బద్వేలు పట్టణంలోని వెంగమాంబ నగర్లో నివసించే కె.భువన అనే నాలుగేళ్ల చిన్నారి గురువారం విషజ్వరంతో మృతి చెందింది.
బద్వేలు అర్బన్ : పట్టణంలోని వెంగమాంబ నగర్లో నివసించే కె.భువన అనే నాలుగేళ్ల చిన్నారి గురువారం విషజ్వరంతో మృతి చెందింది. రామయ్య ,లక్ష్మిలకు ఇద్దరు ఆడపిల్లలు కాగా వారిలో చిన్న కుమార్తె భువనకు వారం రోజుల కిందట జ్వరం వచ్చింది. మూడు రోజులపాటు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా జ్వరం అదుపులోకి రాకపోగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి విషజ్వరం భారినపడి మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.