Published
Tue, Aug 16 2016 11:43 PM
| Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
పొన్నాలను కలిసిన అధ్యాపక బృందం
తెయూ(డిచ్పల్లి) : సీనియర్ రాజకీయ వేత్త, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తూ డిచ్పల్లి మండలం సుద్దపల్లి శివారులో కొద్ది సేపు విశ్రాంతి కోసం ఆగారు. ఈ సందర్భంగా కొంతమంది తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులు మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ప్రపంచంలో మార్పును తెచ్చేది, ఆవిష్కరణలకు, సృజనాత్మకతను పెంపొందించేది అధ్యాపకులే అన్నారు. అధ్యాపకుల వృత్తి అత్యంత పవిత్రమైందని, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. క్లాస్ రూంలలోనే దేశ భవిష్యత్ తయారవుతుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ పి.సాంబయ్యను నియమించడం హర్షనీయమని, ఆయనతో తనకు పరిచయముందన్నారు. ఆయన నిజాయితీ గల విద్యావేత్త అని, అందరూ వీసీకి సహకరించి, వర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పొన్నాలను కలిసిన వారిలో అధ్యాపకులు జాన్సన్, బి.వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, త్రివేణి, చంద్రశేఖర్, నాగరాజు, సత్యనారాయణ, రాజారాం, రమణాచారి, అబ్దుల్ ఖవి తదితరులున్నారు.