Madhya Pradesh Elections 2018
-
నేడే కమల్నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని జంబోరీ మైదానంలో ఈ వేడుక ఉంటుందనీ, ప్రమాణ స్వీకారానికి ముందు సర్వమత ప్రార్థనలు ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు శోభా ఓజా ఆదివారం చెప్పారు. కమల్నాథ్ ప్రమాణం చేశాక గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోతారనీ, అనంతరం కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని శోభా చెప్పారు. ఇతర మంత్రులెవరూ లేకుండా కమల్నాథ్ మాత్రమే సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవె గౌడ, కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి తదితరులు ప్రమాణ స్వీకార వేడుకకు రానున్నారని ఓజా చెప్పారు. ఇటీవలి మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే. 15 వరుస సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటు కాబోతోంది. వింధ్య ప్రాంతంలో ఓటింగ్ సరళిపై విచారణ మధ్యప్రదేశ్లోని వింధ్య ప్రాంతంలో కాంగ్రెస్కు అతి తక్కువ సీట్లు రావడంతో ఈ ప్రాంతంలోని ఓటింగ్ సరళిపై విచారణ జరిపించనున్నట్లు కమల్నా«ద్ తెలిపారు. ఇక్కడి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 30 శాసనసభ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్కు కేవలం 6 సీట్లే దక్కాయి. -
చింద్వాడా నుంచే కమల్నాథ్ పోటీ
భోపాల్: మధ్యప్రదేశ్లోని తన సొంత జిల్లా చింద్వాడాలో కాంగ్రెస్ అత్యధిక ఆధిక్యంతో గెలుపొందిన నియోజకవర్గం నుంచి తాను త్వరలో పోటీ చేస్తానని మధ్యప్రదేశ్ కాబోయే సీఎం కమల్నాథ్ చెప్పారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో కమల్నాథ్ పోటీ చేయకపోయినప్పటికీ ఆయనను మధ్యప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయడం తెలిసిందే. దీంతో నిబంధనల ప్రకారం సీఎం పదవిలో ఆయన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావడం తప్పనిసరి. ఇక చింద్వాడా జిల్లాలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో నాలుగు ఎస్సీ/ఎస్టీ రిజర్వ్డు స్థానాలు. దీంతో మిగిలిన మూడు స్థానాలైన చింద్వాడా, చౌరాయ్, సౌన్సర్లలో ఏదో ఓ చోటు నుంచి కమల్ చేయొచ్చు. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలవగా, ఈ మూడింటిలో అత్యధిక ఆధిక్యం కాంగ్రెస్కు చింద్వాడాలోనే లభించింది. కమల్ ఇల్లు, ఓటరు జాబితాలో పేరు చింద్వాడాలో ఉన్నాయి. దీంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి శాసనసభకు ఎన్నికవుతారని సమాచారం. చింద్వాడాలో కాంగ్రెస్ తరఫున శాసనసభకు ఎన్నికైన దీపక్ సక్సేనా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయక తప్పని పరిస్థితి. ప్రమాణానికి రాహుల్, మమత కమల్నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులకు కూడా కమల్నాథ్ ఆహ్వానాలు పంపారని సమాచారం. -
నేను ఇప్పటికీ మధ్యప్రదేశ్ సీఎంనే : చౌహాన్
భోపాల్ : మధ్యప్రదేశ్లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఓటమిని హుందాగా అంగీకరిస్తూ సీఎం పదవికి శివరాజ్ సింగ్ రాజీనామా కూడా చేశారు. అయినప్పటికీ తాను మధ్య ప్రదేశ్ సీఎంనేనని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం మధ్య ప్రదేశ్ చీఫ్ మినిస్టర్( సీఎం) కాదని, కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని పేర్కొన్నారు. తన ట్విటర్లోని బయోడేటాలో చీప్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ను తొలగించి కామన్ మ్యాన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చేర్చారు. ‘ మధ్యప్రదేశ్ రాష్ట్రం నా గుడి, రాష్ట్ర ప్రజలు నా దేవుళ్లు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ ప్రజల కోసం తెరచే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ఎలాంటి సంశయం లేకుండా నా దగ్గరకు రావోచ్చు. ఎప్పటిలాగే మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తా’ అని ట్విటర్లో చౌహాన్ పేర్కొన్నారు. मध्यप्रदेश मेरा मंदिर हैं, और यहाँ की जनता मेरी भगवान। मेरे घर के दरवाज़े आज भी प्रदेश के हर नागरिक के लिए हमेशा खुले हैं, वो बिना कोई हिचकिचाहट मेरे पास आ सकते हैं, और मैं हमेशा की तरह उनकी यथासंभव मदद करता रहूँगा। — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) December 14, 2018 తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కావడంతో ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) లతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ఆ ఎమ్మెల్యేలు చాలా ప్రమాదకరం..!
భోపాల్ : హత్యలు, అత్యాచారాలు చేసిన నేరస్తులు జైలులోపల శిక్ష అనుభవించాల్సింది పోయి శాసన సభ్యులుగా అవతారమెత్తుతున్నారు. అధికార బలంతో శిక్షలు తగ్గించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, అండ బలంతో దందాలు చేసేవారు మరికొందరు. తాజాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల ట్రాక్ రికార్డు చూస్తే ఇవే విషయాలు గుర్తుకువస్తున్నాయి. శాసనసభకు ఎన్నికైన 230 మంది సభ్యుల్లో 94 మంది ప్రమాదకరమైన క్రిమినల్, హత్య కేసులు ఎదుర్కొంటున్న వారే. వీరిలో 47 మందిపై మర్డర్ కేసులు, మహిళలపై అత్యాచార కేసులు ఇదివరకే రుజువైనాయి. అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్ (ఏడీబీ) అనే సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 56 మంది (49శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలగా, బీజేపీకి చెందిన 34 మంది నేర చరిత్ర ఉన్నవారే అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారం (ఐపీసీ సెక్షన్ 354, మహిళలపై వేధింపులు సెక్షన్ 498ఏ) వంటి కేసులను ఎదురుక్కొంటున్నారు. అంతేగాకా అసెంబ్లీకి ఎన్నికైన 230 మందిలో 187 (81శాతం) సభ్యులపై అవినీతి అరోపణలు ఉన్నట్లు తెలింది. ఆస్తుల్లో తామేమీ తక్కువ కానట్లు 80శాతం పైగా సభ్యులు కోటికి పైగా ఆస్తులు ఉన్నవారు చట్టసభకు ఎన్నికయ్యారు. -
17న కమల్నాథ్ ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్(72) ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయన గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను కలిశారు. ఆయన వెంట సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, సురేశ్ పచౌరీ, వివేక్ తన్ఖా, అరుణ్ యాదవ్ తదితరులున్నారు. వారి భేటీ సుమారు 50 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా గవర్నర్..‘రాజ్యాంగంలోని ఆర్టికల్–164 ప్రకారం అసెంబ్లీలోని అతిపెద్ద పార్టీ నేతగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియమిస్తున్నాను. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’ అంటూ కమల్నాథ్కు ఆమె ఓ లేఖ అందజేశారు. అనంతరం రాజ్భవన్ వెలుపల కమల్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..భోపాల్లోని లాల్పరేడ్ గ్రౌండ్లో 17వ తేదీ మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కేంద్ర కేబినెట్లో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవమున్న కమల్నాథ్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అసెంబ్లీలోని 230 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకోగా ఎస్పీ(1), బీఎస్పీ(2), స్వతంత్రులు(4) కలిపి 121 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 109 స్థానాలను మాత్రం గెలుచుకుంది. అపార అనుభవం, ఆర్థిక బలం కమల్నాథ్ను సీఎంగా ఎంపిక చేయడం వెనుక ప్రధాన కారణాలు ఇవి.. ► రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో అపార అనుభవం. ఆయా రంగాల్లో కీలక భూమికలను విజయవంతంగా నిర్వహించిన దక్షత. ► నిధుల సమీకరణలో దిట్ట. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీ రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. దశాబ్దానికి పైగా అధికారంలో లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ దివాళా స్థితిలో ఉంది. ఈ స్థితి నుంచి ఆర్థికంగా పార్టీని గట్టెక్కించారు. ► 9 సార్లు లోక్సభకు ఎన్నిక. మోదీ హవాను తట్టుకుని ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగా పలు కీలకపదవుల్లో పనిచేశారు. ► దేశంలోని వ్యాపార దిగ్గజాలతో సత్సంబంధాలు. ► రాష్ట్ర రాజకీయాలపై పట్టు. అన్ని వర్గాలతో సంబంధాలు. కార్యకర్తల్లో సింధియాపై ఉన్నది ఆకర్షణ అని, కమల్ నాథ్పై ఉన్నది అభిమానమని అంటుంటారు. పార్టీలో అంతర్గత వర్గ పోరాటాలపై అవగాహన, వాటిని చక్కదిద్దే సామర్ధ్యం. పీసీసీ చీఫ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు వర్గ కుమ్ములాటలను విజయవంతంగా అదుపు చేశారు, అందరిని ఒక్కటి చేశారు. ► గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం. డూన్ స్కూల్లోనే సంజయ్ గాంధీతో స్నేహం. ఇందిరతో కొడుకులాంటి అనుబంధం. సోనియా, రాహుల్లకు విశ్వసనీయ సలహాదారు. ► ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్(114), బీజేపీ(109)ల స్థానాల్లో పెద్ద తేడా లేదు. మిత్ర పక్షాల మద్దతుతో మేజిక్ మార్క్ అయిన 116 సాధించింది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టకుండా కాచుకోవడం కమల్నాథ్ వల్లనే సాధ్యమన్న నమ్మకం. ► లోక్సభ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే అనుభవం, ఆర్థిక బలం, వ్యూహ నైపుణ్యం ఉన్న కమల్ సీఎంగా ఉండటం పార్టీకి అవసరం. ► 72 ఏళ్ల వయస్సు మరో కారణం. రాజకీయాల్లో మరి ఎన్నాళ్లో కొనసాగకపోవచ్చు. సింధియా యువకుడు. బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంది. -
సింధియాలకు అందని సీఎం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం పీఠం సింధియా కుటుంబాన్ని ఊరిస్తోంది. సీఎం అవుతారని అందరూ భావించినా జ్యోతిరాదిత్య సింధియాను కాదని సీనియర్ అయిన కమల్నాథ్ను అధిష్టానం ఎంపిక చేసింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవ్రావు సింధియాకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. అప్పట్లో అర్జున్సింగ్ ఆయనకు సీఎం పీఠం దక్కకుండా చక్రం తిప్పారు. సీఎం రేసులో కమల్నాథ్తో పోటాపోటీగా తుదిదాకా జ్యోతిరాదిత్య ముందున్నారు. గుణ ఎంపీ అయిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు తీసుకుని, పార్టీని విజయతీరాలకు నడిపించారు. 9 పర్యాయాలు ఎంపీ అయిన కమల్నాథ్ తన సీనియారిటీతోపాటు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు పొందడం ద్వారా సీఎం రేసులో పైచేయి సాధించారు. జ్యోతిరాదిత్యను సీఎం పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించేవారు. అయితే, కమల్నాథ్(72)వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 1989లో జ్యోతిరాదిత్య తండ్రి మాధవ్రావు సింధియా విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అప్పట్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్సింగ్ చుర్హాత్ లాటరీ స్కాంలో ఇరుక్కోవడంతో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే, గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మాధవ్రావు సింధియాకు సీఎం కుర్చీ అప్పగించరాదనే హామీని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నుంచి తీసుకున్న తర్వాతే అర్జున్సింగ్ పదవి నుంచి వైదొలిగారు. అంతేకాదు, తన వర్గం ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు చేశారు. సీఎం పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న మాధవ్రావు సింధియా కూడా భోపాల్లో మద్దతుదారులతో వేరుగా మకాం వేశారు. అయితే, అధిష్టానం మోతీలాల్ వోరాను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో మాధవ్రావు సింధియా తీవ్ర నిరాశ చెందారు. గ్వాలియర్ సంస్థానాధీశుల వారసుడు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన నానమ్మ రాజమాత విజయరాజే సింధియా జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1971 ఎన్నికల్లో జనసంఘ్ తరఫున విజయరాజేతోపాటు మాధవ్రావు సింధియా కూడా పోటీ చేసి, గెలుపొందారు. అప్పట్లో ఇందిర ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన అతికొద్ది మందిలో వీరు కూడా ఉన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విజయరాజేను కూడా ప్రభుత్వం జైలుపాలు చేసింది. అయితే, మాధవ్రావు సింధియా 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన తోబుట్టువులు వసుంధరా రాజే, యశోధరా రాజే బీజేపీలో చేరారు. -
‘పార్టీకి పట్టం కట్టేందుకే పాటుపడ్డా’
న్యూఢిల్లీ : పార్టీని అధికారంలోకి తేవడానికే కసితో పనిచేశానని, సీఎం పదవిని చేపట్టాలనే దాహం తనకు లేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న కమల్నాథ్ పేర్కొన్నారు. తాను దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మధ్యప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సీఎం ఆశావహులు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్లకు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో సింధియా క్యాంప్, దిగ్విజయ్ క్యాంప్, కమల్నాథ్ క్యాంప్ అంటూ ఏమీ లేవన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మోదీ, అమిత్ షా విన్నింగ్ కాంబినేషన్కు మధ్యప్రదేశ్లో చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్ను కలవడంపై కమల్నాథ్ స్పందిస్తూ గోవాలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మధ్యప్రదేశ్లో తమకు తగినంత మెజారిటీ ఉన్నందునే గవర్నర్తో భేటీ అయ్యామన్నారు. మాయావతితో తాను మాట్లాడానని, తమకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించారని, ఎస్పీ సైతం సహకరించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. వారు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్నాథ్ వెల్లడించారు. అవి తప్పుడు ఆరోపణలు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై ఎలాంటి అభియోగాలు లేవని, తనపై ఆరోపణలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సిక్కు వ్యతిరేక ఘర్షణలపై ఏర్పాటైన నానావతి కమిషన్ సరైన ఆధారాలు లేవంటూ కమల్నాథ్పై అభియోగాలను తోసిపుచ్చింది. కాగా సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్న కమల్నాథ్కు మధ్యప్రదేశ్ సీఎం పదవి కట్టబెట్టడాన్ని సిక్కు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ను ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఢిల్లీకి చెందిన అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా హెచ్చరించారు. -
మధ్యప్రదేశ్కు కమలనాథుడే
సాక్షి, ప్రతినిధి, న్యూఢిల్లీ: సుదీర్ఘ చర్చల అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడింది. ఫలితాలు విడుదలైన దాదాపు 24 గంటల అనంతరం కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్ పీఠంపై కూర్చోనున్నది ఎవరో తేలింది. తీవ్ర ఉత్కంఠ అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత కమల్నాథ్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఊహాగానాలకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో పార్టీ ట్వీటర్ హ్యాండిల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథేనంటూ స్పష్టత ఇచ్చింది. దాంతో భోపాల్, తదితర మధ్యప్రదేశ్ నగరాల్లో కమల్నాథ్ అభిమానాలు బాణాసంచాతో సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందే కమల్ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియాలు భోపాల్ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమల్నాథ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను కలవనున్నారు. మరోవైపు, రాజస్తాన్ విషయంలోనూ పార్టీ అగ్ర నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న సీనియర్ నేత అశోక్ గహ్లోత్, యువ నాయకుడు సచిన్ పైలట్ తమ పట్టు వీడకపోవడంతో నిర్ణయం తీసుకోవడం పార్టీ చీఫ్ రాహుల్కి కత్తి మీద సాములా మారింది. ఈ రెండు రాష్ట్రాల సీఎం ఎంపికే ఒక కొలిక్కి రాకపోవడంతో.. చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ఎంపికను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, తమ అభిమాన నేతనే సీఎంగా ప్రకటించాలంటూ పలు చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో రాజస్తాన్లో స్వల్ప హింస చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడి దాదాపు 2 రోజులు గడుస్తున్నా సీఎం ఎంపిక పూర్తి కాకపోవడంపై బీజేపీ నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. సీఎం పదవికి రేసు ఏదీ లేదు: సింధియా ప్రజలకు సేవ చేసేందుకే తాము ఉన్నామనీ, సీఎం పదవి కోసం పరుగుపందెం ఏదీ జరగడం లేదని రాహుల్తో చర్చల అనంతరం జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రాహుల్తో సింధియా, కమల్నాథ్లు విడివిడిగా భేటీ అయిన అనంతరం ఇరువురితో కలిసి రాహుల్ ఫొటో తీసుకుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కాలం, ఓరిమి.. ఇవే అత్యంత శక్తిమంతమైన యోధులు’ అనే ప్రఖ్యాత రచయిత లియొ టాల్స్టాయ్ వ్యాఖ్యను ట్వీట్తో జతపరిచారు. రాజస్తాన్ నిరసనల్లో హింస తమ అభిమాన నాయకుడినే సీఎంగా ప్రకటించాలంటూ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయాలు సహా పలుచోట్ల ఆందోళనలకు దిగారు. సచిన్ మద్దతుదారులు ఢిల్లీలో రాహుల్ నివాసం బయట నినాదాలు చేశారు. రాజస్తాన్లో పార్టీ కార్యకర్తల నిరసనల్లో స్వల్ప హింస చెలరేగింది. దౌసా, అజ్మీర్, కరౌలీ ప్రాంతాల్లో సచిన్ పైలట్ మద్దతుదారులు రోడ్లపై వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. సంయమనంతో ఉండాలని సచిన్తోపాటు గెహ్లోత్ కార్యకర్తలను కోరారు. రాహుల్, సోనియాలపై నమ్మకం ఉందనీ, కార్యకర్తలు సంయమనంతో ఉండాలని పైలట్ తన వర్గం వారిని కోరారు. ఛత్తీస్గఢ్పై నిర్ణయం నేడు ఛత్తీస్గఢ్ సీఎం ఎంపిక నేటికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపికలో తలమునకలైన కాంగ్రెస్ అగ్రనేతలు.. చత్తీస్గఢ్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారని సమాచారం. అయితే, రాష్ట్రంలో పార్టీ పరిశీలకుడు మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను, రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తే రూపొందించిన తన నివేదికను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందించారు. చత్తీస్గఢ్లో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్, ఓబీసీ నేత తామ్రధ్వజ్ సాహు, సీనియర్ నేతలు టీఎస్ సింగ్ దేవ్, చరణ్సింగ్ మహంత్లు సీఎం రేసులో ఉన్నారు. 15 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన బఘేల్కే సీఎం పీఠం దక్కే చాన్సుంది. 1984 అల్లర్లలో పాత్రపై ఆరోపణలు మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ను ఎంపిక చేయడం ద్వారా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. ‘గాంధీ కుటుంబం అధికారంలో ఎప్పుడొచ్చినా 1984 అల్లర్ల నిందితులను కాపాడుతుంది. ఇప్పుడు కమల్నాథ్ను మధ్యప్రదేశ్కు సీఎంను చేయడం ద్వారా ఆయనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కానుక ఇస్తున్నారు’ అని మంజీందర్ అన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్నాథ్ పాత్ర కూడా ఉందని అకాలీదళ్ గతం నుంచీ ఆరోపిస్తోంది. ‘సిక్కు వ్యతిరేక అల్లర్లలో అమాయకుల ప్రాణాలు తీసినవారు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ సందేశమిస్తున్నారు. ఆ ఘాతకుల వెనుక తాము ఉన్నామనీ, సిక్కులను చంపినందుకు బహుమతులు ఇస్తామని ఆయన అంటున్నారు’ అని మంజీందర్ అన్నారు. గతంలో కమల్నాథ్ను పంజాబ్, హరియాణాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పుడూ పలువురు సిక్కులు వ్యతిరేకించడంతో ఆయనను అప్పట్లో పంజాబ్ బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత కమల్నాథ్ హస్తం ఉందనేందుకు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టు లాయర్ హెచ్ఎస్ ఫూల్కా కూడా తెలిపారు. ‘కమల్నాథ్కు వ్యతిరేకంగా అవసరమైనన్ని సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. అయితే, చట్టం ముందు ఆయన నిలబడాల్సిన సమయం ఇంకా ఆసన్నం కాలేదు. కానీ, ఇటువంటి వ్యక్తిని మధ్యప్రదేశ్ సీఎంగా నియమించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది రాహుల్ గాంధీనే’ అని అల్లర్ల బాధితుల పక్షాన వాదిస్తున్న ఫూల్కా అన్నారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో ఢిల్లీలో సిక్కులు ఊచకోతకు గురవడం తెలిసిందే. ఉదయం నుంచి ఉత్కంఠ మధ్యప్రదేశ్, రాజస్తాన్ ముఖ్యమంత్రుల ఎంపిక కోసం చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం ఉదయమే ప్రారంభించారు. ఇందుకు గాను ఆయా రాష్ట్రాల సీఎం ఆశావహులతో పాటు, పార్టీ పరిశీలకులు, సీనియర్ నేతలను ఢిల్లీకి పిలిపించారు. రాహుల్కు సహాయంగా ఆయన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా కూడా చర్చల్లో పాల్గొన్నారు. రాహుల్ నివాసంలో జరిగిన ఈ చర్చల్లో మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థులుగా ఉన్న కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలతో.. రాజస్తాన్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లతో ఉమ్మడిగా, వేర్వేరుగా చర్చలు జరిపారు. యువ నేతలైన సింధియా, పైలట్ల వైపు రాహుల్, ప్రియాంక మొగ్గుచూపగా..అనుభవాన్ని, 2019 లోక్సభ ఎన్నికల అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న సోనియా గాంధీ సీనియర్లైన కమల్ నాథ్, గహ్లోత్లకు మద్దతిచ్చినట్లు సమాచారం. మధ్యప్రదశ్ విషయంలో కమల్నాథ్ను సీఎంగా అంగీకరించేలా జ్యోతిరాదిత్య సింధియాను రాహుల్, ప్రియాంకలు ఒప్పించారని, సచిన్ పైలట్ మాత్రం గహ్లోత్ను ముఖ్యమంత్రిగా నియమించడాన్ని తీవ్రంగా నిరసించాడని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ఎంపికను ఖరారు చేసిన రాహుల్.. రాజస్తాన్ అంశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి పలు దఫాలుగా జరిగిన చర్చల్లో రాజస్తాన్కు కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్, ఆ రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జ్ అవినాశ్ పాండే, మధ్యప్రదేశ్ కేంద్ర పరిశీలకుడు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
నా వల్లే బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది!
సాక్షి, విశాఖపట్నం: ‘నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో(రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఐ–హబ్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. సాయంత్రం తగరపువలస జూట్మిల్ గ్రౌండ్స్లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్తో ముందుకెళ్తే తప్పా! తెలంగాణ ఎన్నికల్లో నా వల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్లామని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్తో కూడా వెళ్లడానికి వీల్లేదని అడ్డుజెప్పారు. నేను అక్కడ పని చేయడం తప్పయినట్టు.. నాకేదో రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?..’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లివ్వాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. మోదీని ఎలా బతిమిలాడానో అందరూ చూశారు.. మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని.. కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ‘సార్.. సార్..’ అంటూ ఎలా బతిమలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మెడ్టెక్’తో విశాఖకు విశ్వఖ్యాతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్(ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన ఏపీ మెడ్టెక్ జోన్ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీలో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు. -
శభాష్.. శివరాజ్..!
‘గెలుపైనా.. ఓటమైనా... నేను భయపడను.కర్తవ్య నిర్వహణ పథంలో ఏది ఎదురయినా దాన్ని స్వీకరిస్తాను’ సీఎం పదవికి రాజీనామా చేసే ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలు 2018 ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్న మాటలివి. శివ మంగళ్ సింగ్ అనే కవి రాసిన కవితలోని పంక్తులివి. గత పదిహేనేళ్లుగా అనుభవిస్తున్న ముఖ్యమంత్రిత్వం చేజారిపోయిందన్న బాధ ఆయనలో కనిపించడం లేదు. తన కుర్చీని లాక్కున్న ప్రతిపక్షంపై ఆగ్రహమూ వ్యక్తం చేయ లేదు.ఓటమికి సాకులు వెతకలేదు. స్థిత ప్రజ్ఞుడిలా ప్రశాంత చిత్తంతో పదవి నుంచి హుందాగా తప్పుకున్న చౌహాన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పార్టీ ఓటమికి పూర్తి నైతిక బాధ్యత తానే వహిస్తున్నట్టు చెప్పారు. అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ను హృదయపూర్వకంగా అభినందించారు. ఒక కుటుంబ సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్నదే తన కోరికన్నారు. తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని కూడా కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ట్రై చేద్దాం తాజా ఎన్నికల్లో అతి తక్కువ సీట్ల తేడాతో అధికార బీజేపీ పరాజయం పాలవడం తెలిసిందే. ఏ పార్టీకీ కూడా సంపూర్ణ మెజారిటీ రాని నేపథ్యంలో.. గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరుదామని బీజేపీ అధినాయకత్వం చౌహాన్కు సూచించింది. అయితే, ప్రజలు మనకు మెజారిటీ ఇవ్వలేదు, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కులేదు అన్ని స్పష్టంగా చెప్పడం చౌహాన్ నిజాయితీకి నిదర్శనం. రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేసిన తర్వాత ఇప్పుడు నేను హాయిగా ఉన్నానని విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ‘నా రాజీనామాను గౌరవనీయ గవర్నర్కు అందజేశాను. ఈ ఓటమి బాధ్యత పూర్తిగా నాదే. కాంగ్రెస్ నేత కమల్నాథ్ను అభినందిస్తున్నాను’ అన్నారు. అంతేకాకుండా బీజేపీకి ఓటు వేసినందుకు ఓటర్లకు ట్విట్టర్లో కృతజ్ఞతలు కూడా చెప్పారు. ‘మీరు చూపించిన అపరిమిత ఆప్యాయత, విశ్వాసాలను, మీ దీవెనలను జీవితాంతం గుర్తుంచుకుంటాను’ అని పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన 59 ఏళ్ల చౌహాన్ను రాష్ట్ర ప్రజలు అభిమానంతో మామ అని పిలుచుకుంటారు. ఆశ్రిత పక్షపాతం, అవినీతితో నిండిన ప్రస్తుత రాజకీయాల్లో ఉంటూ కూడా ఆ అవలక్షణాలు ఏమాత్రం అంటని సచ్చీలుడు చౌహాన్. చౌహాన్కు అభినందనల ట్వీట్లు ప్రజల ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించారు. ప్రజాభీష్టం ఏమిటో తెలిసి ప్రశాంతంగా అధికార మార్పిడికి సిద్దపడ్డారు. -సాగరిక ఘోష్, సీనియర్ జర్నలిస్ట్ మధ్య ప్రదేశ్ ప్రజల తీర్పును గౌరవిస్తూ కర్ణాటకలోలా బేరసారాలకు దిగకుండా హుందాగా తప్పుకోవడం ద్వారా చౌహాన్జీ మన అత్యంత హుందాగల రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిరూపించుకున్నారు. వాజ్పేయి మలిచిన బీజేపీ నాయకుడాయన. -శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్ట్ గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కలుసుకున్నప్పుడు ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ చౌహాన్జీని ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంతో హుందాగా, సౌమ్యంగా మాట్లాడతారని, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు. మన్మోహన్జీ మాటలు నిజమేనని చౌహాన్ ఈ రోజు నిరూపించారు. -అల్కా లాంబ, ఢిల్లీ ఎమ్మెల్యే (ఆమ్ ఆద్మీ పార్టీ) -
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఖరారు!
భోపాల్: మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారైనట్టుగా తెలుస్తోంది. బుధవారం జరిగిన సీఎల్పీ మీటింగ్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుడు కమల్నాథ్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పక్షనేతగా కమల్నాథ్ పేరును ప్రతిపాదించారు. పార్టీ గెలుపుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే కారణమని సింధియా తెలిపారు. సీఎం ఎవరనే నిర్ణయాన్ని రాహుల్కే వదిలేస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం రేసులో ఉన్న సింధియానే శాసనసభ పక్ష నేతగా కమల్నాథ్ పేరును ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనం కానుంది. ఈ అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రకటను చేయలేదు. ఈ రోజు రాత్రికి కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్లో జరిగిన తాజా ఎన్నికల్లో మెజారిటీ మార్కుకు రెండు స్థానాల దూరంలో ఆగిపోయిన కాంగ్రెస్.. అధికారం చేజిక్కించుకోవడానికి వేగంగా పావులు కదిపింది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి కూడా కాంగ్రెస్కు మద్దతు తెలపడం, స్వతంత్రులతో కాంగ్రెస్ నాయకుల చర్చలు ఫలించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే సీఎం పదవి విషయంలో కొద్దిగా సందిగ్ధత నెలకొంది. సీఎంగా జ్యోతిరాధిత్య సింధియా, కమల్నాథ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే సింధియా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
‘ఓటమికి పూర్తి బాధ్యత నాదే’
భోపాల్: మధ్యప్రదేశ్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో జరిగిన తాజా ఎన్నికల్లో అధికార బీజేపీ మెజారిటీకి 7 స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీ ఓటమితో మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన చౌహాన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్లో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. హోరాహోరిగా సాగిన పోరులో చాలా కొద్ది తేడాతో తాము అధికారం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తానెవరినైనా నిరాశ పరిచి ఉంటే క్షమించాలని కోరారు. గెలవడం, ఓడిపోవడం ఎన్నికల్లో భాగమేనని చౌహాన్ అన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎప్పుడూ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తానని వెల్లడించారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాను చూస్తు ఊరుకోనని తెలిపారు. -
గవర్నర్ను కలిసిన కమల్ నాధ్
భోపాల్ : మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో మేజిక్ ఫిగర్ను సాధించిన కాంగ్రెస్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ను కలిసింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ సీఎం రేస్లో నిలిచిన కమల్ నాథ్ బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఆనందిబెన్ పటేల్ను కలిశారు. కమల్ నాథ్తో పాటు సీఎం పదవి ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా రాజ్భవన్కు వెళ్లిన నేతల బృందంలో ఉన్నారు.తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను వారు గవర్నర్కు అందచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకుందని కమల్ నాథ్ గవర్నర్కు వివరించారు. మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్కు లభించనుంది. మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది. -
మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ రాజీనామా
భోపాల్ : మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మేజిక్ ఫిగర్కు రెండు స్దానాల దూరంలో నిలిచిన కాంగ్రెస్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్కు సహకరించేందుకు సిద్ధమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంగా వైదొలిగిన అనంతరం తానిప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు. మరోవైపు మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. బీఎస్పీ మద్దతుతో పాటు స్వతంత్రుల సహకారం కూడగట్టేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ను కలిశారు. కాగా, మధ్యప్రదేశ్లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్కు లభించనుంది -
మధ్యప్రదేశ్లో హంగ్?
భోపాల్: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్ను ఆనందీబెన్ పటేల్ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్ 85, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్కు 113 సీట్లు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్ చేరుకున్నారు. గవర్నర్కు లేఖ రాసిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ గవర్నర్కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ మధ్యప్రదేశ్లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు భోపాల్: మధ్యప్రదేశ్లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్ ఫిగర్ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్ కీ బేటా)పే రొందిన చౌహాన్ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్) నుంచి మధ్యప్రదేశ్ను బయటకు తీసుకొచ్చి చౌహాన్ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. -
మందసోర్లో బీజేపీకే మొగ్గు
భోపాల్ : హిందీ బెల్ట్లో కీలక రాజస్ధాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీకి పరాజయం ఎదురైనా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రైతుల ఆందోళనలతో అట్టుడికిన మందసోర్ ప్రాంతంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలోనూ రైతుల సమస్యలు, అన్నదాతల ఆందోళన ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గత ఏడాది రైతుల ఆందోళన సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య జరిగిన ఘర్షణలు కాల్పులకు దారితీసి ఆరుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. రైతుల మృతితో మందసోర్ జాతీయ పతాకశీర్షికలకు ఎక్కింది. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు గుప్పించింది. రైతుల ఆగ్రహానికి కేంద్ర బిందువుగా నిలిచి వివిధ రాష్ర్టాల్లో రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన మందసోర్లో ఊహించని ఫలితాలు రావడం విశేషం. మందసోర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మందసోర్, మల్హర్గర్, నీముచ్, మనస, జవాద్, జవోర స్ధానాలను బీజేపీ నిలబెట్టుకోగా, 2013లో కాంగ్రెస్ గెలుపొందిన సువర్సా స్ధానంలోనూ బీజేపీ విజయం సాధించడం గమనార్హం. -
మాయావతితో కాంగ్రెస్ మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సానుకూల ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాజస్ధాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాధారణ మెజారిటీ సాధించినా, మధ్యప్రదేశ్లో మేజిక్ మార్క్కు అవసరమైన మెజారిటీ రాకుంటే ఏం చేయాలనేదానిపై కసరత్తు వేగవంతం చేసింది. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 116 స్ధానాలు రాకుంటే కాంగ్రెస్కు మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మద్దతు అనివార్యమవుతుంది. ప్రస్తుతం 115 స్ధానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ మాయావతి సాయం కోరేందుకు కాంగ్రెస్ నేతలు సంసిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ మాయావతితో ఫోన్లో సంప్రదింపులు జరిపిన మీదట పార్టీ నేతలతో ఢిల్లీలో సమావేశానికి మాయావతి సిద్ధమైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాజస్ధాన్లోనూ మిత్రపక్షాలతో కలిసి సాగేందుకు కాంగ్రెస్ సంకేతాలు పంపింది. రాజస్ధాన్లో తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ సాధించినా భావసారూప్య పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చెప్పారు. -
ఓటమి బాటలో డజను ఎంపీ మంత్రులు
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినా ఉత్కంఠ పోరులో కాంగ్రెస్దే పైచేయి సాధించింది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్లో మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ముందంజలో ఉంది. బీఎస్పీ రెండు స్ధానాల్లో, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ అవకాశాలను దెబ్బతీయగా, కాంగ్రెస్కు ఇదే కలిసివచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్లోని దాదాపు డజను మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి నరోత్తం మిశ్రా దాటియా స్ధానంలో 6200 ఓట్లతో ఎదురీదుతుండగా, మొరెనా నియోజకవర్గంలో మంత్రి రుస్తం సింగ్ మూడో స్ధానంలో ఉన్నారు. ఇక ఖర్గోవ్లో బాలక్రిష్ణ పటిదార్, గొహద్లో లాల్ సింగ్ ఆర్యా, షహ్పురా స్ధానం నుంచి ఓం ప్రకాష్ దుర్వే వెనుకంజలో ఉన్నారు. ఇక అంతర్ సింగ్ ఆర్య సెంద్వా స్ధానంలో వెనుకబడగా, హట్పిప్లియా నుంచి దీపక్ జోషి, సిల్వాని నుంచి రాంపాల్ సింగ్, బుర్హాన్పురాలో అర్చనా చిట్నిస్ ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ దామో స్ధానంలో, శరద్ జైన్ జబల్పూర్ నార్త్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. మరో మంత్రి జల్బన్ సింగ్ గ్వాలియర్లో, మాజీ ప్రదాని వాజ్పేయి మేనల్లుడు అనూప్ మిశ్రా బితర్వార్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. -
మధ్యప్రదేశ్లో మేజిక్ మార్క్ చేరుకున్న కాంగ్రెస్
భోపాల్ : మధ్యప్రదేశ్లో నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డ బీజేపీ, కాంగ్రెస్లు తుది రౌండ్ల వరకూ ఉత్కంఠ పెంచేలా పోటీపడుతున్నాయి. ప్రారంభం నుంచీ బీజేపీ, కాంగ్రెస్ల మధ్య స్వల్ప ఆధిక్యంతో విజయం దోబూచులాడుతున్నా తాజాగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా, కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ఆధిక్యం సాధించింది. ఇక నాలుగు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న బీఎస్పీ, ఆరు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నాయి. ఫలితాల సరళిని పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్పీ, ఇతరుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది. -
10 రౌండ్ల కౌంటింగ్ పూర్తి : సమంగా నిలిచిన బీజేపీ, కాంగ్రెస్
భోపాల్ : హోరాహోరిగా సాగుతున్న మధ్యప్రదేశ్ కౌటింగ్లో అధికార బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఇద్దరు రాష్ట్ర మంత్రులు వెనకంజలో ఉండగా.. కాంగ్రెస్ కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కమల్ నాథ్ ఇంటి ఆవరణలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం 10.30 : రాష్ట్రంలో హంగ్ పరిస్థిలు వచ్చే నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఫలితాల గురించి చర్చించనున్నట్లు సమాచారం. ఫలితాల గురించి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది ఆరంభం మాత్రమే.. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడలేదు. గెలుస్తామనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం 10.50 : మధ్యప్రదేశ్లో మొత్తం 230 సీట్లు ఉండగా.. 116 సీట్ల సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ 116 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.10 : మధ్యప్రదేశ్లో హస్తందే పై చేయి అవుతోంది. ఇప్పటికే 116 స్థానాల్లో లీడ్లో ఉన్న కాంగ్రెస్ మరిన్ని స్థానాల్లో ఆదిక్యంలోకి వచ్చే అవకాశలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలే సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.45 : అధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ హవా కాస్తా తగ్గగా.. కమలం కోలుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ 115 స్థానాల్లో అధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 106 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. రసవత్తరంగా సాగుతోన్న ఈ పోరులో విజేతలేవరో తేలాలంటే మరి కాస్తా సమయం పడుతోంది. మధ్యాహ్నం 12.10 : మధ్యప్రదేశ్ ఓటరు నాడి సులువుగా చిక్కడం లేదు. కాంగ్రెస్, బీజేపీల మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతోది. కాసేపు బీజేపీ, మరి కాసేపు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటున్నాయి. దాంతో నాయకులు కూడా ధైర్యంగా గెలుస్తామని చెప్పలేక పోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ మాజీ సీఎం బాబు లాల్ గౌర్ గెలుస్తామనుకున్నపుడు ఓడిపోవచ్చు.. కొన్ని సార్లు నిజంగానే గెలవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ 116, బీజేపీ 103 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.40 : మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. ప్రజల ఆగ్రహానికి నిదర్శమన్నారు శివసేన నాయకుడు సంజయ్ రౌత్. అయితే కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పలేమన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అభిప్రాయ పడ్డారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవియ మాత్రం గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు సమంగా మారింది. కాంగ్రెస్ 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కూడా 109 స్థానాల్లోనే లీడ్లో కొనసాగుతోంది. మధ్యాహ్నం 01.10 : బీజేపీ, కాంగ్రెస్ల మధ్య రసవత్తర పోరు కొనసాగుతుండటంతో.. రాష్ట్రంలో హంగ్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కీలంగా మారింది. ప్రస్తుతం బీఎస్పీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఎస్పీతో మంతనాలు జరుపుతున్నాయి. మధ్యాహ్నం 01.40 : ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ 111 స్థానాల్లో, కాంగ్రెస్ 108 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దానిలో భాగంగా తన పార్టీ ఎమ్మెల్యేలందరిని ఢిల్లీకి పంపించారు. 55 స్థానాల భవితవ్యం కేవలం 1000 ఓట్ల మార్జిన్ డిసైడ్ చేయనుంది. మధ్యాహ్నం 02.00 : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉత్కంటభరితంగా సాగుతోంది. 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యిసరికే.. బీజేపీ, కాంగ్రెస్ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. -
మధ్యప్రదేశ్లో బీజేపీ - కాంగ్రెస్ హోరాహోరి..!
భోపాల్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల తుది సమరం నేటితో ముగియనుంది. అధికారాన్ని చేజిక్కించుకునేదేవరో.. ప్రతిపక్షంలో నిలిచేదేవరో మరి కొన్ని గంటల్లో తెలనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కౌటింగ్ ప్రారంభమయ్యింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ - బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాష్ట్రంలోని 50 కీలక స్థానాలు పార్టీల భవితవ్యాన్ని డిసైడ్ చేస్తాయి. మంగళవారం ఉదయం 8. 06 నిమిషాలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది. గెలుపు కోసం రాహుల్ గాంధీ తన నివాసంలో పూజలు నిర్వహించారు. దాదాపు 35 స్థానాల్లో బీజేపీ - కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. బుధ్ని నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లీడ్లో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు నవంబర్ 28న పోలింగ్ జరుగగా, 2 వేలకు పైగా మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ 229 స్థానాల్లో బరిలో నిలిచింది. ఒక సీటును శరద్యాదవ్ నేతృత్వంలోని లోక్తాంత్రిక్ జనతాదళ్కు వదిలేసింది. బీఎస్పీ 227 స్థానాల్లో, ఎస్పీ 51 స్థానాల్లో, ఆప్ 208 స్థానాల్లో పోటీపడ్డాయి. 1,094 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 75.05 శాతం పోలింగ్ నమోదయింది. -
మధ్యప్రదేశ్లో ‘ఇతరులే’ కింగ్ మేకర్లా?
భోపాల్/దతియా: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీలు గెలుచుకునే సీట్ల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంటుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతుండటం తెలిసిందే. అదే జరిగితే, ఈ రెండు పార్టీల్లో ఏ దానికీ, స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ఆ రాష్ట్రంలో బీఎస్పీతోపాటు పలు చిన్న పార్టీలు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పనీ, తమ పార్టీ 12 వరకు సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని ఇప్పటికే బీఎస్పీ నాయకులు అంటున్నారు. ఒక్క టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ సర్వే మాత్రమే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, సీఎస్డీఎస్ సర్వే ఒక్కటే కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. మిగిలిన అన్ని సర్వేల్లోనూ ఈ రెండు పార్టీలు సాధించే సీట్ల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంటుందన్నాయి. బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీలు, స్వతంత్రులకు కలిపి 15 సీట్ల వరకు వస్తాయని దాదాపు అన్ని సర్వేలూ చెప్పాయి. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఓ దానికి పూర్తి ఆధిక్యం రాని పక్షంలో ఈ చిన్న పార్టీలే, స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. మళ్లీ మాదే అధికారం: శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్లో బీజేపీ మళ్లీ గెలుస్తుందనీ, వరుసగా నాలుగోసారి అధికారం చేపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్లకు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ‘నేను అతిపెద్ద సర్వేయర్ను. రోజు మొత్తం ప్రజల మధ్యే గడుపుతా. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుంది’ అని శివరాజ్ అన్నారు. ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ తమ పక్షానే నిలిచారనీ, తామే గెలవబోతున్నామన్నారు. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్లో కాంగ్రెస్దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్సింగ్ చౌహాన్పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్ఖండ్: కాంగ్రెస్దే ఆధిపత్యం ► బాగేల్ఖండ్: కాంగ్రెస్దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్పోల్లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్సింగ్తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సీఎం రమణ్సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్లో నువ్వా–నేనా ఛత్తీస్గఢ్లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్సింగ్కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
బీజేపీ అధికారం కోల్పోనుందా..?!
భోపాల్ : గత మూడు పర్యాయాలుగా మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు మరోమారు అధికారం కట్టబెట్టడానికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు ఉన్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శుక్రవారం సాయంత్రం పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఏబీపీ-సీఎస్డీఎస్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 126 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని అంచనా. బీజేపీ 94 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోతుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ పాలనపట్ల ప్రజలకు పెద్దగా ప్రతికూలత లేనప్పటికీ సుదీర్ఘంగా అధికారంలో ఉండడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సరళి ఎలా ఉండొచ్చు అన్నది ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 116 అన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే కాంగ్రెస్కు 113, బీజేపీకి 111, బీఎస్పీకి 2, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్లు మేజిక్ ఫిగర్కు కొంత దూరంలో ఉంటాయని విశ్లేషించింది. అయితే, టైమ్స్నౌ-సీఎన్ఎక్స్ ఇందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించింది. బీజేపీ పూర్తి ఆదిక్యంతో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని తన సర్వేలో తెలిపింది. బీజేపీకి126 సీట్లు, కాంగ్రెస్కు 89 సీట్లు, బీఎస్పీకి 6, ఇతరులకు 9 సీట్లు వస్తాయని వెల్లడించింది. 2000 నవంబర్ 1న కేంద్రంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్గఢ్ను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేటప్పటికి.. ఉమ్మడి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. విభజన తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోకాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడం గమనార్హం. -
పీపుల్స్ పల్స్: ఎంపీలో కాంగ్రెస్, మిజోరంలో హంగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, చత్తీస్గఢ్లో కూడా 15 ఏళ్ల బీజేపీ పాలకను తెరపడబోతోందని, అలాగే ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో ఉన్న మిజోరం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హైదరాబాద్కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నవంబర్లో నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడబోవడం విశేష పరిణామం. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 41.6 శాతం ఓట్లతో 116 నుంచి 120 సీట్లను గెలుచుకోబోతుండగా, పాలకపక్ష బీజేపీ పార్టీ 39.3 శాతం ఓట్లతో 98–102 స్థానాలకు పరిమితం కాబోతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా) పార్టీ ఓట్ల శాతం గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 41.6 % 116-120 బీజేపీ 39.3 % 98-102 బీఎస్పీ 4.2 % 0-2 ఇతరులు 14.9 % 2-5 చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల వివరాలు (అంచనా) పార్టీ ఓట్ల శాతం గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 41. % 43-45 బీజేపీ 40 % 40-42 జేసీసీ-బీఎస్పీ 11 % 2-3 ఇతరులు 8 % 0-1 ఇక బహుజన సమాజ్ పార్టీ 4.2 శాతం ఓట్లతో 0–2 సీట్ల వరకు, ఇతరులు 14.9 శాతం ఓట్లతో రెండు నుంచి ఐదు సీట్ల వర కు కైవసం చేసుకోబోతోంది. చత్తీస్గఢ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా రాణించినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకే కాస్త ఆధిక్యత లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఓట్లతో 43 నుంచి 45 సీట్లు, బీజేపీకి 40 శాతం ఓట్లతో 40 నుంచి 42 సీట్లు, జేసీసీ–బీఎస్పీ 11 శాతం ఓట్లతో రెండు నుంచి మూడు సీట్లు, ఇతరులు ఎనిమిది శాతం ఓట్లతో ఒక్క సీటు సాధించే అవకాశం ఉంది. అదే మిజోరంకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మిజో నేషనల్ ఫ్రంట్కు 15–19 సీట్లు, పాలకపక్ష కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 19 సీట్లు, జోరమ్ పీపుల్స్ ఫ్రంట్కు 2–4 సీట్లు, బీజేపీకి 0–2 సీట్ల వరకు రావచ్చని సర్వేలో తేలింది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల వివరాలు (అంచనా) పార్టీ గెలుచుకునే సీట్లు కాంగ్రెస్ 14-19 ఎంఎన్ఎఫ్ 15-19 జెడ్పీఎం 2-4 బీజేపీ 0-2 మిజోరం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎన్నడు కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ల మధ్యనే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. తొలిసారిగా బీజేపీ మిజోరం ఎన్నికల్లోకి దిగడం, కొత్తగా ఏర్పడిన జోరమ్ పీపుల్స్ ఫ్రంట్కు కూడా పలు స్థానాల్లో పోటీ చేస్తుండడం వల్ల తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. పీపుల్స్ పల్స్ ప్రతినిధులు మిజోరంలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు సర్వే నిర్వహించగా, మధ్యప్రదేశ్లో నవంబర్ 18 నుంచి 26వ తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు.మధ్యప్రదేశ్లోని ఆరు భిన్న ప్రాంతాల్లో ఓటర్ల మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించగా ఎక్కువ ప్రాంతాల్లో బీజేపీ నష్టపోతున్నట్లు తెల్సింది. చంబల్, గ్వాలియర్ రీజన్లో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. బుందేల్ఖండ్, బఘేల్ఖండ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ఎక్కువగా ఉంది. మహాకోశల్ ప్రాంతంలో పాలక పక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి పోటా పోటీగా ఉంది. మాల్వా రీజన్లో కాంగ్రె‹స్కు, భోపాల్ రీజన్లో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోంది. -
పోలింగ్ ప్రశాంతం
భోపాల్, ఐజ్వాల్: మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యప్రదేశ్లో 74.6%, మిజోరంలో 75 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో వెయ్యికి పైగా ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి రావడంతో పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ శాసనసభలోని 230 స్థానాలకు గానూ.. 227 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని లాన్జీ, పరస్వాడ, బైహార్ (మూడు) నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకే పోలింగ్ కొనసాగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ ఈసారి 2 శాతం పెరిగింది. మావోయిస్టు ప్రభావిత మూడు జిల్లాల్లోనే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. పలుచోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) లు మొరాయించాయని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. సాంకేతిక లోపాలున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా 1,145 ఈవీఎంలు, 1,545 వీవీప్యాట్లను మార్చినట్లు ఆయన చెప్పారు. ‘ఇటీవలి కాలంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఫిర్యాదులు 2% మాత్రమే వచ్చాయనీ, బుధవారం మాత్రం అది 2.5% వరకు ఉంది. ధర్, ఇండోర్, గుణ జిల్లాల్లో పోలింగ్ విధుల్లో ఉన్న ముగ్గురు సిబ్బంది అనారోగ్య కారణాలతో చనిపోగా, వ్యక్తిగత గొడవల్లో మరో వ్యక్తి మృతి చెందాడు. మరోచోట పోలింగ్ అధికారి తనకు అప్పగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లతో అనుమతి లేకుండా హోటల్లో బస చేయడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించాం’అన్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలలో సాంకేతికలోపాలు తలెత్తడం, ఓటర్లు ఎదురుచూడాల్సి రావడంపై కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఈవీఎల కారణంగా పోలింగ్ ఆలస్యమైన ప్రాంతాల్లో అదనపు సమయం కేటాయించాలని అధికారులను కోరారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. అదనపు సమయం కేటాయించడంపై స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపింది. ఓటేసిన శతాధిక వృద్ధులు మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. సుమారు 73 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూలో నిలుచుని ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ఆశిష్ కుంద్రా తెలిపారు. ముఖ్యమంత్రి లాల్ థన్వాలా పోటీ చేస్తున్న సెర్చిప్ నియోజకవర్గంలో అత్యధికంగా 81 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. ఐజ్వాల్ తూర్పు–1 నియోజకవర్గంలోని జెమబౌక్ నార్త్ ప్రాంతానికి చెందిన స్థానిక మత పెద్ద రొచింగా (108) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు 106, 104, 96 ఏళ్ల వృద్ధ ఓటర్లు కూడా తమ హక్కును వినియోగించుకున్నారు. ‘ఓటు వేయడం నేనెప్పుడూ మర్చిపోలేదు. ఓటేయడం మన బాధ్యత. దానిని మనం విస్మరిస్తే.. బాధ్యత మరిచిన సందర్భాల్లో ప్రభుత్వాన్ని మనం ఎలా ప్రశ్నించగలం’ అని రొచింగా అన్నారు. హచ్చెక్, మిజోరం నియోజకవర్గాల్లోనూ శతాధిక వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. త్రిపుర సరిహద్దుల్లోని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బ్రూ శరణార్థులు 55 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆశిష్ కుంద్రా తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు తోడ్పాటు అందించిన మిజో ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని 40 సీట్లకుగాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్
న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్లతో పాటు పలు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 65 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరగనుంది. మధ్యప్రదేశ్, మిజోరం పోలింగ్ లైవ్ అప్డేట్స్: సాయంత్రం 5.45: మధ్యప్రదేశ్, మిజోరంలో ముగిసిన పోలింగ్: మధ్యప్రదేశ్లో సుమారు 65.5శాతం, మిజోరంలో 73శాతం పోలింగ్ నమోదు మధ్యాహ్నం 2.30: మధ్యప్రదేశ్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదయింది. మధ్యాహ్నం 2.15: కాంగ్రెస్ నాయకుడు కమల్నాథ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన హస్తం గుర్తు చూపించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఎవరికి ఓటేశారని జర్నలిస్టులు అడిగితే చేతి గుర్తు చూపించానని ఆయన వివరణయిచ్చారు. కమలం గుర్తు చూపించమంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు. మధ్యాహ్నం 1.45: పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు, వీవీప్యాట్ల మొరాయింపుపై ప్రధాన సీఈసీ ఓపీ రావత్ స్పందించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్య తలెత్తినట్టు తెలిపారు. సమస్య తలెత్తిన ఈవీఎంలను, వీవీప్యాట్లను రీప్లేస్ చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఈవీఎం పనిచేయకపోవడం ఓటర్లు పోలింగ్ కేంద్రాల నుంచి తిరిగి వెళ్లినట్టయితే.. ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ గురించి ఆలోచిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1.30: మధ్యాహ్నం ఒంటిగంటకు మధ్యప్రదేశ్లో 28.68 శాతం, మిజోరంలో 49 శాతం పోలింగ్ నమోదయింది. మద్యాహ్నం 12.30: ఈవీఎంలలో లోపాలు తలెత్తినట్టు 100కు పైగా పోలింగ్ కేంద్రాల నుంచి ఫిర్యాదులు అందినట్టు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వీఎల్ కాంతారావు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించామని పేర్కొన్నారు. మద్యాహ్నం 12.00: పలు చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈసీ ఓటింగ్ సమయాన్ని పెంచాలని జ్యోతిరాదిత్య సింధియా కోరారు. ఉదయం 11.40: ఉదయం 11 గంటల వరకు మిజోరంలో 29 శాతం, మధ్యప్రదేశ్లో 21 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 11.30: మధ్యప్రదేశ్లోని గుణ, ఇండోర్లలో ఎన్నికలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కొల్పోయిన ముగ్గురు అధికారుల కుటుంబాలకు ఈసీ పరిహారం ప్రకటించింది. ఉదయం 11.00: కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల ఆశీస్సులతో డిసెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉదయం 10.00: ఉదయం 9 గంటల వరకు మిజోరంలో 15 శాతం, మధ్యప్రదేశ్లో 6.32 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్లోని కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తింది. ఉదయం 9.30: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు. ఉదయం 9.15: మధ్యప్రదేశ్, మిజోరంలో తొలి సారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. మరోవైపు మిజోరం ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉదయం 8.35: కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు చింద్వారా హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ప్రజలపై పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు. చాలా కాలం నుంచి రాష్ట్రంలోని అమాయక ప్రజలను బీజేపీ మోసం చేస్తూ వస్తుందన్నారు. ఉదయం 8.20: మిజోరంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 8.00: మధ్యప్రదేశ్లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 2 లక్షల మంది పోలీసులతో ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో మూడు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా సీఎం పీఠంపై కన్నేసింది. మరోవైపు బీజేపీ వ్యతిరేకతను తమవైపు మలుచుకుని ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డింది. ఉదయం 7.50: రాష్ట్రవ్యాప్తంగా మరికొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నర్మద తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మధ్యప్రదేశ్లోని 3 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైంది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 227 నియోజకవర్గాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7.00: మిజోరంలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 7.7 లక్షల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2008, 2013లలో మిజోరంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడ కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. -
ఢిల్లీ పీఠానికి..సోపానమిదే!
ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019లో జరిగే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయనేది సుస్పష్టం. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి అడుగు దూరంలో ఆగిపోవడం.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి ఎదురుదెబ్బలు తగలడంతో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు మోదీని ఆదరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది తేలిపోతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఎలాగున్నా బీజేపీపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మధ్యప్రదేశ్ మాత్రం అధికార పీఠాన్ని నిర్ణయించేదిగా ఉండనుంది. వేళ్లూనుకున్న బీజేపీ మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ కమలానికే ఓటర్లు పట్టం కట్టారు. ఆ పార్టీకి రాష్ట్రంలో అన్ని వర్గాల్లో మంచి పట్టుంది. ఒక్కో ఎన్నికకు.. ఒక్కో రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరిస్తూ వస్తోంది. అయితే.. ఇటీవలి రైతుల ఆందోళన, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాలతో పాటు పలు సామాజిక సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే (నాలుగోసారి) జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ తగ్గలేదని, మోదీకి ఆదరణ కొనసాగుతోందని అర్థం చేసుకోవచ్చు. అదే కాంగ్రెస్ విజయం సాధిస్తే అది ఎర్రకోటలో పాగా వేసేందుకు గాలులు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు అందుతాయి. మధ్యప్రదేశ్లో బీజేపీకి ఓట్లు, సీట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. 2008 ఎన్నికల్లో 230 సీట్లకుగాను బీజేపీ 143 సీట్లు గెలుచుకుంటే, 2013 ఎన్నికల నాటికవి 165కు పెరిగాయి. అలాగే, 2008 ఎన్నికల్లో 37.64% ఓట్లు రాగా, గత ఎన్నికల్లో 44.87% వచ్చాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో అయితే మధ్య ప్రదేశ్లో బీజేపీ రికార్డు స్థాయిలో 54.03% ఓట్లు రాబట్టుకుంది. పుంజుకున్న బీజేపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పతనం మొదలయిన తర్వాత చాలా రాష్ట్రాల్లో కనీసం రెండు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే, మధ్య ప్రదేశ్లో మాత్రం వరసగా కాంగ్రెస్ అధికారానికి దూరమవడం, బీజేపీ ఆధిపత్యం కొనసాగడం జరుగుతోంది. తద్వారా ఇక్కడ బీజేపీ ఎన్నికల రాజకీయాలకు అతీతంగా బీజేపీ తన పట్టు నిలుపుకుందని రుజువవుతోంది. ‘రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల్లోనూ బీజేపీ తన బలం పెంచుకుంటోంది. ప్రత్యర్థుల కంటే బాగా పని చేయగలదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించింది. దాని ఫలితమే వరస ఎన్నికల్లో గెలుపు’ అంటున్నారు ఎన్నికల విశ్లేషకులు. మధ్యప్రదేశ్లో బీజేపీ 15 ఏళ్లుగా అధికారాన్ని కాపాడుకోవడమే కాక కాంగ్రెస్ను తనకు చాలా దూరంలో నిలబెట్టగలిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 36.38% ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీ ఓట్ల శాతం కంటే 9%తక్కువ. -
మధ్యప్రదేశ్లో ఎవరిది ‘పైచేయి’?
-
మధ్యప్రదేశ్లో ఎవరిది ‘పైచేయి’?
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను సెమీ ఫైనల్గా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్న నేపథ్యంలో వాటిల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరగుతున్న ఎన్నికలను ‘టై–బ్రేకర్’గా పరిగణించవచ్చు. ఐదు రాష్ట్రాల్లో మిజోరమ్, చత్తీస్గఢ్లు చిన్న రాష్ట్రాలు కాగ, తెలంగాణ ఎన్నికలను ప్రాంతీయ యుద్ధంగానే భావించవచ్చు. రాజస్థాన్ పెద్ద రాష్ట్రమే అయినప్పటికీ రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీలే వరుసగా పంచుకుంటున్నాయి. పైగా రాజస్థాన్లో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. ప్రధాన హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఏ సర్వేలు స్పష్టం చేయడం లేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ వైపు, మరికొన్ని సర్వేలు బీజేపీ వైపు మొగ్గుచూపాయి. మధ్యప్రదేశ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నికలను ప్రధానంగా ప్రభావితం చేసే వర్గం ఇదే. పంటలకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 2017లో రైతులు నిర్వహించిన సమ్మె ఇక్కడ రక్తసిక్తమయింది. మండ్సార్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఆ సంఘటన నాడు యావత్ దేశ రైతు లోకాన్ని కదిలించింది. రైతులకు గిట్టుబాటు ధరల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘భవంతర్ భుక్తాన్ యోజన’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు, మార్కెట్ ధరకు ఉన్న వ్యత్యాసాన్ని నేరుగా ప్రభుత్వం ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకం విఫలమైందని, వ్యాపారులకు, ధనిక రైతులకే ఉపయోగపడుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రుణాలను మాఫీ చేయకపోవడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు కూడా తమను దెబ్బతీసిందని వారు వాపోతున్నారు. ఎన్నికలపై నిరుద్యోగం ప్రభావం నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగులు 53 శాతమని, నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకుల సంఖ్య 2005తో పోలిస్తే 2015 నాటికి 20 రెట్లు పెరిగిందని ‘బిరోజ్గర్ సేన’ వెల్లడించింది. రాష్ట్ర వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ‘వ్యాపం’ కుంభకోణం పట్ల కూడా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడం, జీఎస్టీని ప్రవేశపెట్టడం పట్ల మరోపక్క చిన్న వ్యాపారులు పాలకపక్షంపై ఆగ్రహంతో ఉన్నారు. దళితులు వ్యతిరేకం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో విమల్ ప్రకాష్ అనే దళితుడు మరణించాడు. ఈ సంఘటనే కాకుండా శివరాజ్ సింగ్ చౌవాన్ సంపన్న వర్గాల సంక్షేమం కోసమే కషి చేశారని, నిమ్న వర్గాలైన తమను అంతగా పట్టించుకోలేదని ఎస్సీ, ఎస్టీలు బలంగా భావిస్తున్నారు. నాడు బంద్తో దళితులు దూరం అవుతారని భావించిన మోదీ సర్కార్ ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించారు. అది కొంత మంది అగ్రవర్ణాలకు కోపం తెప్పించింది. వారు సెప్టెంబర్ ఐదవ తేదీన ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని ఎత్తివేయాలంటూ రాష్ట్రంలో బంద్ నిర్వహించారు. దేశ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ను నియమించడం పట్ల, దేశంలో తాము ఆశించిన రిజర్వేషన్ల విధానాన్ని ఎత్తివేయక పోవడం పట్ల కూడా కొన్ని అగ్రవర్ణాలు పాలకపక్షంపై ఆగ్రహంతో ఉన్నాయి. మెజారిటీ ప్రజలు పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ‘మామ’గా వారికి దగ్గరైన శివరాజ్ సింగ్ చౌవాన్ పట్ల వారికి అంత వ్యతిరేకత లేదు. అందువల్లనే కాంగ్రెస్–బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాయావతి నాయకత్వంలో బీఎస్పీ పార్టీ కాంగ్రెస్ ఓట్లను చీల్చడం తమకు లాభించే అంశమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ‘సపక్స్ సమాజ్’ అని కొత్త పార్టీ ఆ మేరకు బీజేపీ ఓట్లను చీలుస్తుందన్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. రాష్ట్రంలో 45 శాతం మంది ఉన్న ఆదివాసీల్లో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతానికి ‘హస్తం’ దే పైచేయని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘రాహుల్ గాంధీ పార్ట్ టైం లీడర్’
భోపాల్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్ట్ టైం లీడర్ అని, ఆయనకు ప్రజల సమస్యల పట్ల కనీస అవగహన కూడా లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లోని సియోనీ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే రాహుల్ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారని, ఆయన స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ సమయం గడుపుతారని వ్యాఖ్యానించారు. స్వదేశానికి వచ్చినప్పుడల్లా రెండు, మూడు సభలు నిర్వహించిన పోతారని అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల సమస్యలు రాహుల్కు తెలియవని, ఎన్నికల సమయంలోనే ఆయన ఈ ప్రాంతాలకు వస్తుంటారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్లు ప్రజా నేతలని అన్నారు. అధికారం కోసమే అమలుకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచిందని, చౌహాన్కు ప్రజల మద్దతు ఉన్నందును గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గరీభీ హఠావో నినాదం ఒక బూటకమని మండిపడ్డారు. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పేదరికాన్ని మరింత పెంచిందని విమర్శించారు. కాగా మధ్యప్రదేశ్లో తొలి విడత ఎన్నికల ఈనెల 28న జరుగునున్న విషయం తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో బీజేపీ జాతీయ నేతలతో సహా, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుకు మధ్యప్రదేశ్ వేదికగా నిలిచింది. నేతల మాటల తూటలతో రాజకీయం మరింత వేడుక్కుతోంది. కాగా గత మూడు విడుతలుగా బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంటుండగా.. ఈ సారి విజయం కోసం హస్తం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. -
‘అభిశంసన’తో జడ్జీలనే బెదిరించారు
ఆల్వార్/విదిశ: అయోధ్య కేసును ఈ ఏడాది తొలి నాళ్లలో విచారించాలనుకున్న సుప్రీంకోర్టు జడ్జీలను అభిశంసన పేరిట కాంగ్రెస్ బెదిరించిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. లాయర్లు కూడా అయిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కొందరు..ఈ కేసును 2019 లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా సాగదీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని విమర్శించారు. రాజస్తాన్లోని ఆల్వార్, మధ్యప్రదేశ్లోని విదిశలో ఆదివారం జరిగిన ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తన తల్లిదండ్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే ధైర్యం లేకే తన కులం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కులతత్వం, పేదలు, అణగారిన వర్గాలపై ద్వేషాన్ని కాంగ్రెస్ నరనరాల్లో నింపుకుందని ధ్వజమెత్తారు. అది ప్రమాదకర క్రీడ.. ఆల్వార్ సభలో మోదీ మాట్లాడుతూ రాజ్యసభలో తనకున్న సంఖ్యాబలం చూసుకుని కాంగ్రెస్ సుప్రీంకోర్టు జడ్జీలను బెదిరిస్తోందని ఆరోపించారు. ‘ పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగిలే కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త ప్రమాదకర క్రీడను ప్రారంభించింది. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి కేసుల విచారణ టైం టేబుల్ను తయారుచేయకుంటే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, లాయర్లు అయిన కొందరు వ్యక్తులు అభిశంసన పేరిట ఆ జడ్జిని బెదిరిస్తారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా మేధావులు ఈ ప్రమాదకర ధోరణిని ఎండగట్టాలి. మోదీ కులం ఆధారంగా ఓట్లు పడతా యా? మోదీ జన్మస్థలం ఆధారంగా రాజస్తాన్ భవిష్యత్ నిర్మితమవుతుందా?’ అని ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ప్రధాని ప్రశ్నించారు. మోదీ దిగువ కులానికి చెందిన వాడని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు. నా తల్లిదండ్రులు పదవులు చేపట్టలేదు.. తన తల్లిదండ్రుల్ని కాంగ్రెస్ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల్లోకి లాగడంపై విదిశలో జరిగిన సభలో మోదీ మండిపడ్డారు. గాంధీ– నెహ్రూ కుటుంబంపై చేసిన విమర్శల్ని సమర్థించుకున్న మోదీ..తన తల్లిదండ్రులు వారిలా రాజకీయాలు, ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నారు. ‘నామ్దార్ (రాహుల్ను ఉద్దేశించి) అండ చూసుకునే కాంగ్రెస్ నాయకులు 30 ఏళ్ల క్రితం చనిపోయిన నా తండ్రికి రాజకీయాల్లోకి లాగుతున్నారు. లేవనెత్తడానికి వారికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదు. అందుకే నా తల్లిదండ్రులు లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నా తల్లి ఇంటికే పరిమితమై పూజలు చేసుకుంటూ శేష జీవితం గడుపుతోంది. రాజ్నీతిలోని ‘ఆర్’ అనే పదం కూడా ఆమెకు తెలియదు’ అని మోదీ అన్నారు. మోదీ 50వ ‘మన్కీ బాత్’ న్యూఢిల్లీ: మాసాంతపు ‘మన్కీ బాత్’ ప్రసంగ కార్యక్రమాన్ని రాజకీయాలకు దూరంగా ఉం చి, ప్రజల ఆకాంక్షలకు వేదికగా చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. తన వ్యక్తిగత, ప్రభు త్వ విజయాల్ని ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదన్నారు. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ‘మన్కీ బాత్’ ఆదివారం 50వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో రేడియో అత్యంత శక్తిమంతమైన సాధనమని, అందుకే తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు మోదీ చెప్పారు. కుటుంబాల్లో యువత, పెద్దల మధ్య కమ్యూనికేషన్ అంతరం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇచ్చి చర్చిస్తే భావవ్యక్తీకరణ ప్రభావవంతంగా ఉంటుందన్నారు. చదువు, అలవా ట్లు, జీవన శైలి గురించి మాత్రమే యువతరం తో చర్చిస్తున్నామని, అలాకాకుండా ఎలాంటి హద్దుల్లేకుండా, ఏమీ ఆశించకుండా జరిపే చర్చలతోనే ఫలితం ఉంటుందన్నారు. -
మార్పు సరే..జై కొట్టేదెవరికి?
మధ్యప్రదేశ్లో మార్పు తథ్యమని కాంగ్రెస్ పార్టీ నినదిస్తోంది. మామగా తనకంటూ రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న శివరాజ్ను ఢీకొట్టి తమ పార్టీ గద్దె నెక్కుతామని ధీమాగా చెబుతోంది. అయితే.. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే వచ్చే వ్యతిరేకతను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకోగలదా? అన్నదే ప్రశ్న. ఓటర్లు కూడా మార్పు కోరుకుంటున్నట్లయితే.. ఆ మార్పు కాంగ్రెస్సేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు వల్ల తలెత్తిన ఇబ్బందులు, 15 ఏళ్లుగా ఒకే ప్రభుత్వాన్ని చూడటం వంటివి సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు సరిపోతాయి. కానీ మధ్యప్రదేశ్లో ప్రజలు ఈ పరిస్థితుల్లోనూ ఏకపక్షంగా కాంగ్రెస్కు ఓటువేసేలా కనిపించడం లేదు. దీనికి కారణం ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలే. కాంగ్రెస్ అధిష్టానం ఈ సమన్వయ లోపాన్ని అరికట్టలేకపోతోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పట్నుంచి కాంగ్రెస్ ఈ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొంటోంది. వరçసపెట్టి ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాశ్యం ఆవహించింది. కాంగ్రెస్ సీఎం ఎవరు? ఓటర్లు మధ్యప్రదేశ్లో మార్పు కోరుకుంటున్నారనే వార్తల్లో వాస్తవం లేకపోలేదు. కానీ.. ఆ మార్పు కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టడమేనని వారు భావించడం లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో దిగ్విజయ్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అనుభవాలను ఇప్పటికీ ఓటర్లు మరిచిపోలేదని, కాంగ్రెస్ను గద్దెకెక్కిస్తే మళ్లీ అవే పరిస్థితులు వస్తాయనే భయం వారిని వెంటాడుతోందని కాంగ్రెస్ నాయకులే పేర్కొనడం ఇందుకు తార్కాణం. ‘బీజేపీకి ఓటేస్తే శివరాజ్ సీఎం అవుతారని అవుతారని మాకు తెలుసు. మరి కాంగ్రెస్కు ఓటేస్తే సీఎం ఎవరో మాకే తెలియదు. ఇంకా ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది’ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించి ఉంటే.. గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ‘సింధియా గుణ, గ్వాలియర్కే పరిమితం, కమల్నాథ్ చింద్వారా సంగతే చూస్తారు. రాష్ట్రం మొత్తానికి నాయకుడంటూ కాంగ్రెస్లో ఎవరూ లేరు. అలాంటప్పుడు వారికెందుకు ఓటేయాల’ నే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. బీజేపీకి ఆరెస్సెస్ అండ బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు వెళ్లి వాళ్ల కష్టసుఖాలు ఆరాతీస్తోంది. చేతనయిన సాయం చేస్తోంది. ఇదంతా ఈ ఎన్నికలను పెట్టుకుని చేస్తున్న పనికాదు. దశాబ్దానికి పైగా ఆరెస్సెస్ పలు ప్రాంతాల్లో చేపడుతున్న పనుల కారణంగానే బీజేపీకి గణనీయమైన ఓటుబ్యాంకు సిద్ధౖమైంది. కాంగ్రెస్కు ఈ రకమైన చేయూత లభించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా పేరుకు సేవాదళ్, యూత్ కాంగ్రెస్ వంటి అనుంబంధ సంస్థలున్నా అవి ఆరెస్సెస్ స్థాయిలో పని చేయలేవని కాంగ్రెస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. చౌహాన్ కరిజ్మాపైనే.. సీఎంగా చౌహాన్కున్న వ్యక్తిగత ఇమేజ్ను నమ్ముకునే బీజేపీ ఈ ఎన్నికల్లో సమరశంఖం పూరించింది. ఆయన కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 55ఏళ్లలో చేయలేనిది తాము 15 ఏళ్లలోనే చేశామని, విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, 77 లక్షల మంది విద్యుత్ బిల్లుల్ని మాఫీ చేశామని గుర్తు చేస్తున్నారు. బీమారు రాష్ట్రాల జాబితా నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చామన్నారు. నిరంతరాయ విద్యుత్, గ్రామీణ ప్రాంతాలకు రహదారులన్నీ తమ ఘనతగా చెబుతున్నారు. కాంగ్రెస్ గెలవాలంటే .. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 58 సీట్లలో నెగ్గింది. ఈ సారి అధికార పీఠం దక్కాలంటే ముందుగా సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలి. అది కత్తి మీద సామే. ఎందుకంటే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే కాంగ్రెస్ అక్కడ గెలిచింది. బీజేపీ గత ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీపై సగటున 7.5%ఓట్ల మెజార్టీతో నెగ్గింది. ఇప్పుడు ఆ అదనపు ఓట్లను కాంగ్రెస్ తనవైపు లాక్కోగలగాలి. అలా బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో కనీసం 58 చోట్ల ఓట్లను కొల్లగొట్టగలిగితే మేజిక్ ఫిగర్ 116కి కాంగ్రెస్ చేరుకోగలుగుతుంది. బీజేపీ నుంచి 4–5 శాతం ఓట్లను రాబట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. విసిగిపోయాం నిజమే.. కానీ! రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ సరైన ప్రత్యామ్నాయం కాదని పలువురు భావిస్తున్నారు. ఓటర్లు బీజేపీతో విసిగిపోయారు నిజమే. అయితే కాంగ్రెస్ గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుంటే వారికి ఓట్లేయడం కష్టమేనని మందసౌర్లోని కొందరు రైతులు పేర్కొన్నారు. దిగ్విజయ్ హయాంలో పడ్డ కరెంటు కష్టాలు ఇప్పటీకి మరిచిపోలేకపోతున్నామని వారంటున్నారు. ఈ వాదనతో పార్టీ శ్రేణులు కూడా లోపాయికారీగా ఏకీభవిస్తున్నాయి. బీజేపీ సమస్యలు - పదిహేనేళ్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత - ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో లేకపోవడం - కనీస మద్దతు ధర విషయంలో రైతుల్లో ఆగ్రహం - ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలపై ప్రజలకు వివరించలేకపోవడం - నిరుద్యోగం, పెట్టుబడులు అనుకున్న స్థాయిలో లేకపోవడం - మౌలిక సదుపాయాల లోటు బీజేపీ బలాలు - మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2013 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 165 స్థానాల్లో గెలవడం. - వాటిలో 91 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే 10% ఓట్ల మెజార్టీ సాధించడం - అతి పెద్ద ప్రాంతమైన మాల్వాలో ఏకంగా 46 సీట్లు గెలవడం - ఇతర పార్టీల ఓట్లు చీలిపోవడం వల్ల 73 స్థానాల్లో జయకేతనం. శివరాజ్ సింగ్ (బీజేపీ) బలాలు – ప్రజలతో మమేకం కావడం, అవిశ్రాంత శ్రామికుడిగా గుర్తింపు, స్త్రీలకు రైతులకు సంక్షేమ పథకాలు. బలహీనతలు – ప్రభుత్వ వ్యతిరేకత, వ్యాపమ్ కుంభకోణం, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు. బుద్నీ నుంచి పోటీ. కమల్నాథ్ (కాంగ్రెస్) బలాలు – పార్టీకి అవసర నిధులను అందించగల సత్తా, అపార అనుభవం ఉన్న రాజకీయ వ్యూహకర్త. బలహీనతలు – రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా లేకపోవడం, పేదల వ్యతిరేకి అన్న ముద్ర. జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్) బలాలు – 44% యువఓటర్లను ఆకర్షించే కరిజ్మా, మచ్చలేని ఇమేజ్, తండ్రి వారసత్వం. బలహీనతలు – రాజకుటుంబీకుడిగా ముద్ర, దిగ్విజయ్ సింగ్తో అంతర్గత విబేధాలు. ఒపీనియన్ పోల్స్ ఏమంటున్నాయ్ - అక్టోబర్ మొదటి వారంలో ఒపీనియన్ పోల్స్ అంచనాలు: బీజేపీ 115, కాంగ్రెస్ 105, ఇతరులు 10 - నవంబర్ మొదటి వారంలో ఒపీనియన్ పోల్స్ అంచనాలు: బీజేపీ 115–125, కాంగ్రెస్ 90–100, ఇతరులు 5–15. - సీఎం అభ్యర్థిగా శివరాజ్ చౌహాన్కే పట్టంగట్టిన 40% మంది ఓటర్లు బరిలో ముఖ్యులు: బీజేపీ– యశోధరరాజె సింధియా, ఉషా ఠాకూర్, ఫాతిమా రసుల్ అబ్దుల్, ఆకాశ్ విజయ్ వర్గీయ, కృష్ణ గౌర్. కాంగ్రెస్ – అరీఫ్ అకీల్, సంజయ్ సింగ్ మసానీ, జైవర్ధన్ సింగ్, అరుణ్ యాదవ్. వయా బుందేల్ఖండ్..! మధ్యప్రదేశ్లో మాయావతి వ్యూహం ఈసారి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటడం ద్వారా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారాలని బీఎస్పీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ రాకున్నా, కనీసం కింగ్మేకర్ స్థాయిలోనైనా ఉండాలని ఆ పార్టీ చీఫ్ మాయావతి ఆశిస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పరాజయాల అనంతరం పార్టీ ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటోంది. ఈ సమయంలో మధ్యభారతంలో తన పట్టును నిరూపించుకోవడం ద్వారా పునరుజ్జీవమవ్వాలని మాయావతి ఆశపడుతోంది. అందుకే మాయావతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్నా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని బుందేల్ఖండ్పై పట్టుకోసం చెమటోడుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సంపాదించగలిగితే బీజేపీ, కాంగ్రెస్తో బేరాలాడే శక్తి వస్తుందని మాయావతి అంచనా. ఆ ప్రాంతమే ఎందుకు? బీఎస్పీ ప్రధాన కార్యక్షేత్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలో కూడా ఉంది. సాధారణంగా పార్టీ బలంగా ఉన్నరాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో సదరు పార్టీ ప్రభావం కనిపిస్తుంటుంది. బుందేల్ఖండ్, చంబల్, వింధ్య ప్రాంతాలు అటు యూపీ, మధ్యప్రదేశ్ల సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో మొదట్నుంచీ బీఎస్పీకి కాస్తంత పట్టుంది. ఈ దఫా తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకొని ఈ ప్రాంతంలో మెజార్టీ సీట్లు పొందాలని బీఎస్పీ భావిస్తోంది. ‘బుందేల్ఖండ్ మీదుగా భోపాల్కు’ అనే నినాదంతో ఈ ప్రాంతంలో మద్దతు పొందేందుకు యత్నిస్తోంది. -
అందుకే మోదీ అమ్మపై కాంగ్రెస్ గురిపెట్టింది
-
మోదీ మోసం చేశారు: రాహుల్
సాగర్/దామోహ్: ఏటా రెండు కోట్ల ఉద్యోగాల సృష్టి, ప్రతిఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ వంటి బూటకపు హామీలతో దేశ ప్రజల్ని ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని సాగర్, దామోహ్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఈ దేశంలో నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ ఎలా ఉన్నారో మీకు తెలుసా? దేశానికి కాపలాదారుడినని చెప్పుకునే మోదీ, సామాన్యులను ‘మిత్రులారా!’ అని సంబోధిస్తారు. కానీ ప్రజల సొమ్ముతో విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, ఇతర రుణ ఎగవేతదారులను ‘భాయీ (సోదరా!)’ అని పిలుస్తారు. పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరుందని తాను చెప్పగానే శివరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించటాన్ని బట్టి, ఈ వ్యవహారంలో వాస్తవం మరేదో ఉందని అనిపిస్తోందన్నారు. -
పోరాడలేక నా తల్లిపై దూషణలా?
ఛత్తర్పూర్/మంద్సౌర్: తనతో పోరాడే శక్తిలేని కాంగ్రెస్ నేతలు తన తల్లి హీరాబెన్ లక్ష్యంగా దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 18 ఏళ్లుగా తన చేతిలో ఓడిపోతున్న కాంగ్రెస్ నేతలు, పోరాడేందుకు మరే విషయం దొరక్కపోవడంతోనే వృద్ధురాలైన తన తల్లిని ఈ వివాదంలోకి లాగారని దుయ్యబట్టారు. దేశంలో రూపాయి విలువ మోదీ తల్లి వయస్సుకు దిగజారిందని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఈ మేరకు స్పందించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఛత్తస్పూర్లో నిర్వహించిన ర్యాలీలో విపక్షాలపై మోదీ నిప్పులు చెరిగారు. ఆమెకు రాజకీయాలంటేనే తెలియదు.. ‘ఈ కాంగ్రెస్ నేతలకు నరేంద్ర మోదీపై పోరాడే శక్తి లేదు. 17–18 సంవత్సరాలుగా మిమ్మల్ని ప్రతీసారి సవాల్ చేయడమే కాకుండా చిత్తుచిత్తుగా ఓడిస్తున్నా. కానీ మీరు ఈ రాజకీయ రొంపిలోకి నా తల్లిని లాగుతున్నారా? కాంగ్రెస్ నేతలకు ఇది సరైనదేనని అనిపిస్తోందా? మోదీపై చేసిన విమర్శలేవీ పనిచేయకపోవడంతో కాంగ్రెస్ నేతలు నా తల్లి హీరాబెన్ను దుర్భాషలాడుతున్నారు. ఆమెను అవమానిస్తున్నారు. కానీ నా తల్లికి రాజనీతి(రాజకీయం) అనే పదంలో ఆర్ అనే అక్షరానికి అర్థం కూడా తెలియదు’ అని అన్నారు. మాది రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కాదు ఈ సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిం చారు. ‘నా ప్రభుత్వాన్ని ఓ మేడమ్(సోనియా) తన ఇంట్లో కూర్చుని రిమోట్ కంట్రోల్ తో నియంత్రించడం లేదు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నా హైకమాండ్. మేడమ్ హయాంలో ధనికుల కోసం బ్యాంకుల ఖజానాలను ఖాళీ చేసేశారు. కానీ, మా ప్రభుత్వం యువతకు సాధికారత కల్పిస్తోంది. అవినీతి అన్నది నాలుగు తరాల కాంగ్రెస్లో అనాదిగా వస్తున్న ఆచారం, సంస్కృతి. నోట్ల రద్దు తర్వాత తప్పుడు పేర్లు, చిరునామాలతో నడుస్తున్న మూడు లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయి.’ అని మోదీ తెలిపారు. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు వస్తున్న ఆదరణ చూసి నామ్దార్(రాహుల్), రాజా (దిగ్విజయ్), మహారాజా (జ్యోతిరాదిత్య సింధియా)లు కలత చెందుతున్నారని ప్రధాని ఆరోపించారు. పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే.. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఉంటే దేశంలో రైతులు నాశనమయ్యేవారు కాదని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తప్పులు, లోపభూయిష్టౖ నిర్ణయాలతో రెతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం అవసరమనీ, అయితే తనకు నాలుగేళ్ల కాలం మాత్రమే లభించిందని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు లభించిన సమయంలో సగం కాలం తనకు అధికారం అప్పగించినా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తానన్నారు. పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) అంటూ నాడు ఇందిర ఇచ్చిన నినాదం నేటికీ నెరవేర లేదని విమర్శించారు. -
‘నన్ను ఎదుర్కోలేక మా అమ్మను తిడుతున్నారు’
భోపాల్ : రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. తనని ఎదుర్కునే సత్తా లేకనే కాంగ్రెస్ నేతలు తన తల్లిని దూషిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ నేతలకు సమస్యలపై మాట్లాడే సత్తా లేక ఇతరుల తల్లులపై అసభ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వారి మాటలు చూస్తుంటే మోదీని ఢీకొట్టలేని నిస్సహాయతలో ఉన్నట్లు అర్ధమవుతుందన్నారు. కానీ తాను మాత్రం గత 17 ఏళ్లుగా కాంగ్రెస్కు గట్టి పోటీనిస్తూ.. ఓడిస్తున్నాననీ తెలిపారు. పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని, వారి డిపాజిట్లు గల్లంతు కావద్దనే మోదీ తల్లిని తిడుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ప్రజలే హైకమాండ్ అని, తమది రిమోట్ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. ఇండోర్లో గత గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో సీపీ జోషి ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. -
బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల్ గాంధీ
-
కాంగ్రెస్ నేతల నోటి దురుసు
ఇండోర్/అహ్మదాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీపీ జోషి, రాజ్ బబ్బర్లు..ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. రూపాయి విలువ మోదీ తల్లి వయసును చేరిందంటూ రాజ్బబ్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు. మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి దిగువ కులాలకు చెందినవారని, వారికి హిందూయిజం గురించి ఏమీ తెలియదని సీపీ జోషి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్ బబ్బర్, జోషితో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జోషి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు జోషి క్షమాపణ చెప్పినా బీజేపీ శాంతించలేదు. జోషి హిందూ మతం, సంస్కృతిని అవమానించారని, ధైర్యముంటే ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని రాహుల్కు సవాలు విసిరింది. మన్మోహన్ను అవమానించారు.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం జరిగిన ర్యాలీలో రాజ్ బబ్బర్ ప్రసంగిస్తూ ‘ ప్రధాని కాక ముందు మోదీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్పై కనీస గౌరవం చూపకుండా రూపాయి విలువ ఆయన వయసుకు సమానంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే రూపాయి మరింత పతనమై మోదీ తల్లి వయసును చేరింది’ అని అన్నారు. మోదీ తల్లి 90వ పడిలో ఉన్నారు. ఇక, జైపూర్లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు సీపీ జోషి మాట్లాడుతూ దిగువ కులానికి చెందిన మోదీ, బీజేపీ ఎంపీ ఉమా భారతి, హిందూ కార్యకర్త సాధ్వి రీతాంభరాలకు హిందూ మతం గురించి ఏమీ తెలియదని, బ్రాహ్మణులే పండితులని వారికే హిందూయిజం గురించి తెలుసని అన్నారు. -
సీఎం బామ్మర్ది అయితే!
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వారాసివని నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యోగేంద్ర నిర్మల్నే బీజేపీ మళ్లీ బరిలో దించింది. మాములుగా అయితే ఈ స్థానంపై పెద్ద ఆసక్తేమీ ఉండదు. కానీ.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బావ (మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్)కు హ్యాండిచ్చి.. కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్న సంజయ్ సింగ్ మసానీ బీజేపీపై పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. వృత్తిరీత్యా వైద్యుడైన మసాని వారాసివని నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని భావించారు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో మసాని ఈ నెల 3వ తేదీన కమల్నాథ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమల్నాథ్ కృషి ఫలితంగా కాంగ్రెస్ నాలుగో జాబితాలో మసానీకి చోటు దక్కింది. బావ పార్టీపై బామ్మర్ది ఆగ్రహం బీజేపీలో బంధుప్రీతి హద్దులు దాటిందని, వారసులకే పెద్ద పీట వేస్తున్నారని 60 ఏళ్ల మసాని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, కూతుళ్లకే ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చౌహాన్ కంటే కమల్నాథ్ అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే, మసానీకి టికెట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. మసానీ అక్రమాలను పలుమార్లు కాంగ్రెస్ పార్టీయే అసెంబ్లీలో ఎత్తిచూపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మద్దతుగా ఎలా ప్రచారం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఆరెస్సెస్ బలమెక్కువ మధ్యప్రదేశ్లో బాలఘాట్ జిల్లా పరిధిలోకి వచ్చే వారాసివనిలో.. 2013లో ఆరెస్సెస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి యోగేంద్ర నిర్మల్.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్పై 17,755 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2008లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జైస్వాల్ గెలిచారు. 10మంది పోటీలో ఉన్నా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నప్పటికీ బీఎస్పీ కూడా తీవ్రమైన పోటీనిస్తోంది. -
చౌకీదార్లను అవమానించారు
విదిశ: అవినీతిని కాచుకునే చౌకీదార్(కాపలాదారుడు)ని అని చెప్పుకునే ప్రధాని మోదీ దేశంలోని కాపలాదారులు అందరినీ అవమాని ంచారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ఇప్పుడెక్కడా ‘చౌకీదార్’ అనే మాట వినిపించినా, ప్రజలు వెంటనే ‘అతను దొంగ’ అని అంటున్నారన్నారు. మధ్యప్రదేశ్లోని విదిశలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యాపమ్ స్కామ్లో రాష్ట్ర సీఎం కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ‘ఇప్పుడెక్కడ చౌకీదార్ అనే పదం వినిపించినా, ప్రజలు వెంటనే దొంగ అని బదులిస్తున్నారు. దేశంలోని వాచ్మెన్లందరికీ నేను క్షమాపణ చెబుతున్నా. తప్పు మీది కాదు. మీరు దొంగలు కారు..మీరెంతో నిజాయతీపరులు. కానీ మోదీ మీకు చెడ్డపేరు తెచ్చారు’ అని అన్నారు. 2014లో అధికారంలోకి రావడానికి ముందు అవినీతి నిర్మూలన, నిరుద్యోగం, రైతుల సంక్షేమం గురించి ఊదరగొట్టిన మోదీ..ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. వ్యాపమ్, ఈ–టెండరింగ్, మైనింగ్, మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాల్లో అవినీతి జరిగిందని ఆరోపించినప్పుడు సీఎం మిన్నకుండిపోయారని, ఈసారి పరువు నష్టం గురించి ఎందుకు నోరు మెదపలేదని సీఎంను, ఆయన కొడుకును రాహుల్ ప్రశ్నించారు. -
మోదీ-షా హవా; కొత్త ట్విస్ట్
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ముద్ర కనిపించడం లేదు. 2014లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వీరి ముద్ర స్పష్టంగా కనిపించింది. బీజేపీలో అన్ని తామే వ్యవహరించి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ మోదీ-షా జోడీ ముందుండి నడిపించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న రమణ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజే సొంత గొంతుక విన్పిస్తున్నారు. బీజేపీలో అగ్రస్థాయి వ్యూహకర్తల బృందంలో అమిత్ షా, మోదీకి సమానంగా పరిగణించబడుతున్న వీరు మోదీ-షా ద్వయంపై ఆధారపడకుండానే ముందుకు పోతున్నారు. మోదీ ప్రధాని పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా 19 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జార్కండ్, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలక పగ్గాలు దక్కించుకుంది. హరియణాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాషాయ పార్టీ సఫలమైంది. ఇదే ఏడాది చివరి జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్లోనూ పాగా వేసింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీకి 2015 కలిసిరాలేదు. అదే ఏడాది ఢిల్లీ, బిహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో కమలం పార్టీకి చుక్కెదురైంది. అసోంలో గెలుపుతో 2016లో ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన కమలనాథులు, అదే సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల్లో భంగపడ్డారు. 2017లో ఉత్తరప్రదేశ్లో భారీ విజయంతో పాటు ఉత్తరాఖండ్, హిమచల్ప్రదేశ్నూ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలోనూ విజయఢంకా మోగించి ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా మారింది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ గుజరాత్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మోదీ-షా సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. అయితే ఈ ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి బీజేపీకి ఝలక్ ఇచ్చాయి. తాజాగా జరుగుతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మోదీ-షా ముద్ర అంతగా కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న రమణ్ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజె బలమైన నాయకులు. తమకు తామే సొంతంగా వ్యూహాలను అమలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో మోదీ-షా జోడికి పెద్దగా పని లేకుండా పోయింది. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ మళ్లీ గెలిస్తే ఆ ఘనత అంతా రమణ్ సింగ్కే దక్కుతుంది. రాజస్థాన్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాజే వెనక్కు తగ్గడం లేదు. మోదీ-షా ముద్ర లేకుండానే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆమెను తప్పించే సాహసం చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఈశాన్య రాష్ట్రం మిజొరంలోనూ మోదీ-షా ముచ్చట లేదు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేకపోవడంతో మోదీ-షా మ్యాజిక్ పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికనుగుణంగానే మోదీ-షా ప్రచార పర్వాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ-షా హవా నడిచింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వీరే ఆధిపత్యం చెలాయించారు. బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడంతో అన్ని విజయాలన్నీ వీరి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఈ ఎన్నికల్లోని విశేషం. ఇక్కడ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే మోదీ-షా ‘ముద్ర’ మాయం కావడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. -
మందసౌర్ మొనగాడెవరో?
మందసౌర్ నియోజకవర్గానికి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ముగ్గురు(సుందర్లాల్ పట్వా, వీకే సక్లేచ, కైలాస్నాధ్ కట్జూ) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జన్సంఘ్ అభ్యర్ధి సుందర్లాల్ గెలుపొందారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ అడపాదడపా విజయం సాధించినా ఎక్కువగా జన్సంఘ్, బీజేపీకి ఈ నియోజకవర్గం అనుకూలంగా ఉంది. 2003 అనంతరం ఈ నియోజకవర్గం పూర్తిగా బీజేపీ పట్టులోకి వెళ్లింది. గత మూడు దఫాలు బీజేపీ అభ్యర్ధి ఇక్కడ గెలుపొందాడు. ఈ దఫా మారిన పరిస్థితులను అనుకూలంగా మలచుకొని గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2013లో బీజేపీ అభ్యర్ధి యశ్పాల్ దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్పై గెలుపొందారు. 2008లో బీజేపీ అభ్యర్ధి యశ్పాల్ దాదాపు 18,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్పై గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎనిమిదిమంది పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి యశ్పాల్ సింగ్ సిసోడియా, కాంగ్రెస్నుంచి నరేంద్ర నహతా, బీఎస్పీ నుంచి ఈశ్వర్ మక్వానా పోటీ పడుతుండగా, ఛెన్సింగ్ నాంద్వెల్(ఆమ్ఆద్మీ పార్టీ), సునీల్ బన్సాల్(సపాక్స్), అనీల్సోనీ, అబ్దుల్ హబీబ్, సురేశ్పండిట్(ఇండిపెండెంట్లు) కూడా పోటీలో ఉన్నారు. ఓపియం సాగు.. ప్రపంచంలో ఔషధ అవసరాల కోసం ఓపియం పండించే దేశాల్లో భారత్ మొదటి స్ధానంలో ఉంది. భారత్లో మాళ్వా ప్రాంతంలోనే ఓపియం సాగు ఎక్కువగా చేస్తారు. ప్రభుత్వ ఓపియం పాలసీ కింద లైసెన్సులు పొందిన రైతులు మందసౌర్ తదితర జిల్లాలో ఓపియంను పండిస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో ఈ లైసెన్సుల జారీ, పంట సాగు పర్యవేక్షణ జరుగుతుంది. అక్టోబర్ నుంచి సాగు ఆరంభమవుతుంది. మార్చి కల్లా పంట చేతికొస్తుంది. మంచి లాభాలు తెచ్చే పంట కావడంతో లైసెన్సుల కోసం గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ప్రభుత్వానికి శరాఘాతంగా మారనున్నాయి. మండోదరి పుట్టినూరు.. పురాణాల్లో మందసౌర్ను దశపుర అనేవారు. రామాయణం ప్రకారం ఈ ప్రాంతం రావణ పత్ని మండోదరి జన్మస్థలం. అందుకే ఇక్కడ రావణబ్రహ్మ ఆరాధన కనిపిస్తుంది. రావణుడిని తమ అల్లుడిగా వీరు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతీయులు దసరా రోజున రావణ దహనం జరుపుకోరు. నగరంలోని ఖాన్పురా ప్రాంతంలో 35 అడుగుల ఎత్తైన దశకంఠుడి విగ్రహం ఉంది. ప్రస్తుత నగరానికి పూర్వం ఇక్కడ మర్, సౌర్ అనే రెండు గ్రామాలుండేవని, ఇవి రెండూ కలిసి మందసౌర్ ఏర్పడిందని మరో కథనం. భౌగోళికంగా ఈ ప్రాంతం మాల్వా, మేవార్ సరిహద్దులో ఉంది. అందుకే మాళ్వా పాలకుడు హుషాంగ్ షా ఘోరీ మందసౌర్లో బ్రహ్మాండమైన కోటను కట్టించాడు. బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతం గ్వాలియర్ రాజ్యం కింద ఉండేది. పశుపతినాధ ఆలయం, యశోధర్ముడి సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధం. ప్రధాని వస్తే అంతే... మధ్యప్రదేశ్లో బీజేపీ కంచుకోటల్లో ఒకటైన మందసౌర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పుకారు షికారు చేస్తుంది. ఏదైనా పార్టీ తరఫున ప్రచారానికి ప్రధాని వస్తే అంతే సంగతులని, నియోజకవర్గంలో విపక్షం గెలుస్తుందని చాలామంది నమ్ముతారు. 1989లో రాజీవ్ ప్రచారానికి వచ్చాక ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించాడు. 1998లో బీజేపీ అభ్యర్ధి తరఫున వాజ్పాయ్ ప్రచారానికి వచ్చారు. ఇంకేముంది.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయభేరి మోగించాడు. దీంతో ప్రజల్లో ఈ నమ్మకం బాగా బలపడింది. 2013లో అప్పటికి ఇంకా ప్రధాని కాని నరేంద్రమోదీ బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చారు. కానీ ఈ సారి అదే మోదీ ప్రధాని హోదాలో ఈ నెల 24న మందసౌర్ వస్తున్నారు. దీంతో పాత సెంటిమెంట్ తలచుకుని కార్యకర్తలు భయపడుతున్నారు. ఓటింగ్ను ప్రభావితం చేసే అంశాలు రైతుల ఆందోళన గతేడాది జూన్లో గిట్టుబాటు ధరలు కోరుతూ ఈ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసు కాల్పులు జరగడం, ఆరుగురు ఆందోళనకారులు మరణించడం జరిగాయి. దీంతో ఆందోళనలు మరింత ముదిరి సరిహద్దు జిల్లాలకు కూడా పాకాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలింది. బీజేపీ రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. బీబీవై పేరిట రైతు సంక్షేమానికి కొత్త పథకం ప్రకటించింది. కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఈ ఆందోళన వెనుక ఓపియం మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెల్లుల్లి ధర ఓపియంతో పాటు ఈ ప్రాంతంలో వెల్లుల్లి సాగు కూడా ఎక్కువ. అయితే 2017 మార్చి నుంచి మందసౌర్ మార్కెట్లో వెల్లుల్లి ధర దారుణంగా పడిపోయింది. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అలాంటిది ఇప్పుడు రూపాయి, రెండ్రూపాయలకు వెల్లుల్లిని అమ్ముకోవడంపై ఈ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికపై అత్యాచారం ఈ ఏడాది జూన్లో ఎనిమిదేళ్ల బాలికపై ఇరువురు అత్యాచారం చేసి చంపేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం ఈ కేసులో వేగంగా స్పందించి ఇరువురు నిందితులను అరెస్టు చేసింది. మతాలు, కులాల ఈక్వేషన్లు మందసౌర్లో మతాల వారీగా హిందువులు, ముస్లింలు, జైనులు ఎక్కువగా ఉన్నారు. కులాల పరంగా సింధియా రాజ్పుట్స్, పటీదార్లు, చమార్లు ఎక్కువగా కనిపిస్తారు. హిందు ఓట్లు సమీకృతం చేయడంలో ఇంతవరకు బీజేపీ సఫలమవుతూ వస్తోంది. ఈ దఫా బీజేపీని ఎదుర్కొనేందుకు ముస్లిం–జైన్ ఫార్ములా అవలంబించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా జైన్ కులస్తుడికి టికెట్ ఇచ్చింది. మరోవైపు రైతు ఆందోళనలో మరణించినవారంతా పటేల్ కులానికి చెందిన వారే. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథాతధంగా కొనసాగించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్పై నియోజకవర్గంలోని ఓబీసీ, ఓసీ ఓటర్లు మండిపడుతున్నారు. తమ తమ ఊర్లలో ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ బ్యానెర్లు ప్రదర్శిస్తున్నారు. తమ ఆందోళను వ్యక్త పరిచేందుకు రాజ్పుత్లు, పటీదార్లు సపాక్స్ పార్టీ పేరతో పోటీ చేస్తున్నారు. -
బీజేపీ ప్రణాళికాబద్ధంగా దెబ్బతీస్తోంది
ఇండోర్: పార్లమెంటు, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) వంటి సంస్థల ప్రతిష్టను మోదీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా దెబ్బతీస్తోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తెలిపారు. తద్వారా ఓ క్రమపద్ధతిలో, వ్యూహాత్మకంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ హయాంలో అవినీతి విలయతాండవం చేస్తోందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాడిక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మన్మోహన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం, ఆర్బీఐ మధ్య సహకారంపై ‘దేశంలో పార్లమెంటు, సీబీఐ వంటి సంస్థల ప్రతిష్టను మోదీ ప్రభుత్వం దిజారుస్తోంది. జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వీటిని దెబ్బతీస్తోంది. తద్వారా దేశంలోని ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు యత్నిస్తోంది. ప్రస్తుతం దేశంలో సమన్యాయంపై దాడి జరుగుతోంది. ఈ పరిస్థితి ఇప్పుడు మారకుంటే చరిత్ర ఈ తరాన్ని ఎన్నటికీ క్షమించదు. మోదీ ప్రభుత్వం ఆర్బీఐ, సీబీఐ వంటి సంస్థలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రజాస్వా మ్యానికి, చట్టాలకు ప్రమాదకరం. ఇక కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐల మధ్య సంబంధాలు ఎన్నడూలేనంతగా దిగజారాయి’ అని అన్నారు. దుర్భాషలు ప్రధాని హోదాకు తగదు పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై విలేకరులు అడిగిన ప్రశ్నకు మన్మోహన్ స్పందిస్తూ.. ‘‘పెద్ద నోట్ల రద్దు అన్నది ‘వ్యవ స్థాగత లూటీ–చట్టబద్ధమైన దోపిడీ’గా తయారైంది. ఈ నిర్ణయంతో దేశంలోని అసంఘటిత రంగానికి తీవ్రనష్టం వాటిల్లింది. నోట్ల రద్దు లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఇలాంటి ఆర్థిక దుస్థితిని కల్పించిన ప్రభుత్వాన్ని వదిలించుకోవాలా? వద్దా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. తన రాజకీయ ప్రత్యర్థులపై మోదీ దుర్భాషలకు దిగుతున్నారు. ఓ ప్రధానికి ఇలాంటి భాష ఎన్నటికీ శోభనివ్వదు’’ అని వెల్లడించారు. నాది రిమోట్ కంట్రోల్ సర్కార్ కాదు తనది రిమోట్ కంట్రోల్ ప్రభుత్వమని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన విమర్శలకు సమాధానమిస్తూ.. ‘అది ఎంతమాత్రం నిజం కాదు. మా పార్టీ (కాంగ్రెస్), ప్రభుత్వం ఒకేతాటిపై ఉన్నాయి. మామధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు అప్పట్లో లేవు. యూపీఏ హయాంలో అవినీతి జరిగిందని మీడియాను, దేశ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టించింది. ఈ విషయంలో ప్రజలకు మేం సరిగ్గా జవాబు ఇవ్వలేకపోయాం’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో సీబీఐ వంటి కేంద్ర సంస్థలపై ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేదని బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్కృష్ణ అగర్వాల్ పేర్కొన్నారు. -
90% ముస్లిం ఓట్లు పడేలా చూడండి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కమల్నాథ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో 90 శాతం ఓట్లు కాంగ్రెస్కు పడేలా చేయాలని ఆ పార్టీ ముస్లిం నేతలను కమల్నాథ్ కోరుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని ఓ ప్రాంతంలో గత నెలలో రికార్డు చేసినట్లు భావిస్తున్న ఈ వీడియోలో ‘నరేంద్ర మోదీకి ఓటు వేయడమంటే హిందువులకు ఓటేయడమేనని బీజేపీ, ఆరెస్సెస్లు ప్రజలకు సందేశాన్ని పంపుతున్నాయి. నిజంగా ముస్లింలకు ఓటేయాలని మీకు ఉంటే కాంగ్రెస్కు ఓటేయండి. వాళ్లు మిమ్మల్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. కానీ పోలింగ్ అయ్యేంతవరకూ ఓపిక పట్టండి. గత ఎన్నికల సందర్భంగా నమోదైన ఓటింగ్ సరళిని ఓసారి గమనించాలని మిమ్మల్ని కోరుతున్నా. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కేవలం 50–60 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 90% పోలింగ్ ఎందుకు జరగలేదు? ఒకవేళ ముస్లింలు ఈ ఎన్నికల్లో 90 శాతం ఓటు హక్కును వినియోగించుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో మతం ఆధారంగా ఓట్లడిగిన కమల్నాథ్ తో పాటు కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ బృందం ఎన్నికల సంఘానికి వినతిపత్రాన్ని సమర్పించింది. -
'బుధ్నీ' మే సవాల్
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత నియోజకవర్గం బుధ్నీలో నువ్వా నేనా అన్నట్టుగా రసవత్తర పోటీకి తెరలేచింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలమైన అభ్యర్థి బరిలో లేకపోవడంతో చౌహాన్ విజయం నల్లేరు నడకలా సాగింది. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఓబీసీ నాయకుడు అరుణ్ యాదవ్ను బరిలోకి దింపడంతో చౌహాన్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో నెలకొన్న రైతు సమస్యలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరిగా లేకపోవడం వంటి సమస్యలతో చౌహాన్కు విజయం అంత సులభంగా దక్కేలా కనిపించడం లేదు. మామ మంచోడే.. కానీ! శివరాజ్ సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గత పదమూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి చాలా చేశారు. ఇప్పుడు అక్కడ విద్యుత్ కోతలు లేనే లేవు. అద్దంలాంటి రోడ్లు తళతళలాడిపోతున్నాయి. బుధ్నీ నుంచి ఎవరు సీఎం కార్యాలయానికి పని నిమిత్తం వచ్చినా వెంటనే ఆ పని జరిగేలా స్వయంగా చౌహానే చూస్తారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రోజుకి 20 గంటలు కష్టపడతారు. ఇవన్నీ చౌహాన్కు కలిసొచ్చే అంశాలే. అయితే కొన్ని పల్లెల్లో నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేకపోవడంతో వైద్య చికిత్స కోసం కొన్ని పల్లెల్లో ప్రజలు మైళ్లకి మైళ్లు నడవాల్సి వస్తోంది. పక్కనే నర్మదా నది ప్రవహిస్తున్నప్పటికీ ఎన్నో పొలాలకు నీరు అందడం లేదు. తాను రైతు బిడ్డనని ఎన్నికల ప్రచారంలో పదే పదే చౌహాన్ గుర్తు చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో రైతులే చౌహాన్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సాగునీరు లేక, పంటలకు మద్దతు ధర రాక ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక నర్మద నదిలో ఇసుక మాఫియాకు అండగా ఉంటారన్న ఆరోపణలు చౌహాన్పై వ్యతిరేకతను పెంచాయి. యాదవ ఓట్లపై నమ్మకంతో.. దిగ్విజయ్ సింగ్ హయాంలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన సుభాష్ యాదవ్ కుమారుడే అరుణ్ యాదవ్ . 46 ఏళ్ల అరుణ్ యాదవ్.. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా పని చేశారు. ఇటీవలే అరుణ్ యాదవ్ ను తప్పించి కమల్నాథ్కు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో అరుణ్ యాదవ్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీఎంపై యాదవ్ను నిలబెట్టింది. ఎందుకంటే బుధ్నీ నియోజకవర్గంలో చౌహాన్ సామాజికవర్గానికి చెందిన కిరార్ ఓట్లరు ఎంత మంది ఉన్నారో యాదవులు కూడా అంతే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం యాదవ్ను ఏరికోరి రంగంలోకి దింపింది. నర్మద నది తీరం నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించిన అరుణ్ యాదవ్ చౌహాన్ సర్కార్ను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇసుక మాఫియాకు చౌహాన్ కుటుంబం అండగం ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. యాదవ్ పీసీసీ చీఫ్ పదవిని లాగేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఆయనను బలిపశువుని చెయ్యడానికే తనపైన నిలబెట్టిందంటూ శివరాజ్ చౌహాన్ దీటుగా విమర్శలు చేస్తున్నారు. ప్రచారం భాబీదే! ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. అలాగే చౌహాన్ విజయాల వెనుక ఆయన భార్య సాధనా సింగ్ చౌహాన్ కృషి ఎంతైనా ఉంది. బుధ్నీ నియోజకవర్గం ప్రజలు ఆమెను ప్రేమగా భాబీ అని పిలుస్తారు. చౌహాన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో సాధన బుధ్నీపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే పరిష్కరిస్తారు. ‘సాధన ఎన్నడూ సీఎం భార్యగా ప్రవర్తించలేదు. అందరినీ సమానంగా చూస్తారు. మాకే సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తారు’ అని స్థానిక మహిళలు చెబుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఆమె ఒక అధికార కేంద్రంగా ఎదిగారు. చౌహాన్ గత కొన్నేళ్లుగా తన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడకపోయినా సాధన ఆ లోటు తెలీకుండా వ్యవహారాలను చక్కచెట్టుకుంటూ వస్తున్నారు. కుమారుడు కార్తికేయ చౌహాన్ కూడా నియోజకవర్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. చౌహాన్ వెంటే నీడలా ఉంటూ సాధనా అన్ని అంశాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. బాబూలాల్ గౌర్ను సీఎంగా తప్పించి చౌహాన్ను సీఎంను చేసిన తర్వాత 2006లో బుధ్నీలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనే తొలిసారిగా సాధన కనిపించారు. అప్పట్నుంచి భర్తను గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాలపైనే మోశారు. సాధనకూ గ్రహణశక్తి చాలా ఎక్కువ. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా తొందరగా పట్టు సాధించారు. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నా, వద్దనుకున్నా నిర్ణయం ఆమెదే. ఇక అధికారుల బదిలీలు కూడా ఆమె కనుసన్నల్లోనే సాగుతాయన్న ఆరోపణలూ ఉన్నాయి. సాధనను పార్టీ కార్యకర్తలు హాఫ్ చీఫ్ మినిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అదే ఇప్పుడు విపక్షాలకు ప్రచారాస్త్రంగా కూడా మారింది. సాధన అత్యుత్సాహంతో ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చడం తమకు మేలే చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన వ్యాపమ్ సహా ఎన్నో కుంభకోణాల్లో సాధన ప్రమేయమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ సారి కూడా చౌహాన్ విజయాన్ని ఒక సవాల్గా స్వీకరించిన సాధన తాను ఏదైనా సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో చౌహాన్ను గెలిపించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో చౌహాన్ 84వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 20 మంది మంత్రుల మోహరింపు ముఖ్యమంత్రి భార్య సాధనా సింగ్ చౌహాన్, ఆయన కుమారుడు కార్తికేయ చౌహాన్ కాలికి బలపం కట్టుకొని నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి మరీ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. అయితే చాలా చోట్ల వారు ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించరా.. అంటూ ప్రచార సభల్లో మహిళలు నిలదీస్తున్నారు. చౌహాన్ను మామా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే నియోజకవర్గ ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఎదురు కావడంతో చౌహాన్ ఏకంగా 20 మంది మంత్రుల్ని రంగంలోకి దింపారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం చౌహాన్ బుధ్నీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1990 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత లోక్సభకు వెళ్లిపోయారు. తిరిగి 2003 అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్పైన పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్లు తిరక్కుండానే ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇక 2008 ఎన్నికల నాటికి తన పట్టును పెంచుకొని 41 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2013 ఎన్నికల నాటికి చౌహాన్ ఇమేజ్కు తిరుగే లేకుండా పోయింది. కాంగ్రెస్ నేత మహేంద్ర సింగ్ చౌహాన్పై 84వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్నారు. -
గుడిలో కూర్చోవడం కూడా తెలియని రాహుల్...
భోపాల్ : దేవాలయాల్లో కూర్చోరానివాళ్లు కూడా ఎన్నికల కోసం గుళ్ల చుట్టు తిరుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం బుర్హాన్పుర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుల, మతాల సెంటిమెంట్స్తో ఓట్లు పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అందుకే కనీసం గుడిలో కూర్చోవడం కూడా తెలియని రాహుల్ గాంధీ దేవాలయాలు సందర్శించడం మెదలుపెట్టాడన్నారు. అంతకు ముందు ఎప్పుడు అతను దేవాలయాలు సందర్శించలేదని, ఎన్నికల కోసం టెంపుల్ రన్ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ఇప్పటికే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి శివరాజ్సింగ్ చౌహన్ అని ప్రకటించిందని, కాంగ్రెస్ మాత్రం తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండా నాన్చుతుందని విమర్శించారు. ఈ వ్యవహారం చూస్తే ‘పెళ్లి జరుగుతందంట కానీ పెళ్లి కూతురు ఎవరికి తెలియదంటా’ అన్నట్లు కాంగ్రెస్ తీరుందని ఎద్దేవా చేశారు. కౌన్ బనేగా కరోడ్పతి రియాల్టీ షో గేమ్లా రాష్ట్రంలో కాంగ్రెస్ కౌన్ బనేగా ముఖ్యమంత్రి గేమ్ ఆడుతుందన్నారు. గత పదిహేనేళ్లుగా శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. -
శివరాజ్ సింగ్ తిన్నది నాన్వెజ్ కాదు!
భోపాల్ : ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు.. సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నాయి. ప్రచార సభలో నాయకుల మాటల తూటాలు.. పొరపాట్లపై జోకులు కూడా పేలుతున్నాయి. అయితే కొన్ని వైరల్ అవుతున్న అసత్య వార్తలు.. నాయకులకు తలనొప్పిగా మారాయి. ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేసింది. స్వచ్ఛమైన.. అచ్చమైన హిందువుగా చెప్పుకునే శివరాజ్ సింగ్ చాటుమాటుగా మాంసాహారం తింటున్నాడని ఓ ఫొటో తెగ వైరల్ అయింది. అయితే ఆ ఫొటో మార్ఫ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఇండియా టుడే గుర్తించింది. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో హెలికాప్టర్లో కూర్చొని శివరాజ్ సింగ్ భోజనం చేస్తున్నారు. తన భోజన ప్లేట్లోని కర్రీస్ను.. కొందరు నాన్వెజ్గా మార్ఫ్ చేసి వైరల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 17న శివరాజ్ సింగ్ హెలికాప్టర్లో భోజనం చేశారని, ఇది పీటీఐ తీసిన ఫొటో అని ఇండియాటూడే పేర్కొంది. ఇక ఫొటోను నిశితంగా పరిశీలిస్తే ఎవరికైన ఇది మార్ఫింగ్ ఫొటోనేనని స్పష్టం అవుతోంది. శివరాజ్ భోజనం చేస్తున్న ప్లేట్లో స్పూన్ పూర్తిగా కనిపిస్తోంది... కానీ మార్ఫింగ్ చేసిన ఫొటోలో స్పూన్ సగం మాత్రమే కనబడుతోంది. -
మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది
ఛింద్వారా/మహాసముంద్: మోసం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. దళితుడైనందునే సీతారాం కేసరిని ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా తొలగించి సోనియాను అందలం ఎక్కించారని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్లోని ఛింద్వారా, ఛత్తీస్గఢ్లోని మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది. కానీ, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరు. గోవును కీర్తిస్తూ మధ్యప్రదేశ్ మేనిఫెస్టోలో పథకాలు కూడా ఆ పార్టీ ప్రకటించింది. కేరళలో మాత్రం ఆ పార్టీ నేతలు ఆవు దూడలను తింటూ పశుమాంసం తినడం తమ హక్కంటారా?’ అని ప్రజలను అడిగారు. ‘ఆధార్ ఆధారిత సాంకేతికతతో ప్రభుత్వ పథకాలను అనర్హుల పాలు కాకుండా చేసి ఏడాదికి 90 వేల కోట్ల రూపాయల దోపిడీని ఆపుతున్నా. అందుకే కాంగ్రెస్ నేతలు నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారని నాకు తెలుసు’ అని మోదీ అన్నారు. కేసరిని అర్ధంతరంగా తొలగించారు ఏఐసీసీ అధ్యక్షుడు(1996–98)గా ఉన్న సీతారాం కేసరి దళితుడైనందునే ఆ పార్టీ ఆయన్ను అర్ధంతరంగా పదవి నుంచి దించేసిందని మోదీ విమర్శించారు. పదవీ కాలం పూర్తి కాకుండానే సీతారాం కేసరిని పార్టీ ఆఫీసు నుంచి బయటకు నెట్టేసిన ఆ పార్టీ నేతలు సోనియా గాంధీని పదవిలో కూర్చోబెట్టారన్న విషయం అప్పట్లో దేశ ప్రజలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. ‘ఆ ఒక్క కుటుంబం నాలుగు తరాలుగా అధికారంలో ఉంటూ లాభం పొందగా, వారి పాలనతో దేశానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు’ అని మోదీ అన్నారు. ఆ కుటుంబానికి చెందని సమర్థుడైన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కాంగ్రెస్కు ఆయన సవాల్ విసిరారు. ‘రైతు రుణాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన అలాంటి హామీని అక్కడి ప్రభుత్వం ఏడాదవుతున్నా అమలు చేయలేదు. పైపెచ్చు రుణగ్రహీతలైన అక్కడి రైతులకు వారంట్లు జారీ చేస్తూ అరెస్టులు చేయిస్తోంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో బరిలో 1,101 మంది ఛత్తీస్గఢ్లో చివరి దశలో ఈనెల 20వ తేదీన 72 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం ముగిసింది. పోటీలో 1,101 మంది అభ్యర్థులున్నారు. రాయ్పూర్ సిటీ దక్షిణ స్థానం కోసం అత్యధికంగా 46 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 18 స్థానాలకు 12న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. కేసరి దళితుడు కాదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి దళితుడు అంటూ ప్రధాని చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేసరి దళితుడు కాదు, ఇతర వెనుక బడిన కులాల(ఓబీసీ)కు చెందిన వ్యక్తి అని స్పష్టం చేసింది. ‘సీతారాం కేసరి బిహార్ ఓబీసీల్లోని బనియా కులానికి చెందిన వ్యక్తి. ఆయన దళితుడు కాదు. ఆయనకు పార్టీ తగు గౌరవం ఇచ్చింది. అయినా.. నిజాలు, సత్యాలను ప్రధాని మోదీ ఎన్నడైనా చెప్పారా?’అంటూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కొత్తకొత్త అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది. ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్రాజ్ మిశ్రా, కేశూభాయ్ పటేల్లాంటి బీజేపీ ప్రముఖ నేతలను ఎలా గౌరవించారో ఆత్మవిమర్శ చేసుకోండి’ అంటూ మోదీని వ్యంగ్యంగా అన్నారు. -
పల్లే.. పట్టు!
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. భారత దేశంలో వ్యవసాయ రంగానికి సమస్యలు మొదట్నుంచీ తీవ్రంగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో రైతు ఆందోళనలు రాజకీయ రంగు పులుముకోవడం ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షాలకు సవాల్గా మారింది. ఈ ఎన్నికల్లో రైతు సమస్యలను ççప్రసావిస్తూ వెళ్తేనే ఓట్లను ప్రభావితం చేయవచ్చని విపక్షాలు గుర్తించాయి. అందుకే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నియోజవకర్గాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకే అధికారం అందనుందనేది సుస్పష్టం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలుచేస్తేనే భారత వ్యవసాయ రంగ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఈ రంగంలోని నిపుణులు కోరుతున్నారు. ఇది గత 15 ఏళ్లుగా దేశమంతా వినిపిస్తున్న డిమాండ్. కానీ.. ప్రభుత్వాలు మాత్రం ఈ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ తమ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి వీలున్నన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవేవీ అన్నదాతకు పూర్తి భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, చీడ పీడ పెరగడం– సరైన నీటి వనరులు లేకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గడం వంటివి రైతును కుంగదీస్తున్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకునే ఉపశమన చర్యల కంటే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పలుచోట్ల ఆత్మహత్యలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో గతేడాది జరిగిన రైతు ఆందోళనలు, తదనంతర పరిణామాల్లో ఆరుగురు రైతులు పోలీసు కాల్పుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. ఇది శివరాజ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీనికితోడు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయనే విమర్శలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నప్పటికీ.. రైతు సమస్యలే ప్రభుత్వ ఏర్పాటును శాసించబోతున్నాయనేది నిర్వివాదాంశం. అసంఘటిత రంగానికి దెబ్బ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు కారణంగా అసంఘటిత రంగ కార్మికులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మార్కెట్లో చెలామణీకి సరిపోయేంతగా నగదు అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనేవారి వద్ద, అమ్మేవారి వద్ద డబ్బుల్లేకపోవడంతో మార్కెట్ దెబ్బతింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దీంతో నష్టం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లోలాగా డిజిటల్ లావాదేవీలు.. గ్రామీణ ప్రాంతాలకు వెంటనే అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి లావాదేవీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ఈ క్రమంలోనే వివిధ అంశాల కారణంగా దేశ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ.. చిరువ్యాపారులు, కార్మికరంగానికి జరిగిన నష్టం పూడ్చలేకపోయారు. అటు రైతుల విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచినప్పటికీ.. రైతులు పండించిన మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో సమస్య మొదటికే వచ్చింది. 200 జిల్లాల్లో కరువు ఈ ఏడాది గతం కన్నా రుతుపవనాలు సరిగ్గానే ఉన్నప్పటికీ.. దేశలోని 600 జిల్లాలకు గానూ 200 జిల్లాల్లో కరువు పరిస్థితులే ఉన్నాయి. వాటిల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్లో జిల్లాలు కూడా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో కూలీలు కూడా దుర్భర జీవితాన్నే గడుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా 12.4 కోట్లు. వీళ్లంతా ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ గ్రామీణ నియోజకవర్గాల్లో బీజేపీపై పూర్తి పైచేయి సాధించింది. అయితే ఈ సారి వీరి దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వంపై రైతులు, చిరువ్యాపారలు వ్యతిరేకతను పక్కనపెడితే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన దానికన్నా.. తాము రైతులకు చేసిన మేలే ఎక్కువని బీజేపీ చెబుతోంది. అసంతృప్తి ఎదురైతే? 2004లో వాజపేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా గ్రామీణ భారతంలో పూర్తిగా పరిష్కారం కాని సమస్యలున్నాయి. రైతులు, రోజు కూలీలు, కార్మికుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే ఎన్డీయే సర్కారు మౌలిక సదుపాయాల రంగం పైనే ఎక్కువ దృష్టి సారించింది. భారత్ వెలిగిపోతోందని విశ్వసించింది. అదే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గ్రామీణ ప్రాంత ఓటరు నిర్ణయం కారణంగా.. బీజేపీ ఓడిపోయింది. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజా నిర్ణయానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు గీటురాయిగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లలో బ్రాండ్ మోదీ, బీజేపీ మధ్య స్పష్టమైన విభజన ఉంది. 2014 తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా గెలుస్తోందంటే.. దానికి మోదీ మ్యాజిక్ కారణం. మరి ఆ మోదీ మ్యాజిక్ ఈ సారి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను మెప్పిస్తుందో లేదో మరి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ‘గుజరాత్’లో మోగిన ఘంటికలు గతేడాది డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల సమస్యలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. అప్పుడే బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగాయి. మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీపై విముఖత వ్యక్తమైంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. గుజరాత్ జనాభాలో దాదాపుగా 43% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. వారంతా బీజేపీకి అండగా నిలవడంతో ఆ పార్టీ ఎన్నికల్లో గట్టెక్కింది. గుజరాత్తో పోలిస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత ఓటర్లు తక్కువ. మధ్యప్రదేశ్లో 28%, రాజస్తాన్లో 25%, ఛత్తీస్గఢ్లో 23% మాత్రమే పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరి సాయంతోనే ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత సులభం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మందసౌర్ ఘటనతో మేల్కొన్న శివరాజ్ సింగ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో రైతుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ‘భవాంతర్’ స్కీమ్ ద్వారా సోయా, మొక్కజొన్న వంటి పంటలపై క్వింటాల్కు మార్కెట్ రేటుకు అదనంగా రూ. 500 ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కొంతమేర వ్యతిరేకతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. రాజస్తాన్లో పరిస్థితి ఏమాత్రం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు! రాజస్తాన్లో పాకిస్తాన్తో సరిహద్దు రేఖ వెంట గ్రామాల్లో రైతులకు అసెంబ్లీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో శ్రీగంగానగర్ జిలాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గ్రామస్తుల కదలికలపై పరిమితులు విధించారు. ఈ షరతులతో రైతులకు పొలం పనులు చేసుకోవడం కష్టంగా మారింది. ఈ జిల్లాలో దాదాపు 50 గ్రామాలు సరిహద్దు రేఖ వెంబడి ఉన్నాయి. వీటిలో ఐదు గ్రామాల్లో బీఎస్ఎఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. విత్తడం నుంచి కాపు కోతవరకు ప్రతిపనికి రైతులు బీఎస్ఎఫ్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఏ పనైనా ఉదయం 9–4 గంటల మధ్యలోనే ముగించాలనడంతో ఇబ్బంది అవుతోందని రైతులంటున్నారు. దీనికితోడు మూడు అడుగులకు పైన పొడవు పెరిగే పంటలు వేయకూడదని ఆంక్షలున్నాయని వాపోయారు. దీంతో చెరకు లాంటి వాణిజ్య పంటలు కాదని కేవలం కూరగాయలను పండిస్తున్నామని చెప్పారు. కొంతమంది రైతులు ఈ ఆంక్షలకు జడిసి పొలంపనికి పోవడమే మానేశారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం 1982లో పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వీరిలో చాలామందికి ఇంతవరకు పరిహారం దక్కలేదని అక్కడి ప్రజల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ సారవంతమైన భూముల కారణంగా పొలాలకు రేట్లు ఎక్కువ. అయితే ఈ ఆంక్షల కారణంగా పెద్దగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అయితే.. ఇన్ని ఇబ్బందులున్నా ఇక్కడి ప్రజలకు మాత్రం బీఎస్ఎఫ్ వాళ్లంటే చాలా అభిమానం ఉండడం కొసమెరుపు. ఒట్టేసి చెబుతున్నా..! ఎన్నికల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టబోనని ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బల్లగుద్ది చెబుతున్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చటానికే జోగి బరిలో ఉన్నారన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వడంమో, బీజేపీ మద్దతు తీసుకోవడమో చేయను’అని భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్, షాడానీ ప్రకట్ తదితర ఎనిమిది మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలపై మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రమాణం చేశారు. ఇదంతా తనపై బురదజల్లేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల ప్రచారమని దుయ్యబట్టారు. బీజేపీతో జట్టు కట్టడం కన్నా చావడమే మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో సీజేసీ, బీఎస్పీ, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కాంగ్రెస్ భయపడుతోంది. ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో బీజేపీపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని జోగి వైపుకు మరలించి తద్వారా కూటమిని బలహీనపరచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. -
సీబీఐ అంటే వారికి భయం
భోపాల్: బయటకు వెల్లడించలేని రహస్యాలు చాలా ఉన్న వారే సీబీఐ అంటే భయపడతారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో సోదాలు, దర్యాప్తులు చేపట్టకుండా ఏపీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సీబీఐకిచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకోవడంపై ఆయన పైవిధంగా స్పందించారు. అలాగే, తమ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు రాజకీయ చర్య కాదు, నైతికతకు సంబంధించినదని సమర్థించుకున్నారు. ఈ నెల 28వ తేదీన మధ్యప్రదేశ్లో జరగనున్న ఎన్నికలకుగాను శనివారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వెల్లడించకూడని ఎన్నో రహస్యాలు ఉన్న వారే తమ రాష్ట్రాలకు సీబీఐ రావద్దంటారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలానా కేసుకు సంబంధించి అని చెప్పలేను. భవిష్యత్లో అలాంటి అవకాశం ఉందనే భయంతో తీసుకున్న చర్య అది’ అని అన్నారు. ‘మన సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలతోపాటు, రాష్ట్రాలు, కోర్టులు అప్పగించిన కొన్ని తీవ్రమైన కేసులను సీబీఐ విచారిస్తుంది. సీబీఐని అడ్డుకున్నంత మాత్రాన పశ్చిమబెంగాల్లో నర్మద, శారదా చిట్ ఫండ్ స్కాంలపై దర్యాప్తు ముగిసినట్లేనని చెప్పలేను’ అని అన్నారు. వివాదాస్పద నోట్ల రద్దును సమర్థించిన అరుణ్ జైట్లీ ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు ‘అత్యంత నైతికమైన’ చర్యగా పేర్కొన్నారు. ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ వంటి అంశాలతో శనివారం మధ్యప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టో ‘సమృద్ధ మధ్యప్రదేశ్ దృష్టి పత్ర’తో పాటు మహిళలకు ప్రత్యేకంగా ‘నారీ శక్తి సంకల్ప పత్ర’ ను విడుదల చేసింది. రైతులకు రూ.40వేల కోట్ల రుణాల పంపిణీ, వచ్చే ఐదేళ్లలో 80 లక్షల హెక్టార్ల భూమిని సాగు యోగ్యం చేయడం, ఆహార శుద్ధి పరిశ్రమకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి. అందరికీ పని కల్పించడంతోపాటు ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేర్కొంది. మహిళల కోసం.. పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్ల తయారీ మిషన్ల ఏర్పాటు, 12వ తరగతి పరీక్షల్లో 75శాతం మార్కులు సాధించే వారికి స్కూటీల పంపిణీవంటివి ఉన్నాయి. -
అమ్మాయిలకు స్కూటీ, 10 లక్షల ఉద్యోగాలు
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో, పది లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామంటూ హామీల వర్షం కురిపించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో కలిసి అరుణ్ జైట్లీ బీజేపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం బీజేపీ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజకీయాల అజెండాను మార్చేసింది. ప్రజల కనీస జీవన ప్రమాణాలు పెంచడమే తమ అజెండా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం గుపించారు. ‘2003 వరకూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే పట్టణాల్లో కూడా తాగు నీరు, రోడ్లు, కరెంట్ వంటి కనీస సౌకర్యాలు లేవు’ అని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. గ్వాలియార్, జబల్పూర్ నగరాలకు మెట్రో రైలు సౌకర్యం తీసుకోస్తామని హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు స్కూటీ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో మిని స్మార్ట్ సిటిని నిర్మిస్తామన్నారు. ఈ నెల 28న మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు ప్రకటిస్తారు. 2003 నుంచి మధ్యప్రదేశ్లో బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. నాలుగో సారి అధికారం కోసం ఆ పార్టీ శ్రమిస్తోంది. -
మధ్యప్రదేశ్లో ప్రధాన పక్షాలకు రెబల్స్ బెడద
-
ఆ చౌకీదార్ను ప్రజలు దొంగ అంటున్నారు!
భోపాల్: గతంలో ప్రతిచోటా అవినీతి గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మాత్రం ఆ మాట ఎత్తడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘56 అంగుళాల ఛాతీ గురించి మాట్లాడిన మోదీ తనను తాను అవినీతి జరగకుండా కాచుకునే కాపలాదారుడినని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అవినీతి నిర్మూలనపై నోరు మెదపడం లేదు. ఇప్పుడు మోదీ చౌకీదార్ అని అంటే, ప్రజలు వెంటనే ఆ చౌకీదార్ దొంగ అని అంటున్నారు’ అని శుక్రవారం మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దియోరిలో జరిగిన ర్యాలీలో ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలు ప్రారంభించినా కూడా ఎన్డీయే హయాంలో రోజుకు 450 ఉద్యోగాల్నే సృష్టిస్తున్నారని, అదే సమయంలో చైనాలో అయితే సుమారు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకే మరింత ‘మాఫీ’.. ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రూపాయల్ని మాఫీచేసిన ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలోనే మిగిలిన రూ.12 లక్షల కోట్లను కూడా రద్దుచేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘ఓసారి మోదీని కలిసి రైతు రుణమాఫీ గురించి అడిగితే ఆయన నోరు మెదపలేదు. కానీ తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. ఇంకా చెల్లించాల్సి ఉన్న రూ.12 లక్షల కోట్ల రూపాయల్ని కూడా నెమ్మదిగా రద్దుచేస్తారు. నోట్లరద్దు సమయంలో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలు కడితే..విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారు ప్రజాధనంతో దేశం దాటి వెళ్లేలా మోదీ అనుమతించారు. అప్పుడు అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలు క్యూలో నిల్చోవడం చూశారా?’ అని ప్రశ్నించారు. పంజాబ్, కర్ణాటకలలో మాదిరిగా అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్లోనూ 10 రోజుల్లోనే రైతు రుణాల్ని మాఫీచేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 10 రోజుల్లోనే ఈ హామీని అమలుచేయకుంటే, ఆయన్ని పదవి నుంచి తొలగిస్తామని చెప్పారు. -
బలమే బలహీనతై
మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్సింగ్ చౌహాన్ పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నారు. అత్యంత వెనకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. అన్నిరంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్ర పగ్గాలు తీసుకున్న సమయంలో ఉన్న పప్పు అని ఇమేజ్ నుంచి రాష్ట్రమంతా మామ అని ఆప్యాయంగా పిలిపించుకునే స్థాయికి ఎదిగిన చౌహాన్ గత రెండు ఎన్నికల్లో బీజేపీని సులభంగా గట్టెక్కించారు. అయితే ఏకంగా మూడుసార్లు అధికారంలో ఉండటంతో ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కాస్తంత ఎక్కువగానే కనబడుతోంది. వరుసగా నాలుగోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి అంత సులభం కాదనే విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌహన్కు బలం అనుకున్న అంశాలే ఇప్పుడు బలహీనతలుగా మారుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, రైతులు శివరాజ్పై తిరుగుబాటు బావుటీ ఎగరేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు.. మధ్యప్రదేశ్లో పార్టీకి నష్టం చేస్తాయనే భావన వినిపిస్తోంది. ఈ చట్ట సవరణలతో అటు దళితులు, ఇటు అగ్రవర్ణాలు కూడా బీజేపీపై గుర్రుగా ఉన్నారు. బీజేపీకి సంప్రదాయంగా మద్దతుగా నిలిచిన కొన్ని వర్గాలు సొంతం పార్టీలు పెట్టుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్ఏపీఏకేఎస్ ఏర్పాటు మధ్యప్రదేశ్లో అగ్రవర్ణాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలే కాదు, ప్రభుత్వంలో పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం వారిలో అసంతృప్తిని పెంచింది. దీంతో వారు ఓబీసీలతో చేతులు కలిపి సామాన్య పిఛ్డా ఔర్ అల్పసంఖ్యాక వర్గ కర్మచారి సంస్థ (ఎస్ఏపీఏకేఎస్) ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. ఓటర్లలో అగ్రవర్ణాలు 15%, ఓబీసీ ఓటర్లు 37%. గత 30 ఏళ్లుగా బీజేపీకే మద్దతుగా ఉన్నాయి. దళితుల్లో అసంతృప్తి బీజేపీ ప్రభుత్వం దళితులకు పలు పథకాలు తీసుకొచ్చినా.. రోహిత్ వేముల ఉదంతం, గుజరాత్లోని ఉనాలో దళిత యువకులపై దాడుల వంటి ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్ ఓటర్లలో 16% దళితులే. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ సమయంలో మధ్యప్రదేశ్లో ఎక్కువగా నిరసన స్వరాలు వినిపించాయి. జై ఆదివాసీ యువ సంఘటన్ మధ్యప్రదేశ్లో ఆదివాసీ ఓటర్లు 23%. గత రెండు సార్లు వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎస్టీల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీయే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఆదివాసీల సంక్షేమం కోసం డాక్టర్ హీరాలాల్ ఏర్పాటు చేసిన జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) బీజేపీకి పక్కలో బల్లెంలా మారుతోందనే అంచనాలున్నాయి. ఒక సామాజిక సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన జేఏవైఎస్తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అన్నదాతల ఆగ్రహం శివరాజ్సింగ్ చౌహాన్ రైతు బిడ్డ. అయినా ఆ రైతులే ఆయనకు వ్యతిరేకంగా మారారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఏడాది మందసౌర్ నిరసనల్లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించడం బీజేపీకి తీవ్ర నష్టం చేయనుందని అంచనా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడంతో రైతులు కాంగ్రెస్ వైపు మరలుతారని భావిస్తున్నారు. కేంద్రంపై వ్యతిరేకత గత ఎన్నికల్లో బీజేపీ విజయానికి మోదీ మ్యాజిక్ ప్రధాన కారణం. యూపీఏపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు బీజేపీకి ఓటేశారు. కానీ ఈ సారి కేంద్రంపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అంచనా. ఈ వ్యతిరేకత ఈ సారి చౌహాన్కు నష్టం చేకూరుస్తుందంటున్నారు. బలాలు ♦ ప్రజలతో మమేకం కావడం ♦ పని రాక్షసుడని పేరు ♦ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బలహీనతలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ♦ రైతుల్లో అసంతృప్తి ♦ వ్యాపమ్ సహా పలు కుంభకోణాలు ♦ బంధుప్రీతి ఎక్కువన్న ఆరోపణలు చెక్ పెట్టగలరా? చౌహాన్ జోరును ఆపేందుకు విపక్షం విశ్వప్రయత్నం ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ భరోసా పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మధ్యప్రదేశ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కనపెట్టి సొంత ఇమేజ్తో మళ్లీ గెలవాలని శివరాజ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా ప్రవేశపెట్టిన పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అటు, ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. అయితే కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతే తప్ప కాంగ్రెస్ నేతల గొప్పదనమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరుపార్టీల్లోనూ నిరసనల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్లో అగ్రనేతలే తమ వర్గానికి టికెట్లు ఇవ్వాలంటూ బహిరంగంగా విమర్శలు చేసుకుంటుంటే.. టికెట్ల పంపిణీ బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ప్రజలతో ఆప్యాయంగా మామా అనిపించుకుంటున్న చౌహాన్ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. వివాదంలో కాషాయ నేతలు బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం ఏ మాత్రం కనిపించడం లేదు. సీనియర్ నాయకులెందరో వివాదాల్లో ఇరుక్కున్నారు. నరోత్తమ్ మిశ్రా పెయిడ్ న్యూస్ కేసులో ఇరుక్కుంటే, ఎమ్మెల్యే మఖాన్ సింగ్ జాటవ్ హత్య కేసులో.. లాల్ సింగ్ ఆర్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రుణాలకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న సురేంద్ర పాత్వా, కోడలు ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్పాల్ సింగ్.. ఇలా కాస్త పేరున్న నాయకులందరూ వివాదాల్లో చిక్కుకొని పార్టీకున్న ఇమేజ్ను చెరిపేస్తున్నారు. ఇతర సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, సర్తాజ్ సింగ్, కుసుమ్ మహ్దెలేలు టిక్కెట్లు నిరాకరించడంతో తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. బహిరంగంగానే పార్టీకి డ్యామేజ్ జరిగేలా వ్యాఖ్యలుచేశారు. తన కోడలు కృష్ణకు టిక్కెట్ ఇచ్చిన తర్వాత బాబూలాల్ గౌర్ శాంతించారు. సర్తాజ్ సింగ్ ఏకంగా పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు, పార్టీకి గట్టిపట్టున్న ఇండోర్, విదిశ, మహూ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీలో అంతర్గత పోరు పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయ, పార్లమెంటు స్పీకర్ సుమిత్ర మహాజన్లకు పడడం లేదు. కాంగ్రెస్ విశ్వప్రయత్నం ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో పోటీ చేయడానికి ఈ రాష్ట్రంలో గెలుపు చాలా ముఖ్యం. అందుకే అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులు, మహిళలు, యువత, పారిశ్రామిక రంగం ఇలా అత్యధిక జనాభా ఉన్న ఏ రంగాన్ని విడిచిపెట్టకుండా వారిని తమవైపు తిప్పుకునే వ్యూహాలు పన్నుతోంది. ఆ ముగ్గురిపై నమ్మకం కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో నాయకత్వ లేమితో సతమతమవుతోంది. ప్రజాకర్షణ కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కానీ మధ్యప్రదేశ్లో పరిస్థితి వేరు. ఒక్కరిద్దరు కాకుండా ముగ్గురు బలమైన నేతలుండటం పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. అంతర్గత పోరు ఉన్నప్పటికీ.. ఒక్కో నాయకుడికి ఒక్కో ప్రాంతంలో పట్టుండడం విశేషం. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్కు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో మంచి పట్టు ఉంది. పీసీసీ చీఫ్ కమల్నాథ్కు మహాకౌశల్ ప్రాంతంలో తిరుగేలేదు. ఇక ఎన్నికల ప్రచార సారథి జ్యోతిరాదిత్య సింధియాకు గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో మంచి ఇమేజ్ ఉంది. టిక్కెట్ల పంపిణీలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ప్రాంతీయ, కుల సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకొని నేతలందరూ ఇంచుమించుగా సంతృప్తి చెందేలా టిక్కెట్లు ఇచ్చింది. -
'హిందీ' మూడ్ 'ఎటో'?
రేపటి దేశ భవిష్యత్తును హిందీ మాట్లాడే రాష్ట్రాలే నిర్ణయించబోతున్నాయి. రాజస్తాన్ నుంచి బిహార్ వరకు విస్తరించి ఉన్న హిందీబెల్ట్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన వారికే ఢిల్లీ పీఠానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లు కీలకంగా మారబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 ఎంపీ స్థానాలుండగా.. 2014లో బీజేపీయే 63 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ మోదీని సీఎం చేయాలంటే ఈ మూడు చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం బీజేపీకి అత్యంత ఆవశ్యకం. అటు కాంగ్రెస్కు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. రాహుల్ను ప్రధానిని చేయాలనుకుంటున్న ఏఐసీసీ పెద్దల కల నెరవేరాలంటే ఈ మూడు చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. అందుకే ఏదేమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తమ అస్త్ర, శస్త్రాలకు పదునుపెడుతున్నాయి. మిజోరంలో ఒక్క లోక్సభ స్థానమే ఉండటం.. తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోవడంతో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ తరఫున ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతను ఆరెస్సెస్ భుజాన వేసుకుంది. పట్టణ నియోజకవర్గాలతోపాటు, ఎస్సీలు, ఆదివాసీలకు రిజర్వ్డ్ అయిన చోట్ల కూడా సంఘ్ పని కారణంగా బీజేపీపై వ్యతిరేకత ఉండకపోవచ్చని తెలుస్తోంది. జోగితో నష్టమెవరికి? ఛత్తీస్గఢ్లో చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య 10 సీట్ల తేడా మాత్రమే ఉంది. 2013లో ఓట్ల తేడా కూడా 0.75% మాత్రమే. చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్లే బీజేపీ నెగ్గిందనే విశ్లేషణలున్నాయి. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత ఉంది. అయితే ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకునే క్రమంలో కాంగ్రెస్కు అజిత్జోగి రూపంలో నష్టం జరుగుతుందని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ సీఎంగా ఉన్న జోగి కొత్త పార్టీ ఏర్పాటుచేయడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతల్ని రాహుల్ గాంధీ స్వయంగా మోస్తున్నప్పటికీ.. జోగి రూపంలో ముప్పు కాంగ్రెస్కు ఎంత నష్టం చేస్తుందో చెప్పలేని స్థితి. రాజేయోగం ఉందా? బీజేపీకి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నది రాజస్థాన్లోనే. సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల్లో ఆమెకున్న పట్టు, ఆరెస్సెస్ అండదండల కారణంగా బీజేపీ అధిష్టానం.. సీఎం అభ్యర్థిని మార్చే సాహసం చేయడంలేదు. అభ్యర్థుల జాబితాలోనూ రాజే మార్క్ స్పష్టంగా కనిపించింది. అయితే.. రాజస్తాన్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న రాజ్పుత్లు బీజేపీకి దూరం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. రాజ్పుత్ వర్గానికి చెందిన ఆనంద్పాల్ సింగ్ ఎన్కౌంటర్.. ఆ తర్వాత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడం వంటి ఘటనలతో రాజ్పుత్లు బీజేపీకి ఓటేయరంటూ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇది బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ రాష్ట్రంలో గెలుపు ఖాయం అని నమ్ముతున్న కాంగ్రెస్.. ఇతర రాష్ట్రాల్లోలాగా ఆధిపత్య పోరు లేకుండా స్థానిక నేతల మధ్య సమన్వయంతో ముందుకెళ్తోంది. పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కలిసిపని చేస్తుండటం కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. శివరాజసం నిలిచేనా! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోరులో హోరాహోరీ పోరు నెలకొంది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అయితే దీన్ని పూర్తిగా తనకు అనకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా 8.5%. అయితే ఈసారి ఎవరు గెలవాలన్నా 9–10% తేడా లక్ష్యంగానే ప్రచారం చేయడం, వ్యూహాలను పన్నడం ఆధారపడి ఉంటుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్నాథ్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మధ్య విభేదాలతో.. కార్యకర్తల్లో ఇంకా పూర్తిగా ఎన్నికల జోష్ రాలేదు. అయితే.. ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలతో బీజేపీకి దళితులు, అగ్రవర్ణాలు దూరమవుతారని తాజా సర్వేలంటున్నాయి. అటు, కాంగ్రెస్ కూడా ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది. బుందేల్ ఖండ్, మహాకౌశల్, బాఘేల్ ఖండ్ ప్రాంతాల్లో అగ్రవర్ణాల ఓట్లు బీజేపీని దెబ్బతీస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో హిందుత్వ ఓట్లను సంపాదించుకునేందుకు రాహుల్ శివభక్తుడిగా మారారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ హిందుత్వ ఛాయలు కనబడుతున్నాయి. రైతే ఎన్ని‘కల’ రాజు! మధ్యప్రదేశ్లో రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు బీజేపీని భయపెడుతున్నాయి. గతేడాది మందసౌర్లో అల్లర్లు, ఆరుగురు రైతుల మృతి, పలు వ్యవసాయరంగ సమస్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో రైతులతోపాటు ఇతర వర్గాల్లోనూ ప్రభుత్వంపై కాస్తంత విముఖత వ్యక్తమవుతోంది. అయితే రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలకు ముందే చౌహాన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పంటలకు అధికర ధర వచ్చేలా భుగ్తానా యోజనను తీసుకొచ్చారు. ఈ పథకమే తన పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఎంపీల కష్టమే ఎక్కువ! పార్లమెంట్ సభ్యులతో పోలిస్తే దేశంలోని వివిధ అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు ఏడాదిలో తక్కువ రోజులు పనిచేస్తున్నారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు మరింత తక్కువ రోజులు కష్టపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. సగటున దేశంలో ఎమ్మెల్యేలు ఏడాదికి దాదాపు 28– 46 పనిదినాలు నమోదు చేయగా, పార్లమెంటు సభ్యులు ఏటా 70 పనిదినాలు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. 2011––2016 కాలంలో దేశంలోని 26 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల పనిగంటలను సంస్థ విశ్లేషించింది. ప్రజల తరఫున ఎన్నికైన సభ్యులు ప్రజా సమస్యలను చర్చించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని నివేదిక గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. 26 అసెంబ్లీల్లో 50 శాతం అంటే దాదాపు 13 అసెంబ్లీలు సరాసరిన ఏడాదికి కేవలం 28 రోజులే సమావేశమవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎక్కువగా బడ్జెట్ సెషన్లోనే అసెంబ్లీలకు హాజరవుతున్నారు. మిగిలిన సెషన్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏడాదికి కేరళ, కర్నాటక అసెంబ్లీలు సుమారు 46 రోజుల పాటు సమావేశమవుతున్నాయి. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర(45 రోజులు), ఒడిషా(42 రోజులు), జమ్ము అండ్ కాశ్మీర్(39 రోజులు) ఉన్నాయి. తక్కువ పనిదినాలు నమోదు చేస్తున్న అసెంబ్లీల జాబితాలో నాగాలాండ్, ఢిల్లీ, సిక్కిం తొలిస్థానాలు ఆక్రమించాయి. ఇదే సమయంలో పార్లమెంటులో లోక్సభ సభ్యులు ఏడాదికి సుమారు 70 పనిదినాలు, రాజ్యసభ సభ్యులు 69 పనిదినాలు నమోదు చేశారు. పార్లమెంటులో కూడా బడ్జెట్ సెషన్లోనే హాజరు శాతం ఎక్కువ. అసలు కంటే కొసరే ..! మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అక్కడి ఎమ్మెల్యేల వేతనానికి సంబంధించిన వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రభుత్వం జీతాలు, అలవెన్సుల రూపంలో ఈ దఫా ఎమ్మెల్యేలకు చెల్లించిన మొత్తం అక్షరాల రూ.149 కోట్లు. ఎన్నికల ప్రచారం ఊపందకున్న నేపథ్యంలో.. సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ కింద సమర్పించిన దరఖాస్తుకు అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన సమచారం ఇది. దీని ప్రకారం మొత్తం 231 మంది శాసనసభ్యులు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఏప్రిల్ 2013 నుంచి సెప్టెంబర్ 2018 వరకు జీతాల కింద రూ.32 కోట్లు చెల్లించారు. అదే సమయంలో అలవెన్సుల కింద రూ.117 కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యేల టీఏల కింద రూ. 34.03 కోట్లు వెచ్చించారు. ఇక్కడి ప్రజల కోసం ఎమ్మెల్యేలు ఎంత కష్టపడి పని చేశారో తెలియదు కానీ.. వారి జీతం కంటే అలవెన్సులే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2017–18 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి అదాయం రూ.79,907 కాగా.. శాసన సభ్యుల ఏడాది సగటు ఆదాయం రూ.14.48 లక్షలుగా ఉంది. -
తుపాకీ 'రాయుళ్లు'!
ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, సొంత వాహనాలు, వ్యవసాయ భూములు, బ్యాంకు డిపాజిట్లు చూపించడమే మనకి ఇప్పటివరకు తెలుసు. కానీ మధ్యప్రదేశ్లో నేతల రూటే సెపరేటు. తుపాకీ ఉన్నోడే నాయకుడు అనుకుంటున్నారో, ఏమో తమ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, వాటి విలువెంతో లెక్కలు కట్టి మరీ అఫిడవిట్లో సమర్పిస్తున్నారు. వారి దగ్గరున్న ఆయుధాల చిట్టా చూస్తే విస్తుపోవాల్సిందే. ఒక్కొక్క నేత ఇల్లు ఒక్కొక్క ఆయుధ భాండాగారం అని అనిపించకమానదు. పది వేల రూపాయల విలువైన చిన్నపాటి రివాల్వర్ దగ్గర్నుంచి 4.5 లక్షల రూపాయల ఖరీదైన రైఫిల్ వరకు అన్ని రకాల ఆయుధాలు వారి దగ్గరున్నాయి. నేతలకు ఈ తుపాకులతో పనేంటి అని ప్రశ్నలు వస్తే ఆత్మరక్షణ కోసమే అన్న సమాధానం వినిపిస్తోంది. సీఎం శివరాజ్ చౌహాన్ దగ్గర రూ.5,500 విలువైన రివాల్వర్ ఉంటే, ఆయన ప్రత్యర్థి, మాజీ పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ దగ్గర లక్ష రూపాయల విలువైన రైఫిల్, రివాల్వర్ ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కున్వర్ విజయ్ షా దగ్గర రెండు రైఫిల్స్, ఒక రివాల్వర్ ఉంటే, మరో బీజేపీ నాయకుడు శరద్ జైన్ వద్ద లక్ష రూపాయల రివాల్వర్ ఉంది. కాంగ్రెస్ నేతలకు నాలుగు తుపాకులు ఎక్కువే ఆయుధాల విషయంలో కాంగ్రెస్ నాయకులు నాలుగాకులు ఎక్కువే చదివారు. రాజ్నగర్ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ దగ్గర ఏకంగా నాలుగు ఆయుధాలు ఉన్నాయి. ఒక డబుల్ బారెల్, 30–06 రైఫిల్, .375 మాగ్నం ఇలా మొత్తంగా 4.5 లక్షల విలువైన ఆయుధాలు ఉన్నాయి. మరో ఇద్దరు నేతలు రామ్నివాస్ రావత్, గోవింద్ సింగ్ల దగ్గర మూడేసి ఆయుధాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ రాజేంద్ర సింగ్ అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న రైఫిల్స్ ఉన్నాయి. వీటి విలువ 1.8 లక్షల వరకు ఉంటుంది. ఇక చాలా మంది అభ్యర్థుల దగ్గర 12 బోర్, 315 బోర్ రైఫిల్స్ ఉన్నట్టు అఫిడవిట్లో సమర్పించిన వివరాలతో వెల్లడైంది. ఇద్దరు మహిళా అభ్యర్థుల దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి. అయితే అక్రమంగా ఆయుధాలున్న నేతలు కూడా చాలా మందే ఉన్నారు. నాకు టికెట్ వద్దు! ఎన్నికల్లో నాకు సీటివ్వలేదని అలిగి రెబెల్గా పోటీచేసే వాళ్ల గురించి రోజూ చూస్తేనే ఉన్నాం. ఎన్నిసార్లు పోటీ చేసి.. గెలుస్తూనే ఉన్నా తనివితీరని వాళ్లకు లెక్కే లేదు. అలాంటిది.. ఈ సారి పోటీ నుంచి నన్ను మినహాయించండని ఎవరైనా అడుగుతారా? కానీ ఇలాగే అడిగేశారు మధ్యప్రదేశ్ మంత్రి సూర్యప్రకాశ్ మీనా. ‘అయ్యా ఈసారి పోటీ చేసే ఓపిక లేదు. దయచేసి ఎన్నికల బరినుంచి నన్ను మినహాయించండి’ అని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖరాశారు. ఈ లేఖ మధ్యప్రదేశ్లో ఆసక్తికర అంశంగా మారింది. మధ్యప్రదేశ్ ఉద్యానవన, ఆహార మంత్రిత్వ శాఖ (స్వతంత్ర) మంత్రి సూర్య ప్రకాశ్ మీనా.. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. విదిశ ఎంపీ నియోజకవర్గంలోని ఐదు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి 100%చిత్తశుద్ధితో పనిచేస్తాను’ అని లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని శంషాబాద్ నియోజవకర్గం నుంచి 2008, 2013లో ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. తన పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతోనే ఆయన తప్పుకున్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఓట్లు అడగకండి ప్లీజ్ ఇది మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా బాగ్నా ప్రాంత ప్రజల విజ్ఞప్తి. విషయం ఏమిటంటే..ఇక్కడ దాదాపు 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఏడు కాలనీల ప్రజలకు గుర్తింపు, ఇళ్ల పట్టాలు, కనీస సౌకర్యాలు సమస్య ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చి, మీకు చట్టబద్ధత కల్పిస్తామని, అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుతామని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికలయ్యాక వాటిని మర్చిపోతున్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఎన్నికల ప్రచారం కోసం వారి కాలనీల్లోకి వచ్చే నాయకులకు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ‘మేము చట్టబద్ధం కానప్పుడు, మా ఓటు చట్టబద్ధం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని ఓట్లు అడగకండి ప్లీజ్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మా సమస్యలు తీరేంత వరకు ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. ఓటు కోసం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొదంటూ ఇళ్ల గోడలపై ప్రజలే పోస్టర్లు వేసి మరీ నిరసన తెలుపుతున్నారు. ఓ మహిళ మరీ ఆగ్రహంతో ఊగిపోతూ...ఓట్లు అడగడానికి వచ్చిన వారికి చెప్పులతో స్వాగతం పలుకుతామని హెచ్చరించడం స్థానిక నేతలను నివ్వెరపరచింది. -
టికెట్ దక్కలేదని..
జీవితాన్నంతా తాము నమ్మిన సిద్ధాంతానికే అర్పించారు. పార్టీకి కష్టం వచ్చిన ప్రతిసారీ మేమున్నామంటూ స్థైర్యాన్నిచ్చారు. కానీ తమ వంతు వచ్చేసరికి.. పార్టీ ‘పక్క’రాగం అందుకోవడంతో నిశ్చేష్టులయ్యారు. నిరాశ, ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీనస్థితికి నిదర్శనమిది. అటు ఓ బీజేపీ టికెట్ ఆశించిన నేతకూ చివరి నిమిషంలో ఆ పార్టీ షాకిచ్చింది. కాంగ్రెస్లోనూ టికెట్ రాలేదన్న నిరాశతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్సింగ్ కుశ్వాహ ఆత్మహత్యాయత్నం చేశారు. గ్వాలియర్ నుంచి ప్రేమ్సింగ్ టికెట్ ఆశించగా.. కాంగ్రెస్ అధిష్టానం కూడా చివరి నిమిషంలో స్థానికేతరుడైన మదన్సింగ్ కుశ్వాహకు టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ్సింగ్ గ్వాలియర్లోని మాధవ్రావ్ సింధియా విగ్రహం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేస్తూనే.. వెంట తెచ్చుకున్న విషాన్ని తాగారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రేమ్సింగ్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ‘పార్టీలో కొందరు నేను బీజేపీలో చేరుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారం. 46 ఏళ్లుగా కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పనిచేశాను. నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటాను. మాధవ్రావ్ సింధియాతో కలిసి 35 ఏళ్లు పనిచేశాను. కాంగ్రెస్ నాయకత్వం అహంకార పూరితంగా, చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తోంది. బహిరంగంగానే ఇందిర, రాజీవ్లను తిట్టిన వారికి టికెట్లు ఇవ్వడం దారుణం’ అని లేఖలో పేర్కొన్నారు. బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అత్వార్ సింగ్ అనే సీనియర్ బీజేపీ కార్యకర్త జబల్పూర్ (పశ్చిమ) టికెట్ను ఆశించారు. తనకు పార్టీలో పోటీ ఎవరూ లేకపోవడంతో అదే ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం చివరి నిమిషంలో హరేంద్రజీత్ సింగ్కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆవేదన చెందిన అత్వార్ జబల్పూర్లోని బీజేపీ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోతుండగానే.. అక్కడున్న కార్యకర్తలు అడ్డుకున్నారు. ముస్లింలకు నిరాశేనా! మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్న ముస్లింలకు ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. నవంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక ముస్లిం అభ్యర్థినే బరిలో దించగా.. కాంగ్రెస్ ముగ్గురికి అవకాశం కల్పించింది. బీజేపీ తరఫున ఫాతిమా సిద్దిఖీ భోపాల్ (ఉత్తరం) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈమె మాజీ మంత్రి రసూల్ అహ్మద్ సిద్దిఖీ కూతురు. కాంగ్రెస్ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరిఫ్ అకీల్ బరిలో ఉన్నారు. బుర్హాన్పూర్ నుంచి హమీద్, భోపాల్ (సెంట్రల్) నుంచి ఆరిఫ్ మసూద్లు పోటీ చేస్తున్నారు. ‘బీజేపీ నుంచి మేం సీట్లను ఆశించడం లేదు. మా రాష్ట్రం ముస్లిం నేతలు జాతీయ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాం. అందుకే మేం కాంగ్రెస్పైనే ఆశలు పెట్టుకున్నాం. మొదట్నుంచీ మా మద్దతు కాంగ్రెస్కే’ అని మధ్యప్రదేశ్ ముస్లిం వికాస్ పరిషత్ కన్వీనర్ మహ్మద్ మాహిర్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 8–9%. అయితే తమ జనాభాకు తగ్గట్టుగా ప్రజాప్రాతినిధ్యం లేదని ముస్లిం మేధావులంటున్నారు. అయితే.. కాంగ్రెస్లో మాత్రం గెలిచే అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ద్వారానే టికెట్ల ఎంపిక జరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా పేర్కొన్నారు. -
క్యాస్టే... బూస్ట్
భారత రాజకీయాలు, ఎన్నికల్లో కులాల పాత్రను వేరుగా చూడలేం. ఈ ఒక్క రాష్ట్రానికి అది మినహాయింపు అని చెప్పలేం. చిన్న కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పెద్దరా ష్ట్రాలైన మధ్యప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాలవరకు ప్రతిచోటా కుల సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. అందుకే పార్టీలన్నీ సోషల్ ఇంజనీరింగ్పైనే దృష్టి పెడుతున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) జరిపిన అధ్యయనంలో మధ్యప్రదేశ్లో పోలయ్యే ఓట్లలో 65% కులం ఆధారంగా పడేవేనని వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ శాతంలో కులం ఓట్లు పడవు. ఇక్కడ చాలా కులాలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు, ఓబీసీలదే ఆధిపత్యం. రాష్ట్ర జనాభాలో 55% ఉన్న ఈ వర్గం (రాజ్పుత్, యాదవ, బ్రాహ్మణ వర్గాలు) బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇందులో అగ్రవర్ణాలు 22%. ఎస్సీ, ఎస్టీల జనాభా 37%. వీరిలో ఎస్సీలు కాంగ్రెస్కు అండగా ఉండగా.. ఎస్టీల్లో మెజారిటీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. మిగిలిన కులాలతో పోలిస్తే సరైన చైతన్యం లేకపోవడంతో రాజకీయంగా వీరు ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్లో అగ్రవర్ణాలు, ఓబిసీలదే పైచేయిగా ఉంది. ప్రధాన పార్టీలు కూడా ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం ఉమాభారతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ సింగ్లు ఓబీసీలే కావడం రాష్ట్రంలో వారి పరపతి ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. కుల సమీకరణాలు మారుతున్నాయ్ 2018లో ఈ కుల సమీకరణాల్లో మార్పు వచ్చింది. ఓబీసీలకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో అగ్రవర్ణాలు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు చేయడంపైనా.. బీజేపీ వైఖరి అగ్రవర్ణాలకు రుచించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతుగా ముందుకు రాకపోవడంతో వారు ఆ పార్టీని కూడా తప్పుపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ జనాభా 7 కోట్లు కాగా.. ఇందులో 52% అగ్రవర్ణాలు, ఓబీసీలున్నారు. ఎస్సీలు 16%, ఎస్టీలు 21% ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర జనాభాలో 91% హిందువులుండగా.. ముస్లింలు 7%, ఇతర మైనారిటీలు 2%గా ఉన్నారు. ఓబీసీలదే మెజారిటీ సంఖ్యాపరంగా చూస్తే ఈ ఛత్తీస్గఢ్లో 42% ఉన్న ఓబీసీలదే (కుర్మీలు, సాహులు) మెజారిటీ. బ్రాహ్మణులు, యాదవులు ఉన్నప్పటికీ రాజకీయాలను ప్రభావితం చేసే సంఖ్యలో లేరు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు ఓబీసీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 2.56 కోట్లు కాగా.. వీరిలో ఎస్సీలు 12.82%, ఎస్టీలు 30.62%. మొత్తం జనాభాలో 93.25% హిందువులు. ఓబీసీల్లో ఎక్కువ మంది కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. అయితే, అజిత్జోగి హయాంలో కాంగ్రెస్ తమను చిన్నచూపు చూసిందన్న కోపంతో బీజేపీ వైపు మళ్లారు. అజిత్జోగి, రమణ్ సింగ్, భూపేష్ భగేల్, తామ్రధ్వాజ్ సాహులు రాష్ట్రంలో పేరొందిన ఓబీసీ నేతలు. తల్లీకొడుకుల సవాల్! ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్శిస్తున్న స్థానం దంతేవాడ నియోజకవర్గం. ఇందుకు కారణం.. తల్లీకొడుకులు వేర్వేరు పార్టీలనుంచి బరిలో ఉండటమే. నక్సలైట్ల చేతిలో చనిపోయిన సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ భార్య దేవతికి (సిట్టింగ్)కి ఈసారి కూడా ఆమెకే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఈ స్థానం నుంచి ఈసారి మహేంద్ర కర్మ కుమారుడు ఛవీంద్ర కర్మ ఎస్పీ టికెట్పై బరిలో దిగారు. ఇన్నాళ్లూ తల్లికి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉన్న చవీంద్ర బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పోటీ చేయొద్దంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఛవీంద్రను కలిసి బతిమాలినప్పటికీ ఫలితం కనిపించలేదు. ‘అమ్మకు నేను వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన బూటకపు హామీలపైనే నా పోరాటం’ అని ఛవీంద్ర పేర్కొన్నారు. -
రామ్.. నర్మద.. గోమూత్ర
భోపాల్: త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ‘వచన్ పత్ర’ను శనివారం విడుదల చేసింది. ఈ వచన్పత్రలో కాంగ్రెస్ ‘రామ్–నర్మద–గోమూత్ర’ అంశాలనే ప్రాతిపదికగా తీసుకుంది. వీటి ప్రకారం.. ‘రాష్ట్రంలో ఆధ్యాత్మిక విభాగ్ పేరుతో ఆధ్యాత్మిక శాఖ ఏర్పాటు, సంస్కృత భాష వ్యాప్తి, 14 ఏళ్ల అరణ్య వాసం సమయంలో శ్రీరాముడు సంచరించిన ‘రామ్ పథ్’ అభివృద్ధి, గో మూత్రం, పిడకలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం, ప్రతీ గ్రామంలో గోశాల, హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నదీ పరిరక్షణకు చర్యలు, నర్మద తీరాన ఉన్న పుణ్య క్షేత్రాల అభివృద్ధికి రూ.1,100 కోట్ల నిధుల కేటాయింపు వంటివి ఉన్నాయి. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించే ‘వ్యాపమ్’ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ సంస్థ నిర్వహించిన పలు పరీక్షలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యాపమ్ బదులు మరో సంస్థను ఏర్పాటుచేసి అవినీతికి తావులేని విధంగా పరీక్షలను నిర్వహణ, 70శాతం మార్కులు సాధించే 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేస్తామని పేర్కొంది. కళాశాల విద్యార్థినులకు సబ్సిడీపై సైకిళ్లు ఇస్తామని తెలిపింది. -
‘హోమ్’ మినిస్టర్లే రిచ్!
భార్యలకన్నా భర్తల ఆదాయాలే ఎక్కువగా ఉండే సందర్భాలు చాలానే చూశాం. కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం విచిత్రంగా హోం మినిస్టర్ల (భార్యల) ఆదాయమే భర్తలకన్నా ఎక్కువగా ఉంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మొదలుకుని.. ఎమ్మెల్యేల వరకు చాలా మంది విషయాల్లో వారి ఇంటి మహాలక్ష్మి పర్సే చాలా బరువుగా కనబడుతోంది. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. బీజేపీ, కాంగ్రెస్తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులూ ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ వివరాలు బయటకొచ్చాయి. ఇందులో సీఎం చౌహాన్ ఆస్తి రూ.19.7 లక్షలు కాగా.. ఆయన భార్య సాధనా సింగ్ ఆస్తి రూ.37.94లక్షలుగా పేర్కొన్నారు. కొందరు మంత్రుల ఆదాయం కన్నా భార్యల ఆదాయం మూడురెట్లుండటం గమనార్హం. -
ఆ 5 నగరాలే కీలకం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ – సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎన్నికల ముందస్తు సర్వేలో అంచనా వేసింది. సాధారణంగా భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్లు బీజేపీ, కాంగ్రెస్లకు కీలకం. ఈ ఐదు నగరాల్లో ఎన్ని ఎక్కువ సీట్లు సాధిస్తే అంత ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. ఈసారి బీజేపీ గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజారిటీ బాగా తగ్గుతుందనీ, 230 సీట్లున్న శాసన సభలో బీజేపీ 122, కాంగ్రెస్ 95 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. 2013 ఎన్నికల్లో బీజేపీకి 165, కాంగ్రెస్కు 65 సీట్లు వచ్చాయి. ఈ నెల 28న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉండే సీట్లలో 70శాతం బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనీ, కాంగ్రెస్ 27శాతమే దక్కించుకోగలదని సర్వే వెల్లడించింది. చౌహాన్ ముఖ్యమంత్రి కావాలని 40.11% ఓటర్లు కోరుకోగా, కమల్నాథ్కు 20.32%, జ్యోతిరాదిత్య సింధియాకు 19.65% మద్దతు పలికారు. ప్రాంతాల వారీగా చూస్తే చంబల్ మినహా మల్వా నిమార్, బఘేల్ఖండ్,భోపాల్, మహాకౌశల్లలో ఇతర పార్టీల కంటే బీజేపీదే పైచేయిగా ఉంది.సర్వేలో భాగంగా 77 నియోజకవర్గాల్లో 9240 మంది అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని గత ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ఐదు నగరాలు... భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిన్లు రెండు పార్టీలకూ కీలకం. ఈ ఐదు నగరాల్లో మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంతవరకు ఈ నగరాలు బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈ కోటల్ని బద్దలు కొట్టగలిగితేనే చౌహాన్ అధికారంలోకి రాకుండా నిరోధించగలుగుతుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో ఈ నగరాల్లో బీజేపీదే పై చేయి. గత ఎన్నికల(2013)విషయానికి వస్తే ఇక్కడున్న 36 సీట్లలో బీజేపీ 30 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఆరింటితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇవి కాకుండా సత్నా, సాగర్ వంటి వాణిజ్యప్రధాన ప్రాంతాలు కూడా పార్టీ గెలుపులో కీలక భూమిక వహిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి 51 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి సీట్లే కాక ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి. ఇటీవలి సర్వేలో పట్టణాల్లో బీజేపీ ఓట్ల శాతం 40 నుంచి 45 శాతానికి పెరిగిందని, కాంగ్రెస్ ఓట్ల శాతం 25–35 శాతాల మధ్య ఊగిసలాడుతోందని వెల్లడయింది. ఓట్ల శాతంలో తక్కువ తేడా ఉన్నా సీట్ల సంఖ్యలో తేడా వస్తుంది. ఈ కారణంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరుగుతోందని టైమ్స్ నౌ తేల్చింది. ఏబీపీ–సీఓటర్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్కు 42శాతం ఓట్లు, బీజేపీకి 40శాతం వస్తాయని అంచనా వేసింది. ఈ తేడాను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే 117 సీట్లు గెలుచుకోవడం కష్టం కాదని ఆ సర్వే పేర్కొంది. అయితే, ఈ లక్ష్యం సాధించాలంటే కాంగ్రెస్ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఓట్లను కొల్లగొట్టి ఎక్కువ సీట్లు సాధించాల్సి ఉంటుందనీ, అదంత సులభం కాదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం, వ్యవసాయ సంక్షోభం, బీజేపీ ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఉపయోగించుకుని, విభేదాల్ని తాత్కాలికంగానైనా పక్కనపెట్టి గట్టి అభ్యర్ధులను పోటీకి దింపితే–ముఖ్యంగా ఈ ఐదు నగరాల్లో– ఫలితాలను తిరగరాసే అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది. -
నాణేలు.. ‘పది’వేలు
మధ్యప్రదేశ్లో నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్గా 10 వేల ‘రూపాయి’ బిల్లలు(నాణేలు) చెల్లించి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు దీపక్ పవార్ అనే అభ్యర్థి. ఇండోర్–3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవార్ నామినేషన్ పత్రాలతోపాటు ఓ సంచీలో ఒక రూపాయి నాణేలు పదివేలు తీసుకువచ్చారు. వీటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. చేసేదేమీ లేక చివరకు...ఐదుగురు సిబ్బందితో దాదాపు 90 నిమిషాల పాటు నాణేలు లెక్కించారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశ్వత్ శర్మ మాట్లాడుతూ ‘నామినేషన్కు అఖరు తేదీ కావడంతో పవార్ చెల్లించిన 10 వేల రూపాయి బిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మా సిబ్బంది లెక్కించారు. నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్కు సంబంధించిన రశీదును ఆయన ఇచ్చాం’ అన్నారు. ఇంతవరకు ఎన్నికల నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద ఎవరూ ఇలా రూపాయి నాణేలను ఇవ్వలేదన్నారు. పదివేల రూపాయి నాణేలు ఇవ్వడంపై అభ్యర్థి దీపక్ పవార్ మాట్లాడుతూ ..‘నేను విరాళాల ద్వారా స్వీకరించిన మొత్తం రూపాయి నాణేలే. అందుకే అవే సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాను’ అని చెప్పకొచ్చారు. ‘బుధ్నీ’కా రాజా! మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లా బుధ్నీ నియోజవకర్గం.. ఆ రాష్ట్ర సీఎం శివ్రాజ్ సింగ్ చౌహాన్కు పెట్టని కోట. 1990లో ఇక్కడినుంచే ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వాజ్పేయి తప్పుకోవడంతో ఖాళీ అయిన విదిశ ఎంపీ స్థానం నుంచి 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1996, 1992, 1999, 2004ల్లో విదిశ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2005లో మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 2006లో బుధ్నీ నుంచే ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత రాజ్కుమార్ పటేల్పై 36వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2008లో (41వేల మెజారిటీ), 2013లో (84వేలు)నూ బుధ్నీలో సాధించిన ఘన విజయంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. -
ఔరా.. హీరా!
ఆయనో 35 ఏళ్ల యువకుడు. దీనికితోడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. ఆకర్శణీయమైన జీతం, ప్రశాంతమైన జీవితం. కానీ ఏదో వెలితి. తన వర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన. వెరసి ఆరేళ్ల ప్రయత్నం తర్వాత రాజకీయ పార్టీ పుట్టింది. ఆదివాసీల్లో పట్టు సంపాదించి.. ఇప్పుడు ఏకంగా గిరిజనుడు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆ యువకుడు దూసుకెళ్తున్నాడు. ఇది ఏయిమ్స్ రుమటాలజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ అలావా గురించిన ఇంట్రడక్షన్. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన హీరాలాల్.. స్థానికంగా ఉండే ’భిల్’ అనే ఓ గిరిజన తెగకు చెందిన యువకుడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగినా.. తన ఊరికి, గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదనే కారణంతో కార్యాచరణ ప్రారంభించాడు. మొదటగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించిన హీరాలాల్.. ఇప్పుడు జై ఆదివాసీ యువ శక్తి (జేస్)అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసేందుకు రిజిస్ట్రేషన్ సంబంధింత సాంకేతిక అడ్డంకులు ఎదురవడంతో.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సహకారంతో ఆయన ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే.. చట్టసభల్లో గిరిజన ప్రతినిధుల సంఖ్య పెరగటం, గిరిజనుడిని మధ్యప్రదేశ్కు సీంను చేయడమే జేస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరేళ్ల ‘ఫేస్బుక్’ పోరాటం కొడితే గట్టి దెబ్బే కొట్టాలనే సూత్రాన్ని డాక్టర్ హీరాలాల్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తన సత్తా చాటేందుకు ఆరేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘యువ శక్తి’పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించి.. గిరిజనుల చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం, నిర్వాసితులవుతున్న గిరిజనులు, ఆదీవాసీల కోసం స్కూళ్లు లేకపోవడం, పౌష్టికాహారలోపం తదితర అంశాలను ఆ ఎఫ్బీ పేజీలో ప్రస్తావించేవారు. ‘ఈ పేజీకి ఆదీవాసీ యువతలో మంచి గుర్తింపు వచ్చింది. 2013, మే 16న బద్వానీ గ్రామంలో ఏర్పాటుచేసిన ఫేస్బుక్ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి మా పేజీని ఫాలో అయ్యేవారు చాలా మంది హాజరయ్యారు. చాలా అంశాలపై ఆరోజు ఆసక్తికర చర్చ జరిగింది. అదే ఏడాది ఇండోర్లో అంతర్జాతీయ ఫేస్బుక్ పంచాయతీని నిర్వహించాం’ అని హీరాలాల్ పేర్కొన్నారు. -
అడవి బిడ్డల ఆదరణతోనే
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల్లో గిరిజనుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. చాలా స్థానాల్లో వీరి పాత్ర కీలకం. రాజస్తాన్లోని పలు నియోజకవర్గాల్లోనూ వీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే గిరిజనుల మద్దతుంటే.. గెలుపు మరింత సులువవుతుందని బీజేపీ, కాంగ్రెస్లు భావిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో ఈ వర్గమంతా బీజేపీకే అనుకూలంగా ఉంది. అయితే తమకు ఒనగూరిందేమీ లేదని కమలంపై కస్సుబుస్సవుతున్న ఈ వర్గం.. ఈసారి కాంగ్రెస్కు జై కొడుతుందా అనేది ఆసక్తికరం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ గిరిజనులు కాంగ్రెస్తోనే ఉన్నారు. కానీ 2010 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘వనవాసీ కళ్యాణ్ పరిషత్’ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించింది. వీరి విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చడంతోపాటు చైతన్యం తీసుకొచ్చింది. దీని ఫలితంగానే.. 2013 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆదివాసీలు ఏకపక్షంగా బీజేపీకి జైకొట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గంపగుత్తగా బీజేపీకి ఓటేశారు. అయితే ఏడాది కాలంగా బీజేపీ పట్ల గిరిజనుల్లో విముఖత వ్యక్తమవుతోందని.. లోక్నీతి–సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి చేసిన సవరణలు, అటవీ హక్కుల చట్టం అమలులో నెలకొన్న నిర్లక్ష్యం, అటవీ ఉత్పత్తులకు తగిన ధర కల్పించడంలో వైఫల్యం, ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన లేకపోవడం తదితర అంశాలతో ఆదీవాసీలు బీజేపీకి దూరమవుతున్నారని ఆ సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహకారంతో జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) నాయకుడు డాక్టర్ హీరాలాల్ తన వర్గాన్ని ఎస్టీ రిజర్వ్డ్ ప్రాంతాల్లో రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. హీరారాల్ రంగంలోకి దిగితే బీజేపీకి గట్టిదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్తాన్ల్లో చక్రం తిప్పేదెవరు? ఛత్తీస్గఢ్లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు బీజేపీ కంటే కాంగ్రెస్కే 9% ఎక్కువగా వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే పైచేయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినా.. నక్సల్స్ సమస్య అభివృద్ధికి అడ్డంకిగా మారింది. కొన్ని గ్రామాల్లో ఆదివాసీలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. పదిహేనేళ్లుగా ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉండి కూడా తమకు ఏమీ చేయలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. అయితే.. ఈసారి గిరిజనులకు పట్టున్న ప్రాంతాల్లో అజిత్ జోగి కీలకం కానున్నారని సర్వేలంటున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్కు మళ్లీ ఇబ్బందులు తప్పవు. రాజస్తాన్లో మాత్రం గత ఎన్నికల్లో ఎస్టీలు బీజేపీకే జై కొట్టారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు ఆదివాసీల్లో వ్యతిరేకతను పెంచాయి. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారంలో ప్రధానంగా పేర్కొంటోంది. ఒక ఊరు.. నలుగురు ఓటర్లు! నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్లోని ఓ పోలింగ్ బూత్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారింది. భరత్పూర్ నియోజకవర్గంలోని షెరందంద్ ఊర్లోని ఓ పోలింగ్ బూత్లో కేవలం నలుగురంటే నలుగురే ఓటర్లుండటం ఈ ఎట్రాక్షన్కు కారణం. ఏ ఒక్క ఓటరూ.. తన హక్కును కోల్పోకూడదని సకల ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఈ నలుగురి కోసం కూడా పోలింగ్ బూత్ను సిద్ధం చేయనుంది. అయితే బూత్ కోసం సరైన వసతుల్లేకపోవడంతో ఓ టెంట్ కిందే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరుంటుంది. కానీ ఇక్కడి చేరుకోవడం ఓ సాహసమే. రోడ్డు మార్గం లేదు. కనీసం కాలిబాట కూడా ఉండదు. రోడ్డుకు కొద్ది దూరంలో ఉండే పెద్ద నదిని దాటి.. ఆ తర్వాత రాళ్లు, రప్పల మధ్య రెండు కొండలు ఎక్కిదిగితే గానీ ఆ ఊరికి చేరుకోలేం. -
ట్రిపుల్.. ట్రబుల్
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ కాంగ్రెస్. అందుకే పార్టీలో ఆ స్థాయిలోనే అంతర్గత కుమ్ములాటలుంటాయి. ఇవి పార్టీకి తీరని నష్టం చేస్తున్నా.. మాట నెగ్గించుకోవాలనేదే నేతల ప్రయత్నం. మధ్యప్రదేశ్లో ఇది కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి గెలిచేందుకు ఓ మంచి అవకాశం ఉంది. కానీ ఆ పార్టీ మాత్రం ముగ్గురు ముఖ్యనేతల మధ్య నువ్వా–నేనా అన్న పోటీతో ఉన్న అవకాశాన్నీ చేజార్చుకుంటోంది. ఇది పార్టీ శ్రేణులను దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. కేవలం అనైక్యత కారణంగానే నష్టపోతున్నామని తెలిసినా.. పునరాలోచన జరగడం లేదు. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీపై మరోసారి బీజేపీ జెండా ఎగిరితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు చిక్కులు తప్పవనే విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు. అందుకే రాహుల్ వీరిమధ్య సయోధ్యకు విఫలయత్నం చేశారు. ఎవరికెవరూ తీసిపోరు! మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఉద్దండ నేతలు ఉన్నారు. యువతను ప్రభావితం చేయగల సింధియా, సీనియర్ నాయకుడు కమల్నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఇలా ఎవరికి వారు బడా నేతలే. కానీ వీరి మధ్య ఐక్యత లేకపోవడమే పార్టీకి తీరని నష్టం చేస్తోంది. అధికారాన్ని పువ్వుల్లోపెట్టి బీజేపీకి అప్పగిస్తున్నామని తెలిసినా కూడా ఈ ముగ్గురు నేతలు మంకుపట్టు విడవడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమావేశంలో రాహుల్ ముందే.. ‘నువ్వేంతంటే – నువ్వెంత’ని దూషించుకునే స్థాయిలో వీరి మధ్య విభేదాలున్నాయి. వేడి చల్లారినట్లే అనిపించినా.. ఈ సమస్యను ఏడాది క్రితమే గుర్తించిన రాహుల్.. వీరి మధ్య రాజీ కోసం సీనియర్లను రంగంలోకి దించారు. దీంతో కాస్త పర్వాలేదనిపించిన పరిస్థితి.. టికెట్ల పంపిణీ దగ్గర పడుతున్న కొద్దీ మళ్లీ వెడెక్కింది. రాహుల్ ముందే ఈ ముగ్గురూ ‘హమ్ కిసీసే కమ్ నహీ’ అని దాదాపు గొడవపడ్డంత పనిచేశారు. కమల్నాథ్ వైపు సోనియా.. సింధియాకు మద్దతుగా రాహుల్ ఆలోచిస్తున్నారన్న వార్తలు మరింత వేడి రాజేశాయి. ఆజ్యం పోస్తున్న బీజేపీ ఈ వర్గపోరాటానికి ఆజ్యం పోయడం ద్వారా తన పీఠానికి ఎసరుండొద్దని బీజేపీ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కు ముగ్గురు సీఎం అభ్యర్థులంటూ మోదీ ఎద్దేవా చేయగా.. దిగ్విజయ్కు పార్టీలో సరైన స్థానం లేదంటూ సీఎం చౌహాన్ తన ప్రచారంలో పేర్కొంటున్నారు. రాహుల్ సభ ప్రచారంలో దిగ్విజయ్ ఫొటో కూడా పెట్టకపోవడం ఆయన వర్గానికి ఆగ్రహం తెప్పించింది. అయితే.. దిగ్విజయ్ సాయం లేకుండా కమల్నాథ్, సింధియాల్లో ఎవరూ సీఎం పీఠాన్ని అధిరోహించలేరనేది మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ముక్తకంఠంతో చెబుతోంది. ఆలు లేదు చూలు లేదన్నట్లు! ఈ ముగ్గురూ సీఎం పీఠం కోసం పోటీపడుతున్నారు. అదే అసలు సమస్యకు కారణం. అధికారంలోకి వస్తే ఎవరు సీఎం కావాలనేదే వీరి మధ్య పోటీకి కారణం. ముందు ఎన్నికల్లో గెలిచేలా పనిచేసి.. ఆ తర్వాత సీఎం కోసం కొట్టుకుంటే అర్థముంటుంది. కానీ ఈ ముగ్గురు గెలుస్తామన్న ముందస్తు ధీమాతోనే సీఎం పీఠం గురించి విభేదించుకుంటున్నారు. అత్యంత సీనియర్ నేత కమల్నాథ్ సీఎం కావాలని ఆయన వర్గం వాదిస్తోంది. యువతను ప్రభావితం చేసే సత్తా, రాజవంశీకుడు కావడం.. పార్టీ యువజన విభాగంపై పట్టున్న సింధియాకే సీఎం పీఠం ఇవ్వాలని ఆయన సన్నిహితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదాల కారణంగా ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధైర్యం చాలడం లేదు. ‘భక్త’ రాహుల్.. జనాభాలో దాదాపు 91 శాతం హిందువులున్న మధ్యప్రదేశ్లో హిందుత్వ ముద్ర కోసం బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోంది. బీజేపీ కన్నా తామే హిందువులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తామని చెప్పేందుకు తిప్పలు పడుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు రాహుల్ వివిధ దేవాలయాలు సందర్శిస్తున్నారు. ఇటీవలే ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర దేవాలయాన్ని దర్శించారు. గతంలో ఇందిర ఈ ఆలయాన్ని సందర్శించిన అనంతరం పదవిని చేపట్టారని అక్కడి పూజారి చెబుతున్నారు. రాహుల్ ఆలయ సందర్శనం తప్పక ఫలితమిస్తుందంటున్నారు. మహాకాలుడితో పాటు కమత్నాధ్, పీతాంబర్ లాంటి ప్రసిద్ధ ఆలయాలన్నింటినీ రాహుల్ సందర్శించారు. నర్మదా హారతిలో కూడా పాల్గొన్నారు. రామ వనవాస మార్గాన్ని సూచించే రామ్ వన్ గమన్ యాత్రను కాంగ్రెస్ నిర్వహించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో ఒక్కో గోశాల నిర్మిస్తామని పీసీసీ చీఫ్ కమల్నాధ్ హామీ ఇస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం ఇప్పటికే పలు గోశాలలు నిర్మించి నిర్వహిస్తోందని, రాష్ట్రంలోని లక్షన్నర గోవుల అభివృద్దికి పలు చర్యలు తీసుకుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిదాంట్లో మతమే రాజకీయ ప్రచారంలో భాగంగా ప్రతి అంశంలో కాంగ్రెస్ మత ప్రస్తావన తెస్తోంది. ఉదాహరణకు చౌహాన్ రైతు వ్యతిరేక, అవినీతి విధానాలను విమర్శించే సమయంలో కూడా ఏదో రకంగా మతాన్ని ప్రస్తావిస్తోంది. ఉదాహరణకు ‘చౌహాన్ ప్రభుత్వం మహాకుంభమేళాను కూడా వదల్లేదు. ప్రతి వస్తువు ధర పదిరెట్లు పెంచడంతో కుంభమేళా నుంచి కోట్లు కూడబెట్టింది.’ అని రాహుల్ తన ప్రసంగంలో విమర్శించారు. ‘ బీజేపీ మతం గురించి మాట్లాడుతుంది, కానీ అవినీతే వారి మతం’ అని దుయ్యబడుతున్నారు. ఆదివాసీలను ఆకట్టుకునే క్రమంలో భాగంగా హిందుత్వం అందరిది అనే ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో ఆదివాసీ ప్రాబల్యం ఉన్న 47 సీట్లలో బీజేపీ 31 సీట్లు గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ చేపట్టే సామాజిక కార్యక్రమాలు బీజేపీకి లాభించాయి. ఈ కారణంగానే ఆదివాసీలు తాము సైతం హిందువులమని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీం తీర్పుపై ఆర్డినెన్సు తీసుకుచ్చిన బీజేపీపై ఓసీ, ఓబీసీలు గుర్రుగా ఉన్నారు. జనాభాలో వీరి వాటా 60 శాతం పైగా ఉంది. వీరంతా గంపగుత్తగా బీజేపీకి ఓట్లేసేవారు. ఇప్పుడు వీరిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. అయితే ఎన్నికలప్పుడే కాంగ్రెస్కు హిందువులు గుర్తుకువస్తారని, కాంగ్రెస్ గిమ్మిక్కులకు అటు దేవుడు, ఇటు హిందువులు మోసపోరని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు నర్మద పరీవాహక ప్రాంతంలో కనిపించే సాధుసంతులంతా మతాన్ని రాజకీయాలకు వాడుకోవడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. మతాన్ని రాజకీయాలతో కలపడం సబబు కాదని కొందరు హితవు చెబుతున్నారు. ఒక్కరోజులో తేలిపోయే ఇంక్! మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఓటేయడానికి రావడం కూడా.. స్థానికులు, ఆదీవాసీలకు చాలా ఇబ్బందికరమే. ఓటేశామని తెలిస్తే మావోయిస్టుల నుంచి చిత్రహింసలు తప్పవు. అందుకే.. ఇలాంటి ప్రాంతాల్లో ఓటేసేవారికోసం ఈసీ కొత్తగా ఆలోచిస్తోంది. మామూలుగా చేతిపై ఉన్న సిరా ముద్ర మాత్రమే మనం ఓటేసినట్లు తెలుపుతుంది. అయితే.. ఓటు వేసిన తర్వాత ఆ గుర్తు లేకుండా చేస్తే అసలు సమస్యే ఉండదు. వాస్తవానికి 2013 అసెంబ్లీ, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రతిపాదనలు ఈసీకి అందాయి. కానీ చెరిగిపోయే సిరాతో.. బోగస్ ఓటింగ్ జరిగేందుకు వీలుంటుందని ఆలోచించింది. అయితే.. ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా ఆ ఓటర్ల గురించి సానుకూలంగా ఆలోచించాలని కోరడంతో.. అందరితోనూ చర్చించి ఓ సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అంతాఅనుకున్నట్లుగా జరిగితే.. ఈ ఎన్నికల్లోనే ఒక్కరోజులోనే తేలిపోయే ఇంకుతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ నిర్వహించాలన్న యోచనలో ఉంది. ఒక ఊరు.. నలుగురు ఓటర్లు! నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్లోని ఓ పోలింగ్ బూత్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారింది. భరత్పూర్ నియోజకవర్గంలోని షెరందంద్ ఊర్లోని ఓ పోలింగ్ బూత్లో కేవలం నలుగురంటే నలుగురే ఓటర్లుండటం ఈ ఎట్రాక్షన్కు కారణం. ఏ ఒక్క ఓటరూ.. తన హక్కును కోల్పోకూడదని సకల ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఈ నలుగురి కోసం కూడా పోలింగ్ బూత్ను సిద్ధం చేయనుంది. అయితే బూత్ కోసం సరైన వసతుల్లేకపోవడంతో ఓ టెంట్ కిందే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరుంటుంది. కానీ ఇక్కడి చేరుకోవడం ఓ సాహసమే. రోడ్డు మార్గం లేదు. కనీసం కాలిబాట కూడా ఉండదు. రోడ్డుకు కొద్ది దూరంలో ఉండే పెద్ద నదిని దాటి.. ఆ తర్వాత రాళ్లు, రప్పల మధ్య రెండు కొండలు ఎక్కిదిగితే గానీ ఆ ఊరికి చేరుకోలేం. -
రాజస్తాన్ కాంగ్రెస్దే!
న్యూఢిల్లీ: రాజస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు ఇండియాటుడే సర్వేలో తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కేవలం 35% ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని 43%, ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని 39% కోరుకున్నారు. 18% తమకు తెలియదని బదులిచ్చారు. ముఖ్యమంత్రిత్వం కోసం అశోక్ గెహ్లాట్(కాంగ్రెస్)కు 35%, వసుంధర రాజె(బీజేపీ)కు 31%, సచిన్ పైలట్(కాంగ్రెస్)కు 11% మద్దతిచ్చారు. రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్ల పరిధిలో 10,136 మందిని సర్వేలో భాగంగా సంప్రదించారు. అత్యధికులు ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రధానిగా మోదీపై మాత్రం సానుకూలత వ్యక్తమైంది. ‘కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధిస్తుంది. దళితులు, ముస్లింలలో బీజేపీపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కంచుకోటల్లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ పట్టు కోల్పోతోంది’ అని విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరి పోరు ఉంది. బీజేపీ ప్రభుత్వం నిలుపుకునే అవకాశం 52% ఉందని సర్వే పేర్కొంది. ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక కారణంగా బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశముందని తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని 42%, ప్రభుత్వం మారాలని 40% కోరుకుంటున్నట్టుగా వెల్లడైంది. 18% తెలియదంటూ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లోని 11,712 మంది నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. నిరుద్యోగం, వ్యవసాయరంగ సమస్యలు, ధరల పెరుగుదల, తాగునీటి సమస్య వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలుగా మారినట్టు తేలింది. జ్యోతిరాదిత్య సింధియాను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ మరింత పుంజుకుని ఉండేదని అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లలో జ్యోతిరాదిత్యకు మంచి ప్రజాదరణ ఉన్నట్టు వెల్లడైంది. ఛత్తీస్గఢ్: మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని 43%, ప్రభుత్వం మారాలని 41%, తెలియదని 16% స్పందించారు. ఈ ఫలితాల ఆధారంగా ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 55% ఉందని నిపుణుల సహకారంతో ఇండియా టుడే విశ్లేషించింది. అజిత్జోగి ‘జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్’పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐలతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి లాభిస్తుందని పేర్కొంది. ఈ కూటమి వల్ల కాంగ్రెస్కే ఎక్కువ నష్టమని విశ్లేషించింది. నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు వెల్లడైంది. వరసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్నా, జనాదరణలో మాత్రం రమణ్సింగ్ ముందు వరసలోనే ఉన్నారు. సీఎంగా 44% రమణ్సింగ్కు, 23% కాంగ్రెస్ నేత భూపేష్ భాఘేల్,కు, 13% అజిత్ జోగికి మద్దతిచ్చారు. జోగి నేతృత్వంలోని కూటమికి 7% సానుకూలత చూపారు. ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ నియోజకవర్గాల్లోని 4,486 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. -
ఓటింగ్ వైకుంఠపాళి...
ఎన్నికల వేళ ఓటర్లలో చైతన్యం పెంచేందుకు రాజస్తాన్లోని బర్మార్ జిల్లా యంత్రాంగం విన్నూత్న ఆలోచన చేసింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు, ఓటర్లలో ఓటింగ్పై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా సరికొత్త వైకుంఠపాళిని తయారు చేసి ప్రదర్శిస్తోంది. దాదాపు 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ మెగా వైకుంఠపాళి సాంప్రదాయక వైకుంఠపాళిలాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో పాముల ఉండే స్థానాలను ఓటర్ల నియమావళి ఉల్లంఘనలు, ఓటు అమ్ముకోవడం, కులపిచ్చితో ఓటేయడం, మందు, డబ్బుకు లొంగి ఓట్లు వేయడం తదితర తప్పులు సూచిస్తుంటాయి. సమయానికి ఓటర్ లిస్టులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఓటు వేయడం, తోటివారిలో ప్రజాస్వామ్య చైతన్యాన్ని రేకెత్తించడం, ఓటింగ్ వేళ దివ్యాంగులకు, పెద్దలకు సాయం చేయడం తదితరాలు నిచ్చెనల స్థానంలో ఉంటాయి. గతంలో జల సంరక్షణ కోసం ఇదే తరహాలో వైకుంఠపాళిని వినియోగించామని బర్మార్ జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆ సమయంలో తమ ప్రయత్నం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కిందని తెలిపింది. దీంతో ఈ సారి ఓటర్లను జాగృతపరిచేందుకు వైకుంఠపాళిని వినియోగించుకోవాలని భావించినట్లు జిల్లా కలెక్టర్ శివప్రసాద్ మదన్ నకాటే చెప్పారు. ఈ దఫా కూడా తమ యత్నానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమ యత్నానికి బర్మార్ నగరంలో మంచి స్పందన వచ్చిందని, త్వరలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దీన్ని ప్రదర్శించే యత్నాలు చేస్తామని తెలిపారు. ఓటేయాలంటూ భయపెట్టే బందిపోట్లు! ఓటేయకపోయారా? మీ సంగతిచూస్తాం అనే బందిపోటు ముఠా ఒకటి రాజస్తాన్లోని ధోల్పూర్ ప్రాంతంలో ఉండేది. 2013 ఎన్నికలకు ముందు వరకు కూడా ఈ ముఠా ప్రభావం ఎక్కువగానే ఉండేది. బందిపోట్లు ఓటేయమని భయపెట్టడం వినడానికి వింతగానే ఉండొచ్చు. ఇంతలా బెదిరిస్తున్నారంటే ఇందులో తిరకాసు ఏదైనా ఉండొచ్చనే అనుమానం రావట్లేదా? అగ్గదీ! అక్కడే అసలు సంగతుంది. ఈ బ్యాచ్ అంతా.. తాము చెప్పిన అభ్యర్థికే ఓటేయాలని బెదిరిస్తుంది. వేయకపోతే తర్వాత మీ సంగతి తేలుస్తామని హెచ్చరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎవరు గెలవాలో వీళ్లే నిర్ణయిస్తారు. ఈ ప్రాంతంలోని బారీ నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో ఈ బందిపోటు ముఠా ప్రభావం ఉందని.. వీరందరినీ అరెస్టు చేస్తే గానీ ఎన్నికలు సరిగ్గా జరగవని అక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగ పోలీసులను కోరుతున్నారు. గతంతో పోలిస్తే వీరి ప్రభావం కాస్తంత తగ్గినట్లు కనిపిస్తున్నా పూర్తిగా బెడద పోయినట్లు కాదంటున్నారు. ఈ బృందంలోని జగన్ గుర్జార్ అనే బందిపోటు భార్య 2017 ఉప ఎన్నికల్లో ధోల్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేవలం 112 సీట్లు మాత్రమే సంపాదించారు. తొలిసారి రంగంలోకి మహిళా సీఆర్పీఎఫ్ మధ్యప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల కోసం తొలిసారిగా మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు పనిచేయబోతున్నారు. భోపాల్, ఉజ్జయిని, ఇండోర్ ప్రాంతాల్లో వీరికి విధులు అప్పగించారు. ‘ఇప్పటివరకు వారికిచ్చిన విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారు. అందుకే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా వీరికి బాధ్యతలు అప్పగించాం’ అని సీఆర్పీఎఫ్ ఐజీ పీకే పాండే వెల్లడించారు. పోలీసుల నుంచి డీఎస్పీ స్థాయి వరకు వివిధ హోదాల్లో 90 మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. అవసరమైతే మరింత మందిని మోహరిస్తామని పాండే తెలిపారు. 1986–87లో తొలిసారిగా సీఆర్పీఎఫ్లోకి మహిళలకు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి వీరు పురుషులతో సమానంగా విధులను నిర్వర్తిస్తున్నారు. మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉండే దక్షిణ బస్తర్ ప్రాంతంలోనూ 240 మంది మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు డ్యూటీలో ఉన్నారు. -
సినిమా భాషలో చెబితేనే చెవికెక్కుతుంది..
సాక్షి, మధ్యప్రదేశ్: ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం.. ఎన్నికల అధికారుల బాధ్యత. ఇందుకోసం ఒక్కొక్క అధికారి ఒక్కో స్టైల్లో ప్రయత్నిస్తుంటారు. మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లా ఎన్నికల అధికారి విశేష్ గర్ఫాలే కూడా ఇలాగే వినూత్నమైన పద్ధతిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిమిక్రీ కళాకారుల ద్వారా బాలీవుడ్ స్టార్లు షారుక్, సల్మాన్, అమీర్, అనుష్క శర్మల డైలాగ్లతో ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ‘అధికారులు నిరక్షరాస్యులకు ఒటుపై అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఓటు ప్రాముఖ్యత తెలియడం లేదు. ఇందుకోసంబాలీవుడ్ సినిమాల ఫేమస్ డైలాగ్లను ఉపయోగించాలని అనుకున్నారు. అలాంటి ఫేమస్ డైలాగుల్లో.. ‘మైనే ఏక్ బార్ కమిట్మెంట్ కర్ ది తో మై వోట్ జరూర్ కర్తాహూ’ (నేను ఒక్క సారి ఓటు వేయాలని కమిటైతే ఓటు వేసి తీరతా), ‘మేరే పాస్ బంగ్లాహై, గాడీహై తుమ్హారేపాస్ క్యా హై’ మేరే పాస్ ఓటర్ కార్డ్ హై!’వంటి డైలాగులతో.. మిమిక్రీ కళాకారులు వీధి ప్రదర్శనలు చేస్తున్నారు’ అని కలెక్టర్ పేర్కొన్నారు. వీటికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ తరహా ప్రచారానికి మరిన్ని వినూత్న ఆలోచనలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఓ పోటీ నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న వారిలో కొందరు జంగిల్బుక్లోని కార్టూన్ క్యారెక్టర్స్తో అలరించారు. ఈ ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం ద్వారా మరింత మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముంటుందని గర్పాలే అభిప్రాయపడ్డారు. -
వెల్లుల్లి మసాలా దంచుడా!
ఉల్లి ధరలు ఆకాశాన్నంటినపుడు సామాన్యుడి కడుపు మండి.. ప్రభుత్వాలు కుప్పకూలిన ఘటనలు గుర్తున్నాయ్ కదా.. ఇప్పుడు వెల్లుల్లి ధర తగ్గడం అదే తరహాలో ఘాటెక్కిస్తోంది. వ్యవసాయం, రైతు సమస్యలే ప్రధాన ప్రచారాస్త్రంగా సాగుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ఎన్నికల్లో అధికార పక్షాలను గార్లిక్ గజగజ వణికిస్తోంది. పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్తాన్ ప్రాంతాల్లో ప్రధాన పంట అయిన వెల్లుల్లి ధర అమాంతంగా కిలో రూపాయి, రెండ్రూపాయలకు పడిపోవడంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపశమన చర్యలు ప్రారంభించినప్పటికీ.. రాజస్తాన్లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సంతోషం ఆవిరైన వేళ పశ్చిమ మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతం, తూర్పు రాజస్తాన్లోని హదోటీ ప్రాంతాల్లో వెల్లుల్లి ప్రధాన పంట. దేశ వెల్లుల్లి ఉత్పత్తిలో 45% ఈ ప్రాంతాలనుంచే వస్తుంది. రెండేళ్ల క్రింది వరకు ఈ రైతులు సంతోషంగా ఉండేవారు. పంటకు తగిన గిట్టుబాటు ధరతో సమస్యల్లేకుండా ఉన్నారు. అయితే.. 2017 మార్చి నుంచి ఈ రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. పంటను తీసుకుని మార్కెట్కు తీసుకొచ్చే సరికి రేటు పడిపోయిందనే సమాచారం. సర్లే.. రెండ్రోజుల్లో అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ.. అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో పెట్టుబడికి రెండు, మూడు రెట్ల నష్టంతోనే వెల్లుల్లిని అమ్ముకోవాల్సి వచ్చింది. ఏడాదిన్నరయినా పరిస్థితిలో మార్పు రాకపోగా.. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారిపోతోంది. గతేడాది వెల్లుల్లి ధరలు తగ్గేంతవరకు దేశ వెల్లుల్లి ఉత్పత్తిలో 45% వాటా.. ఈ రెండు ప్రాంతాలదే. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అంటే కిలోకు రూ.100 అన్నమాట. సీజన్లో అయితే ఈ రేటు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ నాణ్యమైన వెల్లుల్లి సీజన్లేని సమయంలోనూ క్వింటాలుకు రూ.13వేలకు మించే పలుకుతుంది. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రూపాయి, రెండ్రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విపక్షాలకు సువర్ణావకాశంగా.. వెల్లుల్లి ధరలు పడిపోవడమే.. విపక్ష కాంగ్రెస్కు ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ప్రచారం చేసినా.. రాహుల్ వెల్లుల్లి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు కిలో రూ.130గా ఉన్న వెల్లుల్లి ధర.. ఇప్పుడు రూపాయి, రెండు రూపాయలకు పడిపోయిందంటూ గుర్తుచేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో రైతు ఆందోళనలు జరగటం.. తదనంతర పరిస్థితుల్లో పోలీసు కాల్పులకు ఆరుగురు అన్నదాతలు మృతిచెందడం గుర్తుండే ఉంది కదా. ఆ ఆందోళనలకు కారణం కూడా ‘వెల్లుల్లే’. 2016 నోట్లరద్దు తర్వాత పరిస్థితుల్లో చాలా దారుణమైన మార్పులు చోటుచేసుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మద్దతు ధర పెంపు, ఇతర ఉద్దీపనల ద్వారా ఇతర పంటలను కేంద్రం ఆదుకున్నప్పటికీ.. వెల్లుల్లి విషయంలో మాత్రం ఎలాంటి ‘ప్యాకేజీ’ అమలు చేయలేదు. రాజేకు గడ్డుపరిస్థితులు రాజస్తాన్లోని కోటా పెద్ద వెల్లుల్లి మార్కెట్. ఇక్కడ జూలైలో రూ. 25కు కిలో ఉన్న ధర.. సెప్టెంబర్కు రూ.20కి.. ఆ తర్వాత అక్టోబర్ చివరకు ఐదు రూపాయలకు పడిపోయింది. డిమాండ్కు మించిన సప్లై కారణంగా ధరలు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. రాజస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్లో నెలకొన్న నైరాశ్యం ప్రభావం ఈ ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వసుంధరా రాజేపై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిన ఫలితంగా బీజేపీ గద్దె దిగడం ఖాయమంటున్నారు. సినిమా భాషలో చెబితేనే చెవికెక్కుతుంది.. ప్రజలకు ఓటుపై అవగాహన కల్పించడం.. ఎన్నికల అధికారుల బాధ్యత. ఇందుకోసం ఒక్కొక్క అధికారి ఒక్కో స్టైల్లో ప్రయత్నిస్తుంటారు. మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లా ఎన్నికల అధికారి విశేష్ గర్ఫాలే కూడా ఇలాగే వినూత్నమైన పద్ధతిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిమిక్రీ కళాకారుల ద్వారా బాలీవుడ్ స్టార్లు షారుక్, సల్మాన్, అమీర్, అనుష్క శర్మల డైలాగ్లతో ప్రజలకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. ‘అధికారులు నిరక్షరాస్యులకు ఒటుపై అవగాహన కల్పిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఓటు ప్రాముఖ్యత తెలియడం లేదు. ఇందుకోసంబాలీవుడ్ సినిమాల ఫేమస్ డైలాగ్లను ఉపయోగించాలని అనుకున్నారు. అలాంటి ఫేమస్ డైలాగుల్లో.. ‘మైనే ఏక్ బార్ కమిట్మెంట్ కర్ ది తో మై వోట్ జరూర్ కర్తాహూ’ (నేను ఒక్క సారి ఓటు వేయాలని కమిటైతే ఓటు వేసి తీరతా), ‘మేరే పాస్ బంగ్లాహై, గాడీహై తుమ్హారేపాస్ క్యా హై’ మేరే పాస్ ఓటర్ కార్డ్ హై!’వంటి డైలాగులతో.. మిమిక్రీ కళాకారులు వీధి ప్రదర్శనలు చేస్తున్నారు’ అని కలెక్టర్ పేర్కొన్నారు. వీటికి ప్రజలనుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ తరహా ప్రచారానికి మరిన్ని వినూత్న ఆలోచనలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఓ పోటీ నిర్వహించారు. దీంట్లో పాల్గొన్న వారిలో కొందరు జంగిల్బుక్లోని కార్టూన్ క్యారెక్టర్స్తో అలరించారు. ఈ ప్రదర్శనలను సోషల్ మీడియాలో షేర్ చేయడం, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం ద్వారా మరింత మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముంటుందని గర్పాలే అభిప్రాయపడ్డారు. -
ద్యా..వుడా!
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బాబాల హడావుడి జోరందుకుంది. కొందరేమో టికెట్లు ఆశించి పార్టీల చుట్టూ తిరుగుతుండా, మరికొందరు కొన్ని పార్టీలకు అనుకూల, వ్యతిరేక ప్రచారాలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. స్వామీజీల్లో కొందరు చౌహాన్పై అసహనంగా ఉన్నారు. మరికొందరేమో చౌహాన్కు జై అంటూ టిక్కెట్ల కోసం యత్నిస్తున్నారు. పార్టీల చుట్టూ బాబాల సందడి పెరగడంతో ఆయా పార్టీల కార్యాలయాల వద్ద మరిన్ని బలగాలు నియమించాల్సి వస్తోంది. ప్రభావం ఎంత ? మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపుగా 90శాతం హిందువులే కావడంతో అక్కడ బాబాలకు ఆదరణ ఎక్కువే. అందుకే బాబాల మద్దతు కోసం రాజకీయ నాయకులు వారి ఆశ్రమాల వద్ద క్యూ కడతారు. ఉజ్జయిని, జబల్పూర్, భోపాల్ వంటి పట్టణాల్లో అడుగడుగునా ఆశ్రమాలు కనిపిస్తాయి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పదేళ్లలో ప్రభుత్వ పాలనపై బాబాల ప్రభావం ఎక్కువైందన్న విమర్శలూ వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తోంది. బాబాల సంఖ్య పెరిగిపోవడంతో వారి ప్రభావమూ తగ్గుతూ వస్తోంది. బై బీజేపీ.. బైబై బీజేపీ.. మతగురువులను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. గత ఏప్రిల్లో ఒకేసారి ఏకంగా అయిదుగురు బాబాలకు కేబినెట్ హోదా కల్పించింది. కంప్యూటర్ బాబా, యోగేంద్ర మహంత్, నర్మదానంద, హరిహరానంద, భయ్యా మహరాజ్కు కేబినెట్ హోదాలు కట్టబెట్టింది. వీరిలో గురువు భయ్యా మహరాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. కంప్యూటర్ బాబా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నర్మదా నదీ తీర ప్రాంతంలో అక్రమ తవ్వకాలను సీఎం ప్రోత్సహిసున్నారని, గోవులకు రక్షణ లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. బరిలోకి దిగుతాం.. దాతియా జిల్లాకు చెందిన పంధోకర్ సర్కార్ ఇటీవల కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దూకారు. సాంజీ విరాసత్ పార్టీ పేరుతో 50 నియోజకవర్గాల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు. సంత్ సమాజాన్ని సీఎం తీవ్రంగా అవమానించారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరొక గురువు దేవకినందన్ ఠాకూర్ ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి, రిజర్వేషన్లకి వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు. చౌహాన్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు స్వాములేమో బీజేపీ టికెట్ను ఆశిస్తున్నారు. బాబా బిపిన్ బిహారి సాగర్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలతో టిక్కెట్ కోసం పైరవీలు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో నేతలు బాబాల కాళ్లు పట్టుకునే దృశ్యాలే కనిపించేవి. ప్రభుత్వమే శంకరాచార్య యాత్ర లాంటివి స్వయంగా జరిపించింది. అలాంటిది ఇప్పుడు బాబాలు టిక్కెట్ల కోసం నేతలతో పైరవీలు చేయించుకోవడం కనిపిస్తోంది. ఇలాంటి దృశ్యం మధ్యప్రదేశ్ రాజకీయల్లో ఇదే మొదటిసారంటూ రాజకీయ పరిశీలకులు అవాక్కవుతున్నారు. కీలక బాబాలు ఆధ్యాత్మిక గురువు శంకరాచార్య స్వరూపానంద సరస్వతికి మహాకోసల ప్రాంతంలో బాగా పట్టు ఉంది. స్వరూపానంద కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ్వాలియర్–చంబల్ ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన రావత్పుర సర్కార్, ఆచార్యదేవ్ ప్రభాకర్ శాస్త్రి దాదాజీ, జాబూ ప్రాంతంలో ఎక్కువ మంది అనుచరగణం ఉన్న స్వామి ఉత్తమ్, రాష్ట్రవ్యాప్తంగా శిష్యులున్న భయ్యాజీ సర్కార్లు ఈ సారి ఎన్నికల్లో కీలకంగా మారారు. కంప్యూటర్ బాబాకు కౌంటర్గా స్వామి అఖిలేశ్వరానంద రంగంలోకి దిగారు. గోసంరక్షణ బోర్డు చైర్మనైన ఈ స్వామీజీ ఇటీవల సంత్ సమాగమం పేరుతో సదస్సును ఏర్పాటు చేసి సీఎం చౌహాన్పై ప్రశంసల జల్లు కురిపించారు. -
s/o సన్నాఫ్..
మధ్యప్రదేశ్ వారసత్వానికి ఒక లక్షణం ఉంది. అదే పేరు, అదే వంశం,.. ఉంటే చాలు ఏ కాస్త క్వాలిటీ ఉన్నా రాణించేయొచ్చు. రాజకీయాల్లో ఇది ఇంకా ఎక్కువ. మధ్యప్రదేశ్లో మరీ ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బడా నేతలంతా పొలిటికల్ పుత్రోత్సాహంతో మురిసిపోతున్నారు. మరి ఈ వారసుల్లో మహావృక్షంగా మారేవారెవరు? మర్రిచెట్టు కింద మొక్కలా మిగిలేవారెవరు? చూడాలి.. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి వారసుల జోరు ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్నాథ్ వరకు అన్ని కుటుంబాల్లో పుత్రోత్సాహం పొంగిపొరలుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసు రాకపోయినా ఈ నయా లీడర్లు వచ్చే ఎన్నికలకు పునాదిగా తండ్రుల నియోజకవర్గాల్లో వ్యవహారాల్ని చక్కబెడుతున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 55 శాతం వరకు 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఉంటే, ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది వృద్ధులే. అందుకే వారసుల్ని రంగంలోకి దింపి యువ ఓటర్లను ఆకర్షించే వ్యూహాలు పన్నుతున్నారు నేతలు. వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మధ్యప్రదేశ్ అంటేనే వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, మనవలు ఇప్పటికీ వంశం పేరు చెప్పుకునే ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకుంటున్నారు. రవిశంకర్ శుక్లా కుమారుడు శ్యామ్ చరణ్ శుక్లా, మనవడు అమిత్ శుక్లా, మోతీలాల్ ఓరా కుమారుడు అరుణ్ ఓరా, దిగ్విజయ్సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్, దివంగత కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్, ఇలా ఎందరో ఉన్నారు. వీళ్లంతా తండ్రులు, తాతల పేరు చెప్పుకునే రాజకీయాల్లో రాణించారు. ఒకసారి బలపడ్డాక క్రమంగా లీడర్లుగా స్వీయ ప్రతిభ చూపుతున్నారు. చక్రం తిప్పుతున్న సింధియా కుటుంబం సింధియా రాచ కుటుంబం అటు మధ్యప్రదేశ్, ఇటు రాజస్థాన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. విజయ రాజే సింధియా బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె కుమారుడు, దివంగత నేత మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిపోయారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విజయ రాజే సింధియా కుమార్తె వసుంధరా రాజె రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లోక్సభ ఎంపీ. కుమార్తె యశోధర రాజె సింధియా మధ్యప్రదేశ్ లో మంత్రిగా ఉన్నారు. నయా లీడర్స్ కార్తికేయ సింగ్ చౌహాన్: ముఖ్యమంత్రిగా పార్టీని ముందుండి నడిపించాల్సిరావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తన సొంత నియోజకవర్గం బుధ్నీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఈ బాధ్యతల్ని ఆయన కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఇంకా రాకపోయినప్పటికీ ప్రచారంలో తనదైన ముద్ర చూపుతున్నాడు. బుధ్నీ నియోజకవర్గంలో స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క భోపాల్లో పూలు, పాల వ్యాపారాలు చూసుకుంటూనే తండ్రి నియోజకవర్గంలో పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మహానర్యామన్ : కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు మహానర్యామన్కి పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. డూన్ స్కూలులో గ్రాడ్యుయేషన్ చేసిన మహానర్యామన్ అమెరికాలో ఎంబీఏ చేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీకి సెలవులు కావడంతో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రచార బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు. నకుల్నాథ్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ కుమారుడు నకుల్ నాథ్. తండ్రి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడే నకుల్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఢిల్లీలో నైట్ లైఫ్కు బాగా అలవాటు పడిన నకుల్ ఎన్నికల వేళ మాత్రం భోపాల్లోనే ఉంటూ తెగ తిరిగేస్తున్నారు. బోస్టన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన నకుల్ బేతల్ నుంచి పోటీ పడే అవకాశాలున్నాయి. అభిషేక్ భార్గవ్ : మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ్ కుమారుడైన అభిషేక్ రాజకీయాల్లో బాగా పట్టు సంపాదించారు. రెహిల్ నియోజకవర్గం నుంచి గోపాల్ భార్గవ్ గత ఏడుసార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అభిషేకే తండ్రి తరఫు పొలిటికల్ మేనేజర్గా వ్యవహారాలన్నీ నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రచార వ్యూహాలన్నీ అభిషేకే రచించారు. విక్రాంత్ భూరియా: కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భూరియా 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన కుమారుడు విక్రాంత్ భూరియా తండ్రి నియోజకవర్గమైన రట్లామ్ బాధ్యతలు తీసుకున్నారు ప్రజా సంబంధాలు ఏర్పరచుకొని కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తండ్రిని గెలిపించుకున్నారు. పైన చెప్పినవాళ్లే కాకుండా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మంధర్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ వార్గియా కుమారుడు ఆకాశ్ , ప్రజా సంబంధాల శాఖా మంత్రి డా. నరోత్తమ్ మిశ్రా కుమారుడు సుకర్ణ మిశ్రా, ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ కుమారుడు సిద్ధార్థ మాలవీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కుమారుడు దేవేంద్ర సింగ్ తోమర్ తదితరులు సైతం రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీరిలో పలువురు తమ సత్తా చూపాలని భావిస్తున్నారు. -
‘థర్టీన్’ చౌహాన్..యూత్ మహాన్..
పదమూడేళ్లుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సారి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయన పట్ల బాగా వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు చౌహాన్ పలు యత్నాలు చేస్తున్నారు. ఈ సారి రాష్ట్ర ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.09%. అంటే సగానికి పైగా ఓటర్లు యువతే. అందుకే వారి వ్యతిరేకత బీజేపీని భయపెడుతోంది. అసంతృప్తితతో ఉన్న యూత్ను ఆకర్షించడానికి చౌహాన్ ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. రెండునెలల్లో ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తుందనగా మెగా ఎంప్లాయిమెంట్ డ్రైవ్స్, స్టార్టప్ ఫెయిర్స్ నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే మేధావి విద్యార్థి యోజన పథకాన్ని అన్ని కులాలకు వర్తింపజేశారు. మొదటి సారి కాలేజీలో అడుగు పెడుతున్న 3 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, మరో 22 వేల మందికి ల్యాప్ట్యాప్ల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎందుకీ అసంతృప్తి ? రెండేళ్లుగా మధ్యప్రదేశ్లో నిరుద్యోగం భారీగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యువత నైపుణ్యం పెంచుతూ వారిని పారిశ్రామిక రంగం వైపు మళ్లేలా చేస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ నిరుద్యోగంపై గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. పట్టణప్రాంతాల్లో నిరుద్యోగులు 46శాతం, గ్రామాల్లో44 శాతం ఉన్నారు. నికరంగా నిరుద్యోగం 43 శాతంగా ఉంది. 13 ఏళ్ల పాలనలో చౌహాన్ సర్కార్ ఏడాదికి సగటున 17,600 ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. యువతలో నిరుద్యోగిత, అల్పుఉద్యోగిత(చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం) కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62కి పెంచడం కూడా నిరుద్యోగాన్ని పెంచిందనే విమర్శలూ ఉన్నాయి. యువ నేతలకు ప్రోత్సాహం సామాజికంగా యువతను ఆకట్టుకునే పథకాలతో పాటు రాజకీయంగా యువనేతలను ప్రోత్సహించేందుకు బీజేపీ నడుం బిగించింది. మధ్యప్రదేశ్లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యువ నేతల్ని ప్రోత్సహిస్తోంది. అనురాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వంటి నేతలు ప్రచార బాధ్యతల్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ని తీసుకువస్తూ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. గ్వాలియర్లో మారథన్ రన్లు, బుందేల్ ఖండ్లో జానపద నృత్యాల ఫెస్టివల్, భోపాల్లో కవి సమ్మేళనాలు, కుస్తీ పోటీలు నిర్వహిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. - మేధావి విద్యార్థి యోజన: అఖిలభారత ఎంట్రన్స్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారికి ఉన్నత విద్యలో ఫీజు మినహాయింపు. - యువ కాంట్రాక్టర్ ఇంజనీర్ యోజన: మౌలిక సదుపాయాల రంగంలో యువ ఇంజనీర్లకు ఉచిత శిక్షణనిచ్చి, ఉచితంగా కాంట్రాక్ట్ లైసెన్స్ ఇస్తారు. - ప్రతిభ కిరణ్ యోజన: సాధికారత కోసం మహిళలకు ఉన్నతవిద్యలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. - గావోంకీ బేటీ యోజన: పన్నెండో తరగతి ఉత్తీర్ణులైన గ్రామీణ ప్రాంత విద్యార్థినులకు పైచదువుల కోసం ఆర్థిక సాయం. - లాడ్లీ లక్ష్మి యోజన: అమ్మాయిలు విద్యార్థి దశలో ఉన్నప్పట్నుంచి బాండ్ల రూపంలో ఆర్థిక సాయం. - కన్యావివాహ్ యోజన: సామూహిక వివాహాలు జరిపించి పెళ్లీడు ఆడపిల్లల పెళ్లికి 15 వేల ఆర్థిక సాయం - యువ స్వరోజ్గార్ యోజన: చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా యువతకు రుణాల్లో సబ్సిడీ, బ్యాంకు గ్యారంటీ. మధ్యప్రదేశ్లో మొత్తం ఓటర్లు 5.39కోట్లు తొలిసారి ఓటు వేస్తున్నవారు 15 లక్షలకు పైగా 18 –29 ఏళ్ల ఓటర్లు 1.53 కోట్లు 30–39 ఏళ్ల ఓటర్లు 1.28 కోట్లు కాంగ్రెస్లో కిరార్ కిరికిరి! మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడు గులాబ్ సింగ్ కిరార్ని కాంగ్రెస్ అధినాయకులు రాహుల్ గాంధీ, కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా పార్టీలోకి ఆహ్వనించారు. అయితే వ్యాపం స్కాంతో కిరార్కు సంబంధం ఉన్నదంటూ గతంలో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగిన విషయం తెలుసుకుని నాలుక్కరుచుకుంటున్నారు. నాటి విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. మొదట కిరార్ని కాంగ్రెస్లోకి ఆహ్వనిస్తూ అధికారిక వెబ్సైట్ లో చేసిన ట్వీట్ని తొలగించడమే కాకుండా.. గులాబ్ సింగ్ కిరార్ తమ పార్టీలో చేరారన్న వాదనను కాంగ్రెస్ రాష్ట్ర అధికారిక ప్రతినిధి తోసిపుచ్చడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ గందరగోళంలోనే కిరార్ కాంగ్రెస్లో చేరినట్టు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి స్పష్టం చేయడం జరిగింది. అయితే తనగురించి కాంగ్రెస్ ఎలా అనుకున్నా, నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తాననీ, ఎందుకంటే తాను కాంగ్రెస్ సభ్యుడిననీ గులాబ్ సింగ్ చెప్పుకుంటున్నాడు. కిరార్ వ్యవహారంతో కాంగ్రెస్ బుద్ధి బట్టబయలైందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ శర్మ వ్యాఖ్యానించారు. కిరార్ కిరికిరి కాంగ్రెస్ నైజాన్ని బహిర్గతం చేసిందన్న ఆనందంలో బీజేపీ ఉంది. కిరార్ మధ్యప్రదేశ్ బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కమిషన్ మాజీ సభ్యుడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. 2011 పీజీ వైద్య ప్రవేశ పరీక్ష సందర్భంగా జరిగిన అవకతవకల్లో కిరార్కీ, అతని కుమారుడికీ సంబం«ధం ఉందని సీబీఐ ఆరోపించింది. వ్యాపం స్కాంతో ఆయనకు సంబంధమున్నట్లు బయటపడడంతో మూడేళ్ల క్రితమే బీజేపీ అతన్ని పార్టీనుంచి తొలగించింది. తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహిళలకే మీ ఓటు! మిజోరంలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువఉన్నప్పటికీ.. శాసనసభలో వీరి భాగస్వామ్యం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని మార్చి ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకు ఈ రాష్ట్రంలోని ఏకైక మహిళా సంస్థ ’మిజో మీచే ఇన్సుయిఖ్వామ్ పాల్’ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఉధృతంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఏ పార్టీ అనేది ముఖ్యం కాదని.. అన్ని పార్టీల్లోని మహిళా అభ్యర్థులను అసెంబ్లీకి పంపిద్దామంటూ ప్రజలను చైతన్యపరుస్తోంది. మహిళలు తమ శక్తిని చాటేందుకు ఇంతకన్నా మంచి సమయం రాదంటోంది ఈ సంస్థ. ’మాకు పార్టీ ముఖ్యం కాదు. మహిళలు ఎమ్మెల్యేలుగా గెలవడమే ముఖ్యం’ అని ఈ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 1978 నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలు మాత్రమే మిజో శాసనసభకు ఎన్నికయ్యారు. గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి పట్టు మధ్యప్రదేశ్లో గిరిజనుల ప్రాబల్యం ఉన్న నియోజవర్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు ఎన్నికలుగా బీజేపీ పట్టు సాధిస్తోంది. గిరిజనులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లు మాత్రం కమలంపైనే విశ్వాసం ఉంచుతున్నారు. మధ్యప్రదేశ్లో 47 ఎస్టీ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో పరిస్థితిని ఓసారి గమనిస్తే.. ఇటలీ, స్వీడన్.. ఇవన్నీ ఓటర్ల పేర్లే మేఘాలయలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇటలీ, అర్జెంటైనా, స్వీడన్, ఇండోనేసియాలు దిగ్విజయంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దేశాలేంటి, మేఘాలయ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడమేంటి అనుకుంటున్నారా.. అవి దేశాల పేర్లు కాదండీ బాబూ.. అవి మేఘాలయకు చెందిన ఉమ్ని– మర్ఎలాకా గ్రామ ప్రజల పేర్లు. అవేం పేర్లు అని ఆశ్చర్యపోకండి, ఆ ఊర్లో అందరి పేర్లూ విచిత్రంగానే ఉంటాయి. ఈ ఊళ్లో జనాలకు ఇంగ్లీష్ రైమ్స్పై ఆసక్తి కాస్త ఎక్కువంట. కానీ వాటి అర్ధాలు మాత్రం తెలియవట. అందుకే శబ్దం బాగుంటే పేరుగా పెట్టుకుంటూ ఉంటారు. కేవలం పదాలు బాగున్నాయనే ఏకైక కారణంతో ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని అక్కడి సర్పంచ్ ప్రీమియర్ సింగ్ చెప్పారు. టేబుల్, గ్లోబ్, పేపర్, శాటరన్, అరేబియన్ సీ, రిక్వెస్ట్, లవ్లీనెస్, హ్యాపీనెస్, గుడ్నెస్, యూనిటీ, స్వీటర్, గోవా, త్రిపుర.. లాంటి పలు నామధేయులు ఆ ఊర్లో మీకు ఎదురవుతారు. అన్నింటికనా విచిత్రంగా ఆ ఊర్లో ఒకామె పేరు ‘‘ఐ హావ్ బీన్ డెలివర్డ్’’. ఇవన్నీ చదువుతుంటే మనకు సరదాగా ఉంది కానీ అక్కడ ఎన్నికలు నిర్వహించే అధికారులు మాత్రం ఈ పేర్లతో గజిబిజి పడుతున్నామని వాపోతుంటారు. -
ఛత్తీస్గఢ్లో హై అలర్ట్..
మావోయిస్టుల వరుసదాడులతో అతలాకుతలమవుతున్న ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఓవైపు భద్రతా బలగాలు అడవులన్నీ గాలిస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితి గంభీరంగా ఉంది. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనన్న పట్టుదలతో.. ఎన్నికల సంఘం 65వేల మంది కేంద్రీయ, రాష్ట్ర పోలీసు బలగాల సాయంతో ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతను పర్యవేక్షిస్తోంది. ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలి’ అని పైనుంచి ఆదేశాలొచ్చాయని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్తాన్ దళితుల 24 గీ7 కంట్రోల్రూమ్ ఎన్నికలు రాగానే.. ప్రధాన, ప్రాంతీయ పార్టీల నుంచి చిన్నా, చితకా పార్టీల వరకు తమ అభ్యర్థుల ప్రచార సరళిని గమనించేందుకో, కార్యకర్తలతో అనుసంధానంలో ఉండేందుకో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటుచేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా రాజస్తాన్లో దళితుల కోసం 24 గంటల కంట్రోల్రూమ్ ఏర్పాటైంది. దళిత సంఘాలన్నీ ఏకమై దీన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఏయే పార్టీలు దళితుల గురించి ఎలాంటి హామీలిస్తున్నాయని గమనించడం, ఆయా హామీలపై అవసరమైనప్పుడు స్పందించడం, ఎన్నికల నేపథ్యంలో దళితులు, బడుగు బలహీనవర్గాలు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులను అప్రమత్తంత చేయడం వంటి పనులను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నిర్వర్తిస్తారు. మొత్తంగా ఎన్నికల సందర్భంగా దళితుల హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూడటమే దీని ఏర్పాటువెనక ముఖ్యోద్దేశమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఆ రెస్టారెంట్ ఇప్పుడో హాట్ టాపిక్! మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఇండోర్లోని ‘యంగ్ తరంగ్’అనే చిన్న రెస్టారెంట్లో స్నాక్స్ తిన్నారు. రుచికరమైన మసాలా చాట్ను రాహుల్ సంతోషంగా లాగించేశారు. నిజానికి ఆ రెస్టారెంట్ యజమాని బీజేపీ అభిమాని. శివరాజ్ సింగ్ చౌహాన్పై అభిమానం కొద్దీ సీఎం ఫొటోను రెస్టారెంట్లో ఎదురుగా పెట్టుకున్నారు. ఈ కారణంతోనే రెస్టారెంట్ పేరు హాట్ టాపిక్గా మారింది. హోటల్కు వచ్చే వారందరికీ.. రాహుల్ మా హోటల్లోనే భోజనం చేశారని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ‘ శివరాజ్ చౌహాన్ ఫొటో పక్కనే రాహుల్ ఫొటో పెడతా’అంటున్నాడు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ గురించి ఇండోర్ నగరమంతా చర్చ జరుగుతోంది. -
మధ్యప్రదేశ్లో కమలానికి షాక్..!
భోపాల్ : మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ సర్కార్కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టిన సర్వేలో వెల్లడవడం కమలనాధులను కలవరపరుస్తోంది. అక్టోబర్ 30న ముఖ్యమంత్రి చౌహాన్కు ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు సమర్పించిన రహస్య నివేదిక బీజేపీలో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్ధానాల్లో 128 స్ధానాల్లో పాలక బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. బీజేపీ కేవలం 92 సీట్లలోనే గెలుపొందే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఆరు సీట్లలో, అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని ఎస్పీ మూడు సీట్లలో విజయం సాధించవచ్చని నివేదిక అంచనా వేసింది. రుస్తం సింగ్, మాయా సింగ్, గౌరీ శంకర్ షెజ్వార్, ఎస్పీ మీనా సహా పది మంది మంత్రులు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అతితక్కువగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు సీఎం చౌహాన్కు అత్యంత సన్నిహితుడైన మంత్రి ఎస్పీ మీనా పార్టీ టికెట్ రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ నివేదిక ముఖ్యమంత్రికి చేరిన రెండు రోజుల తర్వాతే తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం గ్వాలియర్ చంబల్ డివిజన్లోని 34 స్ధానాలకు గాను 24 స్ధానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీ కేవలం ఏడు సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తుండగా, మిగిలిన మూడు సీట్లలో బీఎస్పీకి విజయావకాశాలున్నాయి. వింధ్య ప్రాంతంలోని 30 స్ధానాల్లో కాంగ్రెస్ 18 స్ధానాల్లో ప్రత్యర్ధుల కంటే పైచేయి సాధించగా, బీజేపీ 9 స్ధానాల్లో, బీఎస్పీ మూడు స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక మహాకోశల్ ప్రాంతంలోని 38 స్ధానాల్లో కాంగ్రెస్ 22 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 13 స్ధానాల్లో నెగ్గే అవకాశం ఉంది. ఎస్పీ రెండు స్ధానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇక రైతు ఆందోళనలు, పోలీసు కాల్పులతో అట్టుడికిన మాల్వా నిమర్ ప్రాంతంలో కాంగ్రెస్ 34 స్ధానాల్లో, బీజేపీ 32 స్ధానాల్లో గెలిచే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. -
బరిలో ‘కొత్త’ గొంతుక
ఎన్నికల్లో పోటీ అంటేనే.. మనం ఏం చేయాలనుకుంటున్నామో చెప్పుకోవడంతోపాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చెడామడా కడిగేయడం చేయాల్సిందే. అలా చేయకపోతే మనమేంటో ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇది సహజకంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై మనకుండే అభిప్రాయం. కానీ మధ్యప్రదేశ్లో ఎన్నికల్లో ఓ మూగ, చెవుడు అభ్యర్థి రంగంలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. పుట్టుకతోనే మూగ, చెవుడు అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుదీప్ శుక్లా.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి సాత్నా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాటలు రాకపోయినా.. రాజకీయాల్లో తన గొంతుకను వినూత్నంగా వినిపించాలని ఆయన భావిస్తున్నారు. మూగ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని సుదీప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఒకవేళ గెలిస్తే.. భారత చరిత్రలో ఎమ్మెల్యేగా ఎన్నికైన మూగ, చెవుడు వ్యక్తిగా నిలిచిపోతారు. బెంగళూరు ఇన్ఫోసిస్లో నెలకు లక్ష రూపాయల జీతాన్ని వదులుకున్నారు. అయితే ఈయన ప్రచారం ఎలా సాగుతుందనేదే ఆసక్తికరంగా మారింది. ఆయనకు ప్రముఖుల నుంచి మద్దతు అందుతోంది. వికలాంగులకోసం స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న జ్ఞానేంద్ర పురోహిత్ శుక్లాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. -
కమల్ వర్సెస్ కమలం
సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలపై చెరగని ముద్ర వేసి మామా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పిలిపించుకునే కమలనాథుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకవైపు, ఇందిరాగాంధీకి కుడి భుజంగా పేరుతెచ్చుకొని సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న కమల్నాథ్ మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ప్రజల మనసు దోచుకునే ‘నాథు’డెవరు? పేదల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ను ధనిక పార్లమెంటేరియన్ కమల్నాథ్ ఢీ కొనగలరా? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అత్యంత కీలకం. 29 లోక్సభ స్థానాలున్న మధ్యప్రదేశ్పై పట్టు సంపాదించడం కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ఆవశ్యకం. అంతకుముందు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నేత చౌహానే. సంక్షేమ పథకాలతోనే ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే 13ఏళ్లు సీఎంగా ఉండటం, వ్యాపమ్ సహా వివిధ కుంభకోణాలు, రైతు సమస్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతరులతో పోలిస్తే వెనకబడడం వంటికి చౌహాన్కు ఈ ఎన్నికల్లో సవాల్గా మారాయి. రాష్ట్రంలో ఇంకా 70% మంది ప్రజల ఆదాయ వనరు వ్యవసాయమే. నెలవారీ రూ.1300 తలసరి ఆదాయంతో వీరి పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ సగటుకంటే ఇది 7% తక్కువ. గతేడాది మందసౌర్లో రైతుల ఆందోళనలు, పోలీసుల కాల్పులు, ఆరుగురు రైతులు చనిపోవడం శివ్రాజ్ మెడకు చుట్టుకున్నాయి. ఇన్ని సమస్యల మధ్య చౌహాన్ సంక్షేమ కార్యక్రమాలు, హిందుత్వ కార్డు, మోదీ ఇమేజ్ను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. అయితే.. ఇప్పటికీ 46% మంది చౌహాన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. శివరాజ్ వ్యూహాలు రైతు సమస్యలు, నిరుద్యోగమే ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. వీటినుంచి బయటపడేందుకు చౌహాన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. జనాశీర్వాద్ యాత్ర, జనాదేశ్ యాత్రల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రైతులకోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొస్తున్నారు. గత ఏడాదిలో రూ.32,701 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. రాష్ట్రంలో 90% హిందువులే ఉండడంతో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే గో సంరక్షణకు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామంటున్నారు. మామ ఇమేజ్ శివరాజ్ సింగ్ చౌహాన్ది రైతు కుటుంబం. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్తో అనుంబధం ఏర్పడింది. ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో తొలిసారిగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీగా నాలుగు సార్లు వరసగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2003లో రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో ఆయనపై పప్పు అనే ముద్ర ఉండేది. కానీ తనకున్న నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యాలతో ఆ ఇమేజ్ను చెరిపేసుకుని అందరితో మామ అని పిలిపించుకునే స్థితికి ఎదిగారు. 2008 ఎన్నికల్లో చౌహాన్ 143 స్థానాల్లో, 2013లో 165 చోట్ల పార్టీని గెలిపించుకున్నారు. కమల్నాథ్ ప్లానింగ్.. మధ్యప్రదేశ్లో పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్ష పగ్గాలను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కమల్నాథ్కు అప్పగించింది. కమల్నాథ్ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్త. పారిశ్రామిక, ఆర్థిక రంగాలపై మంచి పట్టు ఉంది. తొమ్మిదిసార్లు మధ్యప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికైన కమల్నాథ్కు రాష్ట్రంలో ప్రతి నాయకుడి పాజిటివ్, నెగటివ్ అంశాలు బాగా తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలతోనూ మంచి అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కమల్నాథ్ను ఎంపిక చేయడంపై కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చౌహాన్ ‘మామ’ ఇమేజ్ మసకబారేలా, ప్రజల్లో ఆయన విశ్వసనీయత దెబ్బ తీసేలా కుంభకోణాలపైనే దృష్టి సారించారు. హిందూత్వ కార్డునీ ప్రయోగిస్తున్నారు. ‘మేము కూడా మతాన్ని గౌరవిస్తాం. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోం. చింద్వారాలో 101 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. కానీ దానిని ప్రచారం చేసుకోలేదు’ అంటూ పదే పదే చెబుతున్నారు. రాజకీయ ప్రస్థానం కమల్నాథ్ సంజయ్గాంధీకి సమకాలికుడు. ఇందిర నుంచి రాహుల్ వరకు మూడు తరాల గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1980 నుంచి చింద్వారా లోక్ సభ స్థానానికి తొమ్మిది సార్లు గెలిచారు. 16వ లోక్సభలో కమలనాథే సీనియర్ సభ్యుడు. కమల్నాథ్కు ఏవియేషన్ రంగంలో వ్యాపారాలతో పాటు ఎన్నో రెస్టారెంట్లకు అధినేత. 187 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్లో ప్రకటించుకున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
హలో.. ఐస్క్రీం తింటావా..?
-
హలో.. ఐస్క్రీం తింటావా..?
భోపాల్ : మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ కాసేపు ప్రచారానికి విరామం ఇచ్చి సరదాగా గడిపారు. ఈ క్రమంలో రాహుల్ ఇండోర్లోని ‘56 దుకాణ్’ అనే షాప్లో ఐస్క్రీం తినేందుకు వచ్చారు. రాహుల్ కోసం అక్కడి సిబ్బంది ప్రత్యేక ఐస్క్రీంను తయారుచేసి ఇచ్చారు. దాన్ని తీసుకుని తినడానికి సిద్ధమైన రాహుల్.. అక్కడే ఉన్న ఓ చిన్నారిని గమనించారు. ‘హలో.. ఐస్క్రీం తింటావా’? అంటూ ప్రశ్నించి ఆ బాలునికి ఐస్ క్రీం తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఈ సమయంలో రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింథియా తదితరులు ఉన్నారు. -
మామాజీ బెదిరింపులు.. దిగొచ్చిన రాహుల్
భోపాల్ : మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల జోరు పెంచాయి. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పరం విమర్శల దాడికి దిగాయి. సోమవారం మధ్యప్రదేశ్లో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్పై పలు అవినీతి ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో పాల్గొన్న రాహుల్ పనామా పత్రాల కుంభకోణాన్ని ఉటంకిస్తూ ‘ఈ కుంభకోణంలో మామాజీ(శివ్రాజ్ సింగ్ చౌహన్ నిక్ నేమ్), మామాజీ కుమారుడి పేరు ఉంది. అక్కడ చౌకీదార్(మోదీ).. ఇక్కడ మామాజీ ఇద్దరు దోచుకుంటున్నారం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ ఆరోపణలపై ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వ్యాపం నుంచి పనామా కుంభకోణం వరకు నాపై, నా కుటుంబంపై రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ విషయంపై నేను కోర్టుకు వెళతా. రాహుల్పై పరువునష్టం దావా వేస్తాన’ని చౌహన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Mr @RahulGandhi You have been making patently false allegations of Vyapam to Panama Papers against me and my family. Tomorrow, I am filing a criminal defamation suit for maximum damages against you for frivolous and malafide statements. Let law take its own course now. — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) October 29, 2018 దాంతో చౌహన్పై చేసిన అవినీత ఆరోపణల గురించి రాహుల్ దిగొచ్చారు. కానీ మరోసారి బీజేపీపై విమర్శల వర్షం గుప్పించారు. ‘బీజేపీలో అవినీతి చాలా ఎక్కవ కదా అందుకే నేను పొరబడ్డాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబంపై పనామా కుంభకోణం ఆరోపణలు లేవు. ఆయనపై కేవలం ఈ-టెండరింగ్, వ్యాపం కుంభకోణం లాంటి ఆరోపణలు మ్రాతమే ఉన్నాయంటూ’ అని రాహుల్ చురకలంటించారు.