
కోడెల శివప్రసాద్
(జె.రవీంద్ర బాబు)
నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద్ ఈ రోజు జరిగిన మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేసుకోలేకపోయారు. ఆయన కుటుంబానికి 29వ వార్డులో ఓట్లు ఉన్నాయి. అయితే ఆ వార్డులో టిడిపి అభ్యర్థి పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఈ వార్డును బిజెపికి కేటాయించారు. సాంకేతిక కారణాల వల్ల బిజెపి అభ్యర్థి రాచకొండ ప్రసాద్ నామినేషన్ను తిరస్కరించారు. డమ్మీ అభ్యర్థులు గానీ, స్వతంత్ర అభ్యర్థులు గానీ పోటీలో లేరు. ఇక ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు మాత్రమే పోటీలో ఉన్నారు. ఆ ఇద్దరులో ఒకరికి ఆయన ఓటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారిలో ఒకరికి ఆయన ఓటు వేశారు. అయితే ఆయన ఎవరికి ఓటు వేశారనేది పట్టణంలో పెద్ద చర్చనీయాంశమైంది.
ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉందన్నారు. అందువల్ల ఓటు వేశానని చెప్పారు. అయితే పోటీలో ఉన్న రెండు పార్టీలు తనకు నచ్చని, తాను వ్యతిరేకించే పార్టీలన్నారు. రెండు పార్టీలలో ఏది తక్కువ ప్రమాదకారో ఆలోచించి ఆ పార్టీకి ఓటు వేసినట్లు తెలిపారు.