
మలక్పేట: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ మహిళ తన కుమార్తె(3)ను వదిలించుకునేందుకు చిన్నారిని చిత్రహింసలకు గురి చేస్తుంది. తరచూ బాలికపై ఒంటిపై వాతలు పెట్టడం, కొడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు బాలల హక్కుల సంఘానికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న సంఘం సభ్యులు చిన్నారిని కాపాడి మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, పాలడుగు గ్రామానికి చెందిన ముక్కాముల వెంకన్న, సరిత దంపతులకు రేణుక కుమార్తె ఉంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో కొద్దికాలంగా వారు వేర్వేరుగా ఉంటున్నారు.
సరిత కుమార్తె రేణుకతో కలిసి ఈస్ట్ ప్రశాంత్నగర్లో ఉంటూ ఇళ్లల్లో పనులు చేసి జీవనం సాగిస్తోంది. గత కొంత కాలంగా ఆమె మిర్యాలగూడకు చెందిన డీసీఎం డ్రైవర్ వెంకట్రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ ఆనందానికి రేణుక అడ్డుగా ఉందని భావించిన వెంకట్రెడ్డి, సరిత ఆమెను వదిలించుకునేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా తరచూ చిన్నారిని వేదిస్తున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించడంతో సోమవారం వారు పాపను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని రేణుకను శిశువిహార్కు తరలించారు. వెంకట్రెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్రావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment