-
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
-
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా బోలు శబ్దాలు (Hallow Sounds), ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి.. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి, 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండటంతో ఆ ఒత్తిడికి బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి 7వ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి.. ఏకంగా 40వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా బ్యారేజీ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం గమనార్హం. ఇప్పటికే హెచ్చరించిన ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు, 85 గేట్లు ఉండగా.. గతేడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. 7వ బ్లాకులోని 15 నుంచి 22 నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తవగా.. అదే ఏడాది వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని పేర్కొంది. బ్యారేజీలకు వానాకాలంలోగా నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులు, చర్యలను సిఫారసు చేసింది. అయితే వానాకాలానికి ముందే మేడిగడ్డ బ్యారేజీలో మొరాయించిన గేట్లను పైకి ఎత్తేయాలని సూచించింది. అందులోనూ పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సిబ్బందితో కలసి ఈ నెల 17న 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. తర్వాత 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా.. శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ చేయించడంపై దృష్టి మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడో నంబర్ బ్లాకు దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని.. మొత్తం బ్యారేజీ కింద ఓ చివరి నుంచి మరో చివరి వరకు ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక.. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. తొలుత ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లతో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్–విజేత–పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఫిబ్రవరి 7న నిర్వహించిన మోడల్ స్టడీలో డిజైన్లో లోపాలున్నట్టుగా తేలిందని పేర్కొంది. వచ్చే వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే బ్యారేజీకి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు బ్యారేజీలు, డ్యామ్ల గేట్లు ఎత్తినప్పుడు వరద భీకర వేగంతో కిందికి దూకినట్టుగా ప్రవహిస్తుంది. ఆ వరద నేరుగా దిగువన (అప్రాన్ ఏరియా) ఉన్న కాంక్రీట్ బ్లాకులపై పడడంతో అవి కొట్టుకుపోయి భారీగా లోతైన గుంతలు పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికే బ్యారేజీ దిగువ ప్రాంతంలో తగిన స్థాయిలో నీళ్లు నిల్వ (టెయిల్ వాటర్ లెవల్) చేస్తారు. పైనుంచి పడే వరద ఆ నీటిలో పడటం వల్ల ఉధృతి తగ్గి కాంక్రీట్ బ్లాకులకు నష్టం జరగదు. అయితే అన్నారం బ్యారేజీకి దిగువన తగిన రీతిలో నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు. దీంతో గతంలో వచ్చిన వరదలతో దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. నిరంతర వరదలతో బ్యారేజీ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా ఉండే సెకెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. వీటివల్ల సెకెంట్ పైల్స్ దెబ్బతిని వాటికి, ర్యాఫ్ట్కు మధ్య అగాధం ఏర్పడి ఉండడానికి అవకాశం ఉంది. దీని వల్లనే బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని ఆఫ్కాన్స్–విజేత– పీఈఎస్ జాయింట్ వెంచర్ స్పష్టం చేసింది. కాగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ ఏబీ పాండ్య, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మోడల్ స్టడీలో పాల్గొన్నారు. సెకనుకు 15–30 మీటర్ల వేగంతో వరద వరదలు తగ్గుముఖం పట్టాక తక్కువ మొత్తంలో నీళ్లను కిందికి విడుదల చేసేందుకు వీలుగా బ్యారేజీ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపుతారు. అయితే బ్యారేజీ పూర్తిగా నిండి ఉండడంతో పీడనం పెరిగి వరద భీకర ఉధృతితో గేట్ల కింద నుంచి దూసుకు వస్తుంది. అన్నారం గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు 15–30 మీటర్ల భీకర వేగంతో వరద బయటికి వస్తోందని మోడల్ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీ రక్షణకు ల్యాబ్ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ లేఖలో కోరింది. మూడేళ్ల కిందే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అన్నారం బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2021 డిసెంబర్ 17లోనే ముగిసింది. నాటి నుంచి మూడేళ్ల పాటు కేవలం బ్యారేజీ నిర్వహణ కోసం రూ.6.42 కోట్ల అంచనాలతో అఫ్కాన్స్ –విజేత–పీఈఎస్ జేవీతో నీటిపారుదల శాఖ ‘ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్ 16తో ముగియనుంది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది. -
నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. నాణ్యత పర్యవేక్షణ ఎలా? ‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్)కు రక్షణగా తొలుత షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్ పైల్స్కు ఎందుకు మారారు? ఈ డిజైన్ మార్పులకు అప్రూవల్స్ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్ పైల్స్ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! ‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్ చార్ట్ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ జరిపిన వ్యాప్కోస్ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్ స్టడీస్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఈఎన్సీ(ఓఅండ్ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్శర్మ, రాహుల్కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్లోకి దిగి 6, 7, 8 బ్లాక్లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది. -
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. -
ఎల్ అండ్ టీ ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్ అండ్ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్ ర్యాఫ్ట్ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్ అంటే భూగర్భంలోని కాంక్రీట్ నిర్మాణాలను ‘ఎక్స్రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన సెకెంట్ పైల్స్ లోపాలు? వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్ పైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్ పైల్స్ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ కసరత్తు చేసింది. జీపీఆర్ టెస్ట్ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్ ఓవర్సీస్కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు. 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్ డ్యామ్తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్ అండ్ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది. -
వరదలతో బ్యారేజీలకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది. బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్కుమార్, పి.దేవేందర్ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు. ఈ వారం చివరిలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్వాల్స్కి లేదా కటాఫ్వాల్స్–ర్యాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్(జీపీఆర్) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్లెస్) ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది. బ్యారేజీలను పునరుద్ధరిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్ఏకు అప్పగించాం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
హరీష్ రావు Vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖపై అధికార కాంగ్రెస్ నేతలు వర్సెస్ మాజీ మంత్రి హరీష్రావు అన్నట్టుగా వాడీవేడి చర్చ నడుస్తోంది. మంత్రులు, హరీష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సభలో మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్ చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగాయి. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. ఎస్ఆర్ఎస్పీ-2కు నీళ్లిచ్చిన ఘనత మాది. కేసీఆర్ వచ్చాకే రెండు పంటలకు నీరిచ్చాం. కాంగ్రెస్ పాలనలో నీరు రాలేదు ఎందుకు.. కేసీఆర్ వచ్చాకే ఎలా నీళ్లు వచ్చాయి. ►బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రతీసారి అబద్ధాలే చెబుతున్నారు. గోబెల్స్ అవార్డు ఉత్తమ్కే ఇవ్వాలి. ►30 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్ట్ కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ది సెల్ఫ్గోల్. కాగ్ నివేదికకు ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కాగ్ రిపోర్ట్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పుపట్టాయి. కాగ్ నివేదిక తప్పులతడక అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాగ్ నివేదికల్లో ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ►రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నాలుగు అంశాలు అబద్ధాలే. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం. ►ఖర్చులు వర్సెస్ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది. ►రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (బీఆర్ఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో ఈ జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్స్ చేశారు. -
‘రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్కరోజే కాళేశ్వరానికి..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా గత బీఆర్ఎస్ సర్కార్ పాలన, నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విస్తరుపోయే విషయాలను కాగ్ చెప్పింది. కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్ట్లను కొనసాగించారు. 81వేల కోట్ల ప్రాజెక్టుకు CWC అనుమతి ఇస్తే ఒక లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెంచారు. 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు. మొత్తం ఖర్చు 54,234కోట్లు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు. 2014-23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు. కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు. ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు. పీక్ ఎనర్జీ డిమాండ్ ఉన్న రోజు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. ►కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి చుస్తే ఖర్చు రెండు లక్షలకు పోయే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజుకే అవసరమవుతుంది. ఏడాదికి పదివేల ఐదు వందల కోట్లు కరెంట్ బిల్లులు కాళేశ్వరానికి అవసరం అవుతుంది. ►మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మల్లన్న సాగర్ కూడా ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని CAG స్పష్టం చేసింది. ►అన్నారం బ్యారేజ్లో నిన్నటి నుంచి లీక్ మొదలైంది. NDSAకు సమాచారం ఇస్తే నీళ్లను వదిలిపెట్టాలని వాళ్ళు సూచించారు. మేడిగడ్డ తరహాలో అన్నారం కుంగిపోయే ప్రమాదం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఆపరేషన్ చేయలేదు. ►1800 కోట్లకు మేడిగడ్డ టెండర్ పిలిచి నాలుగు వేలకోట్లు చెల్లించారు. మేడిగడ్డ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. డిజైన్, క్వాలిటీ లోపం స్పష్టంగా ఉంది. ►అక్టోబర్లో డ్యామ్ డ్యామేజ్ అయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ►మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదు. కాళేశ్వరం నిర్మాణంలో అలసత్వం వహించిన అధికారులను ఇప్పటికే కొందరిని తొలగించాం. ►ప్రాజెక్ట్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీ వాడుకుంటున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కృష్ణా జలాలను ఏపీ ప్రబుత్వం యథేచ్చగా మళ్లించుకుంది. ►కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట 68 శాతం ఉంటే గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది. పోలింగ్ రోజు ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లకు వేల కోట్లును కట్టబెట్టారు. ►గత ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్లు అప్పగిస్తూ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయింది. ఇలా కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్లను నింపే ప్రక్రియను ఆపేసింది. ►కడెం ప్రాజెక్ట్ను పట్టించుకోకపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో, ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ గేటు కూడా కొట్టుకుపోయింది. ►మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. ►ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి అయ్యింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్ట్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. గత పదేళ్లలో ప్రాజెక్ట్లకు అనాలోచితంగా ఖర్చు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్ట్లను నిర్మించాలి. ఐదేళ్లలోనే కాళేశ్వరం మూలకు పడింది. ►తెలంగాణ రైతుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు బ్యారేజ్లను NDSAకు అప్పగించి విచారణ చేయిస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై విచారణ NDSA రిపోర్ట్తో చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాము. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లను గుర్తించారు. రిపేర్ చేయాలని 18-05-2020న ఇరిగేషన్ శాఖ ఎల్ అండ్ టీకీ నోటీసులు జారీ చేసింది. 28-04-2023న మరోసారి సీసీ-బ్లాకులు కొట్టుకుపోయాయి. ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు పనులు జరగలేదు. తనిఖీ నివేదికలు లేకుండా డీవియేషన్లకు ఆమోదం తెలిపారు. 2019 నుంచి బ్యారేజ్ నిర్వాహణ చేయలేదు. బ్యారేజ్ నిర్మాణం తర్వాత షీట్ ఫైల్స్, కాఫర్ డ్యామ్ను తొలగించలేదు. పనులు పూర్తి చేయకముందే ఏజెన్సీకి బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయాలని ఈఎన్సీ సిఫారసు చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ: ఇరిగేషన్పై మాటల యుద్ధం
Updates.. తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ 45 గంటల 32నిమిషాల పాటు నడిచిన అసెంబ్లీ 8 రోజుల శాసనసభ పనిదినాల్లో 59 మంది సభ్యులు మాట్లాడారు జీరో అవర్ లో 64మంది వారి సెగ్మెంట్ అంశాలను ప్రస్తావించారు ప్రభుత్వ ప్రకటనలు రెండు, మూడు బిల్లులకు ఆమోదం, ఒక లఘు చర్చ అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్ వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్ అయింది.. సరి చెయ్యాలి ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ హరీష్ రావు వన్ మెన్ హీరో మేడిగడ్డలో రిపేర్ కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు అన్నారం డ్యామేజిపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం డ్యామేజి సీరియస్ అంశం మూడు బ్యారేజిలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ(ఎన్డీఎస్ఏ)కు అప్పగిస్తాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు ఒకనాడు కేసీఆర్కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు. ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా హరీష్రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్కు స్లిప్ పంపుతున్నారు నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను నిన్ననే అసెంబ్లీ క్లోజ్ చేయమని చెప్పాం 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు.. మంత్రి భట్టి మాట్లాడుతూ.. కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచారు లక్షల కోట్లు వృధా చేశారు హరీష్రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది సాగునీటి మంత్రిగా హరీష్ను ఎందుకు తప్పించారు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు ఈ పాపాలన్నింటికి హరీష్, కేసీఆరే కారణం తెలంగాణను చెదలు పట్టించారు హరీష్ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్ను సమర్థిస్తున్నారు చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్లో చేరాక అలా తయాయ్యాడు అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్ మారిపోతుంది కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మాటలతో ప్రజల్ని నమ్మించలేరు గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు హరీష్రావు మాట్లాడుతూ.. సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్ కూలాయి మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు కేసీఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశం మేడిగడ్డ.. కేసీఆర్ ఆలోచనే: సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ఆలోచన అక్కడే కట్టాలని కేసీఆర్ ఆదేశించారు వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది హరీష్రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే గోదావరి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ బయటపెట్టే యత్నం చేస్తున్నారు ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో ఎక్కువ దోపిడీ జరిగింది హరీష్రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు గోబెల్స్ హరీష్రావు అని పేరు పెట్టుకోండి పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి హరీష్రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం కాంగ్రెస్ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్ చేశాం ఎస్ఆర్ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ మంత్రి భట్టి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువునా చీటింది కాళేశ్వరంలో నాణ్యత లేదు మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది గత గవర్నర్ హరీష్రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్ కూడా చెప్పింది ఉత్తమ్ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి కూలిన దానికి తప్పు ఒప్పుకోండి ఇంకా సమర్థించుకోవడం సరికాదు ఇరిగేషన్పై వాడీవేడి వాదనలు ఇరిగేషన్ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్ చేసిన అధికార పక్షం తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు లేచి బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హరీష్రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు కేసీఆర్, జగన్ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నొటిఫికేషన్ను మేం వ్యతిరేకించాం మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగింది ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు హరీష్రావు మాట్లాడుతూ.. ఇరిగేషన్పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారు గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు మిడ్మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం ఇరిగేషన్పై చర్చకు 2గం. సమయం అవసరం మంత్రి ఉత్తమ్ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సభలో మంత్రి ఉత్తమ్.. లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు. అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు సభలో మంత్రి ఉత్తమ్.. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది గతంలో.. అపెక్స్ కమిటీ మీటింగ్ గత సీఎం కూడా పాల్గొన్నారు అప్పుడే కేఆర్ఎంబీకి నోటిఫికేషన్ను కేంద్రం రిలీజ్ చేసింది కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కేఆర్ఎంబీకి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాచింయింది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది పోలింగ్ రోజు సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్ఎస్ అప్పుడు పట్టించుకోలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ, కాగ్ అనేక లోపాలు బయటపెట్టింది మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్ తట్టుకోలేదు మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్ పేర్కొంది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది కానీ, కాగ్ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు కాగ్ చెప్పింది కరెంట్ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది డీపీఆర్ అఫ్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టింది కాగ్ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు అన్నారంకు క్రాక్స్ వచ్చాయి అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి వెంటనే ఎన్డీఎస్ఏకి సమాచారం అందించాం నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ఉన్న నీటిని తొలగించమని చెప్పింది సభలో మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది అక్టోబర్లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బాగా దెబ్బతింది గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్.. డిజైనర్ గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు మొత్తం ఖర్చు 54,234కోట్లు 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్పాయింట్ ప్రజంటేషన్ సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్ అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది అసెంబ్లీ స్పీకర్ అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు మంత్రి శ్రీధర్ బాబు.. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు.. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి టెక్నీషియన్ ను బయటకు పంపాలి ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం. మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా? అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం. మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది. ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది. ►ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ సర్కార్. ►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు ►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ►నిన్న జరగాల్సిన ఇరిగేషన్పై చర్చ నేటికి వాయిదా ►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు ►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా. -
TS: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్)గా ఉన్న మురళీధర్ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఇటీవల ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మురళీధర్.. 11 ఏండ్లకు పైగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి మురళీధర్ ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్లు బాస్లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్వర్క్స్ నాగర్కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
రూ. 37 వేల కోట్లు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరం (2024–25)లో నీటిపారుదల రంగానికి రూ.37 వేల కోట్లను కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. మంగళవారం నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. 2024– 25లో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల నిమిత్తం రూ.14,462.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాక రూ.3000 కోట్లను తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ కింద తీసుకున్న రుణాలకు చెల్లింపులున్నాయని అధికారులు నివేదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సృష్టించేలా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్సాగర్, నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), మొడికుంటవాగు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, పెద్దవాగు (జగన్నాధపూర్), చనాకా కొరాటా, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) మురళీధర్ రావు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. విద్యుత్ సంస్థల్లో మరో ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే..
సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంత నిర్లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు మరోటి లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లోనే లోపం ఉందని ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. అలాగే, దాని నిర్మాణం, నిర్వహణ కూడా పూర్తి నిర్లక్ష్య పూరితంగా జరిగాయని చెప్పారు. శనివారం ఆయన సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ. 94వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు 40వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తుందని కాగ్ రిపోర్టు చెబుతోందని, అది కూడా కూలిపోయే స్థితికి చేరుకుందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కో సంస్థ డిజైన్ చేసిందని, అందులో రూ.38వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు డిజైన్ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంటే ఈ మూడు బ్యారేజీలు మాత్రమేనని, వీటినే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని, పైనున్న ఎల్లంపల్లి, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనని వివరించారు. అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిందని, డ్యామేజీతోపాటు నిర్లక్ష్యం కూడా చోటుచేసుకుందని, వీటికి సంబంధించిన ఫొటోలు త్వరలోనే విడుదల చేస్తామని ఉత్తమ్కుమార్ చెప్పారు. కృష్ణా బోర్డుకు అప్పగించలేదు కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణానీటి దుర్వినియోగం జరిగిందని, వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం ప్రారంభించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందని దు్రష్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. గత డిసెంబర్ 7న తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుల స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో ముఖ్యమంత్రి రేవంత్, తాను సమావేశమైనప్పుడు కేఆర్ఎంబీపై య«థాతథస్థితి కొనసాగించాలని చెప్పినట్లు తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ప్రజల ముందు పెట్టనున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై పలు విచారణలు సాగుతున్నాయని, పూర్తి వివరాలతో నిపుణులే మాట్లాడతారన్నారు. విధ్వంసక మైండ్ సెట్ ఉన్నోళ్లే కరెంట్ బిల్లు కట్టొద్దని అంటున్నారని, విద్యుత్ శాఖలో రూ.వేలకోట్ల అప్పులు చేసి బిల్లులు కట్టొద్దని మాట్లాడటం శోచనీయమని అన్నారు. -
మీ కౌంటర్లో పస లేదు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తాము సమర్పించిన నివేదికలోని అంశాలను ఖండిస్తూ గత డిసెంబర్ 7న నీటిపారుదల శాఖ పంపించిన నివేదికలో ఎలాంటి పస లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) తేల్చి చెప్పింది. బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు సమాచారం సైతం అసంపూర్తిగానే ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమాచారాన్ని పంపించాలని కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ నెల 12న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ)కు లేఖ రాశారు. ‘నాణ్యత’పై గోప్యత ఎందుకు ..? బ్యారేజీ నిర్మాణ సమయంలో నాణ్యతా పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు, ప్రత్యేకించి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యతాపర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందించలేదని ఎన్డీఎస్ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేíÙంచిన తర్వాతే బ్యారేజీ పియర్లు కుంగడానికి కారణాలు తెలుస్తాయని పేర్కొంది. బ్యారేజీ పునరుద్ధరణకు తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడానికి నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. పొంతన లేని విభాగాల డ్రాయింగ్స్ భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించి ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్ఏకు సమర్పించింది. వీటిపై అధ్యయనం తర్వాత బ్యారేజీ పునాదుల కింద నుంచి ప్రవహించాల్సిన నీళ్లకు భూగర్భంలో నిర్మించిన కటాఫ్ గోడలు అడ్డుగా ఉన్నట్టు భావన కలుగుతోందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రాజెక్టు అధికారులు సమర్పించిన ‘డిజైన్ కాలిక్యులేషన్స్’మాత్రం బ్యారేజీ కింద భూగర్భంలో ప్రవాహానికి కటాఫ్ గోడలు అడ్డంకిగా లేవని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ప్రాజెక్టు అధికారులు సమర్పించిన వేర్వేరు రకాల సమాచారాన్ని విశ్లేషించి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయానికి ఎన్డీఎస్ఏ వచ్చింది. ప్రాజెక్టు డిజైన్కు సంబంధించి కీలకమైన ఈ అంశంపై మరింతగా పరిశీలన కోసం ..ప్రత్యేకించి బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్(సెక్షనల్ డ్రాయింగ్స్)ను జియోలాజికల్ వివరాలతో సహా అందజేయాలని విజ్ఞప్తి చేసినా ఇంత వరకు అందజేయలేదని ఎన్డీఎస్ఏ పేర్కొంది. మళ్లీ ఎన్డీఎస్ఏ బృందాన్ని పంపిస్తాం... ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించి, బ్యారేజీ కుంగిన ప్రాంతం వద్ద ఉండే నీటి నిల్వలను తోడేసిన తర్వాత తమకు తెలియజేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అలా తెలిపిన వెంటనే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం వచ్చి వాస్తవాలను తెలుసుకోవడానికి తొలి పరిశీలన చేస్తుందంటూ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్డీఎస్ఏ మళ్లీ గుర్తు చేసింది. బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తు అంశాలను సైతం తమకు తెలియజేయాలని కోరినట్టు పేర్కొంది. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదని తెలిపింది. -
మేడిగడ్డపై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/తిమ్మాపూర్(మాన కొండూర్)/కరీంనగర్క్రైం/జ్యోతినగర్(రామగుండం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్లోని జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన 10 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనిఖీలు జరిపాయి. క్షేత్ర స్థాయిలో డివిజనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఈఎన్సీ, సీఈ, ఎస్ఈల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. జలసౌధలో 50 మంది అధికారులు హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఫైళ్లను తనిఖీ చేశారు. ఒకటో అంతస్తులో ఉండే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ క్యాంప్ కార్యాలయం, రెండో అంతస్తులో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ స్వీయ పర్యవేక్షణ కింద ఉండే కీలకమైన ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ (పీఅండ్ఎం), హైడ్రాలజీ విభాగాల్లో తనిఖీలు జరిగాయి. అలాగే ఐదో అంతస్తులోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం, ఆరో అంతస్తులోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఓ), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌస్లకు సంబంధించిన ఫైళ్లను కూడా అధికారులు జప్తు చేసి తీసుకెళ్లారు. సీడీఓ సీఈ కార్యాలయం నుంచి బ్యారేజీలు, పంప్హౌస్ల డిజైన్లు, డ్రాయింగ్స్ను పట్టుకెళ్లారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన రెండు టీఎంసీల ప్రాజెక్టు పనులతో పాటు మూడో టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారు. మొత్తం అన్ని సర్వేలు, వ్యయ అంచనాలు, డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, పనుల్లో నాణ్యతా పర్యవేక్షణ, నిర్వహించిన పరీక్షలు, బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను కూడా పట్టుకెళ్లారు. రాకపోకలు బంద్..సెల్ఫోన్ల స్వాదీనం తనిఖీల సమయంలో లోపలి వ్యక్తులు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులు లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. అలాగే తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా అధికారుల ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. కుంగిన పియర్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదేవపూర్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్లను పరిశీలించారు. మరో బృందం కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ మునిగిన ప్రాంతం, కంట్రోల్ రూమ్ను పరిశీలించింది. పలు కీలక రికార్డులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. ప్రాజెక్టు డీపీఆర్, సీడబ్ల్యూసీ క్లియరెన్స్లు, బ్యారేజీ, పంపుహౌస్ల డ్రాయింగ్, డిజైన్లు తదితర వివరాలు స్థానిక అధికారులను అడిగారు. నిర్మాణ పనులు పూర్తయిన సర్టిఫికెట్స్, భూమి అక్విటెన్స్ స్థితి, ప్రస్తుత పనులపై కూడా ఆరా తీశారు. నీటి విడుదల, విద్యుత్ వినియోగ వివరాలు, అధికారుల బదిలీల వివరాలు, ఫిర్యాదులు, ఆర్టిలతో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. మరోవైపు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇవి కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. స్థానికంగా పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ రమణారెడ్డి తెలిపారు. హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే బ్యారేజీ కుంగిందని నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. దీనిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఇటీవల రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేడిగడ్డపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గతంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. నేడు ముఖ్యమంత్రి సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విచారణ విషయమై గతంలోనే నిర్ణయం తీసుకోగా, తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి మూలకారణాలు తెలుసుకోవడం, బ్యారేజీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బుంగలు ఏర్పడిన అన్నారం బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించాల్సిన పరీక్షలు.. తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మేడిగడ్డ బ్యారేజీ.. వాటిని కూల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా స్ట్రక్చర్కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు. బ్యారేజీకి త్వరలో పరీక్షలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు ♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు ♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు ♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు ♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే) ♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన ♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు డైమండ్ వైర్ కటింగ్ అంటే.. మేడిగడ్డ ఏడవ బ్లాక్లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement