జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందులో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తు ఫారాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు సవరించుకోవచ్చని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది.
పొరపాట్ల సవరణకు విద్యార్థులు ఆన్లైన్లో వచ్చే నెల 4వ తేదీ వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఫీజు చెల్లింపు వర్తించే వారు క్రెడిట్కార్డు/డెబిట్ కార్డు, ఈ చలానా రూపంలో చెల్లించవచ్చని వివరించింది. అయితే ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు ఆఫ్లైన్లో ఏప్రిల్ 2వ తేదీన జరిగే రాత పరీక్షకు మార్పు చేసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. దరఖాస్తులకు సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ పేర్కొంది. ఈమేరకు జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ప్రత్యేక లింక్ను పొందుపర్చింది.