అధికారులు పనితీరు మార్చుకోవాలి | officials Neglect on duty change the work style | Sakshi
Sakshi News home page

అధికారులు పనితీరు మార్చుకోవాలి

Published Sun, Jun 19 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

అధికారులు పనితీరు మార్చుకోవాలి

అధికారులు పనితీరు మార్చుకోవాలి

అధికారులపై ఎంపీ ఆగ్రహం
సమావేశ నిర్ణయాలపై పర్యవేక్షణ తప్పనిసరి
జిల్లాలో 33,396 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి
సకాలంలో పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి


ఖమ్మంసిటీ : జిల్లాలో పలు శాఖల అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని,ఇప్పటికైనా వారి పనుతీరును మార్చుకోవాలని జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ  చైర్మన్, ఎంపీ  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలుపై  శనివారం ఖమ్మంలోని టీటీడీసీ భవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

 నిర్ణయాలపై పర్యవేక్షణ చేయాలి..
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పర్యవేక్షణ లేనప్పుడు సమావేశాలు,సమీక్షలు జరపడం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తూ వాటిపై తప్పనిసరిగా మానిటరింగ్ చేస్తూ నాలుగు రోజుల్లోపు వాటిపై తీసుకున్న చర్యల గురించి కమిటీలోని సభ్యులందరికి వివరాలు అందించాలని ఆదేశించారు.అనంతరం ఎంపీ ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, స్వచ్ఛ భారత్,గిరిజన సంక్షేమ పథకాలు, జాతీయ ల్యాండ్ రికార్డుల అభివృద్ధి పథకాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. సమావేశానికి హాజరుకాని విద్యుత్ ఎస్‌ఈ ధన్‌సింగ్‌పై ఎంపీ ఆసహనం వ్యక్తం చేశారు. విద్యుత్‌శాఖ యాక్షన్ టేకెన్ రిపోర్టును సరిగా రికార్డు చేయడంలేదని,విద్యుత్ శాఖ జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్‌గా ఉన్నా దానికి సంబంధించిన సమావేశం నిర్వహించకున్న కూడా మినిట్స్ బుక్‌లో మాత్రం సమీక్ష జరిగినట్లునివేదిక ఇవ్వడం సబబుకాదన్నారు.

 వివిధ పనుల ప్రగతిపై అధికారుల వివరణ..
జిల్లాలో కనెక్టివిటీ రోడ్లు, బ్రిడ్జిల పనులు ఎంతవరకు వచ్చాయని ఎంపీ పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవీందర్‌ను ప్రశ్నించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 171 పనులు మంజూరు కాగా అందులో 165 రోడ్డు పనులు పూర్తయినట్లు, మరో రెండు రోడ్లు నిర్మాణదశలో ఉన్నాయని, 11 చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనుల్లో 9  పూర్తి చేసినటు,్ల మరొకటి నిర్మాణ దశలోఉండగా ఇంకో బ్రిడ్జి ప్రారంభం కాలేదన్నారు. 10 గ్రామీణ లింక్ రోడ్లలో  ఒకటి మాత్రమే పూర్తయిందని ఎస్‌ఈ చెప్పడంతో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఎంపీ ప్రశ్నించ గా.. కొన్ని చోట్ల ఏజెన్సీ చట్టం అడ్డుగా ఉండగా, మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుని ముందుకు రావడం లేదని ఎస్‌ఈ చెప్పడంతో టెండర్లను రద్దు చేసి  కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని సూచిస్తూ, వాటికి మళ్లీ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

 33,396 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి
జిల్లాలో స్వచ్ఛ భారత్‌లో మంజూరయిన మరుగుదొడ్ల నిర్మాణాలపై డ్వామా పీడీ టి.జగత్‌కుమార్‌రెడ్డి  వివరణ ఇస్తూ ఈజీఎస్ ద్వారా జిల్లాలోని 41 మండలాల్లో 466 గ్రామ పంచాయతీల్లో 38,617 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామని, అందులో 33, 396 మరుగుదొడ్లు పూర్తయ్యాయని, మరో 5,210 నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు ఎందుకు రావడం లేదని ఎంపీ అడగగా గ్రామీణనీటి పనుల శాఖ ఆధ్వర్యంలో మంజూరైన మరుగుదొడ్లకు నిధులు లేనందున బిల్లులు విడుదల చేయడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వివరణ ఇచ్చారు. నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ వారికి సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై ఎంపీ మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. ట్రైకార్ పథకాల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్న యూనిట్లకు బ్యాంక్ అధికారులు బ్యాంక్ కాన్సెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దీనిని సరిచేస్తూ ,టీఎస్సీ సబ్‌ప్లాన్‌లో జిల్లాకు రావాల్సిన రూ.45 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతుకు సూచించారు.

 సాదాబైనామాల కింద 1.47 లక్షల దరఖాస్తులు
భూమి రికార్డుల వివరాలపై  జేసీ దివ్య మాట్లాడుతూ జిల్లాలో సాదాబైనామాల కింద ఇప్పటి వరకు 1.47లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈనెల 22 వరకు గడువు ఉన్నందున మరికొన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలోని 910 గ్రామాల ల్యాండ్ రికార్డులకు గాను 758 గ్రామాల ల్యాండ్ రికార్డులను ఆన్‌లైన్ చేసినట్లు వివరించారు. మిగిలిన గ్రామపంచాయతీల రికార్డులను జూలై  చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే ల్యాండ్ రికార్డుల నమోదులో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జేసీ ఎంపీకి తెలపడంతో ఎంపీ జేసీని అభినందించారు.

 సమాచారం ఇవ్వకపోతే ఎలా..? ఎంపీ సీతారాం నాయక్
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపథకాలపై ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ జిల్లా అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో ఎంపిక చేసిన ఏడు మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆ యన అధికారులను ప్రశ్నించారు. ‘అభివృద్ధి పనులు ఏ స్థాయి లో ఉన్నాయనే కనీస సమాచారం ఇవ్వవద్దని, ప్రజా ప్రతినిధులకు ఏమీ చెప్పవద్దంటూ అధికారులకు ఎవరైనా కాగితాలు ఇచ్చారా..? ఉంటే వాటినైనా చూపించండి’ అని అడిగారు. స మావేశంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాల సాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రవీందర్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మురళీధరరావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రాందాస్, జెడ్పీ సీఈఓ నగేష్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి,  నామినేటెడ్ సభ్యులు భీమా శ్రీధర్, కొంగర జ్యోతిర్మయి, మట్టా దయానంద్, పలు మండలాల ఎంపీపీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement