సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నా..! | collector Sarath to CM KCR Bestow upon | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నా..!

Published Fri, Jan 27 2017 3:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నా..! - Sakshi

గణతంత్ర దినోత్సవంలో జగిత్యాల కలెక్టర్‌ శరత్‌ ప్రసంగం
►ఎంపీ కవిత ముందు మోకాళ్ల మీద కూర్చొన్న సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌
►బిత్తరపోయిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు
►సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైన ఐఏఎస్‌ల తీరు


సాక్షి, జగిత్యాల: ‘జగిత్యాల నూతన జిల్లా జైత్రయాత్రలో సగౌరవంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గరగా చేరవేస్తున్న ఈ శుభ సందర్భంగా.. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన, చరిత్రాత్మక ‘జగిత్యాల ఖిల్లా’లో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి.. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా...’ అంటూ జగిత్యాల కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో సభికుల్లో కలకలం చెలరేగింది.

అంతటితో ఆగకుండా.. జగిత్యాల జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా ఖిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న నిజామాబాద్‌ ఎంపీ.. కల్వకుంట్ల కవిత గారికి శుభాభివందనాలు అన్నారు. ఇదిలా ఉంటే.. మెట్‌పల్లి సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌ అలీ ఏకంగా గ్యాలరీలో కూర్చొన్న సీఎం కుమార్తె, ఎంపీ కవిత దగ్గరికి వెళ్లి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చొని ముచ్చటించారు. దీం తో  కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు కలెక్టర్‌ శరత్‌.. సబ్‌ కలెక్టర్‌ ముషర్రఫ్‌ అలీ వ్యవహారంపైనే సభికులు చర్చించుకున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ జిల్లాకు మచ్చ తెచ్చారని చర్చించుకున్నారు. ‘ఐఏఎస్‌ల తీరు.. నేతల పాదాలకు మోకరిల్లె చూడు.. పరేడ్‌ మైదానంలో ప్రజల సాక్షిగా తలవంపులు తెచ్చెను వీరు.’ అనే పోస్టు సోషల్‌ మీడియాలో గురు వారం హాట్‌టాపిక్‌గా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement