రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్రావు ఓ ప్రకటనలో ఆదేశించారు.
సిమెంటు సంచులు, ఇసుక బస్తాలు నిల్వ ఉంచుకోవాలని అన్ని సాగునీటి శాఖ సబ్ డివిజన్లకు సూచించారు. ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లలో ఏ మేరకు నీళ్లు చేరాయనేదానిపై జిల్లా అధికారులకు వెంట వెంటనే సమాచారం పంపించాలని ఆదేశించారు. భారీ వర్షాలకు కొన్నిచోట్ల చెరువులు పొంగిపొర్లే అవకాశముందని, ఆయా చెరువుల రక్షణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ పనుల్లో రెవెన్యూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా.. బాధ్యులను క్షమించబోమని హెచ్చరించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.