
సాహితీ లోకంలో అద్వితీయుడు... సినారె
బంజారాహిల్స్: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రపంచ తెలుగు సాహితీ లోకంలో అద్వితీయుడని పలువురు వక్తలు కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి సినారె సంస్మరణ సభ మంగళవారం వర్సిటీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సాహిత్యీ అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కె.సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పల్లెల్లో వాడే భాష, మాండలికాలను తన సినీ పాటల రచనల్లో వాడి తెలంగాణ భాషను విశ్వ వ్యాప్తం చేశారన్నారు. సినారె జీవితం నేటి తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రబంధ సాహిత్యం, కావ్యరచన, ప్రాచీన కవిత్వం, జానపదం, గజల్స్, ప్రజల యాస..ఇలా ఏం రాసినా అది గొప్ప ప్రాచుర్యాన్ని పొందిందని కీర్తించారు. అంబేద్కర్ వర్సిటీ వ్యాప్తి, మౌలిక వసతుల కల్పనలో ఆయన దూర దృష్టి మర్చిపోలేనిదన్నారు.