలు రాసి రబ్బరు బ్యాండులు వేసిన కట్టలులభించడం గమనార్హం. -
ఏం పాపం చేశానని..
మాచవరం: ఆ కన్నతల్లికి ఏం కష్టం వచ్చిందో...ఒక్క రోజు పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లింది. భూమ్మీదకు వచ్చి 24 గంటలు కూడా గడవకుండానే ఓ ఆడ బిడ్డకు నూరేళ్లు నిండాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు పసికందును ఖాళీ స్థలంలో వదిలివెళ్లగా, ఆ పసికందు ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...చెన్నాయిపాలెంలో బాణావత్తు దత్తునాయక్ ఇంటికి వెనుక ఖాళీ స్థలంలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కేవల ఒక్క రోజు వయస్సు ఉన్న ఆడ శిశువును వదిలేసి వెళ్లారు. ఆ పసికందు ఏడుపులు విని దారినపోయే వారు గుర్తించారు. ఆ పసికందు ఎక్కడి నుంచి వచ్చింది. గ్రామంలో ఒక రోజు క్రితం ఎవరు ప్రసవించారు ఆని ఆరా తీయగా సమాచారం లభించలేదు. దీంతో ఎక్కడ నుంచో తీసుకుని వచ్చి ఈ ప్రదేశంలో వదిలేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తులు మాచవరం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగా, పసికందుకు వైద్యం అందించేందుకు మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆ ఆడపిల్ల గురువారం కన్నుమూసింది. పసికందు దొరికిన సంఘటనా స్థలాన్ని ఎస్ఐ లక్ష్మీనారాయణరెడ్డి పరిశీలించారు. సీడీపీవో శ్రీవల్లి, సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి శిశుమరణాలు తమ పరిధిలోకి వస్తాయని, మృతి చెందిన పాపను తమకు అప్పగించాలని వారు కోరారు. మాచవరం ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని
యడ్లపాడు: నిలిపి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడిన సంఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన కోండ్రుపాడు గ్రామానికి చెందిన తమ్మలూరి నాగరాజు నాదెండ్ల మండలం గణపవరంలోని పశువుల ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి యడ్లపాడులో చర్చికి వెళ్లాడు. అనంతరం భార్య యశోద, కుమారుడు రాణా, కుమార్తె దివ్యలను గణపవరంలోని అత్తగారింటి వద్ద దింపేందుకు బైక్పై బయలుదేరాడు. తిమ్మాపురం చేపలచెరువు సమీపంలో పంక్చర్ కావడంతో తమిళనాడుకు చెందిన లాంగ్ట్రాలీ లారీ హైవేపై నిలిపి ఉంది. బైక్పై వస్తున్న నాగరాజుకు వెనుక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో వెనక్కి తిరిగాడు. అంతలో బైక్ ట్రాలీలారీని ఢీకొట్టింది. దీంతో బైక్ ట్రాలీ కిందకు దూరి ఇరుక్కుపోయింది. బైక్ ముందు ఆయిల్ ట్యాంక్పై కూర్చున్న నాగరాజు కుమారుడి ఎడమకన్నుకు తీవ్ర గాయమైంది. బైక్పై ఉన్న నలుగురు హైవేపై చెల్లాచెదురుగా పడిపోయారు. నాగరాజు తలకు, భార్య కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి బాలిక కన్నీరుమున్నీరుగా విలపించసాగింది. స్థానికులు పరుగున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశారేఉ. ఎస్ఐ నాగేశ్వరరావు ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే విడదల రజని ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఎమ్మెల్యే విడదల రజని హైవేపై జనాన్ని చూసి ప్రమాదం జరిగిందని గ్రహించి కారు దిగారు. బాధితులను పరామర్శించి అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు పంపించారు. అక్కడ నుంచే జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫోన్ చేసి సత్వర వైద్యం అందించాలని సూచించారు. కొద్దిసేపటి తర్వాత నాగరాజు మెడకు సర్జరీ చేస్తున్నామని, అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయని, బాబు కన్ను పరిస్థితి మాత్రం చెప్పలేమని వైద్యులు ఎమ్మెల్యేకు వివరించారు. -
అంతులేని విషాదం
గుంటూరు, తాడికొండ: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. నాలుగు మెతుకులు సంపాదించడానికి పిల్లలను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే సారి ముగ్గుర్ని బలిగొని ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన తాడికొండ మండలం లాం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ సెల్ఫోన్ వెనక్కి ఇద్దామనుకొనే ప్రయత్నంలో ఒంటి చేతితో వాహనం నడపడం, అతివేగంతో వెళ్లడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మృతితోపాటు మరో ఐదురుగు గాయాలపాలయ్యారు. వ్యవసాయ కూలీలుగా పనిచేసే వీరందరిదీ ఒక్కో గాథ. పాఠశాలకు సెలవు కావడంతో కుమారుడిని వెంట బెట్టుకొని పనికి వెళదామని ఆటోలో మోతడక నర్సరీలలో పని చేసేందుకు బయలుదేరిన షేక్ దరియాబీ కుమారుడు దరియావలి (12) ప్రమాదంలో ఛాతి, పొట్టలో బలమైన గాయం కావడంతో అసుపత్రికి చేరుకొనేలోపుగా మరణించాడు. మరో కుటుంబానికి చెందిన మృతురాలు రాయపూడి భారతి(28) 2వ తరగతి చదువుతున్న ఏడు సంవత్సరాల కుమారుడు సంతోష్ను వెంటబెట్టుకొని వెళుతుండగా తలకు బలమైన గాయం కావడంతో అమె ఆసుపత్రికి చేరుకొనేలోగా ప్రాణాలొదిలింది. కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మరో మృతురాలు మాతంగి నాగేంద్రమ్మ (52) అనే మహిళ తీవ్ర గాయాలతో జీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలింది. ఈమె కోడలు ఎస్తేరు రాణికీ తీవ్రంగా గాయాలు కావడంతో ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో చికిత్స పొందుతుండగా ఇంటివద్ద ఎత్తుకొనేందుకు ఎవరూ లేరని వెంట తీసుకెళ్లిన 2 సంవత్సరాల కుమారుడు చిన్నారి అరుణ్ తేజ్ కూడా ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్తేరు రాణి చెల్లలు కూడా ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. మృతురాలు నాగేంద్రమ్మకి నలుగురు కుమారులు. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన ఈమె వ్యవసాయ పనుల నిమిత్తం 7 సంవత్సరాల నుంచి చిన్న కుమారుడు వద్దే ఉండి కూలి పనులకు వెళుతోంది. ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో నిర్జీవంగా పడి ఉన్న తీరు అందరినీ కలచివేసింది. ఘటనకు కారణమైన ఆటో డ్రైవర్ది నిడుముక్కల గ్రామం కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కలెక్టర్ పరామర్శ గుంటూరు ఈస్ట్: లాం సంమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల బంధువులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మంగళవారం పరామర్శించారు. -
బ్యాట్తో కొట్టి తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్య
నరసరావుపేటరూరల్: భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న స్వల్పవివాదం భార్య హత్యకు దారితీసింది. పురపాలక సంఘం పరిధిలోని బరంపేట కాసు బ్రహ్మనంద ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న షేక్ హయతున్నీసా(35) తన భర్త ముస్తఫా చేతిలో దారుణ హత్యకు గురైంది. క్రికెట్ బ్యాట్తో తలపై దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... నగరం మండలం చినమట్లపూడి గ్రామానికి చెందిన షేక్ హయతున్నీసాకు తన సమీప బంధువైన నిజాంపట్నానికి చెందిన ముస్తఫాతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమా రుడు ఉన్నాడు. ఆరు నెలల కిందట ఉద్యోగ బదిలీలలో భాగంగా హయతున్నీసా నరసరావుపేటకు వచ్చి సత్తెనపల్లి రోడ్డులోని సాయినగర్ 4వ లైన్లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. భర్త ముస్తఫాకు ఉద్యోగం లేకపోవడంతో గతంలో ఇన్నోవా వాహనాన్ని బాడుగులకు నడిపే నిమిత్తం కొనుగోలు చేసింది. అయితే ఇందులో ముస్తఫాకు నష్టాలు వచ్చా యి. తర్వాత రూ.2లక్షల పెట్టుబడితో వస్త్ర వ్యాపారం మొదలుపెట్టించింది. ఈ వ్యాపారంలోను నష్టాలు రావడంతో భార్యభర్తల మధ్య వివాదం మొదలైంది. తనకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే హయతున్నీసా కుటుంబానికి దూరంగా బదిలీ చేయించుకుందని ముస్తఫా భావించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిందట నుంచి హయతున్నీసా నరసరావుపేటలో నివాసం ఉంటున్నప్పటికీ ముస్తఫా మాత్రం ఇక్కడకు రాలేదు. నెల రోజుల కిందట పెద్దమనుషులు ఇరువురి మధ్య రాజీ చేశారు. అప్పటి నుంచి ఇరువురు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దంపతులు ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ముస్తఫా ఆవేశంతో అందుబాటులో ఉన్న క్రికెట్ బ్యాట్తో భార్య హయతున్నీసా తలపై దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం ఆమె తలకు ప్లాస్టిక్ కవరు చుట్టి హత్యకు పాల్పడ్డాడు. ముస్తఫా తన కుమారుడు రజాను తీసు కుని పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారా లు సేకరించారు. డీఎస్పీ వీరారెడ్డి, సీఐలు బిలాలుద్దిన్, కృష్ణయ్య, అచ్చయ్య, ఎస్ఐలు బ్రహ్మం, నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
హత్యలు.. భూదందాలు.. సెటిల్మెంట్లు !
గుంటూరు, మంగళగిరి: టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన హత్యలు, భూ దందాలు, సెటిల్మెంట్ల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన దురాగతాలు అన్నీఇన్నీ కావు. రోజుకొక ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా జంట హత్యల కేసులో నిందితుడిగా టీడీపీ మండల అధ్యక్షుడు చావలి ఉల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2017 లో ఒక మహిళను హత్య చేసిన ఘటనతో పాటు ఆ హత్యకు సహకరించిన మరొకరిని హత్య చేయించిన వ్యవహారంలో నిందితులకు తోడ్పాటునందించారు. ఈ కేసులో ఉల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు హత్యలు వెలుగులోకి రాకుండా చూసేందుకు అçప్పుడు డీఎస్పీగా పనిచేసిన అధికారికి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ ఐదు సంవత్సరాల కాలంలో అధిక కాలం నార్త్జోన్ డీఎస్పీగా పనిచేసిన అధికారి టీడీపీ నాయకులు చేసిన హత్యలతో పాటు భూదందాలకు సహకరించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీ నేతల దుర్మార్గ చర్యలకు నియోజకవర్గంలో అనేక మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. టీడీపీ నాయకుల అరాచకాలకు అప్పడు పనిచేసిన నార్త్ సబ్ డివిజన్ పోలీసు అధికారితో పాటు ఇతర పోలీసులు పూర్తిగా సహకరించి తమ స్వామి భక్తిని చాటుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వరుసగా టీడీపీ నేతల అరెస్టులు... భూ దందాలలో తమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆ పార్టీకి చెందిన నాయకుడు తాడిబోయిన ఉమాయాదవ్ను హత్య చేయించిన కేసులో టీడీపీ నాయకుడు ఏనుగ కిషోర్తో పాటు మండల అధ్యక్షుడు కుమారుడు, మండల టీడీపీ యూత్ నాయకుడు చావలి మురళితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు హత్య కేసులో ఉండడం సంచలనం కలిగించింది. అది మరువక ముందే టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి భూదందా కేసులో ఇరుక్కుని కోర్టు మెట్లెక్కి బెయిల్పై బయటకు రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పలు భూవివాదాల కేసులలో టీడీపీ నాయకుల పేర్లు బయటకు వస్తుండగా రాజీమార్గం పట్టి కేసుల వరకు రాకుండా చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. తాజాగా జంట హత్యల కేసులో ఉల్లయ్యను అరెస్టు చేయడం కలకలం రేపింది. మరింత మంది టీడీపీ నేతల అక్రమ వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతో మంది బాధితులు ధైర్యం చేసి బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
కొడుకును కిడ్నాప్ చేసి.. ఆపై భార్యకు ఫోన్ చేసి
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బుల కోసం కన్న తండ్రే తన ఆరేళ్ల కొడుకును కిడ్నాప్ చేసిన ఘటన అమరారెడ్డి నగర్లో చోటుచేసుకుంది. వివరాలు.. తాడేపల్లి అమరారెడ్డి నగర్కు చెందిన శ్రీనివాస్రావు డబ్బుల కోసం తన స్నేహితులు శామ్యూల్, అబ్రహంతో కలిసి కొడుకు పార్థసారధి కిడ్నాప్కు పథకం రచించాడు. అనుకున్నట్లుగానే బుధవారం మాధ్యాహ్నం 2. 30 గంటలకు బాలుడిని స్కూల్ నుంచి కిడ్నాప్ చేశాడు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భార్యకు ఫోన్ చేసి రూ. 5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద గుంటూరు కాలువలో ఇంటర్మీడియట్ విద్యార్థి బి. విద్యాసాగర్(17) గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివీ.. తాడేపల్లి డొల్లాస్ నగర్కు చెందిన విద్యాసాగర్ ఆదివారం స్నేహితుతడు జగదీష్ పుట్టిన రోజు కావడంతో మరో ఏడుగురు స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ చినకాకానిలోని గుంటూరు కాలువ వద్దకు సరదాగా వెళ్లాడు. అక్కడ విద్యాసాగర్ ఫోటోలు కోసం కాలువలోకి దిగగా లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు అరుణ్ ప్రమాదంలో చిక్కుకోగా.. అక్కడే ఉన్న అయ్యప్ప మూలధారుల్లో ఒకరు వెంటనే కాలువలోకి దూకి అతడిని కాపాడారు. విద్యాసాగర్ గల్లంతు కావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రివేళ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. -
హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు : నలుగురు చూస్తుండగా కొడుతూ, పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లారనే బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మాచర్ల మండలం రాయవరంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మాచర్ల పీఎస్లో పనిచేసే హోంగార్డు రాజేశ్, ఆటో డ్రైవర్ శ్రీనుతో ఉన్న వ్యక్తిగత గొడవలతో అతిగా ప్రవర్తిస్తూ, అతనిపై చెప్పులతో దాడి చేశాడు. అలాగే బజారులో కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. -
దీప్తి.. కార్పొరేషన్నూ వదల్లేదు
సాక్షి, గుంటూరు : నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్ళపల్లి దీప్తి చేతివాటం ప్రదర్శించడంలో తనదైన ముద్ర వేసుకుంది. సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకొని బాధితుల ఫిర్యాదుతో పరారైన విషయం తెలిసిందే. ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ హయాంలో మంత్రి సాయంతో కాంట్రాక్ట్ను కొట్టేసింది. ఆనందలహరి నిర్వహణ కోసం.. 2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్ అధికారులకు తరచూ ఫోన్ చేయించి వారిని దారికి తెచ్చుకుంది. ఈ క్రమంలో గుంటూరులో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్ దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో దీప్తి తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో మరో సంస్థ నిర్వాహకులు కూడా దరఖాస్తు చేశారు. వెంటనే కాంట్రాక్ట్ తనకే ఇవ్వాలంటూ దరఖాస్తు మంజూరు చేసే అధికారిని సైతం మభ్యపెట్టి సదరు మాజీ మంత్రితో కార్పొరేషన్ రికమండ్ చేయించి కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్ రూ.60 వేల చొప్పున చెల్లుస్తుంది. నిబంధనల ప్రకారం కార్యక్రమం కొనసాగించకుండా రూ.20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. దీంతో నగరంలో కార్యక్రమం నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికే ఏడాదిపాటు కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన శ్రీకేష్ లఠ్కర్ ఇదంతా దోపిడీ అని తేల్చి బిల్లులు నిలుపుదల చేశారు. మళ్లీ బిల్లుల చెల్లింపుల కోసం... అప్పట్లో పర్యవేక్షణాధికారిగా పని చేసి అనంతరం బదిలీపై వెళ్లిన అధికారి మళ్లీ బదిలీపై ఇక్కడకే వచ్చారు. దీంతో దీప్తి, ఆమె స్నేహితులు సదరు అధికారి వద్దకు వెళ్లి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అందుకు కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం బిల్లు పెండింగ్లో ఉంది. మంగళగిరి మాయ‘లేడీ’ ఉలికిపాటు మంగళగిరిలో మరో కలాడీ లేడీ బాగోతం అంటూ సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం టీడీపీ నాయకులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. విజలెన్స్ అధికారులు సైతం బాధితుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. తెనాలిలోని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పని చేసిన కిలాడీ లేడీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. మాజీ హోంమంత్రి చినరాజప్పతో తనకు పరిచయాలు ఉన్నాయని పలువురిని నమ్మించింది. సేల్స్ మేనేజర్గా పని చేసిన సమయంలో తనతో పని చేసిన సహ ఉద్వోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్వోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. తాజాగా సాక్షి దినపత్రికలో కథనం రావడంతో కిలాడీ లేడీ ఉదయం నుంచి బాధితులకు ఫోన్ చేసి తాను విదేశాలలో ఉన్నానని, వారంలో వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలుకుతోంది. దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయవద్దంటూ బతిమాలుతున్నట్లు సమాచారం. కొందరు బాధితులు వెంటనే తాము ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని, లేదంటే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. చదవండి: నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ.. -
నకిలీ ఐడీ కార్డుతో దీప్తీ బురిడీ..
సాక్షి, గుంటూరు : విలాసవంతమైన జీవితం గడిపేందుకు రకరకాల మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తి ఉదంతాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానంటూ నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని, స్థలాలు, పొలాల సమస్యలు పరిష్కరిస్తానంటూ మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. కిలాడీ లేడీగా మారి మాయమాటలు చెప్పడం, అందుకు అవసరమైన నకిలీలను సృష్టించుకొని ఘరానా మోసాలకు పాల్పడింది. ఆమె చేసిన మోసాల్లో మరొకటి బయటపడింది. ఏకంగా ప్రభుత్వ చిహ్నంతో నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకుందంటే ఆమె నేర స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. సీసీఎల్ఏ పీఏ పేరులో నకిలీ కార్డు మొదట్లో ఆమె కారును సచివాలయంలోకి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించక పోవడంతో అందుకోసం ముందుగా మాజీ మంత్రులతో కలసి వెళుతూ పరిచయాలు పెంచుకుంది. అక్కడ ఏఏ విభాగాల్లో ఎవరు ఉంటారో తెలుసుకొని రాకపోకలు కొనసాగించడం ప్రారంభించింది. అనతి కాలంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే స్థాయికి చేరింది. అప్పటి నుంచి తనకు తాను గుర్తింపు తెచ్చుకునేందుకు సీఎంవోలో పీఏ నంటూ పరిచయాలు చేసుకోవడం ప్రారంభించింది. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బంది ఐడీ కార్డు చూపాలని కోరితే ఇంటి వద్ద మరచిపోయానని చెప్పి కాలం గడిపింది. ఇక ఇలాగైతే కష్టమని భావించి రెవెన్యూ శాఖ పరిధిలోని ‘ఛీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్’ (సీసీఎల్ఏ)లో పీఏగా పనిచేస్తున్నట్లు ఏకంగా ఐడీ కార్డు సృష్టించుకుంది. కార్డును చూపుతూ మోసాలకు పాల్పడింది. సెటిల్మెంట్లకు తెరతీసి.. ఖరీదైన కారులో తిరుగుతూ కారుపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్ వేసుకొని సెటిల్మెంట్లకు తెరతీసింది. అప్పట్లో పోలీస్ అధికారులతో పరిచయాలను అడ్డుపెట్టుకోవడంతో పాటు ఆమె సామాజిక వర్గానికి చెందిన అధికారులు కూడా ఉండటం కలసి వచ్చిన అంశంగా మారింది. స్థల, పొలాల వివాదాలను పరిష్కరించాలంటూ పోలీసుల వద్దకు వెళ్లడం.. అవసరమైతే మాజీ మంత్రితో ఫోన్ చేసి ఏకపక్షంగా కూడా సెటిల్మెంట్లు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గుంటూరు అర్బన్లో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరి నుంచి రూ. 9 లక్షలు తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, బాధితులు మాత్రం వివరాలను తెలియచేసేందుకు సాహసించడం లేదంటే వారిని ఎంతగా భయపెట్టి ఉంటారో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి : (మోసాల్లో దిట్ట దీప్తి) ఫోన్ స్విచ్చాఫ్ దీప్తి హైదరాబాద్కు మకాం మార్చడంతో స్నేహితుల ద్వారా కేసు నమోదు విషయం తెలుసుకోవడంతో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అవసరమైన సందర్బాలలో ఆన్చేస్తూ మాట్లాడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధితులు కూడా పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని సమాచారం. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే.. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీస్ బాస్ స్పందించి కిలాడీ లేడీ ఆట కట్టించేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వెలుగులోకి మరో కిలాడీ లేడీ బాగోతం! మంగళగిరి: టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తిపై కథనాలు ఓ పక్క ఆ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తుండగా, మరో పక్క అంతకు మించిన మరో కిలాడీ లేడీ ఉదంతం మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజులుగా పట్టణంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. పట్టణానికి చెందిన టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శిగా పని చేస్తున్న ఓ మహిళ నేరుగా అప్పటి హోంమంత్రి చినరాజప్పతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లతో పాటు డీజీపీని సైతం నేరుగా కలిసేది. నాయకులు, ఉన్నతాధికారుల పరిచయాలనే పెట్టుబడిగా పెట్టి సామాన్యులతో పాటు పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ సుమారు రూ.5కోట్లు వసూలు చేసినట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పట్టణంలో నివసిస్తున్న ఆమె గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీంతో బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మాజీ హోంమంత్రి చినరాజప్ప, చినబాబు లోకేష్, డీజీపీల పేర్లు చెప్పి వసూలు చేసినట్లు పార్టీ నాయకులు చెబుతుండడం గమనార్హం. బాధితులు ఒక్కొక్కరు ఇళ్లకు వస్తుండటంతో గుట్టు బయటకు రాకుండా కొందరు నేతలు ఆమె విదేశాలలో ఉందని, రెండు మూడు రోజుల్లో వస్తుందని వచ్చిన వెంటనే తామే ఇప్పిస్తామని, కేసులు పెడితే ఏమీ చేయలేరంటూ బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అనుచరుడు ఆమెకు అండగా నిలుస్తూ బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో కొందరి వివరాలు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువ నేత ఉద్యోగాల కోసం రూ. 14లక్షలు, తెనాలికి చెందిన యువకుడు రూ.6 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యాపారి ఇసుక కాంట్రాక్టు కోసం రూ.60 లక్షలు, నారాయణ కళాశాలలో క్యాంటీన్ కోసం మరో యువకుడు రూ.6లక్షలు, మరో ఇద్దరు యువకులు ఉద్యోగాల కోసం రూ.10లక్షలు చెల్లించినట్లు ఇప్పటికే బయటపడ్డారు. దీనికితోడు గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉద్యోగాలు, కాంట్రాక్టుల పేరుతో రూ. 5కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసిందని టీడీపీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో విదేశాల నుంచి వస్తుందని ఇంట్లోని వారు చెబుతుండడంతో బాధితులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. చదవండి : (కి'లేడీ' కోసం గాలింపు !) -
ఖాళీ చెక్కు ఇచ్చి బురిడీ!
సాక్షి, గుంటూరు: ఖరీదైన కారులో విలాసవంతంగా తిరుగుతూ నిరుద్యోగులు, అమాయకులను నమ్మించి ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్లపల్లి దీప్తి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాను సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నానంటూ ఇప్పటికే రూ.70 లక్షలను వివిధ రకాల ఉద్యోగాలు, సమస్యలు పరిష్కరిస్తానంటూ కాజేసిన విషయం తెలి సిందే. ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలతో బాధితులు బయటకు వస్తున్నారు. వారిని నమ్మించి మోసం చేసిన విషయాలను ఏకరువు పెడుతున్నారు. నిందితురాలిని పోలీసులు వీలైనంత త్వరగా అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బాబాయి పేరుతో కారు... ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయి హైదరాబాదులో ఉంటున్న దీప్తి బాబాయి మామిళ్లపల్లి కృష్ణ ప్రసాద్ పేరుతో ఉన్న మారుతీ డిజైర్ కారును ఉపయోగిస్తుంది. కారుపై రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని రాసుకొని దర్జాగా తిరిగింది. టీడీపీ హయాంలో ఎవరూ కారును నిలుపుదల చేసి కారు నంబరు విషయం అడిగే సాహసం చేయలేక పోయారు. గుంటూరులోని విద్యానగర్లో నివాసం ఉంటున్న కారణంగా కారుకు గుంటూరులోని ఇద్దరు డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంది. అయితే వారిలో ఓ డ్రైవర్కు గత నెలలో జీతం ఇవ్వకపోవడంతో మానేశాడు. ఇదిలా ఉంటే గుంటూరులోని ఓ బాధితుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకున్న సమయంలో ఖాళీ చెక్కుపై ఎంత డబ్బు అనే వివరాలు రాయకపోగా, ఆమె సంతకం కూడా లేకుండా ఇచ్చేసిందంటే బాధితుడిని ఎలా మోసం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేంటి సంతకం లేదని బాధితుడు అడిగితే సంతకంతో పనేముంది నీకు హామీగా ఇస్తున్నానని నమ్మబలికిందని వాపోతున్నాడు. రంగంలోకి దిగిన పచ్చ సీఐ.. ఈ నేపథ్యంలో దీప్తి మోసాల గురించి వస్తున్న కథనాలతో ఆందోళనకు గురైన కొందరు బాధితులు కాకుమాను మండలంలోని మోసకారి గ్రామమైన బోడపాలెం వెళ్లి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న దీప్తి టీడీపీ నాయకులతో మంతనాలు చేసినట్లు తెలిసింది. వారి సూచనల మేరకు పచ్చ రంగు పులుముకున్న ఓ సీఐ రంగంలోకి దిగి దీప్తి గ్రామానికి ఎందుకు వెళ్లి విచారించారంటూ బాధితులకు ఫోన్ చేసి హెచ్చరించారు. ఇకపై అటువెళితే సహించేది లేదని, ఏదైనా ఉంటే దీప్తి పైనే ఫిర్యాదు చేసుకోవాలని ఆదేశించారు. నిందితురాలికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ముందుగా నిలుపుదల చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. (చదవండి: కిలాడీ లేడీ దీప్తీ) -
కిలాడీ లేడీ దీప్తి
సాక్షి, గుంటూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అమాయకులను మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాననీ, ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పనులు చక్క పెడతానని ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడీ లేడీ మామిళ్లపల్లి దీప్తి బాధితులు ఒక్కక్కరిగా బయటకు వస్తున్నారు. ఆమె సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానని నమ్మించి మోసం చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఈ కిలాడీ లేడీ గురించి గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. కిలాడీ లేడీ గురించి సాక్షి జరిపిన విచారణలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమాయకుల నుంచి దాదాపు రూ.70 లక్షలకుపైగా దీప్తి నమ్మించి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. బయటకు వస్తున్న బాధితులు... రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా గ్రామ, సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిని కూడా దీప్తి క్యాష్ చేసుకుంది. సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురికి నమ్మబలికింది. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఓ యువకుడికి సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ యువకుడు అప్పు చేసి రూ 1.50 లక్షలు ఇచ్చానని సాక్షి ఎదుట వాపోయాడు. వైజాగ్కు చెందిన వ్యక్తికి గురుకుల సంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. అందుకు రూ.15 లక్షలు కావాలని అడిగితే.. ఆయన ఇల్లు అమ్ముకొని వచ్చిన రూ.5 లక్షలు తెచ్చి ఇచ్చాడు. మాచర్లకు చెందిన నాయక్ అనే వ్యక్తికి విధ్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఏడాది క్రితం రూ.4.50 లక్షలు వసూలు చేసింది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన బాధితుడు, గుంటూరుకు చెందిన మన్నవ వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, పొలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షలు, కడప జిల్లాకు చెందిన వ్యక్తి నుంచి రూ.12 లక్షలు, నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి నుంచి రూ.10 లక్షల చొప్పున తీసుకున్నట్లు తెలిసింది. దాదాపుగా ఇప్పటి వరకు రూ.70 లక్షలకుపైగా నమ్మించి డబ్బు కాజేసిందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి హైదరాబాద్ దీప్తిపై ఫిర్యాదులు అందుతుండటంతో ముందు జాగ్రత్త పడింది. గుంటూరు నుంచి స్నేహితుల సహకారంతో హైదరాబాద్ చేరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దీప్తి తనపై వచ్చిన ఫిర్యాదుల నుంచి బయట పడేయాలని టీడీపీ నాయకులకు ఫోన్ చేసి కోరుతున్నట్లు సమాచారం. బాధితులు మాత్రం మోసకారి ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్టు చేయడంతోపాటు ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేలా పాస్పోర్టు సీజ్ చేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా వివరాలు తెలియజేయడం సాధ్యం కాదని అంటున్నారు. ఏది ఏమైనా కిలాడీ లేడీని అరెస్టు చేసి మరొకరు ఇలాంటి మోసాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. (చదవండి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏనంటూ..) -
వాగు మింగేసింది
సాక్షి, నాదెండ్ల(గుంటూరు) : మండలంలోని సంక్రాంతిపాడు వద్ద నక్కవాగులో గల్లంతైన యువ రైతు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. సంక్రాంతిపాడు గ్రామానికి చెందిన ప్రత్తి సాంబశివరావు కుమారుడు శ్రీకాంత్ (29) రెండేళ్ల క్రితం గుంటూరు సమీపంలోని బుడంపాడు గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. అరెకరం సొంత భూమికి తోడు మరి కొంత కౌలుకు తీసుకుని తండ్రితో కలిసి పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం తండ్రితో కలిసి బ్రిడ్జి మీదుగా పొలానికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. వాగు ఉధృతికి అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో ద్విచక్రవాహనాలపై వెళ్తున్న రైతులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. నాదెండ్ల ఇన్చార్జి తహసీల్దార్ నాంచారయ్య, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, ఎస్ఐ చెన్నకేశవులు, అగ్నిమాపక దళ అధికారి చంద్రమౌళి సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను తెప్పించారు. ఈలోగా రైతులే శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలతోనే ప్రమాదాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వకాలు జరిపారు. నక్కవాగులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వటంతో గుంతలు ఏర్పడ్డాయి. వాగు ఉధృతి కారణంగా శ్రీకాంత్ ఈ గుంతల్లో పడి మృతి చెందాడు. గల్లంతైన బాలిక మృత్యుఒడికి.. సత్తెనపల్లి: మండలంలోని పాకాలపాడు వాగులో గల్లంతైన విద్యార్థిని పెరవల్లి భువనేశ్వరి (11) మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని గురువారం రెంటపాళ్ళ వద్ద వాగులో పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు గుర్తించారు. చందవరం గ్రామానికి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. అమ్మమ్మ పార్వతితోపాటు దుస్తులు శుభ్రం చేసేందుకు పాకాలపాడులోని శివాలయం వెనుక ఉన్న వాగుకు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్లింది. కాలు జారి వాగులో పడి కొట్టుకుపోయింది. బాలిక మృతితో అమ్మమ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటన పలువురిని కలిచివేసింది. మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ప్రియుడితో బంధం భర్తకు చెప్తాడనే భయంతో..
సాక్షి, రాజుపాలెం(సత్తెనపల్లి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తొమ్మిదేళ్ల కన్న కొడుకుని ప్రియుడితో కలసి కిరాతకంగా హత్య చేసిన తల్లి ఉదంతం ఇది. తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల కథనం మేరకు... మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన షేక్ జాన్వలి, సైదాబీ దంపతులకు కుమారుడు విజ్వాన్ (9), ఓ కుమార్తె ఉన్నారు. జాన్వలి కరెంటు పనులు చేస్తూ మద్యానికి బానిసయ్యాడు. దీనిని ఆసరాగా తీసుకున్న భార్య సైదాబీ అదే గ్రామానికి చెందిన అవివాహితుడు వడ్లమాను శ్రీకాంత్రెడ్డితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రోజూ శ్రీకాంత్రెడ్డి సైదాబీ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. ఇది గమనించిన కుమారుడు తల్లిని మన ఇంటికి అతను ఎందుకు వస్తున్నాడని ప్రశ్నించాడు. విషయాన్ని నాన్నకు చెబుతానని అన్నాడు. దీంతో భయపడిన జాన్బీ తన వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డు వస్తున్నాడని భావించింది. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పన్నాగం పన్నింది. పథకం ప్రకారమే హత్య... తల్లి, ప్రియుడు కలసి విజ్వాన్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2018 డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఆడుకునే విజ్వాన్ను శ్రీకాంత్రెడ్డి మీ అమ్మ నిన్ను తీసుకురమ్మన్నదని బైకుపై ఎక్కించుకొని బీరవల్లిపాయ అడవి సమీపంలోకి చేరాడు. అప్పటికే అక్కడ సైదాబీ వేచి ఉంది. ద్విచక్ర వాహనంపై సైదాబీని కూడా ఎక్కించుకుని దట్టమైన బీరవల్లిపాయ కొండల సమీపంలోకి తీసుకెళ్లారు. విజ్వాన్ను తల్లి రెండు కాళ్లు పట్టుకోగా ప్రియుడు శ్రీకాంత్రెడ్డి బాలుడి తలపై అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపారు. తరువాత మృతదేహాన్ని ఇద్దరూ కలసి ఈడ్చుకుంటూ గుట్టల్లోకి విసిరి పడేశారు. ఆ తరువాత వారిద్దరూ ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు. ఫోన్కాల్ లిస్టు ఆధారంగా... ఇటీవల రూరల్ ఎస్పీ జయలక్ష్మి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించడంతో సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల రూరల్ సీఐ ఎం.రత్తయ్య, ఎస్ఐలు అనంతకృష్ణ, రాజశేఖర్బాబు, ట్రైనింగ్ ఎస్ఐ వెంకటరవి దర్యాప్తును ముమ్మరం చేశారు. తల్లి సైదాబీ ఫోన్కాల్ లిస్టు ఆధారంగా ప్రియుడు శ్రీకాంత్రెడ్డి ప్రమేయం ఉందని భావించారు. తల్లిని, ప్రియుడు శ్రీకాంత్రెడ్డిని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారే బాలుడిని హత్య చేశారని తేల్చారు. దీంతో నిందితులిద్దరినీ గురువారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు. చదవండి : అత్తారింటికి వెళ్తే.. మర్మాంగాన్ని కోసేశారు -
వచ్చీరాని వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
వారు కేవలం ఫస్ట్ ఎయిడ్... అంటే ప్రాథమిక చికిత్స మాత్రమే చేయడానికి అర్హులు. కాని వారు ఎంఎస్ సర్జన్ల మాదిరిగా ఆపరేషన్లు కూడా చేసి పారేస్తుంటారు. కమీషన్ల కోసం ఇబ్బడిముబ్బడిగా నోటికొచ్చిన మందులు, యాంటీబయాటిక్స్ రాసి పారేస్తుంటారు. అవి వాడిన రోగులకు కొత్తరోగాలు, రావడం, కిడ్నీలు ఫెయిలవడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. వీరిపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో గ్రామీణుల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారు. సాక్షి, గుంటూరు మెడికల్ : పట్టుమని పదో తరగతి కూడా చదవరు... అయినా పల్లెటూరులో పెద్ద డాక్టర్గా చెలామణి అవుతుంటారు...చిన్న గదిలోనే పెద్ద ఆస్పత్రి మాదిరిగా సెలైన్లు పెట్టడం, మందులు పెట్టి అమ్మటం, గాయాలకు కుట్లు వేయటం చేస్తూ అను‘మతి’ లేని వైద్యంతో గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. గ్రామంలోనే ఉండటంతో గ్రామీణుల ఆర్థిక స్థితిగతులపై అవగాహన కల్గి ఏదైనా రోగం వచ్చినప్పుడు వారిని వైద్యం పేరుతో దోచేస్తున్నారు. వారిపై పర్యవేక్షణ ఎవరు చేయాలనే దానిపై వైద్యాధికారుల్లో స్పష్టత లేకపోవటంతో ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ ఒక రోగంతో వెళ్లిన వారికి ఇతర రోగాలు సోకే విధంగా వైద్యం అందిస్తున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... ఆర్ఎంపీల వైద్యంతో ముఖం నల్లగా మారి కంటిచూపు పోయిందని ఫిరంగిపురానికి చెందిన కేసనపల్లి కుమారి 2017 మే నెలలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు జ్వరం రావటంతో గ్రామంలోని ముగ్గురు ఆర్ఎంపీల వద్ద వైద్యసేవలను పొందింది. వారు ఇచ్చిన మందులను మింగటం వల్లే తన ముఖం నల్లగా మాడిపోవటంతో పాటుగా కంటిచూపు కూడా పోయిందని బాధితురాలు పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. గర్భం ధరించిన ఓ మహిళకు 2018లో అమరావతిలో ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేయటం, తీవ్ర రక్తస్రావమై సదరు మహిళ ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి రాకుండా రాజీపడే కేసులు చాలా ఉంటాయి. కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసే అర్హత మాత్రమే ఉన్న కొంతమంది ఆర్ఎంపీలు, పీఎంపీలు స్పెషాలిటీ పీజీ చేసిన వైద్యులు కూడా చేయని ఆపరేషన్లు, వైద్యాన్ని చేస్తూ గ్రామీణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జ్వరాల సీజన్లో అప్రమత్తంగా లేకపోతే... నేడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జ్వరాల కేసులు నమోదవుతూ ఉన్నాయి. జ్వరాలతో పాటుగా అప్పుడప్పుడు డయేరియా కేసులు కూడా నమోదువుతున్నాయి. గ్రామీణ రోగులకు ఆర్ఎంపీలు అందుబాటులో ఉండటంతో జ్వరపీడితులు వెంటనే వారిని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది గ్రామీణ వైద్యులు జ్వరపీడితులను ప్లేట్లెట్స్ తగ్గాయంటూ భయపెట్టి పట్టణాల్లో ఆస్పత్రుల్లో చేర్పించి ఆర్థికంగా గుల్ల చేస్తున్నారు. పట్టణాల్లోని ఆస్పత్రుల్లో రోగిని చేర్పించినందుకు రోగికి లక్ష రూపాయలు బిల్లు అయితే అందులో రూ.30,000 నుంచి రూ.40,000 ఆర్ఎంపీ, పీఎంపీలకు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు కమీషన్గా ఇస్తున్నారు. కొన్ని పట్టణాల్లో కేవలం ఆర్ఎంపీలు, పీఎంపీలు పంపించే రోగులపైనే ఆధారపడి ప్రైవేటు ఆస్పత్రులు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏ రోగికి ఎంత వరకు బిల్లు వేయవచ్చనే విషయాన్ని ఆర్ఎంపీలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు తెలియజేస్తారు. అందుకు ప్రతిఫలంగా ఆస్పత్రుల నిర్వాహకులు నెలకోమారు, లేదా మూడు నెలలకు ఒకసారి ఆర్ఎంపీలకు సమావేశాలు ఏర్పాటు చేసి విందు భోజనాలతో పాటుగా భారీగా బహుమతులు, కమీషన్లు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. వైద్యాధికారులు ఈ సీజన్లో ప్రైవేటు వైద్యులపై, ఆర్ఎంపీలు తప్పుడు ప్రాక్టీస్లపై ఓ కన్ను వేసి ఉంచకపోతే రోగులు బలైపోయే ప్రమాదం లేకపోలేదు. కొంతమందికే అనుమతి... జిల్లాలో సుమారు 4,000 మంది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్(ఆర్ఎంపి), ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్(పీఎంపీ) వైద్యసేవలు అందిస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా వీరు ఇష్టానుసారంగా వైద్యం చేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉండటంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఎంపీ, పీఎంపీలకు ఏడాదిపాటు శిక్షణ కోర్సు ఏర్పాటుచేశారు. ఆ కోర్సు పూర్తిచేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 1,400 మంది మాత్రమే 2008–09లో శిక్షణ పొందారు. వైఎస్సార్ మరణంతో ఆ శిక్షణ కార్యక్రమం ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం ఆర్ఎంపీలకు ప్రాక్టీస్ చేసుకునేందుకు ఇచ్చిన జీఓ వివాదాస్పదమై ఐఎంఏ వైద్యులు కోర్టులో కేసు వేశారు. శిక్షణ పొందకుండా ప్రాక్టీస్ చేసేవారిపై, అత్యాశతో పెద్ద డాక్టర్ల మాదిరిగా ఫస్ట్ఎయిడ్ కాకుండా ఇతర వైద్యసేవలు అందించేవారిపై, మందులు రాసే అర్హత లేకున్నా మందులు రాస్తూ షాపు కూడా నిర్వహిస్తున్న వారిపై, బయో మెడికల్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడే పడేసి అంటువ్యాధులు ప్రబలే విధంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆర్ఎంపీలపై వైద్యాధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి గ్రామీణ వైద్యులు కొంత మంది రోగి తమ వద్దకు వెళ్లగానే డైక్లోఫినాక్, జెంటామైసిన్, ఎమికాసిన్ లాంటి నొప్పి నివారణ ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తున్నారు. బీపీ, షుగర్ బాధితులకు అధిక మొత్తంలో నొప్పి నివారణ మాత్రలు, ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా వారికి కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇలాంటి బాధితులు మా వద్దకు చికిత్స కోసం తరచుగా వస్తున్నారు. కొన్ని రకాల నొప్పి నివారణ మాత్రలు వారం నుంచి పదిరోజులు వాడితే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ చింతా రామకృష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు -
ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య
సాక్షి, గుంటూరు : మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆదిలక్ష్మి అనే మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను చంపించింది. ఇందుకోసం తన చెల్లెలి కుమారుడి సహాయం తీసుకుంది. తర్వాత ఎవరికీ తెలియకుండా శవాన్ని డంపింగ్ యార్డులో పడేసింది. ఈ ఘటనను విచారించిన పోలీసులు భార్య పాత్రను నిర్ధారించారు. ఆదిలక్ష్మిని, ఆమె ప్రియుడు కరీముల్లాను అదుపులోకి తీసుకున్నారు. -
బాలికపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు(వినుకొండ) : బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో మంళవారం చోటు చేసుకుంది. వినుకొండ టౌన్ సీఐ చినమల్లయ్య వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కన వాళ్లు వచ్చారు. అంతలోకి నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మందలించాడని ఆత్మహత్య
సాక్షి, తెనాలి, (గుటూరు): భర్త మందలించాడని భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన కలవకొల్లు రంగా ఇంటికి మాంసం తీసుకువెళ్లాడు. మధ్యాహ్నమయినా వంట పూర్తికాకపోవడంతో, పిల్లలకు పెట్టలేదంటూ భార్య లక్ష్మి(26)ని రంగా మందలించాడు. «భర్త బయటకు వెళ్లగానే, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న లక్ష్మి తల్లి, పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు కిందికి దించి తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. హెడ్కానిస్టేబుల్ బొత్తలపూడి శ్యామ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!
సాక్షి, మేడికొండూరు (గుంటూరు): సినిమాల్లో హీరో ఎస్సై వేషం వేసి రౌడీలను ఎక్కడ పడితే అక్కడ చితకబాదినట్లు ఉంది ఎస్సై వినోద్కుమార్ తీరు. యువకులు, వృద్ధులు, మందుబాబులను ఎక్కడ పడితే అక్కడ లాఠీలతో విచక్షణా రహితంగా కొట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై కొట్టిన తరువాత ఆయన దాడిలో గాయపడిన వారు బయటకి చెప్పుకోలేక మిన్నుకుండి పోతున్నారు. ఇటీవల మేడికొండూరు ఈద్గా సమీపంలో ఇద్దరు రైతులను పొలంలో కొట్టడం చర్చనీయాంశమైంది. పేరేచర్ల కూడలిలో మంగళవారం రాత్రి కేసులు రాస్తున్న నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్రవాహంపై వస్తుండగా వారి వాహనాన్ని ఎస్సై ఆపారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్ చేస్తామని చెప్పటం, కేసు రాసుకోమని అనటంతో చిర్రెత్తిన ఎస్సై ఒక యువకుడి చెంప చెళ్లు మనిపించాడు. రెండు సార్లు యువకుడిని కొట్టాడు. ఏదైనా ఉంటే చెప్పాలి లేక కేసులు రాయాలని బాధితులు అంటున్నారు. అంతేకానీ ఇష్టానుసారం దాడి చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం దుకాణాల వద్దకు వెళ్లి పది గంటలు కాక మునుపే మందుబాబులపై తన ప్రతాపం చూపిస్తూ ఎక్కడ పడితే అక్కడ లాఠీతో దాడి చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వారిని మరింత చితకబాదుతున్నారు. వీరికి తగలరాని చోట తగిలి ఎదైనా ప్రాణానికి ముప్పు వాటిల్లితే పరిíస్థ్ధితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అర్బన్ సౌత్ డీఎస్పీ కమలాకర్ను వివరణ కోరగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. ఇంతకమునుపు మేడికొండూరు ఠాణాలో పనిచేసిన ఎవరూ ఇలాంటి క్రూరత్వం ప్రదర్శించలేదని చెబుతున్నారు. చదవండి: వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి -
మురుగు కాల్వలో పసికందు మృతదేహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు రోడ్డు మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే ఆ ప్రాంతానికి సమీపంలో మరో పసికందు మృతదేహం మురుగు కాల్వలో కనిపించటం కలకలం రేపింది. పల్నాడు రోడ్డు పాత చెక్పోస్టు వీధిలోని ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని వన్టౌన్ పోలీసులకు అందించారు. దీంతో ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైడుకాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. నెలలు నిండని శిశువుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 20 రోజుల క్రితం పల్నాడు బస్టాండ్ ఎస్కేఆర్బీఆర్ కళాశాల ఎదుట ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల్లో అబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన మరువక ముందే మురుగు కాల్వలో మరో పసికందు ప్రత్యక్షమవ్వటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
వివాదాస్పదంగా తాడికొండ ఎస్ఐ వైఖరి
సాక్షి, తాడికొండ: తాడికొండ ఎస్సై రాజశేఖర్ వైఖరి నానాటికీ వివాదాస్పదంగా మారుతోంది. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులకు ఎస్సై తొత్తుగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఏ ఒక్క పక్షానికి కొమ్ముకాయకూడదన్న కనీస ధర్మాన్ని విస్మరించి పచ్చ చొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్తలా ఎస్సై వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకులు, శ్రేణులు తప్పులు చేసి ఠాణాకు వచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయనకు టీడీపీపై ఉన్న ప్రేమానురాగాలు పరాకాష్టకు చేరాయి. కంతేరు గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారంలో టీడీపీ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నల్లమట్టిని తరలిస్తున్న ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్ నిర్వాహకుడిని బంధించి వారితో వైఎస్సార్ సీపీ నాయకులే మట్టి తరలించమని చెప్పారని చెప్పించేందుకు తీవ్రంగా యత్నించారు. ఇందులో భాగంగా కంతేరు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి వీడియోలు తీస్తూ బెదిరించిన వ్యవహారం బయటకు రావడంతో తాడికొండ వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి ఎస్ఐ రాజశేఖర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్సై పక్కన పడేశారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కేసు నమోదు చేయడం గమనించాల్సిన విషయం. గతంలోనూ ఇదే పరిస్థితి.. ఎస్సై రాజశేఖర్ తీరు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలోనూ వాస్తవాలు పక్కనపెట్టి కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులను వేధింపులకు గురిచేశాడు. 2018 జనవరిలో వైఎస్సార్ సీపీ నాయకుడిపై సోషల్ మీడియా కేసు బనాయించి కనీసం స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. బండారుపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు టపాసులు కాల్చుతూ రాకెట్కు చంద్రబాబు నరకాసురుడు అని రాసి పైకి ఎగరేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటుపల్లి రాంబాబుపై టీడీపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఓ వ్యక్తితో నామమాత్రపు ఫిర్యాదు ఇప్పించి అక్రమంగా అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా రిమాండ్కు తరలించారు. కానీ నాడు సంబంధిత వీడియోలో కేసు నమోదు చేసిన వ్యక్తులు కానీ టపాసులు కాల్చిన చిన్నారులు కానీ కనిపించలేదు. కేవలం కేసు నమోదు చేసిన వ్యక్తి ఫేస్బుక్లో ఆ వీడియోను షేర్ చేశాడనే నెపంతో అక్రమ కేసు బనాయించడం విశేషం. ఘటనపై స్పందించిన నాటి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీక్రిస్టినా, సురేష్ కుమార్ దంపతులు రాత్రి 12 గంటల వరకు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేసినా కనీసం స్పందించిన దాఖలా లేదు. నేడు అందుకు విరుద్ధం.. నాడు రాంబాబు తప్పు లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసిన ఎస్సై నేడు టీడీపీ నాయకులు మట్టి తరలింపు వ్యవహారంలో ట్రాక్టర్ డ్రైవర్లు, వెంచర్ యజమానిని వేధిస్తూ పక్కా ఆధారాలతో దొరికినా వారిపై కేసు నమోదు చేయడం లేదు. ఇది ఎస్సై ఏకపక్ష ధోరణికి ప్రత్యేక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చదవండి: వివాదాస్పదంగా ఎస్ఐ వినోద్ వ్యవహారశైలి -
వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!
సాక్షి, చిలకలూరిపేట: పెంపుడు కుమార్తెను వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరులో నివాసం ఉండే ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మిట్టనోసుల ప్రభుదాసు ఎలియాస్ వీరారావు ఒక కుమార్తెను పెంచుకున్నాడు. ఆమె చేత 13 సంవత్సరాల వయస్సు నుంచే బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆమెకు వివాహం జరిగాక కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో భర్త వదలివేశాడు. దీంతో ఆమె చిలకలూరిపేట పట్టణంలో తన కుమార్తెతో కలసి జీవనం కొనసాగిస్తోంది. ఇది తెలిసి వీరారావు తిరిగి ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కొట్టి గాయపరచటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!
సాక్షి, తెనాలి: వృద్ధాప్యంలో ఉన్న తమను ఆదరించకపోగా, ఆస్తి కోసం వేధిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతూ తప్పుడు కేసుతో పోలీస్ స్టేషన్లో నిర్బంధానికి గురిచేసిన కోడలు నుంచి తమకు రక్షణ కల్పించాలని కొల్లిపర మండల గ్రామం శిరిపురానికి చెందిన డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు అధికారులను వేడుకున్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో అర్జీనిచ్చారు. తెనాలి ఆర్డీవో ఎ.శ్యామ్సుందర్ అర్జీలను స్వీకరించారు. అర్జీలో విక్టోరియమ్మ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. తాడిగిరిపాడులో నివసిస్తున్న డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు కోడలు భాగ్యలక్ష్మి వేధింపులను తట్టుకోలేక శిరిపురం చేరుకున్నారు. అక్కడే కూలిపనులు చేసుకుంటూ మూడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి పూరిల్లు వేసుకుని నివసిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత కొడుకు గోపాలరావు, కోడలు భాగ్యలక్ష్మి కూడా శిరిపురం వచ్చారు. తల్లిదండ్రులు ఉండే స్థలంలోనే మరో ఇల్లు వేసుకుని వేరుకాపురం ఉంటున్నారు. వీరి మంచీచెడూ చూడటం లేదు. కోడలు పేరిట తాడిగిరిపాడులో ఇందిరమ్మ ఇల్లు ఉంది. అయితే తల్లిదండ్రులు ఉంటున్న నివాస స్థలాన్ని కూడా కోడలు పేరుతో రాసివ్వమంటూ కొడుకు గోపాలరావు ఒత్తిడి చేస్తున్నాడు. బతికున్నంతకాలమైనా స్థలాన్ని తమ అధీనంలోనే ఉంచమని వేడుతున్నా వినలేదు. హృద్రోగంతో బాధపడుతున్న మామ, అత్త విక్టోరియమ్మను ఆస్తి కోసం కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అప్పటికీ స్థలం ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో కొల్లిపర పోలీస్స్టేషనులో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు 23వ తేదీ సాయంత్రం 5 గంటల్నుంచి అర్ధరాత్రి వరకు వృద్ధ దంపతులను నిర్బంధించారు. కొల్లిపర పోలీసులు కూడా కోడలుకే మద్దతునిస్తూ, స్టాంపు పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. నివసిస్తున్న స్థలం మినహా మరే ఆధారం లేని తమను రోడ్డుకీడ్చారని, గతిలేని స్థితిలో అదే ఊరిలో ఉంటున్న అల్లుడి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని వృద్ధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలి వల్ల తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించి, తమ ఇంటిలో తాము ఉండేలా న్యాయం చేయాలని విక్టోరియమ్మ భర్తతో సహా ఆర్డీవోను వేడుకుంది. మనుమలను దూరం చేశారు.. వృద్ధాప్యంలో ఒంటరి జీవితం నరకప్రాయమని, కనీసం చనిపోయేంతవరకైనా తనతో కోడలు, మనుమ సంతానం కలిసుండేలా ఆదేశించాలని పట్టణ సుల్తానాబాద్కు చెందిన వృద్ధురాలు ధనావత్ పట్నీబాయి (70) ‘స్పందన’లో ఆర్డీవోను కలిసి అర్జీనిచ్చారు. భర్త మరణంతో తాను సుల్తానాబాద్లోని సొంతంటిలో పెద్దకొడుకు కుటుంబంతో కలసి ఉంటున్నట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడైన తన పెద్ద కొడుకు మునినాయక్ గత మే నెల 27న ఆటోప్రమాదంలో మరణించాడని, ఉమ్మడి కుటుంబం అయినా కొడుకు చనిపోయాక ఫ్యామిలీ సర్టిఫికెట్లో తన పేరు లేకుండా చేశారని పట్నీబాయి చెప్పారు. ఆధార్లో మార్పులు చేయించుకు వస్తానంటూ కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లినట్టు తెలిపారు. ఇప్పుడేమో ‘నేను రాను...మీతో నాకు అవసరం లేదు’ అంటోందని చెప్పారు. ఎవరూ లేకపోవటంతో పెళ్లివయసుకొచ్చిన చిన్న కుమార్తెతో ఉంటున్నానని, ఆమె వివాహం తర్వాత మళ్లీ ఒంటరినవుతానని ఆవేదనగా అన్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు మనుమ సంతానంతో సహా కోడలు తన ఇంటి వద్ద ఉండేలా చూడాలంటూ ఆర్డీవోను అభ్యర్థించారు. – ధనావత్ పట్నీబాయి -
ఒక్కో టీవీఎస్కు.. ఒక్కో సంవత్సరం జైలు శిక్ష
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు) : అతనో ఘరానా దొంగ. చూడటానికి దివ్యాంగుడే అయినప్పటికీ అతని కన్ను పడితే మాత్రం టీవీఎస్ మాయమే. అలాంటి మాయల మరాఠీని ప్రత్తిపాడు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసులకు ఎనిమిది సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీవీఎస్లు వరుస చోరీలకు గురవుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న అప్పటి ఎస్ఐ ఏ.బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన సంగేపు అర్జునరావు (40)ను పట్టుకున్నారు. అతని నుంచి సుమారు ఇరవైవరకు టీవీఎస్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముద్దాయిపై 379 ఐపీసీ సెక్షన్ కింద 76/19, 81/19, 82/19, 83/19, 84/19, 85/19, 87/19, 89/19 మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వాటిలో ఈనెల 20వ తేదీన రెండు కేసుల్లో, 21వ తేదీన 3 కేసుల్లో, 22న 3 కేసుల్లో శిక్షలు విధిస్తూ ఆరవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అరుణ తీర్పు ఇచ్చారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసుల్లో ఎనిమిది సంవత్సరాలు శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రత్తిపాడు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
వ్యసనాలకు బానిసలై జైలుపాలైన విద్యార్థులు
సాక్షి, గుంటూరు : విద్యార్థి కిడ్నాప్కు విఫలయత్నం చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎస్.ఎం.నజీముద్దీన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎస్.వి.రాజశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన సానిమల్లికార్జున గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బ్రాడీపేటలోని బీసీ హాస్టల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన ఉదయం 3 గంటల సమయంలో మాచర్ల నుంచి వస్తున్న తన రూమ్మెట్ సాంబశివరావును తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్టాండ్కు తన సైకిల్పై మూడు వంతెనల బ్రిడ్జి కింద నుంచి నెహ్రూనగర్ రైల్వే ట్రాక్ పక్కగా రామిరెడ్డితోట ప్రధాన రహదారిపై వెళుతున్నాడు. పోలేరమ్మ ఆలయం వద్దకు వచ్చేసరికి నలుగురు యువకులు కారును అడ్డుపెట్టి మల్లికార్జునను బలవంతంగా కారులో ఎక్కించారు. వారి వద్ద ఉన్న పిస్టల్ చూపించి తాము పోలీసులమని, నీలాంటివాళ్ల వల్ల రాత్రి వేళల్లో విధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బెదిరించారు. అయితే సదరు విద్యార్థి నుంచి సెల్ఫోన్, ఐడీ కార్డు లాక్కున్నారు. ఆ తర్వాత అక్కడ కారు ఎక్కించుకుని బస్టాండ్ పరిసర ప్రాంతంలోని గాయత్రి హోటల్లో వద్దకు వెళ్లారు. అక్కడ రక్షక్ వాహనాన్ని చూసిన నలుగురు కారు వదిలేసి తలో దిక్కు పారిపోయారు. అనంతరం మల్లికార్జున రక్షక్ ఇన్చార్జి షేక్ యూనస్బేగ్కు సమాచారం చెప్పగా, పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే కారును, పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కూడా విద్యార్థులే.. కొత్తపేట ఎస్హెచ్ఓ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రంగంలో దిగిన బృందం నలుగురిని ఈనెల 18వ తేదీన మణిపురం బ్రిడ్జి పక్కన సింగ్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో కిడ్నాప్కు పాల్పడినట్లు అంగీకరించారు. పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన వెనిగండ్ల చైతన్యకృష్ణ, రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామానికి చెందిన వడ్లమూడి నాగబాబు, కాకుమాను మండలం కొండుపాటూరు గ్రామానికి చెందిన పూనం మనోజ్, వినుకొండ మండలం పిట్టంబండ గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావును అరెస్టు చేశారు. నిందితులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే. అయితే ఎస్వీఎన్కాలనీలో ఒక రూము అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీ నగర్లో నివాసం ఉండే మద్దుకూరి రామబ్రహ్మం వద్ద నుంచి చైతన్యకృష్ణ సొంత పనుల నిమిత్తం కారు కావాలని తీసుకున్నాడు. దీంతోపాటు, మరో స్నేహితుడు అభిరామ్ అమెరికా వెళుతూ తన ఇంట్లో అప్పగించమని ఇచ్చిన పిస్టల్ను దగ్గరపెట్టుకుని అమాయకుల్ని బెదిరించి డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈనెల 14వ తేదీన ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడు ఉపయోగించిన పిస్టల్ సామర్థ్యం, పనిచేసే తీరు తదితర అంశాలు తెలుసుకునేందుకు దాన్ని ల్యాబ్కు పంపనున్నారు. అలాగే వెనిగళ్ల చైతన్య కృష్ణ మరికొద్దిరోజుల్లో విదేశాలకు వెళ్లనున్నారు. ఈక్రమంలో అతని పాస్పోర్టు కూడా సీజ్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏఎస్సై ఆంథోని, హెడ్కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ చంద్రశేఖర్ను ఉన్నతాధికారులు అభినందించారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సులు చేస్తున్నట్లు తెలిపారు. -
కోడెల తనయుడు శివరామకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీఆర్ లేకుండా సుమారు 800 బైక్లు విక్రయించిన వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. రవాణా శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీఆర్ లేకుండా బైక్లు విక్రయించిన 138 మంది వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్లో బైక్ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా 800 బైక్లను కోడెల శివరామ్ విక్రయించాడు. ఈ వ్యవహారంలో ఇటీవల గౌతమ్ షోరూమ్ను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్ల పేరుతో వినియోగదారుల నుంచి ఒక్కో బైక్కు రూ.8–10 వేల వరకూ కోడెల శివరామ్ వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. రూ.కోటి మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు.. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా డెలివరీ చేసిన బైక్ల వివరాలను ఇన్వాయిస్లోని చిరునామాల ఆధారంగా గుర్తించారు. రవాణా శాఖ అధికారులు స్వయంగా బైక్లు కొనుగోలు చేసిన ఇళ్లకు వెళ్లి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 138 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులకు స్టేట్మెంట్లు ఇచ్చిన వినియోగదారులందరూ బైక్ కొనుగోలు సమయంలో తమకు టీఆర్ ఇవ్వలేదని, లైఫ్ ట్యాక్స్, టీఆర్ ఫీజుల పేరుతో రూ. 8–10 వేల వరకూ వసూలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి స్టేట్మెంట్ సేకరించిన అధికారులు స్టేట్మెంట్లను రవాణా శాఖ కమిషనర్కు నివేధించారు. విచారణ రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. విచారణ అనంతరం శివరామ్పై క్రిమినల్ కేసులు నమోదుచేస్తారు. బైక్లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్ కంపెనీలు.. టీఆర్ లేకుండా గౌతమ్ షోరూమ్ యాజమాన్యం 800 బైక్లు విక్రయించింది. వీటిలో చాలా వరకూ బైక్లను వినియోగదారులు ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేశారు. టీఆర్ జనరేట్ కాకపోవడంతో వినియోగదారులు కిస్తీ (ఇన్స్టాల్మెంట్స్) చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు బైక్లను స్వాధీనం చేసుకున్నాయి. టీఆర్ జనరేట్ కాకపోవడంతో ఆ బైక్లు రిజిస్ట్రేషన్ అవ్వక వేరొకరికి బైక్లు విక్రయించడానికి వీల్లేక ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రికవరీ చేసిన బైక్లన్నింటినీ ఫైనాన్స్ కంపెనీలు తమ గోడౌన్స్లో ఉంచుకున్నాయి. టీఆర్ లేని వాహనాలను నడపడం నేరం తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లేని వాహనాలను నడపడం నేరం. రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో టీఆర్ లేనట్టు గుర్తిస్తే ఎంవీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి భారీ అపరాద రుసుం విధించి వాహనం సీజ్ చేస్తారు. అదే విధంగా టీఆర్ లేని వాహనం ఢీ కొని ఎవరైన గాయాలపాలైన, మృతి చెందిన వాహనదారునిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. దురదృష్టవశాత్తు వాహనదారుడు మృతి చెందితే ఇన్సూరెన్స్ వంటి ఇతర స్కీమ్లు వర్తించవు. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా బైక్లు విక్రయించినవారు బైక్లను రోడ్డుపై తిప్పడానికి వీల్లేదు. – మీరా ప్రసాద్, డీటీసీ గుంటూరు -
రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
సాక్షి, గురజాల: పురిటినొప్పులతో బాధపడుతూ రెండేళ్ల కిందట గురజాలలోని శ్రీకాంత్ నర్సింగ్ హోంలో తల్లీబిడ్డ మృతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు అప్పట్లో సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే తల్లీబిడ్డ మృతి చెందారని ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి శ్యామ్ రెండో కుమార్తె మాచర్ల శిరీషా రెండోసారి గర్భం దాల్చడంతో 2017 మే నెల 26వ తేదీన గురజాల శ్రీకాంత్ నర్సింగ్ హోంలో చేర్పించారు. వైద్యం చేసే క్రమంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాలను మాడుగుల శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం 10 రోజుల నుంచి మృతురాలి కుటుంబీకులు మాచర్ల శిరీషా, ఆమెకు పుట్టిన బిడ్డ మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదులు చేశారు. దీంతో సీఐ ఓ.దుర్గాప్రసాద్, తహసీల్దార్ షేక్ గౌస్బుడేసాహేబ్ సమక్షంలో బుధవారం గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రమేష్బాబు, డాక్టర్ శివకామేశ్వరావు తల్లీబిడ్డ ఖననం చేసిన చోటు తవ్వకాలు చేపట్టి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
పచ్చని కాపురాల్లో చిచ్చు!
సాక్షి, గుంటూరు: వివాహేతర సంబంధాల కారణంగా కొందరు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కారణం ఏదైనా తీసుకునే నిర్ణయాలతో పచ్చని కాపురాల్లో అంధకారం నింపుకుంటున్నారు. వివాహేతర సంబంధాలను నెరుపుతూ ఆపై భార్య లేదా భర్తను అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు సైతం వెనుకాడటం లేదంటే మానవత్వం వారిలో ఎంతగా దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చు. అభం శుభం తెలియని చిన్నారులు చేయని తప్పుకు జీవిత కాలం తల్లిదండ్రులు లేక శిక్షను అనుభవిస్తున్నారు. పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్న కొంతమంది వారి జీవితాలను చేజేతులా అంధకారం చేసుకోవడంతో పాటుగా జైలు పాలవుతున్నారు. సమాజంలో గౌరవాన్ని కోల్పోతున్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు పరిశీలిస్తే... జిల్లాలో ఇటీవల జరిగిన పలు ఘటనలను పరిశీలిస్తే అసలు మానవ సంబంధాలు ఉన్నాయా... మంటగలిసిపోయాయా.. అనే అనుమానం కలగకమానదు. గడచిన వారం రోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే... ఇటీవల దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్కు చెందిన సీహెచ్ వెంకట పద్మావతి (35) భర్తతో విడిపోయి కుమారుడితో కలసి ఉంటుంది. పెనుమాలి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఆమె ప్రవర్తన పై అనుమానం రావడంతో సుబ్బారెడ్డి ఈ నెల 10న బలవంతంగా ఆమెతో సల్ఫస్ మాత్రలు మింగించి హతమార్చాడు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అంకె ఏడుకొండలు భార్యతో తోటి గొర్రెల కాపరి పి.నాగయ్య వివాహతేర సంబంధం కొనసాగిస్తున్నాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా ఏడుకొండలను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని సమీప అటవీ ప్రాంతంలో తల మొండం వేరు చేసి పాశవికంగా హతమార్చాడు. పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన మీసాల మధు సమీపంలోని మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భావించి యువతి తల్లితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఈ నెల 9న దారుణంగా హతమార్చి రైల్వే ట్రాక్ పక్కన పడేశారని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తప్పు ఎవరు చేసినా చివరకు బాధితులు, నిందితుల కుటుంబాల్లోని చిన్నారులు తల్లిదండ్రులకు దూరం కావాల్సి రావడం విచారకరం. జీవితాలను అంధకారం చేసుకోవద్దు కొద్దిపాటి మనస్పర్ధలు కారణంగా నిండు జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. సమస్యలు ఉంటే ఇరు కుటుంబాల్లోని పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోవాలి. అవగాహన లేకుండా అహంభావాలకు వెళ్లి పుట్టిన పిల్లల భవిష్యత్ను నాశనం చేయవద్దు. వారిని అమ్మానాన్నాల ప్రేమ నుంచి దూరం చేయవద్దు. వివాహేతర సంబంధాలను పెట్టుకొని ఇద్దరు జీవితాలను నాశనం చేసుకోవద్దు. సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి. చట్ట పరిధిలో న్యాయం చేస్తాం. - పీహెచ్డీ రామకృష్ణ, అర్బన్ ఎస్పీ యువత అప్రమత్తంగా ఉండాలి పెళ్లి అనే పవిత్ర బంధానికి ఇద్దరూ విలువ ఇవ్వాలి. ఇద్దరూ ఒకరిని మరొకరు అర్థం చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. అర్థం చేసుకోవడంలో ఏర్పడే తేడాల కారణంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. విచక్షణ కోల్పోతే జీవితం నాశనం కావడంతో పాటుగా విలువలు కోల్పోయి సమాజంలో జీవించాల్సి ఉంటుంది. జన్మనిచ్చిన పిల్లల భవిష్యత్ను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యువత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. - ఆర్.జయలక్ష్మి, రూరల్ ఎస్పీ -
గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు
సాక్షి, వేల్పూరు: గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన ఘటన మండలంలోని వేల్పూరులో గల రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయ పూజారి ఆమంచి రవికుమార్ ఫిర్యాదు మేరకు పురావస్తుశాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ వెంకటయ్య, అచ్చంపేట ఎస్ఐ పి.పట్టాభిరామయ్య శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో వేయిపడగల నాగేంద్రస్వామి రాతి విగ్రహాన్ని కూల్చివేశారు. ఆలయ ప్రాంగణంలోని శివలింగం కింద ఉండే పాణపట్టాన్ని పూర్తిగా కూల్చేసి భూమిలో మూడు అడుగుల లోతులో గొయ్యి తీశారు. స్వామివారి ఎదురుగా ఉండే నందీశ్వరుని రాతి విగ్రహాన్ని దిమ్మెపై నుంచి కింద పడేసి, ఆ ప్రదేశంలో లోతైన గొయ్యి తీసి నిధుల కోసం అన్వేషించిన ఆనవాళ్లు కనిపించాయి. దేవాలయ పరిసరాల్లో అక్కడక్కడే గుప్త నిధుల కోసం పరిశీలించిన దాఖలాలున్నాయి. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఒకే సారి 101 శివాలయాలను నిర్మించి అందులో ఒకే సమయంలో 101 శివలింగాలను ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. వాటిలో రామలింగేశ్వరస్వామి ఆలయం ఒకటిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహాల ప్రతిష్టా సమయంలో విగ్రహాల కింద బంగారు నిధులు భూస్థాపితం చేసినట్లు వదంతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలో కూడా పలు మార్లు ఇదే దేవాలయంలో తవ్వకాలు జరగడంతో దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుని ఆవరణ చుట్టా ఇనుప తీగతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అనుమతులు లేకుండా ఆలయ ప్రాంగణంలోకి వెళ్లడం గానీ, పరిసరాల్లో సంచరించడంగానీ నేరంగా అక్కడక్కడా బోర్డులు ఉంచారు. ఇది జరిగి సుమారు 15 సంవత్సరాల పైనే అయింది. తిరిగి ఇన్నేళ్లకు అక్రమార్కుల కళ్లు ఆలయంపై పడటం, ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే దేవతల విగ్రహాలను కూల్చడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు అచ్చంపేట ఎస్.ఐ పి.పట్టాభిరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
కొత్తదారుల్లో కేటుగాళ్లు!
సాక్షి, తుళ్లూరు: వైష్ణవికి ఓ కొత్త నంబరు నుంచి ఫోన్ వచ్చింది. ‘వైష్ణవి గారు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.30 వేలు షాపింగ్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ అవతలి వ్యక్తి చెప్పడంతో షాక్కు గురైంది. తాను ఎలాంటి షాపింగ్ చేయలేదని ఆమె అనడంతో చెక్ చేస్తానంటూ సదరు వ్యక్తి క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పిన్ నంబర్లు అడిగాడు. అసలే కంగారులో ఉండడం, ఫోన్ చేసిన అపరిచితుడు పేరుతో సంబోధించడంతో ఆమె వివరాలు చెప్పేసింది. ‘సారీ.. ఆ షాపింగ్ మీ క్రెడిట్ కార్డు నుంచి జరగలేదు’ అంటూ అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. సీన్ కట్ చేస్తే.. ఆ వివరాలు వినియోగించి ‘ఫోన్ కాలర్’ ఆన్లైన్ ద్వారా రూ.50 వేలు వైష్ణవి ఖాతా నుంచి మాయం చేశాడు. ఇది వైష్ణవి ఒక్కరి సమస్యేకాదు. సైబర్ నేరగాళ్లు వల విసురుతూ అందులో చిక్కుకున్న వారి ఖాతాలను లూటీ చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు స్మార్ట్ఫోన్లు వినియోగించేవారికి కొన్ని సూచనలు చేశాయి. ఫోన్లలో మనం వాడే 42 యాప్లు దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని గుర్తించాయి. సైబర్ నేరగాళ్లు ఉచితమంటూ ప్రచారం చేసే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోగానే ఆయా మొబైల్ యాజమానుల వ్యక్తిగత రహస్యాలను గుప్పిటపట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో 4.2 కోట్ల మొబైల్ యాప్లు ఉన్నాయని, ఇందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సురక్షితమని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితమైన సైబర్ నేరాలు ఇప్పుడి గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. మాటలతో మభ్యపెడుతూ.. ఈ మధ్య కాలంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి స్త్రీల గొంతుతో అష్టలక్ష్మి యంత్రమని, ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాలు పేరుతో రకరకాలుగా ఫోన్కాల్స్ పెరిగిపోయాయి. వారు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెబుతారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినవారే అని నమ్మేసి వారి వలలో పడిన తరువాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందిన కాడికి దోచుకుంటారు. ఎప్పటికప్పుడు ఏటీఎం పిన్ మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. చాలా మంది తమ పిన్ నంబర్ను మర్చిపోతారేమోననే ఉద్దేశంతో పిన్ నంబర్ రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్వర్డ్ని భద్రంగా దాచుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే సరి.. క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. ప్రతి కార్డుకు వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ నంబర్ ఉంటుంది. దీనిని గుర్తుంచుకుని కార్డుపై చెరిపేయాలి. క్రెడిట్ కార్డులను చాలాకాలం వినియోగించకుండా ఉంటే బ్యాంకు అధికారులకు తెలియజేసి తాత్కాలికంగా మూసివేయాలి. ఆన్లైన్ ద్వారా వ్యవహారాలు సాగించేటట్లయితే సైట్ అడ్రస్ జీటీటీపీతో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి. కార్డులను పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించాలి. మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగినప్పుడు ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మీకు వచ్చేలా చేసుకోండి. ఎగ్జిబిషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్లో గిఫ్ట్కూపన్లు, లక్కీడిప్స్, ఓచర్స్కు సంబంధించిన కాగితాల్లో సెల్ఫోన్ నంబర్ ఈ–మెయిల్ ఐడీలు గుడ్డిగా రాయకూడదు. స్మిషింగ్ వైరస్ స్మార్ట్ఫోన్ల ప్లాట్ ఫాంను ఆధారంగా చేసుకుని ఇటీవల స్మిషింగ్ వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని చెబుతూ.. అదనపు సదుపాయాలు కావాలంటే ఎస్ అని, వద్దనుకుంటే నో అని టైప్ చేసి పంపాలని అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ సెల్ఫోన్లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాకింగ్, క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. సాధారణంగా ‘5000’ వంటి నంబర్లతో వారి ఫేక్ మెయిల్ ఐడీ నుంచి జనరేట్ చేసి ఓ లింక్ని కూడా పంపుతారు. లింక్ ఓపెన్ చేయకుండా ఉండడమే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఉత్తమమైన మార్గం. -
లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య
సాక్షి, గుంటూరు(మాడుగుల) : లైంగిక వేధింపులు తాళలేక వివాహిత మహిళ గనిపల్లి మరియకుమారి (24) మంగళవారం అర్ధ రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాడుగుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి అన్నారావు తన అక్క కూతురైన మరియకుమారిని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. బడ్డీకొట్టు నడుపుతూ, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గనిపల్లి దిలీప్లెవి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నేళ్లుగా దిలీప్లెవి తన సెల్ ఫోన్ను పిల్లలతో మరియకుమారి వద్దకు పంపించి ఆమెతో మాట్లాడాలంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లినా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దిలీప్లెవి గతంలో రెండు మొబైల్స్ను పంపించగా మరియకుమారి భర్త అన్నారావు తీసుకొని గొడవపడ్డారు. మంగళవారం సాయంత్రం మరో మొబైల్ఫోన్ పిల్లలతో పంపించగా గమనించిన భర్త తీసుకొని ఆమె తల్లి, తమ్ముడికి విషయం తెలిపాడు. తమ్ముడు దారివేముల సునీల్ అక్కను మందలించగా తనకు ఏ పాపం తెలియదని, దిలీప్లెవి తనను చాలా కాలంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. అనంతరం మనస్తాపానికి గురైన మరియకుమారి అర్ధరాత్రి సమయంలో భర్త నిద్రపోతుండగా ఇంట్లో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నిద్రలేచిన భర్తకు భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలికి తొమ్మిదేళ్ల మానసిక దివ్యాంగుడైన కుమారుడు అశోక్, పదేళ్ల ప్రమీళ, మూడేళ్ల లతిక, 14 నెలల రుషి ఉన్నారు. అమ్మా...లే అంటూ పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కాం!
సాక్షి, గుంటూరు: బాపట్ల ప్రభుత్వాసుపత్రిలో భారీ స్కామ్ బయటపడింది. దాదాపు రూ. 52 లక్షల నిధులను ఆసుపత్రి సూపరింటెండ్ ఆశీర్వాదం స్వాహా చేసినట్టు ఆడిట్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆశీర్వాదంతో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో ఈ ముగ్గురిపై ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్ కేసు పెట్టారు. కాగా, ఆశీర్వాదం ఇటీవలే బదిలీపై వైజాగ్కు వెళ్లినట్టు తెలుస్తోంది. -
ప్రేమ పెళ్లి: అనుమానంతో అతి కిరాతకంగా..
సాక్షి, గుంటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. నిండు నూరేళ్లు తోడుగా ఉంటానన్నాడు.. మూడు ముళ్లు కట్టి.. ఏడడుగులు వేసిన బంధాన్ని కాటికి పంపాడు.. భార్యను అతి కిరాతకంగా హతమార్చిన కేసులో భర్తకు జీవిత ఖైదు (బతికున్నంత కాలం) శిక్షను విధిస్తూ... ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా కాళిదాసు కథనం మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన మహంకాళి నాగమల్లేశ్వరరావు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మను (25) ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగమల్లేశ్వరరావు భవన నిర్మాణ కార్మికుడిగా ఉండగా వెంకటేశ్వరమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుండేది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహం అనంతరం కొద్ది కాలంగా వెంకటేశ్వరమ్మపై భర్త నాగమల్లేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. భార్యను చీటికి, మాటికి కొడుతూ ఉండటంతో వెంకటేశ్వరమ్మ తల్లి వెంకాయమ్మ పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యత చేసింది. దీంతో భార్యాభర్తలు మార్టూరు వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడకు వెళ్లినప్పటికీ నాగమల్లేశ్వరరావు ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో వెంకటేశ్వరమ్మ తన ఇద్దరు పిల్లలతో మంగళగిరిలోని గండాలయ్యపేటలో నివాసం ఉంటూ ఇంటి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంది. 2013 ఆగస్టు 24న ఆమె నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చిన నాగమల్లేశ్వరరావు భార్యతో ఘర్షణకు దిగడంతో చుట్టుపక్కలవారు, ఇంటి యజమాని మందలించి పంపించారు. మరుసటి రోజు 25వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో వెంకటేశ్వరమ్మ గదిలో నుంచి బయటకు వచ్చి తన కుమార్తెను బాత్రూముకు తీసుకెళుతున్న క్రమంలో తనతోపాటు కత్తి తెచ్చుకున్న నాగమల్లేశ్వరరావు వెంకటేశ్వరమ్మను విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న అన్న, తల్లి, ఇంటి యజమాని బయటకు వచ్చే సమయంలో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో వెంకటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్యపై మృతురాలి సోదరుడు సాంబయ్య మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ ఆర్.సురేష్బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో, కోర్టు మాని టరింగ్ సెల్ ఏఎస్సై గాజుల శివప్రసాద్, టౌన్ పోలీసు స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ పాలపర్తి నరేంద్ర చొరవ చూపారు. కోర్టులో నాగమల్లేశ్వరరావుపై కేసు రుజువు కావడంతో న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ నిందితుడికి జీవించి ఉన్నంతకాలం జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
రౌడీషీటర్ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సంచలనం రేకెత్తించిన కాంగ్రెస్ నేత, రౌడీషీటర్ కారసాని శ్రీనివాసరావు హత్య కేసులో ప్రధాన నిందితులైన నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలకు జీవిత ఖైదుతోపాటు, రూ. 4 వేల జరిమానా విధిస్తూ గురువారం గుంటూరులోని ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ సంచలన తీర్పు ఇచ్చారు. మిగిలిన నిందితులను నిర్దోషులుగా వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామానికి చెందిన కారసాని శ్రీనివాసరావు తండ్రి వెంకటరత్నం నాయుడు గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన యేటిగడ్డ హనిమిరెడ్డి అనుచరుల చేతిలో 1990లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో హనిమిరెడ్డి అనుచరుడుగా ఉన్న నల్లపాటి అంకమ్మరావు ప్రధాన నిందితుడు. తన తండ్రిని హత మార్చారని పగపెంచుకున్న వెంకటరత్నం కుమారుడు కారసాని శ్రీనివాసరావు పథకం ప్రకారం గుంటూరులోని హరిహరమహల్ థియేటర్ సమీపంలో 1992లో హనిమిరెడ్డిని హత్య చేశాడు. మరో మూడేళ్ళ తరువాత నల్లపాటి అంకమ్మరావును కూడా కారసాని వర్గీయులు ఇమాంవలీతో పాటు మరో ఆరుగురు కలిసి హత్య చేశారు. దీంతో అంకమ్మరావు సోదరుడు నల్లపాటి శివయ్య కారసాని శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు. తన సోదరుడు అంకమ్మరావును దారుణంగా హతమార్చాడని, ఎలాగైనా కారసాని శ్రీనివాసరావును కూడా హతమార్చాలని పథకం రచించాడు. ముందుగా శ్రీనివాసరావుతో పాటు తన సోదరుడిని హతమార్చిన ఇద్దరు నిందితులను 2000 సంవత్సరంలో హతమార్చాడు. ఈ కేసులో శివయ్యకు జీవిత ఖైదు విధించగా, శిక్ష అనుభవించి 2007 అక్టోబరు 1న సెంట్రల్ జైలు నుంచి విడుదలై గుంటూరు చేరుకున్నాడు. అప్పటికే కారసాని కాంగ్రెస్ నేతగా పలు పదవులు నిర్వహిస్తున్నారు. పెదపలకలూరు, గుంటూరులోని కొరిటెపాడు కేంద్రాలుగా చేసుకుని తన అనుచరులతో కలిసి కార్యకలాపాలు సాగిస్తుండేవాడు. అతనిపై అప్పటికే 40 కేసులు నమోదు కావడంతోపాటు అరండల్పేట పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. పక్కా ప్రణాళికతో హత్య... తన సోదరుడు హత్యకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నల్లపాటి జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చి వర్గాన్నికూడకట్టే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో హత్యకు రూపకల్పన చేసి పలుమార్లు కారసాని సంచరిస్తున్న ప్రాంతాలు, వెళ్తున్న ఊర్లు వివరాలును ఆరా తీశారు. గుంటూరు నుంచి ఆయా ప్రాంతాలకు వెళుతున్న క్రమంలో కూడా కారసానిని హతమార్చేందుకు రూరల్ ప్రాంతాలకు వెళిన సందర్భాలున్నాయి. అయితే కారసాని పక్కన అనుచరులు, ప్రజలు అధికంగా ఉండటంతో ప్లాన్ విఫలమైంది. ఎలాగైనా కారసానిని హతమార్చాలని శివయ్య గుంటూరు నగరంలోనే ప్లాన్ మార్చారు. అనుచరులతో పాటు బాంబులు, కత్తులు, వేట కొడవళ్లను సిద్ధం చేసుకుని శ్రీనివాసరావు కదలికలపై అనుచరులతో రెక్కీ ప్రారంభించాడు. సుమారు రెండు నెలల రెక్కీ అనంతరం 2008 మార్చి 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిసెంటర్లో ఉన్నాడని తెలియడంతో తోటి అనుచరులైన కత్తి బ్రహ్మారెడ్డి, కలుగూరి నాగరాజు, దోమల చిన యాకోబులతో కలిసి బయల్దేరాడు. శ్రీనివాసరావు లీలామహాల్ సెంటర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉండగా, తన పక్కన ఉన్న వారితో కలిసి కారసాని టీ తాగేందుకు పక్కనే ఉన్న అమన్ టీస్టాల్ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావు కోసం కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు బాంబులు విసిరి వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరకడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. శివయ్య, బ్రహ్మారెడ్డిలతోపాటు, మరో 11 మందిని నిందితులుగా చూపుతూ అప్పటి కొత్తపేట సీఐ, ప్రస్తుతం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కర్రెడ్డి అప్పట్లో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొంత మేర జరిగిన తరువాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించాలని మృతుడి బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడంతో కేసు విచారణ నిలిచిపోయింది. ఆరో అదనపు కోర్టు ఏపీపీగా నియమితులైన కట్టా కాళిదాసును నియమించడంతో మృతుడి బంధువులు స్పెషల్ పీపీ డిమాండ్ను విరమించుకున్నారు. ఏపీపీ ప్రాసిక్యూషన్ తరుపున సాక్షులను ప్రవేశపెట్టి ప్రాసిక్యూషన్ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలను దోషులుగా తేలడంతో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
'బ్లాక్' బిజినెస్!
సాక్షి, గుంటూరు: లాలాపేటకు చెందిన శ్రీనివాస్ పోస్టులో వచ్చిన గిఫ్ట్ స్క్రాచ్ కార్డు నిజమని నమ్మి బ్యాంకు అకౌంట్లో రూ.40 వేలు వేసి మోసపోయాడు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి మిత్రులను సంప్రదిస్తే ఫలితం సున్నా అని తెలుసుకుని ఫిర్యాదు చేయడం మానుకున్నాడు. ఇలా ఎందరో సైబర్ నేరగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. బ్లాక్ బిజినెస్ ఈ పేరు సామాన్య ప్రజలకు కొత్తేమో కాని పోలీసులకు సుపరిచితమే. బ్లాక్ టికెట్..బ్లాక్ మార్కెట్...బ్లాక్ మనీ.. తరహాలోనే సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి సంపాదించిన ధనాన్ని బ్లాక్ బిజినెస్ రూపంలో వెనుకేసుకుంటున్నారు. దీనితో సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కష్టగా మారింది. ఒకవేళ సైబర్ నేరగాళ్లు దొరికినా నేరస్తులు చేస్తున్న బ్లాక్ బిజినెస్ కారణంగా పోలీసులకు వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేయడం కష్టమవుతుంది. ఫలితంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వివిధ మార్గాలలో వివరాల సేకరణ దేశంలో స్థిరపడిన నల్లజాతీయులు బ్లాక్ బిజినెస్కు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లలో అత్యధికులు ఆఫ్రికా దేశానికి చెందినవారే ఉంటున్నారు. వీరు ఆన్లైన్ మోసాలను ఈ–మెయిల్ మీద ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజ్, ఫోన్ కాల్తో ప్రారంభిస్తారు. మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు అనేక మార్గాల ద్వారా సేకరిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా లక్ష ఫోన్ నెంబర్లు ఈ మెయిల్ ద్వారా రూ. 30 వేలకు విక్రయించే వెబ్సైట్లు ఉన్నట్లు సమాచారం. వీటి ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా పక్కా పథకం వేస్తున్నారు. ఖాతాలకు బదులు వాలెట్ల వినియోగం ఈ నైజీరియన్లు స్కీమ్లు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. ఒకప్పుడు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయించుకునే వీళ్లు ఇటీవల కాలంలో వివిధ రకాలైన వాలెట్లను వాడుతున్నారు. వీటిని నైజీరియన్లు నేరుగా తెరిస్తే కేసు నమోదైనప్పుడు పోలీసులకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాలోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలు, వాలెట్లు తెరిచి, వారి వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీల్లో కమీషన్ ఇస్తారు. ఈ రకంగా కమీషన్ తీసుకుని తమ ఖాతాలు, వ్యాలెట్లను అప్పగించే వారిని సాంకేతిక పరిభాషలో మనీమ్యూల్స్ అంటారు. ఇలా చేయడం ద్వారా ఖాతాలు, వ్యాలెట్లు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య...ఏజెంట్లకు, నైజీరియన్లకు మధ్య ఏలాంటి లింకు లేకపోవడంతో సూత్రధారులు దొరకడం కష్టమవుతుంది. వస్త్రాలు.. వస్తువులు సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియా తదితర ఆఫ్రికా దేశాలకు పంపడం ఇబ్బదికరం. అలాగని ఇక్కడే ఏ రూపంలో ఉంచిన పోలీసులు వీరు చిక్కినప్పుడు ఆ మొత్తాన్ని, వస్తువులను రికవరీ చేస్తారు. దీంతో మోసగాళ్లు బాధితుల నుంచి స్వాహా చేసిన సొమ్మును వస్తు, వస్త్ర రూపంలోకి మార్చేస్తున్నారు. వీటిని ఎగుమతుల పేరుతో తమ దేశానికి తరలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరిని బిజినెస్ వీసాపై భారత్కు తీసుకువస్తారు. బాధితుల నుంచి కాజేసిన దాంట్లో కొంత సొమ్ము సైబర్ నేరగాళ్లు తమ వద్ద ఉంచుకుని, మిగిలినదాంతో హోల్సేల్గా వస్త్రాలు, ఎగుమతికి ఇబ్బంది లేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్సైన్మెంట్ రూపంలో ఆయా ఆఫ్రికా దేశాలకు పంపిస్తున్నారు. ఆ దేశాలలో వస్త్రాలు, వస్తువులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరాలలో నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రజలు అప్పమత్తంగా ఉండటం తప్ప మరొక మార్గం లేదు. అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టంగా మారింది. మోసపోయిన వారు 24 గంటల్లో ఫిర్యాదు చేస్తే కొంత వరకు ఉపయోగం. నగదు ఆన్లైన్లో బదిలీ చేసినా, వ్యాలెట్లలోకి ట్రాన్స్ఫర్ చేసినా అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. నేరగాళ్లు ఏటీఎం ద్వారా నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకే సారి విత్ర్డ్రా చేయలేరు. వెంటనే బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్డ్రా కాకుండా ఆపి రికవరీ చేయవచ్చు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలి. –నజీముద్దీన్, ఈస్ట్ డీఎస్పీ -
ఆమెతో వివాహేతర సంబంధం కోసం ఇద్దరి ఘర్షణ!
సాక్షి, చిలకలూరిపేట: వివాహిత మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకొన్న ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. మండలంలోని మురికిపూడి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ భర్తను వదలి ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ఆ మహిళతో ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాబావలి (29) మురికిపూడిలో బిస్మిల్లా చికెన్ సెంటర్ పేరుతో మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం ఇదే మహిళతో బాబావలికి కూడా పరిచయం ఏర్పడింది. ఇతనితో కూడా ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై బాబావలికి, వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తికి తెలిసి గత కొద్ది రోజులుగా ఘర్షణ పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల కిందట ఇద్దరూ మద్యం తాగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాబావలిని అడ్డు తొలగించుకోవాలని వేమవరం గ్రామానికి చెందిన వ్యక్తి నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం మంగళవారం రాత్రి జాతీయ రహదారి సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో బాబావలితో కలిసి అతిగా మద్యం తాగారు. బాబావలి స్వగ్రామమైన పోలూరుకు వెళ్లకుండా మురికిపూడిలోని మాంసం దుకాణానికి చేరుకుని షట్టర్ వేసుకుని నిద్రించాడు. అదే సమయంలో వేమవరం యువకుడు మహిళ ఇంటికి వెళ్లి బాబావలితో సంబంధం వదులుకోవాలని హెచ్చరించాడు. తన మాట వినని పక్షంలో బాబావలిని హత్యచేస్తానని మహిళను బెదిరించాడు. అనంతరం మద్యం మత్తులోనే చికిన్ దుకాణానికి చేరుకొని షట్టర్ పైకి లాగి మద్యం మత్తులో నిద్రిస్తున్న బాబావలిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి దారుణంగా హత్య చేశాడు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలు గడిచినా దుకాణం తీయలేదని బాబావలి బంధువులు షట్టర్ తీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ జి.అనీల్కుమార్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రేమ పేరుతో వంచించాడు..
సాక్షి, గుంటూరు: ‘హాయ్ అంటూ ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. మొదట స్నేహంగా.. ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ముందే పెళ్లయిందని తెలిసి నిలదీస్తే కుటుంబ సభ్యులతో కలసి నాపై దాడి చేశారు’ అంటూ కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ఓ వివాహిత సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఏఎస్పీ ఎస్.వరదరాజుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పిడుగురాళ్లకు చెందిన రావిపాటి వీరయ్య అలియాస్ వినయ్ ఫేస్బుక్లో ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆపై ఆమెతో స్నేహంగా ఉంటూ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఓ రోజు హడావుడిగా ఆమెను తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. భర్త మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న వినయ్ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వినయ్కు ముందుగా వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని తెలుసుకుంది. నమ్మించి తనను మోసం చేశావంటూ దీనిపై వినయ్ను నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్న క్రమంలో అత్తమామలు కల్పించుకొని వివాహితపై దాడికి యత్నించారు. జరిగిన మోసాన్ని గుర్తించిన వివాహిత నేరుగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోకపోవడంతో న్యాయం చేయాలని బాధితురాలు ఏఎస్పీని వేడుకుంది. -
మత్తులో కత్తులతో వీరంగం!
సాక్షి, తాడేపల్లి(మంగళగిరి): పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో స్థానికేతరులు కొంతమంది మద్యంతో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలు తీసుకుని, స్థానికంగా నివసించే మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు. స్థానికులు శనివారం రాత్రి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తులు చూపించి పరారయ్యారు. ఎవరిదారిన వారు వెళ్లిన అనంతరం తిరిగి మరలా ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి వచ్చి కొంతమందిని నిద్రలేపి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదట యువకులు కత్తులు తీసుకొని నులకపేట వీధుల్లో వీరంగం వేయడంతో, స్థానికులు అడ్డుకున్నారు. వారు వేసుకొచ్చిన ద్విచక్రవాహనాన్ని, ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టిన ఆటోను అక్కడ నుంచి తీసుకెళ్లారు. తిరిగి మరలా అదే వాహనంలో వచ్చి స్థానికంగా నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో, తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మత్తులో ఉండి ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా అక్కడే వదిలివెళ్లారు. ఆ వాహనాన్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనానికి లైట్లు, వెనుక ముందు నంబరు ప్లేటు లేకపోవడం మరో ఎత్తు. ఈ వాహనంతో రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ మసీదు దగ్గర ఉన్న ఉర్దూ పాఠశాలలో కూర్చుని గంజాయి తాగి, వచ్చిపోయే ఆడవారిని, విద్యార్థినులను ఏడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే యువకులు మసీదులో ప్రార్థన జరుగుతున్నప్పుడు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్ తీసేసి, హడావుడి చేయడంతో, ముస్లిం పెద్దలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పట్లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరిచారు. మరలా బయటకు వచ్చిన తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న యువకులు మరలా అదే తరహాలో రోడ్లమీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మత్తులో గొడవ పడిన నలుగురు యువకులు పరారీలో ఉండటంతో వారి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఒంటరి మహిలళే వారి టార్గెట్!
సాక్షి, గుంటూరు: ఒంటరిగా రోడ్డుపై నిలిచి ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశాలకు తీసుకెళ్లి దోపిడీ, లైంగికదాడికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు, అతడికి సహకరించిన మరో ముగ్గురు ముఠా సభ్యులను కూడా గుంటూరు అర్బన్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏఎస్పీ ఎస్.రాఘవ విలేకరులకు వివరాలు వెల్లడించారు. సత్తెనపల్లికి చెందిన పల్లపు రమేష్, అతడి భార్య దుర్గ, స్నేహితులు తన్నీరు గోపి, నూర్బాషా ఖాశింలు ముఠాగా ఏర్పడ్డారు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. అందుకు ఆటోను ఎంచుకుని డ్రైవర్గా రమేష్, మిగిలిన ముగ్గురు ప్రయాణికుల్లా రోడ్డుపై వెళుతున్న ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి ఆటోలో ఎక్కించుకునేవారు. ఈ నెల 2వ తేదీన అమరావతి మండలం 14వ మైలుకు చెందిన ఓ మహిళ నిడుముక్కల గ్రామానికి వెళ్లేందుకు వేచి చూస్తున్న సమయంలో ఆటో ఎక్కించుకుని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, బంగారం చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, గురువారం నలుగురు నిందితులు గుంటూరులోని పూలమార్కెట్ సెంటర్లో బంగారం విక్రయించేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు పల్లపు రమేష్పై సత్తెనపల్లి, తెనాలి, గుంటూరు అర్బన్ పరిధిలోని నల్లపాడు పోలీసు స్టేషన్లో మొత్తం 12 కేసులు నమోదయ్యాయని ఏఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకోవాడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీలక్ష్మి, సీఐలు శేషగిరిరావు, మల్లికార్జునరావు, వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మోసం: వయస్సు తప్పుగా చెప్పి పెళ్లి!
సాక్షి, తెనాలి: వయస్సు తప్పుగా చెప్పి మోసం చేసి ఓ యువకుడు తనను వివాహం చేసుకున్నాడని సఫియా అనే యువతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెనాలిలోని ఇస్లాంపేటకు చెందిన సఫియాకు తన స్నేహితుల ద్వారా గురజాలకు చెందిన షేక మహమ్మద్ హసన్ పరిచయమయ్యాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లు. ఈ నేపథ్యంలో గత డిసెంబరులో వివాహం చేసుకున్నారు. మహమ్మద్ హసన్ తనను పెళ్లి చేసుకునే సందర్భంలో అతని వయసు 22గా చెప్పాడని, అయితే వయసు 19గా తెలిసిందని సఫియా తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్టౌన్ ఎస్ఐ టి. అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. సఫియా, ఆమె కుటుంబసభ్యులు తనను మోసం చేసి, మభ్య పెట్టి వివాహం జరిపించారంటూ మహ్మద్ హసన్ గతంలోనే గురజాల పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అక్కడ ఇప్పటికే కేసు కేసు నమోదైంది. -
ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. పట్టాభీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతికి చెందిన బొమ్మనబోయిన ఇంద్రాణి ప్రస్తుతం విద్యానగర్లో నివాసం ఉంటున్నారు. భర్త నాగేంద్రనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఆమె గృహిణిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పీజీ చదివి ఖాళీగా ఉంటున్న ఆమెకు వరుసకు మామయ్య అయిన తెల్లగడ్డల సత్యనారాయణ తనకు పరిచయం ఉన్న సెంట్రల్ ఇంటిలిజెన్స్లో డీఎస్పీగా పనిచేస్తున్న కొరడా నాగశ్రీనివాసరావు ద్వారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రూప్–2 కేడర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ. 15 లక్షలు ఒకసారి, పలుమార్లు ఖర్చుల నిమిత్తం రూ. 8 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్న క్రమంలో డీఎస్పీ నాగశ్రీనివాసరావు ఇటువంటి పనులు చేస్తుంటాడని, డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటాడని సమాచారం తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు తన భర్తకు పరిచయం ఉన్న పాలకొల్లు రాజేశ్వరరావుకు తక్కువ వడ్డీకు డబ్బులు ఇప్పిస్తామని నమ్మబలికి పర్సంటేజీ కింద రూ. 9 లక్షలు, ఖర్చుల నిమిత్తం రూ. 14వేలు తీసుకున్నారని ఆరోపించారు. అతనికి సంబంధించి చెక్కులు కూడా ఇచ్చారని, అయితే అవి చెల్లకపోగా, ఉద్యోగం, రుణం కూడా రాలేదని, తమను మోసం చేసిన డీఎస్పీ నాగశ్రీనివాసరావుతో పాటు, తెల్లగడ్డల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నీళ్లనుకుని లైజాల్ తాగి...
సాక్షి, తెనాలి: నీళ్లనుకుని లైజాల్ (యాసిడ్) తాగి మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన జంపాని అక్కమ్మ (50) పదేళ్ల కిందట భర్త చనిపోవడంతో, తెనాలి మండలం అంగలకుదురులోని చెల్లి వెంకటేశ్వరమ్మ వద్ద ఉంటోంది. మానసిక రుగ్మతతో బాధపడే ఆమె ఇళ్లలో పనులకు వెళ్తుంటుంది. ఒంట్లో నలతగా ఉండడంతో రెండు రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. తాగునీరనుకుని ఫ్లోర్ను కడిగేందుకు వాడే లైజాల్ను తాగింది. వాంతులు చేసుకుంటుండడంతో కుటుంబసభ్యులు గమనించారు. తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..
సాక్షి, యనమదల (ప్రత్తిపాడు): సర్వే అంటూ ఇంటి తలుపుతట్టాడు.. బీమా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు.. ముఖంపై పౌడర్ చల్లి బంగారు నగలతో ఉడాయించాడు.. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళితే.. యనమదల గ్రామానికి చెందిన గట్టు మల్లేశ్వరికి ముగ్గురు సంతా నం. అందరికీ వివాహాలు చేసింది, నాలుగేళ్ల కిందట భర్త చనిపోవడంతో యనమదలలో ఒంటరిగా నివసిస్తోంది. బుధవారం ఉదయం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పిలిచాడు. మీకు పింఛన్ వస్తుందా? రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయా? పొలం ఎంత ఉంది? ఆదాయమెంత? అంటూ మాటలు కలిపాడు. మీకు భర్త లేడు కదా..మీకు ఇన్సూరెన్స్ డబ్బులు రూ.16 లక్షలు వస్తాయి, ముందస్తుగా డిపాజిట్గా రూ.లక్షా ఇరవై ఐదు వేలు చెల్లించాలని చెప్పాడు. ఇప్పటికప్పుడు డబ్బులు కట్టలేని పక్షంలో మీ దగ్గర బంగారం ఉంటే ష్యూరిటీ కింద ఇవ్వండి, ఫొటో తీసుకుని మీ బంగారం మీకు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. దీంతో మల్లేశ్వరి ఇంట్లోకి వెళ్లి బీరువాలో నాలుగు సవర్ల చంద్రహారం, గొలుసు తెచ్చి ఆగంతకుడికి ఇచ్చింది. ఫొటోలకని మరో రూ.వెయ్యి కూడా ఇచ్చింది. అంతే ఆగంతకుడు మల్లేశ్వరి ముఖంపై పౌడర్ చల్లాడు. దీంతో ఆమె మగతకు గురైంది. తేరుకుని చూసేలోపలే ఆగంతకుడు బైక్పై పారిపోయాడు. ఆ వ్యక్తి ఆనవాళ్లను బాధితురాలు పోలీసులకు తెలిపింది. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్ ఆత్మహత్య!
సాక్షి, గుంటూరు: చెట్టుకు ఉరి వేసుకుని వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనారాయణ(35), అదే గ్రామానికి చెందిన దివ్య పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. దివ్య ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారు జిల్లా పోలీసులను ఆశ్రయించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్దికాలంగా భార్య దివ్యను పలు మార్లు హింసించడంతోపాటు ఇటీవల లక్ష్మీనారాయణ హత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు రక్షించారు. ఈమేరకు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, తెనాలి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. కేసు కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో బెయిల్పై వచ్చిన లక్ష్మీనారాయణ సోమవారం రాత్రి భార్యతో గొడవ పడినట్టు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా, గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ విషయంపై అమృతలూరు ఎస్ఐ జి. పాపారావు వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదన్నారు. -
బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్కే..
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): ఆర్టీసీ బస్సులో మహిళ చేతివాటం ప్రదర్శించిన ఘటన మంగళవారం జరిగింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో సురేష్బాబు, ఆర్టీసీ బస్ కండక్టర్ కేబీ పరమానందం తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల డిపోకు చెందిన బస్సు మంగళవారం చేబ్రోలు చేరుకుంది. కండక్టర్ పరమానందం పక్కనే ఓ మహిళ నిలబడి ఉంది. చేబ్రోలు నుంచి నారాకోడూరు వరకు వచ్చే లోపల కొన్ని టిక్కెట్లు కొట్టిన ఆయన చిల్లర కోసం నగదు తీసుకుని ప్రయాణికులకు ఇచ్చారు. నారాకోడూరు నుంచి బస్సు బయలుదేరిన తర్వాత మరికొంత మంది ఎక్కటంతో టిక్కెట్లు ఇచ్చి బ్యాగును తెరవటంతో నగదు కనిపించలేదు. ఉలిక్కిపడ్డ కండక్టర్ పరమానందం ప్రయాణికులను నగదు విషయం అడిగారు. ఎవరిలోనూ స్పందనలేదు. అయితే ఒక మహిళ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో కండక్టర్, డ్రైవర్లు నిలదీశారు. ఈ క్రమంలో ఆమె చీరలో నుంచి నగదు కిందపడటాన్ని గమనించి, మహిళ తీసిందని నిర్ధారణకు వచ్చారు. నేరుగా బస్సును స్టేషన్కు తీసుకెళ్లారు. సదరు మహిళను విచారించిన పాతగుంటూరు పీఎస్ ఎస్హెచ్వో సురేష్బాబు, ఆమె పేరు మరియమ్మ అని చెబుతోందని, అయితే అదీ కూడా సరైన పేరు అయి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సదరు మహిళను సీసీఎస్ పోలీసులకు అప్ప గించారు. కేసు చేబ్రోలు పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. సదరు మహిళ నుంచి కండక్టర్ రూ.17,400 స్వాధీనం చేసుకున్నారు. -
భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం..!
సాక్షి, తెనాలి: తాళి కట్టిన భర్త, చావు...చావు...అంటూ నిత్యం భౌతిక హింసకు పాల్పడటం, అడ్డుకోవాల్సిన అత్తమామలు ప్రోత్సహించటంతో మనస్తాపానికి లోనైన మహిళ, అందరి కళ్లెదుటే పురుగుమందు తాగి అత్తింటివారి ఆకాంక్షను నెరవేర్చాలని ప్రయత్నించింది. అయితే కోడలు మరణిస్తే, పోలీసు కేసవుతుందని భయపడినవారు హుటాహుటిని వైద్యశాలకు తరలించటంతో బాధితురాలు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన తనను వరకట్నం కోసం వేధించి, హింసిస్తూ, పురుగుమందు తాగి చావమంటూ పదేపదే రెచ్చగొడుతూ చావుకు దగ్గర దాకా వెళ్లేలా చేసిన భర్త, అత్తమామలను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను వేడుతోంది. స్థానికంగా ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆమె పేరు సునీత. చేబ్రోలు మండలం శేకూరుపాలెం గ్రామం. తండ్రి ఆర్టీసీ డ్రైవరు. తల్లి గృహిణి. ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె సునీతను, మండల కేంద్రమైన దుగ్గిరాలకు చెందిన బండి కిశోర్కు ఇచ్చి 2017 ఆగస్టులో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.4.5 లక్షల నగదు, అల్లుడుకి వాచి, ఉంగరం ఇచ్చారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరులో విద్యుత్ సబ్స్టేషనులో కాంట్రాక్టు పద్ధతిపై ఆపరేటరుగా పనిచేస్తుండే కిశోర్, సునీతల కాపురం తొలి నెలరోజులు సజావుగానే సాగింది. తర్వాత నుంచి వేధింపుల పర్వం ఆరంభమైంది. భార్య అనాకారి అయింది. తెచ్చిన కట్నం కంటికి ఆనలేదు. అందంగా లేవు...కట్నం హీనంగా తెచ్చావ్...ఇంటి సామానులు ఏవీ తేలేదు..అంటూ భర్త సణగటం మొదలుపెట్టాడని సునీత చెప్పారు. ఆ విధంగా సూటిపోటి మాటలతో మొదలైన వేధింపుల్లో భాగంగా, ఫోను వాడొద్దని షరతు పెట్టారు. తల్లిదండ్రులతో సహా పుట్టింటి తరఫు నుంచి ఎవరూ ఇంటికి రాకూడదని ఆంక్షలు విధించారు. తర్వాతర్వాత చీటికిమాటికి కొట్టటం ఆరంభించినట్టు సునీత కంటనీరు పెట్టారు. కారణం ఏమీ ఉండదు...బంధువులు ఎవరైనా వచ్చివెళ్లారన్న సాకు చాలు భర్తకు...వరసగా రెండురోజులు అకారణంగా హింసించటం అలవాటు చేసుకున్నాడని ఆరోపించారు. ఇలా హింసాపర్వ కాపురంలో 8 నెలల కిందట వారికి బాబు కలిగాడు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ, ఇప్పటివరకు అత్తమామలు బాబును ఒక్కసారి కూడా కనీసం దగ్గరకు తీసుకోలేదని సునీత చెప్పారు. తనపై హింసను అడ్డుకోలేదన్నారు. అన్నయ్య వచ్చి వెళ్లాడని.. ఈ నేపథ్యంలో గత నెలలో విశాఖపట్నంలో ఉండే అన్నయ్య వచ్చి చెల్లిని, మేనల్లుడిని పలకరించి వెళ్లాడు. సునీత భర్త కిశోర్కు గత శనివారం ఈ విషయం మరోసారి గుర్తొచ్చింది. ‘మీ అన్న ఎందుకొచ్చాడు? నువ్వెందుకు రానిచ్చావు?’ అంటూ బాదటం మొదలుపెట్టాడట! సమీప గృహాల్లోని ఎవరో? సునీత తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫోనులో తెలియపరిచారు. తల్లడిల్లిపోతూ దుగ్గిరాల వెళ్లిన సునీత తండ్రిని పట్టుకుని ‘మా ఇంటికెందుకు వచ్చారు? నేను రావద్దంటున్నా మీరెందుకు వస్తున్నారు’అని అల్లుడే స్వయంగా గద్దించటంతో, కూతురుని ఓదార్చాలని వచ్చిన ఆ తండ్రి మనసు రాయిచేసుకుని తిరిగివెళ్లిపోయాడు. అది కూడా నేరమైందా ఇంటికి... చావు, చావు అంటూ భర్త మళ్లీ మళ్లీ కొట్టటమే కాకుండా, ఎనిమిది నెలల పసికందును ఎత్తి పడేయటంతో బతుకుపై విరక్తి చెందిన సునీత, ఇంట్లోనే ఉన్న కలుపు నివారణ మందు ‘గ్లైసిల్’ తాగేసింది. ఆ బాధతో యాతన పడుతున్న ఆమెను చూసి ‘యాక్టింగ్’ అని ఎగతాళి చేశారంట! అనుమానించిన మామ, ‘ఆస్పత్రికి తీసుకెళ్లండ్రా...చస్తే కేసవుతుంది...!’ అని హెచ్చరించటంతో తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అక్కడే కోలుకుంటోంది. విచారించటానికి వచ్చిన పోలీసులకు భర్త చేసిన దారుణాలను ఏకరువు పెట్టి, కేసు నమోదుచేసి, న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు చెప్పారు. -
పోలీసునంటూ షాపులో దౌర్జన్యం
సాక్షి, గుంటూరు: సెల్ టెంపర్ గ్లాసు వేయించుకుని, డబ్బులు అడిగిన షాపు యజమానిని ‘నేను పోలీస్’ అంటూ కొట్టి షాపులోని కొన్ని సామాన్లు ఎత్తుకుపోయిన ఓ వ్యక్తిపె బాధితుడు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పంగడిగుంటలో నివసించే వెనిగళ్ల కిరణ్ మహిళా కళాశాల రోడ్డులో సెల్ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మహ్మద్ అబ్దుల్ సిరాజ్ అనే వ్యక్తి షాపునకు వచ్చి సెల్ ఫోన్ పై టెంపర్ గ్లాసు వేయమన్నాడు. గ్లాసు సెల్ఫోన్కు బిగించుకున్న అనంతరం డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాడు. కిరణ్ అతనిని డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు అబ్దుల్ సిరాజ్ తాను కానిస్టేబుల్ను అని చెప్పి డబ్బులు ఇవ్వనన్నాడు. కిరణ్ అదేమిటని ప్రశ్నించడంతో ఇరువురికి గొడవ జరిగింది. కిరణ్పై అబ్దుల్ సిరాజ్ చేయిచేసుకుని షాపులోని సెల్ సామగ్రి కొన్నింటిని తీసి తన బండిలో పెట్టుకుని వాహనం నడుపుకుంటూ వెళ్లి పోయాడు. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న కిరణ్ వెళ్లిపోతున్న అబ్దుల్ సిరాజ్ను వెనుక నుంచి సెల్ఫోన్తో ఫొటో తీశాడు. దీనిపై కిరణ్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిరాజ్ బాగా మద్యం తాగి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మదరసాలో కీచకపర్వం
సాక్షి, దాచేపల్లి: మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై మదరసా నిర్వాహకుడు కన్నేశాడు. బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని చాపలగడ్డ మదరసాలో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకొచ్చింది. విషయం తెలుసుకున్న ముస్లిం మతపెద్దలు, నాయకులు మదరసా వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు, ముస్లిం నేతల కథనం ప్రకారం.. ఆలిం కోర్సు చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బాలికలు మదరసాలో చేరారు. షేక్ ముఫ్తీ అబ్దుల్ సత్తార్ దీనిని పర్యవేక్షిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. మదరసాలోని 17 ఏళ్ల బాలికపై ఆయన కన్నేసి.. కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక, సత్తార్ కలిసి ఉండటాన్ని మిగతా విద్యార్థినులు గమనించి నిలదీశారు. ఈ విషయం ముస్లిం మతపెద్దలు, నాయకుల దృష్టికెళ్లడంతో వారంతా శుక్రవారం మదరసా వద్దకు వచ్చి అబ్దుల్ సత్తార్, అతని కుటుంబ సభ్యులను నిలదీశారు. వారం కిందటే తాను బాలికను వివాహం చేసుకున్నట్లు అబ్దుల్ సత్తార్ చెప్పాడు. మత సంప్రదాయాలకు విరుద్ధంగా, మైనార్టీ కూడా తీరని బాలికను ఎలా వివాహం చేసుకున్నావంటూ వారు నిలదీయటంతో అక్కడ నుంచి ఉడాయించాడు. పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఈ విషయంపై ముస్లిం మతపెద్దలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. మదరసా ఖాళీ చేయాలని డిమాండ్ చేయడంతో అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులను పిలిపించి మదరసా నుంచి పిల్లలను పంపించారు. అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులను బయటకు పంపేలా.. మదరసా నిర్వహణకు సహకారం అందించే ముస్లింలతో పాటు మతపెద్దలు తీర్మానం చేశారు. గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ కోటేశ్వరరావు కూడా మదరసాను సందర్శించి జరిగిన వ్యవహారం గురించి ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అబ్దుల్ సత్తార్ తనను బెదిరించి లైంగిక దాడి చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘కోడెల కాటు’ బాధితులెందరో!
