
రోడ్డుపై బైఠాయించిన మృతుని బంధువులు ,పి.జయరాం
చిత్తూరు, పాకాల : ఇరుగుపొరుగునున్న దాయాదుల కుటుంబంలోని మహిళలతో ప్రారంభమైన చిన్న తగాదా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పెరుమాళ్లగుడిపల్లికి చెందిన పి.జయరాం(35), ఆయన చిన్నాన్న చెంగల్రాయులు ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి.
నెల కిందట చెత్తపోసే విషయంలో వారిద్దరి భార్యల మధ్య తగాదా నెలకొంది. గ్రామస్తులు సమస్యను పరిష్కరించారు. అయితే ఈ నెల 1న చెంగల్రాయులు, అతని కుటుంబ సభ్యులు జయరాంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు జయరాంకు ఫోన్ చేసి, స్టేషన్కు వచ్చి మాట్లాడాలని ఫోన్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన జయరాం మంగళవారం గ్రామ సమీపంలోని పంటపొలాల్లో విషగుళికలు తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు దామలచెరువు పీహెచ్సీలో ప్రథమచికిత్స చేయించి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9గంటల ప్రాంతంలో జయరాం మృతిచెందాడు.
పోలీస్టేషన్ ఎదుట మృతుని బంధువుల బైఠాయింపు..
జయరాం మృతికి అతని చిన్నాన్న, భార్య వసంత, కుమార్తె గీత, అల్లుడు భూపతి, బంధువులు బ్రహ్మ య్య, పెదక్క కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమేరకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు. అయితే ఎంతసేపటికి పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో మృతుని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహిం చారు. పోలీస్టేషన్ ఎదుట «బైఠాయించారు. దీంతో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఫిర్యాదు స్వీకరించి, దర్యాప్తు చేస్తామన్నారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు మోహన్(14), కుమార్తె మౌనిక(13) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment