
పోలవరం పూర్తి చేస్తాం: అమిత్ షా
రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హామీయిచ్చారు. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తమ పార్టీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, పోలవరంకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని అన్నారు. గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా తమ ఘనతేనని, 2019 నాటికి ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తామని వాగ్దానం చేశారు. ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు ఇచ్చామని, పేదలకు లక్షా 90వేల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. కాకినాడ, విశాఖలను స్మార్ట్ సిటీలుగా చేస్తున్నామన్నారు. అమరావతికి కేంద్రం రూ. 1500 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా కేంద్రం సాయం అందిస్తోందని అమిత్ షా తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే....
రూ. 22 వేల కోట్లతో ఏపీలో ఇండస్ట్రియల్ పార్క్ కు కేంద్ర సాయం
రూ.3200 కోట్లతో మిస్సైల్ నిర్మాణ ప్రాజెక్టుకు అంగీకారం
మంగళగిరిలో రూ.1618 కోట్లతో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర సాయం
రూ. 25వేల కోట్లతో విశాఖలో హెచ్ పీసీఎల్ రిఫైనరీ యూనిట్
విజయనగరం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, విశాఖలో పెట్రోల్ యూనివర్సిటీ