
సాక్షి, కాన్పూర్: సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి కీచకపర్వం కొనసాగించారు. ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోవింద్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇన్స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో టెన్త్క్లాస్ చదివే ఓ విద్యార్థినిని వీరిద్దరూ నిత్యం వేధింపులకు గురిచేసేవారు.
ఈ క్రమంలో ఇటీవల విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీరు ఆమెను అడ్డగించారు. ఆమెను వెంటనే పోలీసు వాహనంలో ఎక్కించుకుని గెస్ట్హౌస్కు తీసుకెళ్లారు. బాధితురాలు తనను ఏం చేయవద్దని ఎంతగా ప్రాధేయపడుతున్నా ఈ కీచకులు పట్టించుకోలేదు. మృగాళ్లుగా మారి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించి, మైనర్ను ఓ చోట వదిలేసి వెళ్లారు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా, కుటుంబసభ్యులు గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా వారిని ఇంటికి పంపించారు.
సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మీడియాలో జరిగిన విషాదం వెలుగుచూడటంతో మథుర ఎస్పీ స్పందించారు ఆయన ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదుచేశారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, ప్రవీణ్ ఉపాధ్యాయ్ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.