రేవంత్రెడ్డికి కొడంగల్... టీ-టీడీపీ రెండో జాబితా
అర్ధరాత్రి ప్రకటించిన చంద్రబాబు..
దేవేందర్గౌడ్ తనయుడు వీరేంద్రగౌడ్కు చేవెళ్ల సీటు
ఆర్. కృష్ణయ్యకు ఎల్బీనగర్
బీజేపీకి ఝలక్.. బోథ్, దుబ్బాక స్థానాలకు పార్టీ అభ్యర్థుల ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో పోటీ చేసే మలివిడత అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంగళవారం అర్థరాత్రి విడుదల చేశారు. బీజేపీ నాయకులతో రాత్రి వేళ జరిపిన చర్చల్లో జరిగిన మార్పుల అనంతరం అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మరో 9 అసెంబ్లీ స్థానాలను బుధవారం ఉదయం ప్రకటించే అవకాశం ఉంది. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాన్ని విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికే కేటాయించారు. ఈ సీటుకోసం కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్రెడ్డి చివరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. మధ్యాహ్నం పార్టీ నేతలు సుజనాచౌదరి, పయ్యావుల కేశవ్లు చంద్రబాబుతో చర్చలు జరిపి రేవంత్రెడ్డికి ఇవ్వాలని కోరినా, వారి మాటలను పట్టించుకోలేదు.
చివరికి రాత్రి 11 గంటల సమయంలో రేవంత్రెడ్డి కూడా చంద్రబాబుతో సమావేశమై తనకు మల్కాజిగిరి లోక్సభ స్థానాన్ని కేటాయించాల్సిందిగా కోరారు. డబ్బులున్నాయని గత ఎన్నికల్లో మల్కాజ్గిరి సీటిచ్చిన తూము భీమ్సేన్ ఎన్నికలయ్యాక పార్టీకి దూరంగా ఉండడం, ఇటీవల మళ్లీ టీఆర్ఎస్లో చేరి పోటీ చేస్తుండడాన్ని ఆయన గుర్తు చేసినట్లు తెలిసింది. తనకు టిక్కెట్టు ఇవ్వకపోతే కొడంగల్ నుంచి కూడా పోటీ చేయనని తెగేసి చెప్పినట్లు సమాచారం. అయితే.. ఆయనను బుజ్జగించి కొడంగల్ నుంచే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. డబ్బుల మూటలు పట్టుకువచ్చిన మల్లారెడ్డికి మల్కాజిగిరి సీటు ఇచ్చారంటూ రేవంత్ వర్గీయులు ధ్వజమెత్తుతున్నారు. ఇక ఉప్పల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి బీజేపీకి ఇవ్వడంతో భంగపడ్డ సీనియర్ నేత దేవేందర్గౌడ్ తనయుడు వీరేందర్గౌడ్కు ఎట్టకేలకు చేవెళ్ల లోకసభ స్థానం దక్కింది. ఈ స్థానం కోసం చివరి వరకు పోరాడిన ఎర్రబెల్లి దయాకర్రావుకు నిరాశ ఎదురైంది. ఆయనకు చివరికి ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం కూడా దక్కలేదు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుకు ఖమ్మం జిల్లా మధిర సీట్లు కేటాయించారు. నల్లగొండ జిల్లా కోదాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చందర్రావుకు టికెట్టు ఇవ్వకుండా మల్లయ్యయాదవ్కు అవకాశం ఇచ్చారు. చందర్రావుకు సీటివ్వకపోతే తాను కూడా పోటీ చేయనని తెగేసి చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి మాటలను కూడా లెక్క చేయలేదు. ఇక.. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన బోథ్, దుబ్బాకల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం విశేషం.
లోక్సభ
చేవెళ్ల -వీరేంద్రగౌడ్, మల్కాజిగిరి- సి మల్లారెడ్డి, పెద్దపల్లి-జనపాటి శరత్బాబు, ఖమ్మం-నామా నాగేశ్వర్ రావు, నల్లగొండ- చిన్నపరెడ్డి,
అసెంబ్లీ స్థానాలు
సిర్పూర్- రావి శ్రీనివాస్, బెల్లంపల్లి (ఎస్సీ)- పాటి సుభద్ర, ఆసిఫాబాద్ (ఎస్టీ)- ఎం. సరస్వతి, ఖానాపూర్ (ఎస్టీ) -రితేష్ రాథోడ్, బోథ్ (ఎస్టీ)- సోయం బాబూరావు, హుజూరాబాద్- ముద్దసాని కశ్యప్ రెడ్డి, చొప్పదండి -మేడిపల్లి సత్యం, మెదక్- బట్టి జగపతి, దుబ్బాక - వెంకటయ్య, ఎల్బీనగర్- ఆర్. కృష్ణయ్య, శేరిలింగంపల్లి- అరికపూడి గాంధీ, చేవెళ్ల (ఎస్సీ)- మేకల వెంకటేశ్, జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్, నాంపల్లి- ఫిరోజ్ ఖాన్, చార్మినార్- బాసిత్, బహదుర్పుర- అబ్దుల్ రెహమాన్, కంటోన్మెంట్ (ఎస్సీ) -జి. సాయన్న, కొడంగల్- రేవంత్రెడ్డి, నారాయణపేట- రాజేందర్ రెడ్డి, జడ్చర్ల- ఎర్ర శేఖర్, దేవరకద్ర- కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, మక్తల్- కొత్తకోట దయాకర్ రెడ్డి, వనపర్తి- రావుల చంద్రశేఖర్రెడ్డి, అలంపూర్ (ఎస్సీ)- అబ్రహాం, నాగార్జునసాగర్- కడారి అంజనేయులు యాదవ్, నల్లగొండ- కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి (ఎస్సీ) - పాల్వాయి రజనీ, స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ)- దొమ్మాటి సాంబయ్య, పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్- జె. రామచంద్ర నాయక్, మహబూబాబాద్ (ఎస్టీ)- బాలూ చౌహాన్, మధిర (ఎస్సీ)-మోత్కుపల్లి నర్సింహులు, సత్తుపల్లి (ఎస్సీ)- సండ్ర వెంకట వీరయ్య, భద్రాచలం (ఎస్టీ)- ఫణీశ్వరి, ఖమ్మం- తుమ్మల నాగేశ్వర్ రావు, జుక్కల్ - మద్దెల నవీన్, కుత్బుల్లాపూర్- కేపి వివేకానంద, భూపాల్పల్లి-గండ్ర సత్యనారాయణ, సికింద్రాబాద్- కూన వెంకటేశం గౌడ్, ఆర్మూర్- రాజారాం యాదవ్, ఇల్లందు: హరిప్రియ, నిర్మల్ - మీర్జా యాసీన్ బేగ్, పాలేరు - స్వర్ణకుమారి, కొత్తగూడెం - బాలసాని లక్ష్మీనారాయణ.
మల్కాజ్గిరి మల్లారెడ్డికే
Published Wed, Apr 9 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement