
అధ్యాపకుల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తా..
- ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం రూరల్ : కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను అసెంబ్లీలో వినిపించి, పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనకు మంగళవారం ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు విస్మరించారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మెతో ఇంటర్ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడినా ప్రభుత్వం పరిష్కరించడానికి ఏమాత్రమూ చొరవ చూపడం లేదని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీనీ టీడీపీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, అనిల్కుమార్ గౌడ్తోపాటు కాంట్రాక్టు అధ్యాపకులు యర్రప్ప, హనుమంతరెడ్డి, సుబ్రమణ్యం, అక్బర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.