అనుమతి తప్పనిసరి
Published Wed, Jul 27 2016 11:35 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
విజయవాడ :
మంచినీటి చేపల చెరువుల తవ్వకానికి తహసీల్దార్ల అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి చేపల చెరువుల తవ్వకానికి ఆటోక్యాడ్ సర్టిఫికెట్ అనుమతి దరఖాస్తుతో పాటు దాఖలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లాలో ఏడు మండలాల పరిధిలో 80 మంది మంచినీటి చెరువుల తవ్వకానికి పెట్టుకున్న దరఖాస్తులను కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఇకపై ఎప్పటికప్పుడు చెరువులకు అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 671 ఎకరాల విస్తీర్ణంలో మంచినీటి చేపల చెరువులకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కర విధులు నిర్వహించే గజ ఈతగాళ్ల వివరాలను వారి ఆధార్ నంబరుతో సహా పుష్కర సెల్కు అందించాలని మత్స్యశాఖ జేడీని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్లవారీగా గత ఈతగాళ్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వారికి ప్రత్యేకమైన జాకెట్తో సహా తగు డ్రెస్ కోడ్ అమలు చేయాలని చెప్పారు. అనంతరం నమూనా జాకెట్ను పరిశీలించారు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్లకు ప్రత్యేక చానల్ ద్వారా స్నానాలకు నీటిని ఏర్పాటుచేస్తున్న దృష్ట్యా అక్కడ గజ ఈతగాళ్ల అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, మత్స్య పరిశ్రమ ఆదర్శ రైతు నరసింగరాజు యాదవ్, వ్యవసాయ శాఖ డీడీ ఎస్.బాలూనాయక్, ఇరిగేషన్ ఈఈ పి.మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement