
‘వికారాబాద్ జిల్లా’ సంబురం!
రంగారెడ్డి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ప్రాంత సమస్యలు విన్నవిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.సోమవారం స్థానిక బ్లాక్ గ్రౌండ్లో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సంబరాలను ఘనంగా నిర్వహించారు.
♦ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా
♦ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చేలా చేస్తా
♦ పేద జిల్లాగా కాదు సుసపన్నమైన జిల్లాగా మార్చుకుందాం
♦ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసుకుని, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ప్రాంత సమస్యలు విన్నవిస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక బ్లాక్ గ్రౌండ్లో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. వెనకబడిన నాలుగు నియోజకవర్గాలతో ఏర్పడిన రంగారెడ్డి జిల్లాలను అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రం చేయడం సంతోషకరంగా ఉందని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా కేంద్రం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చరని, వికారాబాద్ జిల్లా కేంద్రం చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన గుడిసె రుక్మయ్య, వీడీడీఎఫ్ సభ్యులు దేవకి దేవిలు వారి పోరాటాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గుడిసె రుక్మయ్యను మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వీడీడీఎఫ్ ఆద్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని మంత్రికి అందజేశారు. అందులో ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కేంద్రం చేసిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా.. వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేవీఆర్ వికారాబాద్ జిల్లాగా నామకరణం చేయాలని, పాలమూరు ఎత్తిపోతల పథకం నీటిని ఈ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఎంఎంటీఎస్ రైలును వికారాబాద్ వరకు పొడగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా వికారాబాద్లో గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు, మెడికల్ కళాశాల, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని అందులో కోరారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ స్టడీ సర్కిల్, అనంతగిరి, కోట్పల్లిలను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక నిధులు తీసుకురావాలని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే 1983 నుంచి ఉన్న కోట్పల్లి మండల కేంద్రం డిమాండ్ను వెంటనే కోట్పల్లిని చేయాలని కోరారు.
ఆకట్టుకున్న కళాకారుడు సాయిచంద్ర బృందం ఆట..పాట
జిల్లా కేంద్రం సంబరాల్లో మహబూబ్నగర్కు చెందిన సాయిచంద్ర కళాబృందం ధూంధాం విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న..’ అంటే పాడిన పాటకు విద్యార్థులు లేచి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వికారాబాద్ ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి, బంట్వారం ఎంపీపీ చిప్పె సుజాత, జెడ్పీటీసీలు ముత్తార్షరీఫ్, పోలీసు రాంరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ అప్ప విజయ్కుమార్, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, తహసీల్దార్ గౌతమ్కుమార్, ఎంపీడీఓ సత్తయ్య, వీడీడీఎఫ్ నాయకులు కే శ్రీనివాస్, శుభప్రద్పటేల్, రామరావుజోషి, న్యాయవాది గోవర్ధన్రెడ్డి, కే నర్సిములు, దేవదాసు, ఉమాశేఖర్, ప్యాట మల్లేశం, పెండ్యాల అనంతయ్య, తిమ్మని శంకర్, చంద్రకాంత్రెడ్డి, ఆయా కళాశాలల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, 5 వేలకు పైగా విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు.