
ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి ఓ అడుగు ముందుకు వేసి...
పారిస్ : పూర్వం పెద్దలు.. పెళ్లి సమయంలో అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ ఏదైనా దోషం ఉంటే! కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముందు ఏ చెట్టుకో, ఏదైనా జంతువుకో ఇచ్చి పెళ్లి చేసేవారు. దోష నివారణ అనంతరం మామూలుగా పెళ్లి జరిగేది. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి ఇందుకు భిన్నంగా! ఓ అడుగు ముందుకు వేసి ఓ రాతి వంతెనను ప్రేమించింది. ప్రేమించటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన జోడి రోస్ అనే యువతి కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్కు వచ్చి అక్కడే స్థిరపడింది. ఆమె ఉంటున్న సెరెట్ ప్రదేశంలోని టెక్ నదిపై ఉన్న 14వ శతాబ్దపు ‘లీ పాంట్ డు డయాబుల్’ అనే వంతెనపై పలుమార్లు ఆమె ప్రయాణించింది. ఆప్పుడే జోడి రోస్ ఆ వంతెనతో ప్రేమలో పడింది.
కొద్దిరోజుల తర్వాత ఆ వంతెనను ప్రేమ వివాహం చేసుకుంది. తన ప్రేమ పెళ్లి గురించి జోడి రోస్ మాట్లాడుతూ.. ‘‘ పెళ్లి సమయంలో నాకు కొంచెం కంగారుగా ఉండింది. అప్పుడు నన్ను నేను ఒక వంతెనలాగా భావించుకున్నాను. (వంతెనను ఉద్ధేశిస్తూ) అతడు చాలా అందగాడు, దృఢకాయుడు. నా భర్తకు ఉండాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయ’’ని తెలిపింది. అయితే వీరి పెళ్లిని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ తమ బంధం బలమైనదని ఆమె పేర్కొంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
వంతెనను ప్రేమ వివాహం చేసుకున్న యువతి