
అలాకాదు.. ప్లీనరీకి ఇలా రండి!
ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటి వరకు రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- రూట్ మ్యాప్ సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ శుక్రవారం జరగనున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో రావాలని చెప్పారు.
► మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాల్ నుంచి వచ్చే వాహనదారులు నేషనల్ హైవే 44, ఓఆర్ఆర్ శంషాబాద్, పటాన్చెరు, సుతారి గూడ, ఎన్హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్గూడ రోడ్డు జంక్షన్ మీదుగా ప్లీనరీ జరిగే పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట్, పటాన్చెరు నుంచి వచ్చే వాహనదారులు బాంబే హైవే, పటాన్ చెరు, సుతారి గూడ, ఎన్హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్లేస్కు చేరుకోవాలి.
► నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, చౌటుప్పల్, హయత్నగర్ల నుంచి వచ్చే వాహనదారులు ఎన్హెచ్65, ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట, ఘట్కేసర్, కీసర, శామీర్పేట, రాజీవ్ రహదారి, తూముకుంట, హకీంపేట్, బొల్లారం చెక్పోస్టు, బొల్లారం రైల్వే గేట్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల, గోదావరిఖని, రామ గుండం, మంచిర్యాల, అసిఫాబాద్ నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ రహదారి (ఎస్హెచ్ –1), శామీర్పేట, తూముకుంట, హకీంపేట, బొల్లారం చెక్పోస్టు, బొల్లారం రైల్వేగేట్ నుంచి పార్కింగ్ వద్దకు చేరుకోవాలి.
► రామాయంపేట, తుఫ్రాన్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనదారులు నేషనల్ హైవే 44, మేడ్చల్, కండ్లకోయ, బుర్తన్గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, నర్సాపూర్, జోగిపేట, నారాయణఖేడ్ నుంచి వచ్చే వాహనదారులు స్టేట్ హైవే–6, నర్సాపూర్, గగిల్పూర్ (ఓఆర్ఆర్ ఎంట్రీ నంబర్ 5), సుతారిగూడ (ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 6), ఎన్హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ఏటూరునాగారం, జనగాం, భువనగిరిల నుంచి వచ్చే వాహనాలు ఎన్హెచ్ 163, ఓఆర్ఆర్ పెద్దఅంబర్పేట, ఘట్కేసర్, కీసర, శామీర్పేట, రాజీవ్ రహదారి, తూముకుంట, హకీంపేట, బొల్లారం చెక్పోస్టు, బొల్లారం రైల్వే గేట్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► నారాయణ్పేట్, కొండగల్, కోస్గి, తాండూర్, వికారాబాద్, చేవెళ్ల నుంచి వచ్చే వాహనదారులు టీఎస్పీఏ, పటాన్చెరు, సుతారిగూడ, ఎన్హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్గూడ రోడ్డు జంక్షన్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
జంటనగరాల నుంచి బయల్దేరే వారికి..
► హైదరాబాద్ నగరం నుంచి వచ్చే వాహనదారులు సికింద్రాబాద్, ప్యారడైజ్, ట్యాంక్బండ్, బాపూజీ నగర్, బోయిన్పల్లి, చెక్పోస్టు, ఎన్హెచ్ 44, సుచిత్ర జంక్షన్, లయోలా కాలేజ్ రోడ్డు, హెచ్ఎంటీ కాలనీ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనదారులు జేబీఎస్, రాజీవ్ రహదారి, కార్ఖానా, లోతుకుంట, బొల్లారం చెక్పోస్టు, బొల్లారం రైల్వే గేట్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నుంచి వచ్చే వాహనదారులు మియాపూర్, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్, అయోధ్య జంక్షన్, సుతారిగూడ, ఎన్హెచ్ 44, కండ్లకోయ, బుర్తన్ గూడ రోడ్డు జంక్షన్ నుంచి ప్లీనరీ జరిగే పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవాలి.
ఐదు లక్షల మజ్జిగ ప్యాకెట్లు
వరంగల్ జిల్లాలో నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణుల దాహం తీర్చేందుకు సుమారు 5 లక్షల మజ్జిగ ప్యాకెట్లను తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, హçస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ తదితరులు లాలాపేటలోని విజయ డెయిరి ప్రధాన కార్యాలయంలో ఎండీ. కె. నిర్మలతో చర్చించారు.