సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్
ఇస్లామాబాద్: పనామా ఆరోపణలు, ఆపై సుప్రీంకోర్టు తీర్పుననుసరించి పాకిస్థాన్ ప్రధాని గద్దె నుంచి నవాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రజా మద్ధతును కూడగట్టే పనిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ తనపై వచ్చినవన్నీ ఆరోపణలేనని చెప్పుకొస్తున్నారు . ఇక ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు అనర్హత వేటు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు.
షరీఫ్ తరపున ఆయన కూతురు మర్యమ్ నవాజ్, తనయులు హుస్సేన్ నవాజ్ మరియు హస్సన్ నవాజ్, అల్లుడు కెప్టెన్ సఫ్దార్లు పిటిషనర్లుగా పేర్కొంటూ న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా రివ్యూ పిటిషన్ను ఫైల్ చేశారు. అక్రమ ఆరోపణలపై విచారణ అంశం అసలు కోర్టు పరిధిలోకే రాదంటూ వాళ్లు పిటిషన్లో పేర్కొన్నారు.
దుబాయ్ కంపెనీలకు చెందిన ఆదాయాన్ని 2013 ఎన్నికల సమయంలోని నామినేషన్ పేపర్లలో షరీఫ్ పేర్కొనలేదంటూ పనామా పేపర్ల లీకేజీతో వెలుగులోకి రాగా, ఆ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయన దోషిగా ప్రకటించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(F) ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేస్తూ జూలై 28న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.