సాక్షి, గుంటూరు: ప్రతి పనికీ ఓ రేటు కట్టి కే–ట్యాక్స్ పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకున్నారు. అధికారం అండతో ఆ కుటుంబం సాగించిన దుర్మార్గాలు, దౌర్జన్యాలను ఎదురించే పరిస్థితి లేక అప్పట్లో వారంతా మిన్నకుండిపోయారు. వారిలో కొందరు ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తాము మోసపోయిన విషయాన్ని ధైర్యంగా చెప్పకోలేని బాధితులు ఇంకా అనేకమంది ఉన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మి చేతిలో దోపిడీకి గురైన పలువురు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ల్యాండ్ కన్వర్షన్ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని కొందరు, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఇంకొందరు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 18 కేసులు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై ఇప్పటివరకూ 18 కేసులు నమోదయ్యాయి. విద్యుత్ సబ్స్టేషన్, రైల్వే, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి సొమ్ములు తీసుకున్నారని నిరుద్యోగులు, తమ పొలాలు, భూములను కబ్జా చేశారని రైతులు, భూ యజమానులు, తమ నుంచి కే–ట్యాక్స్లు వసూలు చేశారని బిల్డర్లు, మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు కోడెల కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు చేశారు. కోడెల కుమారుడి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతివ్వాలంటూ నరసరావుపేటకు చెందిన కేబుల్ ఆపరేటర్ ఎనుగంటి వెంకట కృష్ణారావు పోలీసులను ఆశ్రయించారంటే ఆ కుటుంబం అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి కోడెల కుటుంబం అరాచకాలపై విచారణ జరిపిస్తే మరికొందరు బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో నమోదైన ఓ కేసులో బాధితుడి నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి రాజీ చేసుకోగా.. ఇంకా 17 కేసులు ఆ కుటుంబంపై ఉన్నాయి. -
గొడ్డలితో యువకుడి వీరంగం
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట మీద ఆవారాగా తిరిగే యువకుడు ఓ మహిళను చంపుతానంటూ గొడ్డలి పట్టుకొని శుక్రవారం రాత్రి వీరంగం వేశాడు. ఆమె 100కు డయల్ చేయడంతో, సమాచారం అందుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఘటన స్థలానికి వెళ్లారు. యువకుడు ఆయన పైకి గొడ్డలి విసిరేసి, అనంతరం దాడి చేశాడు. ఘటనపై కానిస్టేబుల్తో పాటు, సదరు మహిళ తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరిజాల సునీత ఎన్టీఆర్ కరకట్ట మీద నివాసం ఉంటోంది. కుటుంబ పోషణ నిమిత్తం దగ్గరలో ఉన్న అక్వేరియం షాపులో పని చేస్తోంది. దాని కింద నాగపోగు దయానందరాజు నివాసం ఉంటున్నాడు. సునీత భార్యకు తన మీద ఏదో చెప్పిందనే వంకతో చంపుతానంటూ గోల గోల చేస్తూ, ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. సునీత అక్కడ నుంచి పారిపోయి బకింగ్ హామ్ కెనాల్ వద్ద ఉన్న ముళ్లపొదల్లో దాక్కొని 100కు డయల్ చేసింది. ఉన్నతాధికారులు తాడేపల్లి పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో అక్కడ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ యం.వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి వెళ్లారు. ద్విచక్ర వాహనం పార్కింగ్ చేస్తుండగానే, దయానంద రాజు చేతిలో ఉన్న గొడ్డలిని ఆయన పైకి విసిరేశాడు. అనంతరం పరిగెత్తుకుంటూ వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్ది రోడ్డు మీద ఉన్న ఓ పైప్తో దాడి చేశాడు. హెడ్ కానిస్టేబుల్పై దాడి చేశాడని తెలియడంతో పోలీస్స్టేషన్ నుంచి ఘటన స్థలానికి నలుగురు పోలీసులు వెళ్లగా, వారిపై కూడా దురుసుగా ప్రయత్నించాడు. తనను కొడితే మిమ్మల్నేం చేయాలో తెలుసంటూ రోడ్డుపై పడుకున్నాడు. కానిస్టేబుల్స్ బలవంతంగా జీపులో ఎక్కించి, పోలీస్స్టేషన్కు తీసుకురాగా, స్టేషన్ దగ్గర సైతం వీరంగం వేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో కూడా దయానందరాజు పక్క ఇంటి వారిపై దాడిచేసి, తండ్రి, కూతుళ్లను రాడ్డుతో తల పగలగొట్టాడు. దయానందరాజు ఎన్టీఆర్ కరకట్ట మీద రెండున్నర సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఆరుగురిపై దాడికి పాల్పడ్డాడు. అయినా ఒక్క కేసే నమోదవ్వడం విశేషం. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య
సాక్షి, కొల్లూరు: ఉరేసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొల్లూరు శివారు గాంధీనగర్లో నివాసం ఉంటున్న కొల్లూరి ఉదయలక్ష్మికి (28) గతంలో వివాహమైంది. భర్తతో విభేదాలు తలెత్తడంతో గాంధీనగర్లో కొల్లూరుకే చెందిన లారీ డ్రైవర్ యార్లగడ్డ నవీన్ కుమార్తో సహజీవనం చేస్తోంది. తాజాగా నవీన్కుమార్తో వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుంది. అదే సమయానికి వచ్చిన నవీన్కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు అక్కడ నుంచి గుంటూరు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వైద్యశాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి మహిళలే అతని టార్గెట్
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని నమ్మకంగా ఆటోలో ఎక్కించుకొని నిర్జన ప్రదేశంలో వారిని దోచుకోవడంతో పాటు అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని రూరల్ జిల్లా సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారు అనే వివరాలను సేకరిస్తున్నారు. నేరాలకు పాల్పడుతుందిలా... సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం గ్రామానికి చెందిన రమేష్ ఆటో డ్రైవర్గా పని చేస్తుంటాడు. మహిళల్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతని భార్య దుర్గ, స్నేహితులు పట్టి ఖాశీం, గోపీలతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. రాత్రిపూట సత్తెనపల్లి నుంచి సమీప గ్రామాలకు వెళ్లేందుకు వేచిఉన్న మహిళల్ని ఎంపిక చేసుకుంటారు. ఆమె వద్ద బంగారం వస్తువులు ఉన్నట్లయితే ఇక ఆటోలో ఎక్కించుకునేందుకు వారి పథకం అమలు చేస్తారు. ఆటోను రమేష్ నడుపుతూ అందులో ప్రయాణికుల మాదిరిగా దుర్గ, ఖాశీంలు ఎక్కి కూర్చుం టారు. నుంచున్న ఆమె చెప్పిన గ్రామానికి తమ ఆటో వెళుతుందని నమ్మించి ఎక్కించుకుంటారు. కొద్ది దూరం వెళ్లాక గోపీ కూడా ఆటు వైపు వెళుతున్నట్లుగా ఆటోలో ఎక్కుతాడు. తర్వాత గ్రామ శివారుకు తీసుకువెళ్లి నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి మూకుమ్మడిగా మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం,డబ్బు దోచుకుంటారు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అమరావతి నుంచి ఆటోలో గుంటూరుకు వస్తున్న నలుగురు నిందితులు ఈనెల 2వ తేదీ రాత్రి 14వ మైలు వద్ద వేచిఉన్న ఓ మహిళను నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. తాడికొండ అడ్డరోడ్డు సమీపంలోని నిర్జన ప్రాంతంలో ఆటోను నిలిపి ఆమె వద్ద ఉన్న 4 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.400 లాక్కొని, రమేష్ దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మహిళ సమీపంలోని ఓ మిల్లు వద్దకు పరుగులు తీయడంతో వారు ఆటోలో పరారయ్యారు. ఈ మేరకు తాడికొండ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో రమేష్ రాజధానిలో ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్బన్, రూరల్ ఎస్పీలు సీరియస్గా పరిగణించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీఎస్ పోలీసులతో కలసి మొత్తం ఏడు ప్రత్యేక బృందాల్ని కేటాయించారు. ఈ క్రమంలో ఈనెల 10న రమేష్, మరో ఇద్దరు యువకులు సత్తెనపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిలో రమేష్ మినహా మిగిలిన ఇద్దరి ప్రమేయం లేదని తేలడంతో వారిని విచారించి వదిలేసినట్లు తెలిసింది. భర్తకు దోపిడీలు, అత్యాచారాల్లో సహకరిస్తున్న దుర్గ, మిగిలిన ఇద్దరు స్నేహితుల కోసం గాలిస్తున్నారు. రమేష్ను పోలీసులు వారిదైన శైలిలో విచారిస్తున్నారు. విచారణలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఇలాంటి నేరాలకు ఎప్పటి నుంచి పాల్పడుతున్నారు ? ఫిర్యాదులు చేసేందుకు ధైర్యం చేయలేని మహిళలను ఎంతమందిని అత్యాచారం చేశారు ? జిల్లాలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు? అనే అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. -
కారు పంక్చర్..చూస్తే రూ.కోటి విలువ గల..
సాక్షి, యడ్లపాడు(గుంటూరు) : కారులో తరలిస్తున్న 242 కిలోల గంజాయి నిల్వల్ని స్థానికుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన యడ్లపాడులో శుక్రవారం జరిగింది. తెల్లవారుజాము సుమారు 5.30 గంటల మధ్యలో కారు టైరు పగలడంతో గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్రిక్స్ తయారీ ప్రాంగణంలో దానిని గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఆ కారును గమనించిన బ్రిక్స్ కంపెనీ కార్మికులు ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీయాలని, తమ ట్రాక్టర్ వస్తుందని చెప్పారు. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ బ్యాగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన కార్మికులు వారిని కొద్దిదూరం వెంబడించారు. బోయపాలెం మెయిన్ సెంటర్వైపు వెళ్లిన ఇద్దరు కనిపించలేదు. దీంతో అనుమానంతో కారులో పరిశీలించగా ప్యాక్ చేసిన గంజాయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. యడ్లపాడు ఎస్ఐ జె.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. గంజాయి నిల్వలు కనిపించడంతో క్రేన్ను తెప్పించి కారును పోలీస్స్టేషన్కు తరలించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, ఎక్సైజ్ సీఐ బి.లత, ఎస్ఐలు ఎస్ఐ జె.శ్రీనివాస్, షరీఫ్ కారులోని గంజాయ్ ప్యాకెట్లను బయటకు తీయించారు. 121 ప్యాకెట్లలో గంజాయి కారులోని వెనుక సీటు, కింద, వెనుక డిక్కీభాగంగా మొత్తం 121 ప్యాకెట్లలో ఉన్న 242 కిలోల గంజాయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కారు రాజమండ్రి నుంచి చైన్నె వైపు వెళ్తోందని పోలీసులు భావిస్తున్నారు. తమ పరిధిలో స్థానికుల ద్వారా పట్టుబడిన కారును మంగళగిరి పోలీసులు వెంబడించారని, అంతేకాకుండా వారు గంజాయి నిల్వలున్న మరోకారుతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీంతో తాము స్టేషన్కు తరలించిన కారు, గంజాయి నిల్వల్ని మంగళగిరి పోలీసులకే అప్పగిస్తున్నామని ఎస్ఐ జె.శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. కారుటైర్ పగలడంతో పట్టుబడ్డారు... గుంటూరు వైపు నుంచి హైవే పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో దారి తప్పించి 16వ నంబర్ జాతీయ రహదారిలోకి ప్రవేశించిన గంజాయి లోడు కారు విశ్వనగర్ నగర్ వద్ద పోలీసుల తనిఖీలను గమనించి సర్వీసురోడ్డులోకి దిగి నేరుగా అదేమార్గంలో వెళ్లకుండా అండర్పాస్ వంతెన కిందగా అవతలి వైపు రోడ్డులోకి వెళ్లారు. బోయపాలెం దాటి వంకాయలపాడు క్వారీ రోడ్డు సమీపంలో సర్వీసు రోడ్డుపై కంకరరాళ్లు ఎక్కువగా ఉండటంతో కారు ముందు టైర్ పగిలింది. కారుటైరుకు పంక్చర్ వేయించుకోవడానికి తిరిగి వంకాయలపాడు అండర్పాస్ వంతెన కిందుగా బోయపాలెం వైపు వెనక్కు తిప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గ్రామం ప్రారంభంలోనే ఉన్న బ్రిక్స్ కంపెనీ లోనికి పోనిచ్చారు. బ్రిక్స్ లోడింగ్కు వచ్చే ట్రాక్టర్లకు అడ్డొస్తుందన్న భావనతో కారును పక్కకు పెట్టాలని కార్మికులు గట్టిగా చెప్పడంతో భయపడ్డ కారులోని వ్యక్తులు తమ బ్యాగుల్ని తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గంజాయి ముఠా హల్చల్ మంగళగిరి : గంజాయి ముఠా దాష్టీకానికి తెగబడింది. విశాఖ మన్యం నుంచి చెన్నైకు శుక్రవారం ఉదయం కారులో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు ముఠాను పట్టుకునేందుకు మండలంలోని కాజ టోల్గేట్ వద్ద మాటు వేశారు. వాహనం టోల్గేట్ వద్దకు రాగా అధికారులు తనిఖీ చేసేందుకు యత్నిస్తుండగా.. డ్రైవర్ వేగంగా వెళ్లి టోల్గేట్ వద్ద అడ్డుగా ఉంచిన ఇనుప కడ్డీని ఢీకొట్టి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుంటూరు, చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యడ్లపాడు వద్ద వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనానికి పైలెట్గా ఉన్న మరో ముఠా కారును కాజ టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితుల్ని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు.. మహిళలపై దాడి
పిడుగురాళ్ల (గురజాల)/రావికమతం (చోడవరం): రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎంత సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం చేçస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన మహిళలపై కత్తులతో దాడికి యత్నించారు. విశాఖ జిల్లా చోడవరంలో ఆరు ఎకరాల్లో జీడితోటలు ధ్వంసం చేశారు. వీటిపై కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల పట్టణ శివారులోని జగ్జీవన్రామ్ కాలనీలో గత ఎనిమిదేళ్ల నుంచి పలువురు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు నివసిస్తున్నారు. ఇదే కాలనీలో ఉండే దొప్పలపూడి సిరి, తాడేపల్లి నాగేశ్వరరావు, చల్లా రామకృష్ణలతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మేము చెప్పిందే జరగాలంటూ దౌర్జన్యాలు చేసేవారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాలనీకి చెందిన మహిళా కార్యకర్తలు కొంగని ప్రశాంతి, దుర్గంపూడి సైదమ్మ, కొమ్మరి ప్రమీల తదితరులు ఒక బృందంగా ఏర్పడి స్థానిక ఎమ్మెలేకాసు మహేష్రెడ్డిని కలసి తమ సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన ఆయన మంచి నీటి కోసం నాలుగు బోర్లు వేయించారు. వందకు పైగా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మరో ప్రధాన సమస్య అయిన రోడ్డును త్వరలో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ కాలనీలో టీడీపీకి చెందిన తాము పెత్తనం చేయాల్సింది పోయి మహిళలైన మీరు పెత్తనం చేయడం ఏమిటంటూ టీడీపీ నాయకులు బుధవారం అర్ధరాత్రి కత్తులతో దాడులు చేసేందుకు పన్నాగం పన్నారు. దీన్ని గమనించిన కొంగని ప్రశాంతి సీఐకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసు వాహనం అక్కడి చేరుకునేలోపు టీడీపీ నాయకులంతా పారిపోయారు. పోలీసులు సమయానికి రాకపోతే తమను కత్తులతో పొడిచి చంపేవారని సీఐకు మహిళలంతా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అల్లరి మూకల పట్ల చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ధైర్యం చెప్పారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ప్రశాంతి తెలిపారు. రాత్రికి రాత్రి జీడి తోట ధ్వంసం విశాఖ జిల్లా చినపాచిల గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన పోలవరపు ఈశ్వరరావు కౌలుకు చేస్తున్న ఆరెకరాల భూమిలో మూడేళ్ల వయస్సుగల జీడి తోటను బుధవారం రాత్రి టీడీపీ నేతలు సమూలంగా పీకి పారేశారు. దీంతో బాధిత రైతు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని టీడీపీ నాయకుడు తన భార్యకు, బంధువులకు ఒంటరి మహిళల కింద పెన్షన్ పొందుతుండటంపై గత నెలలో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అక్కసుతో వైఎస్సార్సీపీ కార్యకర్త సత్యారావుపై గత నెలలో దాడిచేసి గాయపరిచారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ కోమటి శంకర్రావు, నాయుడు పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు అన్నంత పని చేయించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో రైతు ఈశ్వరరావు పేర్కొన్నారు. రాళ్లు రప్పలుతో ఉన్న బీడు భూమిలో రెక్కలు ముక్కలు చేసుకుని జీడితోటను సాగు చేస్తున్నామని, ఇప్పుడు ఒక్క రాత్రిలో ధ్వంసం చేశారని, తమ జీవనాధారం పోయిందని వాపోయారు. -
రెండు నెలల్లో 70 గేదెలు మాయం
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : గేదెలను అపహరిస్తున్న దొంగలను మండలంలోని పుట్లగూడెం గ్రామస్తులు పట్టుకుని బుధవారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు మూడు నెలలుగా మండలంలో గేదెల దొంగతనాలు ఎక్కువయ్యాయి. రాత్రి సమయాలలో ఇళ్ల ముందు కట్టేసిన గేదెలను, పగటి పూట పొలాలు వెళ్లిన గేదెలు, ఆవులను కొంతమంది దొంగలించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుట్లగూడానికి చెందిన సుమారు 15 గేదెలు గత రెండు నెలలకాలంలో మాయమయ్యాయి. రెండు మూడు రోజులుగా గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలన్న తపనతో కాపుకాసి రాత్రి గస్తీ తిరిగారు. మంగళవారం రాత్రి మినీలారీలో 4 గేదేలు తరలించడం చూసిన గ్రామస్తులు వారిని వెంబడించి చల్లగరిగ వద్ద అటకాయించారు. అవి అపహరించబడిన గేదెలుగా గుర్తించి అచ్చంపేట ఎస్ఐకి సమాచారం అందచేశారు. ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో లారీని, గేదెలను, నిందితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు నెలల కాలంలో సుమారు 70కి పైగా గేదెలు అచ్చంపేట పరిసర గ్రామాల్లో చోరీకి గురయ్యాయి. అచ్చంపేట రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మరమెల ప్రసాదరావు, మార్టూరి నరసింహస్వామి, చిట్టేటి జాన్సీ అనే వారు తమ గేదెలు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టాభిరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.