'మీరిచ్చే ఆఫర్‌ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది' | Sakshi
Sakshi News home page

'మీరిచ్చే ఆఫర్‌ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది'

Published Thu, Mar 5 2020 2:55 PM

Man Blasts Delta Airlines After His Laptop Is Smashed By Passenger - Sakshi

ఆస్టిన్‌ : ఆస్టిన్‌ నుంచి లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లడానికి పాట్రిక్ కాసిడీ  అనే వ్యక్తి బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఎక్కాడు. కాసిడీ తన సీటులో కూర్చుని ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి పని చేసుకుంటున్నాడు. ఇంతలో తన ముందు సీటులో కూర్చున్న వ్యక్తి నిద్రపోవడానికి తన సీటును వెనక్కు వాల్చాడు. దాంతో ల్యాప్‌టాప్‌ మీద సీటు బరువు పడడంతో కంప్రెస్‌ అయి స్ర్కీన్‌ పగిలిపోయింది. అయితే తన ల్యాప్‌టాప్‌ అలా అవడానికి కారణమైన వ్యక్తిని ఏం అనకుండా కాసిడీ ఆ విషయాన్ని డెల్టా ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యానికి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

' @డెల్టా ఎయిర్‌లైన్స్‌.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తన సీటును వెనక్కి వాల్చే ముందు తగిన హెచ్చరికలు బోర్డులు పెడితే బాగుండేది. మీరు అలా పెట్టకపోవడం వల్లే నా ల్యాప్‌టాప్‌ ద్వంసమైంది' అని పేర్కొన్నాడు. దీంతో పాటు ల్యాప్‌టాప్‌ ఫోటోను కూడా వారికి షేర్‌ చేశాడు. అయితే ఈ విషయంపై డెల్టా ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. కాసిడి ఫిర్యాదు మేరకు అతని వస్తువుకు భంగం కలిగించినందుకు మా విమానంలో ఎప్పుడైనా సరే  7500 మైళ్లు ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించింది. అయితే కాసిడీ రీట్వీట్‌ చేస్తూ..' నాకు 7500 మైళ్లు ఉచిత ప్రయాణం ఆఫర్‌ చేయడం బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చిన ఆఫర్‌ ఒక ఆరేళ్ల పిల్లాడికి ఇచ్చుంటే ఎగిరి గంతేసేవాడు' అని పేర్కొన్నాడు. అయితే కాసిడి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ల్యాప్‌టాప్‌ ధ్వంసం కావడానికి ఒక వ్యక్తి కారణమైతే డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఆశ్రయించడం ఏంటని....డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఇచ్చిన ఆఫర్‌ తీసుకుంటే బాగుండేదని కొందరు పేర్కొనగా...  మరి కొందరు మాత్రం పాట్రిక్‌కు మద్దతుగా నిలిచారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement