అలంపూర్లో నినదిస్తున్న సీపీఐ నాయకులు
అలంపూర్ : ప్రజల ఆకాంక్షమేరకు అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్నర్సింహ డిమాండ్ చేశారు. అలంపూర్ పట్టణంలో సీపీఐ జెండాను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పెద్దబాబు అతని మద్దతుదారులతో కలిసి సీపీఐ పార్టీలో చేరినట్లు తెలిపారు. బాల్నర్సింహ మాట్లాడుతూ సీపీఐ ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు చేసే వరకు ఉద్యమిస్తుందన్నారు. సీపీఐకి సాయుధ పోరాటం చేసిన ఘనత ఉందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన సువరం సుధాకర్రెడ్డి జాతీయ కార్యదర్శిగా ఎదిగి అపూర్వ గౌరవాన్ని తెచ్చారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష, ప్రతిపక్ష పార్టీల విన్నపాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా జిల్లాలను చేస్తున్నారన్నారు. గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధకరమన్నారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి సభ్యులు ఆటపాటలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా కార్యదర్శి రామంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఫయాజ్, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రాము, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.