
ఢాకా: టిఫిన్లో వెంట్రుక వచ్చిందన్న కారణంతో ఓ వ్యక్తి భార్య(23)ను తీవ్రంగా అవమానించాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి.. బలవంతంగా గుండుకొట్టాడు. తీవ్ర విచారణమైన ఈ ఘటన బంగ్లాదేశ్ని జోయపుర్హట్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. బాబుల్ మండల్ వ్యక్తి తన భార్యను టిఫిన్ పెట్టమని కోరాడు. దీంతో ఆమె అప్పుడే చేసిన అల్ఫహారాన్ని భర్తకి వడ్డించింది. అయితే వంట చేసే సమయంలో ప్రమాదవశాత్తు దానిలో వెంట్రుక పడింది. ఇది గమనించని భార్య.. అలాగే వడ్డించింది. వెంట్రుకను చూసిన బాబుల్ భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై దాడికి దిగాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో.. బ్లేడ్ తీసుకుని బలవంతంగా ఆమెకు గుండు చేశాడు.
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే దీనిపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు. భార్యను ఇలా అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం అతనికి 14 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారి తెలిపారు.