మహబూబ్నగర్ వానగుట్ట ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
మహబూబ్నగర్ అర్బన్: ముస్లిం సోదరులు బక్రీద్ (ఈదుల్ జుహా) పండగను మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల, షాద్నగర్, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, అలంపూర్, దేవరకద్ర, కొడంగల్, మక్తల్, ఆత్మకూరు, అయిజ కొత్తకోట తదితర పట్టణాలు, మండలకేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్ సంబరాలను ఇస్లామిక్ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హిందూ, ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వర్షం వచ్చిన లెక్కచేయకుండా తడుస్తూనే ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. జిల్లాకేంద్రంలోని వానగుట్టపై రహెమానియా ఈద్గా మైదానంలో ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జామె మసీదు ఇమామ్ మౌలానా హాఫిజ్ ఇస్మాయిల్ ఉదయం 9గంటలకు ప్రత్యేక నమాజ్ చేయించారు. పండగ ప్రాశస్త్యాన్ని ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం పవిత్ర ఖురాన్ గ్రంథంలోని సందేశాలతో పాటు ప్రవక్త మహ్మద్ అలైహివసల్లమ్ ఆచరించిన ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. జిల్లా, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా కటాక్షించాలని అల్లాను వేడుకున్నారు.
ప్రముఖుల ఈద్ ముబార క్ ...
బక్రీద్ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తర ఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్తో పాటు ఆయా పార్టీల నేతలు ఎన్పీ వెంకటేశ్, మహ్మద్ వాజిద్, మక్సూద్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసుల భారీ బందోబస్తు...
బక్రీద్ సందర్భంగా జిల్లాకేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీసులు పహారా కాశారు.