‘సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్’లో అవినీతి
విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి ప్రభుత్వం ఠంచన్గా వేతనాలిస్తున్నా.. కొందరు ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు.. చేయి తడిపితేనే పనులు మొదలు పెడుతున్నారు.. ఈ తతంగం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు విభాగంలో ఇటీవల పెరిగిపోయింది.
-
ఏడాదిలోనే ఏసీబీకి చిక్కిన ఇద్దరు డీఐలు
ఖమ్మం జెడ్పీసెంటర్ :
విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి ప్రభుత్వం ఠంచన్గా వేతనాలిస్తున్నా.. కొందరు ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు.. చేయి తడిపితేనే పనులు మొదలు పెడుతున్నారు.. ఈ తతంగం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు విభాగంలో ఇటీవల పెరిగిపోయింది. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన భూ వివాదం పరిష్కరించాల్సిన అధికారులు పారదర్శకంగా సర్వే చేసి.. మ్యాప్ల ఆధారంగా నిజమైన వ్యక్తులకు న్యాయం చేయాలి. కానీ.. సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారులు పైసలిస్తే.. ప్రభుత్వ భూమినైనా సర్టిఫై చేస్తారనే ఆరోపణలొస్తున్నాయి. ఆక్రమణకు గురైన భూములను గుర్తించడం.. భూముల హద్దులు ఏర్పాటు చేయడం.. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు భూముల హద్దులను ఏర్పాటు చేయడం కోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖలో పని చేస్తున్న సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లకు ప్రతి నెల వేలలో జీతాలు ఇస్తుంది. కానీ.. ప్రభుత్వం ఇచ్చే వేతనాలు సరిపోవంటూ.. నిబం«దనలను తుంగలో తొక్కి.. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ ఏసీబీకి పట్టుపడుతుండటం గమనార్హం.
ఏడాదిలోనే ఇద్దరు డీఐలు..
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి ఏడాదిలోనే అవినీతి మరకలు అంటుకున్నాయి. 2015 ఆగస్టులో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శ్రీనివాసచారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడాడ్డు. మళ్లీ ఏడాదిలోనే ఆయన స్థానంలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సర్వేయర్ మురళి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గత ఏడాది బాలాజీనాయక్ అనే వ్యక్తి తన భూమికి హద్దులు చూపాలని డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారిని కోరాడు. ఎన్నెస్పీ స్థలంలో భూమి ఉందని, తర్వాత లేదని సర్టిఫై చేయడానికి శ్రీనివాసాచారి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. చారి స్థానంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ మురళి.. గురువారం బోనకల్ మండలం రాయన్నపేటకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కానూరి గోపికృష్ణ భూమిని సర్వే చేయడానికి రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు గోపికృష్ణ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటున్న మురళిని రెడ్హ్యాండెడ్గా పటుకున్నారు.
సమీక్షించిన నాలుగు రోజుల్లోనే..
భూముల సర్వే విషయంలో పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఇన్చార్జి కలెక్టర్ డి.దివ్య గత మంగళవారం సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ సర్వేయర్లకు పలు సూచనలు చేశారు. సర్వే చేసేప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని చెప్పినా.. వారం తిరగకముందే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మీసేవ ద్వారా భూమికి సంబంధించిన అనుభవదారులు సర్వే చేయించాలని దరఖాస్తు చేసుకుంటేనే సర్వే చేయాలని ఆదేశించారు. కాగా, జిల్లావ్యాప్తంగా అనేక దర ఖాస్తులు పెండింగ్లో ఉన్నా వాటిని సర్వే చేసేందుకు సర్వేయర్లు కుంటిసాకులు చెబుతున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్ పర్యవేక్షణలో మండల సర్వేయర్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ పర్యవేక్షణలో డిప్యూటీ ఇన్స్పెక్టర్లు పని చేస్తుంటారు. కానీ.. మండల, డివిజన్ రెవెన్యూ అధికారులు పాలనాపరమైన ఒత్తిడిలో ఉండడంతో కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ కొరవడింది.
భూముల ధరలకు రెక్కలు
కొత్త జిల్లాల ఏర్పాటు.. నూతన మండలాల ప్రతిపాదన అంశం తెరపైకి రావడంతో ప్రధాన నగరాలతోపాటు పలు ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో భూ వివాదాలు అధికమయ్యాయి. దీనికి తోడు కొత్త జిల్లాల ప్రతిపాదనలు రావడంతోపాటు ఇటీవల సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామాల్లో భూ వివాదాలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారులు అక్రమ వసూళ్లకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి.