
నేడు జడ్జిమెంట్
సీకే బాబుపై హత్యాయత్నం కేసు
►2007లో సీకే బాబు లక్ష్యంగా కాల్పులు
►గన్మెన్, ఉద్యోగి, దుండగుడు మృతి
►57 మంది సాక్ష్యుల్ని విచారించిన కోర్టు
►నేడు తుది తీర్పు.. కోర్టు వద్ద భారీ భద్రత
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లక్ష్యంగా 2007లో జరిగిన కాల్పుల ఘటనలో కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీకే అంగ రక్షకుడితోపాటు మునిసిపల్ ఉద్యోగి, అగంతకుల్లో ఒకడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాదాపు పదేళ్ల పాటు విచారణ జరిగిన తరువాత ఈ ఘటనపై కోర్టు తీర్పు వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏమి జరిగిందంటే...
2007 ఫిబ్రవరి 9వ తేదీ సమయం ఉదయం 9 గంటలు కావస్తోంది. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో ఉన్న క్లబ్కు వెళ్లడం సీకేకు అలవాటు. మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నా సీకే క్లబ్ వద్ద ఉన్న తన గదిలో అనుచరులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇంతలో తుపాకులతో వచ్చిన ఓ అగంతక ముఠా గది వద్ద ఉన్న గన్మెన్ (ఏఆర్ కానిస్టేబుల్) హుస్సేన్ బాషను తుపాకీతో కాల్పి చంపింది. అక్కడి నుంచి సీకే ఉన్న గదిలోకి వెళ్లారు. సీకే ఆయన అనుచరులు గడ్డాలతో ఉండడంతో ఎవరిని కాల్చాలో తెలియక అందరికీ గురిపెట్టారు. ఒక్క సారిగా కాల్పుల శబ్దం. కొంతమంది పరుగులు తీశారు. చిత్తూరు మునిసిపాలిటీలో పనిచేస్తున్న నావరసు అనే ఉద్యోగి దుండగుల తూటాకు బలయ్యాడు. ఆగంతకుల్లో ఓ వ్యక్తిని సీకే అంగరక్షకులు మట్టుపెట్టారు. కాలికి బుల్లెట్ తగిని ఓ వ్యక్తి, మరికొంత మంది పారిపోయారు. సీకే బాబు తృటిలో తప్పించుకున్నారు.
వీరిపై కేసులు...
2005లో అప్పటి కౌన్సిలర్, టీడీపీ నేత కటారి మోహన్పై జరిగిన హత్యాయత్నానికి ప్రతీకారంగా సీకేపై కాల్పులు జరిగాయని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా కటారి మోహన్, మోహన్ మేనల్లుడు చింటూ (మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు), సతీష్బాబు, పటాన్ సర్దార్, కటారి ప్రవీణ్ (కటారి మోహన్ కుమారుడు), శాంతకుమార్, అమర్నాథ్, శశిధర్, ప్రకాష్, సతీష్, రాజ, వెంకటాచలపతి, జలగం మురళి, త్రివిక్రమ్, ఏకాంబరంపై అభియోగాలు మోపుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. అందరినీ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
నిందితుల్లో కటారి మోహన్, శాంతకుమార్ చనిపోయారు. కాల్పులు జరిగినప్పుడే రాజా అనే వ్యక్తి కాలికి బుల్లెట్ గాయం తగలడంతో పారిపోయాడు. అతని ఆచూకీ తెలియరాలేదు. మొత్తం 94 మందిని పోలీసులు సాకు‡్ష్యలుగా చేర్చారు. ఇందులో కోర్టు 57 మందిని విచారించింది. చిత్తూరులోని 9వ జిల్లా అదనపు, సెషన్స్ కోర్టు దీనిపై సోమవారం తీర్పు వెలువరించనుంది. ముందస్తు జాగ్రత్తగా చిత్తూరు న్యాయస్థానాల సముదాయం వద్ద పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.