Irrigation Department
-
పాత ప్రాజెక్టుల బాగోగులు పట్టవా?
సాక్షి, హైదరాబాద్: కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మాణం పూర్తైన ప్రాజెక్టుల బాగోగులకు మాత్రం నయాపైసా విదల్చడం లేదు. దీంతో రూ.లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు గాలిలో దీపంలా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ (ఓ అండ్ ఎం)కు 2024–25 బడ్జెట్లో రూ.480 కోట్లు కేటాయించగా, మరో 26 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. సాగునీటి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల విలువ రూ.160 కోట్లకు ఎగబాకింది. మొత్తం 170 పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. నీటిపారుదల శాఖ టోకెన్లు జారీ చేసినా, ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్ఓ) జారీ చేయకపోవడంతో వాటికి మోక్షం లభించడం లేదు. దయనీయంగా దేవాదులకాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు మినహా రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణను ప్రభుత్వం.. ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించింది. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ చూస్తున్న కాంట్రాక్టర్ ఏడాదికాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో కార్మికులు ఇటీవల పంప్హౌస్కు తాళం వేసి నిరసన తెలిపారు. తక్షణమే బిల్లులు చెల్లించకపోతే మోటార్లను బంద్ చేసి నీటి పంపింగ్ను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. రెండేళ్ల పాటు ఓ అండ్ ఎం పనులు నిర్వహించేందుకు రూ.22 కోట్ల అంచనాలతో కాంట్రాక్టు అప్పగించగా, సదరు కాంట్రాక్టర్కు రూ.9 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే యాసంగి సాగు చివరి దశలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్కు సర్దిచెప్పి నీటి పంపింగ్ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.ఓ అండ్ ఎం లోపాలే శాపం!గతేడాది గోదావరికి వచ్చిన వరదల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు కొట్టుకుపోగా, నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. 500కి పైగా చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. వీటికి నిర్వహణ లోపాలే కారణమనే ఆరోపణలొచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యాలకు కూడా నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఓ కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక గత 11 ఏళ్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1.9 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ప్రాజెక్టుల నిర్వహణకు మాత్రం ఏటా రూ.100 కోట్లను కూడా ఖర్చు చేయడం లేదు. నెలకు కనీసం రూ.20 కోట్లు ఇచ్చినా ప్రాజెక్టుల నిర్వహణ సజావుగా సాగుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు చిన్నవే.. కాని అత్యంత కీలకం!రాష్ట్రంలో 40 వరకు భారీ, మధ్యతరహా జలాశయాలుండగా, వాటికి 1,884 గేట్లున్నాయి. 42 వేల కి.మీ. మేర ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, 900 కి.మీ. మేర పైప్డ్ కాల్వలు, 138 పంప్హౌస్లు, 115 సబ్స్టేషన్లతో పాటు కాల్వలపై బ్రిడ్జీలు, అక్విడక్ట్లు వంటి 1.3 లక్షల ఇతర నిర్మాణాలున్నాయి. జలాశయాల గేట్లకు గ్రీజింగ్, గేట్లు ఎత్తే క్రేన్లు, జనరేటర్లు, రోప్వైర్లకు మరమ్మతులు, కాల్వల్లో కలుపు మొక్కల తొలగింపు, దెబ్బతిన్న కాల్వలకు మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనులు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణ వంటి పనులు నీటిపారుదల శాఖలోని ఓ అండ్ ఎం విభాగం పరిధిలోకి వస్తాయి. స్థానిక చిన్నస్థాయి కాంట్రాక్టర్లే వీటిని చూస్తుండగా, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదు. ఏదైనా జలాశయం గేట్లకు గ్రీజింగ్కు ఏటా రూ.10 లక్షల లోపే వ్యయం కానుండగా, ఈ పనులు చేయకపోతే వరదల సమయంలో గేట్లు మొరాయించే ప్రమాదం ఉంటుంది. కాల్వల్లో కలుపు మొక్కలు, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుత యాసంగి సీజన్లో చాలా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని పెద్దసంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. -
ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా ఏపీ తీసుకుంటున్న జలాలను తక్షణమే 7 వేల క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి తీసుకుంటున్న జలాలను కూడా ఆ రాష్ట్రం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీటికి అవసరమైన కనీస జలాలను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత సంవత్సరంలో ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలు వాడుకుందని, ఇకపై శ్రీశైలం, సాగర్ నుంచి ఆ రాష్ట్రం నీళ్లు తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. బోర్డు ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ నీటి వినియోగానికి సంబంధించి ఓ రాష్ట్రంపై కృష్ణా బోర్డు ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో కేవలం జల విద్యుత్ను నియంత్రించాలని కోరుతూ మాత్రమే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసిందని వెల్లడించాయి. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలకు కేటాయించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు. ఈ నెల 24న జలసౌధలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పై ఆదేశాలకు సంబంధించి కేఆర్ఎంబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, ఏపీ తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 834 అడుగులకు ఎగువన కేవలం 24 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, సాగర్ ఎండీడీఎల్ 510 అడుగులకు ఎగువన 42.3 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయని కృష్ణా బోర్డు తెలిపింది. ప్రస్తుతం తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాల్లో నిల్వలను వచ్చే వేసవి ముగిసే వరకు లేదా జూలై 31 వరకు సంరక్షించాలని నిర్ణయించింది. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే మిగిలే జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. నేడు కేటాయింపులపై కీలక సమావేశం తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జలసౌధలో సమావేశమై, సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
బీఆర్ఎస్ పాలనలోనే ‘కృష్ణా’లో అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ గత బీఆర్ఎస్ పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపీ పాలకులు దోచుకుపోతుంటే అందుకు సహకరించిన బీఆర్ఎస్ పాలకులు.. ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాలను ఏపీ, తెలంగాణకు పంపిణీ చేసేందుకు 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించగా, ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ సంతకాలు చేశారని ఆయన గత బీఆర్ఎస్ పాలకులపై మండిపడ్డారు. 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సైతం ఈ అన్యాయానికి సమ్మతి తెలిపారని ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు 2020 వరకు నిర్వహించిన అన్ని సమావేశాల్లో గత ప్రభుత్వం ఈ కేటాయింపులను అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలసి గురువారం జలసౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు చేసిన ఆరోపణలను ఉత్తమ్ తిప్పికొట్టారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో జరిగిన వరుస అన్యాయాల క్రమాన్ని తేదీలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2019–22 మధ్యలో ఏపీ ఏటా వరుసగా 653 టీఎంసీలు, 629 టీఎంసీలు, 621 టీఎంసీలను తరలించుకుపోయినా, గత పాలకులు చూస్తుండిపోయారన్నారు. ఏపీని అడ్డుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోవడంపై తాను ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఫిర్యాదు చేయగా, ఏపీని అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకి ఇప్పటికే తాము 67 టీఎంసీల కేటాయింపులను సాధించామని, నెలాఖరులోగా ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులిస్తామని కేంద్ర మంత్రి మరో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జీరో వడ్డీ, 50 ఏళ్ల కాలపరిమితితో రుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపారని వివరించారు. సాగర్ను ఏపీకి అప్పగించారు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం 2023లో 44 వేల క్యూసెక్కుల నుంచి 92,600 క్యూసెక్కులకు పెంచుకోగా, బీఆర్ఎస్ పాలకులు దానికి సహకరించారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే వెలిగొండ, ఇతర ప్రాజెక్టులను ఏపీ పూర్తిచేసుకునేందుకు కూడా సహకరించారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాత్రి 2023 నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం 400–500 మంది సాయుధ పోలీసులతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సగభాగాన్ని ఆక్రమించుకోగా, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా 5,000 క్యూసెక్కులను విడుదల చేసుకున్నారని, అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు దీనిని చేష్టలుడిగి చూశారని ధ్వజమెత్తారు. అన్యాయం చేసింది వారే.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది హరీశ్రావు, కేసీఆర్, మాజీ ఈఎన్సీ మురళీధర్రావే అని, వారికి ఉరేసినా తప్పులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వారిది దొంగల తెలివి అని, ప్రశ్నించిన వారిని హత్యలు చేశారని ఆరోపించారు. -
ప్రమాదంలో ‘శ్రీశైలం’
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని... తక్షణమే జోక్యం చేసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆనకట్టల భద్రత కమిటీ చైర్మన్ హోదాలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఎన్.అనిల్కుమార్ బుధవారం ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాశారు. 1981లో నిర్మించిన శ్రీశైలం జలాశయానికి 2009లో వచ్చిన భీకర వరదలతో స్పిల్ వే దిగువన నీళ్లుపడే ప్రాంతంలో భారీ గుంత (ప్లంజ్ పూల్) ఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో.. క్రమంగా ప్లంజ్ పూల్ విస్తరిస్తూ, జలాశయానికి ముప్పుగా పరిణమించిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయాన్ని 14 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్ చేయగా.. 2009లో ఏకంగా 25లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని వివరించారు. భారీగా నీటి విడుదలతో.. స్పిల్ వేకు దిగువన భూమి కోతకు గురై భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. ఈ గుంతను పూడ్చకపోతే 143.23 మీటర్ల ఎత్తున్న జలాశయం పునాదులను బలహీనపరిచి, డ్యామ్కు ప్రమాదకరంగా మారుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ వంటి సంస్థలు అధ్యయనంలో తేల్చాయని వివరించారు. జలాశయానికి ప్రమాదం జరిగితే భారీ నష్టం శ్రీశైలం జలాశయానికి ప్రమాదం జరిగితే దిగువ ప్రాంతాలను భారీ వరద ముంచేస్తుందని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర విపత్తును సృష్టిస్తుందని లేఖలో అనిల్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీటి సరఫరా, జల విద్యుదుత్పత్తి నిలిచిపోతాయని పేర్కొన్నారు. జలాశయం పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తక్షణమే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్డీఎస్ఏను కోరారు. వచ్చే వానాకాలంలో గుంత మరింత విస్తరించకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం రక్షణకు చర్యలు తీసుకోకపోతే దిగువన ఉన్న నాగార్జునసాగర్, ప్రకాశం బరాజ్లు సైతం ప్రమాదాన్ని ఎదుర్కొంటాయన్నారు. అదే జరిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తాగు, సాగునీటితోపాటు చెన్నైకి తాగునీటి సరఫరా సైతం నిలిచిపోతుందని వివరించారు. -
ఏపీ అక్రమ నీటి తరలింపును అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగా ణకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర నీటి పా రుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాజస్తాన్లోని ఉదయ్పూర్లో జరిగిన 2వ అఖిలభారత నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాశయం, నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించటాన్ని ఆపాలని కోరారు. ఏపీ వాడుకుంటున్న నీటిని కచ్చితంగా లెక్కించడానికి టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేసి కృష్ణా బోర్డు పర్యవేక్షించాలని విన్నవించారు. కృష్ణా జలా ల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి పై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం వెంటనే వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పాల మూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, సీతా రామ ప్రాజెక్టులకు సత్వరంగా నీటి కేటాయింపులు జరపాలని కోరారు. సత్వరంగా ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వండికాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజ్ల పునరుద్ధరణకు తీసుకోవా ల్సిన శాశ్వత చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సత్వరంగా నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. ప్రాజెక్టుల్లో పూడిక తీతకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు.గంగా, యమున నదుల శుద్ధికి సహకరించిన తరహాలోనే మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు గోదావరి నీళ్లను తరలించడానికి మరో రూ.6 వేల కోట్లను కేటాయించాలని కోరారు. -
ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ అసహనం.. సీరియస్ వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అధికారులపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు ఉత్తమ్.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులపై మండిపడ్డారు. ఆయన సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంతో ఇంజనీర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఫోన్ చేసిన ఉత్తమ్.. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు. అయితే, పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరిపై ఒకరు తోసిపుచ్చుకున్నారు జిల్లా అధికారులు. దీంతో, అధికారులపై మంత్రి ఫైరయ్యారు. సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను వెంటనే హైదరాబాద్ ఆఫీస్కు రావాలని ఈఎన్సీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గంలోనే పనులు జరగకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని అసహనం వ్యక్తం చేశారు.మరోవైపు.. మీడియాతో చిట్చాట్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పథకాల్లో వేగం పెంచడమే కాకుండా.. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తాం. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రాజకీయంగా నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని నేను. కేబినెట్ విస్తరణ సీక్రెట్.. ఇప్పుడే చెప్పలేం. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభమని అన్నారు. ఇదే సమయంలో కేటీఆర్ అరెస్ట్పై మంత్రి ఉత్తమ్ స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహిపాల్ రెడ్డి సెక్రటేరియట్గా వరుసగా మంత్రులను కలవడం ఆసక్తికరంగా మారింది. -
ఓఅండ్ఎం ఒప్పందం చేసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయిందని, ఆ వెంటనే బరాజ్ పర్యవేక్షణ, నిర్వహణ (ఓ అండ్ ఎం) కోసం నీటిపారుదల శాఖ తమతో ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదని బరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ చెప్పారు. బరాజ్ వద్ద తమ కంపెనీ సిబ్బందితో పాటు నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రమేశ్కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. బరాజ్ నిర్వహణ, పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ బాధ్యతల గురించి ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ రూపొందించిన డిజైన్లతో పోల్చితే సుందిళ్ల బరాజ్ వాస్తవ షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉండడంతోనే బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయని గతంలో సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ పేర్కొనడాన్ని గుర్తు చేసింది. రెండు పర్యాయాలు బరాజ్కు బుంగలు ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. చివరి బిల్లు చెల్లించడం లేదుతొలిసారి బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేశామని రమేశ్ బదులిచ్చారు. 2022 వరదల్లో బరాజ్కి తీవ్ర నష్టం జరగగా, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్ను శాఖ నుంచి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. సుందిళ్ల బరాజ్లో లోపాలను గుర్తించడానికి పలు రకాల పరీక్షలను నిర్వహించాలన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలతో.. నీటిపారుదల శాఖ అధికారుల సంతృప్తి మేరకు ఆ పరీక్షలన్నీ పూర్తి చేశామని వివరించారు. కాగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని కమిషన్కు రమేశ్ ఫిర్యాదు చేశారు.అనుబంధ ఒప్పందంతో కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదుసుందిళ్ల నిర్మాణం 2021 డిసెంబర్లో పూర్తికాగా, 2023లో అదనపు పనులు చేసేందుకు నీటిపారుదల శాఖతో అనుబంధ ఒప్పందం చేసుకున్నామని నవయుగ ప్రాజెక్టు ఇన్చార్జి కె.ఈశ్వర్రావు తెలిపారు. అనుబంధ ఒప్పందంతో పాత కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. సుందిళ్ల బరాజ్ దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నవయుగ కంపెనీ మరో ప్రాజెక్టు ఇన్చార్జి చింతా మాధవ్ సైతం విచారణకు హాజరు కాగా, ఆయనకు కేవలం మెటీరియల్ కొనుగోళ్లతో మాత్రమే సంబంధం ఉండడంతో కమిషన్ ఆయన్ను ప్రశ్నించలేదు.కాపీ పేస్ట్లా అఫిడవిట్లునవయువ కంపెనీ డైరెక్టర్తో పాటు ఇద్దరు ప్రాజెక్టు ఇన్చార్జిలు దాఖలు చేసిన అఫిడవిట్లు కాపీ.. పేస్ట్ తరహాలో ఉన్నాయని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. డైరెక్టర్ అఫిడవిట్కు కార్బన్ కాపీలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
Krishna River Water: మళ్లీ త్రిసభ్య కమిటీకే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ విజయ్కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డుసభ్యకార్యదర్శి డీఎం రాయ్పురే పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ జి.అనిల్కుమార్తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు కోరామన్నారు. ప్రతి చుక్కను లెక్కించాల్సిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు. సాగర్పై సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్ శ్రీశైలం జలాశయ ప్లంజ్పూల్ (నీళ్లు స్పిల్వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు. బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్పూల్కు మరమ్మతుల కోసం సీఎస్ఎంఆర్ఎస్ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు. -
Telangana: సెక్షన్–3 ప్రకారమే.. కృష్ణా జలాల పునఃపంపిణీ!
సాక్షి, హైదరాబాద్: అందుబాటులో ఉన్న కృష్ణా జలాలు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య పునఃపంపిణీకి మార్గం ఏర్పడింది. అలాగే తెలంగాణ కోరుతున్న విధంగా ఇప్పటికే వాడకంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులకు సైతం నీటి కేటాయింపులను కృష్ణా ట్రిబ్యునల్ పరిశీలించేందుకు అవకా శం చిక్కింది. తొలుత అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్డబ్ల్యూడీఏ) 1956లోని సెక్షన్–3 కింద.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి 2023 అక్టోబర్ 6న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అదనపు రెఫరెన్స్ ప్రకారమే విచారణ నిర్వహించాలని జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాతే ఏపీ కోరిన విధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద విచారణ నిర్వహిస్తామని తెలిపింది. తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్లొక్యూటరీ అప్లికేషన్ (ఐఏ)పై గురువారం ఢిల్లీలో విచారణ నిర్వహించిన ట్రిబ్యునల్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ విచా రణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ట్రిబ్యు నల్ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాంతర విచారణ జరపలేం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్– 89 కింద రెండు రాష్ట్రాల సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ముగియడంతో ట్రిబ్యునల్లో ఇకవిచారణను ప్రారంభించాల్సి ఉండగా, ఐఎస్డబ్ల్యూడీఏ చట్టంలోని సెక్షన్–3 కింద కేంద్రం అదనపు రెఫరెన్స్ జారీ చేసింది. దీంతో పాటు సెక్షన్–89 కింద కేంద్రం చేసిన రిఫరెన్స్ కూడా విచారణకు సిద్ధంగా ఉండగా, రెండింటినీ కలిపి విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ఐఏ దాఖలు చేసింది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. మరోవైపు సెక్షన్–3 కింద కేంద్రం జారీ చేసిన అదనపు రెఫరెన్స్ను సవాలు చేస్తూ ఏపీ సుప్రీం కోర్టులో వేసిన రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. అదనపు రెఫరెన్స్పై స్టే విధించాలని ఏపీ కోరగా, తమ తుది తీర్పునకు లోబడి ట్రిబ్యునల్ విచారణలో పాల్గొనవచ్చని ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు సూచించింది. కాగా కేంద్రం జారీ చేసిన రెండు రెఫరెన్స్ల్లో కొన్ని అంశాలు ఒకేలా ఉండగా, మరికొన్ని అంశాలు లేవు. రెండు రిఫరెన్స్లను కలిపి విచారించి తాము ఒకే తీర్పు జారీ చేస్తే భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఏపీకి అనుకూలంగా తుది తీర్పు వస్తే ఇబ్బందులొస్తాయని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అభిప్రాయపడింది. అదే జరిగితే తమ తీర్పులోని నిర్ణయాలు, నిర్థారణకు వచ్చిన అంశాలను రెండు రెఫరెన్స్ల వారీగా విభజించడం ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండు రెఫరెన్స్లను కలిపి విచారించడం కంటే వేర్వేరుగా విచారించడమే మేలని తేల్చి చెప్పింది. తొలుత రెండో రిఫరెన్స్పై విచారణే సమంజసం అయితే తొలుత ఏ రెఫరెన్స్పై విచారణ జరపాలన్న ప్రశ్న తలెత్తింది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి జారీ చేసిన రెండో రెఫరెన్స్పై తొలుత విచారణ నిర్వహించడమే సమంజసమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ‘ప్రాజెక్టుల వారీ’గా నీటి కేటాయింపులు జరపాలంటూ మొదటి రెఫరెన్స్లో ఉన్న అంశంతో పాటు మరికొన్ని ఇతర అంశాలతో రెండో రెఫరెన్స్కు సంబంధం ఉండడమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అయితే మొదటి రెఫరెన్స్ కింద నిర్వహించిన సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ను రెండో రెఫరెన్స్పై విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడానికి ట్రిబ్యునల్ అంగీకరించింది. అయితే, రెండో రెఫరెన్స్ కింద నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్ను మొదటి రెఫరెన్స్ కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఇక ఆయా డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై విచారణ సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రెండు రెఫరెన్స్ల కింద ఏపీ, తెలంగాణ దాఖలు చేసిన అభ్యర్థనలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను రెండు రెఫరెన్స్లకు ఉమ్మడి రికార్డులుగా పరిగణించాలని తెలంగాణ తన ఐఏలో కోరడంతో ట్రిబ్యునల్ ఈ మిశ్రమ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19 నుంచి 21 మధ్య నిర్వహిస్తామని తెలిపింది. సెక్షన్– 89 ఏమిటి? ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89లోని క్లాజు(ఏ) కింద బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పొడిగించింది. గతంలో రాష్ట్రాల్లోని ‘ప్రాజెక్టుల వారీ’గా నిర్దిష్ట కేటాయింపులు జరిగి ఉండకపోతే ఇప్పుడు జరపాలని ఇందులో (తొలి రెఫరెన్స్) ట్రిబ్యునల్ను కోరింది. నీటి లభ్యత లేని సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల విషయంలో అమలు చేయాల్సిన అపరేషన్స్ ప్రోటోకాల్స్ను సిద్ధం చేయాలని క్లాజు(బీ) కింద సూచించింది. ‘ప్రాజెక్టుల వారీ’గా అని సెక్షన్ 89 ఉండగా, అందులో ఏ ప్రాజెక్టు లొస్తాయన్న అంశంపై స్పష్టత కొరవడింది. సెక్షన్ –3 ఏమిటి ? తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఐఎస్డబ్ల్యూడీఏ–1956లోని సెక్షన్–3 కింద జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్కు అదనపు రెఫరెన్స్ (మరిన్ని విధివిధానాలను) జారీ చేస్తూ 2023 అక్టోబర్ 6న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇందులో కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్–89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ గజిట్ నోటిఫికేషన్లో నిబంధన చేర్చింది. ఉమ్మడి ఏపీకి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా ట్రిబ్యునల్–1 గంపగుత్తగా 811 టీఎంసీలను కేటాయించగా, 65 శాతం లభ్యతతో 1005 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించింది. ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నాగార్జునసాగర్ ఎగువన లభ్యతలోకి వచ్చిన కృష్ణా జలాలను కలిపి రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని అదనపు రిఫరెన్స్లో కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. ఈ 45 టీఎంసీలకు 1005 టీంఎసీలను కలిపి మొత్తం 1050 టీఎంసీలను సెక్షన్–3 కింద కృష్ణా ట్రిబ్యునల్–2 రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. తాజాగా సెక్షన్–3 కిందే తొలుత విచారణ జరపాలని ట్రిబ్యునల్ భావించడంతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చినట్టైంది. తెలంగాణలో ప్రతిపాదన/నిర్మాణం దశలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బీసీ, నారాయణపేట–కొడంగల్ వంటి ప్రాజెక్టులకు సైతం నీళ్లు కేటాయించే అంశాన్ని ట్రిబ్యునల్ పరిశీలించడానికి వీలు కలిగింది. -
సాగర్కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్ను బొల్లపల్లి రిజర్వాయర్తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తామని మరో లింక్ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
సాగర్ ఆయకట్టు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ డ్యామ్ స్పిల్వేకి పడిన గుంతలను పూడ్చివేసి ప్రాజెక్టును పటిష్టపరిచి.. దాని కింద ఆయకట్టు పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. డ్యామ్ మరమ్మతులపై ఐఐటీ రూర్కీ నిపుణులతో అధ్యయనం జరిపించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సాగర్ కెనాల్ నెట్వర్క్కు సైతం మరమ్మతులు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంగళవారం ఆయన జలసౌధలో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. చిన్న లిఫ్టులతోనే అధిక ప్రయోజనం రాష్ట్రంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) పరిధిలోని 334 చిన్న ఎత్తిపోతల పథకాలు కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొన్ని లిఫ్టులు పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపా రు. పూర్తి సామర్థ్యంతో సాగునీటి సరఫరా చేసేలా ఈ లిఫ్టులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. చిన్న ఎత్తిపోతల పథకాలే రైతులకు ప్రయోజనం చేకూర్చుతాయని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను సత్వరం పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీళ్లు అందించాలని ఆదేశించారు. రూ.664.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసి 7,600 ఎకరాలకు నీరందించాలని ఆదేశించారు. లోలెవల్ కాల్వకు మహర్దశ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగమైన హైలెవల్, లోలెవల్ కాల్వల మధ్య 15 కి.మీల లింక్ కాల్వ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మేడవార్మ్, పోతునూరు, సంగారం, పెద్దవూర, తుంగతుర్తి చెరువులను అనుసంధానం చేస్తూ లింక్ కాల్వను నిర్మిస్తామని చెప్పారు. రూ.62.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న లింక్ కాల్వ నిర్మాణానికి 65.02 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా, ఇప్పటికే 43.31 ఎకరాల సేకరణ పూర్తయ్యిందని, తక్షణమే టెండర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రూ.125 కోట్ల అంచనా వ్యయంతో 0–63 కి.మీల లోలెవల్ కాల్వ లైనింగ్ పనులను చేపడుతామని తెలిపారు. అదనంగా లోలెవల్ కాల్వకు సంబంధించిన డీ–1 నుంచి డీ–27 వరకు డిస్ట్రిబ్యూటరీలకు 60 మి.మీల మందంతో కాంక్రీట్ లైనింగ్ వేసి కాల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 90.43 కి.మీల పొడవైన ఈ డిస్ట్రిబ్యూటరీల లైనింగ్కు రూ.42.26 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఫ్లడ్ ఫ్లో కాల్వగా పేరొందిన లోలెవల్ కెనాల్ 80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని చెప్పారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల్లోనే 50 వేల ఎకరాలకు నీరందిస్తోందని తెలిపారు. 19 చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 30 వేల ఎకరాలను స్థిరీకరిస్తుందని వివరించారు. అనుమలవారిగూడెం వద్ద శశిలేరు వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి అనుమతిచ్చారు. సాగర్ పరిధిలోని 39 ఐడీసీ లిఫ్టులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని ఆదేశించారు. సమీక్షలో నల్లగొండ ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. -
పోలవరం ముంపుపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై శనివారం సీఎం రేవంత్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి సమీక్షించారు. గోదావరికి 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం వల్ల భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైనా అధ్యయనం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర అనుమతుల్లేకుండానే కొత్తగా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎస్కు అభ్యంతరం తెలపాని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి బోర్డుతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖలు రాయాలని కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిమితంగానే ఉమ్మడి సర్వే అంటున్న ఏపీ పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సైతం జాయింట్ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కిన్నెరసాని, ముర్రెడువాగులతో పాటే మరో ఐదు వాగులకు ఉండనున్న ప్రభావంపై సైతం సర్వే నిర్వహించాలని కోరుతుండగా ఏపీ అంగీకరించడం లేదు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ముర్రెడువాగు, కిన్నెరసానిలకే సర్వేను పరిమితం చేస్తామని ఏపీ అంటోంది. ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించి కేవలం రెండు వాగులకే జాయింట్ సర్వే నిర్వహిస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుతో తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ శనివారం అధికారులతో సమీక్షలో ఈ అంశంపై వివరణ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రెండు వాగులకు ముంపుపై సర్వే నిర్వహించాలని, మిగిలిన వాగులకు ముంపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం గతేడాది సాంకేతిక కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలను చెప్పిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. 18 తర్వాత ఉమ్మడి సర్వేకు సిద్ధం పోలవరంలో గరిష్ట నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రేడువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించి డీమార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ నెల 18 తర్వాత ఉమ్మడి సర్వేకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉమ్మడి సర్వే నిర్వహించగా తదుపరి క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. -
పోలవరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం.. సీఎంతో నీటిపారుదల శాఖ అధికారులు భేటీ కాగా, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు.2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ను సీఎం రేవంత్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు.వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తమ అభ్యంతరాలను ఏపీ సీఎస్కు తెలియజేయాలన్న రేవంత్.. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్శక్తి శాఖకు లేఖలు రాయాలంటూ ఆదేశించారు.ఇదీ చదవండి: చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్ -
నీటి శాఖ ఇక పటిష్టం!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను పటిష్టపరచడంతో పాటు ఇంజనీర్ల పనితీరు, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓ వైపు ఇంజనీర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా గత పదేళ్లుగా తాత్కాలిక (అడ్హక్) పదోన్నతులే కల్పిస్తుండగా, ఇకపై ఈ విధానానికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టనుంది. వచ్చే 10–15 రోజుల్లోగా అర్హులైన ఇంజనీర్లందరికీ సాధారణ పదోన్నతులు ఇవ్వడంతో పాటు బదిలీల ప్రక్రియ చేపట్టనుంది.తమ తుది తీర్పునకు లోబడి పదోన్నతులు కల్పించుకోవాలని ఇటీవల రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదోన్నతులు, బదిలీలపై కసరత్తు ప్రారంభించింది. కమిటీ సిఫారసుల మేరకు.. ఏఈ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికీ ప్రమోషన్లు కల్పించబోతోంది. పదోన్నతుల విషయంలో జోన్–5, జోన్–6 ఇంజనీర్లతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ), అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఒక జోన్ వారికే పదోన్నతుల్లో ప్రాధాన్యత కల్పించడంతో తమకు అన్యాయం జరిగిందని మరో జోన్ ఇంజనీర్లు కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగంలో చేరాక డిప్లమా చేసిన వారికి ఏఈలుగా పదోన్నతి కల్పిస్తుండడంతో ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో నియమితులైన ఏఈఈలు తమ పోస్టులను కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పదోన్నతులపై అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజయభాస్కర్ రెడ్డితో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవ్వనున్న సిఫారసుల ఆధారంగా ఈ నెలాఖరులోగా మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (రామగుండం), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) పోస్టులతో పాటు 9 సీఈ, 27 ఎస్ఈ, 26 ఈఈ పోస్టులను పదోన్నతులు, బదిలీల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. సీఈలు క్షేత్ర స్థాయిలోనే ఉండాలి నీటిపారుదల శాఖలో టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్లుగా కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులు తమ పని ప్రదేశంలో ఉండకుండా హైదరాబాద్లో ఉంటున్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చిoది. ఇంకొందరు సీఈలకు హైదరాబాద్లోని జలసౌధలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఈలందరూ ఇకపై క్షేత్ర స్థాయిలోనే తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే మిర్యాలగూడ ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో ఇటీవల నియమితులైన కొత్త ఏఈఈలు కొంత కాలం పాటు క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిందేనని, బదిలీల్లో వీరికి స్థానచలనం కల్పించరాదని నిర్ణయం తీసుకుంది. వీరిలో బాగా పనిచేసే ఇంజనీర్లకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పదోన్నతులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. రిటైర్ అయితే ఇంటికే.. ఇకపై రిటైరైన ఇంజనీర్ల పదవీ కాలం పొడిగించరాదని ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో కీలకమైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లుగా రిటైరైన ఇంజనీర్లే కొనసాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లను తొలగించింది. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన ఓ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఎక్స్టెన్షన్లో ఉన్న ఓ కీలక ఇంజనీర్ నీళ్లు నమిలారు. దీంతో మళ్లీ ఆయన పదవీకాలాన్ని పొడిగించరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పోస్టులో మరో ఇంజనీర్ను అదనపు బాధ్యతల కింద నియమించింది. ఇదే సమయంలో మరో ఇంజనీర్ సైతం తన పదవీకాలం పొడిగింపునకు తీవ్ర ప్రయత్నాలు చేసుకున్నా ఫలించలేదు. -
ఏదుల నుంచే ‘డిండి’కి నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్డ్యామ్కు నీళ్లను తరలించే అలైన్మెంట్ పనులకు రూ.1,788.89 కోట్ల అంచనా వ్యయంతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నెల 4న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనలు రానున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే పనులకు పరిపాలనా అనుమతులు జారీచేసి, ఆ వెంటనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27 కి.మీ.ల అనుసంధానం ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్డ్యామ్ కు గ్రావిటీ ద్వారా నీళ్లను తరలించేందుకు 800 మీటర్ల అప్రోచ్ కాల్వను.. ఆ తర్వాత వరుసగా 2.525 కి.మీ.ల ఓపెన్ కెనాల్, 16 కి.మీ.ల సొరంగం, 3.05 కి.మీల ఓపెన్ కెనాల్, 6.325 కి.మీల వాగు నిర్మాణం కలిపి మొత్తం 27.9 కి.మీ.ల పొడవున కాల్వలు, సొరంగం పనులు చేపడతారు.వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపల్లి చెక్డ్యామ్కు.. అక్కడి నుంచి ఉల్పర బరాజ్, డిండి, సింగరాజుపల్లి, ఎర్రపల్లి–గోకవరం, ఇర్వేన్, గొట్టిముక్కల, చింతపల్లి, కిస్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు నీళ్లను తరలిస్తారు. 55 శాతం పనులు పూర్తి శ్రీశైలం జలాశయం ఫోర్షోర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజులపాటు మొత్తం 30 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోని దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.6,190 కోట్ల అంచనాలతో 2015 జూన్ 11న ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ప్రాజెక్టు మొత్తంలో ఇప్పటివరకు రూ.3,441.89 కోట్ల విలువైన పనులు పూర్తి కాగా, మరో రూ.2,748.11 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ లెక్కన ఇప్పటివరకు 55 శాతం పనులు పూర్తయినట్టే. గతంలో రూ.3,929.66 కోట్లతో 7 ప్యాకేజీల పనులకు టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకున్నారు. మిగిలినపనులకు ఇంకా టెండర్లు నిర్వహించలేదు. ఇప్పటివరకు 12,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రాగా, ఇంకా 3,49,000 ఎకరాల ఆయకట్టుకు రావాల్సి ఉంది. మిగిలిన 45 శాతం పనులు పూర్తయితే మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రిజర్వాయర్లకు భూసేకరణ సమస్య ఈ ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలతో రిజర్వాయర్ల పనులు ముందుకు సాగడం లేదు. సింగరాజుపల్లి (85 శాతం), గొట్టిముక్కల (98 శాతం) రిజ ర్వాయర్ల పనులు దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. కిస్టరాంపల్లి (70 శాతం), శివన్నగూడెం (70 శాతం) రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. భూసే కరణ సమస్యలతో చింతపల్లి (0 శాతం), ఎర్రపల్లి–గోకవరం (26 శాతం) రిజర్వాయర్ల పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. ఇదే సమస్యతో ఇర్వేన్ రిజర్వాయర్ పనులు మొదలే కాలేదు. ప్రాజెక్టు అవసరాలకు 16,030 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12,052 ఎకరాలు సేకరించగా, మిగిలిన 3,977 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీడని పర్యావరణ చిక్కులు పర్యావరణ అనుమతులు లేకుండానే డిండి ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) 2022 డిసెంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.92.85 కోట్ల జరిమానా విధించడంతో పాటు పనులపై స్టే విధించింది. ఎన్జీటీ స్టే ఎత్తేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. మరోవైపు పర్యావరణ అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పర్యావరణ అనుమతులు సాధించే పనులను రూ.87.75 లక్షలతో ఎని్వరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)కు 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం అప్పగించినా, ఆశించిన ఫలితం కనిపించలేదు. -
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
మళ్లీ సాగునీటి సంఘాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగదారుల సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి చెరువుకు ఒక సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గతంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కమిటీని ఎన్నుకునేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఇప్పుడు ఎన్నికలకు బదులు ప్రభుత్వమే చెరువు కింద సాగుచేసే రైతులతో సాగునీటి వినియోగదారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ సూచించింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. చిన్న నీటిపారుదల శాఖను ఏర్పాటు చేయండి నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న నీటిపారుదల శాఖను నీటిపారుదల శాఖలో విలీనం చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్వహణకే నీటిపారుదల శాఖలోని యంత్రాంగం పరిమితం కావడంతో గత 10 ఏళ్లలో చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని రైతు కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, వాటికింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు చెరువులను అనుసంధానం చేసి.. వాటిని నింపినప్పటికీ, నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో మళ్లీ చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయని రైతు కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ నుంచి చిన్న నీటిపారుదల శాఖను విభజించి పాత విధానంలో చెరువుల నిర్వహణను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. చెరువుల సంవత్సరంగా 2025! 2025 ఏడాదిని చెరువుల సంవత్సరంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. చెరువుల తూములు, కట్టలు, కాల్వలకు మరమ్మతులు చేపట్టాలని సూచించింది. కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీల కాలంలో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఉండేది.ఒక చెరువు నిండితే దాని కింద ఉన్న చెరువులను నింపుకుంటూ నీళ్లు ప్రవహించేవి. చెరువులు ఆక్రమణకు గురికావడం, లేఅవుట్లు రావడంతో గొలుసుకట్ట వ్యవస్థ దెబ్బతిన్నదని రైతు సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, వాటి కింద చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఫార్సు చేసింది. -
కృష్ణాలో తెలంగాణకు 70% వాటా దక్కాలి
సాక్షి, హైదరాబాద్: నది పరీవాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు జరపాలని అంతర్జాతీయ నీటి సూత్రాలు స్పష్టం చేస్తున్నాయని.. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉంటే.. ఏపీలో 30 శాతమే ఉందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. దీని ప్రకారం కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,005 టీఎంసీల వాటాలో 70 శాతం వాటా తెలంగాణకు దక్కేలా జస్టిస్ బ్రజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ శనివారం నీటి పారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలసి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే.. బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను పరీవాహక రాష్ట్రాలు వినియోగించుకోవచ్చంటూ గతంలో జరిగిన ఒప్పందాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటక 35 టీఎంసీలను వాడుకుంటుండగా.. మిగతా 45 టీఎంసీలపై సంపూర్ణ హక్కు తెలంగాణకే ఉందని చెప్పారు. సాగర్ ఎగువన తెలంగాణలోని ప్రాజెక్టుల ద్వారా ఈ నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరగొద్దు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాలను సాధించుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు. ఈ వాదనలను బలపరిచే సాక్ష్యాలు, రికార్డులు, ఉత్తర్వులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ట్రిబ్యునల్లో వాదనలు.. కృష్ణా ట్రిబ్యునల్–2 ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభిప్రాయాలు, ఆధారాలను సేకరించిందని... త్వరలోనే ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అయితే కేంద్ర జలశక్తి శాఖకు ఇచి్చన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాలని సీఎం సూచించారు. కృష్ణా బోర్డును ఎందుకు పట్టించుకోవాలి? తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీని కృష్ణా ట్రిబ్యునల్–2 పూర్తి చేయలేదని.. ఇక కృష్ణా బోర్డు నిర్ణయాలను తెలంగాణ ఎందుకు పట్టించుకోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే వరకు కృష్ణా బోర్డు జోక్యం ఉండకూడదంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.ఇక ఏపీ కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందన్న అంశం ప్రస్తావనకురాగా.. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుతో దీనికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ, బానకచర్ల క్రాస్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కాల్వ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలుగోడు ప్రాజెక్టుల ద్వారా ఏపీ తరలిస్తున్న నీటి వివరాలను సేకరించి రికార్డు చేయాలని సీఎం సూచించినట్టు సమాచారం. నీటి వాటాల్లో అన్యాయంపై నివేదిక తయారు చేయాలిసీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులను సాధించాలని.. మొత్తం ఆయకట్టుకు నీరందేలా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న జీవోలు, తీర్పులతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు, మెమోలు, డీపీఆర్లు, నాటి నుంచి నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తెలంగాణ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్రెడ్డి, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఖుష్ వోరా, అధికారులు పాల్గొన్నారు. -
HYD: ఇరిగేషన్లో 300 కోట్ల అవినీతి తిమింగలం.. మూడు ఫామ్ హౌస్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్పై గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటుగా బంధువుల ఇళ్లలో కూడా దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ లంచం తీసుకుంటూ నికేష్ కుమార్ పట్టుబడ్డారు. ఇక, సోదాల్లో భాగంగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. గండిపేట బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిబంధనకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్రనగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇక, నికేష్ పేరిట మూడు ఇల్లులు ఉండగా.. ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. ఫామ్ హౌస్ల విలువ రూ.80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక, కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొయినాబాద్లో మూడు ఫామ్హౌస్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. గతంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
‘సీతారామ’ అంచనాలు మోపెడు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం. 16 ప్యాకేజీలుగా కాల్వల పనులు 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్హౌస్ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది. ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు. గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది. దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది. -
తక్షణమే సెలవుపై వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్కుమార్కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్సీపై సీఈ శ్రీనివాస్రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్సీ అనిల్కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఆదేశాల మేరకే..!వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్ను సమర్పించలేదు. మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.టెండర్లపై రాజకీయ రగడ– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు. ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తంకాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల ‘సీతారామ’ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. అనుమతులు రాకుంటే ఏం చేస్తారు? అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. ఇప్పటికే సీతారామపై వివాదాలు... సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్హౌస్ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
‘కొడంగల్’ లిఫ్టుపై మీమాంస
సాక్షి,హైదరాబాద్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్కుమార్ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్ చేసి రాఘవ–జ్యోతి జాయింట్ వెంచర్ ఎల్–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్ చేసి ఎల్–2గా మేఘా ఇంజనీ రింగ్ నిలిచింది. రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్ చేసి ఎల్–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్ చేసిన ఎల్–2గా రాఘవ కన్స్ట్రక్షన్స్ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. 21న జరిగే సమావేశంలోనైనా...ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్ బరాజ్ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది. -
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్జోన్లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్జోన్లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్కేక్లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్టీఎల్పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
పంపింగ్ ప్రారంభం.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/రామగుండం/ధర్మారం: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్హౌస్ల ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీళ్లను నంది, గాయత్రి పంప్హౌస్ల ద్వారా నందిమేడారం, మిడ్మానేరు జలాశయాల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్హౌస్లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పంపింగ్ ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీటి నిల్వలు చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని, దీంతో ఈ మూడు జలాశయాల నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించడం సాధ్యం కాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి బదులిచి్చన విషయం తెలిసిందే. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటన మేరకు నీటిపారుదల శాఖ శనివారం నుంచే పంపింగ్ ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా భారీ వర్షాలతో వస్తువన్న వరదలతో శనివారం 17.34 టీఎంసీలకు నిల్వలు చేరాయి. 14,358 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. నంది, గాయత్రి పంపుహౌస్ల ద్వారా శనివారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీ కాలువ ద్వారా తరలివస్తున్న నీటిని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. మొత్తం 7 పంపులు ఉండగా, 4 పంప్లను ఆపరేట్ చేస్తూ 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒక మోటారును ఆన్చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల వరకు మరో మూడు విద్యుత్ మోటార్లు రన్ చేశారు. నందిమేడారం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్హౌస్లోకి అంతే స్థాయిలో 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. గాయత్రి పంప్హౌస్లోని నాలుగు బాహుబలి పంపుల ద్వారా నీళ్లను గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ఆ నీళ్లు మిడ్మానేరుకు తరలిపోతున్నాయి. నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో మడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నామని, దీనిని రైతులు సది్వనియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. -
సాగునీటికి కటకటే
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2023–24 బడ్జెట్లో రూ.26,885 కోట్లు ఇవ్వగా, 2024–25 బడ్జెట్లో రూ.22,301 కోట్లే కేటాయించారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన రుణాల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.10,829 కోట్లు కేటాయించింది. గతేడాది వీటికి రూ.9381 కోట్లు మాత్రమే ఇచ్చారు.ప్రాథమ్యాలకు నిధుల కరువే..రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై 2024–25లో రూ.19,287 కోట్లు ఖర్చు చేయాలని నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసు కోగా, బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఆశించిన మేరకు కేటాయింపులు జర పలేదు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.10,829 కోట్లు కేటాయించగా, మిగిలిన నిధులు కాళేశ్వరం, పాలమూరు –రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాల చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్లనున్నాయి.రుణాల చెల్లింపులకు నిధుల కోత..కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర జల వనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ డబ్ల్యూఆర్ఐడీసీ)తో పాటు ఇతర మార్గాల ద్వారా రుణా లను సమీకరించింది. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి 2023–24 బడ్జెట్లో రూ.15,773 కోట్లు ప్రతి పాదించగా, తాజా బడ్జెట్లో రూ.9951 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది.కాళేశ్వరం కార్పొరేషన్కు రూ.12, 500 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.6914.54 కోట్లకు కేటాయింపులు తగ్గాయి. ఇక టీఎస్ డబ్ల్యూఆర్ ఐడీసీకి కేటాయింపులు రూ.3200కోట్ల నుంచి రూ.2962. 47 కోట్లకు తగ్గాయి. ఈ రుణాల తిరిగి చెల్లింపుల గడువును పొడిగించి వాటి కిస్తీల సంఖ్యను సైతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణా ల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను కోత పెట్టింది.కేటగిరీల వారీగా ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.8476.48 కోట్లుమధ్య తరహా ప్రాజెక్టులకు రూ.953.21మైనర్ ఇరిగేషన్కు రూ.857.73వరదల నియంత్రణ, డ్రైనేజీ రూ.282.24 -
నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణం పూర్తయిన నాటి నుంచీ నిరంతరం గరిష్ట నిల్వలను కొనసాగించారని.. దాంతో ఒత్తిడి పెరిగి వాటికి తీవ్ర నష్టం కలిగిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు నిపుణుల కమిటీ నివేదించింది. నీటి పారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు, విచారణ కమిషన్కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో విచారించారు. ప్రాథమిక పరిశీలన అంశాలతో.. ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్తో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇటీవల బరాజ్లను పరిశీలించి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తమ దృష్టికి వచి్చన లోపాలను తాజాగా జస్టిస్ చంద్రఘోష్కు వివరించింది. బరాజ్లను సుదీర్ఘకాలం పూర్తిస్థాయిలో నీటితో నింపి ఉంచడంతో.. బరాజ్లపై ఒత్తిడి పెరిగి బుంగలు ఏర్పడ్డాయని కమిటీ సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. బుంగలను వెంటనే పూడ్చయకపోవడంతో వాటి తీవ్రత పెరిగి బరాజ్లకు తీవ్ర నష్టం కలిగించిందని వెల్లడించినట్టు సమాచారం. బరాజ్ల వైఫల్యంపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అఫిడవిట్ రూపంలో సమరి్పంచాలని నిపుణుల కమిటీకి ఈ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. నేడు ఈఎన్సీల ఆఫీసుల సిబ్బంది విచారణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను జస్టిస్ చంద్రఘోష్ శుక్రవారం విచారించనున్నారు. చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులను విచారణకు రావాలని కోరారు. త్వరలో బహిరంగ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో బహిరంగ విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. అఫిడవిట్ల రూపంలో విచారణ కమిషన్కు సమాచారాన్ని సమరి్పంచిన వారందరినీ బహిరంగ విచారణలో ప్రశ్నించనుంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎవరెవరిని పిలవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. బ్యారేజీలపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన తుది నివేదికను సత్వరం సమర్పించాలని కమిషన్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమరి్పంచలేదు. విజిలెన్స్ తుది నివేదిక కోరుతూ మరోసారి లేఖ రాయనుంది. బరాజ్ల నిర్మాణంతో సంబంధమున్న ప్రభుత్వ కార్యాలయాలు, మోడల్ స్టడీస్ ల్యాబ్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులను పరిశీలించాలని జస్టిస్ చంద్రఘోష్ నిర్ణయం తీసుకున్నారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)ను సైతం ఆయన సందర్శించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్లకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విచారణ ముగించిన తర్వాత.. ఆర్థిక అవకతవకతలపై జస్టిస్ చంద్రఘోష్ దృష్టిసారించనున్నారు. అంచనా వ్యయం, ఖర్చులు, రుణాలు, వడ్డీ రేట్లు తదితర అంశాలపై విచారణ నిర్వహించనున్నారు. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నిర్ణయం గురువారం విచారణ ముగిసిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్ల వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావులకు నోటీసులేమైనా జారీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. అధికారులు సమరి్పంచిన అఫిడవిట్లను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. -
‘టైమ్బౌండ్’ ఒత్తిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్ బౌండ్)లోగా పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్కు బరాజ్ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్కుమార్, సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్దాస్, సుందిళ్ల బరాజ్ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్ రామేశ్ యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్రావు, జీఎం సి.మాధవ్ తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు. డిజైన్లు, హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు కూడా.. బరాజ్ల డిజైన్లను రూపొందించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్కుమార్ సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం తన కార్యాలయం విచారించారు. డిజైన్ల తయారీలో ఒక్కొక్కరి పాత్రను అడిగి తెలుసుకున్నారు. డిజైన్ల ప్రకారమే పనులు జరిగాయా? తర్వాత డిజైన్లను ఏమైనా మార్చారా? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? షీట్పైల్స్కు బదులు సెకెంట్ పైల్స్ను ఎందుకు డిజైన్లలో సిఫారసు చేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఇక బరాజ్ల వద్ద నీటి లభ్యతను నిర్ధారించిన హైడ్రాలజీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్నాయక్, మరో ఐదుగురు ఇంజనీర్లను సైతం జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు.ఆదేశించిన వారినీ పిలిచి విచారిస్తాం: జస్టిస్ చంద్రఘోష్ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపం ఎక్కడ జరిగింది? ఎవరు చేశారో తేలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ఆదేశాలతో బరాజ్ల నిర్మాణ పనులు జరిగాయో రికార్డు రూపంలో సమాచారం అందిన తర్వాత వారిని సైతం విచారణకు పిలుస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని మళ్లీ పిలిపించి విచారిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరినట్టు చెప్పారు. బరాజ్ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై సమగ్ర వివరాలు అఫిడవిట్లలో ఉండాలని నిర్మాణ సంస్థలను కోరినట్టు తెలిపారు. ఎలాంటి సమాచారమైనా అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తేనే కమిషన్ స్వీకరిస్తుందన్నారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, కాగ్ నివేదికలు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్ అధికారులను సైతం ప్రశ్నిస్తామన్నారు. నేడు నిపుణుల కమిటీ సభ్యుల విచారణజస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించనుంది. నిపుణుల కమిటీలో ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్ ఉన్నారు. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్కు సమర్పించింది. -
బరాజ్లపై విచారణ స్పీడప్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేగిరం చేసింది. బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, బరాజ్ల డిజైన్లను రూపొందించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ చీఫ్ ఇంజనీర్/రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్రెడ్డి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్ఈ బస్వరాజ్.. అన్నారం, సుందిళ్ల బరాజ్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా వాటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన యాదగిరి, ఓంకార్ సింగ్లను సోమవారం జస్టిస్ చంద్రఘోష్ బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయానికి పిలిపించి విడివిడిగా విచారించారు. బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నించారు. ‘బరాజ్ల నిర్మాణ స్థలాలను ఎవరు నిర్ణయించారు? స్థలాల ఎంపికకు ముందు భూ¿ౌతిక పరీక్షలు నిర్వహించారా? బరాజ్లకు డిజైన్లు, డ్రాయింగ్స్ ఎవరు రూపొందించారు? తర్వాత డిజైన్లలో ఏమైనా మార్పులు చేశారా? నిర్మాణ సమయంలో నాణ్యత పర్యవేక్షణ చేశారా? ఆ బాధ్యతను ఎవరు చూశారు? నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ ఎవరు చూశారు? బరాజ్ల వైఫల్యానికి కారణాలేమిటి? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాక ముందే నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లీషన్ సరి్టఫికెట్లు ఎందుకు జారీ చేశారు?’ వంటి అంశాలపై ఆయన వివరణ కోరినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జాయింట్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్కుమార్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు విచారణకు హాజరై కమిషన్కు సహకరించారు. నేడు 18 మంది ఇంజనీర్ల విచారణ.. నీటిపారుదల శాఖలోని సీడీఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, కన్స్ట్రక్షన్ విభాగాల్లో గతంలో పనిచేసిన/ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం 18 మంది ఇంజనీర్లను మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించనున్నారు. ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు, సీడీఓ చీఫ్ ఇంజనీర్ మోహన్కుమార్, మేడిగడ్డ బరాజ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతితోపాటు ఇతర కీలక ఇంజనీర్లు ఈ విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇక బుధవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణ సంస్థలైన ఎల్అండ్టీ, అఫ్కాన్స్, నవయుగ కంపెనీల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. త్వరలోఅసలు విషయాలు బయటికి..: జస్టిస్ చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణం విషయంలో అసలు విషయాలు రానున్న రోజుల్లో బయటికి వస్తాయని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్ల నిర్మాణంపై ఇప్పటివరకు కమిషన్కు 54 ఫిర్యాదులొచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ కమిషన్కు సమాచారం ఇవ్వడానికి వచ్చే ప్రతి ఒక్కరికి తనను కలిసే అవకాశం ఇస్తానని, వారి వాదన వింటానని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక లోపాలపై విచారణ సాగుతోందని.. తర్వాత ఆర్థిక, ఇతర అవకతవకలపై విచారణ ప్రారంభిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు జూన్ 30లోగా విచారణ పూర్తికాదని.. గడువు పొడిగింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సమగ్రంగా అన్ని విషయాలు, వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ కొందరు భూనిర్వాసితులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బరాజ్లకు సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రభుత్వం సమరి్పంచిందని, వాటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బరాజ్లపై విజిలెన్స్ జరిపిన విచారణ నివేదికను తమకు అందజేయాలని ఆ విభాగానికి లేఖ రాశామన్నారు. -
ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
-
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా బోలు శబ్దాలు (Hallow Sounds), ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి.. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి, 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండటంతో ఆ ఒత్తిడికి బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి 7వ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి.. ఏకంగా 40వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా బ్యారేజీ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం గమనార్హం. ఇప్పటికే హెచ్చరించిన ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు, 85 గేట్లు ఉండగా.. గతేడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. 7వ బ్లాకులోని 15 నుంచి 22 నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తవగా.. అదే ఏడాది వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని పేర్కొంది. బ్యారేజీలకు వానాకాలంలోగా నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులు, చర్యలను సిఫారసు చేసింది. అయితే వానాకాలానికి ముందే మేడిగడ్డ బ్యారేజీలో మొరాయించిన గేట్లను పైకి ఎత్తేయాలని సూచించింది. అందులోనూ పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సిబ్బందితో కలసి ఈ నెల 17న 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. తర్వాత 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా.. శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ చేయించడంపై దృష్టి మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడో నంబర్ బ్లాకు దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని.. మొత్తం బ్యారేజీ కింద ఓ చివరి నుంచి మరో చివరి వరకు ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక.. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. తొలుత ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లతో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్–విజేత–పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఫిబ్రవరి 7న నిర్వహించిన మోడల్ స్టడీలో డిజైన్లో లోపాలున్నట్టుగా తేలిందని పేర్కొంది. వచ్చే వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే బ్యారేజీకి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు బ్యారేజీలు, డ్యామ్ల గేట్లు ఎత్తినప్పుడు వరద భీకర వేగంతో కిందికి దూకినట్టుగా ప్రవహిస్తుంది. ఆ వరద నేరుగా దిగువన (అప్రాన్ ఏరియా) ఉన్న కాంక్రీట్ బ్లాకులపై పడడంతో అవి కొట్టుకుపోయి భారీగా లోతైన గుంతలు పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికే బ్యారేజీ దిగువ ప్రాంతంలో తగిన స్థాయిలో నీళ్లు నిల్వ (టెయిల్ వాటర్ లెవల్) చేస్తారు. పైనుంచి పడే వరద ఆ నీటిలో పడటం వల్ల ఉధృతి తగ్గి కాంక్రీట్ బ్లాకులకు నష్టం జరగదు. అయితే అన్నారం బ్యారేజీకి దిగువన తగిన రీతిలో నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు. దీంతో గతంలో వచ్చిన వరదలతో దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. నిరంతర వరదలతో బ్యారేజీ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా ఉండే సెకెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. వీటివల్ల సెకెంట్ పైల్స్ దెబ్బతిని వాటికి, ర్యాఫ్ట్కు మధ్య అగాధం ఏర్పడి ఉండడానికి అవకాశం ఉంది. దీని వల్లనే బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని ఆఫ్కాన్స్–విజేత– పీఈఎస్ జాయింట్ వెంచర్ స్పష్టం చేసింది. కాగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ ఏబీ పాండ్య, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మోడల్ స్టడీలో పాల్గొన్నారు. సెకనుకు 15–30 మీటర్ల వేగంతో వరద వరదలు తగ్గుముఖం పట్టాక తక్కువ మొత్తంలో నీళ్లను కిందికి విడుదల చేసేందుకు వీలుగా బ్యారేజీ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపుతారు. అయితే బ్యారేజీ పూర్తిగా నిండి ఉండడంతో పీడనం పెరిగి వరద భీకర ఉధృతితో గేట్ల కింద నుంచి దూసుకు వస్తుంది. అన్నారం గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు 15–30 మీటర్ల భీకర వేగంతో వరద బయటికి వస్తోందని మోడల్ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీ రక్షణకు ల్యాబ్ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ లేఖలో కోరింది. మూడేళ్ల కిందే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అన్నారం బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2021 డిసెంబర్ 17లోనే ముగిసింది. నాటి నుంచి మూడేళ్ల పాటు కేవలం బ్యారేజీ నిర్వహణ కోసం రూ.6.42 కోట్ల అంచనాలతో అఫ్కాన్స్ –విజేత–పీఈఎస్ జేవీతో నీటిపారుదల శాఖ ‘ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్ 16తో ముగియనుంది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది. -
నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. నాణ్యత పర్యవేక్షణ ఎలా? ‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్)కు రక్షణగా తొలుత షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్ పైల్స్కు ఎందుకు మారారు? ఈ డిజైన్ మార్పులకు అప్రూవల్స్ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్ పైల్స్ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! ‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్ చార్ట్ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ జరిపిన వ్యాప్కోస్ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్ స్టడీస్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఈఎన్సీ(ఓఅండ్ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్శర్మ, రాహుల్కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్లోకి దిగి 6, 7, 8 బ్లాక్లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది. -
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. -
ఎల్ అండ్ టీ ససేమిరా!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ) పరీక్షల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చేస్తున్న విజ్ఞప్తులను నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’బేఖాతరు చేస్తోంది. నివేదికను అధికారికంగా సమర్పించేందుకు నిరాకరిస్తోంది. గత రెండు వారాలుగా నీటిపారుదల ఇంజనీర్లు చేస్తున్న విజ్ఞప్తులను ఎల్ అండ్ టీ పట్టించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఈఆర్టీ నివేదికను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా నీటిపారుదల శాఖను ఆదేశించింది. దీనిపై త్వరలోనే మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. నెలరోజుల విశ్లేషణతో నివేదిక సిద్ధం! గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిపుణులు బ్యారేజీని పరిశీలించి కుంగిపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఈఆర్టీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేశారు. ఈ పరీక్షల ద్వారా లోపాలు, అలాగే బ్యారేజీలోని అన్ని విభాగాల పటిష్టతను పరిశీలించిన తర్వాతే మరమ్మతులు, పునరుద్ధరణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నవీ ముంబైకి చెందిన ‘డైనసోర్ కాంక్రీట్ ట్రీట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’అనే సంస్థ ఆధ్వర్యంలో 7వ బ్లాక్ ర్యాఫ్ట్ (పునాది)తో పాటు దాని దిగువన ఉన్న సెకెంట్ పైల్స్ (పునాది కింద స్తంభాలు) స్థితిగతులను తెలుసుకోవడానికి జనవరి 4 నుంచి 9 వరకు ఈఆర్టీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి గత నెల రెండో వారం నాటికి నివేదికను సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈఆర్టీ టెస్ట్ అంటే భూగర్భంలోని కాంక్రీట్ నిర్మాణాలను ‘ఎక్స్రే’తీసి ఆ చిత్రాలను విశ్లేషించడమేనని నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కొంప ముంచిన సెకెంట్ పైల్స్ లోపాలు? వాస్తవానికి శాఖలోని కొందరు కీలక అధికారులకు అనధికారికంగా ముసాయిదా ఈఆర్టీ నివేదిక అందింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ అధికారికంగా ఇవ్వనందున రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదని సమాచారం. కాగా నిర్మాణ లోపంతో సెకెంట్ పైల్స్ మధ్య ఏర్పడిన ఖాళీలతోనే బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి భారీ బుంగ ఏర్పడి 7వ బ్లాక్ కుంగినట్టుగా నిర్థారణకు వచ్చారనే చర్చ జరుగుతోంది. భూగర్భంలో సెకెంట్ పైల్స్ను నిటారుగా ఏర్పాటు చేయాల్సి ఉండగా, వక్రంగా పాతిపెట్టడంతో వాటి జాయింట్ల వద్ద ఖాళీలు ఏర్పడినట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇతర బ్లాకులకు ఆగిన టెస్టులు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దారి మళ్లించడం కోసం కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులకు వరద ప్రవాహం చేరకుండా ఏర్పాట్లు చేశారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కొలిక్కి వచ్చాక బ్యారేజీలోని 1–8 బ్లాకులకు ఈఆర్టీ, జీపీఆర్ టెస్టులు నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ కసరత్తు చేసింది. జీపీఆర్ టెస్ట్ల నిర్వహణను న్యూఢిల్లీలోని పార్సన్ ఓవర్సీస్కు అప్పగించింది. అయితే ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు ఏర్పడడంతో బ్యారేజీని ఖాళీ చేసేందుకు కిందికి నీటిని విడుదల చేశారు. 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ కాఫర్ డ్యామ్తో పాటు 6, 7, 8 బ్లాకుల పునాదుల వద్దకు భారీగా నీళ్లు వచ్చి చేరాయి. తమకు చెప్పకుండా వరదను విడుదల చేయడంతో 15 రోజుల పాటు చేసిన పనులు వృధా అయ్యాయని ఎల్ అండ్ టీ ఆరోపించింది. టెస్టులను ప్రస్తుతానికి నిలిపి వేశామని, దీనికి తాము బాధ్యులం కామని పేర్కొంటూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు తాము సొంత డబ్బులతో ఎలాంటి పనులూ చేపట్టబోమని సంస్థ పలు లేఖల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అలాగే బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తయ్యాయని ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేయాలని, చివరి బిల్లుతో పాటు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా కోరుతూ మరో లేఖ రాసింది. -
వరదలతో బ్యారేజీలకు ముప్పు!
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. మళ్లీ అన్నారం బ్యారేజీకి ఎన్డీఎస్ఏ ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిపోగా, మళ్లీ భారీ వరదలొస్తే ఇతర బ్లాకులు సైతం ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో అన్నారం బ్యారేజీకి రెండు పర్యాయాలు బుంగలు ఏర్పడి పెద్ద మొత్తంలో నీళ్లు లీకయ్యాయి. అన్నారంబ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద నిర్మించిన కటాఫ్ వాల్స్కి పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో అనుమానాలు లేవని.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గత అక్టోబర్లో బ్యారేజీని పరిశీలించిన అనంతరం తన నివేదికలో చెప్పింది. బ్యారేజీకి నిర్దిష్టంగా లీకేజీలు పునరావృతం కావడాన్ని చూస్తే ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్లో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్కుమార్, పి.దేవేందర్ రావు కమిటీ అప్పట్లో ఈ నివేదిక ఇచ్చింది. గత శుక్రవారం అన్నారం బ్యారేజీకి మళ్లీ బుంగలు పడటంతో ఎన్డీఎస్ఏ సూచన మేరకు బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేశారు. ఈ వారం చివరిలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ బృందం రెండోసారి అన్నారం పరిశీలనకు రానుంది. కటాఫ్వాల్స్కి లేదా కటాఫ్వాల్స్–ర్యాఫ్ట్ మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్స్(జీపీఆర్) వంటి సాంకేతిక పద్ధతులను వినియోగించాలని గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ సిఫారసు చేయగా, ఇప్పటివరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి స్వాతంత్య్ర భారత చరిత్రలో మరెక్కడా జరిగి ఉండదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి దేశ సాగునీటి రంగంలో మరెక్కడా జరగకూడదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీని రూ.1,800 కోట్ల అంచనాతో ప్రారంభించి ఏటా రూ.వెయ్యి కోట్లు చొప్పున పెంచుతూపోయి... చివరికి రూ.4,500 కోట్లకు చేర్చారని చెప్పారు. వందేళ్లు నిలవాల్సిన బ్యారేజీ.. అవినీతి, లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్వహణ–పర్యవేక్షణ లోపాలతో మూడేళ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. అధికారం అప్పజెప్తే మరమ్మతులు చేయిస్తామనే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. ఉత్తమ్ శనివారం రాష్ట్ర సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ), విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇచ్చిన నివేదికలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలోని ముఖ్యాంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పలువురు సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సభలో ఉత్తమ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోతే డిసెంబర్ 7 వరకు కూడా నాటి సీఎం కేసీఆర్ ఒక్కమాట మాట్లాడలేదు. బ్యారేజీ నిర్మాణానికి పెద్ద మనుషులు వాళ్లే.. చీఫ్ ఇంజనీర్లు వాళ్లే.. చీఫ్ డిజైనర్లు వాళ్లే. ప్రస్తుత పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని (యూజ్లెస్) ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మేడిగడ్డ తరహా డిజైన్లతోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా నిర్మించారని.. వాటిలో కూడా నీళ్లు నింపవద్దని ఎన్డీఎస్ఏ సూచించింది. అన్నారం బ్యారేజీలో బుంగ ఏర్పడి శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అవుతున్నాయి. దీన్ని పరిశీలించేందుకు ఎన్డీఎస్ఏ నిపుణులను రమ్మని కబురు పంపాం. రెండు రోజుల్లో వస్తామన్నారు. సత్వరమే బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఈ బ్యారేజీలను కట్టినవారు సిగ్గుతో తలవంచుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కాగ్ నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికలో యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలున్నాయి. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. రూ.35,800 కోట్ల అంచనాతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తప్పుబట్టింది. ఆ ప్రాజెక్టు డీపీఆర్కు సీడబ్ల్యూసీ అనుమతివ్వడానికి ముందే కాంట్రాక్టర్లకు తొందరపడి పనులు అప్పగించారని ఆక్షేపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారుతుందని చెప్పింది. తెలంగాణ మొత్తం రాష్ట్ర రోజువారీ విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లుకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని పంపులను నడిపితే రోజుకు గరిష్టంగా 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాల్సి ఉంటుందని తేలి్చంది. మల్లన్నసాగర్ బ్యారేజీ కింద భూగర్భంలో చీలిక ఉందని, చిన్న భూకంపం వచ్చినా బ్యారేజీ దిగువన ఉండే ప్రజలకు ప్రమాదకరమని హెచ్చరించింది. కాళేశ్వరం అప్పులు చెల్లించడానికి రూ.15వేల కోట్లు, కరెంట్ బిల్లులకు రూ.10వేల కోట్లు కలిపి ఏటా రూ.25 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసమే కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి శాపంగా, గుదిబండగా మారింది. బ్యారేజీలను పునరుద్ధరిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగిన నష్టం చాలా తీవ్రమైనది. మా ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెట్టబోదు. వాటిలోని లోపాలను గుర్తించి, మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించే బాధ్యతను ఎన్డీఎన్ఏకు అప్పగించాం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చాకే మరమ్మతులపై ముందుకు వెళ్తాం. బ్యారేజీలను పునరుద్ధరించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్కు మంచిపేరు రావొద్దనే రీఇంజనీరింగ్.. కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు రావొద్దని, తమ సొంత ముద్ర ఉండాలనే ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ చేసింది. వాటి అంచనా వ్యయాన్ని అనేక రెట్లు పెంచింది. కాళేశ్వరం నిర్మించాలనేది తప్పుడు నిర్ణయం. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు రూ.41వేల కోట్లతో పూర్తయ్యేది. పైగా ఆ డ్యామ్ కూలింది.. ఈ డ్యామ్ కూలిందంటూ మేడిగడ్డ కుంగిపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎలా ముందుకు సాగాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి ముందుకు సాగుతాం. ఫాస్ట్ట్రాక్ కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, కొడంగల్–నారాయణపేట, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, డిండి, ఎల్లంపల్లి, ఇందిరమ్మ వరద కాల్వ, మిడ్మానేరు, కొమురంభీం, దేవాదుల ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదిలోగా 7లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. రాయలసీమ లిఫ్టుకు కేసీఆర్ సహకారం ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించుకోవడానికి నాటి సీఎం కేసీఆర్ సహకరించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో కలిసి నీటివాటాల గురించి చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు జరుగుతున్న సమయంలో కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం తలపెడితే.. వాయిదా వేయాలని కేసీఆర్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలం అర గంట జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని కేంద్రానికి ఫిర్యాదు చేస్తే రాయలసీమ లిఫ్టు టెండర్లు ఆగిపోయేవి. కానీ ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాకే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు..’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
హరీష్ రావు Vs మంత్రులు.. దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ క్రమంలో ఇరిగేషన్ శాఖపై అధికార కాంగ్రెస్ నేతలు వర్సెస్ మాజీ మంత్రి హరీష్రావు అన్నట్టుగా వాడీవేడి చర్చ నడుస్తోంది. మంత్రులు, హరీష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సభలో మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ..‘ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్ చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగాయి. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. ఎస్ఆర్ఎస్పీ-2కు నీళ్లిచ్చిన ఘనత మాది. కేసీఆర్ వచ్చాకే రెండు పంటలకు నీరిచ్చాం. కాంగ్రెస్ పాలనలో నీరు రాలేదు ఎందుకు.. కేసీఆర్ వచ్చాకే ఎలా నీళ్లు వచ్చాయి. ►బీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయి. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారు. ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రతీసారి అబద్ధాలే చెబుతున్నారు. గోబెల్స్ అవార్డు ఉత్తమ్కే ఇవ్వాలి. ►30 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు వచ్చింది. కల్వకుర్తి ప్రాజెక్ట్ కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ది సెల్ఫ్గోల్. కాగ్ నివేదికకు ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. కాగ్ రిపోర్ట్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పుపట్టాయి. కాగ్ నివేదిక తప్పులతడక అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాగ్ నివేదికల్లో ప్రమాణికం లేదని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ►రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నాలుగు అంశాలు అబద్ధాలే. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారు. ఇందులో అబద్ధాలు ఉన్నాయని నేను రుజువు చేస్తాను. మిడ్మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే, 2014 నాటికి నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మిడ్మానేరు ప్రాజెక్టుకు సంబంధించి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి మూడేళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేశాం. ►ఖర్చులు వర్సెస్ ఆయకట్టు విషయంలో శ్వేతపత్రంలో రెండు చోట్ల వేర్వేరుగా ప్రస్తావించారు. 2014కు 57.79 లక్షల ఎకరాలకు నీరిస్తే.. రూ. 54,234 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇదే నివేదికలో మరో చోట 1956-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీలోని తెలంగాణలో రూ.54,234 కోట్లు ఖర్చు పెట్టి 41.76 లక్షల ఎకరాలను నీరిచ్చాం అని చెప్పారు. ఒకే అంశంపై భిన్నమైన సమాచారాన్ని నివేదికలో పొందుపర్చారు. ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. నీరందించిన ఆయకట్టు విస్తీర్ణంలో మాత్రం తేడా ఉంది. ►రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అప్పటి ప్రభుత్వం (బీఆర్ఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ అంశానికి సంబంధించి గతంలోనే పూర్తి ఆధారాలతో సహా నేను పూర్తి వివరణ ఇచ్చాను. అయినా సరే మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు జీవో వచ్చింది 5/5/2020లో ఈ జీవో రాకముందే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. మే 5న జీవో వస్తే వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశాం. ఆ లెటర్లు కావాలంటే సభలో ప్రవేశపెడతాం. మేం అసలు ఫిర్యాదే చేయలేదనే అబద్ధాలను పదేపదే చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు అంటూ కామెంట్స్ చేశారు. -
‘రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్కరోజే కాళేశ్వరానికి..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా గత బీఆర్ఎస్ సర్కార్ పాలన, నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విస్తరుపోయే విషయాలను కాగ్ చెప్పింది. కాగ్ సూచించిన అంశాలపై ఖచ్చితంగా విచారణ చేస్తాం. గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్ట్లను కొనసాగించారు. 81వేల కోట్ల ప్రాజెక్టుకు CWC అనుమతి ఇస్తే ఒక లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెంచారు. 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79 లక్షల ఎకరాలు. మొత్తం ఖర్చు 54,234కోట్లు. 2014 వరకు ఒక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు. 2014-23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు. కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు. ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు. పీక్ ఎనర్జీ డిమాండ్ ఉన్న రోజు 203 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం. ►కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం పరిస్థితి చుస్తే ఖర్చు రెండు లక్షలకు పోయే ప్రమాదం ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరమయ్యే కరెంట్.. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజుకే అవసరమవుతుంది. ఏడాదికి పదివేల ఐదు వందల కోట్లు కరెంట్ బిల్లులు కాళేశ్వరానికి అవసరం అవుతుంది. ►మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మల్లన్న సాగర్ కూడా ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని CAG స్పష్టం చేసింది. ►అన్నారం బ్యారేజ్లో నిన్నటి నుంచి లీక్ మొదలైంది. NDSAకు సమాచారం ఇస్తే నీళ్లను వదిలిపెట్టాలని వాళ్ళు సూచించారు. మేడిగడ్డ తరహాలో అన్నారం కుంగిపోయే ప్రమాదం ఉందని NDSA రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఆపరేషన్ చేయలేదు. ►1800 కోట్లకు మేడిగడ్డ టెండర్ పిలిచి నాలుగు వేలకోట్లు చెల్లించారు. మేడిగడ్డ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. డిజైన్, క్వాలిటీ లోపం స్పష్టంగా ఉంది. ►అక్టోబర్లో డ్యామ్ డ్యామేజ్ అయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ►మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల నిర్మాణంలోనూ క్వాలిటీ లేదు. కాళేశ్వరం నిర్మాణంలో అలసత్వం వహించిన అధికారులను ఇప్పటికే కొందరిని తొలగించాం. ►ప్రాజెక్ట్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీ వాడుకుంటున్నా బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కృష్ణా జలాలను ఏపీ ప్రబుత్వం యథేచ్చగా మళ్లించుకుంది. ►కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాట 68 శాతం ఉంటే గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది. పోలింగ్ రోజు ఏపీ ప్రభుత్వం సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లు కడుతుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది. కాంట్రాక్టర్లకు వేల కోట్లును కట్టబెట్టారు. ►గత ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్లు అప్పగిస్తూ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కాళేశ్వరం మూడేళ్లలోనే కుంగిపోయింది. ఇలా కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్లను నింపే ప్రక్రియను ఆపేసింది. ►కడెం ప్రాజెక్ట్ను పట్టించుకోకపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో, ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మూసీ ప్రాజెక్ట్ గేటు కూడా కొట్టుకుపోయింది. ►మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు. ►ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి అయ్యింది. ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్ట్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. గత పదేళ్లలో ప్రాజెక్ట్లకు అనాలోచితంగా ఖర్చు చేశారు. ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్ట్లను నిర్మించాలి. ఐదేళ్లలోనే కాళేశ్వరం మూలకు పడింది. ►తెలంగాణ రైతుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు బ్యారేజ్లను NDSAకు అప్పగించి విచారణ చేయిస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లపై విచారణ NDSA రిపోర్ట్తో చర్యలు తీసుకుంటాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాము. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లను గుర్తించారు. రిపేర్ చేయాలని 18-05-2020న ఇరిగేషన్ శాఖ ఎల్ అండ్ టీకీ నోటీసులు జారీ చేసింది. 28-04-2023న మరోసారి సీసీ-బ్లాకులు కొట్టుకుపోయాయి. ఇరిగేషన్ శాఖ సూచనల మేరకు పనులు జరగలేదు. తనిఖీ నివేదికలు లేకుండా డీవియేషన్లకు ఆమోదం తెలిపారు. 2019 నుంచి బ్యారేజ్ నిర్వాహణ చేయలేదు. బ్యారేజ్ నిర్మాణం తర్వాత షీట్ ఫైల్స్, కాఫర్ డ్యామ్ను తొలగించలేదు. పనులు పూర్తి చేయకముందే ఏజెన్సీకి బ్యాంకు గ్యారెంటీలు విడుదల చేయాలని ఈఎన్సీ సిఫారసు చేసింది. -
తెలంగాణ అసెంబ్లీ: ఇరిగేషన్పై మాటల యుద్ధం
Updates.. తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్ 45 గంటల 32నిమిషాల పాటు నడిచిన అసెంబ్లీ 8 రోజుల శాసనసభ పనిదినాల్లో 59 మంది సభ్యులు మాట్లాడారు జీరో అవర్ లో 64మంది వారి సెగ్మెంట్ అంశాలను ప్రస్తావించారు ప్రభుత్వ ప్రకటనలు రెండు, మూడు బిల్లులకు ఆమోదం, ఒక లఘు చర్చ అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్ వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్ అయింది.. సరి చెయ్యాలి ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్ హరీష్ రావు వన్ మెన్ హీరో మేడిగడ్డలో రిపేర్ కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు అన్నారం డ్యామేజిపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారం డ్యామేజి సీరియస్ అంశం మూడు బ్యారేజిలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ(ఎన్డీఎస్ఏ)కు అప్పగిస్తాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు ఒకనాడు కేసీఆర్కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు. ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా హరీష్రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్కు స్లిప్ పంపుతున్నారు నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను నిన్ననే అసెంబ్లీ క్లోజ్ చేయమని చెప్పాం 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు.. మంత్రి భట్టి మాట్లాడుతూ.. కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచారు లక్షల కోట్లు వృధా చేశారు హరీష్రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది సాగునీటి మంత్రిగా హరీష్ను ఎందుకు తప్పించారు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు ఈ పాపాలన్నింటికి హరీష్, కేసీఆరే కారణం తెలంగాణను చెదలు పట్టించారు హరీష్ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్ను సమర్థిస్తున్నారు చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్లో చేరాక అలా తయాయ్యాడు అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్ మారిపోతుంది కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. మాటలతో ప్రజల్ని నమ్మించలేరు గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు హరీష్రావు మాట్లాడుతూ.. సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్ గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్ కూలాయి మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు కేసీఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశం మేడిగడ్డ.. కేసీఆర్ ఆలోచనే: సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్ఆలోచన అక్కడే కట్టాలని కేసీఆర్ ఆదేశించారు వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది హరీష్రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే గోదావరి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ బయటపెట్టే యత్నం చేస్తున్నారు ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో ఎక్కువ దోపిడీ జరిగింది హరీష్రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు గోబెల్స్ హరీష్రావు అని పేరు పెట్టుకోండి పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి హరీష్రావు మాట్లాడుతూ.. ఉత్తమ్ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం కాంగ్రెస్ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్ చేశాం ఎస్ఆర్ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ మంత్రి భట్టి మాట్లాడుతూ.. మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువునా చీటింది కాళేశ్వరంలో నాణ్యత లేదు మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది గత గవర్నర్ హరీష్రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్ కూడా చెప్పింది ఉత్తమ్ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి కూలిన దానికి తప్పు ఒప్పుకోండి ఇంకా సమర్థించుకోవడం సరికాదు ఇరిగేషన్పై వాడీవేడి వాదనలు ఇరిగేషన్ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్ చేసిన అధికార పక్షం తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు లేచి బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హరీష్రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు కేసీఆర్, జగన్ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నొటిఫికేషన్ను మేం వ్యతిరేకించాం మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగింది ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు హరీష్రావు మాట్లాడుతూ.. ఇరిగేషన్పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారు గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు మిడ్మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం ఇరిగేషన్పై చర్చకు 2గం. సమయం అవసరం మంత్రి ఉత్తమ్ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సభలో మంత్రి ఉత్తమ్.. లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు. అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు సభలో మంత్రి ఉత్తమ్.. గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది గతంలో.. అపెక్స్ కమిటీ మీటింగ్ గత సీఎం కూడా పాల్గొన్నారు అప్పుడే కేఆర్ఎంబీకి నోటిఫికేషన్ను కేంద్రం రిలీజ్ చేసింది కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు కేఆర్ఎంబీకి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాచింయింది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్ఎస్ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది సభలో మంత్రి ఉత్తమ్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది పోలింగ్ రోజు సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్ఎస్ అప్పుడు పట్టించుకోలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ, కాగ్ అనేక లోపాలు బయటపెట్టింది మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్ తట్టుకోలేదు మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్ పేర్కొంది సభలో మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది కానీ, కాగ్ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు కాగ్ చెప్పింది కరెంట్ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది డీపీఆర్ అఫ్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టింది కాగ్ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది సభలో మంత్రి ఉత్తమ్.. అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు అన్నారంకు క్రాక్స్ వచ్చాయి అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి వెంటనే ఎన్డీఎస్ఏకి సమాచారం అందించాం నీటిని నింపొద్దని ఎన్డీఎస్ఏ చెబుతోంది ఉన్న నీటిని తొలగించమని చెప్పింది సభలో మంత్రి ఉత్తమ్.. మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది అక్టోబర్లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బాగా దెబ్బతింది గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్.. డిజైనర్ గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు మొత్తం ఖర్చు 54,234కోట్లు 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్పాయింట్ ప్రజంటేషన్ సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్ అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది అసెంబ్లీ స్పీకర్ అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు మంత్రి శ్రీధర్ బాబు.. గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు.. మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి టెక్నీషియన్ ను బయటకు పంపాలి ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం. మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం. ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా? అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం. మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది. ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది. ►ఇరిగేషన్పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ సర్కార్. ►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు ►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ►నిన్న జరగాల్సిన ఇరిగేషన్పై చర్చ నేటికి వాయిదా ►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు ►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా. -
TS: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్)గా ఉన్న మురళీధర్ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఇటీవల ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మురళీధర్.. 11 ఏండ్లకు పైగా ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి మురళీధర్ ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. -
కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు నాలుగున్నరేళ్లుగా ఆయన చేసిన పోరాటం, కృషి ఫలించాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ అంగీకరించింది. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గతనెల 17న ఢిల్లీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమలుకు గురువారం హైదరాబాద్లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ రెండు ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అందుకు సంబంధించిన విధివిధానాలను ఈ సమావేశంలో రూపొందించారు. వాటిని కృష్ణాబోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్ కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలపై రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగించనున్నారు. కృష్ణానదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి కారణమైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణాబోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గతనెల 17న రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆ సమావేశంలో అంగీకరించాయి. ప్రాజెక్టుల అప్పగింత విధివిధానాలను వారంలో ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కానీ.. హైదరాబాద్కు వచ్చాక తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. కృష్ణాజలాల వాటాలను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై బుధవారం కేంద్రానికి లేఖ కూడా రాసింది. అడ్డంతిరిగి.. దారికొచ్చిన తెలంగాణ కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు కృష్ణాబోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే నేతృత్వంలో గురువారం త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ హాజరయ్యారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ తేల్చేవరకు ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ ఈఎన్సీ పాతపాట పాడటంతో ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి వాటాలు తేల్చేది ట్రిబ్యునల్ మాత్రమేనని.. త్రిసభ్య కమిటీ, కృష్ణాబోర్డు, అపెక్స్ కౌన్సిల్కు ఆ అధికారం లేదని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతకే త్రిసభ్య కమిటీ పరిమితం కావాలని సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో తమ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీచేశామని, తెలంగాణ తన భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్ల అప్పగింతపై ఇప్పటికీ తేల్చలేదని ఎత్తిచూపారు. దీంతో తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి తెలంగాణ ఈఎన్సీ అంగీకరించారు. బోర్డు, ఏపీ, తెలంగాణ ప్రతినిధుల నేతృత్వంలో.. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూనే.. ఒక్కో అవుట్లెట్ వద్ద బోర్డు, ఏపీ, తెలంగాణ అధికారులు ఒక్కొక్కరిని నియమించి, నీటి విడుదలను పర్యవేక్షించాలని ఇద్దరు ఈఎన్సీలు చేసిన సూచనకు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే అంగీకరించారు. ఇందుకు రెండు రాష్ట్రాలు సిబ్బందిని సమకూర్చాలని సభ్య కార్యదర్శి చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రతి నీటి సంవత్సరంలో ఎప్పటికప్పుడు త్రిసభ్య కమిటీ సమావేశమై.. రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించి, నీటివిడుదలకు చేసే సిఫార్సు మేరకు బోర్డు ఉత్తర్వులు జారీచేయాలనే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తాగునీటి అవసరాల కోసం తక్షణమే సాగర్ ఎడమకాలువ కింద ఏపీకి రెండు టీఎంసీల విడుదలకు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కుడికాలువకు మార్చిలో 3, ఏప్రిల్లో 5 టీఎంసీల విడుదలకు ఆమోదం తెలిపింది. హక్కుల పరిరక్షణ కోసం సీఎం జగన్ రాజీలేని పోరాటం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. కృష్ణాపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2020 అక్టోబర్ 6న కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేసేలా తెలంగాణ సర్కార్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడిచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా.. తెలంగాణ సర్కారు తన భూభాగంలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని, లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణాబోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేయాలన్న రాష్ట్ర అధికారుల విజ్ఞ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుందని.. అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నవంబర్ 30న తెల్లవారుజామున సీఈ మురళీనాథ్రెడ్డి నేతృత్వంలో పోలీసులు, జలవనరులశాఖ అధికారులు రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం జగన్ ఆది నుంచి చేస్తున్న డిమాండ్ మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏకాభిప్రాయంతో ప్రాజెక్టుల అప్పగింత త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఏకాభిప్రాయం కుదిరింది. ఏపీ భూభాగంలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగింతకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశాం. తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించడానికి ఆ రాష్ట్రం అంగీకరించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు బోర్డు నీటి కేటాయింపులు చేస్తుంది. వాటిని బోర్డే విడుదల చేస్తుంది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ త్రిసభ్య కమిటీ సిఫార్సులే కీలకం శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏటా నీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేస్తుంది. ఆ ప్రకారమే బోర్డు నీటిని విడుదల చేస్తుంది. మా భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను కృష్ణాబోర్డుకు అప్పగిస్తాం. కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం కేంద్ర జల్శక్తి శాఖకు లేఖ రాశాం. – మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ నీటిపారుదలశాఖ -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్లు బాస్లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్వర్క్స్ నాగర్కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
రూ. 37 వేల కోట్లు కేటాయించండి
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరం (2024–25)లో నీటిపారుదల రంగానికి రూ.37 వేల కోట్లను కేటాయించాలని ఆ శాఖ ప్రతిపాదించింది. మంగళవారం నీటిపారుదల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. 2024– 25లో కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల నిమిత్తం రూ.14,462.17 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది కాక రూ.3000 కోట్లను తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ కింద తీసుకున్న రుణాలకు చెల్లింపులున్నాయని అధికారులు నివేదించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సృష్టించేలా ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, రాజీవ్ బీమా, కోయిల్సాగర్, నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకం, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్), మొడికుంటవాగు, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ, పెద్దవాగు (జగన్నాధపూర్), చనాకా కొరాటా, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు ప్రాధా న్యం ఇవ్వనున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) మురళీధర్ రావు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. విద్యుత్ సంస్థల్లో మరో ఆరు నెలలపాటు ఎలాంటి సమ్మెలు చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే..
సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంత నిర్లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు మరోటి లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లోనే లోపం ఉందని ప్రాథమికంగా సమాచారం ఉందన్నారు. అలాగే, దాని నిర్మాణం, నిర్వహణ కూడా పూర్తి నిర్లక్ష్య పూరితంగా జరిగాయని చెప్పారు. శనివారం ఆయన సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ. 94వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు 40వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తుందని కాగ్ రిపోర్టు చెబుతోందని, అది కూడా కూలిపోయే స్థితికి చేరుకుందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కో సంస్థ డిజైన్ చేసిందని, అందులో రూ.38వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు డిజైన్ చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలూ ప్రమాదంలోనే ఉన్నాయన్నారు. కాళేశ్వరం అంటే ఈ మూడు బ్యారేజీలు మాత్రమేనని, వీటినే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని, పైనున్న ఎల్లంపల్లి, మిడ్ మానేరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినవేనని వివరించారు. అన్నారం బ్యారేజీ తీవ్రంగా దెబ్బతిందని, డ్యామేజీతోపాటు నిర్లక్ష్యం కూడా చోటుచేసుకుందని, వీటికి సంబంధించిన ఫొటోలు త్వరలోనే విడుదల చేస్తామని ఉత్తమ్కుమార్ చెప్పారు. కృష్ణా బోర్డుకు అప్పగించలేదు కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణానీటి దుర్వినియోగం జరిగిందని, వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం ప్రారంభించారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకుందని దు్రష్పచారం చేయడం సిగ్గుచేటన్నారు. గత డిసెంబర్ 7న తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుల స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో ముఖ్యమంత్రి రేవంత్, తాను సమావేశమైనప్పుడు కేఆర్ఎంబీపై య«థాతథస్థితి కొనసాగించాలని చెప్పినట్లు తెలిపారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి ప్రజల ముందు పెట్టనున్నట్లు చెప్పారు. కాళేశ్వరంపై పలు విచారణలు సాగుతున్నాయని, పూర్తి వివరాలతో నిపుణులే మాట్లాడతారన్నారు. విధ్వంసక మైండ్ సెట్ ఉన్నోళ్లే కరెంట్ బిల్లు కట్టొద్దని అంటున్నారని, విద్యుత్ శాఖలో రూ.వేలకోట్ల అప్పులు చేసి బిల్లులు కట్టొద్దని మాట్లాడటం శోచనీయమని అన్నారు. -
మీ కౌంటర్లో పస లేదు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో పర్యటించి తాము సమర్పించిన నివేదికలోని అంశాలను ఖండిస్తూ గత డిసెంబర్ 7న నీటిపారుదల శాఖ పంపించిన నివేదికలో ఎలాంటి పస లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) తేల్చి చెప్పింది. బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు సమాచారం సైతం అసంపూర్తిగానే ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమాచారాన్ని పంపించాలని కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ నెల 12న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ)కు లేఖ రాశారు. ‘నాణ్యత’పై గోప్యత ఎందుకు ..? బ్యారేజీ నిర్మాణ సమయంలో నాణ్యతా పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు, ప్రత్యేకించి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యతాపర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందించలేదని ఎన్డీఎస్ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేíÙంచిన తర్వాతే బ్యారేజీ పియర్లు కుంగడానికి కారణాలు తెలుస్తాయని పేర్కొంది. బ్యారేజీ పునరుద్ధరణకు తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడానికి నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. పొంతన లేని విభాగాల డ్రాయింగ్స్ భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించి ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎన్ఏకు సమర్పించింది. వీటిపై అధ్యయనం తర్వాత బ్యారేజీ పునాదుల కింద నుంచి ప్రవహించాల్సిన నీళ్లకు భూగర్భంలో నిర్మించిన కటాఫ్ గోడలు అడ్డుగా ఉన్నట్టు భావన కలుగుతోందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రాజెక్టు అధికారులు సమర్పించిన ‘డిజైన్ కాలిక్యులేషన్స్’మాత్రం బ్యారేజీ కింద భూగర్భంలో ప్రవాహానికి కటాఫ్ గోడలు అడ్డంకిగా లేవని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ప్రాజెక్టు అధికారులు సమర్పించిన వేర్వేరు రకాల సమాచారాన్ని విశ్లేషించి, పరస్పర విరుద్ధమైన అభిప్రాయానికి ఎన్డీఎస్ఏ వచ్చింది. ప్రాజెక్టు డిజైన్కు సంబంధించి కీలకమైన ఈ అంశంపై మరింతగా పరిశీలన కోసం ..ప్రత్యేకించి బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్(సెక్షనల్ డ్రాయింగ్స్)ను జియోలాజికల్ వివరాలతో సహా అందజేయాలని విజ్ఞప్తి చేసినా ఇంత వరకు అందజేయలేదని ఎన్డీఎస్ఏ పేర్కొంది. మళ్లీ ఎన్డీఎస్ఏ బృందాన్ని పంపిస్తాం... ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని దారిమళ్లించి, బ్యారేజీ కుంగిన ప్రాంతం వద్ద ఉండే నీటి నిల్వలను తోడేసిన తర్వాత తమకు తెలియజేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అలా తెలిపిన వెంటనే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం వచ్చి వాస్తవాలను తెలుసుకోవడానికి తొలి పరిశీలన చేస్తుందంటూ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్డీఎస్ఏ మళ్లీ గుర్తు చేసింది. బ్యారేజీ కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తు అంశాలను సైతం తమకు తెలియజేయాలని కోరినట్టు పేర్కొంది. ఈ రెండు విషయాల్లో ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదని తెలిపింది. -
