Srikakulam Crime News
-
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల దుర్మరణం
శ్రీకాకుళం, రణస్థలం: సోమవారం తూరుపు తెల్లారకముందే ఇద్దరి జీవితాలు తెల్లారిపోయాయి. టైర్ పంక్చర్ అయ్యిందని ఓ డ్రైవర్ లారీని నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన రోజుల తరబడి నిలిపివేస్తే.. మరో డ్రైవర్ అంతకంటే నిర్లక్ష్యంతో అతివేగంగా బండి నడుపుతూ ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. వీరిద్దరి అలసత్వం కారణంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రణస్థలం మండలం కోష్ట వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మందస మండలం చిన్న నారాయణపురానికి చెందిన మడియా ఢిల్లీశ్వరరావు(22), మడియా వసంత(20)గా గుర్తించారు. ఈ ఘటనలోనే డ్రైవర్ మూర్తి, పాప కుసుమ(8)లకు తీవ్ర గాయాలయ్యాయి. జేఆర్ పురం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొన్న కారు చిన్న నారాయణపురానికి చెందిన ఢిల్లీశ్వరరావు, వసంతలు వరుసకు అన్నాచెల్లెళ్లు. వీరు డిగ్రీ, డైట్ పూర్తి చేసి వేసవిలో శిక్షణ తీసుకుందామని విశాఖలోని మేనమామ తులసీదాస్ ఇంటికి వెళ్లారు. ఇంతలో లాక్డౌన్ ప్రకటించడంతో చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండు రోజుల ముందే ఇంటికి వద్దామని అక్కడి సిటీ కమిషనర్ అనుమతి తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లతో పాటు మేనమామ కూతురు కుసుమ కూడా బయల్దేరింది. సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో డ్రైవర్ వీరిని తీసుకుని కారులో మందస మండలానికి పయనమయ్యారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి సమీపానికి వచ్చేసరికి.. జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీటులో ఉన్న ఢిల్లీశ్వరరావు, వసంతలు అక్కడికక్కడే మృతి చెందారు. ముందుసీట్లలో ఉన్న డ్రైవర్ మూర్తి, కుసుమలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మేమున్నాం సేవా సంస్థ అంబులెన్స్లో క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. జేఆర్పురం ఎస్ఐ ఇ.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు రిమ్స్లోనే శవ పంచనామా చేయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. చిన్ననారాయణపురంలో విషాద ఛాయలు మందస: మండలంలోని చిన్ననారాయణపురానికి చెందిన మడియా పాపారావు కుమారుడు ఢిల్లీశ్వరరావు, మడియా త్రినాథ్ కుమార్తె వసంతలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నా యి. పాపారావు, త్రినాథ్ అన్నదమ్ములు. ఉన్న త ఉద్యోగాలు చేసి కుటుంబాలకు అండగా నిలబడతారని అనుకుంటే ఇలా యుక్త వయసులో నే వదిలేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు రోదించారు. వసంత తల్లిదండ్రులు బెంగళూరులో ఉండడంతో సమాచారం వారికి చేరవేశారు. అక్కడి పోలీసుల నుంచి అనుమతి లభించడంతో వారు జిల్లాకు ప్రయాణమయ్యారు. -
చెల్లి పెళ్లి చూడకుండానే..
శ్రీకాకుళం, పెందుర్తి: ఎన్హెచ్–16 బైపాస్ ఆనందపురం–అనకాపల్లి రహదారి మరోసారి రక్తమోడింది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం వాసులు దుర్మరణం పాలయ్యారు. లారీ–కారు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నరసన్నపేటకు చెందిన గనగళ్ల జగదీష్ (24), బంధువు జల్లేపల్లి జయలక్ష్మి(65) కుటుంబాలు కలిసి మెలిసి ఉంటాయి. వీరికి సన్నిహిత కుటుంబం పెందుర్తిలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెందుర్తిలోని వారింట్లో శుభకార్యానికి మీనాక్షమ్మ, జగదీష్ కారులో వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత తిరిగి శ్రీకాకుళం బయలుదేరారు. అయితే పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న జగదీష్, ముందు సీట్లో ఉన్న మీనాక్షమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మీనాక్షమ్మ, జగదీష్ మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెల్లి పెళ్లి చూడకుండానే.. నరసన్నపేట: పెందుర్తి రోడ్డు ప్రమాదంలో గనగళ్ల జగదీష్, బంధువు జల్లేపల్లి జయలక్ష్మి మృతి చెందడంతో నరసన్నపేట పట్టణం బజారు వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వచ్చే నెల 15న తన చెల్లి పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి జగదీష్ నెల రోజులుగా బిజీగా ఉన్నాడు. ఇంతలోనే మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడు జగదీష్ మాజీ వార్డు సభ్యుడు శ్రీను కుమారుడు. ఈయన ఇంటి ఎదురుగా ఉంటున్న జయలక్ష్మి కూడా మృతి చెందడంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ♦ ఆనందపురం దాటాక తండ్రి శ్రీనుతో ఫోన్లో మాట్లాడిన జగదీష్ అక్కడికి కొద్ది నిమషాల తర్వాత ప్రమాదానికి గురయ్యాడు. సాయంత్రం మూడు గంటలకు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంత్రి కృష్ణదాస్ సంతాపం... రోడ్డు ప్రమాదంలో జగదీష్తోపాటు జయలక్ష్మి మృతి చెందడం పట్ల ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కృష్ణచైతన్య, పార్టీ నాయకులు ఆరంగి మురళి, కేసీహెచ్బీ గుప్తా తదితరులు సంతాపం తెలిపారు. -
గర్భం దాల్చిన గిరిజన విద్యార్థిని
శ్రీకాకుళం, మందస: మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్చంద్రశివకుమార్ ఐటీడీఏ(సీతంపేట)కు సమాచారం అందించారు. వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఏపీఎంతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. గిరిజన బాలిక రెండు నెలల గర్భిణిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు ఐటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని..
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ప్రేమను జీవితాంతం కొనసాగించలేకపోయారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పలాస పొందర వీధిలోని పొందర కులానికి చెందిన పొందర తేజేశ్వరరావు, ఉదయపురంలోని చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన మౌనికలు ఇరు కుటుంబాలను ఎదురించి మరీ నాలుగేళ్ల కిందట కులాంతర పెళ్లి చేసుకున్నారు. పలాస జీడిపిక్క బొమ్మకు సమీపాన కేటీ రోడ్డుకు ఆనుకుని ఉ న్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి కాపురం నాలుగేళ్లు సజావుగానే సాగింది. ఈ దంపతులు ఓ పాపకు కూడా జన్మనిచ్చారు. ఆదివారం రాత్రి దంపతులు సినిమాకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ మౌనిక ప్రాణాలు కోల్పోయింది. సెల్ఫోన్ తగిలి చనిపోయిందని, భర్త సెల్ విసిరితే ముక్కుకు తగిలి చనిపోయిందని స్థానికంగా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. భర్త కూడా ఇలాగే చెబుతున్నారు. ఆదివారం రాత్రి సంఘటన జరిగితే సోమవారం ఉదయం పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించంతో సీఐ వేణుగోపాలరావు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం తర్వాతే వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి బంధువులు ‘కులాంతర వివాహం చేసుకున్నప్పుడే మా అమ్మాయిచనిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏమీ చనిపోలేదు’ అని మాట్లాడడం గమనార్హం. -
బతుకు జీవుడా..!
ఒక్కసారిగా పెద్ద కుదుపుతో బస్సు ఆగింది.. నిద్దట్లోనే ఒకరిపై ఒకరు పడ్డ ప్రయాణికులకు కాసేపు ఏమైందో అర్థం కాలేదు.. చుట్టూ అంధకారం.. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమాదం జరిగిందని తెలుసుకొని బిలబిలమంటూ దిగిపోయారు.. ఆ షాక్ నుంచి తేరుకొని సామాన్లు తెచ్చుకొనేలోపే కళ్ల ముందే బస్సు దగ్ధమైంది. ఆకాశాన్నంటిన అగ్ని కీలలను చూసి వారెవరికీ నోట మాట రాలేదు. రణస్థలం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బస్సులోనివారంతా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వస్తున్న టూరిస్టులు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. రణస్థలం: రోడ్డు ప్రమాదం ఒక షాక్.. మంటల్లో బస్సు దగ్ధం మరో షాక్.. అంతసేపు తాము ప్రయాణించిన వాహనమేనా ఇలా కాలి బూడిదైందని తలచుకుంటేనేఒళ్లు గగుర్పొడిచే సంఘటన అది.. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజలు వెంటనే సహాయ చర్యలందించడంతో వారు కాస్తంత తేరుకున్నారు.. అయితే సామాన్లన్నీ కాలిబూడిద కావడంతో ఊరుకాని ఊరిలో కట్టుబట్టలతో మిగిలారు. ఉత్తరాఖండ్ వాసులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో దగ్ధమైంది. ముందు వెళుతున్న వరిశాం శ్యాం పిస్టన్స్ పరిశ్రమకు చెందిన బస్సు హఠాత్తుగా కుడివైపునకు మలుపు తిరగడంతో వెనుక వేగంగా వస్తున్న టూరిస్టు బస్సును గుద్ది అవతల రోడ్డులో ఉన్న అమ్మోనియం లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 45మంది ఉన్నారు. నిద్దట్లో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచి బస్సు దిగిపోయారు. ఇంతలో షార్ట్సర్క్యూట్ అయి బస్సు వారి కళ్ల ముందే పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా చకచకా బస్సు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడ్డ కొద్దిమంది పర్యాటకులు, శ్యాం పిస్టన్స్ ఉద్యోగులు, లారీ డ్రైవర్కు లావేరు, రణస్థలం నుంచి వచ్చిన 108 వాహనాల్లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అరబిందో పరిశ్రమ, ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి. హిందీలో ఆర్తనాదాలు ప్రమాదం జరిగిన వెంటనే హిందీలో ఆర్తనాదాలు వినిపించాయి. బస్సు యాక్సిడెంట్ యువా.. బస్సు జల్ గయ్... తూరంత్ బహార్ ఉతరో... ఉతరో (బస్సుకు ప్రమాదం జరిగింది. వెంటనే బయటకు దిగిపోండి) అంటూ హాహాకారాలతో ఉత్తరాఖండ్వాసులు బస్సు దిగిపోయారు. కొద్దికొద్దిగా మంటలు వ్యాపిస్తుండగా బస్సులో ఉన్న 45 మంది ఎమర్జన్సీ గేటు, ప్రధాన గేటు నుంచి బట్టలు, బ్యాగులు వదిలేసి హడావుడిగా దిగిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక బస్సు ఏర్పాటు చేసి టూరిస్టులను విశాఖ పంపించింది. అక్కడి నుంచి వారు రైలు తదితర రవాణా సాధనాల ద్వారా స్వస్థలానికి వెళతారు. నెల రోజులపాటు కాశీ, పూరి, రామేశ్వరం, కన్యాకుమారి వంటి తీర్థయాత్రలు చేసేందుకు ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులు రెండు బస్సుల్లో బయలుదేరారు. అందులో ఒక బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడినప్పటికీ డబ్బులు, ఏటీఎం కార్డులతో సహా సామాను దగ్ధం కావడంతో టూరిస్టులు కట్టుబట్టలతో మిగిలారు. అధికారులు, స్థానికుల చొరవకు ప్రశంసలు సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై అశోక్బాబు, ఫైర్ అధికారులు, ఆర్డీవో ఎం.వి.రమణ, తహసిల్దార్ ఎం.సుధారాణి స్పందించారు. స్థానిక మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు, అరబిందో యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానికులు టూరిస్టులకు సపర్యలు చేశారు. సకాలంలో స్పందించి భోజనాలు, తాగునీరు, టూరిస్టులు విశాఖపట్నం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సమస్తం బూడిదైంది... నెల రోజులపాటు దైవ క్షేత్రాలు తిరిగేందుకు సుఖియాంచల్ ట్రావెల్స్ తో మాట్లాడుకున్నాం. పూరి చూసుకొని వస్తున్నాం. ప్రస్తుతం రామే శ్వరం వెళుతున్నాం. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. దుస్తులు, నగదు, ఆధార్, పాన్కార్డులు, ఏటీఎం కార్డులు సమస్త కాలిపోయాయి. తిరిగి వెళ్లేందుకైనా డబ్బులు లేవు. – రావత్ బహుగుణ్, టూరిస్టు -
మాటలకందని విషాదం
శ్రీకాకుళం, కొత్తూరు: నూతన సంవత్సరాన్ని ఎంతో సందడిగా గడపాల్సిన ఆ ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని అడ్డంగి గిరిజన గ్రామానికి చెందిన సవర రాజారావు (28) మంగళవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజారావు తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషించుకుంటూ వస్తున్నాడు. రాజారావు విద్యుత్ షాక్కు గురికావడంతో ఆ కుటుంబం వీధిన పడింది. అడ్డంగి గ్రామానికి రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్కో సిబ్బందికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విద్యుత్ వైర్లకు తగిలి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని ట్రాన్స్కో సిబ్బంది గిరిజనులకు సూచించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన నలుగురు గిరిజన యువకులు విద్యుత్ వైర్లకు తగిలి ఉన్న చెట్ల కొమ్మలు తొలగించేందుకు బయలుదేరి వెళ్లారు. విద్యుత్ సరఫరాను సిబ్బంది నిలిపివేశారనే భావనతో రాజారావు వైరకు ఆనుకొని ఉన్న జీడి చెట్ల కొమ్మలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఇంతలో షాక్కు గురై అక్కడకక్కడే మృతి చెందాడు. వీఆర్వో జి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ బి.సింహద్రి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రాజారావు (అవివాహితుడు) మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబాన్ని పోషిస్తున్న అన్నయ్య మృతి చెందడంతో చెల్లి, తమ్ముళ్ల రోదనలు మిన్నంటాయి. -
ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్నర్స్ ఆత్మహత్య
పాలకొండ రూరల్: శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్నర్స్గా పనిచేస్తున్న కాకర్ల హేమలత (32) గురువారం ఆసుపత్రిలోని డ్యూటీ రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 4:30 గంటలకు తన డ్యూటీ రూమ్కు వెళ్లిన ఆమె గంట వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో హేమలత కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. దీంతో వారు సహచర సిబ్బందికి ఫోన్ చేశారు. సహచరులు డ్యూటీ రూమ్ కిటికీ నుంచి చూడగా హేమలత ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించిందని, అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్నట్లు తెలిసింది. అయితే దీన్ని పోలీసులు ధృవీకరించలేదు. -
అంతుచిక్కని విదేశీ కరెన్సీ అపహరణ
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని దినవారి బజారు సమీపంలోని సాయి ట్రావెల్స్లో నిర్వహిస్తున్న వెస్టర్న్ యూనియన్ నగదు బదిలీ కేంద్రం వద్ద సోమవారం రూ.3 లక్షల విలువైన విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. ఈ కేసు విషయమై సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తులో చోరీకి పాల్పడినవారు టర్కీ దేశానికి చెందిన ఇద్దరు యువకులుగా అనుమానిస్తున్నారు. నగదు బదిలీ కేంద్రంలో పనిచేస్తున్న నిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం కేసు నమోదు చేశారు. అనుమాతులలో ఒకరికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరా ద్వారా సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు. -
తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి
సాక్షి, శ్రీకాకుళం : ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని కుమార్తె పట్టుబట్టింది. వద్దని తల్లిదండ్రులు వారించారు. తాము తెచ్చిన సంబంధాన్నే చేసుకోవాలన్నారు. ఈ విషయంపై తల్లీకుమార్తెల మధ్య కొద్దిరోజులుగా తగాదా జరుగుతోంది. గురువారం మరోసారి తీవ్రస్థాయిలో ఇంట్లోనే వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన కుమార్తె ఇంట్లోని బాత్రూమ్లో వాడే యాసిడ్ బాటిల్తో తల్లి ముఖంపై కొట్టింది. ఈ ఘటన శ్రీకాకుళం పరిధిలోని ఏఎస్ఎన్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కాలనీలో నివసిస్తున్న రామప్పడు, ప్రభావతిల కుమార్తె జ్యోత్స్న వైజాగ్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివింది. ఆ సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇటివలే బీటెక్ పూర్తయింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. దీనికి తల్లిదండ్రులు తిరస్కరించారు. ఇదే విషయంపై తల్లీకుమార్తె ప్రతి రోజూ తగాదా పడుతున్నారు. ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపిస్తామని తల్లి ప్రభావతి చెప్పినప్పటికీ కుమార్తె జ్యోత్స్న.. తనకున్న తెలివి తేటలతో బాండ్ పేపర్పై ‘కోరుకున్న వాడితోనే పెళ్లి చేస్తామని’ రాసి ఇవ్వాలన్నది. ఈ విషయంలో తల్లికి కోపం రావడంతో ఆమె ససేమిరా అనేసింది. బాత్రూంలో ఉన్న యాసిడ్ బాటిల్ను తీసిన జ్యోత్స్న తల్లి ప్రభావతిపై విసిరికొట్టింది. వెంటనే ముఖంపై బొబ్బలు ఏర్పడ్డాయి. దుస్తులన్నీ కాలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న తండ్రి 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లీకుమార్తెల నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్లో ప్రాథమిక చికిత్స అందించారు. ఈ మేరకు విచారణ చేస్తున్నామని, తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని రెండో పట్టణ ఎస్ఐ ముకుందరావు తెలిపారు. -
మృత్యు తీరం.. స్నానానికి వెళ్లి..
అంతవరకు అక్కడే కలిసి తిరిగారు. అక్కడే కలిసి తిన్నారు. నవ్వుకున్నారు.. ఆడుకున్నారు.. సందడిగా గడిపారు. ఒక్క క్షణంలో పరిస్థితులు తారుమారైపోయాయి. వారి నవ్వులన్నీ సముద్ర ఘోషలో కలిసిపోయాయి. సందడులు రోదనలుగా మారిపోయాయి. అందంగా కనిపించిన సముద్ర తీరం తన భయంకర రూపాన్ని ప్రదర్శించింది. నది నీటి కలయికతో రూపు కోల్పోయి ఉన్న తీరం నలుగురు యువకులను అమాంతం లోపలకు లాక్కుపోయింది. కళింగపట్నం బీచ్లో ఆదివారం స్నానానికి దిగిన నలుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయి ఒడ్డు చేరగా.. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. యువకులంతా ఒకే కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. సాక్షి, గార(శ్రీకాకుళం రూరల్): కార్తీక ఆదివారం సందర్భంగా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్కు వచ్చిన ఆరుగురు ఇంటర్ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా ఒడ్డునే ఉండగా, ఐదుగురు యువకులు సముద్రంలో దిగారు. ప్రమాదం పసిగట్టలేని వారంతా ఒకరిపై సరదాగా నీరు జల్లుకుంటూ ఆనందంగా గడిపారు. నీటిలో వడి ఎక్కువగా ఉండడంతో లోపలకు వెళ్లిపోవడం వారు గమనించలేకపోయారు. గమనించే సరికే నీరు లోపలకు లాక్కువెళ్లిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన మెరైన్ పోలీసులు షేక్ అబ్దుల్లాను కాపాడగలిగారు. శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్లు మాత్రం నీటిలో మునిగిపోయారు. వీరిలో కొంత సేపటి తర్వాత సుధీర్ మృతదేహం కనిపించగా పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. పౌర్ణమి రోజులు కావడంతో రాత్రిపూట సముద్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. రోజంతా సందడి కనిపించిన తీరంలో ఈ ఘటనతో భయానక వాతావరణం నెలకొంది. మెరైన్ సీఐ అంబేడ్కర్, ఇన్చార్జి ఎస్సై సింహాచలం, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాలింపు చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అబ్దు ల్లా, రాజసింహతో మాట్లాడి సంఘటన తీరును తెలుసుకున్నారు. డీఎస్పీ మూర్తి, శ్రీకాకుళం పట్టణ సీఐ లలిత, తహసీల్దార్ జెన్ని రామారావు, మెరైన్ ఎస్ఐ జగన్ తదితరులు ఉన్నారు. ఆఖరి క్షణంలో... సముద్రస్నానంలో గల్లంతైన స్నేహితులు అంతా మెరిట్ స్టూడెంట్లే! శ్రీకాకుళం రూరల్: ఆ విద్యార్థులంతా టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారే. ఒక్కొక్కరూ ఒక్కో పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ ఒకే క్యాంపస్లో చదవడంతో మంచి స్నేహితులు అయ్యారు. రెండు రోజులు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పిక్నిక్కు వెళ్లారు. తిరిగి వచ్చేస్తామనే అనుకున్నారు గానీ.. ఇంతలో విధి ఇలా వికృతంగా ఆడుకుంది. కళింగపట్నం బీచ్లో గల్లంతైన వారంతా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ నేపథ్యా లు పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో కథ. గల్లంతైన వారిలో ముగ్గురు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం విషాదకరం. బిడ్డల పరిస్థితిపై సమాచారం అందుకున్న ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఎదిగి ఆదుకుంటారనుకున్న బిడ్డలు ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోయారని తెలిసి కంటికీమింటికీ ఏకధారగా రోదించారు. పచ్చళ్లు అమ్ముకుంటూ.. గల్లంతైన వారిలో ఒకడైన సుధీర్ తండ్రి కృష్ణ పచ్చళ్లు అమ్ముకుంటూ బతుకుతున్నారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళానికి వలస వచ్చిన వీరు పాతబ్రిడ్జి సమీపంలోని హయాతీనగరంలో నివాసముంటూ పచ్చళ్లు తయారు చేస్తుంటారు. సుధీర్ ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుతున్నారు. సుధీర్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. ఒక్కగానొక్క కొడుకు సముద్రంలో మునిగి చనిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. సుధీర్ పదో తరగతి వరకూ శ్రీకాకుళంలోని కేశవరెడ్డి స్కూల్లో చదివాడు. ఇంటికి వెళ్దామన్నా రాలేదు.. రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్దామని తన తమ్ముడు యోగ్యనారాయణ పండాను బతిమలాడినా రాలేదని యజ్ఞ నారాయణ పండా అక్క ఇంద్రావతి పండా రోదిస్తూ చెప్పింది. వీరిద్దరూ కలిసి శ్రీకాకుళంలోని మహాలక్ష్మీనగర్ కాలనీలో తమ బంధువుల ఇంటి వద్ద అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. తండ్రి పూర్ణచంద్రపండా ఇచ్ఛాపురంలోని నర్మదేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. తల్లి నమితా పండా గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. అందులో రెండో అబ్బాయి నారాయణ పండా. ఇతను పదోతరగతి వరకూ ఇచ్ఛాపురంలోని జ్ఞానభారతి పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ శ్రీచైతన్యలోని బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బిడ్డ పరిస్థితి తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అక్క ఇంద్రావతి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు. దేవుని సేవలు చేస్తున్నా.. గల్లంతైన వారిలో ఒకరైన సంజయ్ తండ్రి ఐరన్ కుమార్ నిత్యం దేవుని సేవలోనే ఉంటారు. ఇండియన్ ఇమాజినల్ మిషన్లో ఆయన పనిచేస్తున్నారు. ఈ దంపతులకు కూడా సంజయ్ ఒక్కగానొక్క సంతానం. నిత్యం దేవుని సేవలో గడిపే తమకు ఇంత పెద్ద దుఖం వస్తుందని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగి వచ్చిన కొడుకు ఇలా అయిపోవడంతో తల్లడిల్లిపోయారు. వీరు శ్రీకాకుళంలోని ఏపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి సుశీలా డీఆర్డీఏలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి కరుమారి సంజయ్ శ్రీచైతన్యలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి పూర్తి చేశాడు. బయటకు వెళ్తానని చెప్పి.. ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తానని చెప్పిన కొడుకు మళ్లీ తిరిగిరాకుండా వెళ్లిపోతాడని అనుకోలేదని శివరామిరెడ్డి తల్లిదండ్రులు రామిరెడ్డి, లత భోరున విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు చిర్ల శివరామరెడ్డి ఇలా సముద్రంలో గల్లంతవుతాడని ఊహిం చలేదని వారు రోదిస్తున్నారు. శ్రీకాకుళంలోని 80 ఫీట్రోడ్లో వీరు నివాసం ఉంటున్నారు. తండ్రి వృత్తిరీత్యా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. శ్రీచైతన్య కళాశాల్లో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాడు. పదోతరగతి కుడా శ్రీచైతన్య టెక్నో స్కూల్లోనే చదివాడు.(చదవండి: సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు) -
30 శాతం రాయితీతో నచ్చిన వాహనం..
ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నాడు. పలువురిని నమ్మించి 30 శాతం రాయితీతో వాహనాలను విక్రయించాడు. వారు మరికొంత మందికి చెప్పటంతో మోసం మొదలుపెట్టాడు. ఈ నకిలీ పథకం అంతటా వ్యాపించడంతో వ్యాపారం మరింత పెరిగింది. సుమారు 110 వాహనాలను విక్రయించాడు. రూ.కోట్లలో వ్యాపారం సాగింది. ప్రస్తుతం గుట్టు రట్టుకావడంతో సదరు వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం ,టెక్కలి రూరల్: టెక్కలి బాలాజీనగర్–2లో నివాసముంటున్న జి.హెచ్.రాజా అలియాస్ తిరుపతిరావు (పాస్టర్) గత కొద్ది నెలలుగా టెక్కలితోపాటు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట, జలుమూరు తదితర మండలాల ప్రజలకు 30 శాతం రాయితీతో నచ్చిన వాహనం విక్రయిస్తానని నమ్మబలికాడు. కొంత కాలం తర్వాత వాహనాలు కావాలనుకునే వారికి నెల రోజల వ్యవధిలో ఇస్తామని చెప్పేవాడు. సుమారు 216 మంది వరకు వాహనాల కోసం డబ్బులు చెల్లించారు. కొంతమందికి వాహనాలు ఇస్తామన్న సమయానికి ఇవ్వకపోడంతో ప్రశ్నించారు. నోయిడాలోని మొయిన్ బ్రాంచ్ నుంచి తన వద్దకు వాహనాలు రాలేదని, వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.3 కోట్ల 20 లక్షల వరకు వసూలు చేశాడని తెలుస్తోంది. ప్రజల వద్ద సేకరించిన డబ్బులతోనే కొన్నొ వాహనాలు కొనుగోలు చేసేవాడు. ఎవరైనా పలుకుబడి ఉన్నవారికి వాహనాలు ఇచ్చి వారిని నమ్మించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, నూర్పుడి యంత్రాలు వంటివి 30 శాతం తక్కువ రేటుకు ఇస్తామనడంతో పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ నకిలీ స్కీం మాయలో పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదారాబాధ్లో కూడా బ్రాంచ్ ఉన్నట్లు సమాచారం. దానిని అక్కడ ప్రశాంత్కుమార్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చల్ల రాజా ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంతబొమ్మాళి గ్రామానికి చెందిన సిమ్మ కృష్ణరావు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కామేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టెక్కలిలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం గుట్టు రట్టు.. రాజా అలియాస్ తిరుపతిరావుది పాతపట్నం మండలం తెంబూరు గ్రామం. పదో తరగతి సైతం ఉతీర్ణత చెందలేదు. గ్రామంలో పాస్టర్గా ఉన్నారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్లో ఇల్లు కూలిపోవడంతో టెక్కలికి వచ్చాడు. ఈ సమయంలోనే హైదారాబాధ్లోని ప్రశాంత్కుమార్తో పరిచడం ఏర్పడింది. ఇరువురు కలిసి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నకిలీ వ్యాపారం గుట్టుగా సాగించారు. ప్రజల వద్ద నుంచి మరింత మొత్తం సేకరించి ఆ సొమ్ముతో వచ్చే ఏడాదిలోగా ఉడాయించేందుకు పక్కా ప్రణాళికలు వేసికున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
విషాదం: మామ, అల్లుడి మృతి
సాక్షి, చీపురుపల్లి(శ్రీకాకుళం): అప్పుడే తెల్లవారింది. అసలే ఆదివారం. సాధారణంగా మాంసాహార ప్రియుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే ఆశతో చికెన్ సెంటర్ నడుపుతున్న ఆ ఇద్దరు మామా అల్లుళ్లు ఉదయాన్నే దుకాణం తెరిచారు. బేరం బాగుంటుందనీ... సాయంత్రం కాస్తంత కాసులతో ఇంటికెళ్తామని ఆశించారు. కానీ వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్ది గంటల్లోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వార్త ఆ రెండు కుటుంబాలను హతాశులను చేసింది. పట్టణంలోని మెయిన్రోడ్లో గల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా దశాబ్దాల క్రితం నుంచి షేక్ బాషా చికెన్ సెంటర్ ఉంది. దాని యజమాని షేక్ బాషా(45), ఆయన అల్లుడు షేక్ సైదు(28) ఉదయం 5 గంటలకే చికెన్ సెంటర్కు వచ్చి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు. 7 గంటల సమయంలో షేక్ సైదు కోళ్లను డ్రసింగ్ చేసేందుకు సంబంధిత మెషీన్లో వేశాడు. ఇంతలోనే విద్యుత్ షాక్ తగలడంతో ఆ మెషిన్కు చెందిన డ్రమ్తో బాటు సైదు ఎగిరిపడ్డాడు. ఆ శబ్దం విన్న మామ బాషా అల్లుడిని పట్టుకున్నాడు. అప్పటికే విద్యుత్ షాక్ తగిలి ఉన్న సైదుతో బాటు బాషా కూడా అక్కడికక్కడే క్షణాల్లో మృతి చెందారు. పట్టణంలో కలకలం పట్టణంలో పేరు మోసిన చికెన్ సెంటర్ కావడంతో ఎప్పటి మాదిరిగానే దుకాణంలో ఎక్కువ రద్దీ ఉంది. ఉదయాన్నే కొనుగోలుదారులతో సందడిగా ఉంది. ఇంతలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతి చెందారు. కలలా జరిగిన ఈ సంఘటనతో వారంతా కలవరపడ్డారు. దాదాపు పాతికేళ్లుగా ఆ మార్కెట్తో బాషాకు అనుబంధం ఉంది. ఇన్నేళ్లుగా అందరి ఆదరణ చూరగొన్న ఆయన తన అల్లుడితో సహా కన్నుమూయడంతో పట్టణంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథలైన రెండు కుటుంబాలు హడ్కోకాలనీకి చెందిన షేక్ బాషా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య అమ్మాజీతో బాటు గోరీ, పీరు, మహీదా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు గోరీకి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన షేక్ సైదాతో నాలుగేళ్ల క్రితం వివాహం చేశాడు. బాషాకు మగ పిల్లలు లేకపోవడంతో అల్లుడు సైదాను నరసన్నపేట నుంచి చీపురుపల్లి తీసుకొచ్చాడు. తన వ్యాపారంతో బాటు కుటుంబాలను చూసుకునేందుకు తోడుగా ఉంటాడని భావించాడు. తానుంటున్న వీధిలోనే వేరే ఇంట్లో కూతురితో కాపురం పెట్టించారు. తన కుటుంబానికి ఎప్పటికైనా ఆసరాగా నిలుస్తాడని భావించాడు. కానీ విధి వక్రీకరించింది. విద్యుత్షాక్ రూపంలో వారి కలలను కల్లలు చేసింది. ఈ సంఘటనతో మగదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బాసటగా నిలిచిన వైఎస్సార్సీపీ నాయకులు.... చికెన్ సెంటర్లో విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ కుటుంబాలకు బాసటగా నిలిచారు. మృతుడు షేక్ బాషాకూడా పార్టీ సానుభూతిపరుడు కావడం... ముస్లిం వర్గానికి నాయకత్వం వహిస్తుండటంతో పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో బాటు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పార్టీ మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను సందర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
నగరంలో భారీ చోరీ
సాక్షి, శ్రీకాకుళం : నగరంలోని కత్తెరవీధిలో నివాసమంటున్న వాండ్రంగి శ్రీనివాసరావు ఇంట్లో శనివారం రాత్రి దొంగలుపడ్డారు. 32 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదు, మూడు తులాల వెండి దోచుకెళ్లారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం పూరీ వెళ్లారు. దీన్ని గమనించిన దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారం, నగదు, వెండిని తీసుకెళ్లారు. అయితే ఇంటి పైభాగంలో శ్రీనివాసరావు తల్లి దమయంతి నివాసముంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి ముందు ఓ వ్యక్తి ఉండడాన్ని దమయంతి గమనించి, ఎవరని ప్రశ్నించారు. తన కుమారుడు కాపలా ఉండమని చెప్పారా అని అడిగారు. దీంతో ఆ వ్యక్తి అవునని సమాధానం ఇచ్చాడు. ఉదయం 6 గంటల సమయంలో పాలు ఇచ్చేందుకు వచ్చిన మహిళ ఇంటి తాళాలు తీసి, లైట్లు వేసి ఉండడం గమనించి, విషయాన్ని శ్రీనివాసరావు తల్లి దమయంతికి తెలియజేశారు. ఇంట్లో చిందరవందరగా వస్తువులు, బీరువా తెరిచి ఉండడాన్ని గుర్తించారు. దీనిపై రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు హుటాహుటిన శ్రీకాకుళం చేరుకున్నారు. పోలీసుల పరిశీలన సంఘటన స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ చక్రవర్తి, సీసీఎస్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శంకరరావు పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలను, ఆధారాలను సేకరించారు. డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు. కత్తెర వీధి నుంచి గొంటి వీధి వరకు వెళ్లి అక్కడ ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద పోలీసు డాగ్ ఆగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీనివాసరావు లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, దమయంతి ఫిర్యాదు మేరకు సీఐ శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైకో చేష్టలతో చనిపోతున్నా...
‘నేను చనిపోతే ఈ ఏరియాలో మాత్రమే విషయం తెలుస్తుంది.. కానీ నేను తులసీ(ప్రియుడు) అనే సైకో చేష్టల వల్ల ఇలా(సూసైడ్) చేసుకున్నానని బీహర్ సీఆర్పీఎఫ్ క్యాంప్లో కూడా తెలియాలి. ఇది నా చివరికోరిక – మీనాక్షి డైరీ సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేధింపులకు గురి చేశాడు. చివరకు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడంతో కుటుంబ సభ్యుల పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఐదు నెలలుగా తానూ ఏ విధంగా నరకం అనుభవించిందో తన డైరీలో రాసుకుని పెట్టుకుంది. చివరకు మంచినీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి చెందిన సొర్ర మీనాక్షి(25) మామిడిమెట్టు పంచాయతీ పరిధి రంగోయి గ్రామానికి సమీప రోడ్డు పక్కన ఉజ్జిడమ్మతల్లి గ్రామదేవత ఆలయం వద్ద బావిలో మృతదేహమై తేలింది. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు మోహనరావు, రూపావతిల ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, సునీతలకు వివాహాలయ్యాయి. చివరి కుమార్తె మీనాక్షి పలాస–కాశీబుగ్గలో ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివింది. ఈమెతో కలిసి మందస మండలం రట్టి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అందాల తులసిరావు కలిసి ఇంటర్మీడియట్ చదివాడు. బీహార్ సీఆర్పీఎఫ్ యూనిట్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనతో పాత పరిచయం ఉన్నందున తన ఫోన్ నంబరు ఇచ్చింది. అప్పట్నుంచి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. చివరకు సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేసి నరకం చూపించి చనిపోయే విధంగా ప్రేరేపించాడు. బావిలో మృతదేహం లభ్యం.. ప్రియుడు తులసీరావు పెట్టిన మానసిక వేధింపులు, తనకు చేసిన అన్యాయాన్ని మీనాక్షి ఈ నెల 5న తన డైరీలో రాసుకుని దాచి పెట్టుకుంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు తన మొబైల్లో భద్రపరుచుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రోడ్డు పక్కన బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బహుశా శనివారం రాత్రి బావిలో పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అయితే రెండు రోజులుగా కుమార్తె కనిపించకుండా పోయిందని, ఇంత దారుణానికి ఒడిగడుతుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్ఐ మహమ్మద్ఆలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం బావిలో నుంచి తీయనున్నారు. సూసైడ్ నోట్లో.... ఒకప్పుడు తులసీ, కృష్ణ మంచి స్నేహితులు. తులసి నా విషయంలో చేసిన ప్రతీ అన్యాయం కృష్ణతో చెప్పుకునేదాన్ని. నా ఫోన్ నంబర్ తీసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పే వ్యక్తి ఇలా చేస్తుంటే ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితి. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే నా మనసు అంగీకరించట్లేదు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ విలువేంటో నాక్కూడా తెలుసు. నేను పోతే నా కుటుంబానికి తులసీ వాళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కారణం నేనే అయినప్పుడు అందరికీ దూరమవుతున్నాను. తను కూడా వాళ్ల నాన్న ప్రాణం కంటే నాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. గర్వపడ్డాను.. తన మనస్సులో నాకు ఇంత మంచి స్థానం ఉందా అని? కానీ ఇప్పుడిప్పుడు అర్థమైంది. తనకు నా మీద ఉన్నది ప్రేమ కాదు. నన్ను అందరిలో పరువు తీసి నన్ను నరకం చూపించి నా లోకంలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చేంత వరకు నాకు తెలియలేదు. బతికే పది రోజులైనా ఏ టెన్షన్ లేకుండా సరదాగా బతకాలి అనుక్షణం భయంతో బతికితే ఆ బతుకే వేస్ట్ ఐ మిస్ యూ మై ఫ్యామిలీ. -
చదువుకుంటానని మేడపైకి వెళ్లి..
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : రోజూ మాదిరిగానే మేడ మీదకు చదువుకుందామని వెళ్లిన విద్యార్థి విద్యుత్ షాక్ గురై మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ నాయనా.. నువ్వెంతో ప్రయోజకుడవుతావని, ఎన్నో కలలు కన్నాం.. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు పోయావా’ అంటూ.. వీరు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ విషాద సంఘటన గురువారం కొత్తూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... కొత్తూరు గ్రామానికి చెందిన సారిపల్లి రామకృష్ణ, లక్ష్మి దంపతుల మొదటి సంతానం భార్గవ్(14) కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ తన ఇంటి శ్లాబ్పై అందరి పిల్లలతో కలిసి చదువుకుంటుంటాడు. అదే మాదిరిగా గురువారం రాత్రి వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ బల్బుకు విద్యుత్ తీగతో కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా షాక్కు గురయ్యాడు. ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితి చేరుకున్న అతడిని స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ వైద్యం అందించేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించిన వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సమాచారం మేరకు సీఐ ఎల్ సన్యాసినాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. -
‘అమ్మ’కు నగ్న వీడియో బెదిరింపులు..సూసైడ్ నోట్
అంజలీ నువ్వు బాగా చదువుకోవాలిరా.. నాన్న నీపైన పెట్టుకున్న హోప్స్ నువ్వు రీచ్ అవుతావని నా నమ్మకం. ఐషూ నువ్వు నా అమ్మవి.. నీ హెల్త్ బాగులేదని తెలిసి కూడా నిన్ను విడిచి వెళ్లిపోతున్నా.. నువ్వు ఎప్పుడూ భయపడకు. నేనెప్పుడూ నీతోనే ఉంటా.. కాళీ.. బాగా చదువుకో.. బాగా భోజనం చేయి.. నేను ఎలాంటి తప్పు చేయలేదు. విడిచిపోతున్నందుకు నన్ను క్షమించండి.. వాళ్లు ముగ్గురికీ శిక్ష పడాలి. అదే నా చివరి కోరిక. - ఓ తల్లి బిడ్డలను విడిచివెళిపోతూ రాసుకున్న చివరి మాటలివి.. అమ్మా అని పిలుస్తూనే తనపై కన్నేసిన ఓ కామాంధుడి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఓ వివాహిత మూగ రోదనకు అక్షర రూపమిది.. పక్కింట్లో ఉంటూ కుటుంబానికి స్నేహితునిగా మెలిగిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి లొంగదీసుకునేందుకు యత్నించడంతో.. అతని బెదిరింపులను భరించలేక ఓ గృహిణి (30) బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. పూర్తి వివరాలను తన డైరీలో సూసైడ్ నోట్ రూపంలో రాయడంతో వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనం సృష్టించాయి. సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): ఆమెది ఓ చక్కనైన కుటుంబం. భర్త కీలు సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు కంచిలి శాఖలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ముగ్గురు ముత్యాల్లాంటి పిల్లలు. చుట్టుపక్కల వారిని కూడా సొంత మనుషుల్లా భావించే మంచితనం ఆమెది. ఆ సౌశీల్యాన్నే ఆ దుర్మార్గుడు దుర్వినియోగపరిచాడు. ఆమెకు నరకం చూపించాడు. బ్యాంక్ అధికారి సత్యనారాయణ కంచిలిలో తన కుటుంబంతో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న మాధవరావు వారి పక్క పోర్షన్లో అద్దెకు ఉండేవాడు. ఆ పక్క పోర్షన్లో ఈశ్వర్రెడ్డి, తులసి అనే దంపతులు ఉండేవారు. ఒకేచోట ఉంటున్న వీరి మధ్య స్నేహం ఏర్పడి కలుపుగోలుగా ఉండేవారు. నిందితుడు మాధవరావు మృతురాలిని, ఆమె భర్తను అమ్మా.. నాన్న.. అని పిలిచేవాడని తెలుస్తోంది. మృతురాలు సూసైడ్ నోట్లో రాసిన వివరాల ప్రకారం తనపై కన్నేసిన మాధవరావు.. ఆమె బాత్రూంలో స్నానం చేసే సమయంలో రహస్యంగా వీడియో, ఫోటోలు తీసి, ఆమెను భయపెట్టి లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తుండేవాడు. మాధవ్కు పక్క పోర్షన్లో ఉండే ఈశ్వర్రెడ్డి, తులసి దం పతులు సహకరించారు. ముగ్గురూ కలిసి తరచూ ఈ వీడియో, ఫోటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని భయపెట్టేవారు. కానీ మృతురాలు ఈ విషయాన్ని భర్తకుగాని, కన్నవారికిగాని చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించేది. మృతురాలి కుమార్తె అంజలి వద్ద వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ వెంకటేష్ (ఇన్సెట్లో) నిందితుడు మాధవ్ (ఫైల్) బదిలీపై వెళ్ళినా.. కొన్నాళ్ల తర్వాత మాధవ్ వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోయాడు. అయినా ఆమెకు ఫోన్లు చేస్తూ, భర్త లేని సమయంలో వచ్చి భయపెడుతూ ఉండేవాడు. మాధవ్ పెడుతున్న వేధింపులను భరించలేక వారం రోజుల క్రితం భర్తకు, మిగతా కుటుంబ సభ్యులకు జరిగిందంతా ఆమె వివరించింది. మాధవ్ను పిలిచి వార్నింగ్ ఇస్తానని భర్త ఊరడించారు. ఇంతలో రెండు రోజుల క్రితం 24వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఎవరో వంటగది కిటికీ వద్దకు వచ్చి పిలిచి తనపై పువ్వు విసరడంతో భర్తకు చెప్పింది. పరిసరాల్లో వెతికినప్పటికీ ఎవరూ కన్పించలేదు. తాజా సంఘటనతో మరింత కుంగిపోయిన బాధితురాలు గురువారం మధ్యాహ్నం భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో.. పిల్లలకు భోజనం పెట్టి నిద్రపుచ్చిన తర్వాత వంటగదిలోనే సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకొంది. తన బలవన్మరణానికి మాధవ్, ఈశ్వర్రెడ్డి, తులసి దంపతుల మానసిక వేధింపులే కారణంగా పేర్కొంటూ తన డైరీలో వివరంగా రాసింది. మృతురాలికి భర్తతోపాటు పిల్లలు అంజలి (12), ఐశ్వర్య (10), రెండున్నరేళ్ల బాబు దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. శైలజ మృతిపై తండ్రి సుద్దాల జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు మండలానికి చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగి అల్లాడ మాధవరావు, సంతబొ మ్మాళి మండలానికి చెందిన భార్యభర్తలు తులసి, ఈశ్వర్రెడ్డిలపై ఇన్చార్జి ఎస్ఐ కె.వెంకటేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. ఆత్మహత్య గురువారం మధ్యాహ్నమే జరిగినప్పటికీ.. రాత్రికి గానీ డైరీ గుర్తించకపోవడంతో శుక్రవారం ఉదయానికి గానీ సంఘటన వెలుగులోకి రాలేదు. -
అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ‘నా భార్య పిల్లలను నీవే చూసుకోవాలి’ అని తన అన్నయ్య శ్రీనివాసరావుకు బాధాతప్తం హృదయంతో ఫోన్ చేసి మాట్లాడిన పలుకులే తమ్ముడు పిట్ట ఢిల్లీరావు(32)కు చివరివయ్యాయి. తన తలలో ఏర్పడిన కణితి బాధ భరించలేక, కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నిర్ధారించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోంపేట పట్టణంలోని తెలగవీధికి చెందిన ఈయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సోంపేట పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న ఈయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచుగా తలనొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించారు. తలలో కణితి ఏర్పడిందని, ప్రమాదస్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక తలనొప్పి తగ్గదని నిర్ధారించుకుని శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అరగంట ముందు హైద్రాబాద్లో ఉంటున్న తన అన్నయ్యకు సమాచారం అందించాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పెద్ద కుమారుడికి భోజనం క్యారేజ్ తీసుకెళ్లిన భార్య తేజేశ్వరికి విషయం తెలిసి బోరుమని రోదించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ కే వెంకటేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెల్లారిన బతుకులు
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం): వారం వారం గుంటూరు వెళతారు.. అక్కడి నుంచి బలిష్టమైన గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు.. హోల్సేల్ మార్కెట్కు వెళితే నాలుగు డబ్బులు మిగులుతాయన్నది వారి ఆశ.. అందుకే రాత్రి బయలుదేరి తెల్లారేసరికల్లా అక్కడికి చేరుకోవాలనుకున్నారు. గంటలో గమ్యస్థానం చేరుతామనగా చీకటి తెరలు వీడకుండానే రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన కోటిపల్లి శాంతారావు (25), జలుమూరు మండలం మాకివలసకు చెందిన బోర కన్నయ్య (48), శ్రీకాకుళం రూరల్ మండలం భైరివానిపేటకు చెందిన కింతలి సింహాచలం (వాహన యజమాని), శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగివలసకు చెందిన కురిటి అప్పన్న, చొట్టవానిపేటకు చెందిన మురపాక శ్రీను గుంటూరులో గొర్రెలమండికి వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో గురువారం రాత్రి బయల్దేరారు. మధ్యలో మరో యువకుడు వాహనాన్ని ఎక్కాడు. శుక్రవారం తెల్లవారుజామున మరో గంటలో గుంటూరులోని గొర్రెలమండి చేరుకోవాల్సి ఉండగా, జాతీయరహదారిపై పక్కన ఆపివున్న కంటైనర్ను వాహనం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో కోటిపల్లి శాంతారావు గోరా కన్నయ్యలతో పాటు మధ్యలో ఎక్కిన గుర్తు తెలియని యువకుడు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. మృతుల్లో కోటిపల్లి శాంతారావుకు నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఆమదాలవలస మండలం సొట్టోడుపేటలో ఉన్న తన భార్య మాధవి ఇంటి నుంచి దసరాకు గొర్రెలు కొనుగోలుకు లగేజి వాహనంపై బయల్దేరాడు. శాంతారావు నడగాంలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాద ఘటన తెలియడంతో రెండు గ్రామాల్లోనూ విషాదం అలుముకుంది. గుండె నిండా విషాదం నింపుకొని శాంతారావు తల్లిదండ్రులు బారికి వాడు, సూరమ్మలతోపాటు భార్య మాదవిలు హుటాహుటిన మంగళగిరి వెళ్లారు. -
మామపై కత్తితో అల్లుడి దాడి
సాక్షి, భామిని (శ్రీకాకుళం): కూతురు కాపురాన్ని చక్కదిద్దడానికి వచ్చిన మామపై అల్లుడు కత్తి దూశాడు. ఈ ఘటన మండలంలో గురువారం కలకలం రేపింది. గాయపరిచిన నిందితుడిని తండ్రే స్వయంగా పోలీస్ స్టేషన్కు అప్పగించి ఫిర్యాదు చేయడం విశేషం. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి మామ వై చిన్నారావు మండలంలోని బిల్లుమడలోని తన అల్లుడు కే సంతోష్కుమార్ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కూతురు, అల్లుడు తగాదా విషయమై మాట్లాడుతున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అల్లుడు తనకు అందుబాటులో ఉన్న కత్తితో మామపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన నిందితుడు తండ్రి తవిటయ్య నేరుగా బత్తిలి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించాడు. అనంతరం గాయపడిన వై చిన్నారావును కొత్తూరు ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్ ప్రశాంత్ వైద్య సేవలందించి పాలకొండ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. కొత్తూరు సీఐ ఎల్ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బత్తిలి ఎస్సై అజార్ అహ్మద్ ఆస్పత్రిలో బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. -
టైతో ఉరేసుకున్న విద్యార్థి..
సాక్షి, శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండల పరిధిలోని శాస్త్రులపేట శివారులో ఉన్న ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (మహాత్మా జ్యోతిబా పూలే) విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రేమసాయి పట్నాయక్ (14) బుధవారం వేకువ జామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం టెక్కలి పట్టణంలోని రాచవీధి. తల్లి చిన్నప్పుడే మృతి చెందింది. తండ్రి రాంప్రసాద్ పట్నాయక్ చదివిస్తున్నాడు. విద్యార్థి తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెతో ప్రేమసాయి నిత్యం వివాదాస్పదంగా ఉంటున్నట్లు సమాచారం. విద్యార్థి మృతికి గల కారణం కుటుంబంలో గడిచిన కొన్నేళ్లుగా కలహాలు ఎక్కువగా ఉండటమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం వేధింపులు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎలా జరిగిందంటే.. మంగళవారం రాత్రి ఎనిమిదో తరగతికి చెందిన 40 మంది విద్యార్థులతో స్టడీ అవర్స్కు వెళ్లి 9.30 గంటలకు తిరిగి వచ్చి డార్మింటరీలో అందరితోపాటే ప్రేమసాయి నిద్రపోయాడు. సమయం ఉదయం 5 గంటల 30 నిమిషాలైంది. రోజూ లాగానే యోగా టీచర్ వచ్చి విజల్ వేయడంతో విద్యార్థులంతా నిద్ర మేల్కోన్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఓ విద్యార్థి వెళ్లాడు. చివరి బాత్రూంలో ఉన్న ట్యాప్ నుంచి వాటర్ పడుతున్న శబ్ధాన్ని గమనించాడు. నీటిని కట్టేందుకు బాత్రూం తలుపు తీయబోయాడు. లోపల గెడ పెట్టి ఉండడంతో రంధ్రం గుండా చూసేసరికి తోటి విద్యార్థి అందులో వేళ్లాడి ఉండం గమనించాడు. తోటి విద్యార్థులతో కలిసి ఈ విషయాన్ని యోగా టీచర్కు, వాచ్మేన్కు చేరవేశాడు. ఆత్మహత్య చేసుకున్న తీరు ఇదీ.. స్కూల్ యూనిఫాంకు సంబంధించిన ఎరుపురంగు టైను మెడకు కట్టుకొని డార్మింటరీలోని 5 నంబర్ (చివరి) టాయిలెట్లో ఉన్న ట్యాప్ గుండా పైకి ఎక్కాడు. 12 అడుగుల ఎత్తులో ఉన్న కిటికీ గ్రిల్స్కు టైను కట్టి దానిని మెడకు బిగుంచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెల్సుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ లక్ష్మణరావు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్లోనూ.. స్కూల్లో జరిగిన ప్రతి ఫంక్షన్లోనూ ప్రేమ్సాయి పట్నాయక్ ముందు ఉండేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ గీతాలు ఎక్కువగా ఆలపించేవాడన్నారు. ఈ నెల 14న హిందీ దివాస్కు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెండు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభమైన 9 నెలలకే.. మహాత్మాజ్యోతిభా పూలే స్కూల్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైంది. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు 410 మంది విద్యార్థులున్నారు. 2019 మార్చి నుంచి తరగతులు ప్రారంభించారు. ఇంతలో ఈ అఘాయిత్యం జరగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతులకు సంబంధించిన రెండో బ్లాక్లోనే ప్రేమ్సాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ బ్లాక్లో ఉండేందుకు విద్యార్థులంతా భయాందోళన చెందుతున్నారు. చూడగానే భయం వేసింది టాయిలెట్స్కు వెళ్లి తిరిగి వస్తుండుగా చివరి బాత్రూంలో ట్యాప్ నుంచి వాటర్ పడుతున్న శబ్ధం వచ్చింది. వెంటనే వెనక్కి వెళ్లి చూశాను. అప్పటికే ప్రేమ్సాయి పట్నాయక్ కిటికీ ఊచలకు వేళాడుతూ కనబడ్డాడు. భయంతో పరుగు తీస్తూ మా టీచర్కు, వాచ్ మేన్కు చెప్పాను. - కె.రామ్మోహన్ (తోటి విద్యార్థి) పొద్దున్నే నిద్ర లేపుతాను ప్రతి రోజు పొద్దున్నే విద్యార్థులందరికీ నేనే నిద్రలో నుంచి లేపుతాను. వేకువ జామున 5.30 కల్లా డార్మింటరీకి వెళ్లి విజిల్ వేయడంతో అందరూ గ్రౌండ్కు వచ్చేస్తారు. ఎవరైనా సిక్లో ఉంటే క్లాస్ లీడర్తో మాకు నేరుగా సమాచారం వస్తే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. – ఎం.మధుసూదనరావు, పీఈటీ హాస్టల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు విద్యార్థి మృతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రిన్సిపాల్ యు.గణపతి, హౌస్ టీచర్ జి.వి.రామ్ప్రసాద్, వాచ్మేన్ వి.సింహాచలంపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరి ముగ్గురికి జిల్లా వెనుకబడుల తరగతుల సంక్షేమ శాఖాధికారి కృతిక బుధవారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. - విద్యార్థి ప్రేమ్సాయి పట్నాయక్ -
హత్యా... ఆత్మహత్యా!
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : మండలంలోని పోతయ్యవలసకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన సాగునీటి కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం ఉదయం నరసన్నపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ మృతదేహం అక్కడకు ఎలా వచ్చిందనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. కాలువలో ఎక్కువగా నీరు లేదు. పైగా దూరం నుంచి కొట్టుకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ ప్రాంతంలో పిచ్చిమొక్కలు అధికంగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ బయట హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. శరీరంపైన గాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించడానికి వీలు కాలేదు. పూర్తిగా ఉబ్బి గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం పొలానికి వెళ్తున్న కొంతమంది రైతులు ఇక్కడ కాలువలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎస్ఐ వీ సత్యనారాయణ, ఏఎస్ఐ నాగభూషనరావు వెళ్లి పరిశీలించారు. శరీరంపై లుంగీ, చుక్కల షర్ట్ ఉన్నాయి. వేలికి గోలిరంగు ఉంది. దుస్తుల్లో వెతికినా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే నరసన్నపేట పోలీసులకు సంప్రదించాలన్నారు. -
రాజాంలో దొంగల హల్చల్
సాక్షి, రాజాం : రాజాం పట్టణంలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. దేవాలయాల్లోని హుండీలనే టార్గెట్గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతమార్కెట్లోని మల్లికార్జునస్వామి ఆలయంలో రెండు హుండీలు, కాకర్లవీధి శివాలయంలోని హుండీ, పుచ్చలవీధి శివారులో ఉన్న వాసవీకన్యకాపరమేశ్వరి ఆలయ హుండీ, చీపురుపల్లి రోడ్డులోని అభయాంజనేయస్వామి దేవాలయంలోని హుండీని పగులుకొట్టి అందులోని నగదును దోచుకున్నారు. ఈ ఆలయాలన్నీ దగ్గర, దగ్గరగా ఉండడంతో చోరీలు వెంటవెంటనే జరిగినట్లు పోలుసీలు భావిస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలకు ఏదో అడ్డంపెట్టి ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. అందులోని ఒక కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి చెందిన ఫుటేజీ దొరికింది. ఉదయం యథావిధిగా ఆలయాలకు వెళ్లిన పురోహితులు, ఆలయ సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో దొంగతనాలు జరిగిన వార్త పట్టణంలో వ్యాపించడంతో సంచలనంగా మారింది. దొంగతనం జరిగిన కాకర్లవీధి శివాలయం, వాసవీకన్యకాపరమేశ్వరి దేవాలయాలు రాజాం పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో ఉండడం విశేషం. దొంగతనం జరిగినట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫుటేజీలో ఉన్నది ఎవరు? కన్యకాపరమేశ్వరి ఆలయంలో సీసీ కెమెరాకు చిక్కిన నిందితుని ఫొటో ఆధారంగా పోలీసులు కేసును ఛేదించే పనిలో ఉన్నారు. 12.45 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు సీసీ ఫుటేజీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూర్యకుమారి తెలిపారు. -
నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ఒడిశా విద్యార్థిని తృప్తిమయి పండా హత్య కేసు నిందితుడు మూడేళ్ల తర్వాత సోంపేట పోలీసులకు నేరుగా లొంగిపోయాడు. 2016లో బేసిరామచంద్రాపురం పరిసరాల్లో సంచలనం సృష్టించిన విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడింది. మూడేళ్లుగా నిందితుడి కోసం దేశంలో ప్రధాన పట్టణాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, పూణే తదితర ప్రాంతాల్లో సోంపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు నిందితుడే నేరుగా సోంపేట పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. పెను సంచలమైన కేసు.. సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని బేసిరామచంద్రాపురం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని యువతి (23) మృతదేహం 2016 ఆగస్టు 27వ తేదీన లభ్యం అయ్యింది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనమైంది. ఒడిశాలోని ఛత్రపురం గ్రామానికి చెందిన బివేకానంద పండా, స్వర్ణమయు పండాల కుమార్తె తృప్తిమయి పండాగా తర్వాత గుర్తించారు. ఈ హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తృప్తిమయి పండా, తన డిగ్రీ క్లాస్మేట్ సిక్కల్ కుమార్ బెహరాలు సన్నితంగా మేలిగేవారు. ఒడిశాలోని ఛత్రపురంలో డిగ్రీ పూర్తి చేసుకున్న తృప్తిమయి పండా బరంపురం కల్లికట్ కళాశాలలో ఎం.సీ.ఏ ప్రథమ సంవత్సరంలో చేరింది. స్నేహితురాలు అనురాధతో కలిసి ప్రైవేట్ వసతిగృహంలో ఉండేది. అనుమానంతోనే హత్య.. సిక్కల్ కుమార్ బెహరాది ఫ్యాక్షన్ కుటుంబం కావటంతో సోదరుడు సుకుడా బెహరాను వ్యతిరేకవర్గం హత్య చేసింది. సిక్కల్ కుమార్ బెహరా వర్గంలోని కొందరు సభ్యులు అవతలి వర్గం వారిని మట్టుపెట్టారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సక్కల్ కుమార్ బెహరా హైదరాబాద్ వెళ్లాడు. ఇంతలో తృప్తిమయి పండా బరంపురంలో ఓ కానిస్టేబుల్తో ప్రేమలో పడిందని సుకుమార్ అనుమానించాడు. తనను దూరం పెడుతుందని మానసిక క్షోభకు గురయ్యాడు. తృప్తిమయి పండా స్నేహితురాలు అనురాధకు ఫోన్ చేసి తాను హైదరాబాద్ నుంచి బరంపురం వస్తున్నానని, తృప్తిమయి పండాను కలవాలనుకుంటున్నానని తెలిపాడు. అనురాధ వీరిద్దరినీ 2016 ఆగస్టు 25న బరంపురంలో కలిపింది. తృప్తిమయి పండాకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై బరంపురం నుంచి బారువ బీచ్కు తీసుకువచ్చాడు. ఆగస్టు 26వ తేదీ రాత్రి బారువ నుంచి బరంపురం తిరుగు ప్రయాణం సమయంలో బేసిరామచంద్రాపురం లేఅవుట్ వద్ద కాసేపు ఆగారు. ఇద్దరి మధ్యన తీవ్ర గొడవ జరిగింది. నిందితుడు తీసుకువచ్చిన కత్తితో తృప్తిమయి పండా గొంతుకోసి, పొట్టపై మూడుసార్లు పొడిచి హత్య చేశాడు. ఆ కత్తిని అక్కడే దాచి పెట్టాడు. అక్కడి నుంచి బరంపురం వెళ్లాడు.తనకు హైదరాబాద్లో పని ఉందని ఇంటి వద్ద చెప్పి వెళ్లిపోయాడు. పోలీసులు కేసును అప్పుడే ఛేదించినా నిందితుడు ఆచూకీ లభ్యం కాలేదు. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోయి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు (రిమాండ్కు) తరలించినట్లు సీఐ తెలిపారు. బారువ ఎస్ఐ నారాయణస్వామి, పోలీసు సిబ్బంది సతీస్కుమార్, లోకనాథం, మథు, ప్రసాద్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం
రెప్పపాటు కాలంలో మొత్తం జరిగిపోయింది. కళ్ల ముందే కష్టార్జితం బూడిదపాలైంది. ప్రమాదాన్ని నివారించేలోగానే అంతా ఆవిరై చివరకు కట్టుబట్టలే మిగిలాయి. ఈ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న వారంతా ఉపాధి కూలీలు. తమ ఇళ్లు మంటలపాలయ్యాయని తెలుసుకొని పరుగు పరుగున వచ్చిన వారికి మొండిగోడలు దర్శనమివ్వడంతో కుప్పకూలిపోయారు. కొందరి ఆర్తనాదాలు మిన్నంటగా.. మరికొందరు సొమ్మసిల్లిపోయారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులు బాధితులను ఓదార్చడమే తప్ప జరిగిన నష్టాన్ని నివారించలేని పరిస్థితి.. ఇవీ రాజాం మండలంలోని పొగిరి గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనిపించిన దృశ్యాలు. సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వారంతా నిరు పేదలు.. కాయకష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి బతుకులు ఈడుస్తున్నవారు.. కూలికి వెళ్తేనే గానీ పూట గడవని దుస్థితి. వచ్చిన కాస్తో కూస్తో కూలీ డబ్బులను ఇళ్లలోనే దాచుకుని అవసరానికి వినియోగించుకునే అల్పజీవులే వీరంతా. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరంతా కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. పొగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో జె.గౌరి ఇంటి సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దగ్గర్లోని విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆ సమయంలో ఈ కాలనీలో నివాసముంటున్నవారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. దీంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించేవరకూ ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అగ్నికి వాయువు తోడు కావడంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించాయి. గ్రామంలో ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాద విషయాన్ని ఉపాధి పనుల్లో ఉన్న బాధితులు తెలుసుకుని తమ ఇళ్లకు చేరుకునే సమయానికే మొత్తం నష్టం జరిగిపోయింది. అప్పటికే ఈ పూరిళ్లలో ఉన్న వంట గ్యాస్ బండలకు అగ్ని అంటుకొని అవి పేలడంతో మంటల వ్యాప్తి అధికమైంది. మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన యువకులు, గ్రామస్తులు సైతం గ్యాస్ బండల పేలుళ్లను తట్టుకోలేక, ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేక భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. ఈలోగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చొప్పున రెండు వీధుల్లో మంటలు వ్యాపించి మొత్తం 31 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా నష్టం... ఈ ప్రమాదంలో బాధితులకు భారీ నష్టమే మిగిలింది. ఇళ్లల్లోని మొత్తం వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో పూరిళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చౌడువాడ వెంకటరమణకు చెందిన రూ.40 వేలు నగదు మొత్తం కాలిపోయింది. 11 ఇళ్లలో బీరువాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. పన్నెండు కుటుంబాలకు చెందిన టీవీలు పూర్తిగా కాలిపోయాయి. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికేట్లు మొత్తం బూడిదయ్యాయి. పాపారావుకు చెందిన సౌండ్ సిస్టమ్ మొత్తం కాలిపోవడంతో ముద్దముద్దలుగా దర్శనమిస్తోంది. పలువురు బాధితులకు చెందిన ఎల్ఐసీ బాండ్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, కరెంటు మీటర్లు, బంగారు అభరణాలు వంటివి మొత్తం బూడిదయ్యాయి. వీటిని చూసి బాధితుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. కొంతమంది బాధితులు ఈ ప్రమాదాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు. ప్రమాదం జరిగే సమయానికి వేరే ప్రాంతాల్లో ఉన్న బాధితులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని ఇంటికి చేరుకోగానే మొండిగోడలు చూసి లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా విలపిస్తూ చెట్టుకొకరు.. పుట్టకొకరుగా రోడ్డున పడ్డారు. ఈ ప్రమాదంలో రూ.9 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రెవెన్యూ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. బాధితులకు తక్షణ సాయం నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. యువత సేవా కార్యక్రమాలు ప్రమాద స్థలం వద్దకు గ్రామానికి చెందిన యువకులు చేరుకుని తొలుత మంటలను అదుపుచేసేందుకు సాహసించారు. కాలిపోతున్న ఇళ్ల నుంచి గ్యాస్ బండలు పేలడంతో ప్రమాద తీవ్రత అధికం కావడంతో ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా సేవలు అందించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు పొగిరి లెనిన్, జడ్డు జగదీష్, కామోదులు శ్రీరంగనాయుడు, శనపతిరాము తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితులకు సాయం అందించారు. బాధితులుకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు. రాజాం టౌన్ సీఐ సోమశేఖర్తోపాటు తహశీల్దార్ పి.వేణుగోపాలరావు, ఆర్ఐ శివకృష్ణ తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. తక్షణ నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులకు రెడ్క్రాస్ సాయం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రాజాం రెడ్క్రాస్ ప్రతినిధి కొత్తా సాయిప్రశాంత్కుమార్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్రావుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడి నుంచి ప్రతి కుటుంబానికి ఒక వంటసామగ్రి కిట్తోపాటు దోమల తెర, దుప్పట్లు తీసుకొచ్చి పొగిరిలో 31 అగ్నిప్రమాద కుటుంబాలకు అందించారు. గ్రామ పెద్ద పొగిరి లెనిన్ చేతుల మీదుగా వీటిని బాధితులకు అందజేశారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు. విజయవాడలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన అగ్ని ప్రమాద ఘటనపై స్పందించా రు. విజయవాడ నుంచి రాజాం మండలంలోని అధికారులకు ఫోన్ చేసి బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని బాధితులతో మాట్లాడారు. తక్షణ ప్రభుత్వం సాయం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ప్రాణం తీసిన బిందె
సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : తాగునీటి కోసం మహిళల మధ్య తలెత్తితున్న చిన్నపాటి ఘర్షణలతో ప్రాణాలు పోతున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పట్టణంలోని పల్లివీధిలో ఇద్దరు మహిళల మధ్య తలెత్తిన గొడవ ఓ మహిళా ప్రాణం తీసేందుకు కారణమైంది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎస్ఐ కే వెంకటేశ్ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 6–30 గంటల సమయంలో ఉద్దానం రక్షిత పథకం నుంచి తాగునీరు సరఫరా అయ్యింది. రోజూ నీటి సరఫరా సమయంలో లైన్లో బిందెలు పెట్టుకోవడం వీధివారికి ఆనవాయితీ. ఈ సమయంలో తాతపూడి పద్మ(36), ఈమె తల్లి తెప్పల ఈశ్వరమ్మల కంటే వెనుక వచ్చిన అదేవీధికి చెందిన తెప్పల సుందరమ్మ బిందెలు పెట్టడంతో చిన్నపాటి ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత సుందరమ్మ కుళాయి నుంచి తన ఇంటికి వెళ్లిపోయింది. వారిద్దరూ ఎన్నో మాటలు అంటున్నారని కుళాయి దగ్గర ఉన్న మరో మహిళ గున్నమ్మ సుందరమ్మకు చెప్పింది. వెంటనే సుందరమ్మ అక్కడకు వచ్చి గొడవ పడింది. ఖాళీ బిందెతో దాడి చేసి, పద్మను జుత్తు పట్టి లాగడంతో కింద పడి పోయింది. దీంతో ఎడమ చెంపపై బయటకు కనిపించని తీవ్ర గాయం కావడంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వీధివాసులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు పద్మ, సుందరమ్మ కుటుంబీకులు దగ్గర బంధువులు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి మృతదేహం వద్ద కుమార్తె రోదిస్తున్న తీరు స్థానికులను కన్నీళ్లు తెప్పించింది. పద్మ భర్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్ఐ 304/2 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలోని పితాతొళి పంచాయతీ పుచ్చపాడులో శుక్రవారం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చోటు చేసుకుంది. వీరిలో అన్నయ్య శిస్టు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మందస పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అన్నదమ్ములు శిస్టు శ్రీనివాసరావు, తాతారావుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. తాతారావు పొలం దున్నుకుని వస్తున్నాడు. ఇప్పటికే వివాదాలున్న పొలం ఎందుకు దున్నావని అన్నయ్య ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. వాగ్వాదం మరింత పెరిగి, తాతారావుతోపాటు కుటుంబ సభ్యులైన హేమసుందర్, బాలనాగమ్మ, నాగేశ్వరరావు వెదురు కర్రలతో శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఈ దాడిలో ఈయన తీవ్రంగా గాయపడగా, ఈయన భార్యకు కూడా దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయింది. మందస 108 అంబులెన్స్ ఈఎంటీ డీ తారకేశ్వరరావు, పైలట్ వీ మురళీమోహన్ బాధితులను పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం కిమ్స్లో చేర్పించారు. ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉలిక్కిపడ్డ బెట్టింగ్ రాయుళ్లు
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : రాజాం పట్టణ కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్థానిక బాబానగర్ కాలనీలో ఓ అద్దె ఇంటి నుంచి కొనసాగిస్తున్న బెట్టింగ్ ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరడంతో మరో ఐదుగురు బుకీలు అక్కడ్నుంచి తప్పించుకుని పరారయ్యారు. ఈ నెల 7న వరల్డ్ కప్ సెమీఫైనల్ –2 సందర్భంగా వీరంతా మ్యాచ్ తిలకిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. రాజాంలో కొంతకాలంగా సాగుతున్న బెట్టింగ్రాయుళ్లుపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో బుకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్కు సంబంధించి లక్షలాది రూపాయలు బెట్టింగ్ల రూపంలో చేతులు మారినట్లు సమాచారం. ఇటువంటి బెట్టింగ్ రాయుళ్లుపై పోలీసుల మరింత కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ బెట్టింగ్పై నిఘా : ఎస్పీ ఎవరైనా బెట్టింగ్కు పాల్పడినా, జూదం ఆడుతున్నా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం బెట్టింగ్ ముఠా వివరాలను వెల్లడించారు. రాజాం పట్టణ సీఐ సోమశేఖర్కు వచ్చిన సమాచారంతో నిఘా పెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్ఫోన్లు, పద్దు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో పిన్నింటి శివకుమార్, శేషపు మురళీకృష్ణ, లెంక దామోదరరావు, చింత శ్రీనివాసరావు, కరణం పురుషోత్తం ఉన్నారని వివరించారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రేమ్కాజల్, సీఐ సోమశేఖర్, ఎస్ఐ సూర్యకుమారి, హెచ్సీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సందేశాలు పంపించి... తనువు చాలించి..
కాశీబుగ్గ: ‘కుటుంబ కలహాలతో నేను చనిపోతున్నాను’ అంటూ కుటుంబీకులకు, బంధువులకు సందేశాలు పంపిన ఓ వివాహితుడు తనువు చాలించాడు. ఈ సంఘటన పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో కలకలం రేపింది. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన కదంబాల గోవిందరావు కుమారుడు వెంకటరమణ(29) గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి కాశీబుగ్గ చేరుకున్నాడు. అక్కడ శ్రీనివాస కూడలి వద్ద శ్రీనివాస లాడ్జీ మూడో అంతస్తులోని 314 గది బుక్ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరికీ ఫోన్ సందేశాలు పంపాడు. ఆ తర్వాత గది తలుపులు బంధించుకుని ఫ్యాన్ ఇనుప రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకున్నాడు. ఈ సందేశాలు చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నాడో తెలియక శుక్రవారం ఉదయం రైలు మార్గాలు, వంతెనలు వెతుక్కుంటూ వచ్చారు. చివరకు పోలీసులకు లాడ్జీ సిబ్బంది సమాచారం అందించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలు వచ్చేంత వరకు కాశీబుగ్గ ఎస్ఐలు టీ రాజేష్, రాజేంద్రప్రసాద్, సిబ్బంది వేచి ఉన్నారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతుడి పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కుటుంబ కలహాలే కారణమని, అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని బంధువులు తెలిపారు. వ్యాపార రీత్యా మార్కెటింగ్ పనిమీద వచ్చినట్లు వివరించాడని లాడ్జీ మేనేజరు తెలిపారు. మృతదేహాన్ని పలాస ఆసుపత్రికి తరలించిన కాశీబుగ్గ పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు వజ్రపుకొత్తూరు రూరల్: వెంకటరమణ ఆత్మహత్యతో స్వగ్రామం నువ్వలరేవులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ బుక్షాపు నడుపుకుంటూ నిన్నటి వరకు అందరితో సరదాగా గడిపి, ఇంతలోనే తమ∙మధ్య లేకపోవడంతో స్నేహితులు జీర్జించుకోలేకపోతున్నారు. ఈయనకు నాలుగేళ్ల కిత్రం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చికిటి నియోజకవర్గ పరిధిలో కోటిలింగం గ్రామానికి చెందిన తులసితో వివాహమైంది. వీరికి కుమార్తె లాస్య(5), కుమారుడు ప్రదీప్(1) ఉన్నారు. తన తల్లిదండ్రులు లక్ష్మి, గోవిందరావులతో కలిసి వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యాపార రీత్యా బయటకు వెళ్లిన తమ తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న పసి హృదయాలకు ఇక నాన్న లేడన్న చేదు నిజం తెలిసి గుక్కపెట్టి ఏడ్చారు. వీరిని చూసిన హృదయాలు చలించిపోయాయి. -
మద్యానికి రూ.100 ఇవ్వలేదని తల్లిని..
నెల్లిమర్ల: ‘నెల్లిమర్ల పట్టణానికి చెందిన జలుమూరు శ్రీనివాసరావు మద్యం కొనుక్కోవడానికి తల్లిని రూ.100 అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇటుకలతో కొట్టి చంపేశాడు’ అని భోగాపురం సీఐ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ హత్యకు సంబంధిచిన వివరాలను వివరించారు. ఆయన కథనం ప్రకారం.. నెల్లిమర్ల పట్టణంలోని మండలపరిషత్ కార్యాలయం సమీపంలోని ఓ పూరి గుడిసెలో జలుమూరు గౌరమ్మ, ఆమె కుమారుడు శ్రీనివాసరావు నివశించేవారు. కొన్నాళ్ల క్రితం వరకు తల్లీకొడుకులు టిఫెన్ సెంటర్ నిర్వహించేవారు. అయితే ఏవో కారణాలవల్ల కొంతకాలంగా ఆ వ్యాపారం నిలిపివేశారు. దీంతో జీవనోపాధికి గౌరమ్మ సమీపంలోనున్న మిమ్స్ ఆస్పత్రి క్యాంటీన్లో పనికి వెళ్లేది. కొడుకు శ్రీనివాసరావు చాలాకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని నిత్యం తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గౌరమ్మ క్యాంటీన్లో పని ముగించుకుని ఇంటికి రాగా మద్యం కొనుక్కోవడానికి తల్లిని రూ.100 ఇవ్వాలంటూ శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. అయితే తన దగ్గర డబ్బుల్లేవని గౌరమ్మ చెప్పడంతో శ్రీనివాసరావు కోపానికి గురై ఇటుకలతో గౌరమ్మ తలపైన, ఒంటిపైనా తీవ్రంగా కొట్టాడు. తప్పించుకుని ఆమె బయటకు పారిపోయినా వెంటబడి మరీ కొట్టాడు. ఆమె భయంతో సమీపంలోని గుడిసెలో దాక్కున్నా వదలలేదు. కొడుకుకొట్టిన దెబ్బలను తట్టుకోలేక గౌరమ్మ మృతి చెందిందని సీఐ ప్రభాకర్ వివరించారు. వీఆర్వో సమక్షంలో లొంగిపోయిన నిందితుడు శ్రీనివాసరావును అరెస్టుచేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ అశోక్కుమార్ కూడా పాల్గొన్నారు. -
వంట రాదన్నందుకు ఆత్మహత్యాయత్నం..
రాజాం సిటీ: ‘ఇంకా వంట నేర్చుకోకుంటే ఎలా?, రేపొద్దున్న ఎలాగే బతికేది.. ఇదిగో రూ.20 తీసుకుని బయట కర్రీ తెచ్చుకో’ అని మందలించి బయటకు వెళ్లిన ఆ తల్లి కాసేపటికే దుర్వార్త వినాల్సి వచ్చింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతురును చూసి హతాశురాలైంది. అయ్యో దేవుడా... కర్రీ తెచ్చుకోమని నేనిచ్చిన రూ.20తోనే అఘాయిత్యానికి ఒడిగట్టావా... అంటూ కన్నీటిపర్యంతమైంది. ఆస్పత్రిలో కొనఊపిరితో చికిత్స పొందుతున్న ఈ బాలిక తనకు బతకాలని ఉందని కోరుతుండటంతో వైద్యులను, పోలీసులను కలచివేసింది. రాజాం పట్టణం కొండకవీధికి చెందిన పట్నాన అనిత (14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆదివారం చీపురుపల్లి రోడ్డులోని వేబ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈమె తన ఒంటికి నిప్పంటించుకోగా మంటలకు తాళలేక గట్టిగా కేకలు వేసినప్పటికీ సమీపంలో ఎవరూ లేరు. కొంత సమయానికి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే శరీరమంతా కాలిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో (ట్రాక్టర్లో) రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్సనందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. తల్లి మందలించిందని.... విషయం తెలుసుకున్న రాజాం సీఐ జీవీ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. సిబ్బందిని ఆస్పత్రికి పంపించి బాధితురాలి వద్ద వాంగ్మూలం సేకరించారు. ఈ విద్యార్థిని రాజాంలోని ఓ ప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి పూర్తి చేసుకోగా, పదో తరగతిలోకి రానుంది. తన తల్లి మంగమ్మ, చెల్లితో కలసి నివాసముంటోంది. మూడేళ్ల క్రితమే తండ్రి మరణించాడు. తన తల్లి భోజనం చేయడానికి కూర వండుకోమని చెప్పగా తనకు రాదనడంతో మందలించి, కర్రీ తెచ్చుకోమని రూ. 20 ఇచ్చి బయటకు వెళ్లిపోయింది. ఈ డబ్బులతో పెట్రోల్ కొనుగోలు చేసి ఆత్మహత్యకు యత్నించింది. రోదిస్తున్న తల్లి.... కాలిన గాయాలతో కుమార్తెను చూసిన తల్లి మంగమ్మ బోరున విలపించింది. తన భర్త మరణానంతరం, రోడ్డు పక్కన పకోడీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె ఇలా చేస్తుందని ఊహించలేదని బోరుమంది. బతకాలని ఉంది... చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనితను శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతోంది. ఈ సమయంలో వాంగ్మూలం తీసుకునేందుకు వచ్చిన పోలీసులతోపాటు వైద్యులు ఎదుట రోదించింది. తనను బతికించాలని, తనకు బతకాలని ఉందని కంటతడి పెట్టింది. క్షణికావేశం కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్లు వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రాజాం సీఐ జీవీ రమణ తెలిపారు. -
సైబర్ వలలో మరో ముగ్గురు
కాశీబుగ్గ: రాజాంలో ఉద్యోగులు సైబర్ మోసానికి బలైన విషయం మరవకముందే, తాజాగా పలాసలో మరో ముగ్గురు వ్యక్తులు సైబర్ మాయగాళ్ల చేతికి చిక్కారు. సుమారు రూ. 1.13 లక్షలు దోచుకోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఆదివారం సంచలనంగా మారింది. బాధితుల్లో పీహెచ్సీ ఏఎన్ఎం, హెల్త్సూపర్వైజర్ ఉండటం గమనార్హం. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన కాశీబుగ్గ హరిజనవీధికి చెందిన చల్లాక మహలక్ష్మి మెళియాపుట్టి మండలం కరజాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్ఎంగా పని చేస్తోంది. ఆదివారం ఈమెకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను స్టేట్బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా. మీకు కొత్త ఏటీఎం కార్డు వస్తుందని, ప్రస్తుత కార్డు పనిచేయదని నమ్మబలికాడు. ఈమె కార్డు నంబర్, పిన్ అడిగాడు. మీకు కొద్దిరోజుల్లో కొత్త కార్డు వస్తుందని అందుకు మీ సెల్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని తీసుకున్నాడు. అక్కడకు కొద్ది నిమిషాల్లోనే 696198 ఒన్టైం పాస్వర్డ్ ఆన్లైన్ పర్చేస్ అంటూ రూ.48,999.00 మొబిక్విక్ కార్డు ఎండింగ్ నంబర్ 6332 అంటూ మెసేజ్ వచ్చింది. అప్పటికే తనిఖీ చేయగా మరో రూ.2,998 వేలు కట్ అయినట్లుగా మెసెజ్ వచ్చింది. అదేవిధంగా కాశీబుగ్గ బ్రాహ్మణవీధికి చెందిన గంటా అనితకు ఇదేవిధంగా ఫోన్ రావడంతో ఆమె కూడా వివరాలు చెప్పింది. కాశీబుగ్గ సిండికేట్ బ్యాంకు ఎకౌంట్ నంబర్ చివర 5055 నంబరులో రూ.10 వేలు కట్ అయింది. హెచ్డీఎఫ్కు ట్రాన్స్ఫర్ అయినట్లుగా మెసెజ్ వచ్చింది. వీరిద్దరితోపాటు బ్రహ్మణతర్లాకు చెందిన హెల్త్ సూపర్వైజర్ కార్డు నుంచి రూ.49,998.00 కట్ అయింది. ఈ విషయమై ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేశారు. పలాస స్టేట్ బ్యాంకు మేనేజరు దృష్టికి తీసుకెళ్లారు. ఓటీపీతోపాటు కార్డు వివరాలు అపరచితులకు ఇవ్వొద్దని, దీనికి తమ బాధ్యత కాదన్నారు. -
ప్రేమికుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం..
మందస: వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమకు దారితీసింది. ఇంతలో యువతికి వేరొకరితో వివాహామైన ఈ ప్రేమను కొనసాగించారు. ఈ సమస్యను ఇంట్లో చెప్పుకోలేక, ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారు. మందస పట్టణంలో శుక్రవారం ఈ ఘటన సంచలనం కలిగించింది. క్రిమిసంహారక మందు తాగి∙ఒకేచోట పడి ఉన్న యువజంటను వారి కుటుంబ సభ్యులు గుర్తించి, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మందస పట్టణంలో కాపువీధికి చెందిన బతకల మంజుల, పొందర వీధికి చెందిన పొందర వెంకటేశ్ల మధ్య స్నేహం చిగురించింది. ఇది ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం మంజులకు ఇదే మండలానికి చెందిన కొత్తకమలాపురం గ్రామానికి చెందిన సింహాచలంతో వివాహామైంది. అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. ఇటీవల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చిన మంజుల, వెంకటేశ్ను శుక్రవారం మధ్యాహ్నం మందసలోని తోటలో కలిసింది. ఈ క్రమంలో క్రిమిసంహారక మందు సేవించిన వీరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి పలాసలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం తీసుకెళ్లారు. అయితే మంజులకు మేజరు కాకుండానే వివాహం చేసినట్లు తెలుస్తోంది. మందస పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్క్రాప్ దొంగే హంతకుడు
శ్రీకాకుళం రూరల్: నగరంలోని గుజరాతీపేటలో నివసిస్తున్న మహాలక్ష్మీ ఠాకూర్ అనే వృద్ధురాలిని తువ్వాలుతో హత్య చేసిన ఘటనలో పోలీసులు కొంతమంది అనుమానితులను విచారించారు. సోమవారం నగర పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని గట్టిగా ప్రశ్నస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం క్రైం ఏఎస్పీ గంగరాజు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. స్క్రాప్ దొంగతనాలకు పాల్పడే లండ రామస్వామి (దుప్పలవలస) వృద్ధురాలిని హత్య చేశాడు. గత నెల 29వ తేదీ అర్ధ రాత్రి తర్వాత గుజరాతీపేట పరిసర ప్రాంతాల్లో దొంగతనానికి వచ్చిన రామస్వామి మహాలక్ష్మీ ఠాకూర్ నివాసాన్ని ఎంచుకున్నాడు. మేడపైన ఇంటిలోకి నేరుగా లోపలకి ప్రవేశించాడు. అప్పటికే తలుపులకు గడియ పెట్టకపోవడంతో బార్లా తెరిచేలోపు గట్టిగా శబ్ధం రావడంతో వృద్ధురాలికి మెలకువ వచ్చి గట్టిగా కేకలు వేయబోయింది. రామస్వామి అప్పటికే తనతో తెచ్చుకున్న తువ్వాలుతో వృద్ధురాలి మెడపై బలంగాబిగించాడు. ఊపిరాడక ఆమె మంచంపైనే ప్రాణాలు విడిచింది. ఆమె మెడలోని చైన్, చెవి దిద్దులు, ఉంగరాన్ని పట్టుకుని అక్కడ నుంచి ఉడాయించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా.. మృతురాలి కోడలు కోడలు రాజేశ్వరి గత నెల 30న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ సీఐ మల్లా మహేశ్వరరావు, సిబ్బంది, సీసీఎస్ పోలీసులు కలిసి అనుమానితులను తమదైన శైలిలో ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు రాత్రి సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించగా కొన్ని కీలక ఆధారాలు పోలీసులకు చిక్కాయి. దీంతో సులువుగా నేరస్తుడు రామస్వామిని ఈ నెల 6వ తేదీ సాయంత్రం కొత్త బ్రిడ్జి పక్కన ఉన్న స్వర్గధామం వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుడుపై 302, 380 సెక్షన్లు కింద కేసు నమోదు చేసి చోరీ సొత్తును రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్క్రాప్ దొంగతనాలే ఎక్కువ.. నిందితుడు రామస్వామి ఎక్కువగా స్క్రాప్ దొంగతనాలే చేసేవాడు. 2005లో ఆయనపై రెండో పట్టణ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఓ దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు చేధించిన పోలీసులు, సిబ్బందితో పాటు ఈ కేసులో సహాయకులుగా ఉన్న ఇద్దరి యువకులకు ఏఎస్పీ చేతులు మీదుగా రివార్డులు అందజేశారు. ఆన్లైన్ మోసాలకు గురికావద్దు: టూ టౌన్ సీఐ మహేశ్వరరావు ఇటీవల ఆన్లైన్ మోసాలు నగరంలోని ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని, వాటిపై నగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని రెండో పట్టణ సీఐ మల్లా మహేశ్వరరావు తెలిపారు. వృద్ధురాలి హత్య కేసు వివరాలు వెల్లడించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రోజుకు రెండు, మూడు ఆన్లైన్ కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. క్రెడిట్ కార్డులో పాయింట్లు, లక్కీడ్రా, ఓఎల్ఎక్స్లో తక్కువ రేట్లుకు వాహనాలు, లక్కీ లాటరీ, అమేజాన్, ఫ్లిప్కార్ట్లో ఉచిత ఆఫర్లు అంటూ చాలామంది ప్రలోభాలకు గురిచేస్తూ కాల్ చేస్తారని, అటువంటి వారిని నమ్మి బ్యాంకు వివరాలు ఇచ్చి మోసపోవద్దన్నారు. ఏటీఎం నంబర్, పిన్ నెంబర్, ఇతరత్రా వివరాలు అడుగుతారని, ఏ బ్యాంకు నుంచి అటువంటి ఫోన్లు రావని ఆయన స్పష్టం చేశారు. 2013 రాష్ట్ర ప్రభుత్వపు ఆదేశాల మేరకు వంద మందికి పైబడి సంచరించే గ్రూప్ హౌస్ల్లో, అపార్ట్మెంట్లలో, ఆస్పత్రుల్లో, కార్పొరేట్ స్కూళ్లలో 30 రోజుల నిడివి బ్యాక్ అప్ ఉండే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే అన్ని అపార్ట్మెంట్లకు, వాణిజ్య సముదాయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ నోటీసులు జారీ చేశామన్నారు. ఎల్హెచ్ఎంఎస్తో ఇళ్లకు భద్రత:సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉండేవారు వేసవి సెలవులో బయటకు వెళ్తే ఇంటి భద్రం కోసం ఎల్హెచ్ఎంఎస్తో (లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం)ను ఏర్పరుచుకోవాలని సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. దొంగ ఇంట్లోకి చొరబడితే గంటల వ్యవధిలోనే పట్టుకోవచ్చన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారి పేరిట దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే ఈ సేవలు పొందవచ్చన్నారు. -
హత్యా..ఆత్మహత్యా?
కాశీబుగ్గ: వృద్ధురాలు అనుమానాస్పదంగా సీలింగ్ ఫ్యానుకు వేళాడుతూ మృతి చెందిన సంఘటన పలాస పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిని 23వ వార్డు రాజమ్మకాలనీకి (గాంధీనగర్) చెందిన తంగుడు లక్ష్మి(63) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలు చేశారు. లక్ష్మి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఆమె ఇద్దరు కుమారులు రామచంద్రరావు (రాజు), కిశోర్లు వేర్వేరు ఇళ్లల్లో కాపరం ఉంటున్నారు. రామచంద్రరావు (రాజు) ఇంట్లో లక్ష్మి ఉంటోంది. జీడిపప్పు వ్యాపారం చేస్తున్న రాజుకు 2007 మార్చిలో శ్రీకాకుళం పట్టణంలోని మంగువారితోట ప్రాంతానికి చెందిన జామి సూర్యారావు కుమార్తె సౌజన్యతో వివాహం జరిగింది. కోడలు సౌజన్య తన పిల్లలతో ఆదివారం శ్రీకాకుళంలోని కన్నవారింటికి చేరుకుంది. తండ్రి సూర్యారావుకు పిల్లలను అప్పగించి నగరంలోని కొత్త వంతెన (నాగావళి)పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తండ్రి జామి సూర్యారావు శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు స్టేషన్లో అత్త లక్ష్మి(మృతురాలు), ఆడపడుచులు పావని, ప్రియ వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం టిఫిన్ సిద్ధం చేసిన అనంతరం 9:30 నిమిషాలకు ఫ్యానుకు మృతదేహం వేళాడుతున్నట్లు సమాచారం బయటకు రావడంతో విషయం అందరికీ తెలిసింది. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆస్పత్రికి తరలించారు. ఆమె కడుపునొప్పిని తాళలేక ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని కాశీబుగ్గ సీఐ చంద్రశేఖరం కేసు నమోదు చేశారు. మృతురాలు వృద్ధురాలు కావడంతో ఎత్తైన ఫ్యానును ఎలా ఉరి వేసుకుంటుందని, పూర్తిగా కాలు భూమికి తాకడం చూసిన బంధువులు, పరిసర ప్రాంతీయులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. -
వస్త్ర దుకాణంలో రూ.1.12 లక్షల చోరీ
శ్రీకాకుళం ,కాశీబుగ్గ: ఓ వైపు పెళ్లి వేడుకలో ఎవరికీవారు హడావుడిగా ఉన్నారు. మరోవైపు బీట్ పొలీసులు జాడలేకపోయింది. ఇదే అదనుగా భావించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వస్త్ర దుకాణంలో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీరోడ్డు శ్రీనివాస కూడలి వద్ద శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. సీసీఫుటేజీలో రికార్డయిన వివరాలను, దుకాణంలో వేలిముద్రలను ఆదివారం శ్రీకాకుళం క్లూస్ టీం సేకరించింది. ఇక్కడ తనూ బట్టల దుకాణంతోపాటు, టైలరింగ్ దుకాణాన్ని అన్నదమ్ములు శివ, భాస్కర్ నడుపుతున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి 9:50 గంటలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. పక్కనే చెప్పుల దుకాణాన్ని సైతం మరో పది సెకన్ల తేడాలో యజమాని మూసివేసి వెళ్లిపోయాడు. అప్పటికే ఎదురుగా శివరామ కల్యాణ మండపం, లాడ్జీలో వివాహ వేడుక జరుగుతోంది. ఈ సందడిలో ఒక వ్యక్తి సెల్ఫోన్లో సంభాషిస్తూ దుకాణం వద్ద కాపలాగా ఉన్నాడు. ఇదేక్రమంలో మరో యువకుడి వచ్చి దుకాణం షట్టర్ తాళం తెరచి లోపలకు చొరబడ్డాడు. అయితే దుకాణం యజమాని భాస్కర్ ఎప్పటిలాగే డబ్బులు దాచుకునే డెస్ తాళాలు అక్కడే విడిచి పెట్టడంతో వీరి పని సులువైంది. డెస్క్లో రూ.1.12 లక్షలతోపాటు విలువైన వస్త్రాలు, వస్తువులు చోరీ చేశారు. గోనె సంచిలో వేసుకుని ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి శివరామ లాడ్జీ రోడ్డుకు దాటేశారు. ఇదంతా సీసీ ఫుటేజీలో నమోదైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం జాగింగ్కు వచ్చిన యజమాని దుకాణం షట్టర్ తెరచి ఉండటంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించాడు. కాశీబుగ్గ సీఐ చంద్రశేఖరం కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్టీం రాక.. కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు శ్రీకాకుళం క్లూస్ టీం చేరుకుని దుకాణంలో దొంగల వేలిముద్రలు సేకరించారు. వీరితోపాటు కాశీబుగ్గ డివిజన్ క్రైం స్పాట్ టీం పూర్తిస్థాయి కిట్తో అక్కడకు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీసి పక్క దుకాణంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఉలిక్కిపడ్డ వ్యాపారులు ఈ చోరీ ఘటనతో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో 300లకుపైగా జీడిపరిశ్రమ యజమానులు, వ్యాపారులు, బంగారు దుకాణదారులు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టూ సీసీఫుటేజీలు, బీట్ పోలీసుల సంరక్షణలో పట్టణం ఉన్నప్పటికీ ముఖ్య కూడలి వద్ద కలెక్టరేట్తో అనుసంధానమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ చోరీ జరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. -
మనస్తాపంతో అగ్రికల్చర్ విద్యార్థి ఆత్మహత్య
పాతపట్నం: స్థానిక శివశంకర్ కాలనీ మెయిన్ రోడ్డులో అద్దెకు ఉంటున్న బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థి బిడ్డక వివేక్కుమార్ (23) మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. పోలీసులు తెలపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని సెంచురీయన్ యూనివర్సిటీ (పర్లాకిమిడి)లో వివేక్కుమార్ అగ్రికల్చర్ ఫైనల్ సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిగా పాతపట్నం శివశంకర్ కాలనీ మొదటి లైన్ రోడ్డులో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న వివేక్ కుమార్ను స్థానికులు గుర్తించారు. చికిత్స కోసం ఆటోలో పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చికిత్స పోందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రిమ్స్లో పోస్ట్మార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వివేక్కుమార్ స్వస్థలం విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టజమ్ము గ్రామం. తమ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేయమని అడిగాడని తండ్రి సుకుమార్కు చెప్పారు. ఆ అమ్మాయి ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. వివేక్కుమార్ తండ్రి సుకుమార్ కడపలో ఆంధ్ర జాగృతి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు. -
తప్పిన పెను ప్రమాదం
శ్రీకాకుళం, కాశీబుగ్గ: వారంతా తీర్థయాత్రలు ముగించుకుని బస్సులో తిరిగి పయనమయ్యారు. మరికొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. రాత్రి సమయం కావడంతో నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే పెద్ద శబ్ధం వినపడింది. ఏం జరిగిందో అని అందరూ ఉలిక్కిపడి లేచారు. పలువురు గాయాలతో హాహాకారాలు చేస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నం వైపు నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న ట్రావెల్ బస్సుకు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కోసంగిపురం కూడలి వద్ద 3:30 గంటలకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన 14 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 36 మంది ఉన్నారు. వీరంతా తీర్థయాత్రలు ముగించుకుని తిరుగుపయనం అయ్యారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే వీరిని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో గంగాధర్ నాయక్, సంతోస్ ప్రధాన్, సత్యప్రకాష్, సాయిరాం ఉన్నారు. కాళ్లు, చేతులు, తలకు తీవ్రగాయాలయ్యా యి. క్షతగాత్రులు రోడ్డుపై ఉండటంతో విషయం తెలుసుకున్న లక్ష్మీపురం టోల్గేటు అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి వారిని సకాలంలో ఆస్పత్రిలో చేర్చారు. వేకువజామున కావడంతో లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చుని స్థానికులు భావిస్తున్నారు. కోసంగిపురం కూడలి వద్ద ఉన్న వంతెన పనులు జరుగుతుండటంతో అక్కడ దారి మళ్లించారు. -
కొండంత విషాదం
శ్రీకాకుళం , నెల్లిమర్ల రూరల్: అంతవరకు ఆ ఇద్దరు స్నేహితులు అక్కడే ఆడుకున్నారు. శివరాత్రి సందర్భంగా వీధిలో ఉన్న స్నేహితులతో కలిసి ఆట, పాటలతో సందడి చేశారు. రామతీర్థంలో జరుగుతున్న శివరాత్రి జాతరను చూసొద్దామనుకుని వెళ్లిన వారు బోడికొండపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ హృదయ విదారకర సంఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆదుకుంటారనుకున్న కుమారులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి సమయంలో జరగగా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జాతరకు వెళ్లి రోజులు గడుస్తున్నా బిడ్డలు ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న బంధువుల సహకారంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులు అందించి వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం ప్రశాంత్నగర్కు చెందిన బూర కుమార్ (16), మన్నెం సాయి(14) ఇద్దరూ ప్రాణస్నేహితులు. శివరాత్రి సందర్భంగా రోజంతా ప్రశాంత్నగర్లోనే సందడిగా గడిపారు. అనంతరం రామతీర్థంలో జరగుతున్న జాతర చూద్దామని బాబామెట్టకు చెందిన అయితి నాగరాజు (26)తో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి సుమారు 1.30 సమయంలో బయలుదేరారు. సీతారామునిపేట జంక్షన్ వద్ద బైక్ పార్క్ చేసి ఎదురుగా ఉన్న బోడికొండ పైకి అడ్డదారిలో ఎక్కేందుకు ప్రయత్నించారు. కొంతదూరం వెళ్లేసరికి అదుపు తప్పడంతో ముగ్గురూ పడిపోయారు. ఈ ప్రమాదంలో బూర కుమార్, మన్నెం సాయి అక్కడికక్కడే మృతి చెందగా.. అయితి నాగరాజు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఎవ్వరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజుకి బుధవారం ఉదయం కొద్దిగా తెలివి రావడంతో కొండ దిగి గట్టిగా కేకలు వేయడంతో సీతారామునిపేట గ్రామానికి చెందిన పలువురు ఆ యువకుడి వద్దకు చేరుకొని మంచినీరు అందించి విషయం తెలుసుకున్నారు. వెంటనే 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ రమేష్, ఎస్సై అశోక్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా నుంచి క్లూస్టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. నాగరాజు పరిస్థితి విషమం.... విజయనగరం బాబామెట్టకు చెందిన నాగరాజు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగరాజు తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోగా.. అప్పటి నుంచి పెయింటర్గా పనిచేసుకుంటూ కుటుం బాన్ని నెట్టుకొస్తున్నాడు. మృతదేహాల తరలింపులో ఇక్కట్లు... బోడికొండ ఎక్కేందుకు కూడా వీలుపడని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో మృతదేహాలను కిందకు దించడం పోలీస్లకు సవాల్గా మారింది. మృతుల కుటుంబాల సభ్యుల సహకారంతో డోలీలపై అతికష్టం మీద ఇద్దరి మృతదేహాలను కిందకు దించారు. అప్పటికే కుమారుల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిల్లల మృదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. వాళ్లను ఆపడం కూడా ఎవరి తరం కాలేదు. బూర కుమార్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మి, ఆది కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే మన్నెం సాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి రాము ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
ఆస్తి కోసం తండ్రిపై తనయుల దాడి
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: కని పెంచిన పాపానికి తండ్రిపైనే తనయులు దాడి చేశారు. ఆస్తి కోసం కన్నతండ్రి అని చూడకుండా స్పృహ కోల్పోయే వరకు విచక్షణారహితంగా చావబాదారు. ఈ దెబ్బలకు తాళలేక ఆసుపత్రి పాలైన ఘటన ఇచ్ఛాపురం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని టి.బరంపురం గ్రామం పాండురంగ వీధికి చెందిన కొయ్య సోమయ్యకు నలుగురు కొడుకులు. తొలి భార్యతో విడాకులు తీసుకుని మరొకరిని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలిభార్యకు చెందిన నలుగురు కుమారులకు, రెండో భార్యకు ఆస్తిని సమానంగా పంపకాలు చేశాడు. అయితే మిగిలిన కొద్దిపాటి ఆస్తిపై తరచూ తండ్రీ కుమారుల మధ్య గొడవలు తలెత్తుతుండగా, గ్రామస్తులు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇదే విషయమై శుక్రవారం మరోమారు తండ్రితో కుమారులు పోలారావు, డొంబురు వాగ్వాదానికి దిగారు. దీంతో విచక్షణ కోల్పోయిన కుమారులిద్దరూ తండ్రిపై చేయి చేసుకున్నారు. అంతేగాకుండా బలంగా తలపై రాయితో కొట్టడంతో సోమయ్య అక్కడకక్కడే స్పృహ కోల్పోయాడు. దీంతో రెండో భార్య లక్ష్మమ్మ, అక్క సోభమ్మ ఆటోపై ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసు స్టేషన్ ట్రైనీ ఎస్సై డీ శ్యామల కేసు నమోదు చేశారు. -
నిందితుడిని పట్టించిన తల వెంట్రుకలు
శ్రీకాకుళం: సోంపేట మండలం బేసి రామచంద్రాపురంలో ఈ నెల 16న జరిగిన కనకలత మహంతి (22) హత్య కేసు మిస్టరీ వీడింది. మృతదేహం వద్ద లభించిన తల వెంట్రుకలే నిందితుడ్ని పట్టించాయి. సంఘటన జరిగిన నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులకు ఎస్పీ వెంకటరత్నం నగదు రివార్డులను బుధవారం అందజేశారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. టవల్తో గొంతు బిగించి హత్య.. హత్య జరిగిన తర్వాత కనకలత తల్లి రాధామణి మహంతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. కనకలత మహంతి ప్రతిరోజూ స్నానం కోసం చెరువుకు వెళ్తుండేదని, అక్కడికి దగ్గరలోనే కల్లు దుకాణం ఉండడంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారించారని, పోస్టుమార్టం రిపోర్టులో సైతం గొంతు బిగించి చంపినట్లు తేలడం, సంఘటన స్థలంలో టవల్ లభించడంతో కేసు కొలిక్కి వచ్చిందన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, క్లూస్టీం ఆధారాలు సేకరించిందని చెప్పారు. సంఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరిగిన సీల తాతారావుపై సిబ్బంది దృష్టి సారించారని, మృతదేహంపై గోరు గాయాలు ఉండగా, తాతారావు శరీరంపైనే గోటి గాయాలు ఉండడంతో అనుమానం పెరిగిందన్నారు. ఇతనికి నేరచరిత్ర ఉండడంతో నిఘా పెట్టారని పేర్కొన్నారు. మృతదేహం వద్ద లభించిన కొన్ని తల వెంట్రుకలను క్లూస్ టీం సేకరించారని, వాటిని చూడగా తాతారావుపై అనుమానం మరింత పెరిగిందని చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. యువతి స్నానం చేస్తున్నప్పుడు కొద్దిరోజులుగా చూసేవాడని, అవకాశం కోసం ఎదురుచూస్తుండగా ఒంటరిగా ఆ రోజు స్నానానికి వెళ్తున్న కనకలత మహంతిని చూసి వెంబడించాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెపై చేయి వేయగా భయపడటంతో మెడలో ఉన్న టవల్తో గొంతు బిగించి చంపినట్టు ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. సంఘటన జరిగినట్లు ముందుగా గ్రామస్తులకు చెప్పింది కూడా తాతారావేనని పేర్కొన్నారు. తాతారావును బుధవారం కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసులో ఇచ్ఛాపురం సీఐ కె.పైడపునాయుడు, సోంపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్, మహిళా ఎస్ఐ ఎన్.గౌరి, కానిస్టేబుళ్లు కనకరాజు, లోకనాథం, ప్రసాద్, సతీష్, శ్రీను తదితరులు చురుగ్గా వ్యవహరించారని, వారికి నగదు రివార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటరత్నం జంట హత్య కేసులో పురోగతి.. శ్రీకాకుళం నగరంలో ఈ నెల 7న జరిగిన జంట హత్య కేసులో కూడా పురోగతి సాధించామని ఎస్పీ చెప్పారు. మరికొంత దర్యాప్తు జరగాల్సి ఉందని, త్వరలోనే ఆ కేసును కూడా ఛేదిస్తామన్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
యువకుల కలకలం
శ్రీకాకుళం, కొత్తూరు: మండల కేంద్రంలో సోమవారం ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా పరుగులు తీయండంతో స్థానికంగా కలకలం రేపింది. బంగారానికి మెరుగు పెడతామనే నెపంతో హిరమండలంలో ఇద్దరు యువకులు పుస్తెలతాడుకి తీసుకొని బైక్పై పరారయ్యారు. దీనిపై హిరమండలం పోలీసులు.. కొత్తూరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందివ్వడంతో పాటు సీసీ కెమెరా పుటేజ్లను పంపించారు. అప్రమత్తమైన ఎస్ఐ వై.రవికుమార్ తన సిబ్బందితో కొత్తూరులో అపరిచిత వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో హిరమండలం నుంచి వచ్చే వాహనాలను నిశితంగా పరిశీలించి, అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. ఇందులో భాగంగా బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపే ప్రయత్నం చేయగా.. వారు నిలుపుదల చేయకుండా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారిని పోలీసులు వెంబడించగా.. ఇరువురూ తలో దారిలో తప్పించుకున్నారు. ఇందులో ఒకరిని గ్రామంలోని రజక వీధి వద్ద మహిళలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో యువకుడు వీధిలో పరుగులు తీస్తూ అటుగా బైక్ మీద వెళ్తున్న ఏ.భగవాన్కు సాయం కోరాడు. అయితే యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వాహనదారుడు... అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు. దీనిపై ఇరువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివరాలను సేకరించారు. ఇద్దరు యువకులు ఒడిశాలోని ఖండవ గ్రామానికి చెందిన మీసాల అర్జున్, జొన్ని కొలియో అని ఎస్ఐ తెలిపారు. అయితే తాము కొత్తూరులో సినిమా చూసేందుకు వచ్చామని, పోలీసులు బైక్ను నిలుపుదల చేసే సరికి హెల్మెట్ లేకపోవడంతో భయంతో పరుగులు తీసామని తెలిపినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు బయటకు వెల్లడించని పోలీసులు.. యువకులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మెరుగు పేరిట బురిడీ హిరమండలం: బంగారానికి మెరుగు పెట్టిస్తామని మాయమాటలు చెప్పి ఓ మహిళా నుంచి రెండు తులాల బంగారు పుస్తెల తాడును తీసుకొని ఇద్దరు యువకులు ఉడాయించారు. మండలంలోని కైవాడ వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆ వీధిలో సోమవారం మధ్యాహ్నం సమయంలో పి.ఏకాసమ్మ అనే మహిళ ఒంటరిగా వద్దకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల.. బంగారానికి మెరుగు పెడతామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు మెడలో ఉన్న బంగారాన్ని వారికి అందించగా.. ఆమెను మాటల్లో పెట్టి, అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో ఏకాసమ్మ పోలీసులను ఆశ్రయించగా.. ఎస్ఐ కె.గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనిపై స్థానిన దుకాణంలో ఉన్న సీసీ పుటేజ్లో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. -
భార్యపై భర్త దాడి
శ్రీకాకుళం, పాతపట్నం: మండలంలోని పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి చంద్రశేఖర్ తన భార్య చిట్టమ్మపై దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ ఈ.చిన్నంనాయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చంద్రశేఖర్, చిట్టమ్మ గత 25 ఏళ్లుగా విడివిడిగా కాపురం ఉంటున్నారు. వీరి ముగ్గురి కుమారులకు వివాహాలు కాగా, గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇటీవల జ్వరం రావడంతో పెద్ద కుమారుడైన ఫాల్గునరావు వద్ద తన భర్త ఉండడంపై భార్య తరచూ తిడుతుండేది. దీంతో అసహనానికి లోనైన చంద్రశేఖర్.. సోమవారం ఉదయం చెరువుకి స్నానానికి వెళ్తున్న చిట్టమ్మను చెతికర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో బాధితురాలిని హుటాహుటిన పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు కె.మోహన్బాబు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. తన తల్లిపై తండ్రి దాడి చేశాడని రెండో కుమారుడు వనజానాథం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్తి తగాదాలా.. లేక వివాహేతర సంబంధాలా..
శ్రీకాకుళం రూరల్: మండలంలోని చాపురం పంచాయతీ పరిధి బొందిలిపురం విజయ్నగర్ కాలనీలో ఈ నెల 7న హత్యకు గురైన మెహర్ ఉన్నీషా, జురాబాయ్ల కేసు ఇంకా చిక్కుముడి వీడలేదు. వీరివురూ హత్యకు గురై ఐదు రోజులు కావస్తున్నా పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా నలుగురు డీఎస్పీలతోపాటు ఐదుగురు సీఐలు ఇతరత్రా సిబ్బంది వివిధ కోణాల్లో విచారణ చేపట్టినా కనీసం అనుమానితులను గుర్తించలేకపోయారు. పైగా జిల్లా చరిత్రలో ఇలాంటి హత్యలు ఇంతవరకూ జరగలేదు. దీంతో ఈ కేసు జిల్లా పోలీసులకు సవాల్గానే మారింది. ఎంతలోతుగా విశ్లేషణ చేసినప్పటికీ హంతకులు ఎవరన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. ఈ కేసులో హత్యలకు గురైన మెహర్ఉన్నీషా, జురాబాయ్ శరీరాలపై కనీసం వేలిముద్రలు పడకుండా హంతకుడు జాగ్రత్త పడటంతో పోలీసుల దర్యాప్తునకు సవాల్గా మారింది. ఈ హత్యలు జరిగిన రోజు ఇంట్లో కొన్ని నకిలీ నగలను (రోల్డ్గోల్ట్) మాత్రం పట్టుకెళ్లలేదని పోలీసుల విచారణలో తెలిసింది. దీన్నిబట్టి తెలిసిన వారే చేశారా? లేక ఎవరితోనైనా చేయించారా? అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న కొత్తకోణం ఈ హత్యలకు సంబంధించి కుటుంబ, ఆస్తు తగాదాలా.. లేక వివాహేతర సంబంధాలా.. అన్న కోణంలో పోలీసులు దృష్టిసారించారు. అయితే ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నదానిపై పోలీ సులు కూపీ లాగుతున్నారు. జిలానీ ఇంటికి రోజూ ఎవరెవరు వచ్చి వెళ్తున్నా రు, పాల వాడి దగ్గర నుంచి పేపరు బాయ్ వరకూ ప్రతీ కోణంలో ఆరా తీస్తున్నారు. గతంలో జిలానీకి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అన్న విషయాలపై తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఫోన్ కాల్స్పై దర్యాప్తు ముమ్మరం హతుల ఫోన్కాల్స్పై కూడా పోలీసులు తనదైన శైలిలో దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన ముందు ఎవరెవరితో మాట్లాడారన్న కోణంలో దర్యాప్తు చేస్తూ కాల్డేటా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరో రెండు, మూడు రోజుల్లో నిందితులు ఎవ్వరన్నది గుర్తించే అవకాశముందని సమాచారం. -
వీడని జంట హత్యల మిస్టరీ
శ్రీకాకుళం రూరల్: జిల్లాలో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్ల దారుణ హత్య ఘటనకు సంబంధించి మిస్టరీ ఇంకా వీడలేదు. దోషులను గుర్తించేందుకు పోలీసులు శుక్రవారం దర్యాప్తు ముమ్మరం చేశారు. అయినా ఎలాంటి స్పష్టత లభించలేదు. శ్రీకాకుళంలోని చాపురం పంచాయతీ బొందిలీపురం విజయ్నగర్ కాలనీలో గురువారం రాత్రి జోహాన్బాయ్, ఆమె కోడలు మెహర్ ఉన్నీషా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జంట హత్యలకు పాల్పడిన వారు కరుడు గట్టిన నేరగాళ్లా.. లేక కుటుంబ సభ్యులకు దగ్గర బంధువులా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాలను గురువారం రాత్రి అదే ఇంట్లో ఉంచేసి శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాకుళం డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం డివిజన్తో పాటు విజయనగరం పోలీసులు కూడా నగర పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు. ఏం జరిగిందో..? తల్లీ, భార్యను కోల్పోయిన జిలానీ.. నగర కేంద్రంలోని డేఅండ్ నైట్ జంక్షన్లో ప్రిన్స్ ఫుట్వేర్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈయనకు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో ఎటువంటి తగాదాలు లేవని సమాచారం. అలాంటప్పుడు అత్యంత దారుణంగా జంట హత్యలకు పాల్పడిన నేరగాళ్లు ఎవరన్నది పోలీసులకు సవాల్గా మారింది. ఓ వ్యక్తి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి జిలానీ పిల్లల కోసం క్యారేజ్ తీసుకెళ్లడం, అదే రోజు జిలానీ ఊర్లో లేకపోవడం, పిల్లలు వచ్చే సమయానికి డోర్ లాకవ్వడం, సాయంత్రానికి రెండు మృతదేహాలు రక్తపు మడుగుల్లో పడి ఉండటం మిస్టరీగా మారింది. ఈ కోణాల్లోనే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానాలెన్నో.. వాస్తవంగా దొంగతనానికి వచ్చిన వారు దొరికినంత దోచుకుపోతారు తప్ప హత్యలకు పా ల్పడిన దాఖలాలు జిల్లాలో అంతగా లేవు. హంతకుడు తలుపులు బార్లా విడిచిపెట్టి పారిపోతాడు తప్ప లోపల మృతదేహాలను ఉంచి తాళాలు వేసి పరారయ్యే అవరసరం ఏముందనేది ప్రశ్నగా మారింది. నేరగాళ్లు చేసిన పనికాదని, బాగా పరిచయస్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడితే కేకలు, అరుపులు వినిపించేవని, ఇక్కడ మాత్రం అటువంటిదేమీ జరగలేదని స్థానికులు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు డబ్బు, బంగారం దొంగిలించిన వ్యక్తులు అడ్డదారులనే ఆశ్రయిస్తారు. ఇక్కడ మాత్రం హత్య జరిగిన ప్రదేశం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారానే ద్వారకానగర్ వరకూ సుమారు రెండు కిలోమీటర్లు వెళ్లినట్లు డాగ్స్క్వాడ్ ద్వారా పోలీసులు గుర్తించారు. దొంగలు నిజంగానే చోరీకి వస్తే బీరువాలో దుస్తులు, ఇతరత్రా వస్తువులను చిందరవందరగా పడేస్తారు. ఇక్కడ మాత్రం దుస్తులన్నీ చక్కగా మడత పెట్టే ఉండటం, సోఫాసెట్పై సూట్కేసులు, ఇతర వస్తువులు యథాతథ స్థానంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అదుపులో నలుగురు అనుమానితులు? డాగ్ స్క్వాడ్ వెళ్లిన ఏరియాలో రెండు, హత్య జరిగిన ప్రాంతంలో రెండు సీసీ టీవీల ఫుటేజీలు పోలీసులు సేకరించారు. ఈ సంఘటనకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పక్కా స్కెచ్ ప్రకారమే.. దుండగుల దాడిలో గాయపడి వ్యక్తులు ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కనీసం గోడలకు కాసింత రక్తపు మరక కూడా అంట కుండా, మంచినీరు ట్యాప్ను విడిచిపెట్టి నీటిలో రక్తం కలిసిపోయేలా హంతకులు జాగ్రత్తపడ్డారు. హత్య ఆనవాళ్లు గుర్తుపట్టకుండా కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టంలో తేలిందిదీ.. హత్య చేసిన వ్యక్తి ముందుగా బ్యాట్తో ఇద్దరు మహిళల తలౖలపె బలంగా కొట్టడంతో ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయినట్లు పోస్టుమార్టంలో వెల్లడైనట్లు తెలిసింది. తర్వాత పదునైన చాకుతో మెడ, రెండు చేతులు, మణికట్టుపై విచక్షణ రహితంగా కోసేసిన ఆనవాళ్లు గుర్తించారని సమాచారం. సైకోలాంటి వ్యక్తులే ఇలాంటి దారుణాలకు ఒడిగడతారని పోలీసులు చెబుతున్నారు. -
అత్తాకోడళ్ల దారుణ హత్య.. చెల్లాచెదురుగా మృతదేహాలు
శ్రీకాకుళం పట్టణంలో ఘోరం జరిగింది. బొందిలీపురంలో అత్తా కోడళ్లు దారుణ హత్యకు గురయ్యారు. అంబేడ్కర్ జంక్షన్లో చెప్పుల దుకాణా న్ని నిర్వహిస్తున్న అబ్దుల్ ఖుదీష్ జిలానీ భార్య మెహర్ఉన్నీషా (37), తల్లి జోహాన్ బాయ్ అలియాస్ మెహర్(65)లు దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పో యారు. గురువారం సాయంత్రం జిలానీ పిల్లలిద్దరూ పాఠశాల నుంచి వచ్చి తలుపులు కొట్టే సరికి ఎంతకీ తీయకపోవడంతో విషయాన్ని తండ్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆయన వచ్చి చూడగా ఘోరం వెలుగు చూసింది. శ్రీకాకుళం/శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురంలో అత్తాకోడళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అంబేడ్కర్ జంక్షన్లో చెప్పుల దుకాణాన్ని నిర్వహిస్తున్న అబ్దుల్ ఖుదీష్ జిలానీ అనే వ్యక్తి చాపురం పంచాయతీ పరిధి బొందిలీపురంలో విజయ్నగర్ కాలనీలోని ఓ గ్రూపు హౌస్లోని మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రతిరోజు దుకాణానికి వెళ్లిపోగా కుమారులిద్దరూ ఉదయాన్నే స్కూల్కు వెళ్లిపోతారు. ఇంట్లో జిలాని భార్య మెహర్ఉన్నీషా(37), తల్లి జురాబాయ్(65)లు ఇంటిలోనే ఉంటారు. పిల్లలిద్దరూ ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5గంటలు కల్లా తిరిగి వచ్చేవారు. ప్రతీరోజులాగే గురువారం కూడా స్కూల్కి వెళ్లి తిరిగి వచ్చిన కుమారులు తలుపులు కొడుతుండగా ఎవ్వరూ తీయడం లేదు. ఈ విషయాన్ని తన తండ్రి జిలానీతో ఫోన్లో సంప్రదించగా ఎక్కడికో బయటకు వెళ్లి ఉంటారని కాసేపు ఆగమన్నాడు. తండ్రి సూచన మేరకు వారి చిన్నాన్న ఇంటికి వెళ్లి డూప్లికేట్ తాళాలు తీసుకొచ్చి తలుపులు తెరిచి చూడగా హాలులో రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో నగదు సుమారు రూ.4 లక్షలు, విలువైన బంగారం దోచుకెళ్లారని బాధితుడు జిలానీ పోలీసుల ముందు బోరునమన్నాడు. చెల్లాచెదురుగా మృతదేహాలు సంఘటన జరిగిన తీరు చూస్తే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. జిలానీ తన షాపుల నిమిత్తం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్షన్లకు గురువారం ఉదయం వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమకు తెలిసిన బంధువు ఇంటికి వచ్చి వెళ్లినట్లు పోలీసులు వద్ద ప్రాథమిక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సంఘటనా స్థలానికి రాత్రి పోలీసులు వచ్చి చూసేసరికి రెండు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో మోహర్ ఉన్నీషా మృతదేహం హాలులో పడి ఉండగా ఆమె తలపై బలమైన గాయంతో పాటు రెండు చేతుల మణికట్లుమీద కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక జూరాబాయ్ మృతదేహం వంటగదిలో పడి ఉంది. ఆమె తలకు, చేతులుపై బలమైన గాయాలున్నాయి. హాల్లో ఉన్న ఉన్నీషా మృతదేహం, వంటగదిలో పడి ఉన్న జోహనాబాయ్ మృతదేహం సంఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసు ఉన్నతాధికారులు పనసారెడ్డి, భీమారావుతో పాటు క్లూస్టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అంతా పరిశీలించారు. ఇంతలో డాగ్స్కాడ్ చేరుకొని ముందుగా మృతదేహాలు ఉన్న రూములను పది నిమిషాలు పరిశీలించాక మేడమీదకు వెళ్లిన డాగ్ అక్కడ నుంచి నేరుగా విజయ్నగర్ కాలనీ నుంచి ద్వారకానగర్ దగ్గర సుమారు రెండు కిలోమీటర్లు దూరం వరకూ పరుగులు తీసింది. చిందరవందరగా కాగితాలు, చెప్పులు ఇంటికి ప్రవేశించిన పోలీసులు మూడు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. హాలులో ఒక మృతదేహం, వంట గదిలో కూరగాయాలు మధ్యలో ఇంకొక మృతదేహం పడి ఉన్నట్టు గుర్తించారు. ఇదిఇలావుండగా షోఫాసెట్పై రెండు సూట్కేసులు తెరిచి వాటిలో ఉన్న కాగితాలు, విలువైన పత్రాలన్నీ చెల్లచెదురుగా పడి ఉన్నాయి. అదేవిధంగా ఇంటి మొత్తం కారం జల్లి, నీటితో కొన్ని గదులను కూడా శుభ్రం చేసిన ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జరిగిన సంఘటనను పరిశీలిస్తే మధ్యాహ్నం 2 గంటలు ప్రాంతంలో జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి 8గంటలు కల్లా తలుపులు తీయగా భయంకరమైన దుర్వాసన వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం బయటకు వచ్చి తాళాలు వేసి వెళ్లడంతో కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని, తెలిసినవారుగాని సంఘటనలో పాల్గొన్నారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కనిపించని సీసీ కెమెరాలు సంఘటన జరిగిన గ్రూప్ హౌస్కు ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పైన జరిగిన విషయాలు కింద ఫ్లోర్ వారికి కనీసం తెలియని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం పరిధిలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. స్థానికంగా ఉన్నవారంతా ఈ సంఘటనను చూసేందుకు తండోప తండాలుగా వస్తున్నారు. కరుడుగట్టిన నేరస్థుల పనిలాసంఘటనా స్థలం హత్యలకు పాల్పడింది కరుడుగట్టిన నేరస్తులేనా అన్న అనుమానాలను సంఘటనా స్థలం కలిగిస్తోంది. మృతదేహాల చుట్టూ కారం జల్లి ఉండడం చూస్తే డాగ్ స్క్వాడ్కు దొరకకుండా ఉండేందుకే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలం నుంచి వెనుక ఉన్న రోడ్డు మీదుగా తిలక్ నగర్ వరకు వెళ్లి అక్కడి నుంచి బొందిలీపురం స్కూల్ వరకు వెళ్లింది. అక్కడి నుంచి రెండువైపులా డాగ్ వెళ్లడంతో అక్కడినుంచి హత్యచేసినవారు రెండుగా విడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా బొందిలీపురం వైపు డాగ్ కొంతదూరం వచ్చి మళ్లీ వెనుదిరిగి వెళ్లిపోయింది. అక్కడకు సమీపంలో సీసీ కెమెరాలు ఉండడంతో వీటిని గమనించి హత్య చేసినవారు వెనక్కు వెళ్లిపోయి ఉండవచ్చని పోలీసులు సందేహిస్తున్నారు. ఇటువంటి వాటిని పరిశీలిస్తే కరుడుగట్టిన వారే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇంటిలో ఉన్న రూ. 4లక్షల నగదు, బంగారం పోయిందని జిలాని పోలీసులకు తెలిపారు. అయితే హత్య చేసిన అనంతరం బయటకు వచ్చి తాళాలు వేసి వెళ్లడంతో కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని, తెలిసినవారుగాని సంఘటనలో పాల్గొన్నారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ఇంటి ముందు ఓ క్రికెట్ బ్యాట్ పడి ఉండగా దానికి కూడా రక్తం ఉండడంతో దాంతో మోది హత్యచేసి ఉండవచ్చని భావిస్తున్నారు. రోదిస్తున్న పిల్లలు మృతురాలి పిల్లలు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. మున్నీషా పెద్ద కుమారుడు జాఫర్ ఆర్సీఎం పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, చిన్న కుమారుడు బిషాన్ ఏడో తరగతి చదువుతున్నాడు. ముందుగా వీరిద్దరే ఇంటిలోకి ప్రవేశించి రక్తం మడుగులో పడి ఉన్న తల్లి, నాన్నమ్మ మృతదేహాలను చూడడంతో ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఇన్చార్జి ఎస్పీ ఇన్చార్జి ఎస్పీ టి.పనసారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దర్యాప్తు చేపట్టాల్సిన తీరుపై డీఎస్పీ, సీఐలకు సూచనలు ఇచ్చారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కిల్లారి లక్ష్మి(24) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. లావేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం గ్రామానికి చెందిన ఉంగరాడ లక్ష్మునాయుడు కుమార్తె లక్ష్మిని అదే గ్రామానికి చెందిన కిల్లారి వెంకటికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటున్నారు. ఈ నెల 1న లక్ష్మి ఉపాధి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆరు గంటల సమయంలో ఆవుకు దాణా పెట్టడం కోసమని లక్ష్మిని తండ్రి పిలవగా ఇంటి నుంచి ఎంతకూ రాలేదు. దీంతో లోపలికి వెళ్లి చూడగా కుమార్తె సోఫాలో పడిపోయి నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే గ్రామస్తులకు విషయం తెలియజేసి లక్ష్మిని ఆటోలో లావేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న లావేరు తహసీల్దార్ ఎస్.సుధాసాగర్, ఎస్ఐ చిరంజీవిలు శనివారం రిమ్స్కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. లక్ష్మి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను, భర్తను అడిగితెలుసుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. లావేరు ఎస్ఐ కేసు నమోదు చేశారు.లక్ష్మీ మృతి వెనుక కారణాలు తెలియరావడం లేదు. ఆత్మహత్య చేసుకుందా లేదా పాముకాటుకు గురైందా అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవని మృతురాలి తండ్రి లక్ష్మునాయుడు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
యువతి ఆత్మహత్య
శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి గ్రామానికి చెందిన లంక సంతోషి(18) అనే యువతి కడుపు నొప్పి భరించలేక పురుగులు మందు తాగి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడిందని జె.ఆర్.పురం ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు. యువతి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించిందని ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి తండ్రి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
యువకుడు ఆత్మహత్య
శ్రీకాకుళం, జి.సిగడాం: మండలంలోని నాగులవలస గ్రామానికి చెందిన రాయపురెడ్డి సాయి అవినాష్(18) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన సాయి అవినాష్ సోమవారం రాత్రి ఇంటికి చేరాడు. ఎప్పట్లాగే తమ్ముడితో కలిసి నిద్రపోయాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో ఫ్యాన్కు పంచె కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయి అవినాష్ తండ్రి ముకుందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జనార్దనరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. -
బావను సాగనంపేందుకు వెళుతూ...
తన చిన్న తనంలోనే తండ్రి తనువు చాలించాడు. తనతో పాటు సోదరి, సోదరుడి భారమంతా తల్లిపై పడింది. కడు పేదరికం, అందులో కట్టుకున్నవాడు అర్ధంతరంగా కన్నుమూసినా మొక్కవోని ధైర్యంతో ఆ తల్లి ఉన్నంతలో కుటుంబాన్ని మోసుకొస్తుంది. తల్లి కష్టాలను చూడలేక మగ పిల్లలిద్దరూ పేపర్బాయ్లుగా పని చేస్తూ, చదువుకోవడం ఆరంభించారు. ఈ సమయంలో సోదరి భర్తను సాగనంపేందుకు వెళుతున్న చిన్న కుమారుడిని లారీ రూపంలో మృత్యువు కబలించింది. తల్లితో పాటు సోదరి, సోదరుడిని కన్నీటి సంద్రంలో ముంచేసింది. శ్రీకాకుళం, మందస: నర్సింగ మహరణ, శోభావతి మహరణ దంపతులు వలస వచ్చి మందస పట్టణంలోని ఆర్టిజన్కాలనీలో జీవనం సాగిస్తున్నారు. వీరికి సోమేశ్వరరావు మహరణ, రంజిత్కుమార్ మహరణ, మాధురి మహరణ అనే పిల్లలు కలిగారు. వీరంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే నర్సింగ మహరణ హటాత్తుగా మరణించాడు. దీంతో పిల్లల భారం తల్లిపై పడింది. అప్పటికే ఎన్నో కష్టాల్లో ఉన్న శోభావతి ఎంతో భారంగా పిల్లలను పెంచిపోషిస్తోంది. అయితే, తల్లి కష్టాలను చూడలేక మగ పిల్లలిద్దరూ పేపర్బాయ్లుగా పని చేస్తూ, చదువుకోవడం ఆరంభించారు. చిన్నవాడైన రంజిత్కుమార్ ‘సాక్షి’ పేపర్బాయ్గా పనిచేస్తూ, మందస బస్టాండ్లోని పలు షాపుల్లో పనిచేస్తూ, కాశీబుగ్గలోని ఎస్బీఎస్వైఎం కళాశాలల్లో డిగ్రీ ద్వితీయ సంవత్సరం హెచ్ఈపీ చదువుతున్నాడు. సోదరి పెళ్లీడుకు రావడంతో సోదరులిద్దరూ ఎంతో కష్టపడి పెళ్లి చేసి, తండ్రిలేని లోటును తీర్చారు. ఈ తరుణంలో ఒడిశాకు చెందిన సోదరి భర్త నరేంద్ర మహరణను సాగనంపడానికి సోమవారం ద్విచక్రవాహనంపై ఒడిశా వెళ్తుండగా ఇచ్ఛాపురం మండలం, బలరాంపురం గ్రామం సమీపంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రిప్పర్ హటాత్తుగా పక్కకు తిప్పడంతో నరేంద్ర, రంజిత్లిద్దరూ ట్రిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రంజిత్కుమార్ అక్కడికక్కడే మరణించగా, నరేంద్ర తీవ్ర గాయాలకు గురికాగా, నడుము విరిగిపోయింది. ప్రస్తుత కాలంలో కాలేజిలో చదువుకునే విద్యార్థులు తమ సొంత పనులు చేసుకోవడానికే సిగ్గు పడుతున్న తరుణంలో కుటుంబం కష్టాలు... తాను చదువుకోవడానికి రాత్రనక, పగలన కష్టపడుతున్న రంజిత్కుమార్ హఠాన్మరణం అందర్నీ కలచివేసింది. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసే రంజిత్ మరణించాడా... అంటూ ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యాంతమవుతున్నారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రకు స్పృహ రావడంతో రంజిత్ ఎక్కడున్నాడని ప్రశ్నిస్తుండగా, ఆయనికి ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చిన్న వయస్సులోనే కుటుంబానికి ఆధారంగా మారిన రంజిత్ మరణంతో తల్లి శోభావతి, సోదరుడు సోమేశ్వరరావు, సోదరి మాధురిలు రోదిస్తున్నారు. వారిని ఆపడం ఎవరి తరమూకాలేదు. సోమవారం సాయంత్రం రంజిత్ మృతదేహాన్ని మందస తీసుకువచ్చి బంధువులు, స్నేహితులు, స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, రంజిత్ ఇటీవల జాబ్మేళాలో కాంట్రాక్ట్ పద్ధతిలో రైల్వేశాఖలో పని చేయడానికి ఎంపికయ్యాడు. రూ.15 వేలు జీతంపై విశాఖలో ఉద్యోగం చేసేందుకు బుధవారం వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో విధి వక్రీకరించి అందని లోకాలకు వెళ్లిపోయాడు. సంఘటన జరిగిన తీరు ఇది శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: రాంగ్ రూట్లో వస్తున్న ట్రిప్పర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఒడిశా రాష్ట్రం బరంపురంనకు చెందిన నరేంద్ర మహరణ సంక్రాంతి పండగ సందర్భంగా ఇటీవల భార్య మాధురితో కలిసి మందసలోని అత్తవారింటికి వెళ్లాడు. సంక్రాంతికి అక్కడే గడిపి సోమవారం బావమర్థి రంజిత్ కుమార్ మహరణ(18)తో కలిసి ద్విచక్రవాహనంపై స్వగ్రామం బరంపురంనకు బయల్దేరాడు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఇచ్ఛాపురం మండలం దరి) బలరాంపురం వద్ద ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేందుకు డ్రైవింగ్ చేస్తున్న నరేంద్ర మహారణ కుడివైపునకు తన ద్విచక్రవాహనం తిప్పాడు. అయితే అప్పటికే రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు కనస్ట్రక్షన్కు చెందిన ట్రిప్పర్ అదే సమయంలో అదే పెట్రోల్ బంకువైపు తిరగడంతో ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నరేంద్ర హల్మెంట్ ధరించడంతో గాయాలుపాలవ్వగా, వెనుక కూర్చున్న బావమర్థి రంజిత్ ఎగిరి కింద పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రంజిత్ కుమార్ మృతి చెందాడు. గాయాలపాలైన నరేంద్రను మెరుగైన చికిత్స కోసం బరంపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పలాసలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు అతడి సోదరుడు సోమేష్ తెలిపాడు. భర్త మృతి చెందడంతో ఇద్దరు కుమారులే దిక్కుగా బతుకుతుండగా చిన్న కుమారుడు తనకు గర్భశోకాన్ని మిగిల్చాడని తల్లి శోభావతి ఆసుపత్రి వద్ద విలపించింది. ఇదిలావుండగా ట్రిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం డ్రైవర్ జరడా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. జరడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండగ పూట విషాదం
శ్రీకాకుళం, రణస్థలం: అందరూ పండగ ఆనందంలో ఉండగా ఆ కుటుంబాలు మాత్రం విషాదంలో మునిగిపోయాయి. జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు మృత్యువాతపడటంతో బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రణస్థలం మండలంలోని దేరసాం గ్రామానికి చెందిన పిల్లా రామకృష్ణ (45) సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ వెంకటరావుపేట సమీపంలో తోటపల్లి కాలువ వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డాడు. ఈ ఘటనలో బలమైన గాయాలు తగలడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాలువ పనుల్లో భాగంగా తవ్విన గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో గతుకుల్లో అదుపుతప్పి బైకు బోల్తాపడినట్లు స్థానికులు చెబుతున్నారు. రామకృష్ణకు భార్య నారాయణమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తపురం పాత చెక్పోస్టు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని గోపాలపురం వద్ద దురా గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ కొయిరెడ్ల ధర్మరాజు(30) బరంపురం నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తుండగా పురుషోత్తపురం పాత చెక్పోస్టు సమీపంలో అదే మార్గంలో బ్యాక్ చేస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధర్మరాజును హైవే అంబులెన్స్లో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో బరంపురం పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ధర్మరాజు సోదరుడు కొయిరెడ్ల లింగరాజు రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ హెచ్సీ వాసుదేవరావు కేసు నమోదు చేశారు. పురుగు మందు తాగి వ్యక్తి అత్మహత్య రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీ లోవ గ్రామానికి చెందిన కె.జగన్నాథరాజు(40) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. జగన్నాథరాజు భార్య లక్ష్మీ, జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథరాజు కడుపు నొప్పి భరించలేక ఇంటి సమీపంలోనే పురుగుల మందు తాగాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడ్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున జగన్నాథరాజు మరణించాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై బి.అశోక్బాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి పోలాకి: మండలంలోని డీఎల్పురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బమ్మిడి దానయ్య(32) సోమవారం ఉదయం విశాఖలోని కేజీహెచ్లో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెలమర పంచాయతీ పాలవలస గ్రామానికి చెందిన దానయ్య కొంతకాలంగా డీఎల్పురం సమీపంలోని రొయ్యిలచెరువుల్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి చెరువుల వద్దకు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సోమవారం సాయంత్రం మృతుని కుటుంబ సభ్యులు పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువుల యజమాని బాధితులకు అందుబాటులో లేనట్లు సమాచారం. -
నన్ను అనుమానించావు.. ఇక సెలవు
శ్రీకాకుళం, పొందూరు: మండలంలోని తండ్యాం పంచాయతీ శ్రీరామ్నగర్ కాలనీలో వివాహిత మృతి కలకలం రేపింది. మేదరమెట్ల సంధ్య(28) మృతి ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. ఆమె మరణించిన తీరు మండల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. సంధ్యది ఆత్మహత్యేనని పోలీసులు అంటున్నారు. కాదు అది హత్యేనని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో ఇది హత్యా..? ఆత్మహత్య..? అనే అనుమానం ప్రతి ఒక్కరిలో నెలకొంది. వివరాల్లోకి వెలితే... తండ్యాం పంచాయతీలోని శ్రీరామ్నగర్ కాలనీలో మేదరమెట్ల వెంకటరమణ, సంధ్య నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం వీరికి ప్రేమ వివాహమైంది. వీరికి పాప లహరి పుట్టి ఏడాది గడచింది. ఏం జరిగిందో ఏమో గాని ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా మృతిచెందింది. గురువారం ఉదయమే సంధ్య మరణవార్త ఆమె సోదరుడు శ్రీనివాసరావుకు ఫోన్లో తెలిపారు. దీంతో అతడు సంధ్య ఇంటికి వెళ్లి చూసేసరికి మరణించి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ భాదుషా వెళ్లి మృతురాలిని చూసి ఎస్ఐ బాలరాజుకు సమాచారం అందించారు. ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి సీఐ వై.రామకృష్ణ, డీఎస్పీ భీమారావుకు తెలియజేశారు. వారు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి వివరాలను సేకరించింది. మృతురాలు సంధ్య ఉరి వేసుకొన్నట్టు ఉరికి ఉపయోగించిన వస్త్రాలను భర్త వెంకటరమణ డీఎస్పీ, సీఐలకు అందించారు. రాత్రి పడుకొనేటప్పుడు ఎటువంటి గొడవ జరగలేదని, తాను గురువారం ఉదయం నిద్రలేచేసరికి తన భార్య ఉరివేసుకొన్నట్టు గమనించి వస్త్రాన్ని కోసానని కింద పడిపోవటంతో అందరికి ఫోన్లు చేశానని వెంకటరమణ తెలిపాడు. పోలీసు అధికారులు ఇంటిని పరిశీలించగా మృతురాలు రాసిన లేఖ లభ్యమైందని చెప్పారు. ఈ లేఖలో తన భర్త ఇబ్బందులు పెడుతూ అనుమానిస్తుండటంతో ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఉందని తెలిపారు. దీంతో ఇది ఆత్మహత్యగా ధృవీకరించామని చెప్పారు. కాగా, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఆర్ఐ ఈశ్వరరావు, వీఆర్ఓలు అంకమ్మ, అసిరయ్య, సీతయ్యల సమక్షంలో పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. సంఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న క్లూస్టీం అయ్యో పాపం చిన్నారి తల్లి మృతి చెందడంతో ఏడాది చిన్నారి లహరిని చూసి గ్రామస్తులు అయ్యో పాపం అని చలించిపోయారు. క్షణం కూడా తల్లిని విడిచి ఉండలేని పాప ఏడుస్తుంటే అందరూ చూసి కంటతడి పెట్టుకొన్నారు. పాప బంధువులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేయడమే తప్ప పాపను ఓదార్చడంలో విఫలమయ్యారు. ఇది హత్యే... తమ కుమార్తె సంధ్యది హత్యేనని ఆమె తల్లిదండ్రులు కాళ్ల వరలక్ష్మి, శంకరరావు తెలిపారు. నిత్యం తాగడం తన కుమార్తెను హింసించడం, కొట్టడం వంటివి అల్లుడు చేసేవాడని అంటున్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని చెబుతున్నారు. కచ్చితంగా తమ కుమార్తెను అల్లుడు హత్య చేశాడని అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేదని, రెండు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. అల్లుడే హత్య చేశాడని చెబుతున్నారు. సంఘటనా స్థలంలో పరిశీలన బట్టి ఆత్మహత్యే... సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మీదట ఇది ఆత్మహత్యగా నిర్ధారిస్తున్నాం. ఆమె రాసిన లేఖ ఆధారంగా ఆత్మహత్యగా అనుమానించి కేసును దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భీమారావు తెలిపారు. -
బాలిక హత్య?.. ప్రేమికుడిపై అనుమానం..
శ్రీకాకుళం, లక్కవరపుకోట: పోలీస్ స్టేషన్కు కూత వేటలోనే దారుణం జరిగింది. రంగరాయపురం గ్రామానికి చెందిన పిల్లా శ్యామల (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గడిచిన రెండు నెలల్లో నియోజకవర్గ పరిధిలో ఇద్దరు బాలికలు హత్యకు గురికాగా... మరో ఇద్దరు బాలికలు శారీరక హింసకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. విజయగనగరం డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్.కోట సీఐ బి. వెంకటరావు, మృతురాలి బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగరాయపురం గ్రామానికి చెందిన పిల్లా శ్యామల ఎస్.కోట పట్టణంలో గల పుణ్యగిరి ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతోంది. నిత్యం బస్సులో కళాశాలకు వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కళాశాలకు వెళ్లిన శ్యామల ఇంటికి చేరుకోలేదు. కొత్తూరులో ఉన్న పెద్దమ్మ దగ్గరకు శ్యామల వెళ్లి ఉంటుందని తల్లి వరలక్ష్మి భావించింది. కాగా బుధవారం ఉదయం ఎల్.కోట పోలీస్స్టేషన్ వెనుకగల శ్మశానంలో బోర్లా పడి ఉన్న శ్యామలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించగా శ్యామల అప్పటికే మృతి చెందింది. మృతదేహం పక్కనే సగం కాలి ఉన్న వాటర్బాటల్లో పెట్రోల్ ఉంది. అలాగే శ్యామల కాలేజ్ బ్యాగ్ పాక్షికంగా కాలిపోయి ఉంది. దీంతో విజయగనరం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి సంఘటనా స్థలలో వివరాలు సేకరించారు. మృతురాలు వీపుపై కాలిన గాయలు, గోళ్లతో రక్కినట్లు ఆనవాలు న్నాయి. మృతురాలి తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా తల్లి వరలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిలను (దేవి, శ్యామల) పెంచుకుంటూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్న కుమార్తె చనిపోవడంతో గుండలవిసేలా రోదిస్తున్న వరలక్ష్మిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. రాముపై అనుమనాలు ఇదిలా ఉంటే ఎల్.కోట గ్రామానికి చెందిన మజ్జి రాము అనే యువకుడు తన కుమార్తెను హత్య చేసి ఉండవచ్చని మృతురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. గతంలో రాము పలుమార్లు శ్యామల వెంటపడేవాడని... రెండు,మూడు పర్యాయాలు మందలించినట్లు మృతురాలు బంధువులు తెలి పారు. డాగ్ స్క్వాడ్ కూడా అనుమానితుడు ఇంటి పరిసరాలకు వెళ్లి ఆగడంతో రాముపై అనుమానాలెక్కువయ్యాయి. విచారణ వేగవంతం చేసి త్వరలోనే నిందితుడ్ని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ, సీతో పాటు ఎల్.కోట ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రత్యక్షం.. శ్యామల మృతికి సంబంధించిన కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మజ్జి రాము కాలిన గాయాలతో విజయనగరం కేంద్రాస్పత్రిలో ప్రత్యక్షమయ్యాడు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఉన్న రాముని తల్లి సీత, తమ్ముడు విజయ్కుమార్ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారుజూము ఇంటి వద్ద చలి మంట వేసుకున్నామని.. ప్రమాదవశాత్తూ రాము మంటలో పడిపోయాని తల్లి తెలిపింది. కఠినంగా శిక్షించాలి బాలిక అనుమానాస్పద మృతి విషయం తెలుసుకున్న ఎల్.కోట, రంగరాయపురం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్ నెలలో ఎస్.కోట మండలం బొడ్డవర వద్ద చిన్నారిపై అగంతకుడు హత్యాయత్నం.. డిసెంబర్ నెలలో ఎల్.కోట మండలం గంగుబూడి గ్రామం వద్ద డిగ్రీ చదువుతున్న బాలిక మృతి... వేపాడ మండలంలో ఒక బాలికపై హత్యాయత్నం... ప్రస్తుతం శ్యామల హత్యకు గురికావడంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
సీసీ కెమెరాలు అమర్చేందుకు వచ్చి..
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి మెళియాపుట్టి రహదారి సమీపంలో బొంగపోలమ్మ మోడరన్ రైస్ మిల్లులో గురువారం విద్యుదాఘాతానికి గురై గుమ్మడి అశోక్(36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, మృతుడి తమ్ముడు ప్రశాంత్ తెలిపిన వివరాలు ప్రకారం... ఈ రైస్ మిల్లులో కొద్దిరోజుల క్రితం ధాన్యం బస్తాలు దొంగతనం జరిగింది. మరోసారి దొంగతనం జరగకుండా ఉండేందుకై మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం కాశీనగర్ సమీపంలోని బొత్తవ గ్రామానికి చెందిన గుమ్మడి అశోక్, అతని సోదరుడు ప్రశాంత్లు మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికై వచ్చారు. దీనిలో భాగంగా గురువారం మిల్లు పైకి ఎక్కి సీసీ కెమెరా వైర్లు బిగిస్తుండగా పక్కనుంచి వెళుతున్న 33 కేవీ విద్యుత్ తీగ అశోక్కు తగలటంతో ఒక్కసారిగా తుల్లిపోయాడు. సమీపంలోని గోడపై పడటంతో తలకు తీవ్రగాయం కాగా తన శరీరం కాలిపోయింది. అశోక్ను బతికించేందుకు తమ్ముడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అప్పటికే తన సోదరుడు మృతిచెందాడు. వెంటనే స్పందించిన మిల్లు సిబ్బంది మిల్లుపైకి వెళ్లి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. మృతుడికి షాక్ తగలగానే సమీపంలోని గోడపై పడడంతో తలకు తీవ్ర గాయమై, అధిక రక్తశ్రావం జరిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి చలించిపోయి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య గౌరి, రెండేళ్ల కుమారుడు సాత్విక్ ఉన్నారు. అశోక్ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఏ కష్టమొచ్చిందో..!
శ్రీకాకుళం ,కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న కాశీబుగ్గ ఎల్సీ గేటు ఫ్లై ఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడి తల.. మొండెం నుంచి వేరుపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందస మండలం బొగాబంద గ్రామానికి చెందిన బొంసుగంటి దండాసి, వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు నరసింహారావు(23) విదేశాలలో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నెల రోజుల కిందటే స్వగ్రామం వచ్చాడు. రెండో కుమారుడు రాంబాబు కాశీబుగ్గ ఐటీఐలో చదువుతుండగా, చిన్నకుమారుడు చైతన్య గొప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తండ్రి కిరణా షాపు నిర్వహిస్తున్నారు. విశాఖ వెళ్తానని చెప్పి.. నరసింహారావు బుధవారం ఉదయాన్నే రెండు రొట్టెలు తిని తండ్రి వద్దకు వెళ్లాడు. విశాఖపట్నం వెళ్తానంటూ రూ.2 వేలు తీసుకుని పలాస రైల్వేస్టేషన్కు వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో కానీ మధ్యాహ్నం 2.45 గంటలకు పలాస నుంచి విశాఖపట్నం వెళ్తున్న వాస్కోడిగామా రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మొండెం నుంచి తల వేరుపడింది. కాళ్లు పక్క ట్రాకుపైకి వెళ్లడం, అదే లైనులో గూడ్స్ రైలు రావడంతో స్థానికులు కేకలు పెట్టారు. వెంటనే జీఆర్పీ పోలీసులు వచ్చి రైలును నిలిపివేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి.. కుమారుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న దండాసి, కుటుంబ సభ్యులు హుటాహుటిన రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైలుపట్టాలపై విగతజీవిగా పడి ఉన్న నరసింహారావును చూసి బోరున విలపించారు. ఎవరి మీదో కోపం పెట్టుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చావా.. అంటూ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
బడికి వెళ్తూ మృత్యుఒడిలోకి..
శ్రీకాకుళం, పాతపట్నం: మరి కొద్దిసేపట్లో పాఠశాలకు వెళ్లాల్సిన ఆ ప్రధానోపాధ్యాయుడిని విద్యుత్ స్తంభం రూపంలో మృత్యువు వెంటాడింది. పెథాయ్ తుఫాన్ గాలుల కారణంగా రోడ్డుకు అడ్డంగా నేలవాలిన స్తంభాన్ని గమనించక బైకుతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ఉమామహల్ వెనుకన ఉపాధ్యాయుల కాలనీలో నివాసముంటున్న పాగోటి ధర్మారావు(56) మెళియాపుట్టి మండలం ఆంపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం 8 గం టలకు భార్య పార్వతికి చెప్పి పాఠశాలకు బైకుపై బయలుదేరారు. కొండల ప్రాంతంలో ఉండే ఆంపురం పాఠశాలకు సిగ్నల్ సమస్య ఉండటం తో ప్రతిరోజూ అదే దారిలో ఉన్న బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్ వేసుకుని వెళ్తుంటారు. మంగళవారం కూడా అదే మాదిరిగా బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్ హాజరు వేసుకుని బైకుపై ఆంపురం పాఠశాలకు బయలుదేరారు. సోమవారం కురిసిన వర్షం, ఈదురుగాలుల ధాటికి ఆంపురం–తెంబూరు రోడ్డులోని జామిచిన్నయ్యపేట వద్ద విద్యుత్ స్తంభం వాలిపోయి రోడ్డుకు నాలుగున్నర అడుగు ఎత్తులో ఉండిపోయింది. మంగళవారం ఉదయం కూడా వర్షం కురవడంతో ధర్మారావు రైన్ కోటు వేసుకుని బైకుపై వెళ్తుండగా విద్యుత్ స్తంభాన్ని గమనించక ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందే విద్యుత్ సిబ్బంది ఈ స్తంభాన్ని పరిశీలించి టిఫిన్ కోసం తెంబూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమా దం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ బి.ఎస్.ఎస్.ప్రకాష్, ఎస్ ఐ ఈ.చిన్నంనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, శవపంచనా మా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల కు అందజేశారు. ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ధర్మారావు స్వగ్రామం పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ కాశీపురం. మూడేళ్లుగా ఆంపురం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. మెళియాపుట్టి పీఆర్టీయూ మం డలశాఖ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. కుమారుడు ఇంద్రసేనాకుమార్ అవనిగెడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నాడు. కుమార్తె విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ధర్మారావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలి పారు. విషయం తెలుసుకున్న పాతపట్నం, మెళి యాపుట్టి మండల ఎంఈఓలు బి.సింహాచలం, ఎస్.దేవేంద్రరావు, పాతపట్నం పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు ఎ.జనార్దనరావు, అంబేడ్కర్ మండల యువజన సంఘం అధ్యక్షుడు సుదర్శన్, పలువురు ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకున్నారు. పీఆర్టీయూ నాయకుల సంతాపం శ్రీకాకుళం: మెళియాపుట్టి మండలంలో ఎల్ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాగోటి ధర్మారావు మంగళవారం జరిగిన ప్రమాదంలో మరణించడంతో పీఆర్టీయూ నాయకులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్మారావు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు భైరి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు పప్పల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, గౌరవాధ్యక్షుడు వి.హరిశ్చంద్రుడు, అసోసియేట్ అధ్యక్షుడు వైబీఎస్ ప్రసాదరావు, పత్రికా సంపాదక వర్గ సభ్యులు జి.యోగానంద్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలివాడ ధనుంజయరావు, బొంగు సత్యనారాయణ, ఎస్.ప్రసాదరావు, ఇ.గణపతి, జె.భరత్చరణ్ తదితరులు ఉన్నారు. -
శోకసంద్రం
శ్రీకాకుళం ,గార: విహారం విషాదం మిగిల్చింది. పిక్నిక్లో తోటి స్నేహితులతో కలిసి సందడిగా గడిపిన ఇద్దరు యువకులు అందరూ చూస్తుండగానే సముద్రంలో గల్లంతయ్యారు. స్థానికులు ఎంతగా గాలించినా గల్లంతైన వారి జాడ తెలియకపోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ విషాద ఘటన కళింగపట్నం బీచ్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరంలోని బరాటం వీధికి చెందిన బరాటం వెంకటరమణ కుమారుడు సాయి (20) స్థానిక పెద్దమార్కెట్లో తోపుడు బండిపై పండ్లు అమ్ముతుండేవాడు. పిక్నిక్ జరుపుకొనేందుకు పది మంది స్నేహితులతో కలిసి ఆదివారం కళింగపట్నం బీచ్కు వచ్చాడు. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి భోజనం చేసి సాయంత్రం సముద్రంలో స్నానానికి దిగాడు. అందరూ సందడి చేస్తున్న సమయంలో సాయి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. స్థానిక యువకులు ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు సముద్రంలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. సాయి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఇదే బీచ్లో విజయనగరం జిల్లా రామభద్రపురం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు (17) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి కూడా ఆదివారం సాయంత్రం గల్లంతయ్యాడు. సుమారు 30 మంది స్నేహితులతో కలిసి బీచ్కు పిక్నిక్ కోసం వచ్చాడు. అందరూ కలిసి సాయంత్రం సముద్ర స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. మృతుడి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి సత్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తలే రామారావు తెలిపారు. -
ఫేస్బుక్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని..
శ్రీకాకుళం అర్బన్, కాశీబుగ్గ: ఫేస్ బుక్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పలాస మండలంలో చోటుచేసుకుంది. శాసనాం గ్రామానికి చెందిన సీరపు రాఖేష్ (27) సోమవారం సాయంత్రం తన ఇంట్లోని బాత్రూంలో పినాయిల్ తాగి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు అతన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గకు చెందిన టి.శ్రీను, ఐ.సందీప్లకు రాఖేష్తో విభేదాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి కూడా పలాసలోని ఓ డాబా వద్ద వీరు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు రాఖేష్ రౌడీ అంటూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో చచ్చిపోవాలని భావించాడు. తన చావుకు టి.శ్రీను, ఐ.సందీప్లు కారణం మంటూ రాఖేష్ కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. అనంతరం ఇంట్లోనే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చూసి వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రి వైద్యులు రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం రాఖేష్ను పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాశీబుగ్గ ఎస్సై ఎంవీఎస్ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న రాఖేష్ను పలాస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. కాగా ఆత్మహత్యకు పాల్పడిన రాఖేష్ను ప్రత్యర్థివర్గంలోని ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో బెదిరించినట్లు తెలిసింది. ఓ ప్రైవేటు టీవీ చానల్లో స్టాఫ్ రిపోర్టర్గా పని చేస్తున్నానని, పోలీసులతో చెప్పి రౌడీషీట్ తెరిపిస్తానని బెదిరించినట్టు తెలిసింది. అలాగే తమ పార్టీ అండదండలు ఉన్నాయని కూడా బెదిరించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన రాఖేష్ చనిపోవాలని భావించి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. -
ఆశల దీపం ఆరిపోయింది
తాము పడుతున్న కష్టాలను కుమారుడు పడకూడదని భావించి రెక్కలుముక్కలు చేసుకుని చదివిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరకు పుత్రశోకమే మిగిలింది. ఆదుకుంటాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదం రూపంలో మృతిచెందాడనే పిడుగులాంటి వార్త వినాల్సి రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన పాలకొండ మండలం నవగాం చెరువు మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం, పాలకొండ/కొత్తూరు: కొత్తూరు మండలం కుంటిబద్ర కాలనీకి చెందిన కానుగ జగన్నాథం, యశోద దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో సంతానమైన కానుగ చంటి(17) చదువులో చురుకైన వాడు కావడంతో పాలకొండలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియెట్ బైపీసీ సెకెండియర్ చదివిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకపోవడం, పిల్లలను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలనే కోరికతో తల్లిదండ్రులిద్దరూ కూలీలుగా మారి చెన్నై వలస వెళ్లారు. తీరని విషాదం.. చంటి తన తల్లిదండ్రులతో దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. కష్టసుఖాలు తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల తన తల్లికి ఫోన్ చేసి సంక్రాంతికి తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలని కోరాడు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో పాలకొండ మండలంలోని పొట్లి గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. నవగాం చెరువు వద్దకు వచ్చేసరికి ఆటో బోల్తాపడి పొలాల్లోకి పడిపోయింది. ఈ ఘటనలో చంటి రోడ్డుపైకి తుల్లిపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఇదే ఆటోలో ప్రయాణిస్తున్న ఎం.సింగుపురం గ్రామానికి చెందిన కె.నారాయణమ్మ(65), పొట్లి గ్రామానికి చెందిన ఎం.మురళీకృష్ణలకు తీవ్ర గాయాలయ్యయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం రాజాం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చంటి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. కుమారుడి మరణ వార్త విని చంటి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వస్తున్నారు. సంక్రాంతి పండగకి రావాలని కోరిన కుమారుడు తమని ఇలా రప్పిస్తున్నాడంటూ కన్నీమున్నీరుగా రోదిస్తున్నారు. -
మృత్యువు అంచుల దాకా వెళ్లి..
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ఏ కష్టం వచ్చిందో గానీ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా రైలు పట్టాలపై పడుకున్నాడు. సరిగ్గా రైలు వచ్చిన సమయంలో భయం వేయడంతో మధ్యలో లేచే ప్రయత్నం చేశాడు. రైలు కిందిభాగం తగలగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పలాస రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సోంపేట మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన సింహాచలం పాత్రో(62) వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం పలాస రైల్వేష్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ రైల్వే ఎల్సీ గేటు వద్ద పట్టాలపై పడుకున్నాడు. టాటా ఎక్స్ప్రెస్ రైలు పలాస చేరుకుంటున్న తరుణంలో భయంతో లేచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో రైలుకింద భాగం తగలగడంతో చేతులు, కాళ్లకకు తీవ్రంగా దెబ్బలు తగలయ్యాయి. వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటున్న సమయంలో కొందరు ప్రయాణికులు చూసి వెంటనే చెయిన్ లాగడంతో రైలు ఆగింది. కొందరు ప్రయాణికులు, గ్యాంగ్మెన్లు వెళ్లి క్షతగాత్రుడిని అతికష్టమ్మీద రైలు కింద నుంచి బయటకు తీశారు. గంటపాటు నరకయాతన.. తీవ్రంగా గాయపడిన సింహాచలం సుమారు గంటంపావు సేపు నరకయాతన అనుభవించారు. స్థానికులు 108కు ఫోన్ చేయగా అందుబాటులో లేదని సమాచారం రావడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. చాలాసేపటి తర్వాత మందస 108 అంబులెన్సు వచ్చి క్షతగాత్రుడిని పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. రైల్వేపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టిన రోజునే..
పుట్టిన రోజు కావడంతో ఉదయం నుంచి తల్లిదండ్రులతో ఆ యువకుడు ఆనందంగా గడిపాడు. ఆలయాలకు వెళ్లి పూజలు చేశాడు. తరువాత స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బీచ్కు వెళ్లాడు. సాయంత్రం వరకూ అక్కడే సందడి చేశారు. మరికొద్దిసే పట్లో ఇంటికి తిరిగిముఖం పడతారకుంటున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. స్నానం కోసం సముద్రంలో దిగి యువకుడు గల్లంతయ్యాడు. దీంతో తోటి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలిసి కన్నవారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పొందూరు మండలం నందివాడ గ్రామానికి చెందిన మజ్జి చంద్రమౌళి (17) కళింగపట్నం బీచ్లో గల్లంతు కావడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. శ్రీకాకుళం, గార/పొందూరు: నందివాడ గ్రామానికి చెందిన మజ్జి వెంకటరమణ, సర్వలక్ష్మి దంపతులకు కుమారుడు చంద్రమౌళి, కుమార్తె భాగ్యలక్ష్మి ఉన్నారు. వెంకటరమణ ఆటో డ్రైవర్గా పని చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమారుడు చంద్రమౌళి (17) పొందూరు మండలం వావిలాపల్లి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ (ఎంపీసీ) రెండో ఏడాది చదువుతున్నాడు. బుధవారం కళాశాలకు సెలవు కావడంతో పాటు తన పుట్టినరోజు కలసి రావడంతో ఆనందంగా గడపాలని భావించాడు. మంగళవారమే స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం గార మండలం కళింగపట్నం బీచ్కు వెళ్లాలని నిర్ణయిం చకున్నారు. బుధవారం ఉదయం తల్లిదండ్రులు ఆశీస్సులు చంద్రమౌళి తీసుకున్నాడు. అనంతరం 11 మంది స్నేహితులతో కలిసి ఆటోలో కళింగపట్నం బీచ్కు బయలుదేరారు. మార్గమధ్యలో ఎచ్చె ర్ల మండలం కుంచాలకుర్మయ్యపేటలోని దేవీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు. అక్కడ నుంచి బీచ్కు వెళ్లారు. స్నేహితులతో కలిసి బీచ్లో సందడిగా గడిపారు. సెల్ఫీలు తీసుకొని తల్లి దండ్రులకు చంద్రమౌళి వాట్సాప్లో పోస్టు చేశా డు. వాటిని చూసి కన్నవారు మురిసిపోయారు. స్నేహితులకు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫొటోలను వాట్సాప్లో పంపించాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ బీచ్లో సందడిగా స్నేహితులంతా గడిపారు. అనంతరం స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అయితే ఇక్కడే విషాదం నెలకొంది. పుట్టిన రోజును సంతోషంగా జరుపుకుంటున్న చంద్రమౌళిని రాకాసి అల ఉవ్వెత్తిన వచ్చి ఈడ్చుకుపోవడంతో గల్లంతయ్యాడు. దీన్ని చూసి మిగిలిన స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపుచర్యలు చేపట్టా రు. అయినా రాత్రి వరకూ ఎలాంటి ఆచూకీ లేదు. మెరైన్ పోలీసులు వద్దంటున్నా.. బీచ్లో స్నానానికి దిగవద్దని విధుల్లో ఉన్న మెరైన్ పోలీసులు మైక్లో హెచ్చరించారు. అయితే చంద్రమౌళితోపాటు అతని స్నేహితులు వీటిని పట్టించుకోకుండా సముద్రంలోకి దిగారు. వీరిలో చంద్రమౌళి గల్లంతయ్యాడు. పడవలో మెరైన్ సీఐ అంబేడ్కర్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థి చంద్రమౌళి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని గార ఏఎస్సై తలే రామారావు తెలిపారు. -
కళ్ల ముందే కాలిపోయాయి
శ్రీకాకుళం, పొందూరు: మండలంలోని కొంచాడ గ్రామంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిం ది. ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధితులంతా పేదవారే. కష్టపడి సంపాందించుకొన్న కొద్ది పాటి డబ్బు, బంగారం, దుస్తులు, సామాన్లు అగ్నికి ఆహుతి కావడంతో వారు కంటికిమింటికి ఏకధారగా రోదించారు.కొంచాడ గ్రామంలోని ప్రధాన వీధిలో మం గళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పది ఇళ్లు దగ్ధమయ్యాయి. ఉదయం ఏడు గంటలకే ఆయా కుటుంబాల వారంతా వరి కోత పనులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇళ్లల్లో ఏ ఒక్కరూ లేకపోవడంతో మంటలను ఆప డం సాధ్యం కాలేదు. ఇళ్లపైన టార్పాలిన్లు కప్పి ఉంచటంతో మంటలు బయటకు వచ్చేందుకు సమయం పట్టింది. పదిళ్లు పూర్తిగా లోపల మండిపోయిన తర్వాత టార్పాలిన్లపై నుంచి పొగ రావ డం ప్రారంభమైంది. ఇది పరిశీలించిన గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసి విఫ లమయ్యారు. మంటలను ఆపడానికి దగ్గరకు వెళ్లి నా ఆపలేకపోయారు. స్థానికులు పొందూరు ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చేలోపలే నష్టమంతా జరిగిపోయింది. బాధితులకు విషయం తెలిసి పరుగుపరుగున ఇళ్ల వద్దకు వచ్చే సరికి అంతా బూడిదైంది. కళ్ల ముందరే కష్టార్జితమంతా కాలిపోతుంటే వారంతా గుండెలవిసేలా రోదించారు. గండబాన రాంబాబు, అలబాన తవి టమ్మ, గడ్డెయ్య, పల్ల అప్నమ్మ, సింహాచలం, ఆదిలక్ష్మి, సూర్యనారాయణ, ముగడ గణపతి, దువ్వ సూరయ్య, చిన్ని సూరమ్మలకు చెందిన పదిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలో దాచుకున్న కొద్దిపాటి వెండి, బంగారం, నగదు, దుస్తులు, సామాన్లు దగ్ధమైపోగా అధికారులు రూ.7 లక్షలు ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. పల్ల ఆదిలక్ష్మికి చెందిన రూ. 40 వేలు నగదు, అరతులం బంగారం కాలిపోయాయి. పలువురు విద్యార్థుల పదో తరగతి, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు కూడా కాలిపోయాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పుస్తకాలు, పట్టాదారు పాసు పుస్తకాలు వంటివీ బూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఆర్ఐ ఈశ్వరరావులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు తక్షణ సాయం కింద బియ్యం అందించారు. సర్వస్వం కోల్పోయాం అగ్నిప్రమాదంతో మేం కట్టుబట్టలతో మిగిలాం. నా కొడుకు లక్ష్మణరావు పది, ఇంటర్, ఐటీఐ సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంకు పుస్తకం కాలిపోయాయి. రోజూ కూలి పని చేసుకొని బతుకుతున్నాం. తల దాచుకొనేందుకు సైతం గూడు లేకుండా పోయింది.– గండబాన రాంబాబు, బాధితుడు, కొంచాడ -
చెరువులో పడి వివాహిత మృతి
శ్రీకాకుళం, నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జలగల చెరువులో పడి కోవెల వీధికి చెందిన పెదిలాపు శాం తమ్మ (52) మృతి చెందింది. మంగళవారం ఉద యం ఈ ఘటన చోటుచేసుకుంది. రజక వృత్తి చేసుకునే శాంతమ్మ కొంతకాలంగా ఫిట్స్ వ్యాదితో బాధపడుతోంది. మంగళవారం దుస్తులను చెరువులో ఉతుకుతుండగా ఫిట్స్ వ్యాధి రావడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగి పోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పది గంటల సమయంలో మిగి లిన రజకులు దుస్తులు ఉతుకుతుండగా శాంత మ్మ మృతదేహం కాలికి తగిలింది. వెంటనే ఆమె మృతదేహాన్ని బయటకుతీసి భర్త మల్లేసుకు సమాచారం అందించారు. శాంతమ్మ ఉదయం నుంచీ కనిపించకపోవడంతో పట్టణంలోకి వెళ్లిం దని భావించామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ మెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ వివా హాలు అయ్యా యి. శాంతమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణదాస్ పరామర్శ.. శాంతమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో చర్చించారు. ఈయన వెంట పార్టీ నాయకులు చింతు రామారావు, కోటిపల్లి శ్రీను తదితరులు ఉన్నారు. -
బాలింత మృతితో ఉద్రిక్తత
శ్రీకాకుళం, హిరమండలం: బాలింత మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన మంగళవారం హిరమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ పట్టుబట్టడంతో కిలోమీటరు మేర ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. ఇదీ జరిగింది.. హిరమండలం మేజర్ పంచాయతీ సుభలయ గ్రామానికి చెందిన గర్భిణి బుడ్డి దేవీ(20) పురిటి నొప్పులతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో హిరమండలం పీహెచ్సీలో చేరింది. ఆ సమయంలో వైద్యాధికారి, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. వాచ్మన్ వెళ్లి పిలవడంతో స్టాఫ్నర్సు ఏకాశమ్మ వచ్చి వైద్యసేవలు అందించడంతో దేవీ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం సమయంలో బిడ్డతో పాటు (మాయ) ప్లజెంటా బయటకు సకాలంలో రాలేదు. దీంతో బొడ్డును కట్ చేస్తుండగా ప్లజెంటా కడుపులోకి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని వైద్యాధికారి సీహెచ్ మౌనికకు ఫోన్ చేసి చెప్పగా ఆమె ఆస్పత్రికి చేరుకుంది. ఇంతలో దేవీకి తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడి వైద్యులు చూసేసరికే దేవీ మృతిచెందింది. ఆస్పత్రిని చుట్టుముట్టిన బాధితులు.. హిరమండలం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైపోయిందంటూ దేవీ కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని హిరమండలం ఆస్పత్రి వద్ద ఉంచి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేది లేదంటూ బైఠాయించారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి మృతురాలి కుటుంబానికి మద్దతు పలికి ఆస్పత్రిని చుట్టుముట్టారు. దీంతో ఏబీ రోడ్డుపై కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ వి.రమేష్ సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు. అయినా వారు ఆందోళన విరమించలేదు. కొత్తూరు, సారవకోట, పాతపట్నం, మెళియపుట్టి ఎస్ఐలు సిబ్బందితో చేరుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. వెంటనే పాతపట్నం సీఐ ప్రకాశరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు రహదారులపై ఆందోళన విరమించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓతో చర్చలు.. సమాచారం అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ నరేష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు వినలేదు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. వైద్యాధికారితో పాటు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ ఇక్కడి పరిస్థితిని ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్ఓలకు ఫోన్లో వివరించారు. క్షమాపణ పేరిట హైడ్రామా.. వైద్యాధికారి మౌనిక బహిరంగ క్షమాపణ చెబుతారంటూ అధికారులు ఆందోళనకారుల వద్దకు తీసుకొచ్చారు. ఇంతలోనే ఆమె కళ్లుతిరిగి పడిపోవడంతో మళ్లీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లిపోయారు. పోలీసు వాహనంలో వేరే ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాధితులు అడ్డుకున్నారు. వైద్యాధికారి క్షమాపణ చెప్పకపోవడంతో మరింతగా ఆందోళన చేపట్టారు. ఆర్టీఓ హామీ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకొండ ఆర్డీఓ ఆర్.గున్నయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యసిబ్బంది, బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యాధికారి, సిబ్బ ందిపై చర్యలు తీసుకుంటామని, కలెక్టర్తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు శాంతించి మృతదేçహాన్ని తీసుకువెళ్లారు. ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద కుటుంబం.. దేవీది పేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం తండ్రి దుబాయి వెళ్లాడు. తల్లి రేణుక కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, స్వాతీలు ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. దేవీకి ఒడిశాకు చెందిన వాసుదేవరావుతో ఏడాది కిందట వివాహం చేశారు. ప్రసవం కోసం పుట్టింటికి రాగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేవీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు. శిశువును చూసి భర్త వాసు, తల్లి రేణుక, చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వైద్యానికి వెళ్తూ..తిరిగిరాని లోకాలకు
శ్రీకాకుళం, పూసపాటిరేగ(నెల్లిమర్ల)/పోలాకి: కిడ్నీ రోగంతో బాధపడుతున్న మహిళను చికిత్స కోసం కారులో తీసుకెళ్తున్న ఓ కటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిందరవందర చేసేసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఇద్దరు పురుషులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూసపాటి రేగ ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పూసపాటిరేగ జాతీయ రహదారిపై పేరాపురం జంక్షన్ వద్ద సోమవారం వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాసి గ్రామానికి చెందిన బొంతల వెంకటరత్నం (62), తలిసి అనూష(23) అనే మహిళలు మృతి చెందగా, వెంకటరత్నం భర్త గణేశ్వరరావు, కుమారుడు గోవిందరావుకు గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, అనూష సుందరపేట ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వెంకటరత్నానికి చికిత్స అందించేందుకు విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి తమ సొంత కారులోనే తరలిస్తున్నపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంకటరత్నంకు ఒక కుమారుడు, ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరి కుమార్తె అనూష. అనూష తండ్రి కారునాయుడు చిన్నప్పుడే మృతిచెందటంతో స్వగ్రామం చెల్లాయివలస నుంచి ధీర్ఘాశి కాలనీకి రాజేశ్వరి కుటుంబం వచ్చేసింది. అనూషకు ఇద్దరు చెల్లెళ్లు యామిని, నవ్యలు, తమ్ముడు వంశీలు ఉన్నారు. అనూష బీఎస్సీ నర్సింగ్ చదివి ప్రస్తుతం విశాఖలోని అపోలో ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవల నాగుల చవితి సందర్భంగా ఇంటికి వచ్చిన అనూష అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేకపోవటంతో తనతో పాటు విశాఖపట్నంలోని వైద్యం చేసేందుకు తీసుకువెళ్లిందని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేసేందుకు విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విస్తరణ పనుల వల్లే ప్రమాదం.. పేరాపురం జంక్షన్లో ఆరులైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న రోడ్డులో ఎత్తుపల్లాలు ఉండడం, పాత రహదారి కంటే కొత్త రోడ్డు ఎత్తుగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటికే రహదారి అంచులో సిమెంట్తో చేసిన స్టాపర్ దిమ్మలు వేయడం వల్ల చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, విస్తరణ పనుల వద్ద హైవే అధికారుల అచూకీ కూడా కానరావడం లేదని, దీని వల్ల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. డీఎస్పీ సందర్శన.. ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎన్.శ్రావణ్కుమార్ హుటాహుటిన పేరాపురం జంక్షన్లోని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీరుపై ఎస్ఐ కృష్ణమూర్తిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా హైవే అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
విధి వింత నాటకం
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం బలైపోయింది. పక్షం రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు ఇద్దరూ మృతిచెందటంతో ఆ కుటుంబంలోని కన్నీటి పడవని ఆపే నాథుడే కరువైపోయాడు. కుటుంబానికి పెద్దదిక్కుని కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబానికి మరో బాధ వచ్చిపడింది. ఆ కుటుంబానికి తండ్రి తర్వాత పెద్దదిక్కుగా ఉండవల్సిన, చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందటంతో ఆ కన్నతల్లి ఆవేదన అరణ్యరోదనగా మిగిపోయింది. కట్టుకున్నవాడు కట్టేలమీదకు వెళ్లి పక్షం రోజులు గడవక ముందే నవమాసాలు మోసి కడుపుచించుకు పుట్టిన బిడ్డ చేతికందివచ్చాడనే ఆనందం తీరక ముందే కట్టేలపై కాలుతుంటే ఆ దేహాన్ని చూచిన ఆ కన్నతల్లి హృదయం చలించుకు పోయింది. ఈ హృదయవిధారక ఘటన టెక్కలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... స్థానిక ఆర్టీసీ గ్యారేజ్కు ఎదురుగా ఉన్న వీధిలో నివశిస్తున్న గురువెల్లి వెంకటరమణ టెలీకాంలో విధులు నిర్వర్తిస్తూ(28.10.18) 15 రోజుల క్రితం పలాస రైల్వేస్టేషన్ వద్ద ట్రైన్ ఢీకొని మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుమారుడు గురుబెల్లి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి టెక్కలి చేరుకొని తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అప్పటి నుంచి మానసికంగా ఆందోళనకు గురవుతున్న శ్రీనివాస్కు తండ్రి మృతి మానసికంగా కృంగదీసింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ఆరోగ్యం క్షీనించడంతో స్థానిక వైద్యులను సంప్రదించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం తరలించారు. వైద్యం పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పక్షం రోజుల వ్యవధిలోనే కుటుంబానికి మగదిక్కు లేకుండా పోవడంతో తల్లి ఉషారాణి, కుమార్తె పావని, బంధువులు ఆవేదన వర్ణనాతీతం. మృతుడు ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్లో ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. తండ్రి మృతిచెందాడన్న వార్త తెలుసుకొని వచ్చి తను కూడా మృత్యువడిలోకి తండ్రికి తోడుగా వెళ్లిపోయాడు. -
ఆ నవ్వులు ఇక లేవు!
ఆ అంగన్వాడీలో రోజూ వినిపించిన హుషారు గొంతు ఇక వినిపించదు. వప్పంగి పంతులు కాలనీలో చలాకీగా తిరిగిన చిన్నారి ఇక ఆ దారుల్లో కనిపించదు. నాగులచవితి నాడు వెండి పట్టీలు వేసుకుని మురిసిపోయిన పద్మశ్రీ నవ్వు మరి వికసించదు. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతూ ఐదేళ్ల ఈ చిన్నారి అందనంత దూరం వెళ్లిపోయింది. గెడ్డలో దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి కన్ను మూసింది. ఉదయాన్నే కూతుళ్లతో నాగుల చవితి పూజలు చేయించిన తల్లిదండ్రులు సాయంత్రానికి ఓ కుమార్తెను పోగొట్టుకోవడం తట్టుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండలం వప్పంగి పంతులు కాలనీకి చెందిన శిమ్మ రవికుమార్, రూపావతిల కుమార్తె శిమ్మ పద్మశ్రీ(5) ఆదివారం మధ్యాహ్నం గెడ్డలో పడి మృతి చెందింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పద్మశ్రీ చిన్న కూ తురు. ఆదివారం నాగులచవితి కావడంతో పిల్లలి ద్దరి చేత పూజలు చేయించిన తల్లిదండ్రులు పొలం పనులపై ఉదయం 10 గంటలకే బయటకు వెళ్లిపోయారు. అప్పటికే పక్కంటి పిల్లలతో పద్మశ్రీ అక్క సుష్మశ్రీలు ఆడుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత టాయిలెట్కువెళ్లాల్సి రావడంతో సమీపంలోని శివాలయాన్ని ఆనుకుని ఉన్న గెడ్డ వద్దకు వెళ్లారు. గెడ్డ గట్టుపై ముగ్గురు పిల్లలు ఉండగా పద్మశ్రీ ముందుగా దిగింది. లోతు గమనించకపోవడంతో ఒక్కసారిగా కొట్టుకుపోయింది. దీంతో గట్టునే ఉన్న పిల్లలు కంగారు పడి స్థానికులకు విషయం చెప్పారు. వెంటనే స్థానికులు 100తో పాటు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఫైర్సిబ్బందితో పాటు రూరల్ పోలీసులు గెడ్డ గట్టు గుండా ప్రతి కల్వర్టు వద్ద నీటిలో నుంచి వెతకడం ప్రారంభించారు. పొలాల్లోని నీరు గెడ్డలో కలిసిపోతుండడంతో నీటి ప్రవాహం ఎక్కువగా కనిపించింది. సుమారు మూడు గంటల సేపు ప్రతి కల్వర్టు వద్ద జల్లెడ పట్టారు. వీరు వెతుకుతున్నంత సేపు చిన్నారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. తమ కూతురు మళ్లీ తమ వద్దకు వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ సుమారు ఐదు గంటల సమయంలో గార మండలంలోని అంబటివానిపేట పరిధి శిమ్మపేట శివారు గ్రామ పరిధిలోని ఓ కల్వర్టు వద్ద చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నట్లు రూరల్ ఎస్ఐ చిన్నం నాయుడు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులకు శోకానికి అంతు లేకుండాపోయింది. కంటికీ మింటికీ ఒకటే ధారగా రోదించారు. శోకసంద్రంలో కుటుంబం.. పద్మశ్రీ మరణవార్త విని తల్లిదండ్రులిద్దరూ షాక్కు గురయ్యారు. ప్రతి రోజు ఉదయం అంగన్వాడీకి వెళ్లేదని, ఎంతో చక్కగా, చలాకీగా ముసిముసి నవ్వులతో పలకరించేదని, నాగులచవితి సందర్భంగా కాళ్లకు వెండి పట్టీలు కూడా పెట్టుకుందని కన్నీళ్లతో అక్కడి వారితో చెప్పుకున్నారు. నాగుల చవితి రోజు ఆ దేవుడు ఇంతటి విషా దాన్ని ఇచ్చాడని బోరున విలపించారు. వారి రోదన చూసి స్థానికులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. చిన్నారి మృతితో వప్పంగిలో విషాదం అలుముకుంది. పద్మశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. రూరల్ ఎస్ఐ చిన్నంనా యుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండగ పూట విషాదం
శ్రీకాకుళం, లావేరు: నాగులచవితి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పుట్టలో పాలు పోశాడు. ఆనక ఎప్పటిమాదిరిగానే మద్యం షాపులో పనిచేసేందుకు వెళ్లిపోయాడు. ఇంతలోనే విద్యుత్ షాక్కు గురై తమ కుమారుడు మృత్యువాత పడ్డాడన్న పిడుగులాంటి వార్త విని వారు శోకసంద్రంలోకి మునిగిపోయారు. ఈ విషాద ఘటన మండలంలోని బొడ్డపాడు గ్రామంలో ఆదివారం నెలకొంది. విద్యుత్ సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ ధనుంజయ్ నిర్లక్ష్యం వల్లేనని తమ కుమారుడు మృతి చెందాడని తండ్రి బాబూరావు లావేరు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ గ్రామానికి చెందిన ఆళ్ల కిశోర్(25)కు ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో ఆర్నెల్ల క్రితం బుడుమూరు గ్రామంలో ఓ మద్యం షాపులో పనికి కుదిరాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో నాగులచవితి పూజ చేసి, అనంతరం మద్యం షాపునకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి మురపాక గ్రామానికి వెళ్తున్న హెచ్టీ విద్యుత్ లైన్ తీగలు తెగి పడ్డాయి. ఈ విషయాన్ని షిఫ్ట్ ఆపరేటర్కు కిశోర్ తెలియజేశాడు. మురపాక లైన్కు సరఫరా నిలిపివేస్తానని తెగిపడిన తీగలు పక్కకు తొలగించాలని షిఫ్ట్ ఆపరేటర్ సూచించాడు. ఆ విధంగా వేస్తున్న క్రమంలో విద్యుత్ సరఫరా చేశాడు. దీంతో కిశోర్ షాక్కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. లావేరు ఏఎస్ఐ కృష్ణారావు, తన సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ఎదిగొచ్చిన ఒక్కగానొక్క కొడుకు విద్యుత్షాక్తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బాబూరావు, ఊర్వశి కన్నీరుమున్నీరయ్యారు. వీరితోపాటు సోదరి, బంధువులు అతడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో అందరితో సన్నిహితంగా ఉండే యువకుడు మృతి చెందాడన్న వార్తతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. షిఫ్ట్ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లే.. తెగిపడిన విద్యుత్ తీగలు పూర్తిగా తీసివేశారా లేదా అని షిఫ్ట్ ఆపరేటర్ తెలుసుకోకుండానే సరఫరా ఇచ్చారని, ఈ కారణంగానే తమ కుమారుడు షాక్తో మృతి చెందాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మృతుడు తండ్రి డిమాండు చేశారు. -
ఘోరం..
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ యడ్ల రవికుమార్ (68) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వర్సిటీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవికుమార్ గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వర్సిటీ ముందు ఉన్న 16వ నంబర్జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు వెనుక నుంచి ఆయన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన రవికుమార్ను 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్కు తీసుకెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు. అయితే తోటి సిబ్బంది శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటల సమయంలో కన్నుమూశారు. రవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రవికుమార్ గురించి.. రవికుమార్ బీఆర్ఏయూలోని విద్యా విభాగంలో ప్రత్యేక బీఈడీ మెంటల్లీరిటార్డ్ ప్రత్యేక బీఈడీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఈయన స్వగ్రామం లావేరు మండలం అప్పాపురం. విజయనగరం ఎంఆర్ కళాశాలలో సీనియర్ ఆధ్యాపకునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. 2009లో బీఆర్ఏయూలో ప్రత్యేక బీఎడ్ కోర్సు ప్రారంభించిన సమయంలో ఇక్కడ విధుల్లో చేరారు. ప్రత్యేక బీఎడ్ కోర్సు బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో అమెరికాలో సాప్ట్వేరు ఇంజినీర్లుగా పని చేసిన పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్లో పని చేస్తున్నారు. రవికుమార్ ఆకస్మిక మరణాన్ని వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. 68 ఏళ్ల వయస్సులో కూడా బోధన విషయంలో యువ ఫ్యాకల్టీ సభ్యులతో పోటీ పడేవారు. ఉత్సాహంగా ఉంటూ వర్సిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. రోజూ స్వగ్రామం అప్పాపురం నుంచి రాక పోకలు సాగిస్తూ ఉండేవారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. -
వెంటాడిన మృత్యువు
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కుప్పిలి సమీపంలో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పిలి, బుడగట్లపాలెం గ్రామాల పరిధిలో చేపల చెరువుల కోసం నెల రోజులుగా కొత్తగా విద్యుత్ లైన్లు వేస్తున్నారు. తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈ పనులను ఓ కాంట్రాక్టర్కు అప్పగించింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ట్రాక్టర్పై విద్యుత్ స్తంభాలను తీసుకొస్తున్నారు. ఆ సమయంలో ట్రాక్టర్ ట్రాలీపై తొమ్మిది మంది కూలీలు కూర్చున్నారు. కుప్పిలి సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ గోపీ బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ట్రాలీలో కూర్చున్న కూలీలు కిందకు దూకేశారు. ఈ సమయంలో కింజరాపు నర్సింహులు (45) అనే వ్యక్తిపై స్తంభాలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనది శ్రీకాకుళం రూరల్ మండలం కంచుభూమయ్యపేట గ్రామం. మిగిలిన కూలీల్లో మెండ చిన్నారావు, రాజారావు, రమణలకు గాయాలయ్యాయి. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి పోలీసులకు, 108 అంబులెన్సుకు తెలియజేశారు. వెంటనే అంబులెన్సు సిబ్బంది వచ్చి క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు సంఘటన స్థల్నా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి తరలించారు. గాయపడిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దీపావళి పండగ ముందు ప్రమాదం జరగడంతో ఆయా కుటుంబాలు పెను విషాదంలో కూరుకుపోయాయి. -
ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకోమన్నాడు
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడాదిన్నరకే భార్య ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సోమవారం చిలకపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని పొండూరు గ్రామానికి చెందిన చాగిశెట్టి దుర్గుబాబు అదే గ్రామానికి చెందిన తనూజ(26)ను ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉల్లిపాయల వ్యాపారం నిమిత్తం చిలకపాలెం వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొంతకాలం కాపురం సజావుగా సాగిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తనూజను భర్త మానసికంగా, శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని బాధితురాలు కన్నవారికి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యేది. ఈ క్రమంలోనే భర్త పెట్టే వేధింపులు తీవ్రం కావడంతో సోమవారం ఇంటి వరండాలోని హుక్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు వారు రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందింది. వెంటనే స్థానికులు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు తూర్పుగోదావరి నుంచి సాయంత్రానికి చిలకపాలెం చేరుకున్నారు. మృతురాలి తల్లి నందిపాటి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు దుర్గుబాబుపై కేసు నమోదు చేశారు. ఎస్సై వై.కృష్ణ పర్యవేక్షణలో హెచ్సీ వాసుదేవరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. దుర్గుబాబును పోలీసులు విచారిస్తున్నారు. -
ఆనందంలో విషాదం
ఆ నవ్వులు ఆరేళ్లకే ఆగిపోయాయి. ఆ సంతోషాలు అప్పుడే అయిపోయాయి. ఒక్కగానొక్క కొడుకు. ఆరేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆశలరూపం. ఊరంతా పండగ చేసుకుంటున్న వేళ లారీ రూపంలో దూసుకువచ్చిన మృత్యువుకు బలైపోయాడు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్చుతూ అందనంత దూరానికి వెళ్లిపోయాడు. ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల హేమంత్ కన్నుమూశాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: తులసమ్మ సంబరంలో భాగంగా గ్రామస్తులంతా మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్తున్నారు. వీరితోపాటే ఆనందంగా గెంతులేస్తూ వెళ్తున్న ఓ బాలుడిని మృత్యురూపంలో వచ్చిన లారీ కబళించింది. దీంతో లొద్దపుట్టి గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఆదివారం స్థానికంగా పూజలందుకుంటున్న తులసమ్మ అమ్మవారి సంబరాన్ని చూసేందుకు అదే గ్రామానికి చెందిన పైలా యోగేష్, నిర్మల దంపతుల కుమారుడు హేమంత్(6) బయలు దేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై తోటి స్నేహితులతో కలిసి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు డివైడర్పై నుంచి రోడ్డు అంచుల్లోకి వచ్చాడు. ఇదేక్రమంలో చెన్నై నుంచి బీహార్కు వెళ్తున్న కార్లు లోడు లారీ ఢీకొంది. దీంతో ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. అయితే లారీ డ్రైవర్ ఆపకుండా సుమారు రెండు కిలోమీటర్లు దూరం వెళ్లిపోయాడు. స్థానిక యువకులు ద్విచక్రవాహనంపై వెంబడించి బెల్లుపడ వద్ద లారీని ఆపివేయించి రూరల్ పోలీసు స్టేషన్కు తరలించారు. కొనఊపిరితో ఉన్న బాలుడిని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి యోగేష్ శ్రీకాకుళంలో వలస కూలీగా పనిచేస్తుండగా, తల్లి నిర్మల స్థానికంగా కూలీ పనులు చేసుకుంటోంది. ఆదర్శ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఏ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని పతివాడపాలెంలో గురువారం సాయంత్రం వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి కట్నం వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామానికి చెందిన ఉప్పల గురుమూర్తికి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెంపాడ గ్రామానికి చెందిన ధనలక్ష్మి(22)తో ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలు కావడంతో ఇరు కుటుంబాల మధ్య తగాదాలు జరిగేవి. ధనలక్ష్మి మూడు నెలల గర్భిణి కావడంతో దసరా పండగ సమయంలో కన్నవారింటికి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. మూడు రోజుల కిందట(గత నెల 30వ తేదీ) భర్త గురుమూర్తి నాన్నమ్మ చిట్టెమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మి అదే రోజు పతివాడపాలెం వచ్చి భర్త ఇంట్లోనే ఉంటోంది. ఇంతలో ఏమైందో గానీ గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు హుటాహుటిన వచ్చి కన్నకూతురు విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె మృతికి వరకట్నం వేధింపులే కారణమంటూ తండ్రి ముత్యాల వెంకటరమణ జె.ఆర్.పురం పోలీసులు స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, సీఐ వి.రామకృష్ణ, తహసీల్దార్ కె.శ్రీరాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త గురుమూర్తి, అత్త పైడిరాజు, బావ అప్పలరాజు, మరిది మోహన్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
దేవాలయాల్లో దొంగలుపడ్డారు
శ్రీకాకుళం, పాతపట్నం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటేశ్వర ఆలయం, మంజునాథ ఆలయాల్లో మంగళవారం రాత్రి దొంగతనం జరిగింది. ఎస్ఐ ఎం.హరికృష్ణ, ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర ఆలయప్రధాన ద్వారం గుండా దొంగలు ప్రవేశించి, ఆలయం ముందు రెండు తాళాలను, ముఖద్వారం వద్ద ఒకటి, హుండి తాళం పగలకొట్టి నగదును చోరీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రధాన అర్చకుడు చామర్తి జగన్నాథ ఆచార్యులు వచ్చేసరికి ఆలయ ముఖద్వారం తలుపు తెరిచి ఉండడంతో వెంటనే ఆలయ ఇన్చార్జి ఈవో వి.వి.సూర్యనారాయణకు చెప్పారు. ఈవో పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి క్యూస్టీం ఎస్ఐ మురళీ, ఎ.ఎస్ఐ సుజాత ఆధ్వర్యంలో హుండీని, ఆలయం తలుపులను పరిశీలించారు. మూడు తాళాలను ఇనుప రాడ్తో తొలగించినట్లు, ఒక తాళం మిషన్తో కట్ చేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు. హుండీలోని చిల్లర ఉంచి, నోట్లు మాత్రమే దొంగలు పట్టుకెళ్లారు. 60రోజు క్రింతం హుండీ లెక్కించామని, ప్రస్తుతం మూడు వేలు వరకు ఉండవచ్చని ఈవో చెప్పారు. ఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే ప్రహారాజాపాలెంలోని మంజునాథ ఆలయంలో దొంగలు తాళాలు పగల గొట్టి హుండీ చోరి చేశారని ఆలయ అర్చకుడు సతీష్ చెప్పారు. 70 రోజు ల కిందట హుండీ లెక్కించామని పేర్కొన్నారు. -
అడ్డదారే ప్రాణాలు తీసింది!
శ్రీకాకుళం, కాశీబుగ్గ: అడ్డదారిలో వెళ్తే వేగంగా ఇంటికి చేరుకోవచ్చుననుకున్న వారిని మృత్యువు రైలు రూపంలో వచ్చి కాటేసింది. కుటుంబ సభ్యుల ను విషాదంలోకి నెట్టేసింది. ఈ దారుణం పలాస–కాశీబుగ్గ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులైన.. టెక్కలికి చెందిన గురుగుబెల్లి వెంకట్రావు (55), కోటబొమ్మాళి మండలం కుజ్జూపేటకు చెందిన కిల్లి భాస్కరరా వు(56)లు మృతి చెందారు. జీఆర్ఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రా వు, భాస్కరరావులు ఇచ్ఛాపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు రోజూ స్వగ్రామాల నుంచి విధులకు వెళ్లి వస్తుం టారు. ఆదివారం కూడా విధుల అనంతరం ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఇచ్ఛాపురం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకూ ప్రయాణించా రు. అక్కడ రైలు దిగిన ఇద్దరూ బస్సును అందుకోవాలనే తొందరలో అసలు దారిని వదిలేసి.. అడ్డదారిలో పట్టాలపై వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారు ప్రయాణించిన ఫలక్నుమా రైలువెనుక నుంచి రావడాన్ని ఇద్దరూ గమనించలే దు. ఇంతలో రైలు వచ్చి ఢీకొట్టడంతో వెంకట్రా వు, భాస్కరరావులు సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు. ఇంటికి చేరుకోవాలనే తొందరలోనే ఇద్దరు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తూ చనిపోవడంపై స్థానికులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. మృతదేహాలను కాశీబుగ్గ జీఆర్ పీ హెడ్కానిస్టేబుల్ కోదండరావు పరిశీలించా రు. ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేశారు. టెక్కలిలో విషాదం టెక్కలి రూరల్: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి గురుబెల్లి వెంకట్రావు రైలు ఢీకొన్న సంఘటనలో చనిపోవడంతో టెక్కలిలోని అతని కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. భార్య ఉషారాణి, కూతురు పావణిలు గుండెలు పగిలేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. మృతుడికి శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతను ప్రస్తుతం హైదారాబాద్లో ఉంటున్నాడు. -
ఆశల దీపం ఆరిపోయింది
శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకుంటాడని కుమారుడిపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు దేవుడు తీరని వేదన మిగిల్చాడు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి రోదన ఆపడం ఎవరి తరము కావటం లేదు. బెంగళూరులో జరిగిన నేవీ ఎంపికల్లో పాల్గొని ముందురోజే ఇంటికి వచ్చిన కొడుకు మరిలేడని తెలుసుకుని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. పదో తరగతి నుంచి అన్ని ఫలితాల్లో ప్రథమ స్థానంలోనే నిలుస్తూ... చదువులో రాణించే కొడుకు ఏదైనా మంచి ఉద్యోగం సాధిస్తాడని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. మండలంలోని మోదుగువలస కాలనీకి చెందిన మునికోటి బాబూరావు, అరుణ దంపతుల కుమారుడు మునికోటి శేఖర్(19) మంగళవారం చెరువుకు స్నానానికి వెళ్లి మృతి చెందాడు. మోదుగువలస గ్రామానికి సమీపంలో ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం చెరువుకు స్నానానికి వెళ్లిన శేఖర్ ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కొడుకు కోసం గ్రామంలో ఆరా తీశారు. స్నేహితులను అడిగినా తమకు తెలియదని, చెరువు వద్ద శేఖర్ బట్టలు, చెప్పులు ఉన్నాయని చెప్పడంతో అనుమానం వచ్చి వెళ్లి చూడగా చెరువు గట్టుపైనే బట్టలు, చెప్పులు ఉన్నాయి. దీంతో చెరువులో గాలించగా మృతదేహం లభించిందని స్థానికులు చెప్పారు. బెంగళూరులో జరిగిన నేవీ ఎంపికలకు వెళ్లిన శేఖర్ సోమవారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఇతడు విజయనగరంలోని మహారాజ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రథమ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయాన్నే కాలేజీకి వెళ్లిపోతానని ఇంట్లో చెప్పాడు. ఊరిలో అమ్మవారి వారాలు జరుగుతున్నాయని, మరలా నువ్వు ఎప్పుడు వస్తావో ఈరోజు వారాలు అయిపోతే బుధవారం ఉదయం వెళుదువులే అని చెప్పడంతో ఉండిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బాబూరావు, అరుణ దంపతుల పెద్ద కుమార్తె శ్రీలతకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండో కుమార్తె సుధారాణి డిగ్రీ వరకు చదువుకుంది. ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ హెచ్సీ రమణమూర్తి చెప్పారు. మృతదేహానికి శవపంచనామా చేసి పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించామన్నారు. -
ఓ ఉద్యోగి ఆతృతకు.. నిండు ప్రాణం బలి
శ్రీకాకుళం, కాశీబుగ్గ: తిత్లీ తుఫాన్ విజృంభణ నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఇతర జిల్లా నుంచి సంబంధిత సిబ్బందితో వచ్చిన ఓ సహాయకుడు విద్యుత్ఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. తన ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఓ ఉద్యోగి ఆతృతకు ఇలా నిండు ప్రాణం బలి కావడంతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే.. మున్సిపాలిటీ పరిధి 16వ వార్డు గాంధీనగర్లో పన్నెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ నివాసముంటున్న స్టేట్ బ్యాంకు ఉద్యోగి శివరాం తన ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఎల్సీ(విద్యుత్ను అనుమతితో నిలిపివేసే పక్రియ) తీసుకోకుండానే అక్రమంగా పనులు చేయించాడు. ఈయన ఓ విద్యుత్ కూలీని తీసుకొచ్చి స్థానికంగా స్తంభం ఎక్కించాడు. ఈ క్రమంలో వైరు కలుపుతుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సెలర్ బోర బుజ్జి, ఉప చైర్మన్ గురిటి సూర్యనారాయణ, కౌన్సెలర్ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ సిబ్బంది తమ సహాయకులుగా (రోజు కూలీలు) పది వేల మంది వరకు తీసుకొచ్చారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నుంచి వచ్చిన ఈ వ్యక్తి పది రోజులుగా పనులు చేస్తూ ఇలా మృత్యవాత పడ్డాడు. ఇటువంటి కార్మికులకు స్థానికంగా పలువురు నగదు ఆశ చూపి ఈ విధంగా వినియోగిస్తుండటం గమనార్హం. ఈ విషయమై ఇంకా కేసు నమోదు కాలేదు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: మండలంలోని గూడేం గ్రామానికి చెందిన వారణాసి అప్పన్న(23) ఆదివారం వేకువజామున తమ టేకు తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడి తల్లిదండ్రులు రాము, రమణమ్మ, అక్క లలితల కథనం మేరకు.. మృతుడు అప్పన్న ఐటీఐ చదువుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇంటి దగ్గరే ఉంటున్న క్రమంలో ఓ వివాహితతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ విషయం ఆ మహిళ బంధువులకు తెలియడంతో ఇతడిని మూడ్రోజులుగా వేధించడంతోపాటు దాడి చేశారు. లక్ష రూపాయల అపరాధ రుసుము విధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామస్తులు సమక్షంలో ఈ తగాదాను పరిష్కరించనున్న క్రమంలో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి రమణమ్మ హైదరాబాద్లో వలస కూలీగా పనిచేస్తోంది. దసరా సందర్భంగా మూడ్రోజుల క్రితమే గ్రామానికి వచ్చింది. ఇంతలోనే కుమారుడు దారుణానికి ఒడిగట్టడంతో బోరుమని విలపించింది. అయితే తన కుమారుడిది ఆత్మహత్య కాదని, గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు టెక్కలి ఎస్ఐ సురేష్బాబు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తెట్టంగిలో దొంగల హల్చల్
శ్రీకాకుళం, వీరఘట్టం: మండలంలోని తెట్టంగి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. కత్తులతో గ్రామంలో తిరుగుతూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. యజ్జల మల్లీశ్వరరావు, గేదెల కన్నబాబు ఇళ్లల్లో చొరబడి చోరీకి యత్నించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మల్లీశ్వరరావు, స్వప్న దంపతులు ఉన్న ఇంటిలోకి దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న డబ్బాను తీసి రెండు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, రూ.10 వేలు నగదు కాజేశారు. అనంతరం పక్క వీధిలో ఉన్న గేదెల కన్నబాబు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు తెరుస్తుండగా కన్నబాబు భార్య సునీతకు మెలకువ రావడంతో కేకలు పెట్టి దొంగలను ప్రతిఘటించింది. దీంతో అక్కడి నుంచి దొంగలు పారిపోయారు. అయితే బీరువా లాకరు తాళాలు మాత్రం పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అందరూ మేల్కొని చుట్టూ గాలించారు. సుమారు 5 అడుగుల ఎత్తున నల్లగా ఉన్న వీరంతా లుంగీ తప్ప ఎటువంటి దుస్తులు లేకుండా కత్తులతో వచ్చినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఓ కత్తిని కన్నబాబు ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ముమ్మర దర్యాప్తు... విషయం తెలిసిన వెంటనే వీరఘట్టం ఎస్ఐ జి.అప్పారావు గురువారం అర్ధరాత్రి తెట్టంగి గ్రామం వెళ్లి దొంగలు చొరబడిన గృహాలను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శుక్రవారం శ్రీకాకుళం క్లూస్ టీం వచ్చి మల్లీశ్వరరావు ఇంట్లో సోదాలు చేసి వేలిముద్రలు సేకరించారు. దొంగలు విడిచిపెట్టిన కత్తిని పరిశీలించారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ... మల్లీశ్వరరావు ఇంట్లో దొంగతనం జరిగినప్పటికీ ఆ బంగారు, వెండి నగలు తన అక్క బంగారుతల్లివని బాధితులు తెలిపారు. తన అక్క కొత్త ఇళ్లు కడుతుండడంతో వారి ఇంట్లో సామాన్లు ఉంచడానికి చోటు లేకపోవడంతో తమ ఇంట్లో నగలను భద్రపరిచారని పేర్కొన్నారు. తులం బంగారు నగలు, 5 తులాల వెండి వస్తువులు, 2 వేల నగదు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అప్పారావు విలేకర్లకు తెలిపారు. భయం వేసింది.. మా ఆయన డాబా మీద కంప్యూటర్ వర్కు చేస్తూ అక్కడే నిద్రపోయారు. నేను పిల్లలిద్దరితో కలిసి నిద్రపోయాను. అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ నాముఖంపై టార్చిలైటు కొడుతుండగా ఇంకో వ్యక్తి బీరువా తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నల్లగా పొట్టిగా ఉన్న ఓ వ్యక్తి నా నోరు మూసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో నేను కేకలు వేసేందుకు ప్రయత్నం చేయడంతో పారిపోయారు. డాబాపై మా ఆయన బయటకు రాకుండా బయట గెడ పెట్టారు. దీంతో భయమేసింది. మా ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదుగాని మా బీరువా లాకరు తాళాలు పట్టుకుపోయారు. – గేదెల సునీత, తెట్టంగి,వీరఘట్టం మండలం -
సూసైడ్ నోట్లోని రాత ఆమెది కాదు
శ్రీకాకుళం, కాశీబుగ్గ: నా కుమార్తె నాగ కనకదుర్గ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని, ఆమెను చిత్రహింసలకు గురిచేసి చంపేసింది తన అల్లుడేనని మృతురాలి తండ్రి నాగభూషణబ్రహ్మ పోలీసులకు తెలిపారు. కనకదుర్గ మృతి చెందిన విషయం అల్లుడు చెప్పలేదని, ఇతరుల ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చామన్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుక ఏటీఎం అపార్ట్మెంట్లో సత్యనారాయణ, నాగ కనకదుర్గ దంపతులు నివహిస్తున్నారు. మంగళవారం రాత్రి కనకదుర్గ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు పడివుంది. ఈ విషయం తెలుసుకున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉంటున్న మృతురాలి తండ్రి, సోదరుడు, కుటుంబ సభ్యులు దాదాపు 50 మంది బుధవారం రాత్రి 10 గంటలకు పలాస చేరుకున్నారు. కనకదుర్గ మృతదేహం చూసి తండ్రి, సోదరుడు బోరున విలపించారు. రాత్రి 11 గంటల సమయంలో నాగ కనకదుర్గ భర్త సత్యనారాయణను ఏలూరు నుంచి వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు చితకబాదారు. తర్వాత అర్ధరాత్రి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి నాగభూషణం మాట్లాడుతూ తన కుమార్తె నాగకనకదుర్గ ఎంఎస్సీ చదివిందని, పెళ్లై 11 ఏళ్లు కావస్తుందని, 8 ఏళ్లుగా తమ కుమార్తెను అల్లుడు సత్యనారాయణ పుట్టింటికి పంపించలేదన్నారు. 8 ఏళ్లగా ఇంటికి ఫోన్ చేయనీయకుండా, ఇంటి ముఖం పట్టకుండా చిత్ర హింసలకు గురిచేసే వాడని తెలిపారు. పిల్లలు లేరని గత కొన్నేళ్లుగా అత్తారింటి వారి నుంచి వేధింపులు ఎక్కువైయ్యాయన్నారు. కనీసం ఆస్పత్రికి వేళ్లేందుకైనా సత్యనారాయణ వెంట వెళ్లేవాడు కాదన్నారు. ఫోన్ చేసి తమతో మాట్లాడించేవాడు కాదన్నారు. చివరకు తనబాధ తనే పడతానని ఎవరూ కలుగచేసుకోవద్దని కనకదుగ్గ తమకు చెప్పి నరకం అనుభవించిందన్నారు. తమ కూతురిని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులు వద్ద రోదించారు. ఆ చేతిరాత నా కుమార్తెది కాదు ఎంఎస్సీ పూర్తిచేసి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే తమ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని చివరకు మరణించే విధంగా చేశాడని ఆరోపించారు. ఆమె వద్ద ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు, పత్రికలు, టీవీ ఛానల్ ఆత్మహత్యగా వారికి వారే నిర్ధారించడం మరింత మా కుటుంబానికి కలిచివేస్తుందన్నారు. ఊరుకాని ఊరు వచ్చి రాత్రంతా ఆస్పత్రి బయట దోమలతో కంటిమీద కునుకులేకుండా ఇబ్బందులు పడ్డామన్నారు. కనకదుర్గ ఉరివేసుకుంటే కాలు ఎందుకు అంత కిందకు ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్ తమ కుమార్తె రాసింది కాదని, ఆమె భర్త, కుటుంబ సభ్యులు చంపేసి కట్టుకథ అల్లుతున్నారని, ఈ విషయం ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. కనకదుర్గ తమ్ముడు విజయ్ మాట్లాడుతూ గతంలోనే సత్యనారాయణతో పాటు అతని కుటుంబీకులు పలుమార్లు తన అక్కను వేధించారన్నారు. ఇంకో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని, పిల్లలు పుడతారని తరచూ వేధించేవాడని తెలిపారు. సత్యనారాయణతో పాటు అతని కుటుంబీకులు ఏకమై అక్కని చంపేశారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు సక్రమంగా విచారణ చేపట్టాలని వేడుకుంటున్నారు. ఇదిలావుండగా ఈ కేసును పోలీసులు పునఃపరిశీలన జరుపుతున్నారు. డీఎస్పీ బర్ల ప్రసాదరావు, సీఐ వేణుగోపాలరావు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి వద్ద మృతురాలి భర్తను ప్రశ్నించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి.. సూసైడ్ నోట్
శ్రీకాకుళం, కాశీబుగ్గ: పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పలాస–కాశీబుగ్గ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన పట్నాల నాగవెంకట కనకదుర్గ(33)తో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన ముక్కామల వెంకట సత్యనారాయణకు 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా ఏలూరులో కొన్నాళ్ల పాటు ఉన్నారు. సత్యనారాయణకు రెండేళ్ల కిందట పలాస సమీపంలోని రామకృష్ణపురంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి బదిలీ అయ్యింది. అప్పటి నుంచి పలాస–కాశీ బుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర సినిమా థియేటర్ వెనుక భాగంలో ఏటీఎం అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. సంతాన లేమి క్షోభతో.. దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా స్వల్ప తగాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు బెడ్రూమ్లలో నిద్రపోయారు. బుధవారం ఉదయం సత్యనారాయణ భార్య నిద్రిస్తున్న గదికి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆమె నిద్రించిన మంచంపై సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రుల రాకకోసం ఎదురు చూస్తున్నామని, అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తామని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పిల్లలు లేకపోవడమే కారణమా..! సత్యనారాయణ దంపతులకుపిల్లలు లేరు. ఇందుకు తానే కారణమని మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కనకదుర్గ సూసైడ్ నోట్లో పేర్కొంది. పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ధారణ అయ్యిందని, తన వల్ల భర్త వంశం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంది. భర్త, అత్తమామలు చక్కగా చూసుకున్నారని, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్లో రాసి ఉంది. కాగా ఈ ఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యానుకు కట్టిన చీర నేలకు బాగా దిగువన ఉండటం, సూసైడ్నోట్లో వివరాలను సైతం అనుమానిస్తున్నారు.