Tirupati Crime News
-
20 నిమిషాల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
సాక్షి, తిరుమల: తిరుమలలో కలకలం సృష్టించిన కిడ్నాప్ కేసును పోలీసులు 20 నిమిషాల్లో ఛేదించారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి వచ్చిన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన హనుమంతరావును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దుండగలను పోలీసులు అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ ముని రామయ్య సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లాకు చెందిన హనుమంత రావు అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు తిరుమలలో కిడ్నాప్ చేశారని చెప్పారు. భర్త కిడ్నాప్కు గురి కావడంతో హనుమంతరావు భార్య 100కు డయల్ చేసి సమాచారం అందించారని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రక్షక సిబ్బంది ఇన్నోవా వాహనాన్ని వెంబడించి అలిపిరి వద్ద కిడ్నాపర్స్ను 20 నిమిషాల వ్యవధిలోనే పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక లావాదేవిల కారణంగానే హనుమంత రావును కిడ్నాప్ చేసిన ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులైన కుమార్, సురేష్, మూర్తినలు అదుపులోకి తీసుకుని ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశామన్నారన్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేసిన రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. దుండగుల ఇన్నోవా వాహనాన్ని వేగవంతంగా వెంబడించి కేసును 20 నిమిషాల్లో ఛేదించిన రక్షక టీం కానిస్టేబుల్స్ మణికంఠ, శేఖర్ హోంగార్డు వెంకటేష్లకు ప్రశంస్తూ వారికి ఏఎస్పీ రివార్డు అందజేశారు. -
భార్యతో గొడవపడి ఆత్మహత్య
చిత్తూరు,కాణిపాకం(యాదమరి): ఐరాల మండలం కాణిపాకం పరిధిలోని జంగాలపల్లె గ్రామంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. పాకాలకు చెందిన విజయభాస్కర్(44)కు ఐరాల మండలం జంగాలపల్లెకు చెందిన అమృతతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆయన తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. పాకాలలో కొన్ని రోజులు, తిరుమలలో కొన్ని రోజులు నివాసం ఉన్నారు. ప్రస్తుతం అత్తగారి ఇల్లు అయిన జంగాలపల్లెలో నివాసం ఉంటున్నారు. రోజూ మద్యం తాగి వస్తుండడంతో అమృత భర్తతో గొడవపడేది. ఇదే విషయమై సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తన భర్త రోజూ తాగొచ్చి కొడుతున్నాడని అమృత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం ఇంటికెళ్లే సరికి దూలానికి చీరతో ఉరేసుకుని విజయభాస్కర్ మృతిచెంది ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదం: క్షతగాత్రుల నరకయాతన..
పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు, అటెండెంట్ దుర్మరణం పాలయ్యారు. 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 34 మంది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వారు, విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, జిల్లాకు చెందిన నలుగురు, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ప్రయాణికుడు ఉన్నారు. సాక్షి, చంద్రగిరి/తిరుపతి: మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునే వేళ చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు పీడకలగా మారింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఆర్టీసీ ఓల్వో బస్సు ప్రమాదం తాలూకు క్షతగాత్రుల హాహాకారాలతో కాశిపెంట్ల దద్దరిల్లింది. కృష్ణా జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, సహాయకుడు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలవడం స్థానికులను దిగ్భ్రాంతి కలిగించింది. ఆర్టీసీ రెండవ డ్రైవర్ సత్యనారాయణ దీనికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలారు. అమరావతి నుంచి కుప్పంకు బయల్దేరిన ఏపీ16 జెడ్ 0586 ఓల్వో బస్సును కాశిపెంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఓల్వో స్లీపర్ బస్సు ఢీకొని ముందరి భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అవడం చూస్తే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రమాదం తీవ్రత అద్దం పట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా, దిండి మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప భక్తులతో శబరిమల యాత్ర ముగించుకుని తిరుమలకు వస్తున్న ఈ ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసు అమరావతి నుంచి కుప్పంకు వెళ్తున్న ఆర్టీసీ ఓల్వో బస్సును ఢీకొంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం) తిరుపతిలో డ్యూటీకి ఎక్కిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రమేష్తోపాటు సహాయకుడు ప్రసాద్ తీవ్రగాయాలతో మరణించారు. బస్సు ముందరి భాగం నుజ్జైన ధాటికి తీవ్రగాయాల పాలై, కేబిన్లోనే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణ ఇరుక్కుపోయాడు. ఆర్టీసీ ఓల్వో బస్సులో ఆరుగురు ప్రయాణికులు, ప్రైవేటు బస్సులో 32 మంది అయ్యప్పస్వాముల తలలకు గాయాలవడంతోపాటు కొందరికి చేతులు, కాళ్లు విరిగిపోవడంతో నరకయాతన అనుభవించారు. వారి హాహాకారాలు, ఆర్తనాదా లకు కాశిపెంట్ల వాసులు అక్కడికి పరుగులు తీశారు. క్షతగాత్రులను శ్రమలకోర్చి పోలీసులు స్థానికులు, ఇతర ప్రయాణికుల సహకారంతో వెలికి తీసి తిరుపతికి తరలించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యసేవలు కాశిపెంట్ల ప్రమాద క్షతగాత్రులకు రుయా ఆస్పత్రి అత్యవసర విభాగంలో వైద్యసేవలు హుటాహుటిన అందించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రమణయ్య పర్యవేక్షణలో సీఎంవోలు, విభాగాధిపతులు, రుయా అధికారులు యుద్ధప్రాతిపదికన వైద్యపరీక్షలు చేయడంతోపాటు చికిత్స చేశారు. ఇద్దరి పరిస్థితి విషమం ఆర్టీసీ ఓల్వో బస్సు డ్రైవర్ రమేష్, అటెండెంట్ ప్రసాద్ మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని చెన్నై, హైదరాబాద్, నెల్లూరుకు తరలించారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పళణి చెన్నై ఆస్పత్రికి, ఇదే యూనివర్సిటీలో పీజీ చదువుతున్న ఉషాకిరణ్ను నెల్లూరుకు తరలించారు. రుయాలో 28 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 19 మంది ఆర్థో వార్డు, ముగ్గురు చిన్నపిల్లల ఆస్పత్రి, ఆరుగురు జనరల్ సర్జరీలో వైద్యసేవలు పొందుతున్నారు. తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మీనారాయణ, జయపాల్ పరిస్థితి విషమంగా ఉందని రుయా సూపరింటెండెంట్ తెలిపారు. ఇదలా ఉంచితే, క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.10 వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 2వేల చొప్పున అందజేసినట్లు ఆర్టీసీ ఆర్ఎంవో చంగల్రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మెన్ బండ్ల చంద్రశేఖర్ సొంత డబ్బులతో అల్పాహారం, ఫ్లూయిడ్స్ను అందజేశారు.. నిర్లక్ష్యమే కారణం? తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా, దిండికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసు డ్రైవర్ లక్ష్మీనారాయణ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ఇంత ఘోరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిబంధనల ప్రకారం రోడ్డుకు ఎడమ వైపు వెళ్తుండగా. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తాను నడుపుతున్న వాహనాన్ని రోడ్డులో కుడివైపు వెళ్లి, ఆర్టీసీ ఓల్వోను ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రోడ్డు ఆరు లేన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ తాను వస్తున్న మార్గం ఆరులేన్లదిగా భావించి, కుడివైపు వాహనాన్ని నడిపినట్లు అధికారులు భావిస్తున్నారు. విశ్రాంతి లేకుండా వారం రోజులుగా వాహనాన్ని నడుపుతుండడంతో తెల్లవారిజామున కునుకు తీసి కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దురదృష్టకరం : కలెక్టర్ రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని జిల్లా కలెక్టర్ నారాయణభరత్గుప్తా వ్యాఖ్యానించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్తో కలసి క్షతగాత్రులను రుయా ఆస్పత్రి లో ఆయన పరామర్శించి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నామన్నారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదానికి పూర్తి కారణాలు తెలుసుకుని ఆదిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
తిరుపతిలో రౌడీషీటర్ హత్య
-
ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
సాక్షి, చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారంటూ వారి తల్లిదండ్రులు గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. వన్టౌన్ ఎస్ఐ మనోహర్ కథనం మేరకు.. గిరింపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు వి.కౌశల్య, ఎ.ఢిల్లీబాబు, ఆర్.సౌమ్య దసరా సెలవులు పూర్తికావడంతో గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రమైనా ముగ్గురు విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా.. అసలు పిల్లలు పాఠశాలకే వెళ్లలేదని తెలుసుకున్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల వివరాలు తెలిస్తే తమకు ఫోన్ నంబరు 94407 76705లో సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు
సాక్షి, తిరువళ్లూరు(చిత్తూరు) : భర్తను హత్య చేసినందుకు ఓ మహిళకు జీవిత ఖైదు శిక్షతో పాటు ఐదు వేలు రూపాయల జరిమానా విధిస్తూ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి దీప్తి అరువునిధి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు చిత్తూరు జిల్లా నాగాలాపురం బీసీ కాలనీకి చెందిన గౌరి(23)కి తిరువళ్లూరు జిల్లా పట్టాభిరాం తండరై ప్రాంతానికి చెందిన రాజీ(27)తో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన రాజీ తరచూ గౌరీని వేధించేవాడు. ఈ నేపథ్యంలో 2016 ఫిబ్రవరి 13న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజీ భార్యతో ఘర్షణకు దిగాడు. భర్త వేధింపులను తట్టుకోలేనీ గౌరి అతని తలపై రుబ్బురోలు రాయితో కొట్టి హత్య చేసింది. తిరువళ్లూరు జిల్లా అదనపు కోర్టులో ఈ కేసు విచారణ సాగింది. నేరం రుజువు కావడంతో శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి దీప్తి అరువునిధి తీర్పును వెలువరించారు. గౌరికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నాలుగు నెలల పాటు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్రావు మీడియాకు వివరించారు. అనంతరం ముద్దాయిని పుళల్ జైలుకు తరలించారు. -
మితిమీరిన వేగం తెచ్చిన అనర్థం
చిత్తూరు ,మదనపల్లె టౌన్ : లారీ డ్రైవర్ మితిమీరిన వేగానికి ఓ భవన నిర్మాణ కార్మికుడు బలయ్యాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. గురువారం ఈ సంఘటన మదనపల్లె లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, ఒకటో పట్టణ పోలీసుల కథనం..తంబళ్లపల్లె మండలం ఎరమద్దివారిపల్లెకు చెందిన టి.సహదేవ(42) బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చాడు. బెంగుళూరు రోడ్డులో ఉన్న నక్కల దిన్నె తాండాలో నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సహదేవ గురువారం ఉదయం కురబలకోట మండలం అంగళ్లులో భవన నిర్మాణ పనులకు కోటవారిపల్లెకు చెందిన నరసింహులు(37)ను తీసుకుని తన మోటార్ సైకిల్లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్యార్డు సమీపాన ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ స్పీడు బ్రేకర్ల వద్ద బైక్పై నెమ్మదిగా వెళుతుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ సహదేవ, నరసింహులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొంది. ఈ సంఘటనలో సహదేవ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన నరసింహులును అక్కడి ప్రజలు ఆటోలో హుటా హుటిన స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ ఎస్ఐ సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని వివరాలు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య భాగ్యమ్మ, పిల్లలు తనుజ, జయశ్రీ తమ బంధువులతో అక్కడికి చేరుకుని ‘ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు.. వాల్మీకిపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని చింతపర్తిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఎగువబూడిదవేడుకు చెందిన ఆవుల ద్వారకనాథ రెడ్డి (32) చింతపర్తి బాహుదానది బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బాధితుది తల నుజ్జునుజ్జై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ మోహన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు ఢీకొని మహిళ మృతి బంగారుపాళెం: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన గురువారం మండలంలోని కేజీ సత్రం వద్ద చెన్నై–బెంగళూరు బైపాస్రోడ్డుపై చోటుచేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ కథనం.. చీకూరుపల్లెకు చెందిన లేట్ లక్ష్మయ్య భార్య లక్ష్మమ్మ(56)పొలం వద్దకు వెళ్లి రోడ్డు దాటుతుండగా చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చచ్చిపోవాలని రైల్వేస్టేషన్కొచ్చింది! ఆపై..
ఆడపిల్లకు జన్మనిచ్చిందని కట్టుకున్నోడు వదిలేశాడు..చంటిబిడ్డతో తల్లిదండ్రులందరి చేరితే అక్కున చేర్చుకోవాల్సిన వారు కర్కశంగా వ్యవహరించారు. ఇంట ఉంటే తమ్ముడికి వివాహం కాదంటూ ఆమెను నిర్దయగా గెంటివేశారు. దీంతో అందరూ ఉన్నా అనాథ అయ్యాయని ఆమె కుంగిపోయింది. ఆత్మహత్య చేసుకునేందుకు తిరుపతికి వచ్చింది. సకాలంలో షీటీమ్ స్పందించింది. రైలు కింద కడతేరిపోవాలనుకున్న ఆమెను కాపాడింది. సాక్షి, తిరుపతి క్రైం : జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యతో తనువు చాలించాలనుకున్న ఓ వివాహితను సకాలంలో శక్తి టీమ్ ఏఎస్ఐ సుమతి స్పందించి కాపాడారు. శని వారం ఈ సంఘటన వెస్ట్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ సీఐ వెంకటప్పయ్య కథనం..చిన్నగొట్టిగల్లుకు చెందిన సుబ్రమణ్యం, భువనేశ్వరి(26) భార్యాభర్తలు. వీరికి 2 నెలల పాప ఉంది. భువనేశ్వరికి గ్రహణ దోషం ఉండడంతో వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు అల్లుడికి కట్నం అధికంగానే ఇచ్చారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి ఆడపాపకు జన్మనిచ్చింది. మగ బిడ్డకు జన్మనివ్వలేదని ఆగ్రహించి ఆమె భర్త పుట్టింటికి తరిమేశాడు. చంటిబిడ్డతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఆమెకు నిరాదరణే ఎదురైంది. నువ్వు ఇంట్లో ఉంటే మీ తమ్ముడికి పెళ్లి కాదంటూ –భువనేశ్వరిని తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో పోలీస్ స్టేషన్లకు, న్యాయస్థానానికి తిరగలేని బాధితురాలు తిరుపతిలోని వెస్ట్ రైల్వే స్టేషన్కు చంటిబిడ్డతో చేరుకుంది. ఆత్మహత్యకు చేసుకునేందుకు సిద్ధమైంది. అదృష్టవశాత్తు అప్పటికింకా ఏ రైలూ రాలేదు. అదే సమయంలో అటుగా వెళ్లిన షీటీమ్ ఏఎస్ఐ సుమతి ఆ వివాహితను గమనించింది. కుమిలి..కుమిలి ఏడుస్తున్న ఆమె వాలకం గమనించి అనుమానిం చింది. ఆమె దరిచేరి ప్రశ్నించింది. ఆమె గోడు తెలుసుకుంది. చంటిబిడ్డతో సహా ఆమెను సీఐ వద్దకు తీసుకువచ్చింది. అనంతరం తిరుచానూరు మహిళా ప్రాంగణంలో తల్లీబిడ్డకు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు పిలిపించి చిన్నపాటి క్లాసు పీకారు. దీంతో వారు దారికొచ్చారు. భువనేశ్వరిని బాగా చూసుకుంటామని చెప్పి తీసుకెళ్లారు. ఏఎస్ఐ సుమతిని పలువురు అభినందించారు. -
పిల్లి కోసం తల్లడిల్లుతూ..
సాక్షి, రేణిగుంట : ‘గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన దంపతులు గత 25రోజులుగా రేణిగుంటలో తచ్చాడుతూ తెలియని భాష మాట్లాడే వ్యక్తుల మధ్య కనిపించిన వారందరినీ వాకబు చేస్తున్నది ఓ పిల్లి కోసం అంటే నమ్మశక్యం కాని విషయం... కానీ నమ్మి తీరాలి.. పిల్లలు లేని తమ జీవితంలో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా భావించిన వారు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు తప్పిపోయిన పిల్లి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారంటే.. అందరూ నోరెళ్లబెడుతున్నారు. కానీ వారి అన్వేషణకు అంతమెప్పుడన్నది దేవుడే నిర్ణయించాలి. వారి ఎదురుచూపులు సుఖాంతమై.. తప్పిపోయిన పిల్లి దొరకాలని విషయం తెలిసిన జంతుప్రేమికులు అభిలషిస్తున్నారు.’’ విషయానికొస్తే... గుజరాత్ రాష్ట్రం సూరత్కు చెందిన జయేష్బాబు, మీన దంపతులు బట్టల వ్యాపారులు. వీరికి పిల్లలు లేరు. వీరు ప్రేమగా పెంచుకున్న పిల్లిని కంటికి రెప్పలా ప్రాణం పెట్టి పెంచుకున్నారు. దాని పేరు బాబు. తిరుమల శ్రీవారి దర్శనార్థం సూరత్లో బయల్దేరి గత నెల 9న పిల్లితో సహా రైలు మార్గాన తిరుపతికి వచ్చారు. తిరుమలేశుని దర్శనానంతరం వారు తిరుగు ప్రయాణంలో గత నెల 13న రేణిగుంట రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో రైలుకోసం వేచి ఉన్న తరుణంలో తమ వద్దనున్న పిల్లి ఒక్కసారిగా మాయమైంది. కొద్ది నిమిషాల్లోనే తప్పిపోయిన పిల్లికోసం తాము తిరుమలలో పిల్లితో కలిసి ఇష్టంగా తీసుకున్న ఫొటోను చూపిస్తూ స్టేషన్ ప్రాంగణమంతా జల్లెడ పట్టారు. ఎంతకీ పిల్లి ఆచూకీ లభించకపోవడంతో స్వస్థల ప్రయాణాన్ని విరమించుకుని స్టేషన్ ప్రాంగణమే కాక, రేణిగుంట మొత్తం తిరుగాడుతూ పిల్లికోసం అలుపెరగని వెదుకులాట ప్రారంభించారు. తప్పిపోయిన పిల్లిని వెదికిపెట్టాలని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు వారిని చూసి నిశ్చేష్టులయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. వారే కనిపించిన వారందరినీ పిల్లి కోసం ఆరా తీశారు. రేణిగుంటకు చెందిన కొందరు ఆకతాయిలు పిల్లిని వెదికిపెడతామని, అక్కడ కనిపించింది... ఇక్కడ కనిపించిందంటూ నమ్మబలికి వారి వద్ద రూ.50వేలు నగదు తీసుకుని మోసం చేసినట్లు ఆ దంపతులు వాపోతున్నారు. అయినా వారు రేణిగుంటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లికోసం వెతుకుతూనే ఉన్నారు. పిల్లి ఆచూకీ తెలిస్తే 9824876542 నంబరుకు సమాచారం అందించాలని వారు వేడుకుంటున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20వేలు బహుమానం ఇస్తామని వారు తెలిపారు. -
వివాహమైన నాలుగు నెలలకే జవాను భార్య..
చిత్తూరు, కాణిపాకం(పూతలపట్టు) : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పూతలపట్టు మండలం బండపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన యశోద (22)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఆమె భర్త వృత్తిరీత్యా జవాను కావడంతో వివాహమైన 50 రోజుల అనంతరం విధులకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో యశోద తన అత్త, ఆడపడుచుతో కలిసి ఉంటోంది. వారి మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చెరువు వద్ద విగతజీవిగా కనిపించింది. గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్ఐ మల్లేష్యాదవ్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మెడ చుట్టూ నల్లటి చారిక ఉండడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? అన్నది పోలీసులు స్పష్టం చేయలేదు. ఒకవేళ ఉరి వేసుకుని ఉంటే ఎక్కడ వేసుకుంది? ఎవరు మృతదేహాన్ని దించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మృతికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉంది. -
నవవధువు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ: పెళ్లైన రెండు నెలలకే భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం..బి.కొత్తకోటకు చెందిన భరత్, శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్య(25) గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఇద్దరూ మూడు రోజుల క్రితం టెక్కలి నుంచి బి.కొత్తకోటకు వచ్చేందుకు నౌపడ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ ప్రమాదశాత్తు జారి పడి భరత్ మృతి చెందాడు. భర్త కర్మకాండలకు బి.కొత్తకోటలో ఉన్న లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరునాళ్లకు వచ్చి.. మృత్యుఒడికి
రాయచోటి టౌన్ : చిన్నమండెం మండలం మల్లూరులో మల్లూరమ్మ తిరునాళ్లకు వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం.. వల్లూరు మండలం నాగిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎం.ఓబుల్రెడ్డి (48) తిరునాళ్లకోసం ఈనెల 20న మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనకు రాయచోటిలో పని ఉందని, తానే భార్గవిని తీసుకెళ్తాంటూ ఓబుల్రెడ్డిని ఆమెను తీసుకుని బైక్లో బయల్దేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్ మలుపువద్ద మృత్యువాత పడ్డారు. కడప నుంచి బెంగళూరు వెళుతున్న అమరావతి బస్సు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓబుల్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పెళ్లైన రెండు నెలలకే నవ వధువు..
చిత్తూరు, కుప్పం: మూడుముళ్ల బంధం తాలూకు కాళ్ల పారాణి ఆరనే లేదు..పెళ్లైన రెండు నెలలకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో బలవన్మరణం చెందింది. శనివారం ఇది పట్టణంలో ఇది చర్చనీయాంశమైంది. వివరాలు..గుడుపల్లె జెడ్పీ హైస్కూలులో టీచర్గా పనిచేస్తున్న చంద్రజ్యోతి (29)కి వి.కోట డీసీసీ బ్యాంకులో పనిచేస్తున్న శ్రీకాళహస్తి వాసి శరత్కు రెండు నెలల క్రితం వివా హమైంది. వీరిద్దరూ స్థానిక హెచ్పీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రజ్యోతి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెం దడం శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివాహమైన కొన్ని రోజులకే దంపతుల నడుమ తరచూ గొడవలు చోటుచేసుకున్నాయని, అల్లుడే తమ కుమార్తెను వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమార్తె ఇక తనకు అవసరం లేదని, వచ్చి తీసుకెళ్లాలని శుక్రవారం రాత్రి శరత్ ఫోన్ చేశాడని, అతడే చంద్రజ్యోతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. తమ కుమార్తె మృతిపై పోలీ సులకు ఫిర్యాదు చేశారు. శరత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి ఒత్తిడితోనే పారిపోయా..
చిత్తూరు , కలికిరి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (17) అదృశ్యం కేసు సుఖాంతమైంది. కలికిరి మండలం తుమ్మలపేట లోని తన అమ్మవారి ఇంటికి వచ్చి ఈ నెల రెండో తేదీన ఆమె అదృశ్యమైన విషయం విదితమే. మూడు రోజుల పాటు వెతికిన ఆమె తల్లిదండ్రులు 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థిని వైఎస్సార్ జిల్లా కడపలో ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులతో సహా మంగళవారం కలికిరి మండల మెజిస్ట్రేట్ కులశేఖర్ ముందు హాజరుపరిచారు. తల్లిదండ్రులు వివాహం చేసుకోవాలని తనపై ఒత్తిడి చేయడంతోనే ఇంటి నుంచి అదృశ్యమైనట్లు సదరు యువతి అధికారులకు వెల్లడించింది. 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, విద్యార్థినిని చదివించాలని ఆదేశించారు. అనంతరం పోలీసుల సమక్షంలో విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
22 ఏళ్ల తర్వాత హత్య కేసులో నిందితుడి అరెస్టు
చిత్తూరు ,కురబలకోట/మదనపల్లె : హత్య కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన సంఘటన కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య తెలిపిన వివరాలు.. ముదివేడుకు చెందిన అమీర్ఖాన్ 1997 అక్టోబర్ 7న తన పొలం వద్ద హత్య కు గురయ్యారు. ముదివేడు ప్రాంతానికి చెందిన సత్తార్ఖాన్, ఇంతియాజ్Œ ఖాన్, ఇలియాజ్ఖాన్, బి.కొత్తకోటకు చెందిన టైలర్ మొహిద్దీన్ఖాన్ ఇతన్ని భూతగాదాల నేపథ్యంలో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. వీరిలో మొహిద్దీన్ తప్ప ముగ్గురిని అరెస్టు చేశారు. అంతేగాకుండా 2000 ఫిబ్రవరి 4న మదనపల్లె 1వ ఏడీజే కోర్టు వీరికి జీవిత ఖైదు, జరిమానా విధించింది. వీరు జైలు శిక్ష కూడా పూర్తి చేసుకుని విడుదలయ్యారు. 4వ ముద్దాయి అయిన టైలర్ మొహిద్దీన్ ఖాన్ అలియాస్ బుజ్జీ మాత్రం 22 ఏళ్లుగా పరారీలో ఉండడంతో మదనపల్లె కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు అప్పట్లోనే జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసుల నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డీఎస్పీ చిదానందరెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ముదివేడు ఎస్ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ శివరామకృష్ణయ్య, కానిస్టేబుళ్లు రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. టైలర్ మొహిద్దీన్ఖాన్పై దృష్టి సారించారు. మూడు నెలల క్రితం ఇతని అక్క చనిపోయింది. అతను వస్తాడని వల పన్నారు. ఇది పసికట్టిన అతను రాలేదు. అతని సెల్ నంబర్ సేకరించి సాంకేతికత పరిజ్ఞానంతో పోలీసులు అతడి కదలికలు పసిగట్టారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులో ఇతన్ని అరెస్టు చేశారు. ఇతను హత్యానంతరం విజయవాడ, బెంగళూరు, ముంబైలో గడిపాడని, ఇప్పుడు బెంగళూరులో టైలర్గా ఉంటూ నేర ప్రవృత్తిని దాచి వివాహం కూడా చేసుకున్నట్లు తేలింది. నిందితుడి అరెస్టులో కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని డీఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. అలాగే, పెండిం గ్ కేసుల్లో భాగంగా నాన్ బెయిలబుల్ వారెం టున్న 16 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నీరుగారుతున్న అవినీతి కేసులు
అవినీతి అధికారుల ఆట కట్టించడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు శక్తి చాలడం లేదు. గత నాలుగేళ్ల కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా 10 మందికిపైగా అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కానీ కేసుల్లో బలం లేకపోవడం, చట్టంలో ఉన్న లొసుగులు, సాక్షులను బెదిరించడం..ఇత్యాది కారణాల వల్ల ఈ కేసులు నీరుగారిపోతున్నాయి. పలువురు అవినీతిపరులు మళ్లీ నెలల వ్యవధిలోనే ఉద్యోగంలో చేరుతున్నారు! కొందరు ఏకంగా ప్రమోషన్లు కూడా పొందారు. దీనికి అధికార పార్టీ నాయకులు ఇతోధికంగా సహకరించడమే కారణమనే విమర్శలొస్తున్నాయి. చిత్తూరు, సాక్షి: ఒక చిరుద్యోగి చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేస్తున్నారు. అయితే, అధికారులు వేలా ది రూపాయలు లంచంగా పుచ్చుకుని ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడితే అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నారు. పలువురు ఉద్యోగులు వేతనానికి మించి 10 నుంచి 15 రెట్లు లంచాలు తీసుకుంటున్నారంటే అవినీతి ఎంతగా వేళ్లూనుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టాల్సిన ఏసీబీ పనితీరు కూడా సక్రమంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏసీబీకి పట్టుబడిన లంచావతారులు మూడు నుంచి ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ దర్జాగా ఉద్యోగాల్లో చేరుతున్నారు. మళ్లీ లం చాలతారులై పీడిస్తున్నారు. కేసుల మాఫీ కోసం ఖర్చుపెట్టిన సొమ్ముకు రెండింతలు లంచాల రూపేణా ప్రజల నుంచి పిండుకుంటున్నారు. అన్నీ ఉత్తమాటలే.. ‘అక్రమార్కులను వదిలేదు..ఎంతటివారైనా సహించేది లేదు..చట్టం తన పని తాను చేసుకుపోతుంది...కఠినంగా శిక్షిస్తాం’ అని చెప్పే ఏసీబీ అధికారులు మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. ఈ నాలుగేళ్లలో ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వోద్యోగులు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.? ఎన్ని ఫిర్యాదులు వస్తే ఎంతమందిపై దాడులు చేశారు..? విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన బడా అక్రమార్కులు ఎంత మందిని కటకటాల పాల్జేశారు? ఈ లెక్కలు తీస్తే ఏసీబీ వైఫల్యం ఇట్టే అవగతమవుతుంది. అవినీతి అధికారికి శిక్షపడకుండా కేసులు పెడుతూ.. కోర్టుకు బలహీనమైన సాక్ష్యాలు దాఖలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. దాదాపు నాలుగు నెలల క్రితం సమాచార శాఖలో ఇంజినీర్ నాగేశ్వరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేవలం నాలుగు నెలలు జైల్లో ఉండి దర్జాగా ఆయన బయటికొచ్చాడు. మరో రెండు మూడు వారాల్లో ఉద్యోగంలో చేరుతాడని అధికారులు చెబుతున్న సమాచారం. జిల్లాలో ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క అవినీతి అధికారికి కూడా శిక్ష పడలేదంటే లోపాలేమిటో ఏసీబీ పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటోంది. కలకడలో రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఓ మహిళా తహసీల్దార్ సంవత్సరం తిరక్కుండానే మళ్లీ విధుల్లో చేరింది. చేయి తడపనిదే.. ఇప్పుడు జిల్లాలో ఏ ప్రభుత్వ శాఖలోకి వెళ్లినా చేయి తడపనిదే పనులు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శిని కలవాలంటే ముందు బయట ఉండే గుమస్తాకు రూ.50 ఇస్తేనే ఆయన దర్శనభాగ్యం కలుగుతుంది. తహసీల్దార్ను కలిసి తమ సమస్యను చెప్పుకోవాలని ఆఫీసుకు వెళితే ఎర్రబిళ్ల జవానుకు రూ.100 ఇవ్వాల్సిందే. ఎంపీడీఓ కార్యాలయంలో పని కావాలంటే జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఎంపీడీఓ వరకు ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి జేబుల్లో నోట్లు ఇచ్చుకుంటూ పోతే తప్ప పనులు కావడం లేదు. డబ్బులు ఇవ్వకపోతే సదరు వ్యక్తి ఫైలు నెలలేమిటి? ఏళ్ల తరబడి కార్యాలయంలోనే బూజుపట్టి పెండింగ్లో ఉంటోంది. ప్రజల జీవన విధానంలో తహసీల్దార్ కార్యాలయంలో పలు పనులు ముడిపడి ఉన్నాయి. నిత్యం ఆయా మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వందలాది మంది కార్యాలయాలకు వస్తుంటారు. వీరిలో నూటికి 80 శాతం ప్రజానీకం ఆయా కార్యాలయాల్లో దిగువ సిబ్బంది నుంచి పై అధికారి వరకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే రోజుకు వివిధ పనులకు గాను ప్రజలు చెల్లించే లంచం రూ.2 కోట్లు పైమాటే ఉంటుందని అనధికార అంచనా. మంచి ఆదాయం ఉన్న శాఖల్లో కుర్చీల కోసం పలువురు అధికారులు వెంపర్లాడుతున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని లక్షలు వెచ్చించి వారికి కావాల్సిన స్థానాన్ని దక్కించుకుంటున్నారు. ఇది అన్ని పట్టణాలు, మండలాల్లో జరిగే తంతే! అధిక సంపాదనకు కొన్ని కార్యాలయాలు అడ్డాగా మారాయి. రెవె న్యూ, ఎంపీడీఓ, ఉపాధి, ఆర్డబ్ల్యూఎస్, పంచా యతీరాజ్, ఇరిగేషన్, ఐసీడీఎస్, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు, సోషల్ వెల్ఫేర్, నీటిపారుదల, వ్యవసాయశాఖ, డ్వామా, సబ్ రిజిస్ట్రార్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి అనకొం డలు ఉన్నాయి. ఆ శాఖలోని ఫైళ్లు ఎలా పేరుకుపోతున్నాయో అలాగే కుర్చీలు వదలడం లేదు. చేయి తడపనిదే పనిచేయడం లేదంటే అతిశయోక్తి లేదు. పనికో రేటుతో పిండేస్తున్నారు. -
దొంగల కుటుంబం
చిత్తూరు, తిరుపతి క్రైం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వద్ద దారిదోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 60, 51,400 రూపాయల విలువగల బంగారు, డైమండ్, వెండి ఆభరణాలను తిరుపతి సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్రెడ్డి కథనం...ఈనెల 7న కోయంబత్తూరు వద్ద దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 1965.530 గ్రాముల బంగారు, 15.140 గ్రాముల డైమండ్ నగలు, 248.200 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకున్నారు. తమిళనాడులో దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, గురువారం తెల్లవారుజామున తిరుపతి టీటీడీ శ్రీకోదండరామస్వామి ధర్మశాల 3వ సత్రం ఎదురుగా ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న ఒక మహిళ, యువకుడిని తిరుపతి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సి.భాస్కర్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారిద్దరూ తల్లీకొడుకులని, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పంజన్ తంగాళ్ రోడ్డు, జీఆర్ నగర్కు చెందిన రసూల్ భార్య షమా(46), ఆమె కుమారుడు మహమ్మద్ సలీం(29) అని తేలింది. అంతేకాకుండా వారి వద్ద నున్న నల్లటి బ్యాగులను తెరచి పరిశీలించగా లక్షల విలువ చేసే బంగారు, డైమండ్, వెండి నగలు ఉండటంతో విస్తుపోయారు! వీళ్లు ఘరానా దొంగలనే కోణంలో విచారణ చేసేసరికి దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. షమా ఇద్దరు కుమారులు మహ్మద్ సలీం, ఫైరోజ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదైనట్టు గుర్తించారు. షమా తన చిన్నకుమారుడు, తన స్నేహితులతో కలసి కోయంబత్తూరులో దోపిడీకి పాల్పడి ఈ నగలు కాజేసినట్టు వెల్లడైంది. ఈ నగలు ఇంటి వద్ద దాచి ఉంచినపక్షంలో తమిళనాడు పోలీసులు గుర్తించి పట్టుకుంటారనే ఉద్దేశంతో తన పెద్దకొడుకుతో కలిసి రెండుమూడు రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రదేశాలలో ఉంటున్నట్టు షమా నోరువిప్పింది. ఈ నగలను తిరుపతిలో విక్రయించి వెళ్లాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ ఘటన సమాచారాన్ని కోయంబత్తూరు జిల్లా కేజీ చావిడి పోలీసు స్టేషన్కు తిరుపతి పోలీసులు చేరవేశారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వివిధ చోట్ల దోపిడీ చేసిన∙సొత్తును బాధితులకు అప్పగించనున్నట్టు డీఎస్పీ ఆర్.రవిశంకర్రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు భాస్కర్రెడ్డి, కె.శరత్చంద్ర, టి.అబ్బన్న, ఎస్ఐ డి.రమేష్ బాబు, హెడ్కానిస్టేబుల్ రాజేంద్ర, ఆర్.పద్మావతి, కానిస్టేబుళ్లు భగవతి ప్రసాద్, బారుసా, రవికుమార్, రెడ్డెమ్మను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. వీరికి రివార్డులను సిఫారసు చేశారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
చిత్తూరు, పిచ్చాటూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని వెంగళత్తూరు దళితవాడలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. నగరి మండలం నెత్తం గ్రామానికి చెందిన శరవణ(30) చిత్తూరుకు చెందిన సత్య (20)ను మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండగకని మూడు రోజుల క్రితం శరవణ తన అక్క సుమతి గ్రామమైన వెంగళత్తూరు దళితవాడకు తన భార్యతో కలిసి వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 సమయంలో సుమతి ఇంట్లో హఠాత్తుగా కేకలు వినిపించాయి. చుట్టు పక్కలవారు వెళ్లి చూడగా సత్య కత్తిపోట్లకు గురై, రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. క్షణాల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. హతురాలి భర్త, అతని అక్క, బావ కలిసి రక్తపు మరకలను శుభ్రంగా కడిగేశారు. ఇంట్లోని నులక మంచంపై సత్య మృతదేహాన్ని పడుకోబెట్టిన స్థితిలో ఉంచి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, నగరి సీఐ మల్లిఖార్జున్, ఎస్ఐ రామాంజనేయులుతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతురాలి భర్త, అతని బంధువులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ చేశారు. అయితే శరవణ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. హత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సత్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గుండెలు పిండే విషాదమే మిగిలింది
చిత్తూరు, ములకలచెరువు: ‘దేవుడా! మా కుటుంబంపై ఎందుకీ పగ?.. ఒక్కసారిగా అందరినీ కడతేర్చావు..మా కుటుంబం కలలన్నీ సమాధి చేశావే..!’ అంటూ వీఎస్ఎస్ వర్మ రోదించడం అక్కడివారిని కంటతడి పెట్టించాయి. బుధవారం గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెం దడం విదితమే. వీరిలో భారతి(53), సుష్మ(28), సాయి కస్విక(2)మృతదేహాలను శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు సోంపాళ్యం వద్ద వీఎస్ఎస్ వర్మ ఫామ్హౌస్కి తీసుకొచ్చారు. ఇదేరోజు పలువురి కన్నీటి నివాళుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. వర్మ అన్న కుమారుడైన సుందరరామరాజు(38)కు కాకినాడలో దహనక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ, విశాఖపపట్నం, కర్ణాటక రాష్ట్రం మైసూరు, బెంగళూరు నుంచి బంధువులు హాజరయ్యారు. కడసారి చూపులకు నోచుకోని సునీల్వర్మ రోడ్డు ప్రమాదంలో సునీల్వర్మ(35) తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయన భార్య సుష్మ, తల్లి భారతి, కుమార్తె కస్విక కడసారి చూపులకు కూడా నోచుకోకపోవడం ప్రతి ఒక్కరినీ విచలితుల్ని చేసింది. తాతయ్య చేతుల్లో కస్విక మృతదేహాన్ని చూసి పలువురు అయ్యో! అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దహనక్రియలకు స్థానికులు సహకారం అందించారు. -
ఇద్దరు మహిళలు దారుణ హత్య
జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. పీలేరు మండలంలో పశువుల మేతకు వెళ్లిన వివాహితను తలపై బండరాయితో మోది హతమార్చారు. పుత్తూరు మండలంలో మరో మహిళను గొంతు కోసి పొట్టన పెట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలకమైన ‘క్లూ’లు లభించాయి. చిత్తూరు, పీలేరు: పశువులు మేపడానికి వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని వేపులబైలు వద్ద చోటు చేసుకుంది. పీలేరు ఎస్ఐ పీ.వీ. సుధాకర్కరెడ్డి కథనం.. వేపులబైలు పంచాయతీలోని వరంపాటివారిపల్లెకు చెందిన శేషాద్రి భార్య వరలక్ష్మి(36) బుధవారం ఆటోలో సోమల మండలం కందూరుకు వెళ్లి పశువులకు దాణా తీసుకువచ్చింది. అనంతరం తమ పశువులు మేపడానికి ఇంటికి తాళం వేసి వెళ్లింది. భర్త శేషాద్రి మేస్త్రీ కావడంతో పని కోసం పీలేరుకు వచ్చారు. వీరి ఇద్దరు కుమారులు తేజ, దినేష్ పాఠశాలకు వెళ్లారు. మేస్త్రీ పనికి వెళ్లిన భర్త, స్కూలుకు వెళ్లిన ఇద్దరు కుమారులు సాయంత్రం ఇంటికి వచ్చారు. వరలక్ష్మి ఇంటి వద్ద లేకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. అప్పటికే మేతకు వెళ్లిన పశువులు సైతం ఇంటికి వచ్చేశాయి. రాత్రి అయినా వరలక్ష్మి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. గ్రామ సమీపంలోని పొలాలు, బావులు, చెరువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు ముమ్మరం చేశారు. ఇంతలో మదరసా సమీపాన చెరువు సమీపంలో వరలక్ష్మి మృతదేహాన్ని ఆమె భర్త గురించి నిశ్చేష్టుడయ్యాడు. బండరాయితో తలపై మోది వరలక్ష్మిని హత్య చేసినట్టు ఉండడంతో పీలేరు పోలీసులకు, వీఆర్ఓ సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎస్ఐ, వరలక్ష్మి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ధరించిన నగలు అలాగే ఉండటం, దుస్తులు చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. హతురాలి భర్త, బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు. హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. వివాహేతర సంబంధమేమై నా హత్యకు దారితీసిందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. పీలేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదేరోజు అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు, పుత్తూరు రూరల్ : వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం స్థానిక ఎన్టీఆర్ కాలనీ సమీపంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం..మండలంలో వేపగుంట క్రాస్ రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో శంకరయ్య, ఆయన భార్య దేవకి (43) నివాసం ఉంటున్నారు. శంకర్ ఓ ప్రైవేట్ కాటన్ మిల్లో పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఇటీవలే ఒక కుమార్తెకు వివాహం చేశారు. దేవకి పశువులను మేపేది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటికి అవసరమైన వంటచెరకు (ముళ్లకంపలు) తెచ్చేందుకు వెళ్లింది. రాత్రి అయినా ఆమె జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం ముళ్లపొదల మధ్య ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తిం చారు. గొంతు కోసి ఆమెను దుండగలు దారుణంగా హత్య చేశారని గుర్తించారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పుత్తూరు పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలంలో మూడు తాగి పడేసిన మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు, మాంసాహారం తిన్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం ఉన్న స్థితి బట్టి బుధవారం రాత్రి హత్యకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, కంపలు కొట్టే ఒక కొడవలిని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్తో గాలింపు సంఘటన స్థలానికి పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించారు. అక్కడి నుంచి జాగిలాలు నేరుగా హతురాలి ఇంటి సమీపంలో ఉన్న మరో ఇంటి వద్దకు వెళ్లి ఆగాయి. దీంతో పోలీసులు సమీప ప్రాంతంలోని 30–35 ఏళ్లున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హతురాలి కుటుంబ సభ్యులు వినియోగిస్తున్న పశువుల కొట్టం స్థలంపై వివాదం ఉన్నట్టు తెలియవచ్చింది. ఈ వివాదం నేపథ్యంలో హత్య చేశారా? మరే ఇతర కారణాలా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్చి ఉంది. గస్తీ పటిష్టం చేయండి : ఎమ్మెల్యే రోజా సంఘటనా స్థలాన్ని నగరి ఎమ్మెల్యే రోజా కూడా పరిశీలించారు. ఇటీవల పుత్తూరు పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు హత్యలు జరిగాయని వాటిని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గస్తీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, సీసీ కెమెరాల పనితీరునూ సమీక్షించాలని పోలీసులకు సూచించారు. -
తెల్లబోయే ఎర్ర నిజాలు
అడవులు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అంతరించి పోతున్నాయి. ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునే శేషాచలంలో అటవీ సంపద హరించుకుపోతోంది. స్వార్థపరుల వ్యాపార దాహానికి ఇక్కడి అరుదైన ఎర్రచందనం వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి. దుర్భేద్యమైన అడవుల్లో స్మగ్లర్లు అమూల్య వనరులను కాజేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులను దాటిస్తున్నారు. వన సంపద దొంగల పాలవడమే కాకుండా పర్యావరణానికి కూడా పెనుముప్పు వాటిల్లుతోంది. రోజుకో వాహనం, పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నా.. దీనికి ఎక్కడా పుల్స్టాప్ పడడం లేదు. చిత్తూరు, భాకరాపేట: అమూల్యమైన సంపదను కాపాడాల్సిన అటవీ శాఖకు ఖాళీ పోస్టుల సమస్య సవాలు గా మారింది. ఎర్రచందనం వృక్షాలున్న ప్రాంతా ల్లో సైతం పోస్టులు భర్తీ కావడం లేదు. తిరుపతి వన్యప్రాణి విభాగం డీఎఫ్ఓ పరిధిలో చామల, బాలపల్లె అటవీ రేంజ్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లా చామల, వైఎస్ఆర్ జిల్లా బాలపల్లె రేంజ్లో 28 బీట్లు ఉన్నాయి. ఇందులోని 18 బీట్లలో భారీ ఎత్తున ఎర్రచందనం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఎర్రదండు తరుచూ చొరబడుతోంది. ఇక్కడ సుమారు 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనిచేయడానికి సిబ్బందెవరూ ముందుకు రావడంలేదు. దీంతో స్థానికంగా ఉం డే 90 మందిని ప్రొటెక్షన్ వాచర్లుగా తీసుకున్నా రు. వీరి ఏంపికలో అధికారులు అవలంబిస్తున్నతీరుపై విమర్శలున్నాయి. వీరి నియామకం వెనుక ఎర్ర స్మగ్లర్లు, నాయకుల హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు పట్టుబడ్డ తరువాతే.... దొరికితే దొంగలన్న చందంగా ఎవరైనా అటవీ శాఖకు చెందిన వారు ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడ్డ తరువాతే ఆ శాఖ స్పందించి చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చామలరేంజ్ పరిధిలో ఇటీవల ఎర్రావారిపాళెం మండలం నెరబైలు సెక్షన్లోనే ఆరుగురు వాచర్లు పట్టుబడ్డారు. వాహనాలను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రాబట్టి న సమాచారంతో ఎఫ్బీవో చొక్కలింగాన్ని సస్పెం డ్ చేశారు. భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలోని గౌడన్ల నుంచి దుంగలు గోడపై నుంచి దాటవేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్ను వాచర్గా పెట్టుకుని అభాసుపాలయ్యారు. ఇలా పట్టుబడ్డాక చర్యలు తీసుకునే కంటే వారిపై ముందుగానే నిఘావేయాల్సి ఉంది. అటవీ శాఖకు ఆయుధాలు కొరత.. ఆయుధాలు కొరత కూడా సమస్యగా తయారైనట్లు తెలిసింది. ఇద్దరు అధికారులు స్మగ్లర్ల చేతిలో హతమయ్యాక ఎర్రకూలీలను అడ్డు కోవాలంటే వారికి అత్యాధునికి ఆయుధాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా నుంచి 200 అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇవి ఇక్కడకు చేరలేదు. ఢిల్లీలోనే ఇవి తుప్పుబడుతున్నాయని తెలిసింది. ఎర్రచందనం అమ్మి భారీగా నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకున్న ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీకి రూ.29 లక్షలు చెల్లించనందుకు అవి విమానాశ్రయం దాటలేదని భోగట్టా. కాగా అటవీశాఖలో జరిగే అవినీతికి యువ ప్రొటెక్షన్ వాచర్లను తమకు రక్షణ కవచంగా అటవీ అధికారులు మల్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఏదో ఒక ఉద్యోగం అనుకుని చేరి చివరికి జైలు ఊసలు లెక్కపెడుతున్నారు చాలా మంది యువకులు. అటవీ అధికారులే వారిని ఆ విధంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెరబైలు సెక్షన్లో పట్టుబడ్డ వాచర్లు తమ అధికారుల తీరును తప్పుబట్టినట్లు తెలిసింది. పట్టించుకోని ప్రభుత్వం.. అటవీశాఖలో అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం పట్టిం చుకోవడంలేదు. టెండర్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించడంలో ఉన్న శ్రద్ధ ఎర్రచందనం కాపాడడంలో లేదు. అమ్మకంలో వచ్చిన ఆదాయంలో 30 శాతం రక్షణకు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా ఆమేరకు నిధులు విడుదల కావడం లేదు. రోజు పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నారు. వీరి నుంచి సమాచారాన్ని రాబట్టి కోర్టుకు హాజరు పరిచేలోపు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడం కూడా అవినీతికి కారణంగా భావిస్తున్నారు. -
ప్రమాదాల్లో ఐదుగురి మృతి
జిల్లాలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదాపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు దుర్మరణం చెందారు. దట్టంగా కురుస్తున్న మంచులో రైళ్లు కనిపించక వారు మృత్యువాత పడ్డారు. చిత్తూరు, కలకడ : ట్రాక్టర్ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో మండలానికి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు–వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. తిప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం ఉదయం 7గంటల సమయంలో ఇటుకల కోసం ట్రాక్టర్లో కలకడకు బయలుదేరి వస్తుండగా పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కెఎ 01 ఎజె 4424 నంబరు గల లారీ జిల్లా సరిహద్దులో ఢీకొంది. ఈ ప్రమాదంలో తిప్పిరెడ్డిగారిపల్లె వాసి చిన్నకోట్ల వెంకట్రమణ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఎస్.మునాఫ్ (23), రఫీ (17), లక్ష్మీపతి తదితరులను 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మునాఫ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఫీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కడప జిల్లా సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో తిప్పిగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు..–మంచు తెచ్చిన ముప్పు గుడుపల్లె/కుప్పం రూరల్: రైళ్లు ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన గుడుపల్లె సమీపంలోని సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం వరదాపురం రైల్వేస్టేషన్ సమీపాన గురువారం చోటుచేసుకుంది. బంగారుపేట రైల్వే పోలీసుల కథనం.. కీమెన్లుగా రామస్వామి (24) బెంగళూరు ట్రాక్ మార్గంలో, రాజప్ప (26) చెన్నై మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో ఇద్దరు వరదాపురం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రెండు పట్టాలపై రైళ్లు వీరిని ఢీకొన్నాయి. దీంతో రామస్వామి, రాజప్ప అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామస్వామి శాంతిపురం మండలం, సీ.బండపల్లెకు చెందిన వ్యక్తి కాగా, రాజప్ప మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. రామస్వామి కాంట్రాక్టుపై పని చేస్తుండగా, రాజప్ప రెగ్యులర్ ఉద్యోగి. ఉదయం మంచులో రైళ్లను గమనించకపోవడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను బంగారుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి యువకుడు.. కురబలకోట : రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం కురబలకోట రైల్వేస్టేషన్ దగ్గర చోటుచేసుకుంది. పట్టాల మధ్యనే మృతదేహం పడి ఉంది. కదిరి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చినట్లు రైల్వే స్టేషన్ మాస్టర్ Ðð తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా అత్మహత్యా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
గమ్యం చేర్చింది.. ప్రాణం తీసింది
చిత్తూరు, సూళ్లూరుపేట: గమ్యం చేర్చిన బస్సే ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన కుప్పాని కవిత (35) సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె మంగళవారం విధులకు హాజరయ్యేందుకు సంతవేలూరులో సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సు ఎక్కింది. స్థానిక వినాయకుడి గుడి సెంటర్లోని బస్స్టాప్లో దిగుతుండగా చీర డోర్కు ఇరుక్కుని అదుపుతప్పి కింద పడిపోయింది. బస్సు డ్రైవర్ ఆమె దిగిందనుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. వెనుక టైర్ ఆమె మీదకు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉందనుకుని వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి కారులో ఎర్రచందనం
తిరుపతిసిటీ: పెళ్లికి ముస్తాబు చేసిన కారులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని మంగళం క్వార్టర్స్ గృహాల మధ్య కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిర్మానుష్య ప్రాంతంలో పెళ్లికి ముస్తాబు చేసిన స్క్వాడా కారు కనిబడింది. టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీ చేశారు. ఎర్రచందనం దుంగలు కనిపించాయి. నలుగురు వ్యక్తులు వుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిండ్ర మండలానికి చెందిన దొరవేలు, మంగళంకు చెందిన దిలీప్కుమార్, తేజ, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలానికి చెందిన మస్తాన్లుగా గుర్తించారు. -
అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠా అరెస్టు
చిత్తూరు అర్బన్: తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కార్లను చోరీ చేసే అంతర్రాష్ట్ర ముఠాను పలమనేరు బైపాస్ రోడ్డులోని దండపల్లె క్రాస్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ విక్రాంత్పాటిల్ తెలిపారు. ఆయన చిత్తూరు నగరంలోని పోలీస్ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. వరుస కార్ల చోరీల నేపథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గంగవరం, పలమనేరు బైపాస్, దండపల్లె క్రాస్ల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో కుప్పం నుంచి పలమనేరు వైపు వరుసగా ఏడు కార్లు వస్తుండగా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. కార్లను డ్రైవర్లు వదిలి పరారయ్యారని పేర్కొన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన దినేశ్కుమార్ (32)ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పరారైన దొంగలు ఆరుగురు తమిళనాడు వాసులని విచారణలో తేలిందన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో కార్ల చోరీ దుండగులు ఆగస్టులో వరదయ్యపాళ్యం, శ్రీకాళహస్తి ప్రాంతంలో మూడు ఇన్నోవా కార్లు, సెప్టెంబర్లో విజయవాడలో మారుతి స్విఫ్ట్ కార్లు, బెంగళూరులో ఒక కారును చోరీ చేశారని ఎస్పీ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. దినేశ్కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా నాయకుడు మదురైకి చెందిన పరమేశ్వరన్ను అక్టోబర్ 16న వి.కోటలో అరెస్టు చేసినట్లు తెలిపారు. పరమేశ్వరన్ భార్య విజయలక్ష్మీ, దినేశ్కుమార్, దేవ పథకం ప్రకారం కార్లను చోరీ చేసి చెన్నై కొరత్తూరులోని సెకండ్ హ్యాండ్ షోరూమ్లో విక్రయిస్తున్నారని వివరించారు. ఆర్సీ నెంబర్లు, చాయిస్ నంబర్లను కూడా మార్చి చోరీ చేసిన కార్లను సులువుగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ద్విచక్ర వాహనానికి ఉండాల్సిన నంబర్లు కార్లకు, కార్లకు ఉండాల్సిన నంబర్లు ద్విచక్ర వాహనాలకు ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో పరారైన మిగతా ఆరుగురు నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అనంతరం ముఠాను పట్టుకోవడానికి అధికారులతో పాటు కృషి చేసిన పలమనేరు క్రైమ్ పార్టీ హెడ్కానిస్టేబుల్ దేవరాజులురెడ్డి, శ్రీనివాసులునాయుడు, గజేంద్ర, జయకృష్ణ, కానిస్టేబుళ్లు ప్రకాశ్నాయుడు, సతీశ్, జ్ఞానప్రకాశ్, అల్లావుద్దీన్, వెంకటేశ్, గౌస్, ఎల్లప్ప, విశ్వనాథ్, సురేష్, హెచ్జీ శివ, లోకనాథ్ లను ఎస్పీ అభినందించారు. -
తమిళ ప్రేమజంట ఆత్మహత్య
వారు ఇద్దరూ నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. కులం కూడా ఒక్కటే కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారని భావించారు. వరుసకు బావ అయ్యే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని యువతిపై తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. పెద్దలను ఒప్పిం చేందుకు ప్రేమజంట ఎన్నిసార్లు ప్రయత్నించినా వారి మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమజంట మృత్యువులోనైనా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కుప్పం రైల్వే స్టేషన్లో బుధవారం జరిగింది. చిత్తూరు, కుప్పం రూరల్ : పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేణిగుంట రైల్వే ఎస్ఐ అనీల్కుమార్, కుప్పం హెడ్కానిస్టేబుల్ నాగరాజు కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా అత్తిమాంజేరి గ్రామానికి చెందిన కె.ఎస్.హేమంత్కుమార్ (22), అదే గ్రామానికి చెం దిన జి.ఎస్. మోనీషా (19) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవా రు. రెండు నెలల క్రితం ఇద్దరి తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయాలని కోరారు. పెళ్లికి మోనీ షా తల్లిదండ్రులు నిరాకరించారు. మంచి ఉద్యోగం లేని హేమంత్కుమార్తో పెళ్లి కుదరదని ఖరాకండిగా చెప్పారు. వరుసకు బావ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ప్రాణప్రదంగా ప్రేమించిన హేమంత్కుమార్ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని మోనీషా తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు కూడా అంతే ప్రతిఘటించారు. దీంతో మనస్తాపానికి చెందిన హేమంత్కుమార్, మెనీషా మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి రైలులో కుప్పం రైల్వేస్టేషన్ చేసుకున్నారు. రాత్రి 12 గం టలకు ఫ్లాట్ఫాం టికెట్టు తీసుకుని రైల్వేస్టేషన్లోనే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున దళవాయికొత్తపల్లి రైల్వేగేటు సమీపంలోని రైలు పట్టాలపై విగతవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడి పరిస్థితిని బట్టి ఇద్దరూ పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రేణిగుంట రైల్వే ఎస్ఐ అనీల్కుమార్ చెప్పారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
చిత్తూరు, తొట్టంబేడు: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తొట్టంబేడు మండలం చిన్నకన్నలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ఐ జయశ్యామ్ కథనం మేరకు.. చిన్నకన్నలి గ్రామానికి చెందిన కిలారి రామానాయుడు, ఆయన భార్య స్వప్న(36) మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలో స్వప్న మంగళవవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్మార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
చిత్తూరు, తిరుపతి క్రైం: సాధారణ ప్రయాణికుల్లా నటిస్తూ బస్సులు, బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో మహిళల హ్యాండ్ బ్యాగులు, పర్సులు చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు క్రైం అడిషనల్ ఎస్పీ డి.సిద్ధారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. టీటీడీకి చెందిన మాధవం వసతి సముదాయాల సమీపంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నట్టు సమాచారం అదిందన్నారు. క్రైం డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ భాస్కరెడ్డి బృందం అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. విచారణలో వారు కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురానికి చెందిన సముద్రాల ఫిలిప్స్ భార్య బత్తల వెంకటరమణమ్మ అలియాస్ సముద్రాల సంగీత (22), పీట్ల సుధాకర్ కుమారై పీట్ల అనిత(19)గా తేలిందని పేర్కొన్నారు. వీరు హైదరాబాద్, రాజంపేట, తిరుపతి, తిరుమల తదితర నగరాల్లో చోరీలు చేసి అరెస్టయ్యారని తెలిపారు. పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు అనేక కేసుల్లో నిందుతులుగా ఉండి తప్పించుకొని తిరుగుతున్నారని తెలిపారు. వీరిపై తిరుపతిలోని స్టేషన్లతోపాటు కడపలోనూ కేసులు ఉన్నట్టు తెలిపారు. వారి నుంచి రూ.8.73 లక్షల విలువ చేసే 286 గ్రాముల బంగారు నగలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి కృషిచేసిన సిబ్బందిని అభినందించారు. -
దళితులపై దాడికి మరోసారి నాని అనుచరుల యత్నం
తిరుపతి రూరల్: పులివర్తి నాని అనుచరులు దళితుడిపై దాడి చేసి మూడు రోజులు అవుతున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు, దళితులు గురువారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ ఓటేరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేడ్కరా.. నువ్వు రాసిన రాజ్యాంగాన్ని నువ్వే కాపాడు, దళితులకు రక్షణ కల్పించు అంటూ వేడుకున్నారు. ఆ సమయంలో పులివర్తి నాని అనుచరులు పలు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. వినతి పత్రాలతో ఏం పీకుతారురా? ప్రభుత్వం మాదిరా.. మొన్న వాడిని తన్నినా మీకు బుద్ధిరాలేదా? మరో నిమిషం ఇక్కడే ఉంటే మిమ్మల్ని తరిమికొడతాం.. అంటూ హెచ్చరించారు. వినతి పత్రం అందించేందుకు వచ్చిన వారిపై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించారు. శాంతియుతంగా కార్యక్రమం చేసుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడడం మంచిది కాదని పోలీసులు నిలదీశారు. నాని అనుచరులు పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు. మాకే నీతులు చెబుతారా? అంటూ దుర్భాషలాడారు. నిరసన తెలుపుతున్న వారిపై దాడికి యత్నించారు. చివరి నిమిషంలో పరిస్థితిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వారు దాడికి తెగబడేవారే. నాని అనుచరుల వ్యవహార శైలిని చూసిన పోలీసులు, పరిస్థితి చేయి దాటుతుందని అప్రమత్తమయ్యారు. వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. దళితులు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులపై నాని అనుచరులు దౌర్జన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఈ దౌర్జన్యాలు ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు రాకపోతే మా పరిస్థితి ఏమిటి? దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. ఇంతలోనే నాని అనుచరులు మాపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. కులం పేరుతో దూషించా రు. పోలీసులు లేకపోతే మాపైనా దాడి చేసేవారు. వీరి దౌర్జన్యాలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం లో ఉన్నామా? అని సందేహంగా ఉంది. ప్రశాంత చంద్రగిరిలో రౌడీ రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దౌర్జన్యం చేసిన వారితోపాటు చేయిం చిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తాం. – దామినేటి కేశవులు, మల్లారపు వాసు,వెంకటరమణ, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకులు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు తిరుచానూరు: శాంతియుతంగా అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న తమపై దౌర్జన్యానికి పాల్పడి కులం పేరుతో దూషించిన పులిపర్తి నాని అనుచరులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, జిల్లా దళిత నాయకుడు మల్లారపు వాసు పోలీసులను కోరారు. వారు గురువారం రాత్రి తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ చంద్రగిరి మండలంలోని మొరవపల్లికి చెందిన దళితుడు రవిని పులివర్తి నాని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. దీనికి నిరసనగా గురువారం ఉదయం తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఆ సమయంలో పులివర్తి నాని అనుచరులు, టీడీపీ తిరుపతి రూరల్ అధ్యక్షుడు చెరుకుల జనార్దన్ యాదవ్, ఇస్మాయిల్తో పాటు మరికొందరు తమపైకి దూసుకొచ్చారని పేర్కొన్నారు. కులం పేరుతో దుర్భాషలాడారని తెలిపారు. మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు. అక్కడే ఉన్న పోలీసులు చొరవ తీసుకుని తమకు రక్షణ కల్పించి, వారిని అక్కడి నుంచి పంపించారని వివరించారు. పులివర్తి నాని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. -
అందని పోస్ట్మార్టం రిపోర్టు
చిత్తూరు, శ్రీకాళహస్తి : ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమై 48గంటలు గడిచినా పోస్ట్మార్టం నివేదిక రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నివేదిక ఎందుకు ఆలస్యమవుతుందో ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. రిపోర్ట్ వస్తేగాని కేసును వేగవంతం చేయలేమని పోలీసులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్ల పురెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన భార్య బుజ్జమ్మ, బిడ్డలు భవ్య, నిఖిల్ ఎందుకు చనిపోయారో అంతుపట్టక అటు కుటుంబ సభ్యులు, ఇటు గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు. అప్పుల బాధతో మృతి చెందారా లేదా గీజర్ గ్యాస్ లీకై ఏర్పడిన ప్రమాదంతో చనిపోయారా..లేదా మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది మిస్టరీగా మారింది. ఘటనకు రెండు రోజుల క్రితం మనవరాలు భవ్య తమ తాత బలరామరాజుకు ఫోన్ చేసి ‘తాతయ్య నాకు చాలా భయంగా ఉంది... నాన్న చనిపోదామని చెబుతున్నారు’ అంటూ రోదించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుమార్తె బుజ్జమ్మ కూడా తండ్రితో అదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అప్పుల వేధింపులతోనే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి పాపానాయుడుపేటలో చిన్నపాటి అద్దె గదిలో కాపురం ఉండేవాడు. పెద్ద మొత్తంలో చీటీలు వేసి, వాటిని ముందే పాడేసి ఆ డబ్బుతో ఇంటిస్థలం కొనుగోలు చేయడమేగాక ఇల్లు కట్టడానికి పెద్దమొత్తంలో అప్పులు చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆటో ద్వారా వచ్చే ఆదా యం తగ్గిపోవడంతో ప్రతినెలా చీటీలకు నగదు చెల్లించలేకపోయాడని, ఈ క్రమంలో కొత్త అప్పులు చేసేవాడని చెబుతున్నారు. కొందరు తమ బాకీలు వెంటనే చెల్లించాలని పట్టుపట్టడంతో దిక్కుతోచని స్థితిలో శ్రీనివాసులురెడ్డి సక్రమంగా ఇంటికి రావడం మానేశాడని... వచ్చినా ముభా వంగా ఉండేవాడని అంటున్నారు. ఈ క్రమంలోనే భార్యాబిడ్డలు భయంతో బలరామరాజుకు సమాచారం ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అప్పుల బాధ భరించలేక శ్రీనివాసులురెడ్డి గీజర్ గ్యాస్ పైపుల లీకేజీతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అధికారులు నివేదికలు అర్బన్ ఎస్పీ అన్బురాజన్కు అందజేయనున్నారు. దాంతో వాస్తవాలు వెలుగుచూడనున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళం వేసి ఉంచారు. -
పెరుగుతున్న చీటీల మోసాలు
కొందరు చీటీల పేరుతో అమాయకులను నిలువునా మోసం చేస్తున్నారు. దీపావళి చీటీ.. సంక్రాంతి చీటీ..అయ్యప్పస్వామి చీటీ, అమావాస్య చీటీ.. పౌర్ణమి చీటీ అంటూ గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులు డబ్బులు చెల్లించి నమ్మకం ఏర్పరుచుకుంటున్నారు. తర్వాత లక్షలు తీసుకుని కనిపించకుండాపోతున్నారు. దీంతో అమాయకులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చిత్తూరు, పిచ్చాటూరు:పిచ్చాటూరు పట్టణంలో పది రోజుల క్రితం దీపావళి చీటీ వేసిన మాలిక్ వెయ్యి కుటుంబాలను మోసం చేసి రూ.70 లక్షలతో పరారయ్యాడు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన షఫీ చీటీలు వేసి సుమారు రూ.50 లక్షలతో ఉడాయించాడు. వారి ఆచూకీ తెలియకపోవడంతో భాధితులకు కన్నీరే మిగిలింది. మాయమాటలతో బురిడీ సాధారణంగా చీటీల వ్యాపారం చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కొంద రు ప్రజల అవసరాలు, వారి అమాయక త్వాన్ని ఆసరాగా తీసుకుని చీటీల వ్యాపారం చేస్తున్నారు. వారికి అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో చీటీలు వేసి ప్రారంభంలో నష్టం వచ్చినా పెట్టుబడి అనుకొని సభ్యులకు మొత్తాన్ని సక్రమంగా ఇస్తూ వారికి నమ్మకం కలిగేలా చేస్తారు. అందరికీ నమ్మ కం వచ్చి ఎక్కువ మంది చీటీలో చేరి భారీ మొత్తంలో డబ్బులు పోగయ్యాక తమ చేతివాటం చూపిస్తున్నారు. రాత్రికి రాత్రి డబ్బులతో ఉడాయిస్తున్నారు. బాధితులు ఎంత గగ్గోలు పెట్టినా డబ్బులు మాత్రం తిరిగిరావు. అక్రమ చీటీ వ్యాపారులపైకఠినంగా వ్యవహరించాలి ఎక్కడైనా అక్రమంగా చీటీలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పొదుపు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చీటీలు వేస్తే ఇలా డబ్బులతో ఉడాయించడంపై మండిపడుతున్నారు. ఇకపై చీటీలు వేసే వారితో కఠినంగా వ్యవహరించి అనుమతి లేకపోతే చర్యలు చేపట్టాలని ప్రజలు పోలీసులకు విజ్నప్తి చేస్తున్నారు. ప్రజలను చైతన్యపరచాలి చీటీ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచాలని మేధావులు అంటున్నారు. అన్నీ తెలిసి ఓ స్థాయిలో ఉన్న డాక్టర్లు, ఇంజినీర్లే మోసపోతున్నారని, ఇక గ్రామీణ ప్రజలను బురిడీ కొట్టించడం చీటీ వ్యాపారస్తులకు పెద్ద పనేంకాదని పరిశీలకులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీటీ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపడం ద్వారానే చీటీల వ్యవస్థను సమూలంగా నిర్మూలించవచ్చని వారు చెబుతున్నారు. చీటీల మోసంపై పోలీసుల విచారణ పిచ్చాటూరు:మండల కేంద్రమైన పిచ్చాటూరులో వెలుగులోకి వచ్చిన మాలిక్ చీటీల మోసంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు స్థానిక ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ‘చీటీల చీటింగ్’ అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్ఐ రెండు రోజుల్లో చీటీలు వేసిన వారి వివరాలు, మాలిక్ కుటుంబం నేపథ్యం తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విచారణ చేపడతామని తెలిపారు. చీటీల నిర్వాహకుడుమాలిక్పై ఫిర్యాదు దీపావళి చీటీల నిర్వాహకుడు మాలిక్పై పిచ్చాటూరుకు చెందిన కె.శాంతి అనే మహిళ శుక్రవారం సాయంత్రం పోలీ సులకు ఫిర్యాదు చేశారు. తాను 33 మందితో చీటీలు కట్టిం చా నని, ప్రతి నెలా ఒక్కొక్కరి నుంచి రూ.9950 చొప్పున 33 మంది నుంచి వసూలు చేసి డబ్బు మాలిక్కు ఇచ్చినట్టు తెలిపారు. ఈ లెక్కన ఇప్పటి వరకు రూ.1,19,400 అతనికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. అతను వస్తువులు ఇవ్వకుండా పారిపోవడంతో సభ్యులు తన ఇంటిని ముట్టడించే పరిస్థితి తలెత్తిందన్నారు. మాలిక్పై కేసు నమోదు చేయడంతో పాటు అతని ఆచూకీ తెలుసుకుని న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా ఇంకా బాధితులు ఫిర్యాదు చేయడానికి సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. -
చీటీలతో చీటింగ్
చిత్తూరు, పిచ్చాటూరు: రూ.70 లక్షల చీటీ డబ్బులతో ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల కథనం..స్థానిక బజారు వీధికి చెందిన మాలిక్ అనే యువకుడు ట్యూషన్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ట్యూషన్కు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిగిన పరిచయాలతో ఐదేళ్ల క్రితం ‘ఎస్ఎస్. మార్కెటింగ్ దీపావళి సేవింగ్ ఫండ్’ పేరిట చీటీల వ్యాపారం మొదలు పెట్టాడు. ప్రతి నెల రూ.200, రూ.300, రూ.550 కట్టేలా మూడు చీటీలు నిర్వహించేవాడు. ఏదో ఒక చీటీని ఎన్నుకుని నెల నెలా డబ్బులు ఇచ్చేవాడు. ఇలా పోగు చేసిన డబ్బులతో మాలిక్ దీపావళి నాటికి అవసరమైన వంటనూనె, చక్కెర, పప్పు, పిండి, టపాసులు పంపిణీ చేసేవాడు. ప్రతి నెలా రూ.550 కట్టే వారికి 2 గ్రాముల బంగారం, 10 గ్రాముల వెండి కూడా ఇచ్చేవాడు. తీసుకున్న డబ్బులకు సక్రమంగా వస్తువులు పంపిణీ చేస్తుండడం, దీనికి తోడు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సొంత ఇల్లు కూడా ఉండటం, స్థానికుడు కావడంతో ప్రజలు మాలిక్ను నమ్మి చీటీలు వేశారు. పదుల సంఖ్య నుంచి చీటీ సభ్యుల సంఖ్య ఇటు ఆంధ్ర, తమిళనాడులో వెయ్యికి పైగా చేరింది. నమ్మకం కొద్దీ స్థానికులు తమతో పాటు తమిళనాడులోని తమ బంధువులతో కూడా చీటీలు కట్టించారు. సభ్యులు ఎక్కువ కావడంతో మాలిక్ కింద కొంత మందిని సబ్ ఏజెంట్లను నియమించుకున్నాడు. 10 చీటీలు కట్టించిన వారికి ఒక చీటీ ఉచితం అనే ఆఫర్ పెట్టాడు. ఈ ఆఫర్తో సబ్ ఏజెంట్లు ఎక్కువయ్యారు. గత నెల 29 నుంచి అజ్ఞాతంలోకి.. మాలిక్ గుట్టుచప్పుడు కాకుండా గత నెల 29 నుంచి అదృశ్యమయ్యాడు. దీపావళి పండుగ ఉండటం వస్తువులు కొనుగోలు నిమిత్తం వెళ్ళి ఉంటాడని చీటీల సభ్యులు భావించారు. కానీ దీపావళి దాటినా అతని ఆచూకీ లేకపోవడం, మొబైల్ స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో అనుమానం రేకెత్తించింది. ఆరా తీస్తే చీటీ డబ్బులతో ఉడాయించిన సంగతి వెలుగులోకి రావడంతో లబోదిబోమంటున్నారు. సబ్ ఏజెంట్లపై ఒత్తిడి మాలిక్ చీటీ డబ్బులతో పరారవడంతో సబ్ ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు సబ్ ఏజెంట్లు, బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మాలిక్పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబాన్నీ మోసం చేశాడు మాలిక్కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహమైంది. మాలిక్ తండ్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ముగ్గురికీ పెళ్లిళ్లయ్యాయి. అతని తండ్రి గత ఏడాది కుటుంబంలో భాగ పరిష్కారం చేసి ఆస్తులను పంపిణీ చేసినట్లు సమాచారం. తనకు తండ్రి పంచిన ఆస్తులన్నింటినీ ఇప్పటికే అమ్మేసినట్లు తెలిసింది. చివరికి కట్టుకున్న భార్యను, తల్లిదండ్రులను, సోదరుని కుటుంబాన్ని సైతం ఇక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాధితులు డబ్బులకోసం మాలిక్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తుండడంతో వారికి దిక్కు తోచడం లేదు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న మాలిక్ తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించి ఆసుపత్రిపాలయ్యాడు. దీపావళిని చీకటి చేశాడు మాలిక్ ఫండ్ చీటీల పేరిట వెయ్యికి పైగా కుటుంబాల్లో చీకట్లు నింపాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతని మోసంపై పోలీసులకు తెలియజేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని వాపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది మహిళలకు మాయమాటలు మాలిక్ నగలు, డబ్బు తీసుకెళ్లినట్లు సమాచారం. స్థానికంగా పూల వ్యాపారం చేసే ఓ వ్యక్తికి రూ.7 లక్షల వరకు చీటీ డబ్బులు మాలిక్ ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ఇలా మాలిక్ సుమారు కోటి రూపాయల వరకు కాజేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ మాలిక్ అదృశ్యం కావడానికి రెండు రోజుల క్రితం స్థానిక సినిమా థియేటర్లో పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మాలిక్తో పాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే రోజు రాత్రి వరకు మాలిక్తో పాటు పేకాటలో పాల్గొన్న మరో ఆరుగురిని స్టేషన్లో విచారణ చేసి పంపించినట్లు తెలిసింది. ఇలా పేకాట, మందు, ఇతర వ్యసనాలు మాలిక్కు ఉన్నట్లు తెలిసింది. -
దంపతుల దుర్మరణం
దీపావళి పండుగను పుట్టినింటిలో జరుపుకోవాలని ఆమె భావించింది. కజ్జాలు తయారు చేసింది. భర్తకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇద్దరూ కలిసి సంతోషంగా కారులో బయలుదేరారు. క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ కానరాని లోకాలకు చేరుకున్నారు. దీంతో రెండు కుంటుంబాల్లో విషాదం నెలకొంది. చిత్తూరు , పూతలపట్టు: చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిలోని సోమవారం కారును మరో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. పులిచెర్ల మండలం కామవరం కొత్తపేటకు చెందిన రమేష్బాబు(59), అనూరాధ(47) దంపతులు తిరుచానూరులోని నారాయణపురం వీధిలో నివాసం ఉంటున్నారు. రమేష్బాబు తొట్టంబేడు మండలం కాసరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం మంగళ, బుధవారాలు పాఠశాలలకు సెలవు ఇచ్చింది. దీంతో అనూరాధ కజ్జాలు చేసుకుని పుట్టినిల్లు అయిన బంగారుపాళెంకు భర్తతో కలిసి కారులో సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. కారును రమేష్బాబు నడుపుతున్నాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పుదుకోటైకి చెందిన రామన్(76), అతని కుటుంబ సభ్యులు చక్రవర్తి(39), విజయలక్ష్మి(33), సెల్వమణి(60), కావ్య(10) టవేరా కారును అద్దెకు తీసుకుని తిరుమలకు బయలుదేరారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద రమేష్బాబు ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టవేరా కారును ఢీకొన్నాడు. టవేరా కారు రోడ్డు పక్కకు దిగింది. రమేష్బాబు దంపతులు వెళుతున్న కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన రమేష్బాబు, అనూరాధ అక్కడికక్కడే మృతి చెందారు. టవేరా కారులో ఉన్న డ్రైవర్తోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎస్ఐ మల్లేష్యాదవ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హైవే పట్రోలింగ్ వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి పంపించారు. వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. రమేష్బాబు, అనూరాధ మృతదేహాలను తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పాకాల సీఐ హరినాథ్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పూతలపట్టు మండలానికి చెందిన 108 వాహనం మరమ్మతులకు గురికావడంతో ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతివేగంతోనే ప్రమాదం సాధారణంగా ఆల్టో కారులో డ్రైవర్ సీటు, పక్క సీటు ఎదురుగా బెలూన్లు ఉండవు. అందువల్ల 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వెళ్లరాదు. ప్రమాద సమయంలో రమేష్ బాబు వేగంగా వెళ్లడంతోనే కారు కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు అభిప్రాయపడ్డారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
చిత్తూరు , తంబళ్లపల్లె : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ఇంటిలోనే చంపేసింది. ప్రియుడి సహకారంతో పాతిపెట్టింది. భర్త అదృశ్యమయ్యాడని నాటకం ఆడింది. ఐదు నెలల తర్వాత పోలీసులు మిస్టరీని ఛేదించారు. ములకలచెరువు సీఐ శ్రీనివాసులు సోమవారం ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తంబళ్లపల్లె మండలం కోట కొండ పంచాయతీ ఎగువతండాకు చెందిన రమణమ్మ(45)కు, అదే పంచాయ తీ బందార్లపల్లెకు చెందిన మదన్మోహన్రెడ్డితో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. రమణమ్మ భర్త బుక్యామారూనాయక్ (60) ఈ విషయమై మందలించేవాడు. దీంతో విసుగు చెందిన రమణమ్మ భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే నెల 25వ తేదీన ఇంటిలోనే మద్యం తాగుతున్న భర్తతో గొడవపడింది. ఓ పథకం ప్రకారం ఇంటిలో ఉన్న గడువు తీరిన పలురకాల మాత్రలను పొడి చేసి మద్యంలో కలిపి భర్తకు తాగించింది. అత ను అపస్మారక స్థితిలోకి చేరుకోగానే చంపేసింది. ఈ విషయాన్ని ప్రియుడు మదన్మోహన్రెడ్డికి ఫోన్లో సమాచారం అందించింది. అదేవిధంగా కోసువారిపల్లె పంచా యతీ చిన్నప్పరెడ్డిగారిపల్లెకు చెందిన సుబ్బారెడ్డికి ఎగువతండాలోని మరో మహిళతో వివాహేతర సంబంధం కల్పిం చేందుకు రమణమ్మ సహకరించింది. దీం తో రమణమ్మ అతని సహకారం కోరింది. ప్రియుడు మదన్మోహన్రెడ్డి, సుబ్బారెడ్డి ఇద్దరూ తండాకు చేరుకుని అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని సంచిలో మూట కట్టి ట్రాక్టర్లో తీసుకెళ్లి రేణిమాకులపల్లె పంచాయతీ జోగువానిబురుజు సమీపంలోని ఈదలవంక వాగులో పాతిపెట్టారు. అదే నెల 29వ తేదీ రమణమ్మ, కుమారు డు హరినాయక్తో కలిసి మారూనాయక్ అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానితులను విచారించినా ప్రయోజనం లేదు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శివకుమార్ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్కాల్స్ ద్వారా నిందితులను గుర్తించి అదృశ్యమైన వ్యక్తిని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రమణమ్మ పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆదివారం ఆర్ఐ బాలాజీ వద్ద లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఆదివారం సాయంత్రం తంబళ్లపల్లె గ్యాస్ గోడౌన్ వద్ద ఉన్న మదన్మోహన్రెడ్డి, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. మారూనాయక్ మృతదే హానికి సంఘటన స్థలంలోనే తహసీల్దార్ సురేష్బాబు సమక్షంలో సోమవా రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులు రామచంద్రప్రసాద్రావు పోస్టుమార్టం చేశారు. నిందితుల కాల్ డేటా సేకరించేందుకు చేసిన కృషి చేసిన ఐడీ పార్టీ పోలీసులు వెంకటేష్, సిరాజ్, శ్రీకాంత్ను అభినందించి నగదు రివార్డు అందజేశారు. ములకలచెరువు ఎస్ఐ ఈశ్వరయ్య, పెద్దతిప్పసముద్రం ఎస్ఐ రవికుమార్ ఉన్నారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
కురబలకోట: కురబలకోట మండలంలోని రైల్వే స్టేషన్ బస్టాప్ సమీపంలో లారీలో తరలిస్తున్న ఎ ర్రచందనాన్ని ముదివేడు పోలీసులు పట్టుకున్నారు. గురువారం కడప నుంచి బెంగళూరుకు ఎర్రచందనంతో వెళుతున్న ఈలారీని హైజాక్ చేసేందుకు బొలెరోలో వచ్చిన మరికొందరు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా ఊహించని విధంగా పోలీసులకు చిక్కారు . 4,253 కిలోల బరువున్న 146 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ముగ్గురు స్మగ్లర్లు పరారు కాగా డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. జిల్లాలో పెద్ద ఎత్తున ఎర్రచందనం పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీఐ మురళీ కృష్ణ, ఎస్ఐ నెట్టి కంఠయ్య, స్థానిక పోలీసులను అభినందించారు. గురువారం రాత్రి ఆయన ముదివేడు స్టేషన్లోని ఎర్రచందనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘కడప నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నట్లు ముదివేడు పోలీసులకు సమాచారం వచ్చింది. కురబలకోట రైల్వే స్టేషన్ బస్టాప్ సమీపంలో లారీని పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ఎన్. రాజును అరెస్టు చేశాం. ఇతను కర్ణాటకలోని అత్తులూర్లోని నార్త్కోడ్కు చెందినవాడు. ఎర్రచందనం తరలిస్తున్న లారీ నంబరు కూడా కర్ణాటకకు చెందినదే. లారీని సీజ్ చేసి స్మగ్లర్ల కోసం దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ పేర్కొన్నారు. హైజాక్ చేసి... కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఎర్రచందనం లారీని బొలోరా వాహనంలో వెంటాడిన స్మగ్లర్లు హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. కురబలకోట రైల్వే బస్టాప్ సమీపంలో ఈ లారీకి బొలెరో వాహనాన్ని అడ్డుపెట్టి హైజాక్ చేశారు. అదే సమయంలో ఖాకీ డ్రస్సులో డ్యూటీకి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ను పోలీసుగా భావించి అటు లారీలోని వారు ఇటు బొలేరోలో వచ్చిన హైజాక్ ముఠా పరారయ్యారు. విషయాన్ని పసిగట్టి ఆర్టీసీ డ్రైవర్ ముదివేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి లారీని తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది. జిల్లా ఎస్పీకి తొలికేసు..!! జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం చిత్తూరులో బాధ్యతలు స్వీకరించారు. తొలి రోజే భారీ ఎర్రచందనం లారీ ముదివేడు పోలీసులకు పట్టుబడింది. ఇంత భారీ స్థాయిలో ఎర్రచందనం పట్టుబడటం ఇదే తొలిసారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
చిత్తూరు, తిరుపతి క్రైం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం తిరుపతి నగరం కొర్లగుంటలో జరిగింది. ఈస్ట్ సీఐ చంద్రబాబునాయుడు కథనం మేరకు.. కొర్లగుంటలో నివాసముంటున్న ప్రకాష్, కమల దంపతుల కుమార్తె లావణ్య(20)ను చిత్తూరు సమీపంలోని బొడేవారిపల్లెకు చెందిన నిర్మల, ఆంజనేయులు దంపతుల కుమారుడు ఈశ్వర్(25) మైనర్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు దూరంగా కొర్లగుంటలోని ప్రశాంత్ స్కూల్ సమీపంలో కాపురం పెట్టారు. వీరికి భవ్య(3) కుమార్తె ఉంది. ఈశ్వర్ కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అతను కొంతమంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు భార్య గుర్తించింది. దీనిపై భర్తను నిలదీసేది. దీంతో ఈశ్వర్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. శనివారం రాత్రి కూడా భార్య, భర్త గొడవపడ్డారు. అనంతరం ఏమి జరిగిందేమోగానీ ఉదయం లేచి చూసే సరికి లావణ్య ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ, ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి, ఐద్వా లక్ష్మీ సంఘటన స్థలానికి చేరుకుని లావణ్యను భర్త ఈశ్వర్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వేధింపులకే ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. -
వేశ్యాగృహానికి అమ్మేశారు
చిత్తూరు, మదనపల్లె క్రైం : అయిన వాళ్లే తనను మోసగించి ముంబయిలోని వేశ్యాగృహానికి అమ్మేశారని, ఏడాదిన్నరపాటు అక్కడ చిత్రహింసలు అనుభవించి ఎలాగో తప్పించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చానని బాధితురాలు వాపోయింది. ఆమె గురువారం తనకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీ చిదానందరెడ్డికి ఫిర్యాదు చేసింది. మదనపల్లె డివిజన్లోని కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన యువతి (25)ని ఆరేళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన మల్లికార్జునకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు వంశీ పుట్టాడు. ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల తర్వాత సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ మఠంవడ్డిపల్లెకు చెందిన దంపతులు సల్లాపురి, యల్లమ్మ కుమారుడు రెడ్డెప్పను రెండో వివాహం చేసుకుంది. వీరు కొంత కాలానికి మదనపల్లె అనపగుట్టలో స్థిరపడ్డారు. ఆ సమయంలో రెడ్డెప్ప తండ్రి సల్లాపురి చనిపోవడంతో తిరిగి మకాంను స్వగ్రామానికి మార్చాడు. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో వరుసకు మరిది అయిన నరసింహులు, అతని భార్య అరుణ కలిసి రెడ్డెప్ప ఇంటిలో లేని సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చారు. మెలకువ వచ్చి చూడగా ముంబయిలోని వేశ్యం గృహంలో ఉంది. ఏడాదిన్నరపాటు వేశ్యావృత్తిలో చిత్రహింసలు అనుభవించింది. అదేవిధంగా మరో ముగ్గురు మహిళలు వైశ్యాగృహం నుంచి తప్పించుకోబోయి నిర్వాహకులు తీసిన కరెంటు ఉచ్చులో పడి మృతి చెందారని బాధితురాలు తెలిపింది. దీంతో భయపడి తాను తప్పించుకోవడానికి మార్గాలు వెతికి ఆరు రోజుల క్రితం అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలిపింది. అనంతరం భర్త ఉన్న చోటును తెలుసుకుని జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో సీపీఐ నాయకుల సహాయంతో ఇక్కడికి వచ్చినట్టు పేర్కొంది. తనలాగా మరెందరో మహిళలు వేశ్యాగృహాల్లో మగ్గుతున్నారని కన్నీటిపర్యంతమైంది. స్పందించిన డీఎస్పీ కిడ్నాప్ చేసిన ప్రాంతం సోమల మండలానికి చెందినది కావడంతో అక్కడి డీఎస్పీ, సీఐలతో మాట్లాడి బాధితురాలిని సోమలకు పంపారు. -
తరలిపోతున్న ఎర్ర బంగారం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని అడవుల్లో ఉన్న అరుదైన ఎర్రచదనం స్మగ్లర్ల పాలవుతోంది. ఈ అక్రమ రవాణా గత 30 ఏళ్లకు పైగా జరుగుతూనే వుంది. ఎక్కువగా తమిళనాడు రా ష్ట్రం జవ్వాదిమలై కొండల్లోని గిరిజన తెగలకు చెం దిన వేల కుటుంబాలు ఈ చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎం తోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏస్థాయిలో ఏవిధంగా ఎలాంటి వారు ఈ రవాణాలో పాల్గొంటారనే దానిపై స్పష్టత రావడం లేదు. ఎర్రచందనానికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పడిన తర్వాత కొంతవరకు అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. అయితే స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తమార్గాలను అన్వేషిస్తూ.. ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ ఐజీ డాక్టర్ మాగంటి కాంతా రావు ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దశలవారీగా అక్రమ రవాణా మూలాలను గుర్తించారు. ఆ వివరాల ప్రకారం ఎర్రచందనం సంపద ఏడు దశల్లో స్మగ్లర్లు నిర్వహిస్తున్నారు. రవాణా ఇలా.. మొదటిదశలో తమిళనాడులోని అటవీప్రాంతాల్లో చెట్లను నరకడంలో సిద్ధహస్తులైన గిరిజన తెగలకు చెందినవారికి నగదు ఆశ చూపించి ఇక్కడికి రప్పిస్తారు. రెండవ దశలో గిరిజన తెగలకు చెందిన వారు నరికిన దుంగల బరువుకు తగిన విధంగా అడవుల్లోనే నగదు చెల్లింపులు చేస్తారు. ఈ దశలో మేస్త్రి కీలకపాత్ర పోషిస్తాడు. మూడవ దశలో నరికిన దుంగలను మేస్త్రి చెప్పినచోటకు చేర్చి అక్కడ ఏర్పాటు చేసిన వాహనంలో లోడ్ చేయడంతో తమిళనాడు స్మగ్లర్ల పని సమాప్తమవుతుంది. లోడ్ చేసిన వాహనాన్ని అనుకున్న చోటకు చేర్చడంలో వాహన డ్రైవర్కు.. పైలెట్గా వ్యవహరించే వ్యక్తి సమాచారం అందిస్తారు. నాల్గవ దశలో వాహనాన్ని తీసుకెళ్లడం, లోడ్ చేసిన వాహనాన్ని గమ్యస్థానం చేరేవరకు వివిధ రకాల వ్యూహాలను అనుసరించే ట్రాన్స్పోర్టర్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఐదవదశలో వాహనంలో వచ్చిన ఎర్రచందనం దుంగలను గోడౌన్లలో భద్రపరచడం, వాటిని కాపలా కాసే వ్యక్తి గోడౌన్ కీపర్గా వ్యవహరిస్తాడు. ఆరవ దశలో గోడౌన్ నుంచి విదేశాలకు పంపేందుకు కావాల్సిన అనుమతులు సృష్టించడం, దానికోసం లంచాలు ఇచ్చి విదేశాలకు ఎగుమతి చేయడంలో ఎక్స్పోర్టర్ కీలకపాత్ర పోషిస్తాడు. ఇక ఏడవ దశలో ఎక్స్పోర్టర్ పంపిన దుంగలను అందుకుని వాటిని విక్రయిం చే ఇంటర్నేషనల్ స్మగ్లర్ చివరగా పని పూర్తి చేస్తాడు. ఈ విషయాన్ని టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు తన బృందంతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపొందించారు. దుంగలను స్మగ్లింగ్ చేసే క్రమంలో ఒకవ్యక్తికి.. మరో వ్యక్తి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం ఇందులో గమనించాల్సి అంశమని టాస్క్ఫోర్సు పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి అడవుల్లోవాహనాలు కనపడితే.. శేషాచల అటవీ శివార్లు, కరకంబాడీ, మామండురు, జూపార్క్ రోడ్డు, శ్రీవారి మెట్టు, భాకరాపేట తదితర చోట్ల తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన వాహనా లు కనపడితే ఆయా ప్రాంతాల్లో మాటువేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు అప్రమత్తం అవుతా రు. కూంబింగ్ చేస్తున్న సిబ్బంది వెంటనే ఆ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ వాహనాలు ఎక్కడికి వెళ్తున్నాయనే దిశగా పూర్తిస్థాయి నిఘా పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేసి అరెస్టు చేశారు. ఇటీవల అనుమానం వచ్చిన నాలుగైదు వాహనాలను సోదాలు చేయడంతో.. ఎర్రచందనం దుంగలు భారీగా పట్టుబడ్డాయి. ఒక వాహనానికి బీటెక్ చదివిన యువకుడు డ్రైవర్గా వచ్చి పోలీసులకు చిక్కాడు. గతంలోనూ డీగ్రీ, పీజీ చదివిన యువకులు స్మగ్లింగ్ కోసం వచ్చి టాస్క్ఫోర్స్ పోలీసులకు దొరికిపోయారు. -
ముగ్గురి బిడ్డలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం
చిత్తూరు, మదనపల్లె టౌన్ : భార్య మరో వ్యక్తితో వెళ్లి పోవడాన్ని జీర్ణించుకోలేక ఓ వ్యక్తి సోమవారం తన ముగ్గురు బిడ్డలకు విషపు ఆకు గుళికలు మింగించి తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు, ముదివేడు పోలీసుల కథనం మేరకు.. తెట్టు పంచాయతీ ఎలకలవారిపల్లెకు చెందిన బీఏ వెంకటేష్ కుమారుడు సుబ్బయ్య(39), వెంకటమ్మ దపంతులకు కవల పిల్లలు రామక్క(16), లక్షుమక్క(16), చిన్నక్క అలియాస్ చిన్ని(9) బిడ్డలు ఉన్నారు. కవలలు మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా చిన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. సుబ్బయ్య, వెంకటమ్మ గ్రామ సమీపంలోని బండపై కంకర రాళ్లు కొట్టుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. బండ పనిలో కూలీలు గిట్టుబాటు కావడం లేదని వెంకటమ్మ ఏడాదిగా మదనపల్లె టమాటా మార్కెట్ యార్డులో కూలి పనులకు వెళుతోంది. ఈ క్రమంలో వెంకటమ్మకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెలకొంది. ఈ విషయాన్ని ఆరు నెలల క్రితం సుబ్బయ్య చూసి భార్యతో తరచూ గొడవ పడేవాడు. వెంకటమ్మ వారం క్రితం ఆ వ్యక్తితో వెళ్లి పోయింది. దీంతో పెళ్లీడుకొచ్చిన బిడ్డలు మథనపడటం, వారి చదువులకు ఇబ్బందిగా మారడంతో సుబ్బన్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అంతేగాక అవమానంగా భావించాడు. విషం తాగి మూకుమ్మడిగా చనిపోదామని మాట్లాడుకున్నారు. అప్పటికే తెచ్చుకున్న విషపు ఆకుల గులికలను సుబ్బన్న తన ముగ్గురు బిడ్డలకు మింగించాడు. తర్వాత తానూ మింగాడు. వారు కడుపు నొప్పితో పెనుగులాడుతుండగా గమనించిన పక్కింటివారు స్థానిక అమ్మచెరువు మిట్టలో కాపురం ఉంటున్న సుబ్బన్న అన్న బీఏ రాజుకు, 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని నలుగురినీ మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వారికి అత్యవసర చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న రూరల్ సర్కిల్ సీఐ మురళీక్రిష్ణ, ఎస్ఐ నెట్టికంఠయ్య మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కూతుర్ని వేధించినందుకు మర్మాంగాలను వేరు చేశాడు..
ఆయనకు 54 ఏళ్లు. తన కుమార్తెను ఇద్దరు తరచూ వేధిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని జీర్ణించుకోలేకపోయాడు. ఓపిక పట్టాడు. ఆవేశాన్ని దిగమింగుకోలేకపోయాడు. విచక్షణ మరచిపోయి ఇద్దరిని మట్టుబెట్టాడు. పంటకోసే కొడవలితో ఇద్దరి గొంతు కోసి, మర్మాంగాలను వేరుచేసి దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. చిత్తూరు మండలంలోని చెన్నసముద్రంలో ఆదివారం ఈ జంట హత్యలు వెలుగుచూశాయి. చిత్తూరు రూరల్:చిత్తూరు మండలం చెన్నసముద్రం గ్రామంలో జంట హత్యలు కలకలం సృష్టిం చాయి. గ్రామ సమీపంలో ఉన్న చెరుకు తోటలో శనివారం అర్ధరాత్రి లక్ష్మీపతి (55), శేఖర్ (40) హత్యకు గురయ్యారు. ఈ హత్యల ప్రధాన నిం దితుడు కేశవులు (54) ఆదివారం పోలీసు ఎదుట లొంగిపోయాడు. డీఎస్పీ సుబ్బారావు, సీఐలు శ్రీనివాసరావు, ఆదినారాయణ, ఎస్ఐలు భాస్కర్, రాజశేఖర్ తాలూకా పోలీస్ స్టేషన్లో నిం దితుడి అరెస్టు చూపించారు. అనంతరం హత్యకు గల కారణాలను వివరించారు. చిత్తూరు మండలం చెన్నసముద్రం గ్రామానికి చెందిన గంగమందడి కుమారుడు లక్ష్మీపతి(55) పంచాయతీలో పారిశద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి పెళ్లయినా పిల్లలు లేరు. అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శేఖర్ ఆర్టీసీ డ్రైవర్గా కుప్పం డిపోలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శేఖర్ శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని చెన్నసముద్రంకు చేరుకున్నాడు. రాత్రి 7.30 గంటల సమయంలో తన సన్నిహితులైన లక్ష్మీపతి, కేశవులుతో కలిసి సారా తాగేందుకు గ్రామ సమీపంలో ఉన్న చెరుకు తోట కు వెళ్లారు. అక్కడ పూటుగా సారా తాగారు. రాత్రి 10 గంటలు దాటినా వీరు ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతి కారు. ఫలి తం లేదు. పది గంటల తరువాత కేశవులు ఒక్కడే ఊర్లో కనిపించాడు. మిగిలిన ఇద్దరు ఎక్కడని గ్రా మస్తులు ప్రశ్నిస్తే తనకు తెలియదని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి చెరుకు తోటలో శేఖర్, లక్ష్మీపతి విగతజీవులుగా కనిపించారు. కిరాతంగా హతమార్చాడు చెరుకుతోటలో ముగ్గురూ కలిసి పూటుగా మద్యం తాగారు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య మాటామాటా పెరిగింది. కుమార్తెను శేఖర్ లైంగికంగా వేధిస్తున్నాడన్న కోపంతో కేశవులు ఊగిపోయాడు. పచ్చగడ్డి కోసే కొడవలితో గొంతుకోసి హత్య చేశాడు. విషయాన్ని బయటకు చెబుతాడని భావించి లక్ష్మీపతిని కూడా హత్య చేశాడు. అంతటితో ఆగక వారి మర్మాంగాలను వేరు చేశాడు. మృతదేహాలను చెరుకుతోటలోనే పడేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి నేరుగా పోలీసు స్టేషన్కు చేరుకుని లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ, ఏఎస్పీ పరిశీలించారు. అలాగే వేలిముద్రల నిపుణులు కొడవలి, సారా బాటిల్, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మృతుడు శేఖర్పై 2014లో చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్లో మహిళలను అవమానించిన కేసు నమోదైనట్లు దర్యాప్తులో తేలింది. పైగా మద్యం తాగి విధులకు హాజరుకావడంతో అధికారులు గతంలో సస్పెండ్ కూడా చేసినట్లు గుర్తించారు. డ్యూటీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెసుకున్నారు. లక్ష్మీపతి, శేఖర్ మృతదేహాలకు ఆదివారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేశవులును సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. ఈ కేసులో అతని కుమార్తెను కూడా విచారిస్తామని పేర్కొన్నారు. -
ఎర్రచందనం రవాణాకు స్మగ్లర్ల బంపర్ ఆఫర్
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. శేషాచలం అడవుల నుంచి నెల్లూరు జిల్లా మీదుగా కోల్కతా, ఇటు నాలుగో నెంబరు జాతీయ రహదారి మీదుగా కర్ణాటకకు దుంగలను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు లారీలు, టెంపోల్లో తరలిస్తున్న దుండగులు ఇప్పుడు ఏ మాత్రం అనుమానం రాకుండా టమాటా లారీలు, ట్యాంకర్లు, కొరియర్ వాహనాలు, ఆంబులెన్స్లు, లగేజీ ఆటోల్లో దుంగలను తరలిస్తున్నారు. దీన్నిబట్టి వీరికి ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పక్కా సమాచారం ఉంటే తప్ప పోలీసులు ఈ వాహనాలను గుర్తించలేకపోతున్నారు. చిత్తూరు, పలమనేరు: కర్ణాటకాలోని కోలారు, బెంగళూరు, జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల ద్వారా టమాటాల ను కలకత్తాకు ఎగుమతి అవుతున్నా యి. ఈ లారీలు ఎర్రచందనం దుంగల రవాణాకు సురక్షితమని భావించిన స్మగర్లు జిల్లా సరిహద్దులో కాపుకాచి డ్రైవర్లతో మాట్లాడుకుని టమాటా బా క్సుల కింద దుంగలను అమరుస్తున్నారు. మామూలుగా టమాటా లోడు తీసుకెళితే లారీ యజమానికి ఖర్చులు పోను రూ.పది వేలు మిగులు తోంది. ఎర్రచందనం దుంగలను టమాటాలతో కలిపి తీసుకెళితే రూ.5 లక్షలు మిగులుతుందనే ఆశ పడుతున్నారు. ఇటీవల పలమనేరు పట్టణా నికి చెందిన టమాటా లారీలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. దురాశకు పోయి దొరికిపోతున్నారు పలమనేరు, పుంగనూరు, వీకోట, కర్ణాటకలోని ముళబాగిళు, కోలారు, బంగా ర్పేట్ తదితర ప్రాంతాల్లో టమాటాలు తోలే లారీలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్నాళ్లు డ్రైవర్లుగా ఉన్న వారు ఫైనాన్స్లో లారీలు కొని త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ రొచ్చులోకి దిగుతున్నారు. స్మగర్లు సైతం సరుకు లారీలో వేసుకుంటే రూ.5 లక్షల వరకు స్పాట్ పేమెంట్ ఇస్తూ బంపర్ ఆఫర్ పెట్టినట్టు తెలిసింది. ఆత్మకూరులో పట్టుబడిన పలమనేరుకు చెందిన డ్రైవర్ నాలుగు నెలల క్రితం ఆ లారీని తమిళనాడులోని గుడియాత్తంలో ఫైనాన్స్లో కొన్నట్టు తెలిసింది. అనుమానం రాకుండా.. చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోకి గానీ లేదా నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించాలంటే ఎక్సైజ్, ఫారెస్ట్, ఆర్టీవో, అగ్రికల్చర్ చెక్పోస్టులను దాటాలి. ఎవరికీ అనుమానం రాకుండా అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. జిల్లా నుంచి కోల్కతాకు విత్తన కోడిగుడ్ల (హ్యాచరీ ఎగ్స్)ను తరలించే పలు ఏసీ కంటైనర్లు ఉన్నాయి. వీరు కోల్కతాలో ఎగ్స్ను దింపి అక్కడి నుంచి చెన్నైకి మాంసాన్ని తీసుకొస్తారు. ఇలాంటి ఏసీ వాహనాల్లోనూ దుంగలను తరలిస్తున్నట్టు సమాచారం. గతంలో పలమనేరు చెక్పోస్టు వద్ద పార్సిల్ కొరియర్ వాహనంలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్న విషయం తెలిసిందే. ట్యాంకర్లో ఎర్రదుంగలను పెట్టి రవాణా చేస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు ఖరీదైన కార్లను స్మగ్లర్లు వాడుతుండడం గమనార్హం. ఇదే రీతిలో శుక్రవారం పుంగనూరులో ఓ ఖరీదైన కారులో రవాణా అవుతున్న దుంగలను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. మరికొందరు ప్రైవేటు అంబులెన్స్లలో సైతం సైరన్ మోగిస్తూ దుంగలను తరలిస్తున్నట్టు సమాచారం. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్, ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు మాత్రం దుంగలను వెస్ట్బెంగాల్, కర్ణాటకకు తరలిస్తుండడం కొసమెరుపు. -
వివాహిత వాట్సాప్ మెసేజ్పై కలకలం
చిత్తూరు, మదనపల్లె: భర్త వేధింపులు, అవమానాలు భరించలేక ముగ్గురు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వివాహిత పెట్టిన వాట్సాప్ మెసేజ్ మదనపల్లె పట్టణంలో ఆదివారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని మోతీనగర్ ఉర్దూ పాఠశాల వీధికి చెందిన షబానా (35)కు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ముస్తఫాతో వివాహమైంది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆఫ్రిద్(12) గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. కవల పిల్లలైన ఆరీఫ్, మునీర్ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ముస్తఫా స్థానికంగా ఓ హోటల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. అతను సక్రమంగా పనికి వెళ్లేవాడు కాదు. ఇంటికి సక్రమంగా వచ్చేవాడు కాదు. భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త కుటుంబ పోషణకు ఏ మాత్రం సహకరించకపోవడంతో షబానా ఇంటిలోనే చిన్నపాటి చిల్లర దుకాణాన్ని నడుపుకుంటూ బిడ్డలను పోషించుకుంటోంది. మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భర్త తనను పోషించలేని స్థితికి చేరుకోవడమే కాకుండా తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, అత్త, మామ కుమారుడిని సక్రమ మార్గంలో పెట్టకపోగా అతడికే మద్దతు తెలుపుతుండడంతో గత్యంతరంలేని స్థితిలో బిడ్డలను తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆదివారం వాట్సాప్లో తల్లికి మెసేజ్ పెట్టింది. అనంతరం బిడ్డలను తీసుకుని అదృశ్యమైంది. వాట్సాప్ వీడియో మధ్యాహ్నానికి వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న భర్త ముస్తఫా ఇంటి వద్దకు వచ్చాడు. చుట్టుపక్కల వారు జరిగిన విషయం తెలియపరిచి ఎందుకిలా చేశావని అడిగేలోపు అక్కడి నుంచి పరారయ్యాడు. షబానా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి షబానా, బిడ్డల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తన కష్టాన్ని చుట్టుపక్కల వారికి తెలియనివ్వకుండా గుట్టుగా నెట్టుకొచ్చిన షబానా బిడ్డలతో సహా తనువు చాలిస్తానంటూ చెప్పడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బావ, బావమరిది హత్య
చిత్తూరు, యాదమరి : మండల పరిధిలోని కొటాల అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను గొర్రెలు కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతులు వేపనపల్లె ఆది ఆంధ్రవాడకు చెందిన బాబు, అతని బావ జయచంద్రగా గుర్తించారు. వీరిని ఎక్కడో చంపి, మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై మనోహర్ కథనం మేరకు.. మండలంలోని తమిళనాడు సరిహద్దులో ఉన్న కొటాల అటవీ ప్రాంతంలోని వేపనపల్లె ఆదిఆంధ్రవాడకు చెందిన బాబు(30) తాపీమేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు, తిరుపతిలో నివాసముంటున్న అతని బావ జయచంద్ర(33) అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో సోమవారం బాబు మేస్త్రీపని చేశారు. రాత్రి అతని బావ జయచంద్ర తిరుపతి నుంచి వచ్చాడు. ఇద్దరూ కలసి భోజనం చేసి బాబు ఇంటిలోనే పడుకున్నారు. అయితే ఉదయం వీరిరువురు కన్పించలేదు. సాయంత్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో శవాలై కన్నించారు. తమిళనాడులో హత్య..? బావ, బావమరిదిలను తమిళనాడులో హత్య చేసి ఆంధ్రలోని కొటాల అటవీ ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలు పడివున్న ప్రాంతంలో ఎలాంటి రక్తపు మరకలు లేకపోగా, ఇద్దరి ముఖం, గొంతు వద్ద గాయాలున్నాయి. ఒకరికి మర్మాంగంపై కాల్చి ఉన్నారు. దీన్నిబట్టి అక్రమ సంబ«ంధం కారణమై ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని ఇంటివద్దకు వెళ్లిన పోలీసు జాగిలాలు.. కొటాల అటవీ ప్రాంతంలో డాగ్స్క్వాడ్ తనిఖీ చేపట్టారు. ఇక్కడ్నుంచి పోలీసు జాగిలం నేరుగా వేపనపల్లె ఆది ఆంధ్రవాడలో మృతుడు బాబు ఇంటి వద్దకు వెళ్లాయి. దీంతో గ్రామంలోనే ఎవరోఎ వారిని హత్య చేసి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ.. కొటాల అడవీ ప్రాంతంలో హత్య విషయం తెలియగానే ఎస్పీ రాజశేఖర్ బాబు, డీఎస్పీ సుబ్బారావు, చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని, త్వరలో దుండగలను పట్టుకుంటామని వారు చెప్పారు. -
యువతుల మృతదేహాలకు అంత్యక్రియలు
చిత్తూరు, కలికిరి : నర్సింగ్ విద్యార్థినులు, అక్కాచెల్లెళ్లు పట్నం తస్లీం(19), పట్నం షికాబి(18)లు సోమవారం ఆత్మహత్యకు చేసుకున్న విషయం విదితమే. వీరి మృతదేహాలకు మంగళవారం ఉదయం కలికిరి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను చూసి స్నేహితులు బోరున విలపించారు. శవపరీక్ష అనంతరం పోలీసులు యువతుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. బలవన్మరణానికి కారణాలేంటి..? అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా వారి సున్నిత మనస్తత్వమే కారణమని భావిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు వేర్వేరు తరగతులైనా చాలా అన్యోన్యంగా ఉండేవారని తెలుస్తోంది. అక్క తస్లీం ఇంటర్ పరీక్షల్లో తప్పడంతో మనస్తాపం చెంది, ఒకరు లేకపోతే ఇంకొకరు ఉండలేమన్న బంధంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారం, ఇంకేదైనా కారణమా.. అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు చదువుతున్న కళాశాలలో వారి స్నేహితులు, వసతిగృహం వార్డెన్ తదితరులను మంగళవారం ఎస్ఐ శ్రీనివాసులు విచారించారు. -
అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. ప్రేమ విషయమేనా..?
చిత్తూరు, కలికిరి: ఆ అక్కా చెల్లెళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు.. ఇద్దరు కలిసి తనువు చాలించారు. పీలేరు సీఐ సోమశేఖర్రెడ్డి కథనం మేరకు.. కలికిరి పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో పట్నం అలీమాబి తన ఇద్దరు కుమార్తెలు పట్నం తస్లీం(19), పట్నం షికాబి(18), కుమారుడు మహమ్మద్ రఫీతో కలిసి ఉంటోంది. ఆమె భర్త నాలుగేళ్లపాటు కువైట్లో ఉండి వచ్చి.. సెప్టెంబరు మొదటి వారంలో తిరిగి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మదనపల్లి పట్టణంలోని హార్సిలీ హిల్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో పెద్ద కుమార్తె తస్లీం నర్సింగ్ మూడవ సంవత్సరం, చిన్న కుమార్తె షికాబి నర్సింగ్ రెండో సంవత్సరం చదుతూ అక్కడే బీసీ వసతిగృహంలో ఉంటున్నారు. వారాంతంలో ఇంటికి వచ్చి వెళ్లే వారు. కుమారుడు మహమ్మద్ రఫీ మండల పరిధిలోని మహల్లో ఉర్దూ ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్నాడు. కాగా నవంబరు 1 నుంచి నర్సింగ్ పబ్లిక్ పరీక్షలు ఉండటంతో కళాశాలలో ప్రిపరేషన్ సెలవులు ఇచ్చారు. దీంతో అక్కాచెల్లెళ్లు 10 రోజుల నుంచి ఇంటి వద్దనే ఉండి చదువుకుంటున్నారు. తల్లి అలీమాబి కంటి శస్త్రచికిత్స నిమిత్తం వారం క్రితం చిన్న కుమార్తెతో కలిసి వెళ్లి మదనపల్లిలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకు వచ్చారు. తిరిగి సోమవారం ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో ఉదయం ఒకరు తన వెంట ఆసుపత్రికి రావాలని తల్లి కోరినా.. వారు ఇంటి వద్దనే ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఆమె ఒక్కతే ఆసుపత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వచ్చి ఇంట్లో చూసే సరికి.. కుమార్తెలు ఇద్దరు ఇంటి పై కప్పునకు ఉన్న కమ్మికి వేర్వేరు చీర్లతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపిం చారు. ఇరుగుపొరుగు సహాయంతో మృతదేహాలను కింద కు దించి పోలీసులకు సమాచారం అందించింది. పీలేరు సీఐ సోమశేఖర్రెడ్డి, ఎస్ఐ పురుషోత్తంరెడ్డి మృతదేహాలను కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి అలీమా బి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారణం ఏమిటో..? నర్సింగ్ చదువుతున్న అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ తెలిపారు. ప్రేమ విషయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా..? కుటుంబ కలహాలతోనా..? అన్న విషయాలపై విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికంగా తీవ్ర కలకలం పేరింది. దర్యాప్తులో అసలు విషయం తెలియాల్సి ఉంది. -
7 గంటల్లోనే దొంగ అరెస్టు
చిత్తూరు, తిరుపతిక్రైం: నగరంలోని చిన్నబజారువీధిలో శనివారం జరిగిన భారీ చోరీని క్రైం పోలీసులు 7 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల బంగారు నగలు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఆదివారం క్రైం పోలీస్స్టేషన్లో వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. చిన్నబజారువీధిలో హేమంత్ అనే వ్యక్తి లావణ్య జ్యువెలరీస్ ను నిర్వహిస్తున్నాడని తెలిపారు. దుకాణం వెనుకవైపు నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద గతంలో ఎమ్మార్పల్లిలో ఉంటున్న అయినపాళ్యం కళ్యాణ్ (23) పనిచేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతన్ని 2 ఏళ్ల క్రితం పని నుంచి నిలిపేశాడు. కళ్యాణ్ హైదరాబాద్లో ట్రావల్స్ను ఏర్పాటు చేసుకో వాలని భావించాడు. ఇందుకు పాత యజమాని షాపులో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మాట్లాడేందుకు వెళ్లి.. ఈ నెల 5వతేదీ రాత్రి 8 గంటలకు లావణ్య జ్యువె లరీస్లోకి వెళ్లి 250 గ్రాముల బంగారు చెవిపోగులు కొనుగోలు చేశాడు. అనంతరం షాప్లో ఉన్న వారితో పాత పరిచయాన్ని వినియోగించుకుని ఇంట్లో వారితో మాట్లాడి మరుగుదొడ్డి కోసమని ఇంటి వెనక్కు వెళ్లాడు. అక్కడ తలుపునకు ఉన్న టవర్ బోల్ట్, ఇనుప గ్రిల్గేట్ను తీసివేసి బయటకు వచ్చేశాడు. రాత్రి ఒంటి గంట సమయంలో లావణ్య జ్యువెలర్స్లోకి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి బంగారు చైను, డబ్బులు, క్యాష్ బ్యాగులోని రూ.20 వేలు, సీసీ కెమెరాల డీవీఆర్ను తీసుకుని వెళ్లిపోయాడు. డీవీఆర్ను పాడుబడిన బావిలో పడేశాడు. ఇంతలో చోరీ జరిగినట్లు యజమాని గుర్తించి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ముందురోజు, వెనుక రోజు ఎవరెవరు వచ్చారనే విషయాలను తెలుసుకున్నారు. కళ్యాణ్పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల 55 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు నగదు దొంగతనానికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వింగ్స్ యాప్తో ఉద్యోగుల సమాచారం సేకరిస్తాం ఇకపై నగరంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా బంగారు షాపులు, షోరూంలు, ప్రముఖ షాపుల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను వింగ్స్ యాప్ ద్వారా త్వరలోనే సేకరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తి ఆధార్కార్డు, ఫొటో వివరాలను సేకరించవచ్చన్నారు. వాటిని బట్టి చిరునామా కనుక్కోవడం, అతని నేర చరిత్రను ఆరాతీయడం సులభమవుతుందని చెప్పారు. అంతేగాక వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారిలో నేర చరితులు, దొంగతనాలు చేసి ఉంటే వెంటనే గుర్తించవచ్చన్నారు. 10 రోజుల్లో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలు ఎక్కడైనా వెళ్లే సమయంలో సమీపంలోని పోలీస్స్టేషన్ నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవచ్చన్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ రవిశంకర్రెడ్డి, సీఐలు భాస్కర్రెడ్డి, శరత్చంద్ర, అబ్బన్న, మధు, పద్మలత, రసూలు సాహెబ్, ఇతర సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. -
రైలు పట్టాలపై మరణ మృదంగం
హడావుడిగా పట్టాలు దాటుతూ ఇనుప చక్రాల కింద నలిగిపోతున్న బతుకులు కొన్ని.. ఎక్కడ పుట్టారో.. ఎక్కడ పెరిగారో.. బతుకు ప్రయాణంలో రైలు పట్టాలపై అనాథలుగా అనంత లోకాలకు వెళుతున్న జీవితాలు మరికొన్ని.. చికాకులు, మానసిక ఒత్తిళ్లతో జీవితం ఒద్దురా అంటూ రైలుకు ఎదురెళ్లితనువు చాలించే బతుకులు ఇంకొన్ని.. ఇలా నిత్యం ఎంతోమంది అభాగ్యుల చావు కేకలు రైలు కూతలో కలిసిపోతున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతను, కడదాకా తోడుంటానన్న భాగస్వామికి కన్నీటిని మిగిల్చి రైలు పట్టాలపైచివరి మజిలీ మింగేసుకుంటున్నాయి. చిత్తూరు, తిరుపతి క్రైం: సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటా యి. ధైర్యంగా ముందుకు సాగితే వాటంతట అవే దూరమవుతాయి. భయపడితే మరింత భయపెడతాయి. అంతేగాని క్షణికావేశంలో జీవితం అయిపోయిందని భావించి తీసుకునే నిర్ణయాలు కన్నతల్లిదండ్రులకు కడుపుకోతను మిగుల్చుతాయి. ఈ మధ్య కాలంలో చాలామంది రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో అభాగ్యులతోపాటు ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం కొంత ఆందోళనను కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఈ తరహా మరణాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటున్నాయి. నిదర్శనాలు ఇవే.. ♦ తిరుపతి నగరంలోని వెంకటేశ్వర థియేటర్ రైల్వే గేటు వద్ద 45 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ♦ రెండు రోజుల క్రితం తిరుపతి నగరంలోని ఒక ప్రముఖ కళాశాలకు చెందిన విద్యార్థిని కాటన్ మిల్ సమీపంలో రైలు కింద పడుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ♦ 15 రోజుల క్రితం నగరంలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి రైలు ఎక్కి కాలు జారి కింద పడి మృతిచెందాడు. ♦ నెలరోజుల క్రితం 30 ఏళ్లు గల వ్యక్తి రైలు పట్టాలపై పడుకుని బలవణ్మరణానికి పాల్ప డ్డాడు. తల, మొండెం వేరై మృతదేహన్ని గుర్తుపట్టడానికి కూడా వీలులేకుండా పోయింది. నేరాల నుంచి తప్పించుకునేందుకు.. కొందరు నేరాలు తప్పించుకునేందుకు కూడా రైలు పట్టాల వద్దకు చేరుకుంటున్నారు. ఎవరినో ఒకరిని చంపడం దానిని రైలు ప్రమాదాలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా కనుగొనలేని విధంగా మృతదేహాలు చిద్రమవుతున్నాయి. తద్వారా నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. గుర్తించడంలో లోపం :రైలు నుంచి జారిపడిన సందర్భాల్లో గుర్తించడంలో జాప్యం కారణంగా ఒక్కొక్కసారి ఉన్నవారిని కూడా కాపాడలేకపోతున్నారు. సమాచారం లేదన్న సాకుతో శవ పంచనామా, శవపరీక్షలకు కాలయాపన జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు కూడా ఇటీవల చాలా చోటు చేసుకున్నాయి. కొందరు వ్యక్తులు రైలు కింద పడితే కనీసం రైలు నడుపుతున్న వ్యక్తి కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో వారి శవాలు తెల్లవారు జరిగితే రాత్రి సమయంలో గుర్తించిన రోజులు కూడా ఉన్నాయి. అజాగ్రత్తతోను అధికమే రైలు ప్రయాణంలో అజాగ్రత్త ప్రమాదాలకు దారితీస్తోంది. రైల్వే స్టేషన్లో రైలు వచ్చేది లేనిది చూసుకోకుండా పట్టాలు దాటడం, రైలు బోగీ దగ్గర నిలుచోవడం, మెట్లపై కూర్చోవడం, కదిలే రైలు ఎక్కడం ప్రమాదాలకు దారితీస్తోంది. సెల్ఫోన్ మాట్లాడుతూ అజాగ్రత్తగా ఉండడంతో బోగీ కుదింపులకు ఒక్కొసారి జారిపడుతున్నారు. శీతాకాలంలో బోగీ డోర్ దగ్గర ఉండే ఇనుపరాడ్లు మంచుతో తడిసి జారిపోవడం ప్రమాదాలకు ఆస్కారమవుతోంది. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు, పాకాల : ఇరుగుపొరుగునున్న దాయాదుల కుటుంబంలోని మహిళలతో ప్రారంభమైన చిన్న తగాదా ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పెరుమాళ్లగుడిపల్లికి చెందిన పి.జయరాం(35), ఆయన చిన్నాన్న చెంగల్రాయులు ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. నెల కిందట చెత్తపోసే విషయంలో వారిద్దరి భార్యల మధ్య తగాదా నెలకొంది. గ్రామస్తులు సమస్యను పరిష్కరించారు. అయితే ఈ నెల 1న చెంగల్రాయులు, అతని కుటుంబ సభ్యులు జయరాంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు జయరాంకు ఫోన్ చేసి, స్టేషన్కు వచ్చి మాట్లాడాలని ఫోన్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన జయరాం మంగళవారం గ్రామ సమీపంలోని పంటపొలాల్లో విషగుళికలు తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు దామలచెరువు పీహెచ్సీలో ప్రథమచికిత్స చేయించి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9గంటల ప్రాంతంలో జయరాం మృతిచెందాడు. పోలీస్టేషన్ ఎదుట మృతుని బంధువుల బైఠాయింపు.. జయరాం మృతికి అతని చిన్నాన్న, భార్య వసంత, కుమార్తె గీత, అల్లుడు భూపతి, బంధువులు బ్రహ్మ య్య, పెదక్క కారణమని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమేరకు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసి, న్యాయం చేయాలని కోరారు. అయితే ఎంతసేపటికి పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో మృతుని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహిం చారు. పోలీస్టేషన్ ఎదుట «బైఠాయించారు. దీంతో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఫిర్యాదు స్వీకరించి, దర్యాప్తు చేస్తామన్నారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు మోహన్(14), కుమార్తె మౌనిక(13) ఉన్నారు. -
బెల్టు తీస్తే ఒట్టు..!
చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి అబ్కారీ పరిధిలో 442 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో 70 శాతం దుకాణాల వద్ద అనధికారిక బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. మద్యానికి బాని సైనవాళ్ల బతుకుల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. జిల్లాలో నెలకు 200 వరకు బెల్టు దుకాణాలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు చేసినా, మద్యం స్వాధీనం చేసుకున్నా..‡ ఆదాయానికి అలవాటుపడ్డ వారు ఈ వ్యాపారాన్ని మానలేకపోతున్నారు. టీడీపీకి చెందినవారికి ఉపాధి చూ పడానికే అన్నట్లు గ్రామాల్లో బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. బెల్టు దుకాణాలపై జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసే సమయంలోముందస్తుగా కొందరు వ్యాపారులకు సమాచారం లీక్ చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కేసులు తగ్గినప్పుడు అధికారులు, మద్యం దుకాణాల నిర్వాహకులకు ఫోన్లు చేసి మనుషులను పంపాలంటూ నామమాత్రపు అరెస్టులు చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బాబువి నీటి మూటలు.. గతేడాది జూలైలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్లీనరీలో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను దశలవారీగా నిషేధిస్తామని, రాష్ట్రంలో ఎక్కడా బెల్టుదుకాణం లేకుండా చేస్తామని చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు నెల రోజుల్లో బెల్టు దుకాణం లేకుండా చేస్తామన్నారు. అవి నీటిమూటలుగా మిగిలిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు ఊపందుకోవాలంటే బెల్టు దుకాణాలు ఒక్కటే ప్రత్యామ్నాయమనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెల్టు దుకాణాలు తీసేయడానికి ప్రభుత్వం ఇష్టపడటంలేదు. జిల్లా ఆబ్కారీ శాఖలో ఎౖMð్సజ్ సహాయ కమిషనర్, సూపరింటెండెంట్ పోస్టుతో పాటు మొత్తం 2 వేల వరకు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం తమపై అదనపు భారం మోపుతోందని కొందరు ఆబ్కారీ అధికారులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళాపాళా లేదు... టౌన్లో ఎక్కడ పడితే అక్కడ వేళాపాళా లేకుండా మద్యం అమ్మతా ఉండారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియడంలేదు. రోడ్లపై ఉన్న చిల్లర అంగళ్లలో కూడా క్వార్టర్ బాటిళ్లు అమ్మతా ఉండారు. ఎప్పుడూ గొడవలే. రోడ్డుపై నడిచి వెళ్లాలన్నా భయంగా ఉంది. – చిట్టెమ్మ, చిత్తూరు కుటుంబాల్లో తిండి లేదు.. మధ్య తరగతి కుటుంబాలు మద్యానికి బానిసై జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. చాలదన్నట్లు ప్రతి చిల్లర దుకా ణంలో మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో చాలా కుటుంబా ల్లో మద్యానికి బానిసై ఇంట్లో వాళ్లకు తినడానికి తిండి కూడా పెట్టడంలేదు. – కళైఅరసి, ఎంపీటీసీ సభ్యురాలు,నంగమంగళం, గుడిపాల కేసులు పెడుతున్నాం.. బెల్టు షాపులను తొలగించడానికి రోజూ ఓ ప్రణాళికతో పనిచేస్తున్నాం. కేసులు పెట్టి నిందితులను అరెస్టు కూడా చేస్తున్నాం. ఏడాదిలో ఆరు మద్యం దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశాం. – మధుమోహన్రావు,ఎక్సైజ్ సూపరింటెండెంట్, చిత్తూరు. -
చెట్టును ఢీకొన్న కారు
తిరుపతి క్రైం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొంది. ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ము గ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తిరుపతి రూరల్లోని కాలూరు క్రాస్ వద్ద జరిగింది. ఎమ్మార్పల్లి ఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. కేటీ రోడ్డు ద్వారకానగర్కు చెందిన సుధీర్రాయల్ (26), సింగాలగుంటకు చెందిన కుమారస్వామి కుమారుడు దాము (21), రమేష్, జయప్రకాష్, నాగా ర్జున షిప్ట్ కారులో సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి ఇంటికి బయలుదేరారు. తిరుపతి రూరల్ పరిధిలోని కాలూరు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొం ది. సుధీర్ రాయల్, దాము అక్కడికక్కడే మృతి చెందారు. రమేష్, జయప్రకాష్, నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని రుయాకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సుధీర్రాయల్ తిరుమలలో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. దాము నగరంలో చదువుతున్నాడు. సీఐ విజయకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. గురువారం వీరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సం ఘటనా స్థలంలో వీరి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతులు జనసేన పార్టీకి చెందన వారు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో సుధీర్రాయల్ సినీనటుడు, జనసేన నాయకు డు పవన్కల్యాణ్ అభిమానుల సంఘం సంయు క్త కార్యదర్శిగా ఉన్నారు. జనసేన పార్టీలో బోత్ ఆస్పత్రి అధినేత పసుపులేటి హరిప్రసాద్ అనుచరుడిగా ఉంటూ కీలకపాత్ర పోషించేవాడు. వీరి మృతి సమాచారం తెలిసిన వెంటనే పసుపులేటి హరిప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, పవన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సురేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ ప్రమాదంపై పార్టీ అధినేత పవన్కల్యాణ్ కార్యాలయానికి సమాచారం అందించినట్టు నాయకులు పేర్కొన్నారు. వీరి మృతదేహాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీకి చెందినవారు రావడం గమనార్హం. -
పోలీసులను లారీతో ఢీకొట్టేందుకు ఎర్రకూలీల యత్నం
తిరుపతి సిటీ: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చిన ఎర్ర కూలీలు టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులను లారీతో ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దుండగులు లారీలోంచి దూకడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగింది. టాస్క్ఫోర్స్ సీఐ మధుబాబు కథనం మేరకు.. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన లారీలో నిత్యావసర వస్తువులు తీసుకుని ఎర్ర కూలీలు శేషాచలం అడవుల్లోకి ప్రవేశించేందుకు వస్తున్నట్లు సీఐకి సమాచారం అందింది. అప్రమత్తమైన ఆయన తన సిబ్బందితో వడమాలపేట టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దీన్ని గమనించిన ఎర్ర కూలీలు లారీని ఆపకుండా వేగంగా దూసుకెళ్లారు. సీఐ వెంటనే గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. వారు జాతీయ రహదారిలో ఏర్పాటుచేసిన బారికేడ్లను దుండగులు ఢీకొని వెళ్లిపోయారు. గమనించిన పోలీసులు తిరుచానూరు, తిరుపతి పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. అప్రమత్తమైన తిరుచానూరు పోలీసులు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బారికేడ్లను పెట్టి లారీని నిలిపే ప్రయత్నం చేశారు. లారీ వేగంగా వచ్చి బారికేడ్లను సైతం లెక్కచేయకుండా గుద్దుకుని ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో అక్కడ రెండు లారీలు ఢీకొని ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని ఎర్ర కూలీలు పసిగట్టారు. లారీని ఓటేరు మార్గంలో రోడ్డుపై నిలిపి కిందకు దూకేశారు. ఈ క్రమంలో గాయాలపాలయ్యారు. వారిని వెంబడిస్తూ వస్తున్న తిరుచానూరు, టాస్క్ఫోర్స్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. రుయాకు తరలించి వైద్య సేవలు అందించారు. చెరుకు కొట్టాలని చెప్పిఅదుపులోకి తీసుకున్న వారిలో రవి అనే కూలీ మాట్లాడుతూ చెరుకు కొట్టాలని చెప్పి తమను లారీ ఎక్కించారని తెలిపాడు. తరువాత ఎర్రచందనం చెట్లు నరకాలని చెప్పారని పేర్కొన్నాడు. లారీలో బియ్యం బస్తాలు, ఇతర వంట సామగ్రి, గొడ్డళ్లు, పూజ సామగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో దొరస్వామి(41), ఎం.రవి (28), గోవిందస్వామి (28), చక్రవర్తి (28), కార్తీక్ (28), తిరుపతి (28), వేదనాయగం (41) ఉన్నారు. వీరు తమిళనాడు జవ్వాదిమలై ప్రాంతానికి చెందినవారుగా టాస్క్ఫోర్స్ పోలీసుల గుర్తించారు. ఎర్ర కూలీలను పట్టుకునేందుకు ప్రాణాలకు తెగించిన పోలీస్ సిబ్బందిని టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు అభినందించారు. -
చిత్తూరులో వ్యక్తిపై హత్యాయత్నం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పూలమార్కెట్కు చెందిన మోహన్ అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. చవితిను పురస్కరించుకుని బజారువీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మోహన్ అతని అనుచరులు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు రోడ్డులోని కట్టెలదొడ్డికి చెందిన శరవణ అనే వ్యక్తి ఊరేగింపులో పాల్గొని గొడవ చేశాడు. దీనిపై మోహన్, శరవణల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో శరవణ తన వద్ద ఉన్న కత్తి తీసుకుని మోహన్ తలను నరకడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్కడే డ్యూటీలో ఉన్న సీఐ మోహన్ను పక్కకు తోసేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా శరవణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని మోహన్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఇతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు గాయపడ్డ వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అనుచరుడు కావడంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. -
శ్రీకాళహస్తిలో భారీ చోరీ
చిత్తూరు, శ్రీకాళహస్తి: పట్టణంలోని శ్రీరామనగర్కాలనీ లోని డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న తొట్టంబేడు టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు గాలి అనసూయమ్మ కుమారుడు గాలి చలపతినాయుడు ఇంటిలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. చలపతి నాయుడు వ్యాపారవేత్త. ఆయన సోమవారం డీఎస్పీ పి.రామక్రిష్ణకు ఫిర్యాదు చేశారు. అందులో తాము ఆదివారం రాత్రి ఇంటి వద్ద లేమని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించిన తమ పనివాళ్లు చోరీ జరిగినట్లు సమాచారం అందించారని పేర్కొన్నారు. రూ.37 లక్షల నగదు, రూ.12 లక్షలు విలువైన రెండు డైమండ్ గాజులు చోరీకి గురైనట్టు తెలిపారు. డీఎస్పీ రామక్రిష్ణ, సీఐ మనోహర్ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. అలాగే డాగ్ స్క్వాడ్ను రప్పించారు. డాగ్ ఇంటి నుంచి సమీపంలోని బైపాస్ రోడ్డు వరకు వెళ్లింది. ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు చోరీ కావడం శ్రీకాళహస్తిలో ఇదే ప్రథమం. అది కూడా డీఎస్పీ కార్యాలయం పక్క భవనంలో జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
ఉసురు తీసిన అ‘టెన్షన్’
‘ఏర్పేడు ఎస్ఐ వెంకటరమణ... వివాద రహితునిగా పేరు... పనిచేసిన చోటల్లా మంచి పేరును సంపాదించుకున్నారు. వివాదాలకు, రాజకీయ ఒత్తిళ్లకు కేంద్రబిందువైన ఏర్పేడు మండలంలో ఆయన చతురత తలకిందులైంది. ఇక్కడ ఆత్మవంచన చేసుకుని రాజకీయ నేతలు చెప్పిందానికల్లా తలాడించలేదు. ఫలితంగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.’ సాక్షి, చిత్తూరు,తిరుపతి/రేణిగుంట: ఇసుక లారీ ఘటన తర్వాత 2017, ఏప్రిల్ 22న ఏర్పేడు సబ్ ఇన్స్పెక్టర్గా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. 40గ్రామ పంచాయతీలతో పెద్ద మండలమైన ఏర్పేడులో ఒక పోలీస్స్టేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ కేసులు రికార్డు్డస్థాయిలో నమోదవుతున్నాయి. స్టేషన్లో సిబ్బంది కొరత... కేసు డాక్యుమెంట్లు, సీడీ ఫైళ్లు తయారుచేసే నైపుణ్యమున్న వారు అసలే లేరు. దీంతో ఆయన సకాలంలో కేసుకు సంబంధించిన ఫైళ్లను ఉన్నతాధికారులకు సమగ్రంగా అందించడంలో ఎన్నో వ్యయప్రయాసలకు, ఒత్తిళ్లకు గురయ్యేవారు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల వరకూ స్టేషన్లోనే కూర్చొని కేసు తాలూకు ఫైళ్లను స్వయంగా టైపు చేసుకున్న సందర్భాలు అనేకమనే చెప్పాలి. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న వెంకటరమణ సీఐగా పదోన్నతి జాబితాలో ఉన్నారు. అయితే స్థానిక టీడీపీ నేతలకుపంటికింద రాయిగా మారిన ఎస్ఐను బదిలీ చేయిం చాలని కొందరు నేతలు కొంతకాలం నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంజిమేడు చెరువులో మట్టిని టీడీపీ నేత ఒకరు ఇటుక చూల కోసం రూ.10లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తుండగా గతంలో ఉన్న తహసీల్దార్ ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఆ ట్రాక్టర్లను విడిచిపెట్టాలని టీడీపీ నేతలు ఎస్ఐ వెంకటరమణపై ఒత్తిళ్లు తెచ్చినా విడిచిపెట్టలేదు. ఎస్ఐ తమ మాట వినకపోవడంతో టీడీపీ నేతలు ఆయనను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఆయనతో పాటు తహసీల్దార్ సుబ్బన్నలను బదిలీ చేయాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంత్రి కూడా ఈ విషయాన్ని పరిష్కరించాలని పక్కనే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి సూచించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలు స్తోంది. తనపై ఫిర్యాదు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన గురువారం రాత్రి మండలంలోని తన ఆప్తులతో పంచుకుని తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే సీఐగా ప్రమోషన్ రానున్న నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులు ఆయనను మానసికంగా కుంగదీశాయి. అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం సెలవు అడిగినప్పటికీ ఉన్నతాధికారలు నిరాకరించడంతో ఆయన విధిలేని పరిస్థితుల్లో శుక్రవారం తెల్లవారుజామున ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ముభావంగా ఉన్న ఆయనను సహచరులు, కిందిస్థాయి సిబ్బంది పలకరించి బాధను పంచుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎస్ఐ వెంకటరమణ హఠాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే విగతజీవిగా మారాడు. పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్లే తన భర్త మరణానికి కారణమని మృతుని భార్య మహేశ్వరి బోరున విలపిస్తుంటే పోలీసు అధికారులు మౌనంగా రోధించడం కనిపించింది. పోలీసు శాఖలో నూ వారాంతపు సెలవులను అమలు చేసి పని ఒత్తిడిని తగ్గించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అధికారులకు కష్టతరమైన ఎయిర్పోర్ట్ డ్యూటీ.. రేణిగుంట ఎయిర్పోర్ట్లో తరచూ వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రధానంగా దేశ, విదేశాల నుంచి వీవీఐపీలు తిరుమల దర్శనార్థం వస్తుంటారు. ఈ క్రమంలో రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఖాకీలు బందోబస్తు డ్యూటీలో నరకం అనుభవిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు ఎయిర్పోర్ట్ బందోబస్తు డ్యూటీ కత్తిమీద సాము లాంటిది. రెవెన్యూ అధికారులు వీఐపీలకు సకల సౌకర్యాలను కల్పించడం కోసం ఒక్కో పర్యటనకు కనీసం రూ.60వేలు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. రేణిగుంట తహసీల్దార్ వీఆర్ఎస్కు ఇది కూడా ఓ కారణంగా రెవెన్యూ సిబ్బందే చర్చించుకుంటున్నారు. సీఎం వచ్చే ప్రత్యేక ప్రవేశమార్గంలో భద్రతాపరమైన విధులు నిర్వహించే పోలీసుల సౌకర్యార్థం షామియానా, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు కల్పించేవారు. అయితే గురువారం సీఎం స్వాగత సమయంలో కనీసం షామియానా కూడా వేయకపోవడంతో పోలీసులు గంటల తరబడి ఎండలోనే ఇబ్బందిపడ్డారు. ఎస్ఐ వెంకటరమణ కూడా అక్కడే ఎండలోనే గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశద్వారం వద్ద సౌకర్యాల లేమిపై కొందరు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఎస్ఐ వెంకటరమణ మృతి ఓ గుణపాఠంగా భావించి పోలీసు శాఖ ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీసుకోవాలని రక్షక భటులు కోరుతున్నారు. అధికార చేష్టలే ఎస్ఐ ప్రాణం తీశాయి శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రక్షక భటులకే రక్షణ కరువు అయ్యిందని వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన ఇసుక నేతల ఒత్తిడితోనే ఏర్పేడు ఎస్ఐ వెంకటరమణ మృతి చెందారని ఆరోపించారు. ఏడాది క్రితం టీడీపీకి చెందిన ధనంజయులు నాయుడు, చిరంజీవుల నాయుడు ఇసుక అక్రమ వ్యాపారం నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో 16 మంది మృతి చెందారన్నారు. బెయిల్పై విడుదలైన వారి నుంచి ఎమ్మెల్యే కుమారుడు బొజ్జల సుధీర్రెడ్డి పెద్ద మొత్తంలో ముడుపులు పొంది పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. మళ్లీ వారు చేస్తున్న ఇసుక అక్రమాలకు ఎస్ఐ అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. దీంతో ఆయనపై కక్షగట్టి సస్పెండ్ చేయించాలని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. ఎయిర్పోర్టులో మంత్రికి ఫిర్యాదు కూడా చేశారని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఐను మానసికంగా కుంగదీశారన్నారు. ఈ కారణంగా ఎస్ఐ ఒత్తిడికి గురై గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆరోపిం చారు. కొత్తగా ఏర్పేడు స్టేషన్కు రావాలంటేనే అధికా రులు భయపడుతున్నారన్నారు. టీడీపీ నేతలు ఇసుక దాహానికి మరెంతమంది బలవుతారో తెలియ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుం బాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు కొట్టెడి మధుశేఖర్, నాగోలు శ్రీనివాసులురెడ్డి, ఊటా రమేష్యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య.. భార్యపై అనుమానం
చిత్తూరు, తవణంపల్లె: మండలంలోని వెంగంపల్లె సమీపంలోని మామిడి తోపులో గురువారం రాత్రి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. వెంగంపల్లెకు చెందిన మొగిలిరెడ్డి(45) వ్యవసాయంతో పాటు మామిడి కాయలు వ్యాపా రం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి వెంగంపల్లె సమీపంలో మామిడి తోపు ఉంది. పాడి ఆవు ఈనుతుందని భావించిన మొగిలిరెడ్డి, అతని భార్య మమత గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మామిడి తోపు వద్ద కు వెళ్లారు. అక్కడే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మొగిలిరెడ్డి తల, శరీరంపై కొట్టారు. అనంతరం గుడ్డతో గొం తు బిగించి హత్య చేశారు. శుక్రవారం ఉదయం కొడుకు రోహిత్రెడ్డి మామిడి తోపు వద్దకు వెళ్లి చూడగా తండ్రి మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే పక్క పొలంలోనే ఉన్న మేనత్త రాజమ్మకు, బంధువులకు తెలిపాడు. సమాచారం అందుకున్న చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు, చిత్తూరు ఈస్ట్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. వివాహేతర సంబంధమే కారణమా..? పోలీసు జాగిలం హత్యా స్థలం నుంచి నేరుగా హతుడి ఇంటి వద్ద తలుపు, బాత్రూం వద్దకు వచ్చి ఆగింది. డీఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో మొగిలిరెడ్డి భార్య మమత, కూతురు భార్గవి, కుమారుడు రోహిత్ రెడ్డి, గ్రామస్తులను వేర్వేరుగా విచారించారు. తాను మంచం పక్కనే పడుకున్నానని, చీకటిలో భర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో భయపడి పరుగులు తీశానని భార్య పోలీసులకు తెలిపింది. పోలీసులు మాత్రం హత్యకు భార్య వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్య, మరో వ్యక్తిని విచారిస్తున్నారు. త్వరలో కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అక్క రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉమామహేశ్వర రావు తెలిపారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ
వారంతా బంధువులు. తిరుమలశ్రీవారిని దర్శించుకోవాలనిఅనుకున్నారు. వెంటనే రెండు వాహనాల్లో బయలుదేరారు. శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కన్నులారా దర్శించుకున్నారు. సంతోషంగా తిరిగి సొంత ఊరికి బయలుదేరారు. వారి సంతోషం ఎంతోసేపు నిలువ లేదు. విధి వక్రించింది. కారు బస్సునుఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడేదుర్మరణం చెందారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటన పులిచెర్ల మండలంలో సోమవారం జరిగింది. చిత్తూరు, పులిచెర్ల(కల్లూరు): ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పులిచెర్ల మండలం చెఱుకువారిపల్లె వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన చావలి వెంకటశాస్త్రి (50), అతని భార్య చావలి రాజ్యలక్ష్మి (45), సౌమ్య (21) మరో ముగ్గురు బంధువులు మూడురోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు కార్లలో వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోమవారం కాణిపాకం వెళ్లారు. అక్కడ వినాయకున్ని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. కల్లూరులో ఒక కారు పీలేరు వైపు, మరొక కారు దారి గుర్తించక పుంగనూరు వైపు వెళ్లాయి. పీలేరు రోడ్డులో వెళుతున్న కారు చెఱుకువారిపల్లె బస్టాప్ వద్ద పీలేరు నుంచి చిత్తూరు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. కారు నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ఉన్న దంపతులు చావలి రాజ్యలక్ష్మి, వెంకటశాస్త్రి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే కారులో వెనుక సీటులో కూర్చున్న సౌమ్య (21)కు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె వెంటనే పుంగనూరు వైపు వెళ్లిన తమ బంధువులకు సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. దైవదర్శనానికి వచ్చి సంతోషంగా వెళుతున్న సమయంలో దేవుడు చిన్నచూపు చూశాడని, ఇద్దరిని పోగొట్టుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో పక్కనే ఉన్న పీఎల్ఆర్ తారు ప్లాంటు మేనేజరు నాగిరెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా సమాచారం అందుకున్న కల్లూరు ఎస్ఐ విశ్వనాథనాయుడు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి కారులో ఇరుక్కున్న మృతులను జేసీబీ సహాయంతో అతికష్టం మీద బయటకు తీశారు. స్వల్ప గాయాలతో బయటపడిన సౌమ్యను పీలేరు ఆస్పత్రి తరలించారు. కారు ఢీకొనడంతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు రెండు చక్రాలు విరిగిపోయి బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందిన వారికి సంతానంలేదు. సమాచారం అందుకున్న పాకాల సీఐ రామలింగమయ్య అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కాటికి పంపిన కష్టాలు
కనీస ఖర్చులకూ సరిపోనివేతనం..గర్భం దాల్చిన భార్య.. ఎలా పోషించాలో తెలియకదిగులు.. ఆఖరుకు భార్యకు అబార్షన్ చేయించాలనే ఆలోచన.. ఈ పరిస్థితులు ఓ చిరుద్యోగిమనసును కల్లోలం చేశాయి. చివరికి అతను ఆత్మహత్యచేసుకున్నాడు. కుమారుడివిషాదాంతంతో తల్లడిల్లిన తల్లి కూడా పరనిందతో తనువుచాలించింది. రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటనబుధవారం తిరుపతిలోసంచలనం రేకెత్తించాయి. మృతునికి చాలీ చాలని వేతనం చెల్లిస్తున్న టీటీడీ పై విమర్శలుచెలరేగాయి. తిరుపతి (అలిపిరి): తిరుపతిలో బుధవారం తల్లీకుమారుల ఆత్మహత్య సంఘటన చర్చనీయాంశమైంది. పర్సాల వీధికి చెంది న బి. గంగాధర్ (25) తన తండ్రి మరణాంతరం వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. ఇతని తల్లి కుమారి(45) నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇద్దరివీ తక్కువ వేతనాలు కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కుటుం» పోషణకు తల్లి కొంత మొత్తాన్ని బ్యాంకులో అప్పుగా తీసుకుంది. మూడు నెలల క్రితం గంగా ధరానికి అదే ప్రాంతానికి చెందిన దివ్యతో వివాహం జరిపించారు. వివాహానికి కొంత మంది దగ్గర అప్పు తీసుకున్నారు. ఆర్ధిక వెతల వల తల్లీకొడుకుల మధ్య వివాదాలు వచ్చేవి. ఇటీవల దివ్య గర్భం ఘోషిస్తున్నాయి. స్వామి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పిం చడంలోనూ ధార్మిక సంస్థ యాజమాన్యం, ఉన్నతాధికారులు వైఫల్యం చెందారు. ఈ కారణంగానే కార్మికులు మానసిక వేదనకు గురై తనువు చా లించే స్థితికి చేరుతున్నారు. పనికి తగిన వేతనం అందక ఓవైపు, పని ప్రాంతాల్లో అధికారుల వే ధింపులు మరోవైపు కార్మికుల పాలిట శాపాలుగా మారాయి. బా«ధితుల నుంచి అందే ఫిర్యాదులకు స్పందించి కార్మికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన టీటీడీ విజిలెన్స్ విభాగం సైతం తమకెందుకు అనే ధోరణితో వ్యవహరిస్తోంది. రెండు దశాబ్దాలు గడుస్తున్నా పెరగని వేతనాలు.. టీటీడీలోని 28 విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1998లో చేరిన కార్మికులకు రెండు దశాబ్దాలు గడుస్తున్నా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. 1998లో రూ.4,500గా ఉన్న కనీస వేతనాలు ప్రస్తుతం రూ.6,500 వరకు మాత్రమే అందుతోందంటే కార్మికుల ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టీటీడీ వార్షిక బడ్జెట్ సుమారు రూ.3వేల కోట్లు దాటుతున్నా అందుకు ప్రత్యక్షంగా సహకరిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచేందుకు మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు నిత్యం ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే దారులు లేక మృతి చెందేందుకు సిద్ధమవుతున్నారన్న వాదనలు లేకపోలేదు. ప్రతి సమస్యకూ చావే కారణం కాకున్నా ధార్మిక సంస్థలోని అధికారుల అధర్మ విధానాలకు మాత్రం కార్మికులు మృత్యుపాలయ్యేందుకు ప్రేరేపిస్తున్నాయనడంలో సందేహం లేదు. పని ప్రాంతాల్లోనూ వేధింపులే.. ఓ వైపు కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులు, మరోౖ పు ఉద్యోగం చేస్తున్న విభాగాల్లో చా లని వేతనాలతో పాటు కార్మికులకు పని ప్రాంతాల్లో వేధింపులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో భాగంగానే గత ఏడాది ఔట్ సోర్సింగ్ సెల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులపై అధికారి వెకిలి చేష్టలు, లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పురుష కాంట్రాక్ట్ కార్మికులు సైతం ఆయా విభాగాల్లోని అధి కారుల వేధింపులు, సూటిపోటి మాటలను భరి స్తూ ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు. అధికారులు కళ్లు తెరవాలి టీటీడీ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ ప్రతి అంశానికీ ప్రభుత్వంపై నెపంవేసే విధానాన్ని మార్చుకోవాలి. రాజకీయ ప్రమేయం ధార్మిక సంస్థలో ఉన్నన్నాళ్లు కాంట్రాక్ట్ కార్మికుల గోడు వినిపించుకునేవారు ఉండరు. అలాంటప్పుడు ధార్మిక సంస్థ అనే పేరుకు సార్థకత ఉండదు. అధికారులు కళ్లు తెరవాలి.– టి.సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలి టీటీడీలోని మహిళా కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా మార్పులు తేవా లి. వేధింపుల విషయంలో అధికారులు నిఖార్సుగా వ్యవహరించి చర్యలు తీసుకుంటే తప్పులకు ఆస్కారం ఉండదు. కనీస వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కార్మికుల స్థానంలో అధికారులే పనులు చేస్తే కార్మికుల ఘోష ఏంటో తెలిసి వస్తుంది.– రుద్రరాజు శ్రీదేవి,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు -
ప్రాణం తీసిన ఫోన్ కాల్
చిత్తూరు, పెద్దమండ్యం: పరారీలో ఉన్న జంట చేసిన ఫోన్కాల్ ఓ తాత్కాలిక ఉద్యోగి ప్రాణం తీసింది. ప్రియుడితో వెళ్లిన మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ పేరుతో తాత్కాలిక ఉద్యోగిని స్టేషన్కు పిలిపించారు. దీన్ని అవమానంగా బావించిన అతను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు అనంతపురం జిల్లా 3 వపట్టణ ఎస్ఐ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు, మృతుడు రాసిన సూసైడ్ నోట్లోని వివరాల ప్రకారం.. పెద్దమండ్యం మండలంలోని శివపురం కస్పాకు చెందిన లక్కం రెడ్డిమల్రెడ్డి కొడుకు లక్కం నాగిరెడ్డి అనంతపురం జిల్లా ఎన్పీకుంట బీసీ హాస్టల్లో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో గాండ్లపెంట, నల్లచెరువు, గుత్తిమండలం ఇసురాళ్లపల్లె, నల్లమాడ మండలాల్లోనూ పనిచేశాడు. 12 ఏళ్ల క్రితం ఇసురాళ్లపల్లె బీసీ హాస్టల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ చదువుకున్న విద్యార్థులకు తన ఫోన్ నెంబరు ఇచ్చాడు. ఇటీవల అదే ప్రాంతానికి చెందిన వివాహిత తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మహిళ భర్త అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న వారి సెల్ వివరాలను సేకరించారు. వారు బీసీ హాస్టల్ అటెండర్ లక్కం నాగిరెడ్డి సెల్కు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నాగిరెడ్డిని పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారించారు. నాగిరెడ్డి సోమవారం సాయంత్రం స్వగ్రామమైన శివపురం వచ్చాడు. తన తప్పు లేకపోయినా పోలీసులు విచారించడాన్ని అవమానంగా భావించాడు. తీవ్ర మనస్తాపం చెంది గ్రామ సమీపంలో చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహితులైన జంట పరారీలో తనకు సంబంధం లేకపోయినా అనంతపురం 3వ పట్టణ ఎస్ఐ వేధించాడని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. సంఘటనా స్థలాన్ని పెద్దమండ్యం ఎస్ఐ శంకరమల్లయ్య పరిశీలించారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నాగిరెడ్డి అనంతపురం జిల్లా వెనుకబడిన తరగతుల హాస్టల్ దినసరి వేతన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మృతునికి భార్య శివకుమారి, కుమారులు భార్గవకుమార్రెడ్డి (23), రెడ్డిశేఖరరెడ్డి (20) ఉన్నారు. భార్య శివకుమారి శివపురం అంగన్వాడీ కేంద్రం కార్యకర్తగా పనిచేస్తోంది. -
తండ్రిని కడతేర్చిన కుమార్తె
పుంగనూరు: చెడు అలవాట్లకు బానిసై, వేధిస్తున్న కన్నతండ్రిని కుమార్తె బండరాయితో కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులోని మేలుపట్లలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మేలుపట్లలో షేక్బాబుబాషా (48)కు కుమార్తె నగీన, కుమారుడు సిద్దిక్ ఉన్నారు. నగీన టీటీసీ చదువుతోంది. కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. మద్యానికి బానిసైన షేక్బాబుబాషా మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. కుటుంబ సభ్యులను కొట్టడం, ఇంట్లో వస్తువులు అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగేవాడు. పలుమార్లు చెప్పిన బాబుబాషా ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో తీవ్రంగా గొడవపడ్డాడు. విసిగిపోయిన నగీన ఇంటి ముందు నిద్రిస్తున్న తండ్రి తలపై పెద్ద బండరాయితో మోదింది. బాబూబాషా అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితురాలు నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. సీఐ సాయినాథ్, ఎస్ఐ అరుణ్కుమార్రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. -
మృత్యుశకటం
కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం అతడిని తీసుకుని కుటుంబ సభ్యులు వచ్చారు. చికిత్స అనంతరం తిరుగుప్రయాణ మయ్యారు. ఇంతలోనే దురదృష్టం వెంటాడింది. వేగంగా దూసుకొచ్చిన లారీ వారి ప్రాణాలను బలి తీసుకుం ది. శాంతిపురం మండలం కడపల్లి సమీపంలో మంగళవారం జరిగిన ఘోర దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారు. వీరంతా తమిళనాడు వాసులే. శాంతిపురం:తమిళనాడులోని జిల్లా కేంద్రమైన ధర్మపురి సమీపంలో ఉన్న వల్లగట్టూరుకు చెందిన చిన్నస్వామి(40)కి పక్షవాతం వచ్చింది. పలమనేరు సమీపంలో ని విరూపాక్షపురంలో నాటు వైద్యంతో వ్యాధి నయమవుతుందని ఇతని కుటుం బ సభ్యులు తెలుసుకున్నారు. చిన్న స్వామితో పాటు విరూపాక్షపురం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం కారులో అతన్ని వెంటబెట్టుకుని సోదరి కృష్ణమ్మ (68), బంధువులు శేఖర్(45), మోహన్కుమార్(38), దారి చూపడం కోసం అదే గ్రామానికి చెందిన రంగప్ప(60) వచ్చారు. వీరిలో మోహన్కుమార్, శేఖర్లు అన్నదమ్ములు. కృష్ణమ్మదికోయిలర్కొటార్ గ్రామం. వీరంతా ఉదయం చేరుకుని చిన్నస్వామికి చికిత్స చేయించారు. పక్షవాత నివారణ మందు తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి తిరుగుపయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును కడపల్లి సమీపంలోని బొమ్మలగుట్ట సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. కారు తుక్కుతుక్కుగా మారింది. ముందు వరసలో ఉన్న వారు పూర్తిగా ఇరుక్కుపోయి నలిగిపోయారు. రాళ్లబూదుగూరు, కుప్పం పోలీ సులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులు, రోడ్డున వెళ్లేవారు, పోలీసులు అతికష్టం మీద వారిని కారులోంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడటంతో ఐదుగురూ చనిపోయారు. తమిళనాడులోని తిరుపత్తూరు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు వెళ్తూ ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసు కున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని రాళ్లబూదుగూరు స్టేషన్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన మృతదేహాలను కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఎస్పీ రాజశేఖరబాబు ఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గమనించి వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కుప్పం సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటశివకుమార్లకు సూచించారు. అతివేగమే ప్రాణాలను బలి తీసుకుందని గుర్తించారు. సాయంత్రానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వారంతా కన్నీరుమున్నీరయ్యారు. -
ఇక నిఘా నేత్రాన్ని తప్పించుకోలేరు
నేర నియంత్రణలో అర్బన్ జిల్లా కొత్తపుంతలు తొక్కుతోంది. హైటెక్ టెక్నాలజీతో ఇప్పటికే అర్బన్ పోలీసులు ముందంజలో ఉన్నారు.తిరుపతిలోని సీసీ కెమెరాలను రాష్ట్రంలోనేనెంబర్ వన్గా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్బన్ జిల్లాపరిధిలో 2వ కమాండెంట్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్బన్ జిల్లాఅంతటా ఈ నిఘానేత్రాలు విస్తరించనున్నాయి. జిల్లాకు వచ్చే భక్తులు, ప్రజలకు మరింత భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ.. శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. నెల రోజుల్లో తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లోని రెండో అంతస్తులో అధికారికంగా ఈ నిఘా నేత్ర కేంద్రాన్ని ప్రారంభించేందుకుఎస్పీ అభిషేక్ మొహంతి సిద్ధం చేసుకున్నారు. తిరుపతి క్రైం: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని భద్రతానగరంగా తీర్చిదిద్దే పని చురుగ్గా సాగుతోంది. 2012లోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద తిరుపతి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు కెమెరాలను ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ను ఆధునీకరించేందుకు 2014లో రూ.50 లక్షలు ప్రభుత్వం కేటా యించింది. అదే ఏడాది డిసెంబరులో సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ను ఈస్ట్ పోలీస్స్టేషన్లో వీడియో వాల్తో అప్పటి డీజీపీ జేవీ రాముడు ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలోని 59 ప్రధాన సర్కిల్స్లో 324 సీసీ కెమెరాలున్నాయి. ఇందులో హై టెక్నాలజీ కలగిన 41 జూమింగ్ కెమెరాలు ప్రధాన సర్కిళ్లలో ఏర్పాటయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో 285 కెమెరాలను ఏర్పాటు చేశారు. అభిషేక్ మొహంతి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 150 కెమెరాలు ఏర్పాటు కావడం విశేషం. గతంలో సీసీ కెమెరాలు లేని ప్రాంతాలైనచెర్లోపల్లి నుంచి పద్మావతిపురం వరకు ఉన్న చాముండేశ్వరీ ఆలయం, వైకుంఠపురం, అవిలాల, ఉప్పర పల్లి, ఆంధ్రాబ్యాంక్ కాలనీ, పద్మావతిపు రం, శ్రీనివాసపురం, కేశవాయని గుంట, ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేశారు. నూతన కెమెరాల వివరాలు ♦ అర్బన్ జిల్లా పరిధిలో 852 సీసీ కెమెరాల్లో వివిధ రకాలు ఉన్నాయి. ఇందులో ఆర్ఎల్వీడీ సీసీ కెమెరాలు 33, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద రెడ్ లైట్ పడి ముందుకు వెళ్లిన వాహనాలను గుర్తిస్తాయి. ♦ ఎన్పీఆర్ సీసీ కెమెరాలు 250 ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఆటోమేటిక్గా వాహన నెంబర్ ప్లేట్లు గుర్తిస్తాయి. ♦ ఎఫ్ఆర్ఎస్ సీసీ కెమెరాలు 103 ఏర్పాటు చేయనున్నారు. ఇవి మనిషి ముఖాన్ని పూర్తిస్థాయిలో గుర్తించగలవు. ♦ 58 వీడీఏ సీసీ కెమెరాలు నిరంతరం వీడియోలు తీస్తాయి. బస్టాండ్, ఆలయాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి వీడియో తీసిన సమయంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగు, వాహనాలు, వస్తువులు ఉంచి ఆపై నిర్ణీత గడువులోపల తీసుకోకపోతే అలాంటి వస్తువును ఇది గుర్తించి అప్రమత్తం చేస్తుంది. ♦ 200 జనరల్ సర్వైలెన్స్లు సాధారణ కెమెరాల్లా పనిచేస్తాయి. ♦ 208 పీటీజెడ్ కెమెరాలు అత్యంత నాణ్యత కల్గిన ఫొటోలను తీయగలవు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, రంగంపేట, వడమాలపేట ప్రాంతాల్లో 500, నగరంలో మరో 300 ఈ తరహా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ప్రవేశించే ప్రతి వాహనాన్ని, వ్యక్తిని గుర్తించే లక్ష్యంగా పోలీసులు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ఫైబర్తో అనుసంధానం అర్బన్ జిల్లా పరిధిలో సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రం విజయవాడలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంలో ఉంది. ప్రభుత్వం రియల్టైం గవర్నెన్స్ లింక్ (ఆర్టీజీ) కలిగి ఉంటుంది. తిరుపతిలోని సీసీ కెమెరాల నిఘా కల్గిన ప్రతి ప్రాంతాన్ని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా పరిశీలించవచ్చు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న నిఘాకేంద్రాన్ని ఆర్టీజీకి అనుసంధానం చేయనున్నారు. -
లేడీ కేడీ ‘ఇంటి’ గుట్టు
ఓ లేడీ కేడీ పనులు బయటపడ్డాయి.. మాయ మాటలతో పేదలను బురిడీ కొట్టించిన వైనం వెలుగుచూసింది.. ఇళ్లు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసింది.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీలంటూ మోసగించింది.. ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇళ్లు రాకపోవడంతో బాధితులు కార్పొరేషన్ అధికారుల వద్దకు రాగా అసలు విషయం బయట పడింది... ఊహించని ఈ ఘటనతో కార్పొరేషన్ యంత్రాంగం ఉలిక్కి పడింది. విషయం తెలుసుకున్న కమిషనర్ విజయ్రామరాజు విచారణకు ఆదేశించారు. పోలీసులు రంగప్రవేశం చేసి హౌసింగ్ స్క్యామ్ కూపీ లాగుతున్నారు. విచారణలో కొందరి కార్పొరేషన్ సిబ్బంది పేర్లు బయటకు రావడంతో ఆ దిశగా కూడా విచారిస్తున్నారు. తిరుపతి తుడా: తిరుపతి కర్నాలవీధి సమీపంలోని కస్తూరిబా వీధికి చెందిన ఓ మహిళ ఆది నుంచి పేదలను మోసం చేయడమే పనిగా పెట్టుకుంది. ప్రజావసరాలను తనకు అనుకూలంగా ఉపయోగిస్తూ మామూళ్లకు అలవాటు పడింది. ఆరు నెలల కిందటి వరకు ఆమె తిరుపతి తహశీల్దార్ కార్యాలయంలో బీఎల్వోగా పనిచేసేది. కార్యాలయానికి వచ్చే వారిని మాటల్లో పెట్టి సర్టిఫికెట్ ఇప్పిస్తానని, రేషన్ కార్డు, పెన్షన్, ఇళ్ల పట్టాలు.. ఇలా అవసరమయ్యేవాటిని తీసిస్తానని చెప్పి అందినకాడికి వసూలు చేసేదని తె లిసింది. వరుసగా ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికా రులు ఆమెను బీఎల్వో పోస్టు నుంచి తప్పించారు. అయినా ఆమె ఆగలేదు. మరింతగా ప్రజల్ని మోసగించే పనిలో పడ్డారు. ఇటీవల తిరుపతి కార్పొరేషన్ పరిధిలో పేదల ఇళ్లనిర్మాణ పనులు జోరుగా చేపట్టారు. ఈ హౌసింగ్ స్కీమ్ను స్కాంగా మలుచుకుంది. ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేస్తూ కొందరి నుంచి లక్షలు వసూలు చేసింది. ఏడెనిమిది నెలలు అవుతున్నా ఇళ్లు రాకపోవడంతో బాధితులు కార్యాలయానికివచ్చారు. విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. మాయ మాటలతో మస్కా..కమిషనర్ సంతకం ఫోర్జరీ మున్సిపల్ కార్పొరేషన్ పూర్వపు కమిషనర్, ప్రస్తుత వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ సంతకాన్ని ఆ మహిళ ఫోర్జరీ చేసింది. కమిషనర్ పేరుతో స్టాంపును తయారు చేసుకుంది. తిరుపతిలో గతంలో రెవెన్యూ వార్డులు 6–17 పరిధిలో బీఎల్ఓగా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చింది. పాత పరిచయాలతో ఇళ్లు లేని పేదలను టార్గెట్ చేసుకుని ఇళ్లు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పింది. ఆమెతో పాటు మరికొందరు గ్రూపుగా ఏర్పడి హౌసింగ్ మాఫియాకు తెరలేపారు. గత కమిషనర్ హరికిరణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, స్టాంపును సిద్ధం చేసుకుంది. దామి నేడు రూ.లక్ష, పాడిపేట రూ.2 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకుంది. ముందు ఇళ్ల కేటాయింపు పత్రాలను ఇప్పించిన తర్వాతే డబ్బులు ఇవ్వండని ఆమెతోపాటు మిగిలినవారు నమ్మించారు. ఆమెపై నమ్మకంతో డబ్బులు కట్టేందుకు ముందుకొచ్చా రు. కమిషనర్ పేరుతో సొంతంగా డాక్యుమెంటును సిద్ధం చేసుకుని ఇళ్లు కేటాయిం చినట్టు ఆర్డర్ తయారు చేసుకున్నారు. ఆర్డర్ను చేతిలో పెట్టి రూ.1–2 లక్షల వరకు, మరీ నమ్మిన వాళ్ల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును మరో వ్యక్తి హనుమంతు అకౌంట్లో జమచేసినట్లు గుర్తించారు. నాలుగు రోజుల నుంచి విషయం బయటకు పొ క్కుండా లోలోనవిచారణ చేపడుతున్నారు. కమిషనర్ ఆగ్రహం.. హౌసింగ్ మాఫియాపై కమిషనర్ విజయ్రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశా రు. బాధితుల ఫిర్యాదులపై ఆరా తీస్తున్నా రు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతికి సమాచారం ఇచ్చారు. ఈస్ట్ పోలీసులను కలిసి బాధితులు గోడును వెల్లబోసుకున్నారు. 18 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఈస్ట్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, క్రైం బ్రాంచ్ పోలీసులు హౌసింగ్ మాఫి యాపై కూపీ లాగుతున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరోపణలెదుర్కొంటున్న మహిళను విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొంతమంది పేర్లను ఆమె చెప్పడంతో పోలీసులు విచారించారు. ఇప్పటివరకూ రూ.25 లక్షలను వసూలు చేసినట్టు బయటపడింది. మరికొందరు బాధితులున్నట్లు భావిస్తున్నారు. -
ప్రియాంకా.. ఎందుకిలా చేశావ్ ?
చిత్తూరు, కురబలకోట: విద్యార్థినుల బలవన్మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఎంబీబీఎస్ విద్యార్థిని గీతిక తనువు చాలించి రెండు రోజులు గడవకమునుపే మరో విద్యాసుమం రాలిపోయింది. అంగళ్లులో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిని ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. కారణాలు తెలియనప్పటికీ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్య ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొనాల్సిన విద్యావంతులు ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. విద్యాసంస్థల్లో తక్షణ కౌన్సెలింగ్ అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అంగళ్లు సమీపాన ఇంజినీరింగ్ కశాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ప్రియాంక తన స్వస్థలం అనంతపురం జిల్లా కదిరి ప్రాంతం పట్నంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఇక్కడి విద్యార్థులను విషాదంలో ముంచింది. ర్యాగింగ్, ఈ వ్టీజింగ్తో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రి యాంక తండ్రి నగేష్ అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రూరల్ సీఐ రమేష్, ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య విచారణ జరిపారు. ఆమె చదువుతున్న మండలంలోని ఇంజినీరింగ్ కళాశాలలో వి ద్యార్థులను, యాజమాన్యాన్ని విచారించా రు. హాస్టల్ను సందర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రియాంక కలివిడిగా మసలుకునేదని సహ విద్యార్థులు చెబుతున్నారు. ఈమె తండ్రి ఆటోడ్రైవర్. కళాశాల ఉచితంగా హాస్టల్ వసతి కల్పించినట్లు యాజమాన్యం చెబు తోంది. ర్యాగింగ్ జరగలేదని పోలీసులకు యాజమాన్యం వివరించింది. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ర్యాగింగ్ ఎదురుకాదని పేర్కొనట్లు భోగట్టా. వ్యక్తిగత అంశాలపై పోలీసులు ఆరా తీశారు. తాతకు బాగలేదని మంగళవారం ప్రియాంక కళాశాలకు సెలవు పెట్టింది. కళాశాల హాస్టల్నుంచి సోమవారం సాయంత్రం కళాశాల బస్సులోనే కదిరి వెళ్లింది. అదే రోజు రాత్రి ఇంటిలో చనిపోయింది. విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు మంగళవారం కళాశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. -
మాయమాటలతో కలిసిపోతుంది.. కొట్టేస్తుంది
తిరుపతి క్రైం: నగరంలో ఆటో, బస్సుల్లో ప్రయాణికులతో కలసిపోయి మాయమాటలతో హ్యాండ్బ్యాగ్లు, బంగారు ఆభరణాల చోరీకి పాల్పడే ఘరానా మహిళా దొంగను క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. క్రైం డీఎస్పీ రవిశంకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అట్టీయాంపట్టికి చెందిన రేవతి (34), ముత్తమ్మ, సెల్వి, లక్ష్మిలతో కలసి ముఠాగా ఏర్పడింది. వీరు తిరుపతిలో బస్సులు, ఆటోల్లో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేసే వారు. ఈ క్రమంలోనే దొంగిలించిన నగలను తిరుపతిలో అమ్ముకునేందుకు పథకం పన్నారు. మిగిలిన సభ్యుల కోసం ప్రధాన నిందితురాలు రేవతి తిరుపతి ఆర్టీసీ బస్టాండు వద్ద వేచి ఉండగా క్రైం సీఐ భాస్కర్రెడ్డి అరెస్టు చేశారు. 228 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.84 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఈస్టు పీఎస్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. భారతిని చాక చక్యంగా అరెస్టు చేసిన సీఐ శరత్చంద్ర, పద్మలత, ఎస్ఐ రమేష్బాబులకు మనీ రివార్డులు వచ్చేలా ఎస్పీకి సిఫార్సు చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
నిన్న శిల్ప.. నేడు గీతిక
తిరుపతి అర్బన్ : మెడికోల వరుస బలవన్మరణాలతో తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఉలిక్కిపడింది. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక బలవన్మరణం విద్యార్థులను, వైద్యులను కలవరపాటుకు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అశువులు బాయటం సర్వత్రా ఆందోళనకు తావిస్తోంది. భావి డాక్టర్ల బలవన్మరణాలు సమాజాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. మెడికల్ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఇంటర్నల్ పరీక్షలు.. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం పాథాలజీ అంశంలో ఇంటర్నల్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గీతిక మృతితో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశముందని వైద్య విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. పరీక్షలకు భయపడేంత విధంగా ఇంటర్నల్ పరీక్షలు జరగవని జూడాల నాయకులు చెబుతుండగా, పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులకు భయపడి గీతిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా...? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కళాశాలలోనూ గీతిక ఎక్కువగా ఎవరితోనూ కలివిడిగా ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు. భరోసా ఇచ్చే చర్యలు శూన్యం.. ఒక్క ఎస్వీ మెడికల్ కళాశాలలోనే కాకుండా ఏ విద్యా సంస్థలోనైనా, విధి నిర్వహణ ప్రాంతా ల్లోనైనా వేధింపులు ఎదురైనప్పుడు వారికి భరోసా కలిగించే చర్యలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుత ఈ రెండు ఘటనలే నిదర్శనాలుగా నిలిచాయి. ఏదో ఘటన జరిగిన సందర్భంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణ మవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగాఅవగాహన కల్పించాలి.. కళాశాలల్లో, విధి నిర్వహణ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేలా నిరంతరం అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ధైర్యం నూరిపోయాలి. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలూ శ్రీకారం చుట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ప్రద్యుమ్న సూ చించిన వేధింపుల నివారణ కమిటీల ఏర్పాటునూ వేగవంతం చేయాలన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అవసరమైతే ఈ అంశాలను హైస్కూల్ స్థాయిలోని పాఠ్యాంశాల్లోనే చొప్పించాల్సిన అవసరముంది. -
‘అలా చేసుంటే శిల్ప బతికేది’
సాక్షి, తిరుపతి: తన భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ముందే స్పందించివుంటే ఆమె బతికేదని డాక్టర్ శిల్ప భర్త రూపేశ్ అన్నారు. ఫిర్యాదు చేసిన ప్రతిసారీ శిల్పను చిన్నచూపు చూశారని వెల్లడించారు. మానసిక సంఘర్షణకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకునివుంటే శిల్ప ఆత్మహత్య చేసుకునేది కాదని ఆమె తండ్రి రాజగోపాల్ అన్నారు. తమను పరామర్శించిన వివిధ సంఘాల నాయకులతో వారు మాట్లాడారు. ఏడాదిన్నర పోరాడింది చిన్నప్పటి నుంచి శిల్పను గారాబంగా పెంచుకున్నామని, గోల్డ్ మెడల్ విద్యార్థి కావడంతో మెడిసిన్ పూర్తి చేసిందని రాజగోపాల్ తెలిపారు. పీజీ కోర్సు కూడా అయిపోతే తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆశించామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుపై శిల్ప ఫిర్యాదు చేసిందని, ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకునివుంటే తమకు కడుపుకోత మిగిలేది కాదన్నారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న అన్యాయాలపై ఏడాదిన్నరగా శిల్ప పోరాడుతూనే ఉందని, ఎన్నోమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. మే నెలలో గవర్నర్ కూడా ఫిర్యాదు చేసిందని, దీంతో కక్ష కట్టి పరీక్షల్లో శిల్పను ఫెయిల్ చేశారని ఆరోపించారు. దోషులను చట్టప్రకారం శిక్షించాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకున్నారు. ఇద్దరిపై కేసులు డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతంలో ఆమె సోదరి శృతి ఫిర్యాదు మేరకు రవికుమార్, కిరీటి శశికుమార్ లపై కేసులు నమోదు చేసినట్టు పీలేరు సిఐ సిద్ధ తేజోమూర్తి తెలిపారు. ఐపీసీ 354 డీ,509, 506, 306, 34 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టినట్టు వెల్లడించారు. కాగా, శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఎస్వీ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిర్లక్ష్యమే ప్రాణం తీసింది డాక్టర్ శిల్ప ఫిర్యాదు చేసినప్పుడే స్పందించివుంటే ఇంత అమానుషం జరిగేది కాదని మహిళా ఐక్యవేదిక, సీపీఎం అనుబంధ సంస్థ ఐద్వా సభ్యులు అన్నారు. శిల్పను నమ్ముకున్న కుటుంబ సభ్యులు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా శోకం మిగిలిందని పేర్కొన్నారు. శిల్ప కుటుంబ సభ్యులను శనివారం మహిళా సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. -
మత్తెక్కించే అవినీతి
చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగంలో ఓ సాధారణ కానిస్టేబుల్గా చేరిన వ్యక్తి 26 ఏళ్ల సర్వీసులో ఏం సాధించావని ఎవరైనా అడిగితే మంచి పేరు అనో, నిజాయితీ ఉన్న వ్యక్తనో, ఎవ్వరికీ తలవంచడనో సమాధానాలు రావాలి. కానీ చిత్తూరుకు చెందిన విజయ్కుమార్ మాత్రం ఈ 26 ఏళ్ల సర్వీసులో దాదాపు రూ.35 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. కల్తీ మద్యం తయారు చేసిన కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సీఐడీ పోలీసుల చేత అరెస్టయి జైల్లో ఉన్నాడు. అయినా మార్పు రాలేదు. ఈసారి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఇప్పటికీ ట్రాక్టర్ నడుపుతూ.. చిత్తూరు నగరంలోని కాజూరుకు చెందిన విజయ్ కుమార్ను చూస్తే ఎవరైనా ఇన్ని రూ.కోట్ల విలు వైన ఆస్తులున్నాయంటే నమ్మరు. ఎందుకంటే ఆబ్కారీ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాఓ సాధారణ వ్యక్తిలానే ఇతని దినచర్య ఉంటుంది. కర్నూలు నుంచి చిత్తూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే నీటి ట్యాంకరున్న ట్రాక్టర్ నడుపుతూ వీధుల్లో తాగునీరుఅమ్ముతుంటాడు. ఇక్కడున్న పెట్రోలు బంకు వద్ద తనకు చెందిన శుద్ధినీటి ప్లాంటులో కూర్చుని నీళ్ల క్యాన్లు విక్రయిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి ఇన్ని రూ.కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడంటే స్థానికులు ఆశ్యర్యంగా చూస్తున్నారు. పాఠం నేర్పని గతం.. జిల్లాలోని తిరుపతిలో ప్రభుత్వ మద్యం బాటిళ్ల సరఫరా డిపోలో పనిచేస్తున్నప్పుడే విజయ్కుమార్పై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో కల్తీ మద్యం జిల్లాలోకి తీసుకొచ్చారనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2014లో విజయ్కుమార్ను అరెస్టు చేశారు. బెయిల్ రాకపోవడంతో ఆరు నెలల వరకు జైల్లో ఉన్నాడు. అప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. జిల్లా నుంచి కర్నూలుకు బదిలీ అయినప్పటికీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అన్ని ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వామ్మో ఇన్ని ఆస్తులా.. విజయ్కుమార్ అక్రమ సంపాదన, ఆస్తుల గురించి సొంత శాఖలోని ఓ వ్యక్తి నుంచి ఆధారాలతో కూడిన పక్కా సమాచారం ఏసీబీకి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ తిరుమలేష్, సీఐలు చంద్రశేఖర్, విష్ణువర్దన్, ప్రసాద్రెడ్డి, గిరిధర్, విజయశేఖర్, రమేష్, శివకుమార్, ఎస్ఐ విష్ణువర్దన్, కడప, కర్నూలుకు చెందిన ఏసీబీ అధికారులు చిత్తూరు, యాదమరి, తమిళనాడులోని కాట్పాడి, తిరుపతి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో విజయ్కుమార్ భార్య మీన పేరిట మూడంతస్తుల భవనం, రెండంతస్తుల భవనం, మరో రెండు భవనాలకు సంబంధించి పత్రాలు దొరికాయి. ఇరువారం, కాజూరు ప్రాంతాల్లో ఎనిమిది ప్లాట్లు, కాజూరులో ఓ ఇల్లు, తమిళనాడులోని కాట్పాడిలో ఓ ఇల్లుకు సంబంధించిన పత్రాలు, విజయ్కుమార్ పేరిట కాజూరులో ఓ శుద్ధినీటి ప్లాంటుకు చెందిన ఖాళీ స్థలం, ఇరువారం వద్ద ఓ స్థలాన్ని, ఇతని కొడుకు పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. ఇక బంగారు ఆభరణాల్లో ఆడవాళ్లు పెట్టుకునే చెవి కమ్మల్లో 10 రకాలు, చేతి కడియాలు, ఐదు రకాల గొలుసులు, పదికి పైగా ఉంగరాలు, రాళ్ల హారాలు, వెండి ఆభరణాలు చూసిన అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ నేతల భరోసా... విజయ్కుమార్ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు చిత్తూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత అండగా నిలిచినట్లు బహిరంగంగా చెబుతున్నారు. జైల్లో ఉన్న విజయ్కుమార్ను బయటకు తీసుకురావడంతో పాటు మళ్లీ పోస్టింగ్ ఇప్పించడం, పదోన్నతి కల్పించడంలో టీడీపీ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్ స్థాయిలో పనిచేసిన ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. మరోవైపు విజయ్కుమార్ ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులు జిల్లాలోని ఎక్సైజ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. తిరుపతిలోనూ తనిఖీలు తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చిత్తూరు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ విజయ్కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి వివేకానందనగర్లో ఎస్ఐ చెల్లెలు విశాలాక్షి ఇంట్లో కూడా అధికారులు తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ మల్లేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఎలాంటి ఆస్తులూ పట్టుబడలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల కోసం ఆరా తీస్తున్నారు. -
నిర్లక్ష్యమే ఉసురు తీసిందా!?
తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకెదురవుతున్న లైంగిక వేధింపులపై చేసిన ఫిర్యాదుపై సాక్షాత్తు రాష్ట్ర గవర్నరే స్పందించినా అదే స్థాయిలో ఇతర అధికారులు స్పందించకపోవడం, విచారణ చేసి నాలుగు నెలలైనా వాస్తవాలేమిటో వెల్లడించకపోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. బాధితురాలు విచారణ నివేదిక బహిర్గతం చేయాలని ఎన్నోసార్లు మొత్తుకున్నా ఆమె ఘోష అరణ్య రోదనే అయ్యింది. మరోవైపు– కాలేజీలో వేధింపుల పర్వం మరింత ఎక్కువైందని జూనియర్ డాక్టర్ల వాదన. ఈ నేపథ్యంలో పీజీ పరీక్షలు జరిగాయి. పీజీ పరీక్షల్లోనూ డాక్టర్ శిల్ప కు ముగ్గురు సమస్యలు సృష్టించారని ప్రచారంలోకి వచ్చింది. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్తోపాటు ప్రొఫెసర్లు డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్ ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..‘‘మహిళలను వేధిస్తే కఠినంగా వ్యవహరిస్తాం..వారి రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటాం..’ అని వివిధ సందర్భాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినా, మహిళలను వేధిస్తే ఖబడ్దార్ అనే లెవెల్లో పోలీసులు ఊదరగొట్టినా శిల్పకు ఎవరి అండా లభించలేదని, అడుగడుగునా అవరోధాలే ఎదురయ్యాయని వైద్య విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఆమె ఫిర్యాదులపై సకాలంలో స్పందించి, విచారణ వేగవంతం చేసి, నివేదిక బహిర్గతం చేసి ఉంటే ఒక నిండుప్రాణం బలయ్యేది కాదని వైద్య విద్యార్థి లోకం ఘోషిస్తోంది. ‘అధికార’ రాజకీయ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నారంటూ డాక్టర్ శిల్ప గవర్నర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న డాక్టర్, ఆయనకు సహాయంగా ఉంటున్నారన్న ఇద్దరు ప్రొఫెసర్లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆమెపై వివిధ రూపాల్లో ‘కాముకాసురులు’ రెచ్చిపోయారు. ఈ కాముకాసురులు వేధింపులు శృతి మించుతుండడంతో శిల్ప అలిపిరి పోలీసులను కూడా ఆశ్రయించారు. అయితే అధికార, రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా కావడంతో విధిలేక ఆమె ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్లు కాలేజీ వర్గాల్లో బలంగా వినబడుతోంది. అటు ఉన్నత స్థాయి అధికారులే కాకుండా చివరకు పోలీసు వ్యవస్థ కూడా ఆమెకు అండగా నిలబడకపోవడం శాపమైంది. దీంతో మానసిక ఒత్తిళ్లతో ఆమె నలిగిపోయారు. పీజీ పరీక్షల ఫలితాలతో మరింత కుంగుబాటుకు గురైనట్లు తెలుస్తోంది. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న తనకే న్యాయం జరగలేదంటే, మిగిలిన వారి పరిస్థితి ఏమిటో? అని సన్నిహితుల వద్ద ఆమె కన్నీటిపర్యంతమైనట్లు తెలియవచ్చింది. అంతటా ఆధిపత్య పోరే మెడికల్ కాలేజీలో విభాగాధిపతులు, వైద్య అధ్యాపకులు, వైద్యుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న పోరు, ఆధిపత్యం, వివాదాలకు ప్రతిసారీ వైద్య విద్యార్థులే పావులుగా మారుతున్నారనే వాదన వినిపిస్తోంది. విభాగాధిపతులతో సన్నిహితంగా ఎవరు వ్యవహరించినా మరో వర్గం దానిని భూతద్దంలో చూపేందుకు ప్రయత్నిస్తూంటుందని మరో వాదన. ఇలాంటి కోవకే పీజీ విద్యార్థిని శిల్ప వ్యవహారం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ వైద్య విద్య కోర్సులతో పాటు ఎంబీబీఎస్, ఎండీ కోర్సులను సుదూర ప్రాంతాల విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారు బస చేసే హాస్టళ్లలోను వైద్య విభాగా«ధిపతులు, ప్రొఫెసర్లు రాత్రి వేళల్లో మకాం వేసి, తమకు అనుకూలంగా వ్యవహరించేలా వారిపై నయానో భయానో ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో వచ్చిన విద్యార్థులకు వీరి చర్యలు కంపరం కలిగిస్తున్నా మౌనంగా భరిస్తున్నారని, ఒకవేళ తెగించి గళం విప్పితే, ముప్పేటలా దాడి చేసి, చివరకు వారికి జీవితమే లేకుండా చేస్తున్నారనడానికి శిల్ప ఉదంతమే ఓ ఉదాహరణ అని విద్యార్థిలోకం, మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. తల్లి, తండ్రి తర్వాత గురువే దైవమని చెప్పుకునే మన సంస్కృతిలో ఇప్పుడు గురువుల స్థానం ఏమిటో ఇలాంటి ఉదంతాలు సమాజానికి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు. కొందరు గురువుల తీరు మారకపోతే నష్టపోయేది సమాజమే. ఇకనైనా ప్రభుత్వం ఇబ్బందులు లేని విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చే దిశగా కార్యాచరణకు పూనుకోవాలని పలువురు కోరుతున్నారు. పీలేరులో సీఐడీ అధికారుల విచారణ పీలేరులోని శిల్ప ఇంట శుక్రవారం సీఐడీ అధికారులు ఆమె తల్లిదండ్రులను కలిశారు. కుటుంబ సభ్యులను విచారణ చేశారు. శిల్ప ఆత్మహత్యకు దారితీసిన సంఘటనలు గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి డాక్టర్ శిల్ప మృతి ఘటన చిత్తూరు కలెక్టరేట్ : ఎస్వీ మెడికల్ కాలేజ్ పీజీ వైద్యవిద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కలెక్టర్ ప్రద్యుమ్న తీసుకెళ్లారు. శుక్రవారం కలెక్టర్ అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. శిల్ప మృతితో ఎస్వీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న పరిణామాలు, జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, శిల్ప తల్లిదండ్రుల డిమాండ్లు తదితర అంశాలను ముఖ్యమంత్రికి ఆయన నివేదించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి శిల్ప మృతి సంఘటనపై సీఐడీ విచారణను వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వ డాక్టర్లతో సమావేశం నిర్వహించి, నిరుపేద రోగులకు వైద్య సేవలను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఫలించిన విద్యార్థి పోరు
తిరుపతి అర్బన్/పీలేరు: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం ఎస్వీ మెడికల్ కాలేజిని కుదిపేసింది. ఎట్టకేలకు బాధ్యులైన ఇద్ద రు ప్రొఫెసర్లను ప్రభుత్వం నెల్లూరు బది లీ చేసింది. ప్రిన్సిపల్ రమణయ్యను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.బుధవారం ఉదయం బాధ్యులైన ప్రొఫెసర్లను అరెస్టు చేయాల్సిందేనని విద్యార్థులు భీష్మించారు. కలెక్టరు స్వయంగా వచ్చి తన డిమాండ్లపై చర్చించాలనంటూ నిరసించారు. వైద్యాధికారులతో, విద్యార్థులతో హైపవర్ కమిటీ తొలుత జరిపినచర్చలు ఫలప్రదం కాలేదు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలి సింది. శిల్ప ఆత్మహత్యపై హైపవర్ కమిటీతో పాటు సీఐడీ కూడా దర్యాప్తు చేయనుంది. సీఐడీ స్పెషల్ బ్రాంచి పోలీసులు విద్యాసంస్థను సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. గత నివేదికలను పరిశీలించి ప్రిన్సిపల్ రమణయ్య నుంచి కూడా తీసుకున్న వివరాలను వీరు ప్రభుత్వానికి పంపనున్నారని భోగట్టా. కన్నీటి వీడ్కోలు.. డాక్టర్ శిల్పకు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. పీలేరు మండలం మొరవపల్లె వద్ద దహన క్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కారకులైన ప్రొఫెసర్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారకులైన ప్రొఫెసర్లను అరెస్ట్ చేయాలని పీలేరు ఆర్టీసీ బస్టేషన్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. శిల్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరా టాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రొఫెసర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్, పురుషోత్తం, వెంకటేష్ తదితర విద్యార్థి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేసినాన్యాయం జరగలేదు.. రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడం వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని డాక్టర్ శిల్ప తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హడావుడి చేసి చివరకు ప్రాణాలు బలిగొన్నారన్నారు. జీవితాంతం తలుచుకొని బాధపడాల్సిందేనని, ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నివేదిక బయట పెట్టకుండా వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్లకు అండగా నిలవడం దారుణమన్నారు. డాక్టర్ శిల్ప భర్త, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. బుధవారం పీలేరులోని శిల్ప ఇంటికి వచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు, ప్రొఫెసర్ల వేధింపులపై వివరాలు సేకరించారు. ప్రొఫెసర్లను అరెస్ట్ చేయిస్తామని చెప్పాలని కోరగా నన్నపనేని సమాధానం దాటవేశారు. పీలేరు ఇన్చార్జి సీఐ సిద్ధతేజమూర్తి, ఎస్ఐలు పీవీ సుధాకర్రెడ్డి, రామస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కన్నతండ్రి కర్కశత్వం
మద్యం రక్కసి మనుషుల్ని రాక్షసుల్ని చేస్తోంది. హంతకులుగా మారుస్తోంది. నేర సంస్కృతిని ప్రేరేపిస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఇటీవల మద్యం పూటుగా తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను హతమార్చాడు. ఈ సంఘటన మరువకమునుపే తాగిన మైకంలో మరో కిరాతకుడు ముక్కుపచ్చలారని ముగ్గురు పసికందుల ప్రాణాలు తీశాడు. మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక విచక్షణ కోల్పోయాడు. పేగు బంధాన్ని కూడా విస్మరించి పొట్టనబెట్టుకున్నాడు. చిత్తూరు, గంగాధరనెల్లూరు: జీడీనెల్లూరు మండలం బాలగంగానపల్లిలో ఆదివారం రాత్రి అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను ఓ తండ్రి చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన వెంకటేష్(30) డ్రైవరుగా పనిచేసేవాడు. చిత్తూరు రూరల్ మండలం శెట్టిగారిపల్లికి చెందిన అముద, అమరావతిని ప్రేమించాడు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఏడేళ్ల క్రితం అముదను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదిన్నరకే అము ద భర్తను విడిచిపెట్టి శెట్టిగారిపల్లిలోనే ఉంటోం ది. వీరికి ఓ కుమార్తె ఉంది. ఐదేళ్ల క్రితం అమరావతిని పెళ్లిచేసుకున్నాడు. వీరికి పునీత్(4), సంజయ్(3), రాహుల్(2) ఉన్నారు. ఇతడు మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడడం దినచర్యగా మార్చుకున్నాడు. శనివారం ఇదే మాదిరిగా భార్యతో గట్టిగా గొడవపడ్డాడు. దీంతో బిడ్డల్ని తీసుకుని ఆమె చిత్తూరు మండలంలోని కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆదివారం సాయంత్రం వెంకటేష్ బాగా మద్యం తాగి అత్తవారింటికి వచ్చాడు. తనతో రావాలని గొడవ పడ్డాడు. ఈ మత్తులో నీతో రానని, మర్నాడు ఉదయం వస్తానని భార్య చెప్పింది. పిల్లల్నయినా తీసుకుపోతానంటూ నిద్రపోతున్నవారిని లేపి ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. దారిలో ఏమనుకున్నాడో ఏమోగాని ముగ్గురు పిల్లల్ని దారుణంగా పైనుంచి నీవానదిలోకి విసిరేశాడు. వారు మునిగి చనిపోయారు. ఇదేమీ పట్టనట్టుగా వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం భార్య ఫోన్ చేస్తే పిల్లలిద్దరినీ నదినీటిలో విసిరేశానని చెప్పాడు. అమరావతికి గుండె ఆగినంతపనైంది. నదివద్దకు వచ్చి చూసేసరికి పిల్లల శవాలు కనిపించాయి. స్థానికులు ఈ ఘటన చూసి చలించిపోయారు. మద్యం మత్తు దిగడంతో ఎస్ఆర్పురం మండలం కొల్లాగుంట వద్ద హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నిందితుడ్ని బంధువులు గుర్తించి పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ రాజశేఖర్కు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
ఖమ్మం అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉరికి వేలాడదీశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కామేపల్లి మాజీ ఎంపీపీ జర్పుల లక్ష్మణ్ నాయక్–రమాదేవి దంపతులు పదేళ్ల క్రితం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో స్థిరపడ్డారు. రమాదేవి గేటు కారేపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరి కూతురు లిఖిత యామిని(19) చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ కాలేజీలో ట్రిపుల్ ఐటీ చదువుతోంది. మొదటి ఏడాది పూర్తవడంతో సెలవులకు ఇంటికి వచ్చింది. రెండు నెలలపాటు ఇంటి వద్దనే ఉంది. రెండో ఏడాది తరగతులు ప్రారంభం కానుండడంతో గత ఆదివారం కాలేజీకి వెళ్లాల్సి ఉంది. వచ్చే ఆదివారం వెళదామని ఆమె నిర్ణయించుకుంది. బుధవారం ఆమె తల్లి పాఠశాలకు, తండ్రి బయటకు వెళ్లారు. ఇంటిలో లిఖిత యామిని ఒక్కతే ఉంది. పాఠశాల నుంచి తల్లి రమాదేవి కూతురుకు ఫోన్ చేశారు. ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటి కింది పోర్షన్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి, ‘లిఖిత పోన్ తీయడం లేదు. వెళ్లి చూడండి’ అని కోరారు. వారు పైకెళ్లి చూసే సరికి.. ఇంట్లో ఫ్యాన్కు యామిని వేలాడుతూ ఉంది. ఆమె కాళ్లు, చేతులు చీరతో గట్టిగా కట్టేసి ఉన్నాయి. ఆమెది ముమ్మాటికీ హత్యేనని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి ఉంటే ఉరి వేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఎవరో చంపి, ఇలా వేలాడదీశారని భావిస్తున్నారు. ఆమె తండ్రి ఫిర్యాదుపై ఎస్ఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.