
ప్రజారంజకంగా ఎన్డీయే రెండేళ్ల పాలన
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
♦ మోదీ చేసిన అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో ప్రజారంజక, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అమలయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ నేతలు ఎన్.రామచందర్రావు, ప్రకాశ్రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి పథంలో భారత్’ అనే నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్టు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కేంద్రమంత్రులు 7 బృందాలుగా ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తారని లక్ష్మణ్ వెల్లడించారు. పేద మహిళలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించడానికి ఉజ్వల పథకం కింద 1600 రూపాయల సబ్సిడీతో దేశవ్యాప్తంగా 5కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు లక్ష్మణ్ చెప్పారు.