మేడిగడ్డపై విజిలెన్స్
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/తిమ్మాపూర్(మాన కొండూర్)/కరీంనగర్క్రైం/జ్యోతినగర్(రామగుండం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మంగళవారం ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం ఉదయం నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్లోని జలసౌధ సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన 10 కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనిఖీలు జరిపాయి. క్షేత్ర స్థాయిలో డివిజనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు ఈఎన్సీ, సీఈ, ఎస్ఈల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి ఫైళ్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. జలసౌధలో 50 మంది అధికారులు హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు సుమారు 50 మంది విజిలెన్స్ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ఫైళ్లను తనిఖీ చేశారు. ఒకటో అంతస్తులో ఉండే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్, గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరామ్ క్యాంప్ కార్యాలయం, రెండో అంతస్తులో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ స్వీయ పర్యవేక్షణ కింద ఉండే కీలకమైన ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ (పీఅండ్ఎం), హైడ్రాలజీ విభాగాల్లో తనిఖీలు జరిగాయి. అలాగే ఐదో అంతస్తులోని రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం, ఆరో అంతస్తులోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ (సీడీఓ), క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌస్లకు సంబంధించిన ఫైళ్లను కూడా అధికారులు జప్తు చేసి తీసుకెళ్లారు. సీడీఓ సీఈ కార్యాలయం నుంచి బ్యారేజీలు, పంప్హౌస్ల డిజైన్లు, డ్రాయింగ్స్ను పట్టుకెళ్లారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ కింద చేపట్టిన రెండు టీఎంసీల ప్రాజెక్టు పనులతో పాటు మూడో టీఎంసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లారు. మొత్తం అన్ని సర్వేలు, వ్యయ అంచనాలు, డీపీఆర్ తయారీ, టెండర్ల నిర్వహణ, కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, పనుల్లో నాణ్యతా పర్యవేక్షణ, నిర్వహించిన పరీక్షలు, బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వినియోగం తదితర అంశాలకు సంబంధించిన ఫైళ్లను కూడా పట్టుకెళ్లారు. రాకపోకలు బంద్..సెల్ఫోన్ల స్వాదీనం తనిఖీల సమయంలో లోపలి వ్యక్తులు బయటికి వెళ్లేందుకు, బయటి వ్యక్తులు లోనికి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. అలాగే తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చెప్పకుండా అధికారుల ఫోన్లను స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. కుంగిన పియర్ల పరిశీలన ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహదేవపూర్ డివిజన్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పియర్లను పరిశీలించారు. మరో బృందం కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ మునిగిన ప్రాంతం, కంట్రోల్ రూమ్ను పరిశీలించింది. పలు కీలక రికార్డులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. ప్రాజెక్టు డీపీఆర్, సీడబ్ల్యూసీ క్లియరెన్స్లు, బ్యారేజీ, పంపుహౌస్ల డ్రాయింగ్, డిజైన్లు తదితర వివరాలు స్థానిక అధికారులను అడిగారు. నిర్మాణ పనులు పూర్తయిన సర్టిఫికెట్స్, భూమి అక్విటెన్స్ స్థితి, ప్రస్తుత పనులపై కూడా ఆరా తీశారు. నీటి విడుదల, విద్యుత్ వినియోగ వివరాలు, అధికారుల బదిలీల వివరాలు, ఫిర్యాదులు, ఆర్టిలతో తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రాత్రి పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. మరోవైపు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఇవి కూడా రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యాలయాల్లో సోదాలు కొనసాగాయి. స్థానికంగా పలు ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. కాగా బుధవారం కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ రమణారెడ్డి తెలిపారు. హైకోర్టు సీజేకు ప్రభుత్వం లేఖ గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 7వ బ్లాకు కుంగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆధ్వర్యంలోని బృందం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి డిజైన్, నిర్మాణం, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ లోపాలతోనే బ్యారేజీ కుంగిందని నివేదిక సమర్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. దీనిపై వారం రోజుల్లో న్యాయ విచారణకు ఆదేశిస్తామని ఇటీవల రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మేడిగడ్డపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జి ఒకరిని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గతంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. నేడు ముఖ్యమంత్రి సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. న్యాయ విచారణ విషయమై గతంలోనే నిర్ణయం తీసుకోగా, తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి మూలకారణాలు తెలుసుకోవడం, బ్యారేజీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, బుంగలు ఏర్పడిన అన్నారం బ్యారేజీతో పాటు సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించడానికి నిర్వహించాల్సిన పరీక్షలు.. తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మేడిగడ్డ బ్యారేజీ.. వాటిని కూల్చాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన 7వ నంబర్ బ్లాక్లోని 18, 19, 20వ నంబర్ పియర్లు, వీటికి సంబంధించిన 3 రేడియల్ గేట్లు, 3 స్లాబులను పూర్తిగా కూల్చి వేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ స్పష్టం చేశారు. కూల్చివేతకు డైమండ్ వైర్ కటింగ్, డ్రిల్ అండ్ బ్లాస్ట్, డ్రిల్ అండ్ వన్ టైం బ్లాస్ట్ అనే 3 ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. బ్యారేజీ మిగతా స్ట్రక్చర్కు నష్టం జరగకుండా దెబ్బతిన్న బ్లాక్లోని వించ్, వాక్ వే –1, యాక్సెస్ లా డర్, గంట్రీ ట్రాక్ గ్రైడర్, గాంట్రీ బీమ్వంటి భాగాలను అ త్యంత జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందన్నారు. నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన మంత్రుల బృందానికి, మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైన పేర్కొన్న అంశాలపై మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు నెలల్లోగా బుంగల పూడ్చివేత కొత్త బ్లాక్ కట్టడం కంటే కూల్చి వేతకు అధిక సమయం పడుతుందని ఈఎన్సీ చెప్పారు. డైమండ్ వైర్ కటింగ్ టెక్నాలజీతో కూల్చివేత పనులు చేపట్టాలని భావిస్తున్నా, ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిని వినియోగిస్తే పక్కనే ఉన్న ఇతర బ్లాకులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఏర్పడిన బుంగలను రెండు నెలల్లోగా గ్రౌటింగ్ ద్వారా పూడ్చి వేస్తామని, నిర్మాణ సంస్థలే వ్యయాన్ని భరిస్తాయని ఈఎన్సీ చెప్పారు. బ్యారేజీకి త్వరలో పరీక్షలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి త్వరలో గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, ఎలక్ట్రికల్ రెసెస్టివిటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మురళీధర్ తెలిపారు. బ్యారేజీ పునాదుల కింద జరిగిన మార్పులను, ఏర్పడిన లోపాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలతో వీలుంటుందన్నారు. ఏడవ బ్లాక్లోని పియర్ల పునరుద్ధరణ కోసం నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ పనులు వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈఎన్సీ చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.28 లక్షల కోట్లు ♦ ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93,800 కోట్లు ♦ 2 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఐదు వేల మెగావాట్ల కరెంటు ♦ మూడో టీఎంసీ పనులు చేస్తే 8,450 మెగావాట్ల కరెంటు ♦ ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసింది 173 టీఎంసీలు ♦ ప్రాజెక్టు కింద సాగైంది 98,570 ఎకరాలు (నిర్మాణం పూర్తయ్యాక ఇచ్చిన నీరు స్థిరీకరణకు మాత్రమే) ♦ మూడో టీఎంసీ కోసం రూ.33,400 కోట్లతో ప్రతిపాదన ♦ ఏడాదిన్నరగా రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ♦ పాలమూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరుతో అప్పులు డైమండ్ వైర్ కటింగ్ అంటే.. మేడిగడ్డ ఏడవ బ్లాక్లోని మూడు పియర్లు, స్లాబులు తొలగించేందుకు డైమండ్ వైర్ కటింగ్ విధానాన్ని అవలంభించాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పక్కనున్న పియర్లు, పైనున్న ఇతర స్లాబులకు ఎలాంటి నష్టం జరగకుండా తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇది అధిక వ్యయంతో కూడిన, ఎక్కువ సమయం పట్టే విధానమని చెబుతున్నారు. ఈ విధానంలో.. వజ్రాల పొడి పొదిగిన లోహపు వైర్ రంపం వినియోగించి కాంక్రీట్ దిమ్మెలను కట్ చేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రకంపనలకు తావుండదు. ఎలాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించరు. కాబట్టి పక్కన, పైన ఉన్న దిమ్మెలకు నష్టం వాటిల్లదు. -
ఆయకట్టు ఎకరా పెరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్సాగర్ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరా సాగర్ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్ అలాట్మెంట్ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ హెడ్ వర్క్ నుంచి చివరి కెనాల్ వరకు ఫేజ్ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరా తీశారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్సీ మురళీధర్ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్ లిఫ్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. -
కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటిని డిజైన్ చేసిన, నిర్మించిన వారిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సవివరంగా లిఖితపూర్వక వివరణ సమర్పించాల్సిందిగా నీటిపారుదల శాఖను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం జలసౌధకు వచ్చిన మంత్రి.. శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై ఈఎన్సీ సి.మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రతి ప్రాజెక్టుపై సమగ్ర నివేదికకు ఆదేశం నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత పాటిస్తున్నారని, రహస్య జీవోలు ఇచ్చారంటూ అనేక ఆరోపణలున్నాయని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఇకపై శాఖ పనితీరు పారదర్శకంగా ఉండాలని, సమర్థతను పెంచుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు వంటి అంశాలపై సరైన అధ్యయనాలు లేకుండానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.లక్ష కోట్లను ఖర్చు చేసినా, ఆయకట్టుకు నామమాత్రంగానే సాగునీరు లభిస్తోందన్నారు. ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్టు కింద స్థిరీకరించిన కొత్త ఆయకట్టు, ప్రాజెక్టుల నిర్వహణకు కానున్న విద్యుత్ చార్జీల వ్యయం ఇతర అంశాలపై సమగ్ర నివేదిక కోరామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల చేపడతాం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పక్కన పెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని చెప్పారు. ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేస్తామని చెప్పారు. సీఎంతో పాటు, మంత్రివర్గంలో చర్చించి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల బిల్లులు విడుదల చేస్తామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. మంత్రిగా ఈ నెల 14న బాధ్యతలు స్వీకరిస్తానని ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. సమీక్షలో ఈఎన్సీలు బి.నాగేందర్ రావు, హరిరామ్, అనిల్కుమార్, సీఈలు హమీద్ఖాన్, అజయ్కుమార్ పాల్గొన్నారు. స్మితా సబర్వాల్ గైర్హాజరు జలసౌధలో జరిగిన సమీక్షకు ఆ శాఖ ఇన్చార్జి కార్యదర్శి స్మితా సబర్వాల్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి జలసౌధకు వస్తున్నారనే విషయాన్ని ఆమెకు తెలియజేసినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మిత కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
‘సాగర్’లో సగం ఏపీ స్వాధీనం
సాక్షి, అమరావతి/సాక్షి, నరసరావుపేట/మాచర్ల/విజయపురిసౌత్ :కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో నాలుగున్నరేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాల వినియోగం విషయంలో ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున సీఈ మురళీనాథ్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల శాఖాధికారులు నాగార్జునసాగర్కు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు వాస్తవాలను వివరించి.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారనడానికి ఇది మరో తార్కాణమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ తొండాట.. నిజానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్టోబరు 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి 30 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 15 టీఎంసీలను నాగార్జునసాగర్కు తెలంగాణ సర్కార్ తరలించింది. మాకు కేటాయించిన ఆ 15 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని ఏపీ అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలు వివరించారు. వాస్తవానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు చంద్రబాబు తాకట్టు.. ♦ విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. దీని పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నిర్దేశించింది. ♦ దీంతో సాగర్ను 2014–15లో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్కేంద్రాన్ని సైతం తన ఆధీనంలోకి తీసుకుంది. అయినాసరే.. నాటి సీఎం చంద్రబాబు ఇటు రాష్ట్రంలో.. అటు తెలంగాణలో టీడీపీని బతికించుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే తగ్గితే.. శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాల కోసం నీటిని వినియోగించలేని దుస్థితి. కానీ, శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దిగువన నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా తెలంగాణ సర్కార్ చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో రాష్ట్ర వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ♦ శ్రీశైలం నుంచి 2015లో ఇదే రీతిలో సాగర్కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. దీంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకునేందుకు 2015, ఫిబ్రవరి 13న ఆదిత్యనాథ్ దాస్ పోలీసులతో కలిసి సాగర్కు చేరుకున్నారు. కానీ, తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను ఆయన తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడుల సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరించి వేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు వాటిని తెలంగాణ సర్కార్కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్ నుంచి నీరు విడుదల గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీరు లేక మూడు జిల్లాల చెరువులు, భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు మంచినీటికి అల్లాడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఊపిరిపోసింది. ఏపీ భూభాగంలోని 13 గేట్లను, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు స్వాధీనం చేసుకుని కుడికాలువ రెండు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు. అంతకుముందు.. భారీ స్థాయిలో ఏపీ పోలీసులు అక్కడ మోహరించారు. కుడికాలువపై పట్టు సాధించే క్రమంలో డ్యాంపై ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ పోలీసులు ఏపీ జలవనరుల శాఖ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఏపీ పోలీసులు శాంతియుత వాతావరణంలోనే వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం.. సాగర్ డ్యాంపై ఏపీకి చెందిన భూభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గేట్లను దాటి సగభాగం వరకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏపీ పరిధిలోని 13 క్లస్టర్ గేట్ల వరకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ చర్యలతో నాగార్జునసాగర్లో ఏపీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించినట్లయ్యింది. మరోవైపు.. నీరు విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీఎం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హక్కుల పరిరక్షణకు సీఎం జగన్ రాజీలేని పోరాటం.. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో.. దాన్ని పరిష్కరించడానికి 2020, అక్టోబర్ 6న కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టంచేసిన సీఎం జగన్.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడమే కాక.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ♦ శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే 2021లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించి.. సాగర్కు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ♦ దీంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంకాగా.. తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని.. లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 1,311 మంది పోలీసులతో బందోబస్తు ఇక నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో.. ఏపీ పోలీసు శాఖ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. గుంటూరు రేంజ్ ఐజి పాల్రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి, ఎస్పీ రవీంద్రబాబుల ఆ«ధ్వర్యంలో 1,311 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సాగర్ వద్ద పరిస్థితులు చక్కబడే వరకు వీరు అక్కడే ఉండే అవకాశముంది. -
‘మేడిగడ్డ’పై కేసీఆర్ స్పందించరేం?
సాక్షి, హైదరాబాద్: ‘2014 నుంచి 2018 వరకు హరీశ్రావు దగ్గర నీటిపారుదల శాఖ ఉంది. 2019 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గరే ఆ శాఖ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఇంత చర్చ జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదు? బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు? మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయంలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ ప్రజల ముందుకు రావాలి’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ప్రకారం నిర్మాణం, నిర్వహణ జరగలేదని... కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందని, మేడిగడ్డ కుంగిందని ఆరోపించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు జరిగిన ఘటనను చిన్నదిగా చూపి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందన్న రేవంత్... కేసీఆర్ను ఓ ఆర్థిక ఉగ్రవాదిగా అభివర్ణించారు. కేసీఆర్ కుటుంబమే ఆర్థిక ఉగ్రవాద కుటుంబమని, ఈ ఉగ్రవాదులను కేంద్రం శిక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన వేల రూ. కోట్ల అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రం వెంటనే సీబీఐతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ మౌనమేల? కేంద్ర జలశక్తి పరిధిలో ఉండే కమిటీ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో తప్పు జరిగిందని చెప్పిందని, అవినీతిపరులను వదలనని చెప్పే ప్రధాని మోదీ ఈ కమిటీ నివేదిక వచ్చాక కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారని రేవంత్ ప్రశ్నించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని అడిగితే తాము అధికారంలోకి వచ్చాక తీసుకుంటామని అంటున్నారని, అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని... కేసీఆర్పై చర్యలు తీసుకోబోమని చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల అధికారులతో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ వేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక తెప్పించుకోవాలని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. 2014–2023 వరకు కాళేశ్వరం నిర్మాణం వెనుక హరీశ్, కేసీఆర్ ఉన్నందున వారిని పదవుల నుంచి తొలగించాలన్నారు. కాళేశ్వరం అంచనాలు, పెంచిన వ్యయంపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే డిసెంబర్ 9 తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. -
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాల్లేవు
సాక్షి, హైదరాబాద్: ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవ ని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నా రు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై ఆయన శుక్రవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారే జీ తట్టుకుందని రజత్కుమార్ చెప్పారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్బెడ్పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పియర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ (సాధారణ) మురళీధర్, ఈఎన్సీ (పరిపాలన) అనిల్కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేంద్రరావు, ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ (కరీంనగర్) శంకర్, నీటిపారుదల అదనపు కార్యదర్శి భీం ప్రసాద్, సీడీవో సీఈ మోహన్కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఏబీ పాండ్యా నేతృత్వంలో శనివారం బ్యారేజీని పరిశీలించనున్నట్లు రజత్కుమార్ చెప్పారు. -
మరింత కుంగిన మేడిగడ్డ బ్యారేజీ!
కాళేశ్వరం/సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ మరికాస్త కుంగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్లోని 20వ పియర్ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. వంతెనపై సైడ్ బర్మ్ గోడ, ప్లాట్ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఘటన జరిగిన వెంటనే సాగునీటిశాఖ అధికారులు, ఇతర నిపుణులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది పరిశీలించేందుకు ప్రయత్నించారు. ఆదివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్ధ మేనేజర్ సురేశ్కుమార్ తదితరులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటిమట్టం తగ్గితే ప్రమాదమేంటి? దానికి కారణమేంటి? అన్నది తెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఉన్నట్టుండి నీటిని వదలడంతో గోదావరిలో, తీరం వెంట మేపుతున్న గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయని.. వ్యవసాయ మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. వంతెనపై రాకపోకలు నిలిపివేత బ్యారేజీ వంతెనపై తెలంగాణ–మహారాష్ట్ర మధ్య రాకపోకలను శనివారం రాత్రి నుంచే నిలిపివేశారు. బ్యారేజీ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా మట్టిపోసి, బారికేడ్లు పెట్టి ఎవరూ రాకుండా చూస్తున్నారు. కుంగిన ప్రాంతం వద్దకు వెళ్లడానికి మీడియాను కూడా అనుమతించడం లేదు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్లు బ్యారేజీని పరిశీలించడానికి వేర్వేరు సమయాల్లో వచ్చారు. తొలుత వారిని అడ్డుకున్న పోలీసులు తర్వాత బ్యారేజీ పరిశీలనకు అనుమతించారు. బ్యారేజీకి ప్రమాదం లేదు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితిని సమీక్షించాక ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్అండ్టీ సంస్థ మేనేజర్ సురేశ్కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పెద్ద శబ్ధం వచ్చిందని, ఇంజనీర్లు వెళ్లి పరిశీలించగా బ్యారేజీ పియర్ కుంగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. 7వ బ్లాక్లోని 20వ పియర్ దెబ్బతిన్నదని.. అయితే పక్కన ఉన్న పియర్లపై దీని ప్రభావం ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని.. నెలన్నర రోజుల్లో పూర్వ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ నిర్వహణ బాధ్యతను ఎల్అండ్టీ సంస్థ చూస్తోందని.. ప్రస్తుతం మరమ్మతుల బాధ్యతనూ చేపడుతుందని వివరించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో బ్యారేజీలోని నీటిని ఖాళీ చేస్తామని.. కుంగిన చోట ఏం జరిగింది? సరిచేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి అన్నది తేల్చుతామని వివరించారు. ఈ ఘటనలో దుష్ట శక్తుల హస్తం ఏదైనా ఉందో, లేదో తెలుసుకునేందుకు మహదేవపూర్తోపాటు మహారాష్ట్ర వైపు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు. ప్రపంచ రికార్డు వేగంతో నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా గోదావరి నదిపై రూ.1,849 కోట్ల వ్యయంతో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీని నిర్మించారు. ఎల్ అండ్ టీ సంస్థ కేవలం 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు, దీనికి 87 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటీ 110 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించిన పియర్స్ (గేట్ల మధ్య పిల్లర్లలా ఉండే కాంక్రీట్ నిర్మాణం) మధ్య ఈ గేట్లను అమర్చారు. బ్యారేజీ నిర్మాణంలో భాగంగా ఒకదశలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్టు నిర్మాణ సంస్థ తమ వెబ్సైట్లో పేర్కొనడం గమనార్హం. నేడు మేడిగడ్డకు డ్యాం సేఫ్టీ బృందం బ్యారేజీ కుంగిన ఘటనపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని ‘సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్’ నిపుణుల బృందం సోమవారం పరిశీలన జరపనుంది. కుంగిన ప్రాంతాన్ని సందర్శించి జరిగిన నష్టంపై అంచనా వేయనుంది. ఆ బృందం సిఫార్సుల ఆధారంగా మరమ్మతు పనులు చేపడతారు. వాస్తవానికి బ్రిడ్జిలు, బ్యారేజీలను బ్లాకులుగా నిర్మిస్తారు. పునాదుల పరంగా ఒక బ్లాక్కు మరో బ్లాక్తో సంబంధం ఉండదు. దీనివల్ల ఏదైనా బ్లాక్లో విపత్తు/ప్రమాదం ఎదురైతే మొత్తం బ్రిడ్జి/బ్యారేజీ దెబ్బతినకుండా సదరు బ్లాక్ వరకే నష్టం పరిమితం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా నిర్మించారు. తెలంగాణ వైపు నుంచి వాటికి నంబరింగ్ ఇచ్చారు. అలా మహారాష్ట్ర వైపు చివరన ఉన్నది ఏడో బ్లాక్. దీనిలోని 20వ నంబర్ పియర్ ప్రస్తుతం కుంగిపోయింది. దీని ప్రకారం ఏడో బ్లాక్ వరకు నష్టం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని.. పునాదికి నష్టం జరిగితే ఏడో బ్లాక్ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్ల ‘డిఫెక్ట్ లయబిలిటీ (లోపాలుంటే సరిచేయాల్సిన బాధ్యత)’ సమయం ఇంకా పూర్తి కానందున.. నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే మరమ్మతుల వ్యయం భరించాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరమ్మతులు పూర్తయ్యే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వచేసే అవకాశం ఉండదని అంటున్నాయి. -
‘కృష్ణా’లో కేటాయింపులే జరగలేదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏపీకి 26.29 టీఎంసీలు, తెలంగాణకు 6.04 టీఎంసీలను విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిందని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్ప ష్టం చేసింది. ఈ నెల 21న త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రోజు త్రిసభ్య కమిటీ క న్వినర్, కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే, ఏపీ జల వనరు ల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మాత్రమే సమా వేశమై తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చించా రని తెలియజేసింది. రెండు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులు జరగలేదని, అసలు తెలంగాణ అంగీకారం తెలపలేదని వివరణ ఇచ్చింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శితో తెలంగాణ ఈఎన్సీ భేటీ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం.రాయిపూరేను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గురువారం జలసౌధలో కలిసి కృష్ణా జలాల కేటాయింపులపై పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి అవసరాలకుపై చర్చించిన అనంతరం, నీటి కేటాయింపులపై సిఫారసులతో రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలు(మినట్స్) అంతర్గతంగా సర్క్యులేట్ చేశామని, పత్రికలకు అధికారికంగా విడుదల చేయలేదని రాయిపూరే వివరణ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో త్రిస భ్య కమిటీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సూచించారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల జలవినియోగం, నీటి నిల్వ లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాగునీటి అవసరాలను మదింపు చేసిన తర్వాత కేటాయింపులు జరపాలని కోరారు. తాగునీటి అవసరాలను త్రిసభ్య కమిటీలో చర్చించి, ఇరుపక్షాల అంగీకారం మేరకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
కాళేశ్వరం కింద 97,170 ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ సమావేశమై వానాకాలంలో వివిధ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని జలాశయాలన్నీ నిండి ఉన్న నేపథ్యంలో వాటి కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడంతో ఎగువ నుంచి వస్తున్న వరదలను పరిగణనలోకి తీసుకుని ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల కింద 36.81లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. రాష్ట్రంలో 13,16,557 ఎకరాల ఆరుతడి, 23,64,530 ఎకరాల వరి పంటకు కలిపి మొత్తం 342.43 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. కాళేశ్వరం కింద 71600 ఎకరాల వరి, 25570 ఎకరాల ఆరుతడి పంటలు కలిపి మొత్తం 97,170 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని కమిటీ ప్రతిపాదించింది. -
నెత్తుటి పారుదల యాగమా ఇది?
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తుతుంటే అతడి మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ వారం రాయలసీమ పర్యటనలో చంద్రబాబు ప్రవర్తనలా ఉంటుంది. ఇంచుమించు ఉన్మాదస్థితిని తలపిస్తుంది. బాధాకరం. రాజకీయాల్లో ఆయనది నెగెటివ్ పాత్రే కావచ్చు. వెన్నుపోటుకు మారుపేరే కావచ్చు. విధానపరంగా పేదల వ్యతిరేకే కావచ్చు. పెత్తందార్ల ప్రతినిధే కావచ్చు. అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు. కానీ పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నాయకుని హోదా అనుభవించారు. నగరవాసమూ, అరణ్యవాసమూ తర్వాత మిగిలింది అజ్ఞాతవాసమే కదా! అందుకు సిద్ధపడాల్సిన సమయంలో ఈ దుఃస్థితి! తెలుగు వారందరూ విచారించ దగిన పరిణామం. సాగునీటి ప్రాజెక్టులపై ‘యుద్ధభేరి’ అనే పేరుతో కర్నూలు జిల్లా బనకచర్ల దగ్గర ఆయన యాత్రను ప్రారంభించారు. పేరు ఏదైనా సరే తన ఉద్దేశం వేరే ఉన్నట్లు తొలిరోజు నుంచే సంకేతాలు పంపిస్తున్నారు. పాల్గొన్న ప్రతి సభలో ముఖ్యమంత్రిపై దూషణలకు తెగబడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిని ఆంబోతుగా సంబోధించారు. చివరకు ముప్ఫయ్యేళ్ల వయసు కూడా లేని యువకుడు సిద్ధార్థరెడ్డిని కూడా వదల్లేదు. నాలుకను నాలుగించులు సాగదీసి మరీ బెదిరించారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక సభలో ఆటంబాంబు లాంటి స్టేట్మెంట్ను జనం మీదకు వదిలారు. ఆ బాంబును తయారుచేసిన ఒపెన్హైమర్ సినిమా ఇప్పుడు నడుస్తున్నందువల్ల స్ఫూర్తి పొందాడేమో తెలియదు. ‘ఏయ్! నేను సింహంలాంటోణ్ణి’ అనగానే సభికులు అవాక్కయ్యారు. వారి పంచేంద్రియాలు ఎవరో మంత్రించినట్టుగా స్తంభించిపోయాయి. నవనాడుల్లో రక్తప్రసరణ ఆగిపోయినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో దసరాకు పులివేషాలు సహజమే – ఆ వేషాలు వేసే వాళ్లు లేక ఇప్పుడవీ తగ్గిపోయాయట! కానీ, బాగా పాపులారిటీ ఉన్న వ్యక్తులు తమకు నప్పని, కుదరని వేషాలు వేస్తే జనం అంగీకరించరని అనేకమార్లు రుజువైంది. అందుకే ఎన్టీ రామారావు దేవదాసు వేషాన్నీ, నాగేశ్వరరావు దుర్యోధన వేషాన్నీ వేయడానికి సాహసించలేదు. కిల్బిల్ పాండే వేషంలో బ్రహ్మానందం ఎంత సీరియస్గా మొహం పెట్టినా అది కామెడీ ట్రాక్గానే మిగిలిపోయింది. ఈ కారణం వల్లనే చంద్రబాబు బాంబింగ్కు జనం స్పందించలేదు. చప్పట్లు కొట్టలేదు. నప్పని వేషాలు వేస్తేనే అంగీకరించని జనం స్వభావ విరుద్ధమైన పోలికలు తీసుకొస్తే, పొగడ్తలు కురిపిస్తే షాకవ్వడం సహజం. పోనీ, ఎవరో ఒక అభిమానో, లేదా కార్యకర్తో వచ్చి ‘అన్న టైగర్’, ‘అన్న లయన్’ అంటే అది వేరు. కానీ స్వయంగా ‘నేను లయన్’ను అని ప్రకటించుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. కొంతమంది తాము కూర్చునే కుర్చీ వెనుక పెద్దపులి బొమ్మల్ని పటం కట్టించి పెట్టుకుంటారట! ఇలాంటి వారు స్వభావసిద్ధంగా పిరికివాళ్లనీ, దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం ఇటువంటి బొమ్మల్ని పెట్టుకుంటారనీ సైకాలజిస్టులు చెబుతారు. ఇక స్వయంప్రకటిత నర‘సింహా’లకూ, నర‘శార్దూల’లకూ కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో తెలుసుకోవాలి. మొదటి సింహ ప్రయోగం రసాభాస కావడంతో రెండోరోజు కొంత కసరత్తు చేసి కార్యకర్తలను ముందుగానే సిద్ధం చేశారు. ఈ సభలో వారు చప్పట్లు కొట్టారు. ‘నేను సింహాన్ని, కొదమ సింహాన్ని’ అని రెండు మూడుసార్లు ఆయన ప్రకటించుకున్నారు. కొదమసింహం అంటే యువసింహం అని అర్థం. ఆయనే యువసింహం అయితే వాళ్లబ్బాయి బాలసింహం అవుతాడా, శిశుసింహం అవుతాడా అనే తర్కం అనవసరం. ఈ సింహోపాఖ్యానాన్ని వ్యూహం ప్రకారమే ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మరో ఓటమి తప్పదనే అంచనాలు ఆయనకు తెలియనివి కావు. గత ఎన్నికల్లో టీడీపీ కంటే పదిశాతం ఎక్కువ ఓట్లు వైసీపీకి లభించాయి. ఇప్పుడా తేడా మరింత పెరిగి దాదాపు పద్దెనిమిది శాతానికి చేరుకున్నట్టు వివిధ సర్వేల అంచనాలు తేల్చుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన కొన్ని జాతీయ సంస్థలతో ప్రతిపక్షాలు చేయించిన సర్వేలో వైసీపీకి 52 శాతం, తెలుగుదేశం పార్టీకి 34 శాతం ఓటర్ల మద్దతున్నట్టు వెల్లడైందట! గడచిన ఏడాది కాలంగా జరిగిన సర్వేల్లో ఈ బలాబలాల పొందికలో ఒకటి రెండు శాతానికి మించిన ఊగిసలాట కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఒక్క దానితో పొత్తు కుదిరినా ప్రయోజనం లేదు. బీజేపీతో సహా మిగిలిన పార్టీలన్నీ తనకు మద్దతుగా నిలబడాలి. అందరూ ఏకమవడం ఎలా కుదురుతుంది? బీజేపి మద్దతు ఉన్న కూటమి వైపే కాంగ్రెస్ వారూ, కమ్యూనిస్టులూ ఎలా నిలబడతారు? ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతో ఏకం చేయవచ్చుననే అంధ విశ్వాసమేదో చంద్రబాబులో ఉన్నదని అంటారు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేసినప్పుడు ఈ ఐక్యత సాధ్యమైందట! తిరిగి అధికారంలోకి రావడానికి సహకరించినందుకు కృతజ్ఞతగా ఎన్టీరామారావు ఒక పక్క బీజేపీనీ, మరోపక్క కమ్యూనిస్టులనూ కలుపుకొని తదుపరి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఐక్యతకు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరు పెట్టినప్పటికీ, కనిపించని ‘కామన్ త్రెడ్’ ఏదో వీరిని కలిపేసిందని అప్పట్లోనే కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. ఆ ‘కామన్ త్రెడ్’ ఇప్పుడు కూడా అక్కరకొస్తుందని చంద్రబాబు ఆశ. కొందరు కమ్యూనిస్టులు, కొందరు కాంగ్రెస్ నాయకులతో కూడా ఈ మేరకు ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడానికి ఒక భూమిక కావాలి కదా! ఆ భూమిక కోసం ఇంతకు ముందే, ఒకటి రెండు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనీ, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారనీ ఎల్లో మీడియా సహకారంతో తెలుగుదేశం పార్టీ పెద్ద క్యాంపెయిన్నే నిర్వహించింది. కానీ, ఆ క్యాంపెయిన్ ప్రజలను నమ్మించలేకపోయింది. ఇటీవల గోదావరి జిల్లాల్లో బాబు భాగస్వామి పవన్ కల్యాణ్ రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో ఆడపిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన గాలి ఆరోపణను కూడా ఈ కోణంలోంచి చూడాలి. దానికి కొనసాగింపు చంద్రబాబు రాయసీమ పర్యటన. కర్నూలు జిల్లాలో సింహం మాస్క్తో మొదలై చిత్తూరు జిల్లాలో రక్తం చిందే వరకు సాగింది. అంగళ్లులో, పుంగనూరులో జరిగిన అల్లర్లలో చంద్రబాబు పాత్ర వీడియో ఫుటేజీల సాక్షిగా రుజువైంది. రెండు రోజుల కింద పులివెందులలోనే ఇటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులుగానీ, వైసీపీ శ్రేణులు గానీ కవ్వింపులకు రెచ్చిపోకుండా నిగ్రహం పాటించడంతో ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి గుణపాఠం తీసుకున్న చంద్రబాబు గురి తప్పకుండా పుంగనూరులో అల్లర్లు జరిగేలా ప్లాన్ చేశారు. పర్యటన జరిగినన్ని రోజులూ మూడు నాలుగు జిల్లాల నుంచి సమీకరించిన రౌడీ దండును ఆయన వెంటేసుకుని తిరిగారు. ఈ రౌడీదండు తమ వెంట రాళ్లు, గాజుముక్కలతో పాటు కత్తులు, తుపాకులను కూడా ఉంచుకున్నారు. ఇవన్నీ సందేహాతీతంగా నిరూపణ కాబోతున్నాయి. నిందితుల మీద చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులను వేధిస్తున్నారని గగ్గోలు పెట్టాలి. చర్యలు తీసుకోకపోతే మరింత చెలరేగిపోవాలి. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ఎవరి భాష్యాలు ఎలా చెప్పినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఒక తంతుగానే సాగింది. చిత్తం ప్రాజెక్టుల మీద, భక్తి పచ్చినెత్తురు మీద అన్నట్టుగా ముగిసింది. ఆయనకు చిత్తశుద్ధి ఉండి ఉంటే రాయలసీమ సాగునీటికి సంబంధించి వైసీపీ వాళ్లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. రాయలసీమ ప్రజల్లో, మేధావుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసేవారు. కానీ ఆయన లక్ష్యం అది కాదు. రాయలసీమ ఇరిగేషన్ ప్రధాన ఆధారం కృష్ణా ప్రవాహం. 1983–84లో తెలుగు గంగ ప్రాజెక్టు కోసం శ్రీశైలం జలాలను తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు వద్ద అప్పటి ఎన్టీరామారావు ప్రభుత్వం హెడ్ రెగ్యులేటర్ను ఏర్పాటుచేసింది. దాని సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ రెగ్యులేటర్ ద్వారా తరలించిన నీటి పరిమాణం ఎంత అని ఇరవయ్యేళ్ల తర్వాత పరిశీలించినప్పుడు, రిజర్వాయర్లో ఆవిరైన నీటిలో సగానికంటే తక్కువని వెల్లడైంది. ఆ ఇరవై ఏళ్ల కాలంలో శ్రీశైలం డ్యామ్లోకి 19,642 టీఎమ్సీల నీరు చేరింది. అందులో 349 టీఎమ్సీల నీరు ఆవిరైంది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సీమకు చేరిన నీరు 160 టీఎమ్సీలు మాత్రమే. అంటే ఆవిరైన నీటిలో 0.45 శాతం. రామారావు తర్వాత తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఎందుకు పెంచలేదని రాయలసీమ రైతులు, మేధావులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు రాజశేఖరరెడ్డి పెంచినప్పుడు తెలుగుదేశం శ్రేణుల చేత కర్నూలు రహదారిపై, ప్రకాశం బ్యారేజీపై ఎందుకు వ్యతిరేక ధర్నాలు చేయించావు చంద్రబాబూ అని వారు గత పద్దెనిమిదేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలింపు కార్యక్రమం రిజర్వాయర్లో 881 అడుగుల స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ స్థాయి నీటిమట్టం ఏడాదిలో సగటున 35 రోజులు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 800 నుంచి 826 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎడమగట్టు కాల్వలను డిజైన్ చేసింది. 796 అడుగుల నుంచి విద్యుత్ కేంద్రం ద్వారా 44 వేల క్యూసెక్కులను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉన్నది. రోజుకు 6.5 టీఎమ్సీలను తక్కువ నీటి మట్టం నుంచే తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారంలో ఉండి ఏం చేశావన్నది రాయలసీమ ప్రజలు చంద్రబాబుకు వేస్తున్న ప్రశ్న. ‘ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు సీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టలేదా’ అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇందుకు విరుగుడుగా 800 అడుగుల మట్టం నుంచే ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతలను డిజైన్ చేసి జగన్మోహన్రెడ్డి ఎలా సీమ ప్రాజెక్టుల ద్రోహి అయ్యాడో వివరించమని వారు నిలదీస్తున్నారు. బనకచర్ల క్రాస్ టు వెలిగోడు లింక్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులు. లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంలో అందులో సగం కూడా వెళ్లలేని పరిస్థితి. బ్రహ్మంసాగర్ నిల్వ సామర్థ్యం 17.85 టీఎమ్సీలు. మట్టికట్ట లీకేజీల వల్ల నాలుగు టీఎమ్సీలు కూడా నిలబెట్టలేని స్థితి. అధికారంలో ఐదేళ్లు ఉండి పట్టించుకోని మీరా? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆ పనులు పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డా? ఎవరు ద్రోహి? అని రాయలసీయ ప్రజలు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ఏ ప్రాంతంలోనైతే నెత్తురు పారించాలని ప్రయత్నం చేశాడో, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని హంద్రీ–నీవా, గాలేరు–నగరిని సంధానిస్తూ జగన్మోహన్రెడ్డి మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా టీడీపీ నేతల చేత చంద్రబాబు ఎన్జీటీలో కేసులు వేయించారు. కడుపు మండిన ఆ ప్రాంత రైతులు రోడ్ల పక్కన నిలబడి చంద్రబాబుకు నిరసన తెలిపారు. రాయలసీమకు నీరందించే ఒక్కో ప్రాజెక్టు కింద ఒక్కో డజన్ ప్రశ్నలు చంద్రబాబు కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటికి ఆయన దగ్గర సమాధానాల్లేవు, సమాధానం చెప్పే ఉద్దేశం కూడా లేదు. సీమలో సాగునీరు పారితే ఆయనకు అధికారం రాదు. ఏమో... నెత్తురు పారితే? ఎంతవరకు ఉపయోగమనే ట్రయల్రన్ నడుస్తున్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
డ్యూటీలో మద్యం తాగి ఇంజినీర్లు చిందులు.. వీడియో వైరల్ కావడంతో
భువనేశ్వర్: ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్కుమార్ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్ డివిజన్లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్ సెక్షన్ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు! -
గౌరవెల్లిని ఆపేయండి
సాక్షి, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని, ఒక వేళ పనులు పూర్తయితే నీటిని నిల్వ చేయొద్దని తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) ఆదేశించింది. ఇప్పటికే నీటిని నిల్వ చేసి ఉంటే కాల్వలకు విడుదల చేయొద్దని కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.అఝగేషన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్కు లేఖ రాశారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టడాన్ని సవాలు చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన కేసులో గోదావరి బోర్డు ప్రతివాదిగా ఉంది. ఎన్జీటీ ఆదేశాల మేరకు గౌరవెల్లి రిజర్వాయర్ పనులపై యథాస్థితిని కొనసాగించాలని, కొత్త పనులు చేపట్టరాదని తాజాగా గోదావరి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఆ క్లాజుల ప్రకారం నడుచుకోవాలి’’ గోదావరి బోర్డు అధికార పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని క్లాజులు 1(డీ)(3), 2(ఎఫ్), 2(జీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది. క్లాజు 1(డీ) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ)ల నుంచి అనుమతులు పొందే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇతర మార్పులు, రెగ్యులేటర్లు, అప్రోచ్ చానల్, సొరంగం పనులు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులు చేపట్టాలన్నా గోదావరి బోర్డు, టీఏసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తప్పనిసరి అని గుర్తు చేసింది. క్లాజు 2(ఎఫ్) ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టుల పనులు నిలుపుదల చేసి, గెజిట్ విడుదలైన ఆరు నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. క్లాజు 2(జీ) ప్రకారం అనుమతి రాని ప్రాజెక్టులను వినియోగించుకోకుండా పక్కనబెట్టాల్సి ఉంటుందని తెలిపింది. రాష్ట్రం వచ్చాక పెరిగిన గౌరవెల్లి సామర్థ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ వరద కాల్వ ప్రాజెక్టులో భాగంగా 1.04 టీఎంసీల సామ ర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ను నిర్మించారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల రీడి జైనింగ్లో భాగంగా గౌరవెల్లి సామ ర్థ్యాన్ని 8.5 టీఎంసీలకు పెంచాలని నిర్ణ యం తీ సుకున్నారు. ఇందుకోసం 1960 ఎక రాలను సేకరించారు. రిజర్వాయర్ పనులు పూర్తి కాగా, 1.02 టీఎంసీలను నింపారు. రిజ ర్వాయర్ సామర్థ్యం 8.5 టీఎంసీలకు పెరి గినా ప్రధాన కాల్వ సామర్థ్యం 1.04 టీ ఎంసీలే ఉంది. పర్యావరణ అనుమతులు లే కుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని గ్రా మ స్తులు కొందరు కేసు వేయగా, ఎన్జీటీ గతంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
త్వరలో ఏలేరు–తాండవ ప్రాజెక్టుల అనుసంధానం
నాతవరం (అనకాపల్లి జిల్లా): వర్షాకాలం తర్వాత ఏలేరు–తాండవ అనుసంధానం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇంజనీర్ ఇన్ చీఫ్, గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీర్ ఆర్.సతీష్ కుమార్ చెప్పారు. నాతవరం మండలం జిల్లేడుపూడిలో ఏలేరు సొరంగం వద్ద తాండవ ప్రాజెక్టు కాల్వలను ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఏలేరు, తాండవ ప్రాజెక్టుల అనుసంధానానికి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు రూ.470 కోట్ల 5 లక్షలను కేటాయించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ స్టీల్ప్లాంట్, జీవీఎంసీ, ఇక్కడి పరిశ్రమలకు రోజుకు 95 జీఎండీల నీరు సరఫరా అవుతోంది. అనుసంధానం పనులు ప్రారంభించడానికి నీటి సరఫరాను నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఎదురుకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు నీటిపారుదల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. అనంతరం ఏలేరు, తాండవ ప్రాజెక్టు అధికారులతో పాటు జీవీఎంసీ, విస్కో అధికారులకు అనుసంధానం పనులపై ఇంజనీర్ ఇన్ చీఫ్ సతీష్కుమార్ దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టు పనులను రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తున్నామని ఉత్తర కోస్తా సీఈ ఎస్.సుగుణాకరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వంశధార ప్రాజెక్టు లిఫ్ట్ పనులు రూ.150 కోట్లతో జరుగుతున్నాయన్నారు. హిరమండలంలో బ్యాలెన్స్ రిజర్వాయర్ పెండింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. రూ.123 కోట్లతో విజయనగరం జిల్లా తోటపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ పనులు చేస్తున్నామన్నారు. తారకరామ రిజర్వాయర్తో పాటు పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తున్నామని వివరించారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ భాస్కరరావు, డీఈ వినోద్కుమార్, విస్కో సలహాదారు, విశ్రాంత ఎస్ఈ జగన్మోహన్రావు, తాండవ ప్రాజెక్టు డీఈ జె.స్వామినాయుడు, జేఈలు శ్యామ్కుమార్, వినయ్కుమార్, ఆర్.పాత్రుడు, రామకృష్ణ, నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు. -
నీటిపారుదల శాఖకు 5,950 మంది వీఆర్ఏలు!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలోని 24 వేల మంది గ్రామ రెవెన్యూ సహా యకు(వీఆర్ఏ)ల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం వీరంతా రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగు లుగా కొనసాగుతున్నారు. వారి సేవలను అదే శాఖలో క్రమబద్ధీకరించడంతోపాటు కొత్త పేస్కేల్ను వర్తింపజే యాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ.19 వేల మూల వేతనంతో కలిపి మొత్తం రూ.23 వేల స్థూల వేతనం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. 5,950 మంది వీఆర్ఏలతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాల నుంచి మరో 200 మందిని లస్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 98 కింద 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపి లస్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఏలను లస్కర్లుగా నియమిస్తామని ఆయన చాలా ఏళ్ల కిందే ప్రకటించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లస్కర్లు పనిచేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహిస్తారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. లస్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే అవకాశాలున్నాయి. -
పాలమూరుకు ‘పర్యావరణ’ కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ మళ్లీ వాయి దా పడింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నిపుణుల మదింపు కమిటీ గత నెల 27న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మినిట్స్ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి (పర్యావరణ పునరుద్ధరణకు) రూ.142 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. అయితే నష్ట నివారణ వ్యయాన్ని లెక్కించడంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను నీటిపారుదల శాఖ అనుసరించలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణానికి జరిగిన నష్టం విలువ, నష్ట నివారణ చర్యల వ్యయం, సామాజిక ప్రభావ నివారణ చర్యల వ్యయాలను ఎస్ఓపీ ఆధారంగా మళ్లీ లెక్కించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా రూ.55,086.57 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు, ఇప్పటికే రూ.21,200 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖకు తెలియజేసింది. ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాల్లోని 70 మండలాల పరిధిలో మొత్తం 8,83,945 హెక్టార్లకు సాగునీరు అందుతుందని, సత్వరం పర్యావరణ అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. గత నవంబర్లోనే ఉల్లంఘనల నిర్ధారణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం..పర్యావరణ ప్రభావం మదింపు (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ఈఐఏ) నోటిఫికేషన్ 2006ను ఉల్లంఘించినట్టు గతేడాది నవంబర్ 14న జరిగిన సమావేశంలో కమిటీ నిర్ధారించింది. వాస్తవానికి ఇలాంటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల జారీ విషయంలో అనుసరించాల్సిన ఎస్ఓపీని 2021లో కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపాదనలను సైతం ఎస్ఓపీ ఆధారంగా మదింపు నిర్వహించాలని అప్పట్లో నిపుణుల కమిటీ నిర్ణయించింది. దీంతో ఎస్ఓపీ అమలులో భాగంగా.. అనుమతులు లేకుండా పనులు చేపట్టడంతో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.6124.36 కోట్లతో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)ని సిద్ధం చేసింది. అందులో రూ.142.49 కోట్లను పర్యావరణ పునరుద్ధరణకు కేటాయించింది. అయితే వీటిని లెక్కించే విషయంలో ఎస్ఓపీని పాటించలేదని నిర్ధారించిన నిపుణుల కమిటీ మళ్లీ కొత్తగా అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంపై గతంలో ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.528 కోట్లను పర్యావరణ పరిహారంగా కృష్ణా బోర్డుకు చెల్లించాలని అప్పట్లో ఆదేశాలివ్వగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
నీళ్లలా ఇంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరాలతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తు మనుగడపై కాగ్ తీవ్ర సందేహాలను వ్యక్తం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం ద్వారా అనవసర భారం పడినట్లు ఆక్షేపించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలపి చెల్లింపులకు ఏటా రూ. 13 వేల కోట్లు, ప్రాజెక్టు విద్యుత్ చార్జీలకు ఏటా మరో రూ. 12 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు రూ. 270 కోట్లు కలిపి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల వ్యయం కానుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం రూ. 6.4 లక్షలు కానుందని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. ప్రాజెక్టు 12 శాతమే పూర్తి... కాళేశ్వరం ప్రాజెక్టులోని 56 పనుల్లో ఇప్పటివరకు 12 మాత్రమే పూర్తయ్యాయని, మరో 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం వరకు, మిగిలిన 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదని నివేదికలో కాగ్ వివరించినట్లు తెలిసింది. ప్రాజెక్టు భూసేకరణ కోసం 98,110 ఎకరాలకుగాను 63,972 ఎకరాలనే సేకరించారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో రూ. 1,700 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఉన్నతాధికారుల భేటీ... కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేరకు కాగ్ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపారు దల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాగ్ ని వేదికపై బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు చర్చించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణలను తీసుకున్నాక తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రుణాలు, వడ్డీల భారం.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం రూ. 97,449 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంది. వార్షిక వడ్డీ రేట్లు 8.25 శాతం నుంచి 10.9 శాతం వరకు ఉన్నాయి. 2023–24 నుంచి 2034–35 మధ్యకాలంలో ఏటా రూ. 13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉండనుంది. ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039–40 వరకు కొనసాగనున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ. 1.50 లక్షల కోట్లకు ఎగబాకనుందని కాగ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద ఎకరా ఆయకట్టు సాగుకు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు కానుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
పోలవరం ప్రధానాంశంగా.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఈ సమావేశం చేపట్టారు. సకాలంలో సాగునీరు: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని వెల్లడించారు. చక చకా పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్పై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాగా ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని, నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని తెలిపారు.దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్తో సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని సీఎం జగన్కు అధికారులు వివరించారు. ఆ మేరకు పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని వెల్లడించారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. చదవండి: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ప్రాధాన్యత ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ: సీఎం జగన్ ► ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ►ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలన్నారు. ►ఈ మేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలన్నారు. ► వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు. ►ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. ► అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ► అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు ►వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ►ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండోటన్నెల్ పనులుకూడా కొలిక్కివస్తున్నాయని తెలిపారు. ►పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేస్తామన్నారు. ► టన్నెల్ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేశామన్న అధికారులు. ►నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ►వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు వంశధార పనులపైనా సీఎం సమీక్ష. ► ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ను కూడా పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు. ► గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ►తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై సీఎం సమీక్ష. ►ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని అధికారుల వెల్లడి. ►వీటి తర్వాత ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష. ►కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు తెలిపారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఇదీ చదవండి: మినీ పోర్టులా ఉప్పాడ -
‘వార్ధా’ అంచనాలు పెరగలేదు!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులో భాగంగా.. 2018లో బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే రూ.750 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ పేర్కొంది. భూసేకరణ, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, ఫీల్డ్ చానళ్లు, కరకట్టలు, పంపుహౌజ్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, రెగ్యులేటర్లు, క్రాస్ డ్రైనేజీ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, నిర్వాహణ ఖర్చులతోపాటు 18 శాతం జీఎస్టీ పన్నును కలిపితే మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,550.73 కోట్లకు చేరిందని తెలిపింది. కేవలం జీఎస్టీ పన్ను వ్యయం రూ.622.40 కోట్లు కానుందని వెల్లడించింది. ‘వార్ధా ప్రాజెక్టు..భారీ బడ్జెట్’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగలేదని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టితో భారం తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా వార్ధా నదిపై బ్యారేజీని నిర్మించనుండటంతో వ్యయం గణనీయంగా తగ్గుతుందని నీటిపారుదల శాఖ పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పొడవు 6.45 కిలోమీటర్లు, గేట్ల సంఖ్య 102కాగా.. వార్ధా బ్యారేజీ పొడవు 1751 మీటర్లు, గేట్ల సంఖ్య 29కి తగ్గుతాయని వివరించింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీలో 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద గరిష్ట నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలు మాత్రమేకాగా.. వార్ధా బ్యారేజీలో 155 మీటర్ల వద్ద 2.94 టీఎంసీలను నిల్వ చేయవచ్చని తెలిపింది. -
వార్ధా ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ‘వార్ధా’ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్లు ఉండనుందని గతేడాది రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, తాజాగా రూ.4,550.73 కోట్లకు ఎగబాకింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి తాజాగా రాష్ట్ర నీటిపారుదలశాఖ సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో ఈ విషయాన్ని వెల్లడించింది. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్(వ్యాప్కోస్) ఈ డీపీఆర్ను తయారు చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగాకుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేట వద్ద వార్ధా బ్యారేజీ నిర్మించనున్నారు. నాలుగేళ్లలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వార్ధా బ్యారేజీకి ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్ర భూభాగంలో ముంపు నివారణకు వరద రక్షణ గోడలను నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. మొదట అనుకున్న తుమ్మిడిహెట్టి వద్ద కాదని.. ఉమ్మడి ఏపీలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి తెలంగాణ ఏడు జిల్లాల్లోని 16.4లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. రూ.1919 కోట్లతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలని, 6.5 కి.మీల పొడవున ఉండనున్న ఈ బ్యారేజీకి 107 గేట్లను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ నిర్మాణంలో మహారాష్ట్రలో 1852 ఎకరాలు, తెలంగాణలో 526 ఎకరాలు, నదీ గర్భంలో 3771 ఎకరాలు కలిపి మొత్తం 6149 ఎకరాల ముంపు ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కనపెట్టింది. దీనికి బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లోని 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యమృగాల అభయారణ్యం ఉండడంతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీకి అనుమతులు రావని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంది. మహారాష్ట్రతో మళ్లీ ఒప్పందం మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో వార్ధా నదిపై బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. వార్ధా నదిపై 36 గేట్లతో బ్యారేజీ నిర్మిస్తే సరిపోతుందని, దీనికి రూ.650 కోట్ల ఖర్చు కానుందని గతేడాది జనవరిలో నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయంలో తవ్వి వదిలేసిన కాల్వలతో అనుసంధానం చేయడానికి అదనంగా తవ్వాల్సిన కాల్వకు మరో రూ.100 కోట్ల కానుందని, మొత్తం రూ.750 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని లెక్కలు వేసింది. కానీ తాజాగా అంచనా వ్యయం రూ.4550 కోట్లకు పెరిగిపోయింది. వరద రక్షణ గోడల నిర్మాణానికి రూ.1000 కోట్లను అంచనాల్లో ప్రతిపాదించారు. వార్ధా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో మళ్లీ కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. 1.34 లక్షల ఎకరాల ఆయకట్టు.. ఈ ప్రాజెక్టు కింద 1,34,880 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, మరో 5868 ఎకరాల స్థిరీకరణ జరగనుందని, ఏటా రూ.1224.18 కోట్ల ఆదాయాన్ని సృష్టించనుందని డీపీఆర్లో వ్యాప్కోస్ అంచనా వేసింది. 11.5 టీఎంసీల నీళ్లను ఈ ప్రాజెక్టు వాడుకోనుండగా, బ్యారేజీ నిల్వ సామర్థ్యం 2.96 టీఎంసీలు ఉండనుంది. 142.5 మీటర్ల ఎత్తులో బ్యారేజీకి 22 గేట్లను ప్రతిపాదించారు. తెలంగాణలో 3076 ఎకరాలు, మహారాష్ట్రలో 741.31 ఎకరాలు సేకరించాల్సి ఉండనుంది. -
10న కృష్ణా బోర్డు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో వాటాల పంపకాలపై ఈ నెల 10న జరిగే కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశం ఎజెండా ఖరారైంది. తెలంగాణ గతేడాది నుంచి పట్టుబడుతున్న కృష్ణాజలాల్లో చెరి ఏభై శాతం చొప్పున నీటిపంపిణీ చేయాలన్న అంశాన్ని ఎజెండాలో చేర్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి. 2022–23 వాటర్ ఇయర్లో నీటి పంపకాలు చేయకుండానే పూర్తికానిచ్చిన నదీ యాజమాన్య బోర్డు ఈసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు సమావేశ ఎజెండాను పంపించింది. ఇప్పటివరకు ఉన్న 66:34 నీటి పంపకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతేడాది మే 6వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ అధికారులు మొదట చెరిసగం నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసినా.. చివరలో బోర్డు చైర్మన్ విచక్షణకే వదిలేశారు. దీంతో తెలంగాణ అధికారులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశంలో గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తాగునీటికి కేవలం 20 శాతం మాత్రమే కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీతోపాటు పలు ప్రాంతాల్లో సెన్సార్ ఆధారిత రియల్ టైమ్ డేటా అక్విజేషన్ సిస్టమ్ కూడా ఈసారి బోర్డు ఎజెండాలో చేర్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ, కుడికాలువ పనుల నిలిపివేత కోసం తెలంగాణ చేసిన విజ్ఞప్తిని సమావేశంలో చర్చకు పెట్టారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలనే అంశం కూడా ఈసారి సమావేశంలో ప్రధాన అంశం కానుంది. జల విద్యుత్... శ్రీశైలం, నాగార్జునసాగర్లో అవసరం లేకున్నా తెలంగాణ జలవిద్యుత్ ఉత్పాదన చేస్తుందన్న ఏపీ అభ్యంతరాలు, రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సిఫారసుల అమలుపై కూడా చర్చించనున్నారు. జలవిద్యుత్ ఉత్పాదన, రూల్కర్వ్ మిగులు జలాల నిర్ధారణ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ సమర్పించిన డీపీఆర్తోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ రూ.1,450 కోట్లతో నిర్మిస్తున్న సుంకిశాల ఇంటెక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ అభ్యంతరాలు కూడా చర్చకు రానున్నాయి.