
లారీ ఢీకొట్టడంతో అద్దాలు పగిలిన ట్రావెల్ బస్సు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: వారంతా తీర్థయాత్రలు ముగించుకుని బస్సులో తిరిగి పయనమయ్యారు. మరికొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. రాత్రి సమయం కావడంతో నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే పెద్ద శబ్ధం వినపడింది. ఏం జరిగిందో అని అందరూ ఉలిక్కిపడి లేచారు. పలువురు గాయాలతో హాహాకారాలు చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నం వైపు నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న ట్రావెల్ బస్సుకు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కోసంగిపురం కూడలి వద్ద 3:30 గంటలకు ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఒడిశాకు చెందిన 14 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. వీరంతా తీర్థయాత్రలు ముగించుకుని తిరుగుపయనం అయ్యారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే వీరిని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో గంగాధర్ నాయక్, సంతోస్ ప్రధాన్, సత్యప్రకాష్, సాయిరాం ఉన్నారు. కాళ్లు, చేతులు, తలకు తీవ్రగాయాలయ్యా యి. క్షతగాత్రులు రోడ్డుపై ఉండటంతో విషయం తెలుసుకున్న లక్ష్మీపురం టోల్గేటు అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి వారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్చారు. వేకువజామున కావడంతో లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చుని స్థానికులు భావిస్తున్నారు. కోసంగిపురం కూడలి వద్ద ఉన్న వంతెన పనులు జరుగుతుండటంతో అక్కడ దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment