పాతబస్తీలోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సునీల్జోషి హత్య కేసులో జాతీయ...
=జితేందర్ను పట్టుకున్న ఎన్ఐఏ
=‘మక్కా’ విధ్వంసంలో జోషి ఐదో నిందితుడు
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న సునీల్జోషి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ రూరల్ బీజేవైఎం ఉపాధ్యక్షుడు జితేంద్ర శర్మను గత శనివారం పట్టుకున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ‘మక్కా’ విధ్వంసంలో కీలక పాత్ర పోషించిన సునీల్జోషి మాలేగావ్, సంరతా ఎక్స్ప్రెస్, అజ్మీర్ దర్గా తదితర పేలుళ్లలోనూ పాత్రధారిగా ఉన్నాడు.
పథకం వేసింది సునీలే...
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్లో 2006 మార్చి 7న బాంబు పేలుడు జరిగింది. ఈ ఆలయంతో పాటు అక్కడి కం టోన్మెంట్ రైల్వే స్టేషన్లో జరిగిన పేలుడులో దాదాపు 21 మంది చనిపోగా.. 70 మంది గాయపడ్డారు. ఇది లష్కరేతోయిబా పనిగా నిఘా వర్గాలు అనుమానించాయి. అయితే, దీనికి సంబంధించిన ఎలాంటి ఆ ధారాలు సేకరించలేకపోవడంతో కేసు కొలిక్కి రాలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సునీల్జోషి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఇండోర్కే చెందిన లోకేష్ శర్మ, రామ్చంద్ర కస్లంఘర్, సందీప్ థాంగే, అజ్మీర్కు చెందిన దేవేంద్రగుప్తాలతో మాడ్యు ల్ ఏర్పాటు చేశాడు. నవ్కుమార్ అలియాస్ స్వామీ అశిమానంద వీరందరికి వెనుకుండి నడిపించాడు.
షెల్స్ సైతం తయారు చేయించాడు...
ఈ మాడ్యుల్ దేశ వ్యాప్తంగా ఉన్న ఓ వర్గానికి చెందిన ప్రార్థనా స్థలాలను టార్గెట్ చేసింది. తమ టార్గెట్లో ఒకటైన మక్కా మసీదులో పేలుడుకు భారీ స్కెచ్ వేసింది. ఈ కుట్ర మొత్తం ఇండోర్లో అశిమానంద ఆదేశాలతో సునీల్జోషి నేతృత్వంలో జరిగింది. అవసరమైన ఆర్థిక సహకారం సందీప్ ధాంగే అందించాడు. మక్కా, అజ్మీర్ పేలుళ్లలో ముష్కరులు షేప్డ్ బాంబులను వాడారు. ఇనుప షెల్స్లో ఆర్టీఎక్స్ను నింపి సెల్ ఫోన్ అలారం ద్వారా సర్క్యూట్ పూర్తి చేసి పేల్చారు. ఈ షెల్స్ను సునీల్ జోషి ఇండోర్లోని ఓ కర్మాగారంలో తయారు చేయించాడు. పేలుడుకు అవసరమైన సిమ్కార్డులను దేవేంద్రగుప్తా జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్స్లో కొనుగోలు చేశాడు. సెల్ఫోన్లను ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్లో కొన్నారు. పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే ఈ రకంగా వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేశారు.
లష్కర్లోని లాడ్జిలో బస చేసి...
హైదరాబాద్తో పరిచయం ఉన్న లోకేష్శర్మను ‘మక్కా’లో రెక్కీ కోసం పంపాడు. ఇది పూర్తయ్యాక పేలుడుకు మూడు రోజుల ముందు (2007 మే 15) సునీల్జోషితో పాటు సందీప్ ధాంగే, రామ్చంద్ర కస్లంఘర్ నగరానికి వచ్చి సికింద్రాబాద్లోని లాడ్జిలో బస చేశా రు. తమతో తెచ్చిన షెల్స్లో ఆర్టీఎక్స్ బాంబ్స్ తయా రు చేశారు. రెండు బాంబులను తీసుకుని మే 18 మ ధ్యాహ్నం మక్కా మసీదు వద్దకు చేరుకున్న సందీప్, రామ్చంద్ర, సునీల్జోషిలు వాటిని అక్కడి రెండు ప్రాంతాల్లో పెట్టి పేల్చారు. ఇది జరిగిన దాదాపు ఏడు నెలలకు 2007 డిసెంబర్ 29న ఇండోర్కు 200 కిమీ దూరంలోని దేవాస్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తు లు జరిపిన కాల్పుల్లో సునీల్జోషి మరణించాడు.
ముడివిప్పిన ఎన్ఐఏ అధికారులు...
సునీల్ జోషి హత్య కేసు మిస్టరీని ఛేదించడంలో విఫలమైన దేవాస్ పోలీసులు కొన్ని రోజులకే కేసును మూసేశారు. అయితే ‘మక్కా’ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ జోషి హత్య కేసును రీ-ఓపెన్ చేసింది. జోషి హత్య జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఎలాంటి ఆధారాలు దొరక్కుండా క్రైమ్ సీన్ మార్చేశారని, హతుడి మూడు సెల్ఫోన్లలో రెండు మాయమయ్యాయని ఎన్ఐఏ గుర్తించింది. కీలక ఆధారాలు సేకరించి 2011లో ఇద్దరిని అరెస్టు చేసింది. తాజాగా గత శనివారం మరో నిందితుడు జితేందర్ శర్మను జైల్లోకి పంపింది. స్థాని కంగా నిర్వహిస్తున్న ఓ వైన్షాపు విషయంలో తలెత్తిన విభేదాలకు తోడు ఇదే మాడ్యుల్కు చెందిన ఠాకూర్ ప్రజ్ఞాసింగ్ సాథ్వీ (మాలేగావ్ కేసులో నింది తురాలు)తో దురుసుగా ప్రవర్తించినందుకే సునీల్జోషి హత్యకు గురైనట్లు ఎన్ఐఏ భావిస్తోంది.