అనంతపురం అగ్రికల్చర్ : రాగల నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన విభాగం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుందన్నారు. 7 నుంచి 28 మి.మీ మేర తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఉష్ణోగ్రతలు గరిష్టం 38 నుంచి 40 డిగ్రీలు, కనిష్టం 26 నుంచి 27 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 62 నుంచి 65, మధ్యాహ్నం 40 నుంచి 42 శాతం మధ్య ఉండవచ్చని తెలిపారు. గంటకు 7 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.